రాక్‌స్టార్‌గా మారిన మంత్రి రావెల

70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణాపురంలో జరిగిన వేడుకల్లో ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనలోని కళాకారుడు బయటకొచ్చాడు. వేడుకల్లో పాల్గొనడానికి గురుకుల పాఠశాలకు వచ్చిన రావెల, అక్కడ ఏర్పాటు చేసిన అర్కెస్ట్రాలో కిశోర్ బాబు రాక్‌స్టార్ అవతారమెత్తాడు. అర్కెస్ట్రా బృందంలోని గిటార్‌ను తీసుకున్న ఆయన, దాన్ని వాయిస్తూ ప్రజలను అలరించడమే కాకుండా, విద్యార్థులతో కలిసి స్టెప్పులేసి అదరగొట్టారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, పాఠశాలల్లో ఈ తరహా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతాయని రావెల చెప్పారు.

జెండా వందనం చేసి కుప్పకూలిన మంత్రి

70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహానీయులను స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శివమొగ్గలోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి కాగోడు తిమ్మప్ప పాల్గొన్నారు. జెండా వందనం చేసి ప్రసంగిస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో సిబ్బంది ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఎర్రకోటలో మోడీ స్పీచ్..జోలపాటా..?

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జెండా ఎగురవేసి ప్రధాని ఇచ్చే ప్రసంగం కోసం యావత్ దేశం టీవీలకు అతుక్కుపోతుంది. జీవితంలో ఒక్కసారైనా ఎర్రకోట వద్ద వేడుకల్లో పాల్గొవాలని అనుకుంటారు. అలాంటిది ప్రధాని మాట్లాడుతుంటే..ఎర్రకోట వద్ద గ్యాలరీల్లో కూర్చొన్న వారు నిద్రపోతే..ఆ నిద్రపోయిన వారు కూడా సామాన్యులు కాదు. జాతిని నడిపే నిర్దేశకులు. కునుకుపాట్లు పడుతూ కేంద్రమంత్రులు కెమెరా కంటికి చిక్కారు. అరుణ్‌జైట్లీ, మనోహర్ పారికర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇలా పార్టీలకతీతంగా ధ్యానముద్రలోకి దిగారు. మోడీ ప్రసంగాన్ని ఈ చెవి నుంచి ఆ చెవిలోకి వదిలేసి నిద్రలోకి జారుకున్నారు. 

పుష్కరాల్లోనూ "ప్రత్యేక" హోరు..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే అంశం ఇటీవల రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. హోదాపై పార్లమెంట్ వేదికగా ఏపీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో పుష్కరాలు వచ్చాయి. రాష్ట్రమంతా ఆధ్మాత్మిక శోభతో కళకళలాడుతుండటంతో హోదా వ్యవహారం కాస్త సైలెంట్ అయ్యిందనుకున్నారు. కాని విజయవాడలోని పుష్కర ఘాట్‌లో కొందరు యువకులు హోదా నినాదాలతో హోరెత్తించారు. భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలు చేతపట్టుకుని నదిలోకి దిగిన యువకులు ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినాదాలు చేస్తూ పుష్కర స్నానమాచరించారు.

బాలారిష్టాలు ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నాం-కేసీఆర్

70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడం ఇది మూడోసారని..బాలారిష్టాలు ఒక్కొక్కటిగా అధిగమిస్తూ...స్థిర పాలన అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం లుంబినీ పార్కులో అమరవీరుల స్థూపాన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ఆకర్షించాయని..రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోడీ ప్రశంసించడం మనలో స్పూర్తి నింపిందన్నారు. సమాఖ్య స్పూర్తితో కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలతో సత్ఫలితాలు పొందుతున్నామన్నారు. దసరా కానుకగా కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోందని, ఆ రోజు నుంచే కొత్త జిల్లాలు పని చేస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. 

ప్రపంచంలోనే ఏపీ నెంబర్‌వన్ కావాలి-చంద్రబాబు

70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా జరుగుతున్నాయి. అనంతరపురంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ..ఎందరో త్యాగమూర్తుల ప్రాణత్యాగాల వల్లే స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. రాయలసీమలో పుట్టిన ఎందరో మహనీయులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారని వారందరినీ తెలుగుజాతి ఎన్నటికీ మర్చిపోదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకలను అనంతపురంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు.   తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తే..తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, చివరకు కుట్రలు, కుతంత్రాలతో తెలుగుజాతిని విడదీసిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం అన్యాయంగా, అక్రమంగా, అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించి కట్టుబట్టలతో రోడ్డున పడేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా...నిధుల లోటు ఉన్నా రాష్ట్రాన్ని అభివద్ధి దిశగా నడిపిస్తున్నామన్నారు. 2022 నాటికి ఏపీ మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి నంబర్ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రరాష్ట్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకురావాలి-మోడీ

70వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 125 కోట్ల భారతీయులకు నా శుభాకాంక్షలు అని తెలిపారు. మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం వెనుక లక్షలాది మహానుభావుల త్యాగఫలం ఉందని గుర్తు చేశారు.   కృష్ణుడి నుంచి గాంధీ వరకు, భీముడి నుంచి అంబేద్కర్ వరకు భారతదేశానికి సనాతన చరిత్ర ఉందని ప్రధాని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు మనమంతా సంకల్పించుకోవాలన్నారు. స్వరాజ్యం ఏర్పడాలంటే త్యాగాలు తప్పనిసరని..అది మన నిరంతర సంకల్పం కావాలని ప్రధాని స్పష్టం చేశారు. సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకురావడమే సురాజ్యమని పేర్కొన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆరోగ్య, పౌర సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత జోడించాలని మోడీ పిలుపునిచ్చారు.

పాక్ స్వాతంత్ర దినోత్సవం గిఫ్ట్..ఇండియాపై కాల్పులు

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇండియాకు గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ అంటే ఏమిటో అనుకునేరూ..పాక్ సైన్యానికి తిక్క అని అందరికి తెలిసిందే కదా. దీనిలో భాగంగా పాక్ మొత్తం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్‌లో మునిగిపోయుంటే ఆ దేశపు సైన్యం ఇండో-పాక్ సరిహద్దులోని పలు ప్రాంతాలపై పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. పూంచ్ సెక్టార్‌లోని భారత సైనిక పోస్ట్‌లపై మిషన్ గన్స్, మోటార్ రాకెట్లతో దాడికి తెగబడింది. అయితే భారత సైన్యం అందుకు దీటుగా స్పందించి కాల్పులను తిప్పి కొట్టింది. ఈ ఘటన జరిగిన తర్వాత అదే ప్రాంతంలోని ప్రఖ్యాత బుద్థ అమర్‌నాథ్ దేవాలయానికి వెళుతున్న యాత్రికులపై ముగ్గురు ముష్కరులు గ్రేనేడ్లు విసిరారు. ఈ ఘటనలో 11 మంది యాత్రికులు గాయపడ్డారు. వారందరినీ జమ్మూలోని ఆసుపత్రికి తరలించారు.

ఏ సమస్య ఉన్నా..నేనున్నా

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణాపుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పుష్కరాలు ప్రారంభంకావడానికి ముందు ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటూనే అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాజాగా పుష్కరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా తన ట్విట్టర్ ఖాతాకు సమస్యల గురించి ఫిర్యాదు చేస్తే, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుంచి వచ్చిన వెంకట్రావు అనే కానిస్టేబుల్ మరణాన్ని గురించి ప్రస్తావించారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

డిశ్చార్జ్‌ అయిన అధినేత్రి..

అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. రానున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తోన్న వారణాసి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. అయితే భుజం నొప్పి, వైరల్ ఫీవర్ కారణంగా ర్యాలీని మధ్యలోనే నిలిపివేసి ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు మొదట సఫ్దర్‌జంగ్ ఆర్మీ ఆసుపత్రిలోనూ..అనంతరం సర్ గంగారాం ఆసుపత్రిలోనూ సోనియా చేరారు. వైద్యులు ఆమె ఎడమ భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో అప్పటి నుంచి సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  సుమారు 11 రోజుల తర్వాత 10 జన్‌పథ్‌లోని ఇంటికి చేరుకున్నారు. సోనియా పూర్తిగా కోలుకున్నారని అందుకే ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు సర్ గంగారాం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఆలయంలో ఆయువు తీసుకున్నారు

కర్నూలు జిల్లా నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. పట్టణంలోని బర్మాశాల వీధికి చెందిన రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఇవాళ ఉదయం ప్రథమనంది ఆలయ సమీపంలోకి వెళ్లారు. అక్కడ రాంప్రసాద్, అతని భార్య సత్యవతి, కుమారుడు విజయకుమార్, కుమార్తె శోభారాణి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మిగతా భక్తులు విషయం గమనించి వెంటనే 108 కి ఫోన్ చేయడంతో వారు హుటాహుటిన ఆలయానికి వచ్చారు. అయితే వారు వచ్చేలోగానే రాంప్రసాద్, విజయ‌కుమార్ మరణించారు. కొన వూపిరితో ఉన్న భార్య, కూతురులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

బెజవాడలో జవదేకర్ పుష్కర స్నానం..చంద్రబాబు సూపర్

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విజయవాడలో పుష్కర స్నానం ఆచరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానించడంతో ఆయన ఆహ్వానాన్ని మన్నించి జవదేకర్ విజయవాడ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ఆయనకు మంత్రులు గంటా శ్రీనివాస్, నారాయణ, ఎంపీ సీఎం రమేశ్‌తో పాటు పలువరు టీడీపీ, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికి ఆయనతో పాటు పుష్కర స్నానం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పుష్కరాల కోసం చాలా కష్టపడ్డారని..ఆ కష్టమంతా ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తోన్న ఆనందంతో తెలుస్తోందన్నారు. అనంతరం ఆయన ఇంద్రకీలాద్రిపై కనకదుర్గను దర్శించుకున్నారు.

టీడీపీలో చేరను-రోజా

పార్టీ మారుతున్న వార్తలను ఖండించారు సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఇవాళ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ మార్పుపై విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా..తాను టీడీపీలో తిరిగి చేరుతానని వస్తున్న వార్తలు అవాస్తవమని..కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని రోజా విమర్శించారు. తాను ఎప్పటికి జగన్ బాటలోనే నడుస్తానని వైసీపీని వీడనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా మరింత మంది టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వారిలో రోజా కూడా ఉన్నారని ప్రచారం జరుగుతుండటంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మోడీ హామీలు నెరవేరినట్టా..?

  మోడీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది. ఈ రెండు సంవత్సరాలలో ఆయన ఎన్నో హామీలు ఇచ్చుంటారు. అయితే ఆయన ఇచ్చిన హామీల్లో ఆయన కొన్ని నెరవేర్చినా.. కొన్ని మాత్రం పెండింగ్లో ఉన్నాయి. ఆ వివరాలేంటో ఓసారి చుద్దాం.. * ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన పథకం. దీని ద్వారా దాదాపు 228 మిలియన్ల మంది ఖాతాలు తెరిచారు. అయితే అందులో 24శాతం ఖాతాల్లో డబ్బు లేదు. పేదల కోసం 'జీరో బ్యాలెన్స్‌' ఖాతాలు తెరిపించారు. వీటిలో డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. * స్వచ్ఛ విద్యాలయ అభియాన్‌ పథకం.. సంవత్సరంలోగా అన్ని పాఠశాలల్లో బాల బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలనే సంకల్పంతో ఈ పథకం ప్రవేశపెట్టారు. దీని కింద ఇంకా 4.25లక్షల టాయిలెట్లు నిర్మించాల్సి ఉంది. * ఆర్థికంగా స్థిరంగా ఉన్న వారిని ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీ తీసుకోవద్దని మోదీ కోరారు. ఈ మేరకు దాదాపు 20 లక్షల మంది సబ్సిడీ వదులుకున్నారు. దీంతో దాదాపు లక్షా 76వేల మంది పేద మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చారు. * గ్రామాల విద్యుదీకరణ: 98.1శాతం గ్రామాల్లో విద్యుదీకరణ అయ్యిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా 9,895 గ్రామాలను విద్యుదీకరించాల్సి ఉంది. * సామాజిక భద్రత: ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాలలో 127 మిలియన్ల మంది నమోదు చేసుకున్నారు. * గ్రామీణ భారతానికి సంబంధించి వ్యవసాయ బడ్జెట్‌ 44శాతం పెరిగింది. పలు గ్రామీణాభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. * మాజీ సైనికోద్యోగుల కోసం ఒకే ర్యాంకు.. ఒకే పింఛను పథకం ప్రవేశపెట్టారు. కానీ ఈ పథకంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో దీనిపై సైనికోద్యోగులతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రణబ్ కూతురికి కూడా లైగింక వేధింపులు..

  ఆడవాళ్లకు లైంగిక వేధింపులు సర్వసాధారణమే. అయితే ఈ వేధింపులకు అధికారుల కూతుళ్లు ఏం మినహాయింపు కాదు అని రుజువైంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ రాజకీయ నేత కూతురు కూడా లైగింక వేధింపులకు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. ఇంతకీ ఆమె ఎవరు... ఆ ప్రముఖ రాజకీయ వేత్త ఎవరనుకుంటున్నారా..? భారత ప్రధమ పౌరుడు..రాష్ట్రపతి.. ప్రణబ్ ముఖర్జీ.. ఆయన కూతురు షర్మిష్ట ముఖర్జీ. పార్థమండల్ అనే వ్యక్తి ఆన్ లైన్ లో తనను పలుమార్లు లైంగికంగా వేధిస్తూ మెస్సేజ్ లు పెట్టాడని.. అతను పోస్ట్ చేసిన అసభ్య మెస్సేజ్ లను స్క్రీన్ షాట్లు తీసి తన ఫేస్ బుక్ ఖాతాలో ఆమె పోస్ట్ చేశారు. అంతేకాదు.. మొదట్లో అకౌంట్ బ్లాక్ చేశా.. కానీ ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండకూడదని.. అందుకే అందుకే, అతను ప్రొఫైల్, అతను పంపిన మెస్సేజ్ లను స్క్రీన్ షాట్లు తీసి పోస్ట్ చేస్తున్నానని, ఇటువంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదని షర్మిష్ట పేర్కొన్నారు. మొత్తానికి సామాన్యులకే కాదు ఇలాంటి వారికి కూడా వేధింపులు వస్తున్నాయంటే అశ్యర్యకరమైన విషయమే.

ఏ డీజీపీకి నయీంతో సంబంధం లేదు..

  నయీం కేసులో రోజుకో పేరు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు 15 మంది డీజీపీలతో లింక్ అప్స్ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ డీజీపీ దినేష్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీనిలో భాగంగానే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఏ డీజీపీ స్థాయి అధికారితో నయీంకు సంబంధాలు లేవు.. నేను డీజీపీ కాకముందు నుండి దుష్ర్పచారం చేస్తున్నారు అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను ఇన్ ఫార్మర్ గా వాడుకోవడం సహజం..కానీ డీజీపీ స్థాయి అధికారికి ఇన్ ఫార్మర్ తో సంబంధం ఉండదని వ్యాఖ్యానించారు. నయీంను స్వలాభం కోసం వాడుకున్న వారిని శిక్షించాలి.. సిట్ కు ఏ అధికారినైనా విచారించే అధికారం ఉందని తెలిపారు.. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి అని అన్నారు. ఇంకా నయీంను అంతమొందించడం మంచిదే..తెలంగాణ సీఎం కేసీఆర్ కు సెల్యూట్ అన్నారు.