పాలేరు ఉపఎన్నికలో ఉద్రిక్తత... కొట్టుకున్న కాంగ్రెస్, టీఆర్ఎస్

  ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్లో ఉద్తికత వాతావరణం నెలకొంది. పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నేలకొండపల్లి మండలం సుద్దేపల్లి గ్రామంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మరో ప్రాంతంలో టీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తల మధ్య కూడా తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరు వర్గాల కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో ఈ ఉపఎన్నిక ఖరారైన సంగతి తెలిసిందే.

మనోరమాదేవికి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ ను విచారణకు తీసుకోని కోర్టు..

  మనోరమా దేవికి కోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన ముందుస్తు బెయిల్ ను కోర్టు విచారణకు స్వీకరించలేదు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ముందు కేసు డైరీని, పూర్తి వివరాలను, ఎఫ్ఐఆర్ కాపీని అందించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా పూర్వాపరాలు తెలుసుకోకుండా, యాంటిసిపేటరీ బెయిల్ పై విచారించలేమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాగా బీహార్లో సంపూర్ణ మద్య పానం నిషేదించిన తరువాత  మహోరమా దేవి ఇంట్లో విదేశీ బ్రాండ్లకు చెందిన బ్రాందీ, విస్కీ బాటిళ్లు ఉండటంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తన ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోయింది. మరోవైపు మనోరమాదేవి కొడుకు రాఖీ యాదవ్ ఇప్పటికే నేరం అంగీకరించాడు.

మాల్యా కొత్త ఆఫర్.. ఆ హామీ ఇస్తే భారత్ కు వస్తా..

  గతంలో బ్యాంకులకు ఆఫర్లు ఇచ్చిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఇప్పుడు తాజాగా మరో ఆఫర్ తో ముందుకొచ్చారు. ముంబైలో జరిగిన యునైటెడ్ బ్రూవరీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో విజయ్ మాల్యా కూడా పాల్గొన్నారు. వీడియో కాన్పరెన్స్ లో పాల్గొన్న ఆయన ఓ ప్రకటన చేశారు. తాను బ్యాంకులకు బకాయి పడ్డ రుణాలు చెల్లించడానికి సిద్దంగానే ఉన్నానని.. అయితే తనను అరెస్ట్ చేయమని.. అంతేకాదు తగిన భద్రత కల్పిస్తామని హామి ఇస్తేనే భారత్ వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా మాల్యా మొత్తం 17 బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని 9 వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాల్యాను భారత్ కు రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మాల్యా కొత్త ప్రతిపాదనను అంగీకరిస్తారా?.. తను అడిగిన హామీ ఇస్తారా..? చూద్దాం ఏం జరుగుతుందో..

మా అమ్మ తొలిసారిగా నా ఇంటికి వచ్చింది

ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే..ఎంతటి వారైనా అమ్మ ప్రేమకు బంధీ అవ్వాల్సింది. సాక్షాత్తూ దేశ ప్రధాని తన అమ్మ కోసం సేవకుడిగా మారాడు. ఆయన ఎవరో కాదు, భారత ప్రధాని నరేంద్రమోడీ. ఎప్పుడూ ఊపిరి సలపనంత బిజీగా ఉండే ప్రధాని కాసేపు పనుల్నీ పక్కనబెట్టి తన తల్లి హీరాబెన్‌కు సేవలు చేస్తూ గడిపారు. మోడీ ప్రధాని అయిన రెండేళ్ల తరువాత హీరాబెన్ తొలిసారి ఢిల్లీ రేస్ కోర్సు‌ రోడ్డులోని ప్రధాని అధికార నివాసం 7 బంగ్లాకు వచ్చారు. రాక రాక అమ్మ రావడంతో మోడీ ఖుషి అయ్యారు. స్వయంగా అమ్మను వీల్‌చైర్‌లో తీసుకెళ్లి గార్డెన్ చూపించారు. తల్లికి నీళ్లు అందించి సేవలు చేశారు. ఈ సందర్భంగా తల్లితో దిగిన ఫోటోలను ప్రధాని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  నా అధికార నివాసానికి అమ్మ తొలిసారి వచ్చింది. చాలా రోజుల తర్వాత ఆమెతో విలువైన సమయం గడిపాను అంటూ ట్వీట్ చేశారు.

పాలేరు ఉపఎన్నిక పోలింగ్ నేడే.. పక్కా ప్రణాళికతో టీఆర్ఎస్

  ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో ఈ ఉపఎన్నిక ఖరారైన సంగతి తెలిసిందే. అయితే రాంరెడ్డి మరణించడంతో ఆ స్థానం.. ఆయన సతీమణి సుచరితా రెడ్డికి ఏకగ్రీవ ఒప్పందంతో ఇవ్వాలని చూసినా దానికి టీఆర్ఎస్ ఒప్పుకోకపోవడంతో ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈ ఎన్నిక బరిలో టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుండి సుచరితా రెడ్డినే బరిలోకి దింపారు. కాగా ఇప్పటి వరకూ జరిగిన మూడు ఉపఎన్నికల పోలింగ్ లో మూడింటిని టీఆర్ఎస్సే దక్కించుకోగా.. ఇప్పుడు నాలుగోసారి కూడా విజయం తమదే కావాలని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. మరి అంతేకాక సర్వేలు కూడా టీఆర్ఎస్ దే విజయమని తేల్చిచెప్పేశాయి. మరి ఏం జరుగుతుందో.. విజయం ఎవరిదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

తమిళనాడులో ఎన్నికలు షురూ.. ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్

  తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తమిళనాడుతో పాటు ఇంకా కేరళ, పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు పార్రంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించనున్నారు. అంతేకాదు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.   కాగా తమిళనాడులో 232 అసెంబ్లీ స్థానాలకు 3,776 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా 5,82,59,801 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కేరళలో 140 స్థానాలకు గాను 1,203 మంది అభ్యర్ధులు ఉండగా 2,61,06,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు 344 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 9,41,935 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయిన కొంత సమయానికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇండో-చైనా బోర్డర్‌లో అలజడి..ప్రజలకు అనుమానాస్పద కాల్స్

గత కొన్ని రోజులుగా దేశ సరిహద్దు గ్రామాల ప్రజలకు అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దులోని దర్బక్ గ్రామ సర్పంచ్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తులో ఉన్న ఛాంగ్‌లా, సంగేత్ గ్రామాల్లో పహారా కాస్తున్న ఆర్మీ సిబ్బంది వివరాలను ఆ ఫోన్ చేసిన వ్యక్తి అడిగాడు. తాను డిప్యూటీ కమిషనర్‌నని చెప్పాడు. ఆ సమయంలో ఆ సర్పంచ్ ఆకక్దీ ఆర్మీ క్యాంప్‌లోను ఉన్నాడు. దీంతో అప్రమత్తమైన ఆర్మీ అధికారులు విచారణ ప్రారంభించారు. అయితే డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి అలాంటి ఫోన్ కాల్ చేయలేదని తేలింది.   దీంతో విషయం కేంద్ర హోంశాఖ దృష్టికి వెళ్లింది. చైనా, భారత సరిహద్దుల వెంబడి భారీ స్థాయిలో సైనికులను మోహరిస్తుండటంతో ఆ ఫోన్ కాల్స్ చైనా నుంచి వస్తున్నాయా? లేక పాకిస్థాన్ నుంచి వస్తున్నాయా? అన్న కోణంలో భారత ఇంటెలిజెన్స్ అధికారులు శోధిస్తున్నారు. ఈ ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తులు తాము సైనికాధికారులమని, ప్రభుత్వాధికారులమని చెబుతూ సరిహద్దుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వివరాలను అడుగుగున్నట్టు ప్రజలు తెలుపుతున్నారు.

తెలంగాణలో నిలిచిపోయిన ఆటోలు

రవాణాశాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు నిరసనగా తెలంగాణలో ఆటోవాలాలు సమ్మెబాట పట్టారు. హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్ల అనధికార ధరల ప్రకారం ప్రయాణికులను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అక్రమంగా రవాణా వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ క్యాబ్ కంపెనీల జోలికి వెళ్లని అధికారులు ఆటో డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరించడం ఏ మాత్రం బాగోలేదన్నారు. అధికారుల తీరు వల్ల ఆటో డ్రైవర్ల జీవనం సంక్షోభంలో పడుతోందని తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆటోల తనిఖీల సందర్భంగా లోపాలున్నట్లు తేలితే..పర్మిట్లు రద్దు చేస్తామంటూ పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. దీనిని నిరసిస్తూ నిన్న అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లుగా ప్రకటించింది.

మోడీతో ఎం మాట్లాడాలో ప్లాన్ చేస్తున్న చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని బీజేపీ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో బీజేపీతో తెగతెంపులు చేసుకుంటారా..లేక వార్నింగ్ ఇస్తారా అంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనపై చంద్రబాబు భారీ కసరత్తులు చేస్తున్నారు. ఇవాళ ఉదయం తన నివాసంలో మంత్రులు, తెదేపా ముఖ్యనేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని కలిసి కరువు సమస్యలు, విభజన హామీలపై చర్చిస్తారని తెలిపారు. కరువుపై ప్రధానికి ప్రజెంటేషన్ ఇచ్చి వినతిపత్రం అందజేయనున్నారు. రేపు మరోసారి ఉన్నతాధికారులతో సమావేశమై..రాష్ట్రానికి కావాల్సిన సాయంపై నివేదిక రూపొందించనున్నారు ముఖ్యమంత్రి.

రాజ్యసభకు డీఎస్... ! చక్రం తిప్పిన కవిత

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ నుంచి 2 ఖాళీలు ఉన్నాయి. దీంతో రాజకీయపార్టీలు రాజ్యసభ అభ్యర్థులపై కసరత్తును ప్రారంభించాయి. తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రెండు సీట్లు అధికార టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తాయి. ఈ రెండింటి కోసం దాదాపు ఐదారుగురు సీనియర్లు పోటీ పడుతున్నారు. అయితే అందరికంటే ముందుగా డీఎస్ తన బెర్త్ కన్ఫామ్ చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా పనిచేసి కాంగ్రెస్ రెండు సార్లు వరుసగా అధికారంలోకి రావడానికి కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనతో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో డీఎస్ కాంగ్రెస్‌ను వీడి..టీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్‌లో చేరడానికి ముందే రాజ్యసభ సీటుపై కేసీఆర్ నుంచి గ్యారెంటి లభించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రాజ్యసభ సీటు దక్కించుకోవడానికి ఆయన తన బీసీ కార్డుతో పాటు కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత చక్రం తిప్పినట్టు టీఆర్ఎస్ భవన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కూతురు రికమండేషన్‌తో కరిగిన కేసీఆర్..డీఎస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీనిపై నేడో,రేపో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముంది.

దత్తన్న సెల్‌ఫోన్‌ చోరి..!

తాము దొంగతనం చేయడానికి ఎవరైనా ఒకటే అని నిరూపిస్తున్నారు. సాక్షాత్తూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సెల్‌ఫోన్‌ని ఆగంతకులు కొట్టేశారు. దత్తాత్రేయ హైదరాబాద్ రామ్‌నగర్‌లోని మీ సేవాకేంద్రంలో నివాసం ఉంటారు. నిన్న అర్థరాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చెట్లు విరిగిపోయి ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మంత్రిగారి శామ్‌సంగ్ సెల్‌ఫోన్‌లో చార్జింగ్ అయిపోయింది. దీంతో ఆయన తన ఇంటి ముందున్న గదిలో ఛార్జింగ్ పెట్టారు. రోజులాగే ఆయన్ని కలిసేందుకు చాలా మంది సందర్శకులు అక్కడ నిలిచి ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత చూస్తే సెల్‌ఫోన్ కనిపించలేదు. ఫోన్‌ని ఎవరో దొంగిలించారని నిర్థారించుకున్న మంత్రి పీఏ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ విలువ రూ.25 వేల వరకు ఉంటుందని అంచనా.

జర్నలిస్ట్‌లకు భారత్ సేఫ్ కాదు..సర్వేలో బయటపడ్డ నిజాలు..!

నిత్యం సమాజం కోసం పరితపించి..నిజాలను నిగ్గుతేల్చే జర్నలిస్టులపై రోజు రోజుకి దాడులు ఎక్కువైపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో పాత్రికేయులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. అంతేకాదు చివరికి ప్రాణాలు కూడా తీస్తున్నారు. దీంతో ప్రపంచంలో జర్నలిస్టుల పరిస్థితిపై ఓ అంతర్జాతీయ సంస్థ సర్వే జరిపింది. ఆ సర్వేలో మీడియా వ్యక్తులకు భారత్ అత్యంత ప్రమాదకరదేశమని తేలింది. అంతేకాదు జర్నలిస్టులకు రక్షణ కరువైన దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో్ స్థానంలో నిలిచింది. జాబితాలో ఇరాక్, సిరియా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. బీహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఇద్దరు జర్నలిస్ట్‌లను దుండగులు దారుణంగా కాల్చిచంపడంతో భారత్‌లో జర్నలిస్ట్‌ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనదేశంలో 1992 నుంచి ఇప్పటి వరకు 64 మంది పాత్రికేయులు దారుణ హత్యలకు గురయ్యారు.

అది మిస్ ఫైర్ కాదు..ఆత్మహత్య

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ నల్లాల ఓదెలు వద్ద ఎస్కార్ట్‌ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బొండాజీ గంగాధర్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి బెటాలియన్‌కు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గత కొంత కాలంగా విప్ నల్లాల ఓదెలు వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆది, సోమవారాల్లో మంత్రి హారీశ్‌రావు జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై విప్ ఓదెలు మందమర్రిలో పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నారు. హఠాత్తుగా పెద్దశబ్ధం రావడంతో బయటకు వచ్చి చూడగా గన్‌మెన్ గంగాధర్ రక్తపుమడుగులో పడి ఉండటం చూసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొద్ది సేపటికే అతను మరణించాడు. తుపాకీ మిస్‌ఫైర్ కావడంతోనే మృతిచెందాడని తొలుత వార్తలు వచ్చాయి. కాని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తర్వాత ధ్రువీకరించారు. జిల్లా ఎస్సీ తరుణ్‌జోషి ఆస్పత్రిలో గంగాధర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. 

ట్రంప్ గెలవాలంటూ ఇండియాలో పూజలు...!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్‌ గెలవాలని సొంత దేశం అమెరికాలో చాలా మంది కోరుకుంటున్నారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు కాని నోరు తెరిస్తే భారత్‌పై విషం కక్కే ట్రంప్‌ గెలివాలని భారతీయులు కోరుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే భారత్‌లోని హిందూసేన..డోనాల్డ్ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని యజ్ఞమే నిర్వహించింది. యజ్ఞంలో భాగంగా దేవతల ప్రీత్యర్థం నవధాన్యాలు, నెయ్యి హోమగుండంలో వేశారు. హిందూ దేవతల బొమ్మలతో పాటు తిలక ధారణం చేసిన ట్రంప్ ఫోటోలను కూడా అక్కడ పెట్టారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించగలగిన వాడు ఒక్క ట్రంప్ మాత్రమేనని హిందూసేన ఆకాంక్షిస్తోంది. భారత్ కూడా ఇస్లామిక్ చాందసవాదం బెడదను ఎదుర్కొంటున్నదే కాబట్టి, ట్రంప్ గెలిస్తేనే ఆ బెడద వదులుతుందని హిందూసేన వ్యవస్థాపకుడు విష్ణుగుప్తా విలేకరులకి చెప్పారు.