కొవిడ్ కట్టడి చర్యలు ఇలాగా? ఏపీ సర్కార్ పై హైకోర్టు అసహనం
posted on Apr 22, 2021 @ 4:50PM
ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో మరణాలు పెరిగిపోయాయి. ఏపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కోవిడ్ నియంత్రణ చర్యలపై కౌంటర్ దాఖలు చేయకపోవటం పట్ల ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈనెల 26లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో తోట సురేష్ బాబు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రాధాన్యతా అంశాన్ని పట్టించుకోకపోవటంపై జగన్ రెడ్డి సర్కార్ కు ప్రశ్నించింది ధర్మాసనం. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా సెకండ్ వేవ్ కేసులు, పరీక్షలు, ఫలితాలు, పడకల అందుబాటు, అత్యవసర మందులు తదితరం అంశాలపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రవేటు ఆసుపత్రులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని పేర్కొంది. రెమిడీ ఫీవర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్లోకి వెళ్లటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకటం లేదని చెప్పారు. ఈ వివరాలన్నింటితో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 27లోపు అఫిడవిట్ దాఖలు చేయకపోతే ప్రభుత్వంపై తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం పేర్కొంది.
మరోవైపు కోవిడ్-19ను కట్టడి చేయడంలో భాగంగా హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్ ద్వారా కీలక సర్క్యులర్ విడుదలైంది. సబార్డినేట్ కోర్టులు సహా ట్రిబ్యునల్, లేబర్ కోర్టులు, న్యాయసేవా సంస్ధలు, జిల్లా యూనిట్లలో 50 శాతం మంది మాత్రమే సిబ్బంది విధులకు హాజరుకావాలని మిగిలిన 50 శాతం మంది తరువాత రోజు విధులకు రావాలని హైకోర్టు పేర్కొంది. ఎవరైతే విధులకు హాజరు కారో వారు ఫోన్ కాల్లో అందుబాటులో ఉండి అవసరమైతే అత్యవసరంగా విధులకు హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొంది. న్యాయస్ధానాల ఉద్యోగులు ఎవరూ ముందస్తు అనుమతులు లేకుండా హెడ్ క్వార్టర్స్ను వదిలి వెళ్లకూడదని, హైకోర్టులోకి ప్రవేశించేముందు పూర్తిస్ధాయిలో శానిటైజేషన్ చేసుకొని, మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించి హాజరుకావాలని సూచించింది.