బ్రిటన్ జర్నలిస్ట్ కు సెహ్వాగ్ దిమ్మతిరిగే సమాధానం..

  భారత క్రికెటర్ సెహ్వాగ్ తన ఆటలోనే కాదు.. ఈమధ్య ట్వీట్లలో కూడా తన దూకుడుని ప్రదర్శిస్తున్నాడు. రియో ఒలింపిక్స్ పుణ్యమా అని వీరూ తన చేతికి మళ్లీ పని చెప్పాల్సి వస్తుంది. మొన్నీమధ్యే రియో ఒలింపిక్స్ గురించి ప్రముఖ కాలమిస్ట్ శోభా డే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వీరూ శోభాడేకు ఘనమైన ‘సన్మానం’ చేశారు. ఇప్పుడు మరో జర్నలిస్ట్ బుక్కయ్యాడు. బ్రిటన్ కు చెందిన పియర్స్ మోర్గన్ అనే జర్నలిస్ట్ రియో ఒలింపిక్స్ లో భారత్ గెలిచిన పతకాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. 120 కోట్ల జనాభా ఉన్న దేశం కేవలం రెండు ఒలింపిక్స్ మెడల్స్ గెలుచుకున్నందుకు సంబరాలు చేసుకొంటోంది.. అని అన్నాడు. ఇక ఈ వ్యాఖ్యలకు స్పందించిన వీరూ.. ఘాటుగానే అతనికి సమాధానమిచ్చాడు..   ‘అవును.. మేం చిన్న సంతోషాలనే సంబరంగా మార్చుకున్నాం. మరి క్రికెట్ ను ఇన్వెంట్ చేసిన దేశం మీది. మరి ఇంత వరకూ ఒక్క ప్రపంచకప్పునూ సాధించలేకపోయిందే మీ దేశం.. ఇప్పటికీ వరల్డ్ కప్ కోసం మీరు సాగిస్తున్న వేట  ఎంబరాసింగ్ గా లేదా?’’ అంటూ సెహ్వాగ్ ఘాటైన ట్వీట్ ను పెట్టాడు. దీనికి ఆ జర్నలిస్ట్ కూడా సమాధాన మిచ్చాడు... “మా దేశం టీ 20 వరల్డ్ కప్ నెగ్గింది.. లెజెండ్, ఆ ప్రపంచకప్ లో పీటర్సన్ కు మ్యాన్ ఆఫ్ ద సీరిస్ దక్కింది’’ అంటూ చెప్పుకొచ్చాడు.   మరి దీనికి వీరూ ఎందుకు ఊరుకుంటాడు.. మంచి లాజిక్ తో కొట్టాడు.“టీ 20 ప్రపంచకప్ విజయాన్నే సెలబ్రేట్ చేసుకుంటాం.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పీటర్సన్ ను హీరో అనుకొంటే మాకేం అభ్యంతరం లేదు.. అలాగే మా సంబరాలూ మేం చేసుకుంటాం.’’ అంటూ ట్వీటాడు. దీనికి ఆ బ్రిటీషర్ మళ్లీ మారు మాట్లాడలేదు! మొత్తానికి అంత మంది జనాభాలో వీరూ స్పందించి సమాధానం చెప్పడం మంచిదే..

ఈసారి వికెట్ ధర్మాన...

  పుష్కరాల జరుగుతున్న కారణంగా ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పార్టీ ఫిరాయింపులు మళ్లీ తెరపైకి వచ్చాయి. పుష్కరాల మైలేజ్ ను కూడా వాడుకోవచ్చన కాన్సెప్ట్ కూడా ఇన్నీ రోజులు ఆ ఊసే ఎత్తలేదు నేతలు. ఇక ఎలాగూ పుష్కరాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. అయితే తాజాగా పడుతున్న వికెట్ ధర్మాన ప్రసాదరావు అని తెలుస్తోంది. దీనికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవేంటంటే..  జగన్ కడపలో అయితేనే నెగ్గగలడు, శ్రీకాకుళంలో అయితే ఆయన కూడా నెగ్గలేడు.. నేను గనుక తెలుగుదేశం తరపున పోటీ చేసి ఉంటే.. ఎమ్మెల్యేగా నెగ్గే వాడిని అని ధర్మాన చెప్పుకొచ్చాడు. దీంతో ధర్మాన టీడీపీలో చేరడం ఖాయం అంటున్నారు. మరోవైపు ఎలాగూ జగన్ పెట్టుబడుల కేసుల్లో ఈయన నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఆయనపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఈ కారణం చేత అయినా ఆయన అధికార పార్టీ అయిన టీడీపీలోకి వెళ్లే అవకాశాలు చాలానే ఉన్నాయి అంటున్నారు. మరి చూద్దాం.. కేసులు ఉన్నాకానీ టీడీపీ పార్టీలోకి చేర్చుకుంటుందో.. లేదో..

రోశయ్య పదవీకాలం పొడిగింపు.. కారణం అదేనా..!

తానొవ్వక.. నొప్పించక అన్న సామెత సీనియర్ రాజకీయ నేత కొణిజేటి రోశయ్యకు బాగా నప్పుతుంది. ఎందుకంటే ఎవరిపై ఎక్కువ విమర్శలు చేయరు.. తాను కూడా ఎవరిపై ఎక్కువ వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చాలా ప్రశాంతంగా కాలాన్ని వెళ్లదీస్తుంటారు. ఇలాంటి మంచి పేరు మూటగట్టుకోవడం వల్లే తమిళనాడు గవర్నర్ గా తన పదవి కాలం త్వరలో ముగియనున్నా కానీ... పదవీకాలం పొగిడించనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ ఇటీవలే నాలుగు రాష్ట్రాల గవర్నర్లను నియమించిన సంగతి తెలసిందే. అయితే మోడీ మార్చకుండా వదిలేసిన గవర్నరల్లో రోశయ్య ఒకరు. ఎందుకంటే మోడీ అధికారంలోకి రాకముందు నుండే రోశయ్య తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్నారు. దానికి తోడు ఎలాంటి వివాదాలు, అక్కర్లేని ప్రకటనలు చేయకుండా మంచి రిపోర్ట్ సొంతం చేసుకున్నారు.   ఇక రోశయ్య పదవికాలం పెంచమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితే స్వయంగా మోడీకి లేఖ రాశారు. ఒక్క జయలలితే కాదు పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు కూడా ఇదే చెబుతున్నారట. దీంతో రోశయ్య పదవీకాలం పొడిగింపు ఖాయమైనట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

జయలలిత కాన్సెప్ట్ కు చంద్రబాబు కనెక్ట్ అవుతాడా..?

  టెక్నాలజీని వాడుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట అని మనందరికి తెలిసిన విషయమే. అలాంటి చంద్రబాబుకి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ ఐడియా ఇచ్చారంట. అయితే డైరెక్ట్ కాదులెండి... ఇన్ డైరెక్ట్ గా. ఇంతకీ  ఆ ఐడియా ఏంటనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల‌న్నింటినీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా అనుసంధానించే బృహత్తర కార్యక్రమానికి జయలలిత శ్రీకారం చుట్టారు.  ఈనేపథ్యంలో దీనిపై ఆమె అసంబ్లీలో ఓ ప్రకటన కూడా చేశారు. అన్నా విశ్వవిద్యాలయంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేస్తామన్నారు. ఇందుకు రూ.160 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా అత్యున్నత విద్యా ప్రమాణాలను అన్ని విశ్వవిద్యాలయాలు పంచుకుని అభివృద్ధి చెందేందుకు వీలవుతుందని జ‌య చెప్పారు. అంతేకాదు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్యులు, పరిశోధన విద్యార్థులకు ఎన్నో సదుపాయాలు కలుగుతాయని, ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు, ఉన్నతవిద్యకు అందిస్తున్న పథకాలు, ఫలాల గురించి కూడా ఈ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ద్వారా తెలియజేస్తామన్నారు.   అయితే ఇప్పుడు ఈ ఐడియా చంద్రబాబుకి ఉపయోగపడుతుందేమో అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే నధుల అనుసంధానం చేసిన తొలి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ కు కూడా కనెక్ట్ అవుతారేమో.. ఈ కాన్సెప్ట్ ద్వారా క్యాంప‌స్‌ల‌ను క‌నెక్ట్ చేస్తారేమో అని అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..

నన్ను ఉద్యోగానికి పనికిరావన్నారు..

  కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి ఉద్యోగం ఇవ్వనన్నారట. ఇప్పుడు స్మృతీకి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందబ్బా అనుకుంటున్నారా.. ఇప్పుడు కాదులెండి. తాను రాజకీయాల్లోకి రాకముందు సంగతి. ఈ విషయాన్ని స్వయంగా స్మృతీనే చెప్పారు. అసలు సంగతేంటంటే... దిల్లీలో జరిగిన ఏపీఏఐ(ఎయిర్‌ ప్యాసెంజర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) కార్యక్రమంలో స్మృతీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి రాకముందు విమానం క్యాబిన్‌ సిబ్బంది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ అప్పుడు జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ తిరస్కరించింది. నా పర్సనాలిటీ ఉద్యోగానికి సరిపోదని.. ఉద్యోగం ఇవ్వలేమని తెలిపారు. అయితే అప్పుడు ఉద్యోగం రాకపోవడమే మంచిదైంది.. అటు తర్వాత మిగిలిన నా జీవితమంతా మీకు తెలిసిందేనని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

నిర్భయ కేసు నిందితుడు ఆత్మహత్యాయత్నం

నిర్భయ గ్యాంగ్ రేప్ నిందితులు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ నిందితుల్లో ఒకడైన రామ్ సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు నిందితుల్లో మరొక‌డైన విన‌య్ శ‌ర్మ తీహార్ జైలులో ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. ఆత్మ‌హ‌త్య‌ాయ‌త్నంలో భాగంగా మొద‌ట అత‌ను పెయిన్ కిల్ల‌ర్ల‌ను తీసుకున్నాడు. ఆ త‌ర్వాత ట‌వ‌ల్‌తో ఉరి వేసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది.. విన‌య్‌ని ఢిల్లీలోని దీన్ ద‌యాల్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ప్రస్తుతం అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉంది.   కాగా త‌న‌ను జైల్లో ఉన్న ఇత‌ర ఖైదీలు చిద‌క‌బాదినట్లు గ‌తంలో విన‌య్ ఫిర్యాదు చేశాడు. త‌న‌కు అద‌న‌పు భ‌ద్ర‌తా కావాల‌ని కూడా జైలు అధికారుల‌ను డిమాండ్ చేశాడు.

అభిమానం ఉండాలి.. హద్దులు మీరద్దు

  పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వినోద్ కుటుంబాన్ని ఈరోజు తిరుపతిలో పరామర్శించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వినోద్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అభిమానం ఉండాలి కాని.. హద్దులు మీరద్దు.. ఒకరినొకరు చంపుకునే స్థాయిలో కక్ష్యలు పెంచుకోవద్దు అని హితవు పలికారు. పెచ్చుమీరిన అభిమానంతో ఓ కుటుంబం రోడ్డున పడింది.. సమాజానికి ఉపయోగపడే ఓ మంచి వ్యక్తిని కోల్పోయాం.. వినోద్ కుటుంబానికి అన్నీ విధాలా అండగా ఉంటామని తెలిపారు. అంతేకాదు నిందితులను కఠినంగా శిక్షించాలి అని అన్నారు.

భార్య శవాన్ని భుజంపై మోస్తూ 10 కిలోమీటర్లు..

  ఒడిషాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పేదరికం వల్ల తన భార్య శవాన్ని మోస్తూ 10 కిలోమీటర్లు నడుకుంటూ వెళ్లాడు ఓ వ్యక్తి. వివరాల ప్రకారం.. దానా మాజీ, అమంగ్ దేయి భార్య భర్తలు. అయితే అమంగ్ దేయి గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుంది. అయితే ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు దానా మాజీ. చికిత్స పొందుతూనే ఆస్పత్రిలో మరణించింది. ఇక శవాన్ని ఇంటికి చేర్చడానికి వాహనంలో తీసుకెళ్లే స్థోమత లేకపోవడంతో తన భుజంపైనే మోస్తూ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి బయలుదేరాడు. అలా 10 కిలోమీటర్లు నడిచాడు. ఇంతలో అది కాస్త మీడియా ప్రతినిధుల కంట పడడంతో ఆరా తీశారు. నేను చాలా పేదవ్యక్తినని.. వాహనాన్ని ఏర్పాటు చేసుకోలేను.. నా నిస్సాహాయతను ఆస్పత్రి అధికారులకు మోరపెట్టుకున్నాను.. దానికి వారు తాము ఎటువంటి సహాయం చేయలేమని తేల్చిచెప్పారు. దీంతో అనివార్యంగా భార్య మృతదేహాన్ని మోస్తూ ఇంటికి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నాడు. దాంతో వారు జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పగా.. ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఘటన గురించి తెలుసుకున్న అధికార పార్టీ ఎంపీ కైలాష్ సింగ్.. జరిగిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక మంత్రిని కోరారు.

తిరుపతి చేరుకున్న పవన్..

  పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. ఆయన అభిమాని వినోద్ ఆత్మహత్యకు గురైన నేపథ్యంలో అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు గాను పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారు. అతని కుటుంబాన్ని పరామర్శించారు. తమ కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ను చూడటానికి అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.   కాగా పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ వేరే హీరో ఫ్యాన్స్ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రెండు నెలల్లో యూఎస్ వెళ్లాల్సిన వినోద్ ఇలా హత్యకు గురవ్వడం చాలా మందిని కలచివేసింది.

విమానాల్లో కూడా వైఫై...

  ఇప్పటి వరకూ నేలకు మాత్రమే పరిమితమైన సేవలు ఇప్పుడు నింగికి కూడా చేరనున్నాయి. త్వరలోనే విమానాల్లో కూడా వైఫై సేవలు అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విమాన ప్రయాణంలో ముబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం నిషేదం అని తెలిసిందే. అయితే ఇప్పుడు విమాన ప్రయాణికులకు ఓ శుభవార్త తీసుకొచ్చింది పౌరవిమానయాన శాఖ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పది రోజుల్లో మీకో మంచి కబురు చెబుతా’’ అని చెప్పడంతో  ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తానికి ఇక నుండి భారత గగనతలం మీద ప్రయాణించే వారు ఇక నుంచి ఎంచక్కా మొబైల్ ఫోన్స్ వాడుకోవచ్చు. వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకోవచ్చన్నమాట. 

ముష్కరుల కాల్పుల కలకలం.. 700 మంది విద్యార్థుల‌ు సరక్షితం..

  ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని అమెరికా యూనివర్శిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ లోకి నిన్న రాత్రి ముష్క‌రులు ప్ర‌వేశించి బీభ‌త్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. వర్శిటిలోకి ప్రేవశించిన ముష్కరులు కనిపించిన వారిపై కాల్పులు జరిపారు. దీంతో విద్యార్ధులు భయంతో బల్లలకింది దాక్కున్నారు. ఈ కాల్పుల్లో మొత్తం ఏడుగురు చనిపోగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ‌ప‌డిన వారికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా రంగంలోకి దిగిన భ‌ద్ర‌తాద‌ళాలు ముష్క‌రుల‌ను మ‌ట్టుబెట్టిన‌ట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. సైనిక కార్యాచ‌ర‌ణ ముగిసింద‌ని.. 700 మంది విద్యార్థుల‌ను ర‌క్షించామ‌ని పేర్కొన్నారు.

మాల్యా విమానం తీర్ధయాత్రలకు..

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా ఆస్తులు ఒక్కొక్కటి వేలం పాటలో దక్కించుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన పలు ఆస్తులను వేలం వేశారు. ఇప్పుడు తాజాగా ఆయన విమానాన్ని వేలం వేశారు. ఈ విమానాన్ని ఎస్‌జీఐ కామెక్స్ సంస్థ వేలంలో దక్కించుకుంది. రూ. 152 కోట్లకు కనీస ధరను ఫిక్స్ చేసినా.. తొలిసారి మాత్రం రూ.కోటి రూపాయలు మాత్రమే పలికింది. రెండోసారి మాత్రం రూ.27.39కోట్లు పలికింది. దీంతో ఈ విమానాన్ని ఎస్‌జీఐ కామెక్స్ సంస్థ దక్కించుకుంది. అయితే ఈ విమానాన్ని వ్యక్తిగత అవసరాల కంటే తీర్ధయాత్రలకు, విదేశీ పర్యాటకులకు ఉపయోగించాలని అనుకుంటున్నట్టు సంస్థ అధికారులు తెలిపారు.

ప్రపంచ రికార్డ్ మిస్సైన బ్యాట్స్ మెన్..

  కేవలం రెండు పరుగుల తేడాతో ప్రపంచ రికార్డ్ మిస్సయ్యాడు శ్రీలంక బ్యాట్స్ మెన్ దినేష్. ఆస్ట్రేలియా శ్రీలంక జట్ల మధ్య సెకండ్ వన్డే మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో లంక బ్యాట్స్‌మెన్ దినేష్ చండీమాల్ 48 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. చండీమాల్ వరుసగా ఐదు వన్డే మ్యాచ్‌లలో హాఫ్ సెచెరీలు నమోదు చేశాడు. ఈరోజు కూడా చేసినట్టయితే వరుసగా ఆరోవది అయ్యిండేది. కానీ ఔటయ్యాడు. దీంతో వరల్డ్ రికార్డ్‌కు దూరమయ్యాడు. లంక బ్యాటింగ్ దిగ్గజాలైన సనత్ జయసూర్య, సంగార్కర, దిల్షాన్‌లు మాత్రమే వరుసగా ఐదు వన్డేల్లో అర్ధ శతకాలు చేశారు.   అయితే వరుసగా 6 వన్డే హాఫ్ సెంచరీలు చేసిన వారు ఉన్నారు కానీ అదే క్రమంలో ఏడు చేసిన వారు మాత్రం లేరు. కానీ ఆల్ టైమ్ గ్రేట్ రికార్డ్ మాత్రం పాకిస్థాన్ ఆటగాడు జావెద్ మియాందాద్ పేరుపై ఉంది. జావెద్ వరుసగా 9 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

సింధూకి వచ్చిన నజరానా ఎంతో తెలుసా..?

  రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పివి సింధూ ఇప్పుడు విజయలక్ష్మే కాదు.. ధనలక్ష్మీ కూడా అయింది. విజయం సాధించి భారత కీర్తి ప్రతిష్టలు పెంచిన సింధూకి మన తెలుగు రాష్ట్రాలే కాదు.. పక్క రాష్టాలు కూడా నజరానాలు ప్రకటించేస్తున్నాయి. మరి ఎవరెవరూ ఎంత ఇచ్చారో ఓ లుక్కేద్దాం.. * ఏపీ సర్కార్ …3 కోట్లు, వెయ్యి గజాల స్థలం, ప్రభుత్వ ఉద్యోగం *తెలంగాణ సర్కార్..5 కోట్లు, వెయ్యి గజాల స్థలం * ఢిల్లీ సర్కార్…..2 కోట్లు * మధ్యప్రదేశ్ సర్కార్..50 లక్షలు * భారత్ పెట్రోలియం …75 లక్షలు * భారత బాడ్మింటన్ అసోసియేషన్ …50 లక్షలు * సల్మాన్ ఖాన్ …..25 లక్షలు * వాణిజ్యవేత్త ముక్కట్టు సెబాస్టియన్ ..5 మిలియన్ డాలర్లు * భారత ఒలింపిక్ అసోసియేషన్….30 లక్షలు * హర్యానా సర్కార్….50 లక్షలు * రైల్వే శాఖ…. 50 లక్షలు * భారత ఫుట్ బాల్ సమాఖ్య ..5 లక్షలు * సచిన్ చేతుల మీదుగా  bmw కారు... * మహీంద్రా కంపెనీ ప్రకటించిన suv అత్యున్నత శ్రేణి వాహనం * మరో మూడునాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రకటించిన ఫ్లాట్స్ మరి ఇంకా ఎంత మంది ఏం ప్రకటిస్తారో చూద్దాం..

సుష్మ గారు నిజంగా మీరేనా..

  భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్‌కు అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన ట్వీట్లు వస్తుంటాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమె అలాంటి ట్వీట్లకు కూడా చాలా మర్యాదపూర్వకంగా సమాధానాలు ఇస్తుంటారు. గతంలో గతంలో కారు దెబ్బతింది, రిఫ్రిజిరేటర్‌ చెడిపోయిందంటూ పలు ఫన్నీ ట్వీట్లు వచ్చాయి. వాటికి ఆమె సమాధానం చెప్పారు. ఇప్పుడు కూడా సుష్మకు అలాంటి ట్వీటే ఒకటి వచ్చిది. సుమంత్ బల్గి అనే వ్యక్తి ‘సుష్మాస్వరాజ్‌ నిజంగా మీరేనా? కేవలం చెక్‌ చేసుకుంటున్నాను.. భారతలో రాజకీయ నాయకుల లక్షణాలు మీకులేవు.. మీరు మా(భారతీయుల) గురించి ఆలోచిస్తున్నారు’ అంటూ ట్వీట్‌ చేశాడు. అయితే దీనికి స్పందించిన సుష్మ.. దయచేసి అలాంటి భావాలతో ఉండొద్దు. భారత రాజకీయ నాయకులు చాలా సున్నితమైనవారు.. సహాయతత్వం గల వారు అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో సుష్మ చేసిన మర్యాదపూర్వకమైన ట్వీట్ పై అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.    

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నీరుగారిపోయింది..

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మూడు పదవులు.. ఆరు ఫిరాయింపులుల్లాగా ఫుల్ జోష్ మీద నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ అక్కడ బాగానే వర్కవుట్ అయింది. చాలా మంది నేతలు పార్టీ ఫిరాయించి గులాబీ గూటికి చేరారు. ఇక అదే అడుగుజాడల్లో ఇక్కడ ఏపీలో చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దాని తాతలా తయారైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిహేను మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేటర్లు.. ఇలా ఒక్కరేంటి చాలా మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇంకా కప్పుకోవడానికి చాలా మంది రెడీగానే ఉన్నారనుకోండి. అయితే ఇదంతా నాణెనికి ఒకపక్క మాత్రమే. ఇంకో పక్క ఏంటంటే.. బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ చేయండ. విచిత్రంగా ఉంది.. ఇప్పటి వరకూ బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిందంటే నమ్మడానికి కొంచం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే బీజేపీ చేపట్టిన విషయం ఇంతవరకూ ఎవరికీ తెలియక పోవడం. ఎందుకంటే కనీసం ఒక్క నేత అయిన బీజేపీలో చేరి ఉంటే ఆ విషయం బయటపడేది.   అసలు సంగతేంటంటే.. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ మాదిరి బీజేపీ కూడా అసంతృప్తి నేతలను ఆకర్షించడానికి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసింది. స్వయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నే ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షించమని రాష్ట్ర నేతలను ఆదేశించారు. అంతేకాదు దీనిలో భాగంగా ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించటానికి ఏకంగా ఒక కమిటీనే ఏర్పాటు చేసింది బీజేపీ. కమిటీలో సీనియర్ నేత, ఎంఎల్‌సి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, రాంభూపాల్ రెడ్డి, శాంతారెడ్డి ఉన్నారు. వీరి పని ఏంటంటే.. జిల్లాల వారీగా, పార్టీల వారీగా ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను గుర్తించటం, వారితో నేరుగా గానీ లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించడం.. వారిని పార్టీలోకి తీసుకురావడం. అయితే దౌర్భాగ్యం ఏంటంటే... ఈ కమిటీ ఏర్పాటు చేసి రెండు నెలలు అవుతున్నా ఒక్కరు కూడా బీజేపీ వైపు కన్నెత్తి చూడకపోవడం..   అందుకు కారణం లేకపోలేదు.. గడచిన రెండేళ్ళుగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేసిన సాయం ఏమీ ప్రజలకు కనబడటం లేదు. పైగా, విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజి, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, ఆర్ధికలోటు భర్తీ తదితరాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో నేతలు కూడా బీజీపీలోకి వెళ్లినా వర్కవుట్ కాదని ఆ వైపు కూడా చూడటంలేదు. రోజురోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణల్లో బీజేపీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేతలకు నిరాసనే మిగిల్చింది. ఆపరేషన్ ఆకర్ష్ నీరుగారిపోయింది.

సచిన్ చేతుల మీదుగా సింధూకు BMW కారు..

రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన సింధూకు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రశంసలు అందిచారు. ప్రశంసలతో పాటు ఆమెకు అదే రేంజ్లో నజరానాలు కూడా అందుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రా ప్రభుత్వాలు ఇప్పటికే సింధూకు తగిన విధంగా రివార్డులు అందించాయి. ఇప్పుడు ఆ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ కూడా చేరిపోయాడు. సింధూకు BMW కారు బహుమతి గా ఇవ్వనున్నాడు. 60 లక్షల విలువ గల ఈ కారును పి.వి.సింధూ కు సచిన్ చేతులమీదుగా బహుకరించానున్నారు. ఈ కారును హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు వి చాముండేశ్వర్ నాథ్, ఆయన స్నేహితులు కలిసి స్పాన్సర్ చేశారు. సచిన్ చాముండికి ఆప్త మిత్రుడు. సచిన్ చేతుల మీదుగా సింధూకు దీన్ని అందచేయాలని అసోసియేషన్ తరఫున నిర్ణయించారు. దీంతో సచిన్ సింధూకు ఈ నెల 28 వ తేదిన కారును బహుకరించానున్నారు.   కాగా రియో స్టార్ సింధూకు ఏపీ ప్రభుత్వం 3 కోట్లు, రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఇక పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు, వెయ్యి గజాల స్థలం ప్రకటించింది. ఇంకా ఢిల్లీ ప్రభుత్వం రెండు కోట్లు ప్రకటించింది. ఇంకా పలు సంస్థలు సింధూకు భారీగానే నజరానా ప్రకటించాయి.