డీఎంకే ఎమ్మెల్యేలు అందరిపై ఎఫ్ఐఆర్..

  తమిళనాడులోకి డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరిపై పోలీసులు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల ప్రకారం.. తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత డీఎంకే పార్టీ నేత, కరుణానిధి తనయుడు స్టాలిన్ ను విమర్శించిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరిని వారంరోజులపాటు సస్పెండ్ చేశారు. దీనిలో భాగంగానే డీఎంకే పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జయలలిత ప్రభుత్వాన్ని, అసెంబ్లీలో అన్నాడీఎంకే పార్టీ వైఖరిని విమర్శిస్తూ, భారీ ఎత్తున కార్యకర్తలతో సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు. అయితే ధర్నాకు అనుమతి లేదని.. ఎమ్మెల్యేలను అందరినీ అరెస్ట్ చేస్తున్నామని స్పష్టం చేసిన పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వెంటనే స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా స్టాలిన్ సహా 60 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఈ పరిస్థితుల్లో తమిళనాట అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు.

వివాహ వేడుకలో మారణహోమం.. 30 మంది మృతి

ప్రపంచ దేశాల్ని తమ దాడులతో వణికిస్తున్న ఉగ్రవాదులు మరోసారి టర్కీపై తమ పంజా విసిరారు. ఇప్పటికే రెండు సార్లు టర్కీపై దాడి జరిపిన ఉగ్రవాదులు.. ఇప్పుడు మరోసారి దాడి జరిపి మారణహోమం సృష్టించారు. ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి..30  ప్రాణాలు బలిగొన్నాడు. వివరాల ప్రకారం.. సిరియా సరిహద్దు ప్రాంతంలోని టర్కిష్‌ పట్టణంలో ఉన్న గజియాన్‌టెప్‌లో ఓ వివాహ వేడుక జరుగుతుండగా ..ఓ ఉగ్రవాది బాంబులు అమర్చుకుని వివాహ వేడుకకు వచ్చి తనకుతాను పేల్చుకుని  ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఈ ఘటనలో 30 మంది అక్కడి మరణించగా మరో 90 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. టర్కీ సరిహద్దు ప్రాంతాలను మూసివేసిన అధికారులు, హై అలర్ట్‌ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఐసిస్‌కు అనుంబంధంగా ఉన్న కుర్దిష్‌ మిలిటెంట్లు దాడికి పాల్పడినట్లు గుర్తించారు.

ట్వీట్ల వల్ల తిట్లు తింటున్న కాంగ్రెస్..

ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సరిగా ట్వీట్స్ చేయడం కూడా రావడం లేదనిపిస్తోంది. ఆవేశంతో ట్వీట్స్ చేసి పలువురి ఆగ్రహానికి గురవుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ 'పాక్ ఆక్రమిత కాశ్మీర్' అని అభివర్ణించడానికి బదులు.. 'భారత్ ఆక్రమిత కాశ్మీర్' అని అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఇంకేముంది దానిపై ఒకటే విమర్శలు.. పెద్ద దుమారమే రేగింది. ఇక ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ తప్పులో కాలేసింది. తాజాగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా వివాదాస్పద ట్వీట్ చేసింది. అదేంటంటే ఇందిరా గాందీ మరణానంతరం.. రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలు..   'ఓ మహావృక్షం కూలినప్పుడు నేల సహజంగానే అదురుతుంది' అంటూ రాజీవ్ అప్పట్లో పేర్కొన్నారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేతిలో హత్యకు గురవ్వగా.. ఆ వెంటనే పెద్ద ఎత్తున సిక్కులపై అలర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2,700 మంది సిక్కులు చనిపోయారు.     అయితే ఇప్పుడు రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా బెంగాల్ పీసీసీ ఈ వ్యాఖ్యలను ట్వీట్ చేసింది. ఇక దీంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిక్కులపై జరిగిన అమానుష గాయాలను మళ్లీ గుర్తుచేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యను పెట్టిందా? అంటూ వారు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెలిసి చేసినా.. తెలియక చేసినా ప్రాబ్లమ్స్ మాత్రం కొనితెచ్చుకుంటున్నాయి..

ప్రత్యేకహోదాపై పవన్ కళ్యాణ్.. నా ఒక్కడివల్ల ఏమవుతుంది..

టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తాము స్నేహపూర్వకంగానే కలిశామని తెలిపారు. ఇంకా ప్రత్యేక హోదా గురించి తనను అడిగినప్పుడు ఆయన చాలా ఆచితూచి మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా అనేది చాలా సున్నితమైన అంశమని.. ప్రత్యేక హోదాపై తొందరపడి మాట్లాడను.. కేంద్రంతో వైరం నాకు ఇష్టం లేదు.. రాజ్యాంగ పరంగా ఇచ్చిన హామీ నెరవేరాల్చిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. అంతేకాదు ఎంపీలతోనే కానిది నా ఒక్కడివల్ల ఏమవుతుంది.. కాంగ్రెస్, బీజేపీ కలిసి పార్లమెంట్లో హామీ ఇచ్చారు.. దానిని నెరవేరాల్చిన బాధ్యత వారిదే అని వ్యాఖ్యానించారు.

కోట్లు పలికిన మోదీ కోటు... గిన్నిస్ కి ఎక్కింది!

  గుర్తుందా.... ఆ మధ్య రాహుల్ గాంధీ మోదీని సూట్, బూట్ ప్రధాని అని వెటకారంగా అన్నాడు! ఇప్పుడు ఆ మాట మోదీకి సగర్వంగా సూట్ అయిపోయింది! రాహుల్ గాంధీ ఉద్ధేశ్యం ఏదైనా మోదీ సూటు మాత్రం ఇప్పుడు గిన్నిస్ కి ఎక్కింది. ఆయన ప్రత్యేకతల్లో మరొకటిగా చేరిపోయింది! గిన్నిస్ రికార్డ్ సృష్టించిన మోదీ సూటు ఆ మధ్య ఒబామా భారత్ కి వచ్చినప్పుడు ఆయన వేసుకున్నది. దానిపై మోదీ పేరు బంగారుపోగులతో వుండటంతో విపక్షాలు నానా యాగీ చేశాయి. కాని, ఎప్పటిలాగే మోదీకి తన చుట్టూ ముసురుకున్న ఈ వివాదం ప్లస్ పాయింట్ గా మారింది. మోదీ ఖరీదైన సూటు గంగా నది శుద్ది కోసం ఫిబ్రవరీలో వేలం వేశారు. అప్పుడు రికార్డు స్థాయిలో 4.31కోట్లు ధర పలికింది. అంతే కాదు, తాజాగా ఈ సూటు వేలం గిన్నిస్ కి ఎక్కింది. ప్రపంచంలో ఇంతకు ముందెప్పుడూ ఒక సూటు ఇంత ధరకి అమ్ముడుపోలేదట! అలా వాల్డ్స్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సూటుగా చరిత్ర సృష్టించింది మోదీ సూటు!

మళ్లీ లేచిన సుబ్రహ్మణ్యస్వామి... ఈసారి కూడా రాజనే టార్గెట్

  బీజేపీ సీనియర్ నేత.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట అయిన సుబ్రహ్మణ్యస్వామి గత కొన్ని రోజులుగా ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. అయితే సుబ్రహ్మణ్యం లాంటి వాళ్లు ఎక్కువ రోజులు అలా ఉండటం కష్టమే. అందుకే మరోసారి ఆయన తన నోటికి పనిచెప్పారు. అయితే ఈసారి కూడా రఘురాం రాజన్ నే ఆయన టార్గెట్ చేశారు. గతంలో రఘురాం రాజన్ పై విమర్శలు గుప్పించిన సుబ్రహ్మణ్యస్వామిపై మరోసారి మండిపడ్డారు.  దేశంలో త‌లెత్తిన రుణాత్మ‌క‌ ద్రవ్యోల్బణ పరిస్థితులకు రఘురాం రాజనే కార‌ణ‌మ‌ని.. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించిన వర్కింగ్ పేపర్‌ను ఆయన కోట్ చేస్తూ.. రాజన్ చేప‌ట్టిన‌ వడ్డీ రేట్ల విధానమే ద్రవ్యోల్బణానికి కార‌ణ‌మ‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తోరో చూడాలి.

భారత్ లో పాక్ ఏజెంట్ అరెస్ట్..

  మరోసారి భారత ప్రత్యర్ధి దేశమైన పాకిస్థాన్ కపటబుద్ధి బయటపడింది. భారత్ పై దాడి చేయడానికి ఎప్పుడూ కుట్రలు పన్నే పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఈసారి కూడా కుట్రలో భాగంగా ఓ ఏజెంటును భారత్ కు పంపింది. అయితే పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. పాకిస్థాన్ కు చెందిన నంద్ లాల్ మేఘ్ వాల్ అనే ఐఎస్ఐ ఏజెంట్ రాజస్థాన్ లోని జైసల్మేర్ లోని బస చేస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితమే పక్కా వీసాతో భారత్ లో అడుగుపెట్టిన అతను ఆ తరువాత కనిపించకుండా పోయాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నంద్ లాల్ మేఘ్ వాల్ ను జైసల్మేర్ లోని ఓ హోటల్ లో అరెస్ట్ చేశారు. అతని నుండి భారత రక్షణ స్థావరాలకు చెందిన ఫొటోలు, సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతడిని జయపురకు తరలించారు.

పవన్ కళ్యాణ్ తో మాజీ సీఎం భేటీ..

  కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈసందర్భంగా ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తనతో కుమారస్వామి భేటీ స్నేహపూర్వకమైనదేనని.. కృష్ణా పుష్కరాలకు హాజరు కావాలంటూ ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం అందిందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించాలని మీడియా ప్రశ్నించగా, అందుకు పవన్ కల్యాణ్ తిరస్కరించారు. ఆ విషయంపై తర్వాత స్పందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా కుమారస్వామి మాట్లాడుతూ.... మా భేటీకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని.. మాకుమారుడు సినిమాల్లోకి వస్తున్నందుకు పవన్ కళ్యాణ్ ఆశీస్సుల కోసం వచ్చామని తెలిపారు.

నన్ను అలా పిలవండి.. కానీ పాకిస్థానీ అనొద్దు..

నన్ను కుక్క అని అయినా పిలవండి కానీ... పాకిస్థానీ అని అనొద్దు అని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా..? వివరాల ప్రకారం.. 25 ఏళ్ల బలూచిస్థాన్ శరణార్ధి మ‌జ్ద‌క్‌ తన భార్యతో కలిసి న్యూఢిల్లీకి వచ్చాడు. ఈ నేపథ్యంలో తన పాస్ పోర్టును చూసిన అధికారులు తన జన్మస్థలం పాకిస్థాన్ లోని క్వెట్టా అని ఉండటంతో ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. ఇక ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన మజ్దక్.. త‌న‌ను కుక్క అని అయినా పిలువండి కానీ పాకిస్థానీ అని అనొద్ద‌ని అధికారులతో అన్న‌ట్లు తెలిపాడు. తాను బలూచ్ వాసినని తాను అక్క‌డ పుట్టినందుకు ఎన్నో వేధింపులకు గుర‌యిన‌ట్లు తెలిపాడు. బలూచిస్థాన్ కు చెందిన వేలమంది ప్రజలు విదేశాల‌కు త‌ర‌లివెళ్లారు. బ‌లూచిస్థాన్ వాసుల‌ని పాకిస్థాన్‌ ఆర్మీ వేధింపుల‌కి గురిచేస్తోందని.. తన తండ్రిని కూడా అపహరించి చంపేసిందని.. తల్లిని కూడా ఎన్నోర‌కాలుగా హింసించిందని తెలిపాడు. అంతేకాదు బలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో జ‌రుగుతోన్న ఘోరాల‌పై మాట్లాడినందుకు ఆయ‌న ప్రధాని నరేంద్రమోదీకి ధ‌న్యవాదాలు తెలిపాడు.

16 ఏళ్ల తరువాత తల్లిని కలిసిన ఇరోం షర్మిల..

  మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల సాయుధ బలగాల ప్రత్యేక అధికారాలు తొలగించాలని 16 ఏళ్లుగా దీక్ష చేసిన సంగతి తెలిసిందే. కానీ తాను చేసే దీక్షకు ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక తాను దీక్ష చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి దీక్షను విరమించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆమె దీక్ష ప్రారంభించి 16 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ ఆమె తన తల్లిని కలుసుకోలేదు. షర్మిలా దీక్ష చేపట్టిన రోజే ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేసే వరకు ఆహారం తీసుకోనని, ఇంటికి వెళ్లనని, తల్లిని కూడా కలవనని దీక్ష ఆరంభించారు. అలాగే ఇన్ని సంవత్సరాలు తన తల్లిని కలిసే ప్రయత్నం చేయలేదు. ఇక షర్మిలా తల్లి కూడా తన కూతురిని కలుసుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు షర్మిలా తల్లి ఇరోం సాక్షి దేవి, ఆమె సోదరి ఆస్పత్రికి వచ్చి షర్మిలను కలిశారు. దీంతో షర్మిల చాలా ఆనందపడ్డారు. పదహారేళ్ల తర్వాత తన తల్లి, సోదరి తన కోసం రావడం చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని చెప్పారు. ఆర్మీ దళాల ప్రత్యేక హక్కుల చట్టంపై పోరాటం ఆపనని.. రాజకీయాల్లోకి వచ్చి ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఆర్జేడీ నేత దారుణ హత్య..

  గత కొద్దిరోజుల నుండి పలు చోట్ల నేతలపై కాల్పులు జరిగిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా బీహార్లో మరో ఘటన చోటుచేసుకుంది. బీహార్లోని భాగల్పూర్ లో అధికార కూటమిలోని ఆర్జేడీ నేత వినోద్ యాదవ్ పై దుండగలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వినోద్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు అని పోలీసులు తెలిపారు. కాగా నిన్నటిదాకా పలు కారణాలతో అధికారులు, కాంట్రాక్టు కంపెనీల ఉద్యోగులు బలైపోగా... తాజాగా రాజకీయ నేతలు హతమైపోతున్నారు.

జమైకా చిరుత ఖాతాలో హ్యాట్రిక్ గోల్డ్..

రియో ఒలింపిక్స్‌లో జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ స్వర్ణాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే 100 మీటర్లు, 200 మీటర్ల విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్‌ సాధించిన బోల్ట్..తాజగా 100 మీటర్ల రిలే ఈవెంట్‌లో మరో పసిడి పతకాన్ని సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా బోల్ట్ రికార్డు సృష్టించాడు. 100 మీటర్ల రిలే ఈవెంట్‌ను జమైకా అథ్లెట్లు  37.27 సెకన్లలో పూర్తి చేయగా, జపాన్ అథ్లెట్లు 37.60 సెకన్లలో రేసును పూర్తి చేశారు. జమైకా రిలే టీమ్‌లో బోల్ట్‌తో పాటు అసఫా పావెల్, నికల్ ఆష్‌మేడ్, యోహన్ బ్లేక్‌లు ఉన్నారు.

తుని ఘటనలో దర్యాప్తు ముమ్మరం...40 మందికి నోటీసులు

  కాపు నేత ముద్రగడ పద్మనాభం..కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని... వారిని బీసీల్లో చేర్చాలని కాపు ఐక్య గర్జన పేరిట ఉద్యమం చేసిన సంగతి తెలసిందే. అయితే ప్రశాంతంగా ఉండాల్సిన ఈ ఉద్యమం కాస్త హింసాత్మకంగా మారింది. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. అంతేకాదు కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ఈకేసులో భాగంగా 13 మంది కాపులను సీఐడీ అరెస్ట్ చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారంతా విడుదలయ్యారు. తాజాగా ఈ కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసిన సీఐడీ... 40 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో ఇఫ్పటికే 27 మంది సీఐడీ ముందు విచారణకు హాజరుకాగా, మిగిలిన వారు నేడో, రేపో విచారణకు హాజరుకానున్నారు.

రాఖీ గిఫ్ట్‌గా చెల్లెలికి మరుగుదొడ్డి..

అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది రాఖీ పండుగ. ఆ రోజు సోదరీ, సోదరుడి ఇంటికి వచ్చి రాఖీ కట్టడం..అందుకు బహుమానంగా సోదరుడు బహుమానంగా ఏదైనా ఇవ్వడం ఆనవాయితీ. అయితే, అందరిలా కాకుండా తన సోదరికి జీవితాంతం గుర్తుండిపోయే బహుమానం ఇవ్వాలనుకున్నాడు ఆ యువకుడు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు చెల్లి ఇంటి వద్ద మరుగుదొడ్డిని కట్టించి బహుమానంగా ఇచ్చాడు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా రోహిణీ గ్రామానికి చెందిన ప్రేమ్‌చంద్ శర్మ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛ్‌భారత్‌ కార్యక్రమం ఆకట్టుకుంది. మరుగుదొడ్డి లేక నిత్యం ఇబ్బంది పడుతున్న తన చెల్లెలి కష్టాన్ని చూడలేని ఆ అన్న రాఖీ సందర్భంగా తన చెల్లెలి ఇంటి వద్ద మరుగుదొడ్డిని కట్టించి బహుమతిగా ఇచ్చాడు. ఈమెకే కాకుండా మిగిలిన ఆరుగురు అక్కాచెల్లెళ్లకు కూడా అతి త్వరలో మరుగుదొడ్డు నిర్మించి ఇస్తానని ప్రేమ్‌చంద్ పేర్కొన్నాడు.

సింధుపై రివార్డుల వర్షం..

ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగుతేజం పీవీ సింధుపై ప్రశంసలతో పాటు రివార్డుల వర్షం కురుస్తోంది. స్వర్ణానికి రూ.2 కోట్లు, రజతానికి రూ. కోటీ, కాంస్యానికి రూ.50 లక్షలు రివార్డుగా ఇస్తామని ఒలింపిక్స్‌ కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా సింధు రజత పతకాన్ని సాధించడంతో రూ. కోటీ రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. దీంతో పాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రూ.50 లక్షల రివార్డు ప్రకటించారు. భారత బ్యాడ్మింటన్ సమాఖ్య మరో 50 లక్షల బహుమతిని ప్రకటించారు. అలాగే సింధు అవార్డు సాధించేలా ఆమెను సానబెట్టిన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ. 10 లక్షల రివార్డును ప్రకటించారు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య రూ.5 లక్షల నగదు రివార్డును ఇస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.

సింధుకు అభినందనల వెల్లువ..

ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో సిల్వర్ మెడల్ సాధించిన తెలుగుతేజం పీవీసింధుకు దేశం జేజేలు పలుకుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సింధు ప్రదర్శన అద్భుతం. ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిపెట్టిన సింధుకు హృదయపూర్వక అభినందనలు. నీ ప్రదర్శన భారత్‌కు గర్వకారణం.                                      -రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సింధుకు అభినందనలు,నువ్వు అద్భుతంగా పోరాడావ్, అలాంటి నీ చరిత్రాత్మక ప్రదర్శన కలకాలం నిలిచిపోతుంది.                                                                                                               -ప్రధాని నరేంద్రమోడీ    సింధు పోరాటం భారతీయులకు స్పూర్తి. స్వర్ణం కోసం పోరాడిన సింధు తెలుగుజాతికే గర్వకారణమన్నారు. సింధు ప్రదర్శన దేశానికి కొండంత బలాన్నిచ్చిందని, ఇలాంటి క్రీడారత్నాన్ని అందించిన కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నా.                   - ఎన్.చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అద్భుతమైన ఆటను కనబరిచిన సింధుకు అభినందనలు. భారతదేశం తరపున ఒలింపిక్స్‌లో రజతం గెలిచి దేశానికే గర్వకారణంగా నిలిచిన సింధు..తెలంగాణకు గొప్ప ప్రతిష్టను తీసుకొచ్చారు.                                                                     -కే.చంద్రశేఖర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి

సింధు మరో మారిన్ కావాలి

రియో ఒలింపిక్స్‌ మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్లో పీవీ సింధు రజతం సాధించడంతో దేశం మొత్తం ఉప్పొంగిపోయింది. సింధు విజయంపై ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తన కూతురు భవిష్యత్తులో కరోలినా మారిన్‌లా ఆడుతుందని ఆమె తండ్రి పీవీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. మారిన్ నుంచి సింధు చాలా నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎంతోమంది ఆశీర్వాదాలే సింధుకు విజయాలను అందిస్తున్నాయని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా కోచ్ గోపిచంద్, అతడి బృందం కష్టం వృథా పోలేదన్నారు. అటు అనవసర తప్పిదాలే సింధుకు స్వర్ణాన్ని దూరం చేశాయన్నారు ఆమె తల్లి విజయ. శారీరకంగానూ అలసిపోవడం సింధు ఆటపై ప్రభావం చూపిందని..మొదట్లో ఉత్సాహంగా కనిపించిన సింధు..చివర్లో కాస్త టెన్షన్ పడ్డట్టు కనిపించిందన్నారు. సింధు స్పూర్తితో కూతురు వద్దు అనుకునే వారి ఆలోచనలో ఇకనుంచి కాస్త మార్పువస్తుందని విజయ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓడినా గెలిచింది..

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తెలుగుతేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన తొలి భారత మహిళగా సింధు రికార్డుల్లోకి ఎక్కింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి, కరోలినా మారిన్‌తో తలపడిన సింధు..ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. పాయింట్ పాయింట్‌ నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో ఆమె 21-19, 12-21, 15-21 తేడాతో ఓటమి చవిచూసింది. అయితే స్వర్ణం సాధించేందుకు సింధు చెమటోడ్చింది. బలమైన ప్రత్యర్థి అని భయపడకుండా తొలి గేమ్ నుంచే ఎదురుదాడికి దిగింది. క్రాస్ కోర్టు షాట్లు, స్మాష్‌లు, నెట్‌గేమ్‌తో తొలిసెట్‌ను గెలిచింది. అనంతరం పుంజుకున్న మారిన్‌ సింధును ఒత్తిడిలోకి నెట్టి అంతలోనే ఆటను మార్చేసి పసిడిని ఖాతాలో వేసుకుంది. సింధు ఓడినా కాని తన పోరాటంతో క్రీడాభిమానులకు వినోదాన్ని అందించింది. అటు దేశం ఆమె ఆట చూడాలని స్క్రీన్లకు అతుక్కుపోయింది. క్రికెట్ ప్రపంచకప్‌ ఫైనల్ కోసం ఎంత హడావుడి ఉంటుందో..అలా యావత్ భారతావని సింధు మ్యానియాతో ఊగిపోయింది.