మొన్నటివరకూ ఉత్తరాధిన.. ఇప్పుడు దక్షినాధిన..

  ఉత్తరాధిన దళితులపై దాడులు జరగుతుండటం చూస్తూనే ఉన్నాం.. ఏదో ఒక కారణంతో దళితులపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గోమాంసం వివాదంపై దళితులపై దాడులు జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకూ ఉత్తరాదికే పరిమితమైన ఈ వివాదం ఇప్పుడు నెమ్మదిగా దక్షిణాదికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఆవు వివాదం వెలుగుచూసింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా.. అమలాపురంలో జానకిపేటకు మోకాటి ఎలీషా..అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు చర్మకారులు. అయితే వారు ఓ చనిపోయిన ఆవును తీసుకెళ్లి చర్మ వలుస్తుండగా.. కొంతమంది వచ్చి.. ఆవును దొంగిలించి చర్మ వలుస్తారా..? అంటూ ఆగ్రహంతో వారిని చెట్టుకు కట్టేసి కొట్టారు. దీని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకి సమాచారం అందిచంగా అసలు విషయం బయటపడింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఇప్పుడు జిల్లా మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాడిని నిరసిస్తూ అమలాపురంలో దళిత సంఘాల నాయకులు రాస్తారోకోకు దిగారు.

శశికళపై మరో ఆరోపణ.. పోలీసులకి పనిమనిషి ఫిర్యాదు

అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప ఇప్పటికే డీఎంకే ఎంపీ రవిని ఢిల్లీ విమానాశ్రయంలో చెంపదెబ్బ కొట్టిన నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిలోభాగంగా పార్టీ అధినేత్రి ఇప్పటికే ఆమెను పార్టీ నుండి సస్పండ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరో వివాదంలో ఇరుకున్నారు శశికళ. ఆమె ఇంట్లో పనిచేసే 22 ఏళ్ల యువతి శశికళ కుటుంబంపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆమె కుటుంబ సభ్యులు తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ..తనతో పాటు తన సోదరిపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. తన ఫిర్యాదులో పేర్కొంది.  తమను ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని తెలిపింది. తెల్లకాగితాలపై తమతో సంతకాలు పెట్టించుకున్నారని, దీని గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని తెలిపింది. మరి దీనిపై శశికళ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో చూడాలి.

హిల్లరీని ట్రంప్ కాల్చమంటున్నారా..!

  ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్ది డోనాల్డ్ ట్రంప్ మరోసారి హిల్లరీ క్లింటన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న అయన హిల్లరీ క్లింటన్ గురించి మాట్లాడుతూ.. హిల్లరీ అధికారంలోకి వస్తే అమెరికన్లకు మాత్రమే వర్తించే గన్ లైసెన్స్ 'సెకండ్ అమెండ్ మెంట్'ను తొలగిస్తారని.. తుపాకి లైసెన్స్ కలిగివున్న ప్రతి అమెరికన్ పౌరుడు హిల్లరీ క్లింటన్ వైట్ హోస్ కు చేరకుండా ఆపగలరని వ్యాఖ్యనించారు. అయితే ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. హిల్లరీ పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హిల్లరీని చంపాలన్న సందేశం ఇచ్చేట్టుగా ఉన్నాయని యూఎస్ లా మేకర్స్ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ట్రంప్ అనుచరులు ఖండిస్తున్నారు. మీడియా కావాలనే ట్రంప్ పై ఇలాంటి ఆరోపణలు చేస్తుందని.. కేవలం సెకండ్ అమెండ్ మెండ్ ద్వారా లబ్ధి పొందుతున్న ఓటర్లను ఆకర్షించడానికి మాత్రమే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మరి దీనిపై హిల్లరీ ఎంత దుమారం రేపుతారో చూడాలి.

జగ్గారెడ్డి దీక్ష.. అరెస్ట్ చేసిన పోలీసులు

తెలంగాణ ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలోనూ నిర్మించాలని భావిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దీక్షకు పూనుకున్నారు. తన ప్రాణం పోయినా దీక్ష నిర్వహించే తీరుతానని.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం చేసేవరకూ తన పోరాటం సాగుతోందని అన్నారు. నిరంకుశ పాలనకు చరమగీతం మల్లన్న సాగర్ నుంచే బీజం పడిందని తెలిపారు. భారీ అనుచరగణంతో దీక్షా స్థలికి చేరుకొని దీక్షకు దిగారు. అయితే దీక్షకు తాము అనుమతి ఇవ్వలేదని చెప్పిన పోలీసులు జగ్గారెడ్డి దీక్షను అనుమతించబోమని చెప్పారు. జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

అందులో ఉండలేం.. పని చేయలేం... ఏపీ మంత్రులు

  ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా శాఖలు అమరావతికి తరలివచ్చాయి. ఇక హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులు కూడా చాలామంది ఏపీకి చేరుకున్నారు. అయితే వెళ్లడానికి వెళ్లారు కానీ.. అక్కడ సరైన వసతులు లేని కారణంగా కొంత మంది ఉద్యోగులు మళ్లీ తిరిగివచ్చేశారు. ఇక ఇప్పుడు మంత్రుల వంతు వచ్చింది. తాత్కాలిక సచివాలయంలో కార్యాలయాల తరలింపునకు నేడు చివరి ముహూర్తం కాగా ఈరోజు యనమల రామకృష్ణుడు ఆర్ధిక శాఖ కార్యాలయాన్ని కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు. అయితే మిగిలిన మంత్రులు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, గంటా శ్రీనివాస్, ప్రత్తిపాటి, కొల్లు రవీంద్రలు మాత్రం తమ గదులు చిన్నవిగా ఉన్నాయని, అందులో ఉండలేమని, అక్కడి నుంచి పనిచేయలేమని స్పష్టం చేశారు. వాటిని వెంటనే కూల్చి మరింత వెడల్పుగా నిర్మించాలని సూచించారు.. దీనికి స్పందించిన మునిసిపల్ మంత్రి పి.నారాయణ.. మంత్రుల ఫిర్యాదులు, అభిప్రాయాలు తీసుకున్నామని,  ప్రస్తుతం ఐదు చాంబర్లుగా ఉన్న ప్రాంతాన్ని మూడు చాంబర్లుగా మారుస్తామని చెప్పారు. కాని దీనికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. మరి దీనికి చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

జగన్ కు అక్కడ కూడా షాకులే..

  ఇప్పటికే పార్టీ వలసలతో అందరూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాకిస్తుంటే మరోపక్క ఢిల్లీ పర్యటనలో కూడా జగన్ కు షాకులు మీద షాకులు తగులుతున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అవ్వగా.. జగన్ ముందే ప్రణబ్ ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును పొగిడేశారట. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైసిపి నేతలతో చంద్రబాబు బాగానే పని చేస్తున్నారని రాష్ట్రపతి స్వయంగా అభిప్రాయపడ్డారట. అంతేకాదు ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలు జగన్‌కు షాకిచ్చారు. వీరిద్దరితో భేటీ కోసం జగన్ అపాయింటుమెంట్ అడిగారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. అసలు.. జగన్‌తో భేటీకి వారు నిరాకరించినట్లుగా కూడా చెబుతున్నారు.   ఇక ఆతరువాత  సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని జగన్ క‌లిశారు. ఈ సందర్బంగా ఆయన ప్రత్యేక హోదా గురించి ఆయనతో ప్రస్తావించారు. ప్రత్యేక హోదా సాధించే క్ర‌మంలో తాము వెన‌కాడ‌బోమ‌న్నారు. త‌మ‌ పోరాటాన్ని విడ‌వ‌బోమ‌న్నారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.

ఒలింపిక్స్‌లో కాల్పుల కలకలం

విశ్వక్రీడా వేదిక ఒలింపిక్స్‌‌‌లో కాల్పలు చోటు చేసుకున్నాయి. క్రీడా ప్రాంగణంలో జర్నలిస్టులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఒలింపిక్స్ కవరేజ్ కోసం వచ్చిన వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు బాస్కెట్‌బాల్ వేదిక నుంచి ప్రధాన వేదికకు బస్సులో వెళుతుండగా, మార్గం మధ్యలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఒలింపిక్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే అనుమానాస్పద బ్యాగ్ ఒకటి కలకలం సృష్టించింది. తాజాగా ఇప్పుడు కాల్పులు జరగడంతో ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు కలుగుతున్నాయి.

చంద్రబాబు ఇచ్చిన టైం అయిపోయింది..

కాపు రిజర్వేష్ల కోసం కాపు నేత ముద్రగడ పద్మనాభం గత కొద్దిరోజులుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మూడుసార్లు దీక్ష చేయడం.. ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పడం.. దీక్ష విరమించడం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఆయన ఉద్యమానికి తెర తీస్తున్నట్టు తెలుస్తోంది. కడప జిల్లాలోని మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన కాపుల రిజర్వేషన్ల అంశంలో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన గడువు ఈనెలాఖ‌రుకి పూర్తవుతుందని..  2014 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీల‌పై నిర్ల‌క్ష్యం వ‌హించొద్దని అన్నారు. అంతేకాదు అలాకాని పక్షంలో వ‌చ్చేనెల మొద‌టి వారంలో త‌మ‌ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక ఖ‌రారు చేస్తామ‌ని ముద్రగడ చెప్పారు.

మునికోటి కుటుంబానికి జనసేన 5లక్షల సాయం..

మునికోటి ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. తిరుపతికి చెందిన మునికోటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసందే. అయితే మునికోటి ప్రాణ త్యాగం చేసి ఏడాది అయిపోయింది. ఇప్పుడు మునికోటి కుటుంబానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ రూ.5లక్షల ఆర్థిక సాయం చేశారు. పవన్‌కళ్యాణ్‌ ప్రతినిధి మారిశెట్టి రాఘవయ్య.. మునికోటి భార్య దాక్షాయణి, తమ్ముడు మురళికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రత్యేక హోదా కోసం మునికోటి చేసిన ప్రాణత్యాగాన్ని రాఘవయ్య గుర్తుచేసుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.  

కాశ్మీర్ అల్లర్లపై మొదటిసారి నోరు విప్పిన మోడీ..

గత కొద్ది రోజులుగా కాశ్మీర్లో అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాది బుర్హాన్‌ ఎన్ కౌంటర్ నేపథ్యంలో కాశ్మీర్ లోని గయలో అల్లర్లు మొదలయ్యాయి. ఇక ఈ అల్లర్ల నేపథ్యంలో పలువురు పలు రకాల వ్యాఖ్యలే చేశారు. అయితే ఇన్ని రోజుల నుండి అల్లర్లు జరుగుతున్నా ఇప్పటివరకూ నోరు విప్పని ప్రధాని ఇప్పుడు మొదటి సారి తన పెదవి విప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అలిరాజ్‌పూర్ జిల్లాలో జ‌రిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన కాశ్మీర్ అల్లర్లపై మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ యువతను కొంతమంది కావాల‌నే తప్పుదోవ పట్టిస్తున్నారని.. పుస్త‌కాలు, ల్యాప్ టాప్‌లు, క్రికెట్ బ్యాట్లు ప‌ట్టాల్సిన వారి చేతుల‌కు రాళ్లు ఇస్తూ వారిని కొంద‌రు హింస‌కు పురిగొల్పుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కొంత‌మంది కార‌ణంగా ఆ రాష్ట్రంలో అశాంతి నెలకొంద‌ని అన్నారు. క‌ల్లోలం సృష్టించ‌డానికి ఎవ్వ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ప్ర‌భుత్వం వారి ప్ర‌య‌త్నాల‌ను తిప్పి కొడుతూ క‌శ్మీర్‌లో మామూలు ప‌రిస్థితులు తీసుకురావ‌డానికే ప్ర‌యత్నిస్తోంద‌ని మోదీ పేర్కొన్నారు.

మ‌ణిపూర్‌కి సీఎం అవుతా.. ఇరోమ్ షర్మిలా

  మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలా.. తాను 16 ఏళ్లుగా చేపట్టిన దీక్షను ముగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో ఆమె దీక్షకు తెరపడింది. అయితే దీక్ష విరమించే ముందు తాను  జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు హజర‌య్యి తనపై ఉన్న‌ కేసులన్నీ ఎత్తివేయాలని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. ఆమెను త‌ప్పు ఒప్పుకోవాల‌ని అప్పుడే త‌నపై కేసులు కొట్టివేస్తామ‌ని న్యాయ‌మూర్తి అన్నారు. దీనిపై తిరిగి ఈనెల 23న విచార‌ణ జ‌రుపుతామ‌ని చెప్పారు. అనంతరం ఆమె దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  తాను చేస్తోన్న డిమాండ్‌ను నెర‌వేర్చుకునే క్ర‌మంలోనే తాను రాజ‌కీయాల్లోకి రానున్నాన‌ని, మ‌ణిపూర్‌కి సీఎం అవుతాన‌ని పేర్కొన్నారు. కాగా ఆమె మణిపూర్ లోని సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించాలని గత 16 ఏళ్ల క్రితం నుండి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను 16 ఏళ్ల నుండి దీక్ష చేస్తున్నా కానీ.. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో.. ఆమె దీక్ష విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు.

నంది అవార్డుల స్థానంలో కొత్త పేరు..

  రాష్ట్ర విభజన జరిగిన తరువాత రెండు రాష్ట్రాలు దాదాపు అన్ని శాఖలను పంచేసుకన్నాయి. ఏదో ఒకటి రెండు పెండింగ్ లో ఉన్నా.. దాదాపు రెండు రాష్ట్రాలు..రాష్ట్ర ప్రత్యేకతలను తాము చూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అన్ని విషయాల్లో తమ కంటూ ఓ ప్రత్యేకత ఉండాలని చూస్తుంది. తమ రాష్ట్ర జంతువు, పక్షి, చెట్టు, చేప అంటూ అన్నింటికి పేర్లు పెట్టేసుకుంది. ఇప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ విషయంలో కూడా తెలంగాణ సర్కార్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. నంది అవార్డుల విషయంలో.. నంది అవార్డుల స్థానంలో త్వరలోనే కొత్త పేరును ప్రకటిస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తామని, అన్ని థియేటర్లలోనూ ఐదో ప్రదర్శనగా చిన్న సినిమాలకు అనుమతిస్తామని చెప్పిన తలసాని, 200 సీట్ల సామర్థ్యంతో మినీ థియేటర్లకు త్వరలోనే అనుమతిస్తామని తెలిపారు.

సొంత ఇంటికి నయీమ్ మృతదేహం..

  గ్యాంగ్‌స్టర్ నయీమ్ ను షాద్ నగర్లో పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి... అనంతరం అతడి డెడ్ బాడిని అతని కుటుంబసభ్యులకి అందజేశారు. నల్లగొండ జిల్లాలోని అతడి సొంతూరు నుంచి బంధువులు వచ్చి నయీమ్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని వారు పోలీసులను కోరారు. దీనికి పోలీసులు అంగీకరించడంతో నయీమ్ మేనకోడలు షాజిదాబేగం, బావ సలీం మరొకొందరు షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం నయీమ్ మృతదేహాన్ని భువనగిరికి తీసుకువెళ్లారు.  భువనగిరిలోనే ఓ దర్గాలోని శ్మశానవాటికలో మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   కాగా ఇప్పటికే నయీమ్ అనుచరులు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇంకా అతని భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పిల్లల్ని కస్తూరిభా ఆశ్రమానికి తరలించారు. అంతేకాదు నయీమ్ హత్యానంతరం.. అతని ఇంటిలో సోదాలు నిర్వహించారు. హైదరాబాదులోని అలకాపురి ఇంటిలో సోదా చేసిన పోలీసులకు భారీ ఎత్తున నగదు, స్థిరాస్తులకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.2.5 కోట్లకు పైగా.. 2 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ స్థిరాస్తుల పత్రాల విలువ రూ.2 వేల కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.

ఇప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే..

  పార్లమెంట్ ఉభయ సభల్లో కీలకమైన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ జీఎస్టీ బిల్లుపై మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం అత్యావశ్యకంగా మారిందని.. చట్టంగా మారబోయే జీఎస్టీ వల్ల.. అమ్మకం పన్ను ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతాయని, తద్వారా మౌలిక వసతులు లేని ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు క్షీణిస్తాయని చెప్పారు. నిరుద్యోగ సమస్య ఇంకా పెరిగిపోతుంది. అందుకే రాష్ట్రాన్ని బతికించాలంటే ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదని, ఆమేరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే..  ఏపీకి పెట్టుబడులు ధారాళంగా వస్తాయి.. పరిశ్రమలు పుట్టుకొస్తాయి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి' అని వైఎస్ జగన్ అన్నారు.

మోడీ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు..

  ఇటీవల కాలంలో ఉత్తరపదేశ్లో దళితులపై వరుస దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడులపై చర్చలతో పార్లమెంట్ సభలు కూడా అట్టుడికిపోయాయి. ఇప్పుడు ఈ దాడుల గురించి మాట్లాడుతూ బీఎస్పీ అధినేత మాయావతి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శల బాణాలు వదిలారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల దళితుల దాడులపై ప్రస్తావించగా.. దీనికి స్పందించిన మాయావతి.. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది.. ఈరెండు సంవత్సరాలు మోడీ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు.. ఇప్పుడు త్వరలో యూపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ద‌ళిత ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నారని అన్నారు. రాబోయే యూపీ ఎన్నిక‌ల్లో ఒక్క ద‌ళిత ఓటు కూడా రాద‌ని తెలిసే, మోదీ ఈ ప్ర‌య‌త్నాల‌కు దిగుతున్న‌రాని ఆమె ఎద్దేవ చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ఆత్మహత్య..!

  అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకన్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. కలిఖోపుల్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా  ఫిబ్రవరి నుంచి గత నెల దాకా పని చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే అయన ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయారు. ఆ తరువాత  సీఎం అధికార నివాసంలోనే ఆయన ఉంటున్నాడు. అయితే గత కొద్ది రోజుల క్రితమే.. మాజీ సీఎంలు ప్రభుత్వ అధికార నివాసాల్లో ఉండరాదని.. కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తన అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నేటి ఉదయం ఉరేసుకొని విగతజీవిగా కనిపించారు. తన సిబ్బంది గుర్తించే లోపే ఆయన మరణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత కొద్దిరోజులుగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నయీమ్ ఎన్ కౌంటర్...ఛానల్ రిపోర్టర్లు అరెస్ట్

  హైదరాబాద్ లోని షాద్ నగర్లో నిన్న పోలీసులు గ్యాంగ్ స్టర్ నయీమ్ ను ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నయీమ్ హత్యానంతరం అనేక కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పోలీసులు నయీమ్ కుటుంబసభ్యులను... అతని బంధువులను విచారిస్తున్నారు. అనేక అక్రమాస్తులను, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దీనిలో భాగంగానే మరో ముగ్గురు టెలివిజన్ ఛానల్ రిపోర్టర్లను అరెస్ట్ చేశారు. నయీమ్ కు అనుచరులుగా ఉంటూ, పలు మోసాల్లో భాగం పంచుకున్న వీరు..  రూ. 35 కోట్ల మేరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. నిన్న రాత్రి అరెస్ట్ చేసిన వీరిని ప్రస్తుతం విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.