తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్?
posted on Mar 21, 2021 @ 4:36PM
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. పెరుగుతున్న కోవిడ్ కేసులతో సర్కార్ అప్రమత్తమైంది. మరోసారి లాక్ డౌన్ పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. లాక్ డౌన్ పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగా ఉంటుందని తెలుస్తోంది. కరోనా హాట్ స్పాట్లుగా మారిన స్కూళ్ల మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనాపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. వీకెండ్స్లో లాక్డౌన్ విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో 3 రోజుల పాటు లాక్డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై కసరత్తు చేస్తున్నారు. కోవిడ్ అదుపులోనే ఉన్నా.. ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోనుంది.ఈ నెల 26 కంటే ముందే అసెంబ్లీ సమావేశాలు ముగించే యోచనలో సర్కార్ ఉంది.
తెలంగాణలో కేసుల సంఖ్య ఎంత పెరిగినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే లక్ష కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన చేసుకున్నామని, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు రాకపోవచ్చని అధికారులు అంటున్నారు. తాజాగా రాష్ట్రంలో పది ప్రాంతాల్లో వైరస్ అవుట్ బ్రేకు అవ్వగా, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా విస్తృతమైన టెస్టులు చేసి కట్టడి చేయగలిగారు. గతంలో సర్కారు చేపట్టిన చర్యల వల్ల తెలంగాణలో 1.44 లక్షల కేసులు రాకుండా ఆపడంతో పాటు, 2300 మరణాలు నివారించగలిగిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో కూడా వెల్లడించిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
గత సంవత్సరం జనవరిలో ఇండియాలో తొలి కరోనా కేసు నమోదు కాగా.. మార్చి2న తెలంగాణలో తొలి కేసు వచ్చింది. మే, జూన్ లో కరోనా కేసులు భారీగా నమోదు కాగా.. నవంబరు నాటికి తీవ్రత తగ్గింది. మళ్లీ ఇప్పుడు వైరస్ విజృంభిస్తోంది. ప్రధానంగా మహారాష్ట్రలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. లోకల్ ట్రైన్స్తో పాటు, జనసమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నట్లు తేలింది.