వాణీ దేవి ధర్మాగ్రహం

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ముందెన్నడూ లేనంతగా భారీ పోలింగ్ జరిగింది. చదువుకున్నోళ్ళు ఓటింగ్’కు రారు, ఓటేయరు అన్న అపవాదును తుడిచేసే విధంగా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, డాక్టరేట్లు, ఇంకా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉద్యోగాల వేటలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగులు పోలింగ్ లో పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో సామాన్య ఓటర్లులా బారులు తీరి, ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండు నియోజక వర్గాలలోనూ భారీగా పోలింగ్ జరిగింది. రంగా రెడ్డి-మహబూబ్ నగర్ – హైదరాబాద్ నియోజక వర్గంలో ఏకంగా 67 శాతం పోలింగ్ నమోదైంది. ఇదొక రికార్డు.  ఇంత ఉత్సాహంగా ఓటేసినా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెరాస అభ్యర్ధి, పీవీ కుమార్తె వాణీదేవికి ఓటర్ల మీద కోపమొచ్చింది. ఓట్ల మీద కోపం రావడం మాత్రమే కాదు, ఆమె మీద ఆమెకే జాలి లాంటిది ఎదో వేసింది. ఇంతకీ అందుకు కారణం ఏమంటే, చెల్లని ఓట్లు.ఆమె పోటీచేసిన నియోజకవర్గంలో ఏకంగా 20వేలకు పైగా  ఓట్లు చెల్లక పోవడంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. పట్టభద్రులు సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకో లేక పోవడం పట్ల బాధను వ్యక్తంచేస్తూ, ఇవేం చదువులు, మేము నేర్పిన చదువులు ఇవేనా  అంటూ ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. నిజమే కదా పట్టభద్రులకు ఓటు వేయడం రాక పోవడం పట్ల ఎవరికైనా ఆగ్రహం రావడం సహజమే కదా, అందునా ఉపాధ్యవృత్తిలో ఉన్న పీవీ కుమార్తెకు ఆగ్రహం రావడం సహజం.నిస్సందేహంగా ఆమెది అమెది ధర్మాగ్రహమే, అర్థం చేసుకోవచ్చును. అయితే, అదే పట్టభద్రుల ఎన్నికల్లోనూ   కోట్లు ఖర్చు చేయడం,ప్రలోభాలకు గురి చేయడం, సాధారణ ఎన్నికల్లో కంటే ఎక్కువగా తాయిలాలు ఎరావేయడం వంటి, సకల అక్రమాలకు పాల్పడడం విషయంలోనూ ఆమె అదే ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తే ఆమె గౌరవం ఇంకొంచెం ఇనుమడించేది కదా ..  

ప్రివిలేజ్ నోటీసులకు నిమ్మగడ్డ గడుసు సమాధానం

ఎపి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన హక్కులకు భంగం కలిగించారని మంత్రి పెద్దిరెడ్డి అసెంబ్లీ ప్రివిలెజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.  దీనిపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో చర్చించిన కమిటీ ఎస్ఈసీ కి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా తమ ముందు విచార‌ణ‌కు హ‌జ‌ర‌య్యేందుకు సిద్ధంగా ఉండాలంటూ క‌మిటీ కొన్ని అంశాల‌ను పేర్కొంది.. తాజాగా ఈ నోటీసులపై ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ స‌మాధానం ఇచ్చారు. తాను కోవిడ్ వ్యాక్సిన్  తీసుకున్నానని.. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నానని.. కొన్ని రోజులపాటు  ప్ర‌యాణాలు చేయ‌లేన‌ని ఆయన తన సమాధానంలో తెలిపారు. అంతేకాకుండా తాను అస‌లు ప్రివిలేజ్ క‌మిటీ ప‌రిధిలోకే రాన‌ని..  దీనిపై మీరు ఇంకా ముందుకు వెళ్లాల‌నుకుంటే స‌రైన స‌మ‌యంలో తగిన ఆధారాల‌తో స్పందిస్తాన‌ని ఆయన తెలిపారు. మరోపక్క తన‌కు శాసనస‌భ‌పై అత్యున్న‌త గౌర‌వం ఉంద‌ని.. తాను స‌భ్యుల హ‌క్కుల‌కు భంగం క‌లిగేలా ఎపుడూ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని రమేష్ కుమార్ త‌న స‌మాధానంలో పేర్కొన్నారు.   గత నెల ఫిబ్రవరిలో జరిగిన  పంచాయితీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా ఉన్న నిమ్మ‌గ‌డ్డకు‌, ప్ర‌భుత్వంలోని కొంతమంది  మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోణ‌ప‌లు జ‌రిగాయి. మరీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి, కొడాలి నాని వ్యాఖ్య‌ల‌పై నిమ్మ‌గ‌డ్డ సీరియ‌స్ గా స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డిని ఐతే హౌస్ అరెస్ట్ చేయాలనీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పోలిసులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఐతే హైకోర్టు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసిన సంగతి తెల్సిందే.    

మాల్స్, స్కూల్స్ క్లోజ్.. మళ్లీ రాత్రి కర్ఫ్యూ..

మార్చి 31 వరకూ విద్యా సంస్థలన్నీ మూత. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకూ రాత్రిపూట కర్ఫ్యూ అమలు. ఆదివారం.. సినిమా థియేటర్స్, మాల్స్, మల్టీఫ్లెక్స్, రెస్టారెంట్స్ క్లోజఓ్. సోషల్ గ్యాదరింగ్‌పై నిషేధం. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే పర్మిషన్. 50శాతం సామర్థ్యంతో థియేటర్లకు అవకాశం. శనివారం నుంచి కొత్త కరోనా ఆంక్షలు అమలులోకి రానున్నాయి.  దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ విజ‌ృంభిస్తోంది. మహారాష్ట్ర తర్వాత పంజాబ్ పాజిటివ్ కేసుల్లో ముందుంది. దీంతో.. పంజాబ్ సర్కారు అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలుచోట్ల ఆంక్షలు మరింత కఠినతరం చేసింది. శనివారం నుంచి ఇవి అమల్లోకి రానున్నట్టు సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు.  మార్చి 31 వరకు విద్యా సంస్థలన్నీ మూసివేయనున్నారు. సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌పైనా పరిమితులు విధించారు. థియేటర్లు 50శాతం సామర్థ్యంతో నడిచేందుకు అవకాశం కల్పించారు. ప్రజలంతా రెండు వారాల పాటు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు.  కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో మాత్రం ఆదివారం నుంచి సామాజిక కార్యక్రమాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చినప్పటికీ 20మందికి మించి హాజరు కావొద్దని సూచించారు. ఆయా జిల్లాలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు తెలిపారు. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌, రెస్టారెంట్లు, మాల్స్‌ మాత్రం ఆదివారం పూర్తిగా మూసే ఉంచాలని ఆదేశించారు. పరిశ్రమలు, అత్యవసర సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి. 

ఈడీ పై కేరళ పోలీసుల రివర్స్ కేసు..

ఎక్కడైనా దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై కేసులు బుక్ చేయడం.. అవసరమైతే వారిని పిలిచి విచారిస్తారన్న సంగతి తెల్సిందే. అయితే కేరళలో మాత్రం సీన్ రివర్స్  అయింది. కెరళలో జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరై విజయన్ హస్తం కూడా ఉందని కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అసాధారణ రీతిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై కేసు నమోదు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ చేత ఈడీ అధికారులు  బలవంతంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరును చెప్పించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసారు. దీనికి సంబందించిన ఎఫ్ఐఆర్ ను ఎర్నాకుళం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో దాఖలు చేశారు. గోల్డ్ స్కాంలో భాగంగా హవాలా కేసుపై ఈడీ ప్రతుతం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ను ఈడీ అధికారులు గత ఏడాది ఆగస్టు 12, 13 తేదీల్లో ప్రశ్నించారని ఈ ఎఫ్ఐఆర్ లో క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. ఈ కేసులో సీఎం  పినరయి విజయన్‌ను ఇరికించే ఉద్దేశంతో ఆయన పేరును చెప్పే విధంగా స్వప్నను బెదిరించారని ఆ ఎఫ్ఐఆర్ లో  పేర్కొంది. ఈ విషయంలో ఈడీ అధికారులు కుట్ర, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. సీఎం కు హాని కలిగించే ఉద్దేశంతో తప్పుడు దస్తావేజును తయారు చేశారని ఆ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.   మరోపక్క స్వప్నకు సంబంధించినదిగా చెప్తున్న ఒక ఆడియో క్లిప్‌పై అదనపు పోలీసు సూపరింటెండెంట్ బిజుమోన్ గతంలో దర్యాప్తు చేశారు. ఆ క్లిప్ పై ఆయన సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా క్రైమ్ బ్రాంచ్ ఈ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. సీఎం విజయన్ కి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని తనను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని స్వప్న చెప్పినట్లు ఈ ఆడియో క్లిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే వ్యవహారంపై కొందరు మహిళా పోలీసులు కూడా ఈడీ అధికారులకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఈ కేసులో సీఎం విజయన్ పాత్ర ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని స్వప్నను ఈడీ అధికారులు నిర్బంధించారని ఆ మహిళా పోలీసులు సాక్ష్యం చెప్పారు. దీంతో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో. వేచి చూడాలి.  

జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్! చంద్రబాబు సీఐడీ విచారణపై స్టే

అమరావతి అసైన్డ్ భూముల కేసులో  ఆంధ్రప్రదేశ్  సర్కార్ కు షాక్ తగిలింది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఐడీ విచారణపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. కేసు విచారణపైనా కోర్టు నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. చంద్రబాబు, నారాయణపై కేసులో.. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఆరేండ్ల క్రితం ఇచ్చిన జీవోపై  ఇప్పుడు విచారణ ఏంటని చంద్రబాబు తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అలాగే నారాయణ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదించారు. ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు. వాదనలు విన్న ఏపీ హైకోర్టు... చంద్రబాబు సీఐడీ విచారణపై స్టే  ఇచ్చింది.  అమరావతిలో దళితుల నుంచి భూములను బలవంతంగా లాక్కొని తమ బినామీలకు లబ్ధి చేకూర్చారని చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించగా.. మాజీ మంత్రి నారాయణ తరపున  దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.  సీఆర్డీఏ చట్టం ద్వారా తీసుకువచ్చిన జీవో చెల్లదనటం సరికాదని, ఐపీసీలోని సెక్షన్‌ 166, 167 ఈ ఫిర్యాదుకు వర్తించవని  చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా  కోర్టులో వాదించారు. ఉన్నతాధికారుల లిఖితపూర్వక ఆదేశాలను ఉల్లంఘిస్తే ఈ సెక్షన్ల కింద కేసు పెట్టాలని, అలాంటి ఆదేశాలు ఇక్కడ లేవని ఉన్నత న్యాయస్థానానికి న్యాయవాది సిద్దార్థ లూథ్రా తెలిపారు. ఫిర్యాదులోని ఆరోపణలకు..పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. జీఓ విడుదలైన 35 రోజుల తర్వాత దానిని సీఎం ఆమోదించారని.. విచారణ నివేదికలోనే చెబుతున్నారన్నారు. అలాంటప్పుడు సీఎంకు తెలిసి జీఓ ఇచ్చారని ఎలా చెబుతారన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదులో కేసు నమోదు చేయటం కుదరదని, ఇక్కడ నష్టపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేయలేదని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి ఎక్కడా ఈ ప్రక్రియలో పాల్గొనలేదన్నారు. అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుందన్నారు.  మాజీ మంత్రి నారాయణ తరపున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు జీఓను సవరించారని, జీవోకు సంబంధించిన చర్చలు, విడుదల చేసే ప్రక్రియలో గాని.. అప్పటి సీఎం, మంత్రి పాల్గొనలేదని దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. జీవో విడుదలయ్యాక మాత్రమే ఆమోదానికి పంపారని, వ్యక్తిగతంగా వెళ్లి అసైన్డ్‌ రైతుల ల్యాండ్‌ తీసుకుని.. వారిని నష్టపరిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు వర్తిస్తాయని దమ్మాలపాటి అన్నారు. ఒక జీవో ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం కల్పించి.. భూములు తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం భూములు తీసుకొనే సమయంలో.. అప్పటి ప్రభుత్వం అన్నివర్గాలకు లబ్ది చేకూర్చిందన్నారు. దాని ప్రకారమే భూములు సమీకరించారన్నారు.  చంద్రబాబు హైకోర్టులో వేసిన  పిటిష‌న్‌లో తెలిపిన వివ‌రాల ప్రకారం.. అమ‌రావ‌తి రాజధాని ఏర్పాటు కోసం విజయవాడ చుట్టుపక్కల 2014, సెప్టెంబర్ 1న అప్ప‌టి ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుని, సెప్టెంబర్‌ 4న శాసనసభ ముందు ఉంచారు. దీంతో సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంత‌రం రాజధాని గ్రామాల ప్రజలకు భూసమీకరణ విధానాన్ని తెలిపారు. భూసమీకరణ పథకాన్ని తీసుకొచ్చి, ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని రూపొందించారు. భూసమీకరణపై 2015, జనవరి 1న జీవో 1 జారీ, అసైన్డు భూముల హక్కుదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు 2016, ఫిబ్రవరి 17న జీవో 41 జారీ అయ్యాయి.   చట్ట నిబంధనల మేరకే ఆ జీవో జారీచేశారు. ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత దురుద్దేశంతో వైసీపీ నేత‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా త‌న‌పై తప్పుడు కేసు నమోదు చేశారని చంద్ర‌బాబు పిటిష‌న్‌లో ఆరోపించారు. ఒక‌వేళ‌ నిబంధనల పై అభ్యంతరాలు ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోర్టులో సవాలు చేసుకోవచ్చని, అంతేగానీ, గ‌త ప్రభుత్వ హయాంలో నిబంధనలు రూపొందించారనే కారణంతో త‌న‌ను నేర బాధ్యుడిగా పేర్కొనడం అసంబద్ధమ‌ని చంద్ర‌బాబు పిటిషన్ లో తెలిపారు.తాము నష్టపోయామని గ్రామస్థులుగానీ, భూ యజమానులుగానీ ఇన్నేళ్లుగా ముందుకు రాలేదని, ఇప్పుడు వారి తరఫున వైసీపీ నేత అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం చూస్తే ప్ర‌త్య‌ర్థి పార్టీపై అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈనెల 13న చంద్రబాబుపే సీఐడీ కేసులు నమోదు చేసింది. చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. ఈనెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని చంద్రబాబుకు నోటీసులిచ్చిన అధికారులు.. విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. 

వేడి అన్నం కోసం అత్తాకోడళ్ల గొడవ

అత్తతో కోడలు గొడవ. తట్టుకోలేక పోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాకీలు హడావుడిగా ఆమె ఇంటికి వచ్చారు. గొడవేంటి అని అడిగారు. కోడలు చెప్పిన కారణం విని పోలీసులు షాక్ అయ్యారు. ఇదేంటీ ఈ విషయానికే ఫిర్యాదు చేశావా అంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ అత్తాకోడళ్లకు గొడవెందుకు అయిందో తెలిసి అంతా అవాక్కయ్యారు. వేడి ఆహారం కోసం వాళ్లిద్దరూ గొడవ పడ్డారు. రోజూ కోడలికి చల్లారిన ఫుడ్ పెడుతోందట ఆ అత్త. అది తినీ తినీ తన ఆరోగ్యం పాడవుతోందని అత్తతో తగువు పెట్టుకుంది కోడలు. రోజంతా టీవీ చూస్తూ తనను అసలు పట్టించుకోవడం లేదంటూ పోలీసులకు చెప్పింది.  అయితే.. కోడలు చేసిన ఆరోపణలను అత్త తప్పుబట్టింది. కోడలు అబద్దాలు చెబుతుందని పోలీసులకు చెప్పింది. తన కోడలు ఎప్పుడు చూసినా ఫోన్‌తోనే టైంపాస్ చేస్తుందని ఆరోపించింది. వంట చేసేటప్పుడు తనకు సాయం చేయడం లేదని.. తిరిగి తన మీదే పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటని ఆ అత్త మండిపడింది.  అత్తాకోడళ్ల వాదనలు విన్న పోలీసులు.. ఇంటి విషయాలు మీరు మీరు పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఒప్పించారు. ఇలాంటి పనికిరాని ఫిర్యాదులు చేయవద్దని ఆ కోడలిని హెచ్చరించారు. పోలీసుల స‌మ‌యం వృథా చేస్తే క‌ఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌, గోరఖ్‌పూర్‌లోని మజ్గావన్ గ్రామంలో జరిగింది. 

భర్తను చంపిన భార్య.. అల్లుడిని చంపిన మామ 

అనుమానంతో భార్యను చంపినా భర్త. ప్రియుడి మోజులో పడి భర్తను చంపినా భార్య, అంటూ రోజు ఏదో ఒక వార్త వింటుంటాం. మరి కొంత మంది అయితే అనుమానం పెంచుకుని చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి చంపుకోవం ఫ్యాషన్ అయిపొయింది ఈ రోజులల్లో. అదే తరహా అనుమానం మరో భర్త మరణానికి కారణం అయింది. అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు. నిజానికి ప్రతి మనిషికి అనుమానం సహజం.  తాజాగా విశాఖపట్నంలో భర్తపై అనుమానంతో భార్య రోకలిబండతో అతి దారుణంగా కొట్టి చంపింది. ఈ ఘటన ఏవీఎన్‌ కాలేజీ ద్వారం వీధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. భార్యభర్తల  మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు అంటున్నారు. ఆ గొడవలే వివాదంగా మారి హత్యకు దారి తీసి ఉంటుందంటున్నారు. . పోలీసుల వివరాల ప్రకారం భర్త పుండరీ కాక్షయ్య పిల్లలను చంపేస్తాడనే భయంతోనే భర్తను హత్య చేసినట్లు భార్య పుణ్యవతి అంటోంది అంటున్నారు. హత్య గురించి తెలిసిన వెంటానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహిటిన  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులు మాత్రం కేవలం క్షణికావేశంలోనే ఆమె భర్తను హత్య చేసిందా. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు మాత్రం ప్రతి నిత్యం వారి ఇంట్లో గొడవలు జరుగుతుండేవి అని అంటున్నారు. అయితే కేవలం పుణ్యవతి  మాత్రమే హత్య చేసిందా? భర్తను హత్య చేయమని ఎవరైనా ప్రోత్సహించారా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.. మద్యం మత్తులో అల్లుడిని చంపినా మామ..  విశాఖలోనే మరో దారుణం చోటు చేసుకుంది.  పెందుర్తి మండలంలోని చినముషిడివాడలో  మద్యం మత్తులో అల్లుడిని మామ కొట్టి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మామ శంకర్‌, అల్లుడు చిన్నా మధ్య మద్యం మత్తులో మాటకు మాటా పెరిగి.. గొడవకు దారి తీసింది. దాంతో  కోపోద్రేకంలో రాడ్‌తో కొట్టి అల్లుడు చిన్నను మామ శంకర్‌ హత్య చేశాడు. అలాగే హత్య చేసిన మామ శంకర్ తో  పాటు ఆ గొడవకు కారణమైన బావ మరిది అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం మద్యం సేవించి ఉండడం వల్లే  హత్య చేశాడా?  లేదంటే రెండు కుటుంబాల మధ్య పాత వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

స్వచ్ఛందంగానే భూములిచ్చాం.. అమరావతి రైతుల వాంగ్మూలం 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో సీఐడీ విచారణ చేపట్టింది. సీఐడీ విచారణకు హాజరైన పలువురు రైతులు.. రాజధాని కోసం స్వచ్ఛందంగానే ఇచ్చామని చెప్పారని తెలుస్తోంది. తమ వద్ద నుంచి భూములను ఎవరూ లాక్కొలేదని, తమను ఎవరూ బెదిరించలేదని కూడా రాజధాని రైతులు చెప్పారని సమాచారం. భూములు ఇచ్చినందుకు ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పరిహారం కూడా అందిందని సీఐడీ అధికారులకు రైతులు తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు.అప్పటి గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు పిలిపించారు. తాడేపల్లిలో శ్రీధర్‌ను అధికారులు విచారించారు. అప్పట్లో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని అసైన్డ్‌ భూములపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఈనెల 12న సీఐడీ కేసు నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు.  ‘‘ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం మిమ్మల్ని ప్రశ్నించాల్సి ఉంది. మీకు(ఏ1) మాత్రమే తెలిసిన వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. అందువల్ల... ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు  విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ రీజనల్‌ ఆఫీసుకు వ్యక్తిగతంగా హాజరు కావలెను’’ అని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అమరావతి దళిత జేఏసీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసులు పెట్టడమంటే.. ఎస్టీ, ఎస్సీ చట్టాలను దుర్వినియోగం చేసినట్లేనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 41 జీవో ద్వారా చంద్రబాబు దళితుల అభివృద్ధికి పాటుపడితే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ హక్కు ప్రకారం ఎస్టీ, ఎస్సీ కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను వెనక్కితీసుకోవాలని లేని పక్షంలో ఆళ్లపై అట్రాసిటీ కేసులు పెడతామని దళిత జేఏసీ నేతలు హెచ్చరించారు. అమరావతి రాజధానిలో దళితులకు చోటు లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ఓట్లు గల్లంతుతో కలకలం! ఎమ్మెల్సీ కౌంటింగ్ నిలిపివేత

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తీవ్ర ఉత్కంఠగా మారింది. హోరాహోరీ పోరు సాగుతుండటంతో జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే  రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తుండగా గందరగోళం నెలకొనడంతో హైదారాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ నిలిచిపోయింది.  రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా తక్కువ ఓట్లు వచ్చిన చివరి ఎనిమిది మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియలో 50 ఓట్లు గల్లంతు అయ్యాయి. ఎన్నికల అధికారులు దీన్ని గుర్తించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆందోళన చేశారు. ఓట్ల గల్లంతుపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. విపక్షాల ఆందోళనతో కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేశారు ఆర్వో.  హైదరాబాద్ స్థానంలో మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు, బీజేపీ కేండిడేట్ రామచంద్రారావుకు 1,04,668.. వామపక్షాలు బలపరిచిని స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,610, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చిన్నారెడ్డికి 31,554 ఓట్లు వచ్చాయి. రేసులో ముందున్న మొదటి ఇద్దరు అభ్యర్థులకు స్వల్ప తేడా మాత్రమే. దీంతో వాణీదేవి, రామచంద్రారావులో ఎవరు గెలుస్తారనేది మాత్రం నాగేశ్వర్, చిన్నారెడ్డిలకు వచ్చిన రెండో ప్రాధాన్యతా ఓట్లే డిసైడ్ చేస్తాయి. 

ఛైర్‌పర్సన్ దొంగ ఓటు.. పదవికి ఎసరు?

ఆమె తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్. పేరు తాటికొండ స్వప్న. మార్చి 14న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. అంత వరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే వివాదం మొదలైంది. పట్టాభద్రుల కోటాలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్వప్నకు అసలు ఓటు హక్కు లేనేలేదు. అయినా.. ఆమె ఓటు ఎలా వేశారనేదే వివాదం.  బూత్ నెంబర్ -283. ఓటరు సీరియల్ నెంబర్ 528. పేరు తాటికొండ స్వప్న. అయితే, తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న వేరు.. ఓటరు లిస్ట్‌లో ఉన్న స్వప్న వేరు. ఆ ఇద్దరూ ఒకరు కాదు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న భర్త పేరు పరిమళ్. 528 సీరియల్ నెంబర్లో ఉన్న స్వప్న భర్త పేరు తాటికొండ అశ్విన్. ఆ ఇద్దరు స్వప్నలు తోటికోడళ్లు. అందుకే, తోటికోడలు స్వప్న పోలింగ్ చీటీతో మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్వప్న దొంగ ఓటు వేశారు. ఈ విషయం పోలింగ్ బూత్‌లో ఉన్న కాంగ్రెస్ ఏజెంట్ గుర్తించారు.  ఛైర్‌పర్సన్ స్వప్న దొంగ ఓటు వేశారంటూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈసీ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టారు. ఆమె దొంగ ఓటు వేసినట్టు తేల్చారు. తోటికోడలు పేరుతో నమోదైన ఓటును తన ఓటుగా చూపించి దొంగ ఓటు వేశారని తేల్చారు.  తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంగ ఓటు వేశారని తేలడంతో స్వప్న రాజీనామా చేయాలంటూ బల్దియా ఆఫీసు ముందు విపక్షాల ఆందోళనకు దిగాయి. దొంగ ఓటు వేయడం చట్టరిత్యా నేరమని.. ఛైర్‌పర్సన్ హోదాలోని వ్యక్తే దొంగ ఓటు వేస్తే.. సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నైతిక బాధ్యత వహిస్తూ.. వెంటనే తాండూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి తాటికొండ స్వప్న రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

కొండా కొత్త  పార్టీ! రేవంత్ డైరెక్షన్ లోనే?

కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు,  చేవెళ్ల మాజీ ఎంపీ, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అలోచనలో ఉన్నారా.. అంటే  అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర రెడీ .. బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి.  ఆయన లాంటిదేమీ లేదని బహిరంగ లేఖ ద్వారా తెలిపారు కొండా.  వాట్ నెక్స్ట్’ అనేది మూడు నెలల తర్వాతనే ప్రకటిస్తానని చెప్పారు. ఈ మూడు నెలల కోసం  మూడు ఆప్షన్స్ ఇచ్చారు. బీజేపీలోకి వెళ్లాలా, టీజేఎస్‌లోకి వెళ్లాలా, అసలు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలా అనేడి అధ్యయనం చేసి..దానిపై నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి చెప్పారు.  తన భవిష్యత్ కార్యాచరణపై శుక్రవారం మరోసారి క్లారిటీ ఇచ్చారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వచ్చే రెండు మూడు నెలల్లో అందరినీ కలుస్తానని చెపుతూ గతంలో చెప్పిన మూడు ఆప్షన్స్’కు మరొకటి చేర్చారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్పారు. అయితే  కొండా విశ్వేశ్వర రెడ్డి  తాజా ఆలోచన ఆయన  సొంతమా లేక రేవంత్ రెడ్డి ఆలోచనను ఆయన బయట పెట్టారా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ లో చేరడం, కాంగ్రెస్ నుంచి బయటకు రావడంలోనూ రేవంత్ రెడ్డి పాత్ర ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ  నేపధ్యంలో కొండా  కొత్త పార్టీ ఆలోచన వెనక కూడా రేవంత్ పాత్ర, ప్రమేయం ఉందనే చర్చ జరుగుతోంది.   రేవంత్ రెడ్డికి  పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినట్లే వచ్చి తాత్కాలికంగానే కావచ్చు, కానీ  చేజారి పోయింది. రేపో మాపో ప్రకటన ఉంటుందని అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పీసీసీ పీఠానికి, నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ముడి పెట్టారు. ఢిల్లీలో  చక్రం తిప్పారు. పీసీసీ నిర్ణయాన్ని హోల్డ్ ‘లో పెట్టారు. అప్పటి నుంచి త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్న రేవంత్ రెడ్డి..  కాంగ్రెస్ పార్టీలో కొంత ఉక్కపోతకు గురవుతున్న మాట వాస్తవం. ఈ నేపధ్యంలో కొత్త పార్టీ ఆలోచన సహా విశ్వేశ్వర రెడ్డి చేస్తున్న ప్రకటనలు అన్నీ, ఆయన పలికిస్తున్న పలుకులేనా, అన్నది ప్రస్తుతానికి రహస్యం. అయితే  రాజకీయ రహస్యాలు, ఇంకొకటి  అట్టే కాలం దాగవు అంటారు. రేపో మాపో అంతా అదే తెలిసిపోతుంది. అంతవరకూ ...? 

19 ఏళ్లకే.. 3 హత్యలు.. 

పెద్దలే కాదు పిల్లలు కూడా క్రైమ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని వారిని హత్యలు చేస్తున్నాడు. సినిమాల ప్రభావమే తాము పెరిగిన వాతావరణమో లేక తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన అలవాటులో తెలియదు గానీ.. ఓ పిల్లవాడు మరి క్రూరంగా మారాడు. 19 ఏళ్ళ వయసులోనే ముగ్గుర్నిచంపేశాడు.  వాడు మగడు..కానీ మగాలపైనా కన్నేసిన కిరాతకుడు.. చిన్నవయసులోనే క్రూరత్వాన్ని అక్షరాభ్యాసంగా చేసుకున్నాడు. తోటి బాలురపై కన్నేయడం కిడ్నాప్ చేసి వారిపై లైంగిక దాడి చేయడం వాడి వృత్తిగా మార్చుకున్నాడు. అది వాడికి చిన్నప్పటి వెన్నతో పెట్టిన అలవాటుగా మారింది. ఇక అంతే 14 ఏళ్ల వయసుకే ఆ ఊరిలో అందరికి స్పైడర్ చూపించాడు. చివరికి తన స్నేహితుడ్నే చంపేశాడు. ఇలా ఐదేళ్లలో ముగ్గురిపై అఘాయిత్యానికి పాల్పడి వారి నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.  ఈ సంఘటన  ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం, మెల్లంపూడి గ్రామాల్లో నెలరోజుల వ్యవధిలో ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. మెల్లంపూడి గ్రామంలో ఈనెల 14న భార్గవతేజ అనే బాలుడు అదృశ్యమై హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘాతుకానికి పాల్పడింది అదే గ్రామానికి చెందిన మెల్లంపూడి గోపయ్య అలియాస్ గోపీ అనే 19 యువకుడిగా గుర్తించారు. అనుమానంతో అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా.. పోలీసులకే షాకిచ్చే నిజాలు వెల్లడించాడు. ఇంటిముందు ఆడుకుంటున్న భార్గవతేజకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్ళీ కాళ్లు చేతులు కట్టేసిభార్గవతేజ లైంగిగ దాడి జరిపినట్లు తెలిపాడు. లైంగిక దాడి తర్వాత అతడ్ని తీవ్రంగా కొట్టి హత్య చేశానని, ఆ తర్వాత మృతదేహం కాళ్లు, చేతులు విరిచినట్లు.. ముఖాన్ని చెక్కేసి సమీపంలోని సమీపంలోని అరటితోటలో పడేశానని పోలీసుల ముందు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.  గతంలో ఇదే తరహాలో మరో నేరం : గత నెల 11వ తేదీవ వడ్డేశ్వరం గ్రామానికి చెందిన మరియదాసు, మీనాక్షిల కుమారుడు అఖిల్ మధ్యాహ్నం సమయంలో అదృశ్యమయ్యాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసినా అఖిల్ ఆచూకీ లభించలేదు. దీంతో ఆకేసు గురించి కూడా గోపీని ఆరా తీయగా.. తానే కిడ్నాప్ చేసి లైంగిక వాంఛ తీర్చుకొని చంపేసినట్లు అంగీకరించాడు. నిందితుడు గోపీలో  సైకో లక్షణాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు 14ఏళ్ల వయసులోనే తన ఫ్రెండ్ ని సెకండ్ షో సినిమాకు తీసుకెళ్లి.. మధ్యలోనే బయటకు తీసుకొచ్చిఅతడిపై లైంగిక దాడి చేసి చంపేశాడు. మృతదేహాన్ని రేవేంద్రపాడు బ్రిడ్డిపై నుంచి కాలువలో పడేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో వివాదం ఎందుకులే అని స్థానికులు వదిలేసినట్లు తెలుస్తోంది. గోపీ తండ్రిది కూడా నేర ప్రవృత్తేనని గ్రామస్తులు చెబుతున్నారు. అతడు మొదటి భార్యను హత్య చేసిన కేసులో 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

షర్మిల పార్టీలోకి అజర్, సానియా!

మాజీ క్రికెటర్, హెచ్.సి.ఎ. అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ షర్మిల పార్టీలో చేరబోతున్నారా? టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సైతం షర్మిలకు జై కొడతారా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. షర్మిల ఎంట్రీతో తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. పలువురు మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు, వివిధ రంగాల ప్రముఖులు షర్మిలను కలిసి తమ సంఘీభావం తెలుపుతున్నారు. యుద్ధనౌక గద్దర్ నుంచి యాంకర్ శ్యామల వరకు ఇప్పటికే షర్మిలతో కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.   ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న షర్మిల పార్టీలో చేరేందుకు అనేకులు ఆసక్తి కనబరుస్తున్నారు. లేటెస్ట్‌గా లోటస్ పాండ్‌లో ఓ సెలబ్రెటీ జంట షర్మిలను కలిశారు. అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్.. సానియా మిర్జా సోదరి ఆనం మిర్జా.. దంపతులు షర్మిలతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే ఈ సమావేశం జరిగిందని బయటకు చెబుతున్నా.. వారు త్వరలోనే షర్మిల పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, అసదుద్దీన్, ఆనం మిర్జాలు మాత్రమే చేరుతారా? లేక, అజారుద్దీన్, సానియా మిర్జాలకు ప్రతినిధులుగా వారు షర్మిల దగ్గరకు వచ్చారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న అజారుద్దీన్ చాలా కాలంగా ఆ పార్టీతో అంటీముట్టనట్టే ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. తన రాజకీయ ఎదుగుదలకు మంచి ప్లాట్‌ఫామ్ కోసం ఎదురు చూస్తున్న అజారుద్దీన్.. షర్మిల పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.  అజర్ కుమారుడు అసదుద్దీన్‌, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి ఆనం మిర్జాలు గతేడాది వివాహ బంధంతో ఏకమయ్యారు. రెండు క్రీడా కుటుంబాలకు చెందిన ఈ జంట తాజాగా షర్మిలను కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త దంపతులు మాత్రమే పార్టీలో చేరుతారా? లేక, అజర్, సానియాలు సైతం షర్మిలతో చేతులు కలుపుతారా? అనేది రాజకీయంగా చర్చనీయాంశమైంది. 

ఓయూ హాస్టల్ లో కరోనా కలకలం

తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. స్కూళ్లు , కాలేజీలు వైరస్ కు హాట్ స్పాట్లుగా మారిపోయాయి. వారం రోజులుగా విద్యాసంస్థల్లో  కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని  వేర్వేరుచోట్ల 86 మందికి వైరస్ నిర్ధారణ అయింది. గురుకులాలు, ఉన్నత పాఠశాల్లో వైరస్ విస్తరిస్తోంది. బాసర ట్రిపుల్ ఐటీలో ముగ్గురికి కరోనా పాజిటీవ్ వచ్చింది. తాజాగా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలోనూ కరోనా కలకలం రేగింది. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ లో ఇద్దరూ  పీజీ విద్యార్థినులకు కరోనా సోకింది. కరోనా నిర్దారణ అయిన ఇద్దరు విద్యార్థినులను కింగ్ కోటి హాస్పిటల్ కు తరలించారు. కరోనా సోకిన స్టూడెంట్స్ ఉన్న హాస్టల్ లో  మొత్తం 400 మంది విద్యార్థినులు ఉన్నారు. వారంతా ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓయూ హాస్టల్ రూమ్ లను సానిటైజ్ చేయిస్తున్నారు  అధికారులు. కరోనా సోకిన విద్యార్థినులతో క్లోజ్ కాంటాక్టులో ఉన్న విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించేందుకు ఓయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కేంద్రం హ్యాండ్సప్! అందరికీ నో టీకా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ విజృంభణతో చాలా ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో టీకా కోసం డిమాండ్ పెరుగుతోంది. అయితే కోవిడ్ టీకా పంపిణిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. టీకా కార్యక్రమంలో వేగం పెరుగుతున్నందున అందరికీ టీకాలు వేస్తారా? అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి.. ప్రతి వ్యాక్సిన్ నూ అందరికీ వేయాల్సిన అవసరం లేదని చెప్పారు.   కరోనా టీకాలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, అవి సురక్షితమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందాలంటే కష్టమన్నారు. అందుకే ప్రాధాన్య వర్గాల వారీగా కరోనా టీకాలు వేస్తున్నామన్నారు. శాస్త్రీయ వాస్తవాలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకునే ప్రాధాన్య వర్గాలను నిర్ణయించామన్నారు. ప్రాధాన్య వర్గాలను గుర్తించేందుకు గత ఏడాది ఆగస్ట్ లోనే ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేశారని, అన్నింటినీ పరిశీలించే ఆరోగ్య సిబ్బంది, ముందు వరుస యోధులు, వృద్ధులు, జబ్బులున్న వారికి టీకాలు వేస్తున్నామని ఆయన వివరించారు. అన్ని పరీక్షలు చేశాకే వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపామన్నారు. వ్యాక్సిన్ల గురించి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.  ‘‘ప్రతి వ్యాక్సిన్ నూ అందరికీ వేయాలనేం లేదు. ప్రస్తుతం వైద్య సిబ్బంది, వృద్ధులు, 45 ఏళ్ల వయసుండి వేరే జబ్బులున్న వారికి కరోనా టీకాలు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత మందికి వేస్తాం. నిపుణుల అభిప్రాయాలు, సలహాలు తీసుకునే ముందుకు సాగుతున్నాం. భారత నిపుణులే కాదు.. ప్రాధాన్య వర్గాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులనూ సలహాలు, సాయం కోరుతున్నాం’’ అని కేంద్ర మంత్రి  వివరించారు.   

బులెట్ ఫ్రూఫ్ ట్రాక్టర్..

ఒక రైతు  బులెట్ ఫ్రూఫ్ ట్రాక్టర్ తయారు చేశాడు. దానికోసం ఏకంగా 5 లక్షల వరకు ఖర్చుచేశాడు. బులెట్ ఫ్రూఫ్ కారు చూశాం, బులెట్ ఫ్రూఫ్ బైక్ చూశాం , బులెట్ ఫ్రూఫ్ ఇల్లు చూశాం. బులెట్ ఫ్రూఫ్ బస్సు చూశాం. బులెట్ ఫ్రూఫ్ ట్రాక్టర్ ఏంటని అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే. పొరుగు రాష్ట్రం రైతుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఓ రైతు తన ట్రాక్టర్‌ను బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్చాడు. హరియాణాలోని సోనీపత్‌ జిల్లా ఖరమపుర్‌ గ్రామానికి చెందిన రాజేంద్ర ఇందుకోసం రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాడు. దీనికి సీసీటీవీ కెమెరాలతో పాటు లోపల ఏసీ, జీపీఎస్‌ ఏర్పాటు చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా మధ్య ఎప్పటినుంచో జలవివాదం కొనసాగుతోంది.   సరిహద్దు ప్రాంతం కావడంతో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భాలున్నాయి. ఈ సమస్య నుంచి నన్ను నేను కాపాడుకోవడానికే ట్రాక్టర్‌ను బుల్లెట్‌ ప్రూఫ్‌ చేయించాను. గత వారం నేను నా సోదరుడితో పొలానికి వెళ్తున్నప్పుడు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మాపై దాడి చేశారు. కాల్పులు కూడా జరిపారు. ఆ సమయంలో ఈ ట్రాక్టర్‌ కారణంగా మేము సురక్షితంగా బయటపడ్డాము అని వివరించారు రాజేంద్ర.

టగ్ ఆఫ్ వార్.. వాణీదేవీనా? రామచంద్రారావా?

ఎమ్మెల్సీ ఓట్స్ కౌంటింగ్. హైదరాబాద్లో హైటెన్షన్. టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ. జస్ట్.. 8వేల మార్జిన్. వాణీదేవి, రామచంద్రారావు హోరాహోరీ. మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తి. అయినా రాని క్లారిటీ. ఎవరు గెలుస్తారు? ఎవరు ఎమ్మెల్సీ అవుతారు? టీఆర్ఎస్, బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎమ్మెల్సీ పోరులో ఎవరిది అప్పర్ హ్యాండ్?  ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సరళి చూస్తుంటే ఎవరు గెలుస్తారో ఓ అంచనాకు రాలేని పరిస్థితి. మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి.. టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు, బీజేపీ కేండిడేట్ రామచంద్రారావుకు 1,04,668.. వామపక్షాలు బలపరిచిని స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,610, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చిన్నారెడ్డికి 31,554 ఓట్లు వచ్చాయి. రేసులో ముందున్న మొదటి ఇద్దరు అభ్యర్థులకు స్వల్ప తేడా మాత్రమే. మూడో స్థఆనంలో ఉన్న నాగేశ్వర్‌కు అందులో సగం ఓట్లు కూడా రాలేదు. ఇక నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఎక్కడో ఆగిపోయింది. అయితే.. వాణీదేవి, రామచంద్రారావులో ఎవరు గెలుస్తారనేది మాత్రం నాగేశ్వర్, చిన్నారెడ్డిలకు వచ్చిన రెండో ప్రాధాన్యతా ఓట్లే డిసైడ్ చేస్తాయి.  నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు ఓటు వేసిన వారు తమ సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి వేశారనేది కీలకం. కాంగ్రెస్ తరఫున రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారు కాబట్టి.. ఆయన అబిమానులే ఎక్కువ శాతం హస్తం గుర్తుకు ఓటేసి ఉంటారు. ఆ లెక్కన.. రేవంత్ ఫ్యాన్స్ ఎవరూ టీఆర్ఎస్‌కు ఓటేసే ఛాన్స్ లేదు. వారి ఓట్లు బీజేపీకి పడితే రామచంద్రారావు లీడ్‌లోకి వస్తారు. ఒకవేళ.. మాజీ ప్రధాని పీవీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి.. ఆయన కూతురైన వాణీదేవి వైపు కాంగ్రెస్ ఓటర్లు మొగ్గు చూపితే.. టీఆర్‌ఎస్ ముందంజలో నిలుస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా జరగొచ్చు. గెలుపు, ఓటమిలను అమాంతం మార్చేయవచ్చు. ఇక, మూడో స్థానంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ. ఆయన్ను స్వతహాగా అభిమానించే వారే ఆయనకు ఓటేసి ఉంటారు. మరి, నాగేశ్వర్ ఓటర్లు తమ రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేసుంటారు? టీఆర్‌ఎస్‌కా? బీజేపీకా? అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నాగేశ్వర్ ఈ రెండు పార్టీలకు సమాన దూరంలో ఉంటారు. ఆయన ఫ్యాన్స్ సైతం అలానే ఉండే అవకాశం ఉంది. ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే.. టీఆర్‌ఎస్‌ కంటే బీజేపీనే ఎక్కువ తప్పుబడుతుంటారు. ఒక దశలో నాగేశ్వర్‌కు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందంటూ ప్రచారం కూడా జరిగింది. అలా చూస్తే.. నాగేశ్వర్‌కు వచ్చిన సెకండ్ ప్రయారిటీ ఓట్లలో ఎక్కువ శాతం వాణీదేవికే పడే ఛాన్సెస్ ఎక్కువ.  ఇలా.. చిన్నారెడ్డి, నాగేశ్వర్‌కు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయనే దానిపైనే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎవరనేది డిసైడ్ అవుతుంది. 

కేరళలోనూ హస్త రేఖలు అస్తవ్యస్తం ...

దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో వుంది, ఇది ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలా చాలా పాపులర్ అయిన సినిమా డైలాగ్. అలాగే, ఈ డైలాగ్’ నూతన ప్రసాద్’ కు మంచి గుర్తింపు,గౌరవం తెచ్చి పెట్టింది. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా, అలానే చాలా క్లిష్ట పరిస్తితులలో ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న ఐదు రాష్ట్రాలలో ‘కేరళ’ ఆటోమేటిక్’ గా కాంగ్రెస్ ఖాతాలో చేరవలసిన రాష్ట్రం. అక్కడ ఒకసారి, సిపిఎం సారధ్యంలోని ఎల్డీఎఫ్, మరోమారు  కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ అధికారంలోకి రావడం ఆనవాయితీగా  వస్తోంది. ఆ లెక్కన ప్రస్తుతం ఎల్డీఎఫ్ అధికారంలో వుంది కాబట్టి రేపటి ఎన్నికల్లో యూడీఎఫ్ ఆటోమేటిక్’ గా గద్దెనెక్కాలి, కానీ, పరిస్థితి చూస్తే, హస్త రేఖలు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడంలేదని ఆ పార్టీ నాయకులే, అది కూడా బహిరంగంగా అంగీకరిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ పార్టీలోని అంతర్గత విబేధాలు బయట పడుతూనే ఉన్నాయి. అంతర్గత విబేధాల కారణంగానే, రాష్ట్ర ముఖ్యమంత్రి  పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా తానూ  పోటీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ కే .సుధాకరన్,  ప్రకటించారు. పినరయి పోటీ చేస్తున్న ధర్మదోమ్ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్ధిగా పార్టీ అధిష్టానం సుధాకరన్ పేరును ప్రకటించింది. అయితే, ఆయనే స్వయంగా తాను పోటీ చేయడం లేదని ప్రకటించడంతో పాటుగా ఆయన ఏ మాత్రం దాపరికం లేకుండా అందుకు కారణం కూడా చేప్పేశారు.  ‘‘ధర్మదోమ్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నన్ను కోరింది.దీనికి నేను నా కృతజ్ణతలు తెలియజేస్తున్నాను, ఈ ప్రతిపాదనను కూడా ఆహ్వానిస్తున్నాను. కానీ ప్రస్తతం అక్కడి పరిస్థితుల దృష్ట్యా పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఆ నియోజకవర్గం నుంచి నా అభ్యర్థిత్వంపై అక్కడి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సముఖంగా లేరు.” అంటూ ఆయన పార్టీలో అంతర్గత విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెప్పారు. ఇదలా ఉంటే, రాష్ట్ర పార్టీ నాయకులు కొందరు, గతంలో ఇలాంటి పరిస్థితి వస్తే, పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దేది, ఇప్పుడా పరిస్థితి లేదు. అసలు అధిష్టానమే ఉండీ లేనట్లుగా వుందని, విచారం వ్యక్త పరిచారు. అలాగే, ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న నియోజక వర్గంలో గట్టి అభ్యర్ధిని నిలపలేక పొతే, ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళన కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది. అదేవిధంగా, జమాతే ఇ ఇస్లామి రాజకీయ విభాగమైన వెల్ఫేర్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం కూడా పార్టీలో చిచ్చురేపుతోంది. శబరిమల ఆందోళన సమయంలో పార్టీ తీసుకున్న స్టాండ్, కొంత మేరకు హిందువులకు దగ్గర చేసింది. ఇప్పుడు పార్టీ ఐయుఎంఎల్’లో చేతులు కలడంతో పరిస్థితి  మళ్ళీ మొదటికే వచ్చింది. బీజేపీ గెలిచే అవకాశాలు లేక పోయినా, హార్డ్ కోర్ హిందూ ఓటు బీజేపీకే పడుతుందని, పార్టీ నాయకులతో పాటుగా,రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇదలా ఉంటే, రాష్ట్రంలో పార్టీ, ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాలా, మాజీ ముఖ్యమంత్రి, ఎన్నికల  ప్రచార కమిటీ కన్వీనర్‌గా ఉమెన్ చాందీ వర్గాలుగా చీలిపోయింది. యుడిఎఫ్‌కు మెజారిటీ వస్తే ఉమెన్ చాందీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఖాయమన్న సంకేతాలు రావడంతో, ఇరు వర్గాలు ప్రత్యర్ధులకు ప్రయోజనం చేకూర్చే విధంగా  వ్యవహరిస్తున్నారు. ఇదలా ఉంటే, పార్టీ మరో సీనియర్ నేత చాకో, టికెట్ల పంపిణీలో తమ వర్గానికి అన్యాయం జరిగిందని అలిగి, పార్టీకి రాజీనామా చేసి, ఎన్సీపీలో చేరారు. మరో వంక ముఖ్యమంత్రి పినరయి విజయన్, అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను ఎల్డీఎఫ్’ను మరోసారి గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు.  ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పినరయి విజయన్ , ఈ ఐదేళ్ళలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై  రూ. 50,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నాం, అయితే ఇప్పటికే ఆ లక్ష్యాన్ని దాటి రూ.63,000 పై చిలుకు పనులు పూర్తి చేశాం అని పేర్కొన్నారు. అలాగే వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని రూ.600 నుంచి రూ.1600లకు పెంచామని, కరోనా కాలంలోనూ ఏ ఒక్కరూ  ఆకలితో అలమటించే పరిస్థతి రాకుండా ప్రభుత్వం ఆదుకుందని చెప్పుకొచ్చారు.  అన్నిటినీ మించి, కరోనా సంక్షోభ సమయంతో పాటుగా వరసగా పలకరించిన ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం ప్రజలను అన్ని విధాల ఆదుకుందని, అందుకే ప్రజలు ఎల్డీఎఫ్’ కు మరో మారు పట్టం కడుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. నిజంగా అదే జరిగితే అది హస్తం స్వయం కృతమే అవుతుంది. ఎందుకంటే, ఎల్డీఎఫ్ ప్రభుత్వం అనేక అవినీతి కుంభకోణాల్లో పీకలవరకూ కురుకు పోయింది. బంగారం  దొంగ రవాణ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం  ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఒక విధంగా, ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుంది. అయినా, ప్రాధాన ప్రతిపక్ష కూటమి, యూడీఎఫ్కు సారధ్యం వహ్సితున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కాడి వదిలేయడంతో , ఎల్డీఎఫ్’కు వరంగా మారింది.  కాంగ్రెస్’కు శాపమైందని, రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.  

కౌన్ బనేగా ఎమ్మెల్సీ? నరాలు తెగే ఉత్కంఠ..

ఎవరు? ఎవరు ఎమ్మెల్సీ? వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి గెలిచేదెవరు? ఎమ్మెల్సీగా నిలిచేదెవరు? మొదటి ప్రాధాన్యతా ఓట్లలో టీఆర్ఎస్ ముందుంది. అంత మాత్రాన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ అవుతారనే గ్యారంటీ లేదు. ఓడిపోతారనీ చెప్పలేం. ఇక ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్న తీన్మార్ మల్లన్న గెలుస్తాడా? అంటే ఏమో చెప్పలేం. గెలిచే అవకాశాలు ఎక్కువే. మరి, మూడో స్థానంలో నిలిచిన కోదండరాం పని ఖతమేనా? అంటే కానే కాదు. థర్డ్ ప్లేస్‌లో ఉన్నా అనూహ్యంగా కోదండరామే ఎమ్మెల్సీ అయ్యే ఛాన్సెస్ భారీగానే ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో ఉన్న బీజేపీ ఖేల్ ఖతం.. దుకాణం బంద్. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ నుంచి 71 మంది పోటీలో నిలవగా.. వీళ్లకు పడిన ఓట్లన్నీ విజేతను నిర్ణయించడంలో కీరోల్ ప్లే చేస్తాయి. గెలుపునకు రెండో ప్రాధాన్యత ఓట్లే అత్యంత కీలకం. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత చివర నిలిచిన అభ్యర్థుల నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ.. వారికి వేసిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చాయో వారికి కలుపుతారు. ఈ లెక్కన.. ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతూ.. చివారఖరికి ఒక్కరు మిగులుతారు.  మొదటి ప్రాధాన్యత ఓట్లలో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించిన వారు ఎనిమిది మంది ఉన్నారు. వీరికి మొదటి ఓటు వేసిన వారు.. రెండో ప్రధాన్యత ఓటు ఇంకెవరికి వేశారనేదే ముఖ్యం. రాణిరుద్రమ రెడ్డి, చెరుకు సుధాకర్, జయసారధిరెడ్డి.. వీరికి 8వేల నుంచి 10 వేల వరకు ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,588.. బీజేపీ కేండిడేట్ ప్రేమేందర్‌రెడ్డికి 39,107 ఓట్లు వచ్చాయి. వీరంతా ఎలిమినేట్ అవడం పక్కా. అయితే.. వీరి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయో ఆ ఓట్లు విజేతను డిసైడ్ చేస్తాయి. రేసులో.. పల్లా, మల్లన్న, కోదండరాం మిగులుతారు. ఇప్పటికే పల్లాకు 1,10,840 ఓట్లు.. మల్లన్నకు 83,290.. కోదండరాంకు 70,072 మొదటి ప్రాధాన్యతా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు వేసిన వారంతా ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులే అయి ఉంటారు. ఆ ఓటర్లు రెండో ప్రాధాన్యత ఓటు టీఆర్‌ఎస్‌కు వేసే అవకాశం తక్కువ. వేస్తే మల్లన్నకు, లేదంటే కోదండరాంకు వేసుండాలి. ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయనేది కీలకం. మూడో ప్లేస్‌లో ఉన్నవారే ఎమ్మెల్సీ గెలుపును డిసైడ్ చేసే కీ ఫ్యాక్టర్.  కోదండరాం మూడో ప్లేస్‌లో నిలిస్తే.. ఆయనకు మొదటి ఓటు వేసిన వారిలో ఎక్కువ మంది మల్లన్నకు రెండో ఓటు వేసే ఛాన్స్ ఉంది. అంటే, ప్రస్తుతం కోదండరాంకు వచ్చిన 70వేల కోట్లలో సగం ఓట్లు మల్లన్నకు పడినా తీన్మార్ మల్లన్న గెలుపు పక్కా.  ఒకవేళ మల్లన్న మూడో స్థానంలో ఉంటే.. ఆయనకు మొదటి ఓటు వేసిన వారు కోదండరాంకు రెండో ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం ఉంది. ఆ లెక్కన్న.. 83 వేల ఓట్లలో సగం ఓట్లు పడినా కోదండరాం గెలుస్తారు. మరి, మొదటి స్థానంలో ఉన్న పల్లా పరిస్థితి ఏంటి? అంటే, ఆయన గెలుపు మూడో స్థానంలో నిలిచే అభ్యర్థిపైనా ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా చూసినా.. మొదటి ప్రధాన్యతా ఓట్లలో టాప్‌లో నిలిచామన్న సంతోషం టీఆర్‌ఎస్‌లో కనిపించడం లేదు. ఇలా.. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది మూడు స్థానంలో నిలిచే అభ్యర్థే డిసైడ్ చేసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి.. ఆ మూడో వ్యక్తి ఎవరు? అతనితో మూడేది ఎవరికి? అనేది ఆసక్తికరం. ఓట్ల తేడా తక్కువగా ఉండటం.. టఫ్ ఫైట్ కొనసాగుతుండటంతో.. తుది ఫలితాలు వచ్చే వరకూ నరాలు తెగే ఉత్కంఠ తప్పకపోవచ్చు.