ఎన్ఎస్జీ లో భారత్ కు సభ్యత్వం వ్యతిరేకిస్తున్నాం...

  న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు చైనా ఎన్ఎస్జీ లో భారత్ కు సభ్యత్వం ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియాకు సభ్యత్వం ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చైనా పేర్కొంది. ఇందుకు కారణం కూడా చైనా చెప్పుకొచ్చింది.. ఎన్ఎస్జీలో ఇండియాను చేరిస్తే, పాకిస్థాన్ ను రెచ్చగొట్టినట్టు అవుతుందని.. తమ దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని, అది తమకు ప్రమాదమని పేర్కొంది. దక్షిణాసియాలో తీవ్ర అణ్వస్త్ర పోటీ నెలకొంటుందని తన భయాన్ని వ్యక్తం చేసింది.

ఓర్లాండో ఘటనలో ట్విస్ట్... భార్యకు కూడా తెలుసు.

  ఓర్లాండో నరమేధంపై రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఇప్పటికే ఈ దారుణానికి పాల్పడిన ఒమర్ మతీన్ పై నిజాలు బయటపడుతుంటే.. ఇప్పుడు ఆయన భార్య గురించి కూడా కొన్ని విషయాలు వెలుగుచూస్తున్నాయి. కాల్పుల ఘటన గురించి మతిన్‌ రెండో భార్య నూర్‌ సల్మాన్‌కు ముందే తెలుసని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.   విడాకులు తీసుకున్నప్పటికీ, ఆమెకు మతీన్ తో సంబంధముందని, గే క్లబ్బులకు పలుమార్లు మతీన్ తో కలసి వెళ్లిందని అధికారులు గుర్తించారు. దాడికి వారం ముందు కూడా మతీన్ తో ఆమె కలిసి కనిపించిందని, ఇద్దరూ కలిసి తిరుగుతున్న సమయంలోనే మతీన్ ఆయుధాలను సమకూర్చుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో ఏ క్షణమైనా నూర్ ను అదుపులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.

మరోసారి చంద్రబాబుపై జేసీ.. చంద్రబాబుకు అది అత్యాశే..

  ఇతర పార్టీ నేతలపైన విమర్సలు చేయడం కామన్. కానీ ఇతర పార్టీ నేతలను విమర్శిస్తూ.. తమ పార్టీ నేతలపై కూడా విమర్సలు చేసే ధైర్యం ఎవరికి ఉందంటే వెంటనే మనకు జేసీ బ్రదర్స్ గుర్తొచ్చేస్తారు. ఎవరు ఏమనుకున్నా తమకి నచ్చినట్టు, తమకు చెప్పాలనిపించింది చెప్పడంలో వీరిద్దరూ దిట్ట. తాజాగా అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రుణమాఫీపై చేసిన కొన్ని వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఒకే దఫా రైతులందరికీ కనీసం రూ.50 వేలు రుణమాఫీ గనుక చేసుంటే.. ఈపాటికి చంద్రబాబును రైతులంతా నెత్తికెక్కించుకునేవారని, అనవసర అత్యాశకు పోయి చంద్రబాబు రుణమాఫీ హామి ఇచ్చారని' విమర్శించారు. అంతేకాదు నియోజక వర్గ ప్రజలకు ఓ సలహా కూడా ఇచ్చారు. ఈ నెల చివరి వారం వరకు రుణమాఫీ పూర్తవుతుందన్న ప్రభుత్వం హామి ఇచ్చింది.. ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టు రుణాలు మాఫీ కాకపోతే నియోజకవర్గ ఎమ్మెల్యేలను నిలదీయండి అంటూ సూచించారు.

ఐసిస్ కు ఒబామా వార్నింగ్.. మాతో పెట్టుకోవద్దు...

  అగ్రరాజ్యమైన అమెరికాపై ఉగ్రవాదులు దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. మొన్ననే ఒమర్ మతీన్ అనే ఉగ్రవాద సంబంధి 50 మందిని అత్యంత దారుణంగా మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాను కాని, ఆ దేశ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుంటే... ఐఎస్ ఉగ్రవాదులకు ప్రపంచంలో ఎక్కడ కూడా సురక్షిత స్థానం దొరికే అవకాశమే లేదని.. పూర్తిగా పెకలించేస్తాం అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే సిరియా అండ్ ఇరాక్ లో ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాము.. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన 120 మంది అగ్ర నేతలను మట్టుబెట్టాము..అక్కడ ఆ సంస్థ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు.

కేక్ పై అసదుద్దీన్.. కట్ చేసిన రాజ్ ఠాక్రే!

  మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. ఇప్పుడు ఆయన వివాదస్పద చర్యలకు తెరతీసినట్టు కనిపిస్తోంది. రాజ్ ఠాక్రే నిన్న సెంట్రల్ ముంబైలోని దాదర్ లోని తన ఇల్లు ‘కృష్ణ కుంజ్’లో 48వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కేక్ కట్ చేశారు. అయితే ఆయన కేక్ కట్ చేయడంలో అంతా వివాదాస్పదం ఏముందనుకుంటున్నారా.. అక్కడే ఉంది ట్విస్ట్.. తాను కట్ చేసిన కేక్ పై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ బొమ్మ ఉండటమే. ఒవైసీ బొమ్మతో ఉన్న కేక్ ను ఆయన ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. ఆ తర్వాత అభిమానులందరికీ దానిని పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడినా... ఈ కేక్ మాదిరే ముక్కలు ముక్కలు చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. మరి దీనిపై ఎంఐఎం పార్టీ నేతలు.. అసదుద్దీన్ ఎలా స్పందిస్తారో.. ఈ వ్యవహరంలో ఇంకెంత దుమారం రేగుతుందో చూడాలి.

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పుకోనున్న అజయ్ దేవగన్.. కారణం అదేనా..?

  ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా అజయ్ దేవగన్ దంపతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పదవి నుండి అజయ్ దేవగన్ తప్పుకుంటున్నారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీనికి ఆయన ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండటమే కారణమంట.   ఎందుకంటే.. ఇంత వరకు అడ్వర్టయిజ్‌మెంట్ నిమిత్తం ఒక్క యాడ్ ఫిల్మ్‌ను కూడా అజయ్ దేవగణ్‌తో చిత్రీకరించలేదు.. ఏపీలో గల పర్యాటక ప్రాంతాల గురించి వివరించిన సందర్భాలు లేవట. దీనికితోడు ఈ ప్రాజెక్టు కోసం తాను ఎలాంటి డబ్బులు తీసుకోకపోయినా టాప్ ఏజెన్సీల ద్వారా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అజయ్ దేవగణ్ భావించారని, ఇందుకోసం అజయ్ - కాజోల్‌లు లింటాస్, ఒజిల్వీ వంటి సంస్థలను కూడా చూపించారని కానీ.. ఏపీ అధికారులు మాత్రం స్థానిక ఏజెన్సీతో పట్టాలెక్కించాలని భావిస్తోందట. అందుకే అజయ్ దేవగన్ అప్ సెట్ అయ్యారని బ్రాండ్ అంబాడిడర్ గా తప్పుకోవాలని చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ముద్రగడ, చంద్రబాబు.. పంతం నీదా నాదా..?

  చూడబోతే కాపు నేత ముద్రగడ పద్మనాభం... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ పట్టు వదిలేలా కనిపించడం లేదు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని, తుని అల్లర్ల కేసులో అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్షకు పూనుకున్నారు. ఈరోజుతో ఆయన దీక్ష చేపట్టి ఏడో రోజుకి చేరుకుంది. దీంతో ఒకపక్క ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా.. వైద్య పరీక్షలకు మాత్రం ససేమిరా అంటున్నారు. అంతేకాదు తమ డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రకటన చేస్తేనే తాను దీక్ష విరమిస్తానని ముద్రగడ మొండికేస్తున్నారు. మరోవైపు ముద్రగడ దీక్ష నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నుండి కూడా అడుగు ముందుకుపడటంలేదు. ముద్రగడ దీక్షను విరమిస్తే డిమాండ్లు పరిష్కారం చేస్తామని.. ఇప్పటికే కాపుల సమస్యలపై పరిశీలిస్తున్నామని చెప్పాము. ముందుగా ముద్రగడ దీక్ష విరమిస్తే ఆ తర్వాత ఆయన డిమాండ్ల పరిష్కారంపై ఆలోచిస్తామని ప్రకటన చేశారు. మరి ముందుగా డిమాండ్ల పరిష్కారమంటూ ముద్రగడ... దీక్ష విరమణ తర్వాత డిమాండ్ల పరిష్కారమంటూ ప్రభుత్వం చెబుతుండటంతో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పరారీ నేరస్తుడిగా మాల్యా గుర్తింపు.. భారత్ రావాల్సిందే..

  విజయ్ మాల్యాకు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. మల్యాను భారత్ కు అప్పగించేందుకు లైన్ క్లియరైనట్టు తెలుస్తోంది. జయ్ మాల్యా కేసులో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అవ్వగా.. ఇప్పుడు మాల్యాను ‘ప్రొక్లెయిమ్ డ్ అఫెండర్’ (పరారీలో ఉన్న నేరస్తుడు) గా గుర్తించాలని కోర్టులో పిటిషన్ వేసింది. అయితే దీనిపై విచారించిన కోర్టు మాల్యాను ప్రొక్లయిమ్ డ్ అఫెండర్ గా ప్రకటించింది. నెల రోజుల్లో కోర్టు ముందు హాజరుకావాలని సూచించింది. దీంతో మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. అంతేకాదు మాల్యాను అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడైనా మాల్యా భారత్ వస్తారో లేదో చూద్దాం..  

కాంగ్రెస్ కు షాక్.. జానారెడ్డి రాజీనామా.. అందుకేనా..?

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు నేతలు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు, మాజీ ఎంపీ వినోద్, మాజీ ఎమ్మెల్యే వినోద్ టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు వారికి తోటు మరో నేత కూడా గులాబి కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ప్రకటించాడు. నల్గొండ డీసీసీ చీఫ్ రాంరెడ్డి కూడా కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు చెప్పారు.   అయితే ఇప్పటికే వరుస జంపింగ్ లతో దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్న కాంగ్రెస్ కు జానారెడ్డి మరో షాక్ ఇచ్చారు. నిజంగా వరుస పార్టీ ఫిరాయింపులతో ఆయన విసుగెత్తి పోయారో లేక ఇంకా ఏదైనా ఉందో తెలియదు కాని ఆయన కూడా తన పదవులకు రాజీనామా చేస్తానని చెప్పి షాకిచ్చాడు. దీంతో ఇప్పుడు ఇది చర్చాంశనీయంగా మారింది. కాంగ్రెస్ నేతల ఫిరాయింపులపై మాట్లాడిన జానారెడ్డి సీఎల్పీతో పాటు మిగతా అన్ని పదవులకు రాజీనామా చేయాలనుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. అంతేకాదు తన రాజీనామా వెనుక కారణం కూడా వివరించాడు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు లోను చేశాయని.. ఫిరాయింపుల నేపథ్యంలో ఈ పదవుల్లో కొనసాగడం అవసరమా..?, ఎందుకు నాకీ పదవులు..? అనిపించినందువల్లే ఫిరాయింపులకు వ్యతిరేకంగా పదవులన్నింటిని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలియజేశారు. రాజీనామాపై తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో చర్చించాక వెల్లడిస్తామని ప్రకటించారు. మరి నిజంగానే జానారెడ్డి చెప్పింది నిజమేనా.. లేకపోతే తరువాత ఏదైన ట్విస్ట్ ఇస్తారా.. చూడాలి మరి.

ఎమ్మెల్యేలు కావాలనుకునే వారికి జగన్ చిట్కాలు..

ఎంత డబ్బు ఉన్నా..ఎంత పేరున్నా పొలిటికల్ పవర్ ముందు దిగదుడుపే..అందుకే జీవితంలో ఒక్కసారైనా ఖద్దరు బట్టలు వేసుకోవాలనుకుంటారు చాలామంది. కాని అది అనుకున్నంత ఈజీ కాదు. అలాంటి వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మంచి చిట్కాలు చెబుతున్నారు.  రాజకీయ నాయకులు కావాలంటే ఘనమైన వారసత్వం కావాల్సిన అవసరం లేదని, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదన్నారు. అందుకు చక్కన అవకాశం తాను కల్పిస్తున్నానన్నారు. రోజుకి నాలుగు గంటల చొప్పున, 5 నెలల పాటు రోజుకొక పంచాయతీ చొప్పున ప్రచారం కల్పిస్తే..విజయం మీ సొంతమవుతుందని ఆయన తెలిపారు.  ప్రతి ఇంటికీ వెళ్తే..మనతో ఉన్నదెవరు, మాటలు చెబుతున్నదెవరు, మన వెంట నడిచేదెవరు? అన్న క్లారిటీ వస్తుందన్నారు. ఆ సమయంలో బూత్ ఏజెంట్లు, గ్రామ పెద్దలు, ఇలా వివిధ స్థాయిల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలకు క్లారిటీ వస్తుందని ఆయన చెప్పారు.  వైఎస్సార్‌సీపీ ఇచ్చే పాంప్లేట్‌ను గడపగడపకు ఇచ్చి, అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయించడం ద్వారా ప్రజల స్పందన తెలుస్తుందని..జూలై 8 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.   

మంత్రి పదవికి రాజీనామా.. హాట్ టాపిక్ ఇదే..

    ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఇది ఢిల్లీలో హాట్ టాపిక్ అయింది. మంత్రి గారు రాజీనామా చేయడానికి.. అందరూ చర్చించుకోవడానికి కారణం ఏంటనుకుంటున్నారా..? ఎందుకంటే బస్సుల కుంభకోణంలో గోపాల్‌ రాయ్‌ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో గోపాల్ రాయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు గోపాల్ రాయ్ మాత్రం అనారోగ్యం కారణంగానే రవాణా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే గోపాల్ రాయ్ మెడలో ఉన్న బుల్లెట్ను వైద్యులు తొలగించారు. దీంతో ఆయన ఏడాది పాటు పక్షవాతానికి కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలో తాను విశ్రాంతి తీసుకోనున్నట్లు గోపాల్ రాయ్ తెలిపారు.  కాగా గోపాల్ రాయ్ స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ...రవాణా శాఖ బాధత్యలను స్వీకరించనున్నారు.

మరోసారి తెరపైకి వచ్చిన ఫ్రీడమ్ 251 .. జూన్ 28 నుండి డెలివరీ

  ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్.. ఇది గుర్తుండే ఉంటుంది కదా.. రూ. 251 కే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని రింగింగ్ బెల్స్ సంస్థ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఈ హడావుడికి తగ్గట్టే విమర్శలు కూడా బాగానే వచ్చాయి. అయితే గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు మరో వార్తతో బయటకు వచ్చింది. జూన్ 28వ తేదీ నుంచి  తమ ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్లను అందిస్తామని  కంపెనీ డైరెక్టర్ మొహిత్ గోయల్ ప్రకటించారు. తమ ఫ్రీడం ఫోన్ల కోసం దాదాపు ఏడు కోట్లకు పైగా  రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, 30వేలమంది  కాఫ్ ఆన్ డెలివరీ కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. కాగా గత ఫిబ్రవరిలో  చేసిన సంస్థ ప్రకటనతో ముప్పై వేల మందికి పైగా ఫ్రీడమ్ 251 ఫోన్లను బుక్ చేశారు. మరో ఏడు కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో.. ఇది ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.

బాబు ముఖ్యమంత్రి అయ్యారు కానీ... లీడర్లు అవ్వాలంటే ఏం చేయాలి..

విజయవాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై, ప్రభుత్వం విమర్శల బాణాలు సంధించారు. బాబు ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. జాబు మాత్రం రావడం లేదు.. నిరుద్యోగ భృతి గురించి మాట కూడా మాట్లాడటం లేదు అని అన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లో కొంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలను కొంటే ఎన్నికల్లో గెలవలేరు.. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల గుండెల్లో చోటు సంపాదించాలి.. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలి అని వ్యాఖ్యానించారు.   అంతేకాదు లీడర్లు అవ్వాలంటే ఏం చేయాలో కూడా జగన్ సలహాలు ఇచ్చారు. రోజుకి నాలుగు గంటల చొప్పున, 5 నెలల పాటు రోజుకొక పంచాయతీ చొప్పున ప్రచారం చేస్తే... విజయం మీ సొంతమవుతుందని.. 5 నెలలు పూర్తయ్యే సరికి మీరు లీడర్లు అవుతారని ఆయన చెప్పారు.

బాయ్ ఫ్రెండ్ ముద్దు.. ప్రాణాలనే తీసింది..

  బాయ్ ఫ్రెండ్ పెట్టిన ముద్దు ఏకంగా ఆమె ప్రాణాలనే తీసింది. ఈ విచిత్రమైన ఘటన ఇంగ్లడ్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మరియమ్ లిమే అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ను కలిసింది. ఎంచక్కా ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆఖరిలో ఆమె తిరిగి వచ్చేటప్పుడు అతను ఆమెకు ఓ ముద్దు కూడా పెట్టాడు. అంతే కాసేపటికి ఊపిరి ఆడనట్టు అయిపోయి.. ఊపిరి తీసుకునేందుకు తీవ్రంగా కష్టపడి చివరికి ప్రాణాలు కోల్పోయింది మరియమ్ లిమే. ఆమెకు పోస్టు మార్టం చేసిన వైద్యులు కూడా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ముద్దు వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని తేల్చిచెప్పారు. అయితే ఆమె చనిపోవడానికి.. అతని ముద్దకు సంబంధం ఏంటనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆమెకు ఆస్తమా ఉంది. మరియమ్ ను ముద్దుపెట్టుకునే ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ పీనట్ (వేరు శనగ) బటర్ స్కాచ్ శాండ్ విచ్ తిన్నాడు. ఆస్తమాతో బాధపడేవారికి పీనట్ అలర్జీ ఉంటుంది.. అది కొద్దిగా తిన్నా ప్రాణాలకే ప్రమాదం. ఈ కారణంతోనే ఆమె చనిపోయింది.

హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సోనియా..

  తరచూ ఏదో ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కాస్త రిలీఫ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టున్నారు. అందుకే తన కూతురు ప్రియాంకగాందీతో కలిసి హాలిడే ట్రిప్ వెళ్లారు. తన కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి సిమ్లాలో ప్రత్యక్షమయ్యారు. ఇద్దరూ ఢిల్లీ నుంచి కలిసి వెళ్లి అక్కడి నుండి సిమ్లాలో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారట. అంతేకాదు హాలీడేస్ కే వెళ్లినప్పటికీ ఛారబ్రాలో తాము కొత్తగా కట్టుకుంటున్న ఇంటిని వారు ఓసారి పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చిన సదరు భవంతిని ప్రియాంకా గాంధీ తన అభిరుచికి అనుగుణంగా కట్టించుకుంటున్నారు.

నేను వస్తే ఇదంతా మారుతుంది.. ట్రంప్

  ఓర్లాండాలో జరిగిన నరమేథాన్ని అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ బాగానే ఉపయోగించుకుంటున్నట్టు ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ ఒబామాపై.. ప్రభుత్వంపై విమర్శలు కురిపించే పనిలో పడ్డారు. మన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.. ఎవర్ని దేశంలోకి రానిస్తున్నామో తెలియడం లేదు అని అన్నారు. తనిఖీల్లో అధికారులు ఫెయిలయ్యారు.. అయినప్పటికీ మన అధ్యక్షుడు బరాక్ ఒబమా మాత్రం ఇంటెలిజెన్స్ అధికారులను వెనుకేసుకొస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే ఇదంతా మారుతుంది' అని ట్రంప్ చెప్పారు. ముస్లింలను అమెరికాలోకి రానివ్వకూడదంటే నన్ను అందరూ తిట్టారు.. కానీ ఇప్పుడు నేనే కరెక్ట్ అంటున్నారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ అమెరికాని టార్గెట్ చేసింది.. రాడికల్ ఇస్లానిక్ భావాలతో ఉన్నారు.. వారిని దేశంలోకి రానివ్వకూడదు అని అన్నారు. అందుకే అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా ఓ తాత్కలిక నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కాగా అమెరికాలోని ఓర్లాండోలో మతీన్ అనే వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల కారణంగా దాదాపు 50మంది ప్రాణాలుకోల్పోయిన సంగతి తెలిసిందే.

గుత్తా పోవడంతో శని పోయింది.. కోమటిరెడ్డి

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు నేతలు టీఆర్ఎస్లోకి చేరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ నేతలపై మండిపడ్డారు. నల్గొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లిపోనుండడంతో కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని పోయింది అని ఆయ‌న అన్నారు. గుత్తా, భాస్క‌ర్ రావు పార్టీ కండువా మారుస్తోన్న సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు స‌హేతుక‌మైన‌వి కావని ఆయ‌న వ్యాఖ్యానించారు. వారు పార్టీని వీడుతున్నందుకు త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకుంటున్నార‌ని కోమటిరెడ్డి అన్నారు. పార్టీని వీడనున్న నేత‌లు రాజీనామా చేసి మ‌ళ్లీ గెలిస్తే తాను రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకుంటాన‌ని కోమ‌టిరెడ్డి ప్ర‌క‌టించారు. కాగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్, ఎమ్మెల్యే భాస్కరరావు టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.