గో సంరక్షకులకు ఐడీ కార్డులు..

  ప్రస్తుతం దేశంలో గోమాంసంపై జరగుతున్న దాడుల గురించి వింటూనే ఉన్నాం. ఆవులను చంపుతున్నారు అంట.. వాటి చర్మాన్ని ఒలుస్తున్నారు అంటూ చాలా చోట్ల దాడులు జరిగుతున్నాయి. మొన్నటి వరకూ ఉత్తరాధికే పరిమితమైన ఈ దాడులు కాస్త.. ఇప్పుడు దక్షిణాధికి కూడా చేరుకున్నాయి. అయితే ఇప్పుడు హర్యానాలో గో సంరక్షణా కమిషన్ తమ గో సంరక్షకులకు ఐడీ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. గోవుల రక్షణ కోసం రాష్ట్ర ఆవు సంరక్షణా కమిషన్ కొన్నేళ్ల క్రితమే ఏర్పడింది. ఆ రాష్ట్రంలో కూడా కొంత మంది గో సంరక్షకుల పేరుతో దందాలకు, దాడులకు దిగుతున్నారు. అంతేకాదు ఆవు పేరు చెప్పి తమ శత్రువులపై పగ తీర్చుకుంటున్నారు. దీనివల్ల ఐడీ కార్డులివ్వాలని కమిషన్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గో సంరక్షకుల గురించి పోలీసుల చేత ఎంక్వైరీ కూడా పూర్తి చేసింది. వారికి కార్డులు ఇష్యూ చేయడమే తరువాయి.

చెంచా గాడిద పాలు ఎంతో తెలుసా..?

గంగి గోవు పాలు గరిటడైనా చాలు.. కరము పాలు కడవనేలా అన్న సామెత వినే ఉంటాం.. అయితే ఇప్పుడు మాత్రం గాడిద పాలు చాలా మంచిదని.. వాటిని ఇంటింటికీ తిరిగి అమ్ముతున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కోలార్ కు చెందిన క్రిష్ణప్ప అనే వ్యక్తి తన గాడిద అయిన లక్ష్మీని వెంటపెట్టుకొని వీధి వీధి తిరుగుతూ గాడిద పాలు అమ్ముతున్నాడు. కానీ రేటు వింటే మాత్రం అవాక్కవ్వాల్సిందే. ఒక స్పూన్ రూ. 50 కి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే రేటు కూడా ఎవరూ పట్టించుకోకుండా పాలు కొని తమ పిల్లలకి తాగిస్తున్నారు. గాడిద పాలు ఆరోగ్యానికి చాలా మంచిదని.. ఆస్తమా, జలుబు, దగ్గు తగ్గుతాయని అంటున్నారు. ఇంకా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ లో పనిచేస్తున్న జయప్రకాష్ మాట్లాడుతూ గాడిద పాలు... మనిషి పాలలాగే ఉంటాయని.. యాంటీ బ్యాక్టిరియా గుణాలతో పాటూ రోగ నిరోధక శక్తిని కలిగిస్తుందని చెప్పారు. పూర్వం గ్రామాల్లో చంటి పిల్లలకు తల్లి పాలకు బదులు గాడిద పాలు పట్టేవారని తెలిపారు.

క్రికెట్ లెజెండ్ చనిపోలేదు.. బ్రతికే ఉన్నాడు..

  పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్, పాక్ లిటిల్ మాస్టర్‌గా పేరుగాంచిన హనిఫ్ మహ్మద్ చనిపోయారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించారని వార్తలు పొక్కడంతో అందరూ నిజమే అనుకున్నారు. అంతేకాదు తన కుమారుడు హనిఫ్ మహ్మద్ షోయబ్ మహ్మద్ కూడా తన తండ్రి మరణించినట్టు తెలిపారు. అయితే మళ్లీ అతనే తన తండ్రి బతికే ఉన్నార‌ని స్పష్టం చేశారు. తన తండ్రి బతికే ఉన్నప్ప‌టికీ వైద్యులు త‌న‌తో ఆయ‌న మృతి చెందిన‌ట్లు చెప్పారని.. అందుకే తాను కూడా పొర‌పాటు ప‌డి మీడియా ముందుకు వ‌చ్చి త‌న తండ్రి చనిపోయినట్లుగా ప్రకటించానని, కానీ హనిఫ్ మహ్మద్ ప్రాణాల‌తోనే ఉన్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు.  81 సంవత్సరాల హనీఫ్ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్ తో బాధపడుతున్నారు. కరాచీలోని అగాఖాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   కాగా టెక్నికల్, స్టైలిష్ బ్యాట్స్‌మన్‌గా పేరున్న హనీఫ్ మహ్మద్ 1958-59లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో లాంగెస్ట్ ఇన్నింగ్స్ ఆడి 337 పరుగులు చేసిన ఏకైక పాక్ క్రికెటర్‌గా పేరుగాంచారు. 43.98 యావరేజ్‌తో మొత్తం 3,915 పరుగులు చేశారు. ఆయన ఫస్ట్‌క్లాస్ హైయస్ట్ స్కోరు 499 పరుగులు. రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగలరు. తన కెరీర్‌లో మొత్తం 12 సెంచరీలు సాధించారు.

తెలంగాణ సర్కార్ సవరణలకు హైకోర్టు అసంతృప్తి..

తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. భూసేకరణ విషయంలో కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 123 చట్టాన్ని రద్దు చేసింది. 2013 చట్టం ద్వారానే భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసి మళ్లీ కోర్టు ముందు ఉంచింది. కానీ హైకోర్టు మాత్రం సర్కార్ చేసిన సవరణలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉమ్మడి కుటుంబంలోని వారికి ఎలా ఉపాధి కల్పిస్తారని.. బాధిత కుటుంబాలకు నెలకు రూ.2500 తాత్కాలిక పరిహారం ఇవ్వాలని చెప్పినా ఎందుకు ఇవ్వలేక పోతున్నారంటూ ప్రశ్నించింది. రైతులు, రైతు కూలీలకు సంబంధించి పరిహారం, ఉపాధి ఏ విధంగా కల్పిస్తారో పూర్తిస్థాయి నివేదికతో రావాలని పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ ఆదేశించింది.

దేవినేని నెహ్రూ ఇంట్లో లోకేశ్.. నెహ్రూ ఫిక్స్ అయినట్టేనా..!

  కృష్ణా జిల్లాలో రాజకీయ అతిరథులు దేవినేని నెహ్రూ పార్టీని వీడనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. కాంగ్రెస్ పార్టీని వీడీ ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న్టటు గత వారం రోజుల నుండి రాజకీయవర్గాల్లో ఒకటే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు దేవినేనితో చర్చలు జరిపారని కూడా సమాచారం. అయితే ఈ వార్తలపై స్పందించిన నెహ్రూ.. టీడీపీ నేతలు తనతో సంప్రదింపులు జరుపుతున్నది నిజమేనని.. కానీ తాను మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతానని పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. ఇక దీంతో ఆ ఊహాగానాలు తెరపడిందిలే అనుకున్నారు అంతా. అయితే ఇప్పుడు తాజాగా మరో విషయం బయటపడింది.   స్వయంగా దేవినేని ఇంట్లోనే టీడీపీ నేతలు అతనితో బేటీ అయ్యారు. టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఇంకా దేవినేని ఉమా, కేశినేని నాని ఈ భేటీలో పాల్గొన్నారు. దీంతో ఇప్పుడు ఈ వార్తలకు ఆజ్యం పోసినట్టైంది. దేవినేని నెహ్రూ, అతని తనయుడు అవినాష్ లు టీడీపీ ఎంట్రీ ఖాయమని తేలిపోయింది. రాజకీయ ఉద్దండుడు కావడంతో ఆయనను టీడీపీలోకి తీసుకురావడానికి నేతలందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఆయన కనుక పార్టీలోకి వస్తే జిల్లా అభివృద్దికి మరింత ప్రాభల్యం చేకూరుతుందని భావిస్తున్నారు. ఇక నెహ్రూ చేరికకు సీఎం చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులతో కలిసి నారా లోకేశ్ భేటీ నేపథ్యంలో ఇక టీడీపీ ఎంట్రీకి మూహూర్తం ఖరారు చేయడమే అంటున్నారు రాజకీయ పెద్దలు. మరి అన్నీ కుదిరితే ఈ పుష్కరాలు అయిపోయిన తరువాత నెహ్రూ టీడీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.   కాగా దేవినేని నెహ్రూ ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగు వెలిగారు. పార్టీ చీలిక పరిణామాల్లో ఎన్టీఆర్‌వైపు ఉన్న ఆయన తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు.

మీడియా ముందుకు ఉమా మాధవరెడ్డి.. నేను తప్పు చేస్తే జైలుకు వెళ్తా

  గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ సంచలనం సృష్టించిన సంగతి తెలసిందే. అయితే నయీం హత్యానంతరం.. పలువురు ప్రముఖుల పేర్లు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి తెరపైకి వచ్చారు. నయీం కేసుకు సిట్ బృందానికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఉమా మాధవరెడ్డిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో తనపై వస్తున్న ఆరోపణలకు స్పందించిన ఆమె ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.   మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె... మాధవరెడ్డికి ఉన్న పేరు చెడగొట్టేందుకు ప్రభుత్వం కక్ష కట్టింది.. మా కుటుంబానికి మచ్చ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. నా ఫోన్ నుండి వందల కాల్స్ వెళ్లాయని దుష్ర్పాచారం చేస్తున్నారు.. మాధవరెడ్డి ఉన్నప్పటినుండి ఒకటే ఫోన్ నెంబర్.. కాల్ డేటా ఉంటే బయటపెట్టాలి.. నేను తప్పు చేస్తే జైలుకు వెళ్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎంత సేవ చేశామో మాకు తెలుసు.. గ్యాంగ్ స్టర్ లను ప్రోత్సహించే పరిస్థితి మాకు లేదు.. నేరాలు చేయాల్సిన అవసరం మాకు లేదు.. కొందరిని తప్పించడానికే మాపై ఆరోపణలు.. ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ జరపాలి.. నాపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి అని అన్నారు.

కర్నూలు జిల్లాలో మావోల కలకలం...

  కర్నూలు జిల్లాలో మావోయిస్టుల కలకలం రేగింది. కర్నూలు జిల్లా అవుకు మండలం రామవరం వద్ద మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు గాలేరి పనుల్లో కూలీలుగా పనిచేస్తుండగా.. వీరిని పనిలోకి తీసుకున్న కాంట్రాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ, ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా ఎస్పీ కల్యాణ్‌ నేతృత్వంలో బుగ్గ వద్ద ఎల్‌అండ్‌టీ అతిథిగృహంలో అనుమానితులను విచారిస్తున్నారు. కాగా వీరు ఛత్తీస్‌గఢ్‌ కు చెందిన మావోలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

రేపే కృష్ణ పుష్కరాలు.. చంద్రబాబు ఆదేశాలు..

  రేపటి నుండి కృష్ణ పుష్కరాలు జరగనున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పుష్కర ఏర్పాట్లు అన్ని చేసింది. కృష్ణ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారు. కృష్ణ పుష్కరాల ఏర్పాట్లపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా పుష్కర విధులకు అధికారులంతా విధిగా హాజరుకావాలని చెప్పారు. ప్రజల సంతృప్తే ప్రజాప్రతినిధులు ప్రతిష్ఠగా భావించాలని, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది విధులు సమర్థంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఐవీఆర్‌ఎస్‌, మీడియాలో వచ్చే సమాచారంపై వెంటనే స్పందించాలని, ఎక్కడా విధి నిర్వహణ లోపం ఉండకూడదని అన్నారు. అలాగే టీటీడీ భోజన ఏర్పాట్ల ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని, రద్దీ కూడళ్ల దగ్గర ట్రాఫిక్‌ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, రవాణా, తాగునీరు, భోజనం, లైటింగ్‌, శానిటేషన్‌పై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలని చంద్రబాబు ఆదేశించారు.

సొంత పార్టీపైనే దుమ్మెత్తిపోసిన శశికళ..

అన్నాడీఎంకే ఎంపీ శశికళ పలు ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డీఎంకే పార్టీ ఎంపీ చెంప చెళ్లుమనిపించిన నేపథ్యంలో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేశారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అయిన జయలలిత. దీనికితోడు ఆమెపై మరో ఫిర్యాదు అందింది పోలీసులకు. ఆమె ఇంట్లో పనిచేసే అమ్మాయి.. శశికళ కుటుంబం వేధిస్తుందని చెప్పి ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు శశికళ తన సొంత పార్టీపైనే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'నేను నాడార్ కులానికి చెందిన దాన్ని. భయపడేది లేదు. ప్రజలు ఇదంతా చూస్తున్నారు. నాకు అండగా నా కులం నిలుస్తుంది. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లోని బలమైన కమ్యునిటీల్లో నాడార్ కులం ఒకట'ని పుష్ప అన్నారు. అన్నాడీఎంకే పార్టీ బానిసల గుంపు అని.. బానిసల గుంపులో భాగం కావాలనుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తనను వేధిస్తే నాడార్ సామాజిక వర్గం ప్రతిఘటిస్తుందని ఆమె హెచ్చరించారు.

గూగుల్ మేనేజర్ పై అత్యాచారం.. ఆపై చంపారు..

  గూగుల్ మేనేజర్ ను అత్యాచారం చేసి దారుణంగా చంపిన ఘటన న్యూయార్క్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. న్యూయార్క్ గూగుల్ కంపెనీలో వనెస్సా మార్కోటీ మేనేజర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆమె మసాచుసెట్స్‌లోని ప్రిన్‌స్టన్ నగరంలోని తల్లిని కలుసుకోవడానికి వెళ్లగా.. ఆమె కనిపించకుండా పోయారు. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు జాగిలాలను తీసుకొని వెళ్లి ఆ రోడ్డుపక్కనున్న పొదల్లో గాలించగా సగానికిపైగా కాలిపోయిన మృతదేహం వారికి దొరికింది. ఒంటిపై దుస్తులు లేని ఆమె చేతులపై, కాళ్లపై గాయాలు ఉండడంతో అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించి పోస్ట్ మార్టంకు పంపించారు. వచ్చిన నివేదికలో రేప్‌చేసి, హత్య చేసినట్లు తేలింది. అయితే అత్యాచారం ఎంత మంది జరిపారన్న విషయం తెలియలేదు.

సెల్ఫిస్టులకు బ్యాడ్ న్యూస్.. ఆ ఏడు రోజులు సెల్ఫీలు బంద్

  ఈ మధ్యకాలంలో సెల్ఫీలు తీసుకునే వాళ్ల పిచ్చి ఎక్కువైపోయింది. అలాంటి వాళ్లని ఓ వారం రోజుల పాటు సెల్పీలు దిగొద్దు అని చెబితే ఎలా ఉంటుంది. అయ్య బాబోయ్ అనుకుంటారేమో.. అయితే మొత్తానికే కాదులెండి. కేవలం జాతీయ స్మృతి చిహ్నాల ముందు సెల్పీ దిగకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12 నుంచి 18 వరకు ఏ ఒక్కరూ జాతీయ స్మృతి చిహ్నాల ముందు సెల్ఫీలు తీసుకోకుండా నిబంధనలు అమలుచేయాలని కేంద్ర పర్యాటక శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీకి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలీజెన్స్ నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఎర్రకోట చుట్టుపక్కల ఉన్న దాదాపు 3,140 చెట్ల వద్ద ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటుచేశారు.

దేవుడా... యువకుడిపై యువకుడు అత్యాచారం..

  సాధారణంగా ఆడవాళ్లపై మగవాళ్లు అత్యాచారం చేస్తుంటారు.. ఇలాంటి ఘటనలు చాలానే వింటుంటా. అయితే ఇక్కడ ఒక యువకుడు.. ఇంకో యువకుడిని అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల యువకుడికి, ఇండోర్ కు చెందిన మరో యువకుడితో ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే వాళ్లిద్దరూ ఒకరోజు కలుసుకొని.. ఆగ్రాలోని తాజ్ మహల్ ఇంకా అనేక ప్రదేశాలు తిరిగి.. ఒక హోటల్ లో బస చేశారు. ఇక ఇద్దరూ అక్కడ మద్యం సేవించారు. అయితే ఇండోర్ కు చెందిన వ్యక్తి.. ఆగ్రాకు చెందిన యువకుడి తాగే మందులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అతను స్పృహ కోల్పోయిన తరువాత.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు దానిని వీడియో తీసి సదరు వ్యక్తిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. లేకపోతే ఆన్ లెన్లో పెడతానని చెప్పాడు. దీంతో అతను జరిగిన విషయం మరో ఫ్రెండ్ కు చెప్పగా.. అతని సలహా మేరకు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టారు.

ఇరోమ్ షర్మీలా 16 ఏళ్ల దీక్షకు హెల్త్ సీక్రెట్ అదేనట..!

  మణిపూర్ ఉక్కు మహిళగా పేరు పొందిన ఇరోమ్ షర్మిలా సాయుధ బలగాల అధికారాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 ఏళ్లు నిరాహర దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె తన ఆమరణ దీక్షను విరమించిందనుకోండి. అయితే ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటంటే.. ఇన్ని సంవత్సరాలు దీక్ష చేపట్టిన ఆమె ఆరోగ్యంగా ఎలా ఉన్నారబ్బా అని అందరి డౌట్.. కేవలం ముక్కు ద్వారా పంపించిన  ఫుడ్ ద్వారానే ఇన్ని సంవత్సరాలు ఉన్నారా అని అందరి సందేహాం.   ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉండటానికి గల కారణాలు ఎంటో చెబుతున్నారు ఆమె బంధువులు. ఇన్ని సంవత్సరాలు దీక్ష చేస్తూ.. ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకోవడానికి ఆమె సంకల్పం.. దానికి తోడు యోగా.. నిత్యం యోగాభ్యాసనాలే కారణమట. ఆమె దీక్ష పూనుకోవడానికి రెండు సంవత్సరాలు ముందు నుండి ఆమె యోగాభ్యాసం నేర్చుకుందట. ఆమె సోదరుడు ఇరోమ్ సింగజిత్ చెబుతూ.. షర్మిల స్వతహాగా ప్రకృతి ప్రేమికులురాలు..పంతొమ్మిదేళ్ల వయసులో 'నేచర్ క్యూర్' సబ్జెక్టు చదివించింది. అందులోనే యోగా ఒక భాగం. అదే ఆమెను ముందుకు నడిపించిందని.. 'దృఢ సంక్పల్పం, యోగాలే ఆమెను శారీరంగా దృఢంగా ఉండేలా చేశాయని అన్నారు. అంతేకాదు వైద్యులు కూడా అదే చెబుతున్నారు. ఆమె యోగాతోపాటు క్రమంతప్పకుండా నడక కొనసాగించడమే ఆమె హెల్త్ సీక్రెట్ అని వైద్యులు చెబుతున్నారు. వాటితో పాటు ఆమెను ఆస్పత్రిలో చేర్పించినప్పటినుండి.. ముక్కుద్వారా...ఉడికించిన అన్నం.. పప్పు, కూరగాయలు ద్రవంలా చేసి ఎక్కిస్తున్నారు.   కాగా ఆమె దీక్ష విరమించుకొని రాజకీయాల్లో ఆరంగేట్రం చేయనున్నారు. తాను చేస్తోన్న డిమాండ్‌ను నెర‌వేర్చుకునే క్ర‌మంలోనే తాను రాజ‌కీయాల్లోకి రానున్నాన‌ని, మ‌ణిపూర్‌కి సీఎం అవుతాన‌ని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా.. తిండి తినకుండా ఒక రెండు రోజులు ఉండాలంటేనే కష్టం.. అలాంటిది పదహారు సంవత్సరాలు ఆమె దీక్ష చేసిందంటే నిజంగా అభినందిచాల్సిన విషయం. అందుకే ఆమె ఉక్కు మహిళగా పేరు పొందింది.