అస్థిపంజరానికి.. ఆసరా పెన్షన్..
posted on Mar 22, 2021 @ 9:56AM
పెన్షన్ అంటే మాములుగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఇస్తారు. లేదా 60 ఏళ్లు పైబడిన వారికి ఆసర పెన్షన్ ఇస్తారు. కానీ ఒక అస్తిపంజరానికి పెన్షన్ ఇవ్వడం ఎక్కడైనా చూశారా. గవర్నమెంట్ నుండి పెన్షన్ తీసికోవాలంటే ఎంతో తతంగం ఉంటుంది. ఎవరైనా అర్హులు పెన్షన్ కోసం అధికారుల దగ్గరికి వెళితే. నువ్వు నింజంగానే అర్హుడివా.. నీ వయసు 60 లా లేదే.. అసలు నువ్వు బతికి ఉన్నావ్ అనడానికి ఫ్రూఫ్ ఏంటి..? అందుకు సాక్ష్యం ఉందా? అని రకరకాల ప్రశ్నలు వేస్తారు . కానీ ఇక్కడ మాత్రం ఓ అస్థిపంజరానికి 30 ఏళ్లుగా పెన్షన్ ఇస్తూనే ఉన్నారు. పెన్షన్ ఎంతో తెలిస్తే గుండెలు జారిపోతాయి. అక్షరాల రూ. 8 కోట్లు. బ్రతికి ఉన్నవాళ్లకే సరిగ్గా పెన్షన్ రావడం లేదు. ఓ అస్థిపంజరానికి రూ. 8కోట్ల పెన్షన్ ఎలా ఇస్తారని? అంటుకుంటున్నారా అదేనండి ఇక్కడ ట్విస్ట్.
సోగెన్ కటో 111వ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఆయన మనవరాలితో ఈ రోజుల్లో 60,70 ఏళ్లు బ్రతకడం చాలా కష్టం అలాంటిది మీ తాత ఈ రోజుతో 111వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అది తెలుసుకొని విషెస్ చెప్పాలని వచ్చాం. ఒక్కసారి మీ తాత ఎక్కడున్నాడో చెప్పండి. అని అధికారులు కోరారు. దీంతో కంగారు పడ్డ ఆయన మనవరాలు. మా తాత ఎవరినీ చూడాలని అనుకోవడం లేదంటూ వారిని ఇంటి నుంచి పంపించేసింది.
దీంతో అనుమానం వచ్చిన స్థానిక ప్రభుత్వ అధికారి టోమోకో ఇవామాట్సు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సోగెన్ కటో ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సోఫాసెట్ పై దుప్పటి కప్పుకొని ఉన్న మనిషి ఆకారం కనిపించింది. వెంటనే పోలీసులు సోఫాలో పడుకుంది సోగెన్ కటో అని భావించారు. అతన్ని లేపేందుకు మొహం మీద ఉన్న దుప్పటిని పక్కకి లాగారు. సోఫాలో ఉన్న ఆకారాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. ఎందుకంటే సోఫాలో ఉంది సోగెన్ కటో అస్తిపంజరం. అస్తిపంజరానికి లోదుస్తులు, పైజామా ధరించి దుప్పటితో ముసుగేసి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో సోగెన్ కటో చనిపోయి 30ఏళ్లు అవుతుందని, కానీ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు టోక్యో మెట్రోపాలిటన్ సంక్షేమ అధికారి యుటాకా మురోయ్ తెలిపారు. సోగెన్ చనిపోయినా 30ఏళ్ల నుంచి పెన్షన్ తీసుకుంటున్నారని, ఇప్పటి వరకూ అలా రూ.8 కోట్ల దాకా సోగెన్ కుటుంబ సభ్యులు తీసుకున్నట్లు మెట్రోపాలిటన్ సంక్షేమ అధికారి యుటాకా మురోయ్ వెల్లడించారు. ఈ సంఘటన జపాన్ టోక్యోలో జరిగింది.