సీఎం కు బాలిక రక్తంతో లేఖ.. నా తల్లిని సజీవదహనం చేశారు
తన తల్లిని చంపిన హంతకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ బాలికి సీఎం అఖిలేష్ యాదవ్ కు లేఖ రాసింది. అది కూడా తన రక్తంతో. ఈ ఘటన యూపీలో జరిగింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లో బులంద్ షహర్ పట్టణానికి చెందిన ఒక వివాహితకు ఇద్దరు కుమార్తెలు. అయితే ఆమెకు మగసంతానం పుట్టలేదని చెప్పి హత్య చేశారు. ఈ విషయాన్ని ఆ బాలిక లేఖ ద్వారా సీఎంకు తెలియజేసింది. మగ సంతానానికి జన్మ నివ్వలేదనే కారణంగా తన తల్లిని తన తండ్రి మనోజ్ బన్సాల్, ఇతర కుటుంబసభ్యులు తమ కళ్లెదుటే సజీవదహనం చేశారని, తనను, తన చెల్లిని ఒక గదిలో బంధించి తమ తల్లికి నిప్పంటించారని పేర్కొంది.
తనను, తన చెల్లిని కూడా చంపేస్తామని వారు బెదిరిస్తున్నారని, ఈ విషయమై పోలీసులు తమకు ఎటువంటి సాయం చేయకపోగా, నిందితులకు వారు రక్షణగా నిలుస్తున్నారని ఆ లేఖలో పేర్కొంది. కాగా, ఈ జులైలో ఈ విషయమై సీఎం అఖిలేష్ కు ఈ బాలిక ఒక లేఖ రాసింది. అయితే, దీనిపై సీఎం స్పందించకపోవడంతో, తాజాగా మరోమారు ఈ లేఖను తన రక్తంతో రాసింది. ఈవిధంగా చేస్తే సీఎం స్పందిస్తారనే ఇలా లేఖ రాశానని ఆ బాలిక పేర్కొంది.