ధర్నాలతో భగ్గుమన్న బెజవాడ

బెజవాడ రాజకీయం భగ్గుమంటోంది. ఫ్లైవోవర్‌ నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ధర్ణాలు చేశారు. మరోవైపు రైతుసమస్యలపై వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు ప్రారంభించారు. ఫలితంగా ప్రజలు తీవ్ర అగచాట్లకు గురయ్యారు. విజయవాడ కనకదుర్గగుడి హైవే వద్ద   ఫ్లయిఓవర్‌ నిర్మించాలనే డిమాండుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యాన ఆ పార్టీ ధర్నాకు దిగారు. దీన్ని ఆపేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. ఇప్పుడే ఫ్లయిఓవర్‌ నిర్మిస్తే ట్రాఫిక్‌ సమస్యలు తప్పవని ఎంపి లగడపాటి రాజగోపాల్‌ అబిప్రాయపడ్డారు. ఆల్‌రెడీ ఫ్లయిఓవర్‌కు నిధులు మంజూరైతే ఎందుకు పనులు ప్రారంభించలేదని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. తన అభిప్రాయం చెప్పిన రాజగోపాల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సుముఖంగా లేరు. అయినా నిరసన కార్యక్రమం ఆగదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి. అయితే తెలుగుదేశం మెరుపుధర్నా వల్ల ట్రాఫిక్‌ సమస్య తప్పదనీ, ముందస్తుగా చేయాల్సిన ఏర్పాట్లు గురించి పోలీసుశాఖ అప్రమత్తమైంది. బాబు మెరుపుధర్నా వెనుక పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. విజయవాడలో ప్రారంభించిన ప్రతీ ఆందోళన సక్సస్‌ అవుతుందన్నది సెంటిమెంటు. దీనికి ఉదాహరణ ఆంథ్రరాష్ట్ర అవతరణ. బెజవాడ ఉద్యమాల పురిటిగడ్డ వంటిదని ప్రస్తుతిస్తారు. అంతేకాకుండా తాజాగా వై.కా.పా. అథినేత జగన్మోహనరెడ్డి ఇక్కడ రైతాంగ సమస్యలపై పోరాటం ప్రారంభించి మంచి పేరు సంపాదించారు. ఒకరకంగా చెప్పాలంటే జగన్‌ చేసిన ఈ ఆందోళనే ఉప ఎన్నికల ఫలితాల్లో అంతలా గెలుపుగుర్రం ఎక్కడానికి  కారణమని ఆ పార్టీనేతలు విశ్లేషించారు కూడా. అందువల్ల చంద్రబాబు ఆ దుర్గమ్మపై భారం పెట్టి మెరుపు ధర్నాకు సిద్ధమయ్యారు.

తోటకు మంత్రిపదవి

రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దాదాపు 12వేల మెజార్టీతో గెలుపొందిన తోటకు మంత్రి పదవి ఇస్తే బహుళ ప్రయోజనాలు ఉన్నాయని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బలమైన సామాజికవర్గ నేతగా తోటత్రిమూర్తులుకు పేరుంది. ఈ వర్గం శాంతిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకలాంటిదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకనైనా తోటకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ పెద్దలే సిఎం కిరణ్‌కుమర్‌రెడ్డికి సూచిస్తున్నారు. పైగా, గెలిచిన రెండు స్థానాల్లో మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌పై విజయం సాధించటం అంటే మాటలు కాదని రాజకీయ ఉద్దండులే అభిప్రాయపడుతున్నారు. పిల్లి సుబాష్‌ చంద్రబోస్‌ రామచంద్రపురం నియోజకవర్గంలో బిసిల్లో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన్ని ఈ నియోజకవర్గంలో ఓడించటమే కష్టం. అటువంటిది తోట త్రిమూర్తులు గెలిచినందుకు నియోజకవర్గంపై పట్టుఉండాలంటే ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే. ఇంకోరకంగా చూస్తే కోనసీమకు మంత్రి పినిపే విశ్వరూప్‌, మెట్టప్రాంతానికి మంత్రి తోటనర్సింహం మధ్యలో జిల్లాకు కీలకమైన స్థానం రామచంద్రపురం. అందువల్ల ఇక్కడ కూడా మంత్రి పదవి ఇస్తే తూర్పుగోదావరి జిల్లాపై ముగ్గురుమంత్రులూ పట్టున్నవారే అవుతారని సూచనలు వస్తున్నాయి. రాజకీయంగా తూర్పుగోదావరి ఓటరు ఎటుతీర్పు ఇస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడు మంత్రిపదవులు ఇవ్వకతప్పదని పలువురు నేతలు పట్టుబడుతున్నారు. అయితే తోట త్రిమూర్తులు మాత్రం ఎక్సయిజ్‌శాఖను కోరుకుంటున్నారు. కానీ, ఈ నియోజకవర్గం మొదలుకుని జిల్లాలో వెనుకబడిన తరగతులపై పట్టుకోసం, తరువాత (2014) ఎన్నికల్లో విజయం కోసం బిసి, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి పదవి అయితే బాగుంటుందని మేథావులు సూచిస్తున్నారు. చిత్రంగా ఈ విషయంపై ఎన్ని సూచనలు వచ్చినా సిఎం కిరణ్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే మంత్రి పదవి ఇచ్చినా చిరంజీవి వ్యాఖ్యానాలు దృష్టిలో ఉంచుకుని కీలకశాఖ ఇవ్వకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. తాను సోనియాతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తోటత్రిమూర్తులు అనుచరులకు చిరంజీవి దాదాపు హామీ ఇచ్చారు. చిరంజీవి అక్కడికి వెళ్లేలోపే కిరణ్‌ తన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తోటను పిలిపించి మరీ మంత్రి పదవి కేటాయించవచ్చని కిరణ్‌ సన్నిహితులు భావిస్తున్నారు. ఎందుకంటే కిరణ్‌ సిఫార్సు కన్నా తాను స్వయంగా తీసుకునే నిర్ణయానికే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారని అందరికీ తెలిసిందే. అందుకే కిరణ్‌ పిలుపు కోసం రామచంద్రపురం నియోజకవర్గంలో తోట అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మేథావుల పార్టీగా వై.కా.పా. చూపేందుకు కసరత్తులు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మేథావుల పార్టీగా చూపేందుకు కసరత్తులు చేస్తున్నారు. అందుకే పార్టీలో కొత్తకొత్త విభాగాలను పుట్టిస్తున్నారు. వీటి సహాయంతో పార్టీకి కొత్తగా సిద్ధాంతాలను సృష్టించి మేథావుల పార్టీగా అనిపించేందుకు బులెటిన్‌లు కూడా అందజేయనున్నారని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఈ బులెటిన్‌లు ఆధారంగానే ఆ నెలలో ఉన్న సమస్యలపై నేతలు, కార్యకర్తలు కార్యాచరణ రూపొందించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమస్యను ఏ కోణంలో చూడాలో అన్న అంశాన్నీ మేథావుల విభాగం డైరెక్షన్‌ ఇస్తోంది. దీంతో కమ్యూనిస్టుపార్టీల మూలసిద్ధాంతాలను ఎలా ప్రచారం చేస్తుందో అదే తరహాలోకి వై.కా.పా. చేరుతోంది. అంటే తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేకుండా బులెటిన్‌లను రూపొందిస్తారు. ఈ బులెటిన్‌లు చదవటమే వారికి శిక్షణ. ప్రధానంగా ఈ మేథావుల వింగ్‌లో కీలకంగా ప్రొఫెసర్ల విభాగం ఉంటుంది. దీనిలో కొత్తసభ్యులకు వై.కా.పా.నేత సోమయాజులు స్వాగతం పలికి సభ్యత్వం ఇచ్చారు. సమాజంలో వస్తున్న సామాజిక ఆర్థిక మార్పులపై ఎప్పటికప్పుడు పరిశీలన చేసి నివేదికలను ముఖ్యనేతలకు అందిస్తామని ఈ విభాగం సభ్యులు ప్రకటించారు. వీరి నివేదికలను సాక్షిపత్రికల్లో వ్యాసంగా ప్రచురించటం, బులెటిన్‌లు రూపొందించటం  కోసం కూడా ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది. ఈ నివేదికల ఆధారంగానే ధర్నాలు, ఆందోళనాకార్యక్రమాలు రూపొందించవచ్చు. అలానే కీలకమైన అంశాలపై పార్టీ ఎలా స్పందిస్తుందో గమనించి నేతలు తమ ప్రసంగాలను దానికి అనుగుణంగా చేయవచ్చు. ఏమైనా మేథావుల పార్టీగా వై.కా.పా. త్వరలో జనం ముందు నిలబడేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో తమ పార్టీ ఎలా వ్యవహరించాలనే విషయం త్వరలో వై.కా.పా. ప్రొఫెసర్ల విభాగం బయటపెడుతుంది.  ఈ విభాగం తొలినివేదిక ఎలా ఉంటుందన్న అంశంపై మాత్రం అన్ని పార్టీలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

జగన్ పార్టీలోకి పెరిగిన వలసలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం నుంచి 500 మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. మరోవైపు బోడుప్పల్‌లో మేడ్చల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని రంగారెడ్డి జిల్లా కన్వీనర్ జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో250 మంది కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పొన్నాల రఘుపతిరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లాలోనూ ముదినేపల్లి మండలం ఉటుకూరులో టీడీపీ నుంచి 200 మంది కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సీపీ చేరారు.

బోరుబావిలో పడిన ఐదేళ్ళ చిన్నారి మహి మృతి

బోరుబావిలో పడిన ఐదేళ్ళ చిన్నారి మహి మృతి చెందింది. బుధవారం (20వ తేదీ) రాత్రి బోరుబావిలో చిక్కుకున్న మహిని సహాయక సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం బయటకు తీశారు. మహిని వెంటనే అంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. మహి మృతిని జిల్లా కలెక్టర్ కూడా ధృవీకరించారు. ఈనెల 20న చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. మహిని బయటకు తీసేందుకు సహాయ సిబ్బందితోపాటు సైన్యం, వైద్యులు 86 గంటల పాటు కృషి చేసి బయటకు తీశారు. అయినా వారి శ్రమ వృధా అయింది. బావిలో పడిన రోజే చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్లు అభిప్రాయపడ్డారు. మహి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

411 పాఠశాలల బస్సుల సీజ్ చేసిన ఆర్టిఏ

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్, పాఠశాలల బస్సులను నిలువరించే కార్యక్రమాన్ని రవాణా శాఖాధికారులు ఉధృతంగా కొనసాగిస్తున్నారు. శనివారం నాటికి 411 స్కూలు బస్సులు, 211 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. దాడుల నేపథ్యంలో మరో 500 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆయా సంస్థల యజమానులు రోడ్లపైకి తీసుకురాకుండా నిలిపివేశారు. ఒక్క శనివారమే ఎనిమిది జిల్లాల్లో వివిధ ట్రావెల్స్‌కు చెందిన 10 బస్సులను, వివిధ పాఠశాలలకు చెందిన 99బస్సులను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన విద్యా సంస్థల బస్సుల్లో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో(22) ఉన్నాయి.

జైల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా జగన్‌

వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ అధినేత జగన్‌ చంచల్‌ గూడా జైల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలుపుతున్నారు. జైల్లో దాదాపు నెల రోజులుగా వుంటున్న జగన్‌ ఆరోగ్యం కోసం వెజిటబుల్‌ జ్యూస్‌ల మీదే ఎక్కువగా ఆధానపడుతున్నట్లు తెలుస్తుంది. ఉదయం రెండుగంటలపాటు బైబిల్‌ చదవటం, పేపర్లు తిరగవేయడం చేస్తున్న జగన్‌ ప్రత్యేక సదుపాయాలు కలిగి రోజూ నాన్‌వెజ్‌ తినే అవకాశం ఉన్నప్పటికి ఆయన పూర్తిగా శాఖాహారమే తింటున్నట్లు తెలుస్తోంది. అదే ఓల్డు హాస్పిటల్‌ బ్లాకులో ఉన్న మిగతా విఐపి లంతా కేవలం ఆదివారం మాత్రమే మాంసాహారం తింటున్నారని తెలిసింది. అప్పుడప్పుడు అదే బ్లాకులో ఉన్న 10 మంది విఐపి ఖైదీలతో జగన్‌ మాట్లాడుతున్నా ఎక్కువ సమయం ఏకాంతం లోనే వుంటునారు. మోపిదేవిరమణ కు జగన్‌ కు జాలీ ములాఖత్‌ ఉన్నందువలన మాట్లాడుకునే అవకాశం వున్నప్పటికి అంతగా ఆనాయకులు మాట్లాడుకోవడం లేదని తెలుస్తోంది. వారానికి మూడు ములాఖత్‌లు మాత్రమే వున్నందున విజయమ్మ, జగన్‌ భార్య బారతి కొత్తగా ఎన్నికైన ఎంఎల్యేలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం వల్ల మిగిలిన నాయకులకు జగన్‌ ను కలుసుకునే అవకాశం లభించడం లేదు.

వైసిపి ఖుషీ, కాంగ్రెస్‌లో అయోమయం, నిస్సత్తువతో తెలుగుదేశం

యువనాయకులంతా వైసిపి వైపు  మొగ్గు చూపుతున్నారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి చంచల్‌గూడా జైలులో జగన్‌ ను కలసిన రాజకీయ నాయకుల్లో అత్యధికులు యువనాయకులే కావడం విశేషం. అసదుద్దీన్‌  ఒవైసీ, జనార్ధన్‌ రెడ్డి కుమార్తె విజయారెడ్డి రాజమండ్రి కాంగ్రెస్‌ ఎమ్మేల్యే పినిపే విశ్వరూప్‌ తో పాటు అనేక మంది  చంచల్‌గూడా జైలులో ములాఖత్‌ తీసుకుని జగన్‌ను కలిశారు. కాంగ్రెస్‌ పరిస్థితి దీనికి భిన్నంగా భిన్నంగా ఉంది. యువనాయకులంతా వైసిపి లోకి వెళతానికి ఆసక్తిచూపుతుంటే సీనియర్లంతా తమ భవిష్యత్‌ ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు తెలంగాణా అనుకూలవాదం వ్యతిరేక వాదాలతో ఆ పార్టీ సతమతమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే  కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది.  ఇక తెలుగుదేశం పార్టీ సంగతి చూస్తే ఆ పార్టీనాయకులు కూడా దిక్కు తోచని స్ధితిలో ఉన్నారు. ఎన్నికల్లో  చంద్రబాబునాయుడ కాలికి బలపం కట్టుకు తిరిగినా ఆయాసం, నీరసం తప్ప ఏం మిగలలేదు. తెలంగాణ ప్రకటిస్తే ఓట్లు పడతాయని తెలంగాణనాయకులు , సమైఖ్యాంద్రకే కట్టు బడాలన్న ఆంధ్రనాయకులు చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పార్టీ నుంచి వలసల్ని నివారించడానికి ఆయన ఎంతగానో శ్రమపడాల్సి వస్తోంది. పార్టీలో నూతనోత్తేజం కల్పించడానికి, తనకు చేదోడువాదోడుగా ఉంటాడనే ఉద్దేశ్యంతో ఆయన తన తనయుడు నారా లోకేష్‌బాబును రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇటువంటి ప్రయత్నం చేస్తారాని తెలుగువన్‌ డాట్‌ కామ్‌ ఉప ఎన్నికలకు ముందే చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది.

వీణా,వాణిల వంతు ఎప్పుడు

మద్యప్రదేశ్‌లోని బేతుల్‌జిల్లా పాదర్‌ లో అవిభక్త కవలలుగా పుట్టిన స్తుతి , ఆరాధన 23 మంది డాక్టర్లు , 34 మంది వైద్య సిబ్బంది కలిసి నాలుగు దశల్లో చేసిన ఆపరేషన్‌ విజయవంతం అయింది. ఈ ఆపరేషన్‌ కు మద్యప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం 20 లక్షలు కేటాయించింది. గత ఏడాది మే 2న మాయా యాదవ్‌లకు జన్మించిన స్తుతి, ఆరాధన అవిభక్త కవలలను ఆ తల్లి దండ్రులు ఆసుపత్రిలోనే వదిలారు. ఇప్పుడు ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ అయినందుకు గాను వారు ఎంతగానో సంతోషపడుతున్నారు . మరి మన వీణా వాణి ల మాటేమిటి ? వారి తల్లిదండ్రులు కూడా పేదవారు కావడం వల్ల వారు గుంటూరు మెడికల్‌ హాస్పిటల్‌ లోనే పిల్లలను వదిలి వెళ్లారు. ప్రొఫెసర్‌ నాయుడమ్మ వారి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. అదిగో ఇదిగో అంటూ కాలం గడిచి పోయింది. ప్రొఫెసర్‌ నాయుడమ్మ రిటైర్‌ అయ్యారు. వాణి వీణ తల్లిదండ్రులు నాయుడమ్మే ఆపరేషన్‌ చేయాలని ఎంతగా ప్రభుత్వాన్ని కోరినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత వారు హైదరాబాద్‌ నిమ్స్‌లో అలాగే వుండి పోయారు గాని ఇప్పటివరకు ప్రభుత్వం కాని కార్పొరేట్‌ డాక్టర్లు కాని పట్టించు కోకపోవడం విచారకరం.

చెట్టెక్కిన చింతచిగురు ధర

చింతచిగురు ఈ మాట తెలియని వారుండరు. సాంప్రదాయ వంటలకిది పెట్టింది పేరు. అది వెజిటేరియన్‌ కూరైనా , నాన్‌ వెజిటేరియన్‌ కూరలైనా కాస్తంత చింత చిగురు వేస్తే ఆ కూర రుచేవేరు. పప్పుచింత చిగురు, వంకాయ చింతచిగురు, ఇలా ఒకటేమిటి దేనిలోవేసినా దాని రుచేవేరు. ఇక నాన్‌వెజ్‌ వంటకాలకొస్తే చింతచిగురు మటన్‌ చింతచిగురు చికెన్‌ మహా పసందుగా వుంటుంది. కాని ఆహార ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌ ...ఇదివరకటిలా రాష్ట్రంలో చింతచిగురు ఎక్కువగా దొరకటం లేదు. వ్యవసాయభూములకు, పండ్లతోటలకు రియల్‌ఎస్టేట్‌ తో వచ్చిన గండం వల్ల ఈ చెట్లు చాలావరకు నరికి వేయబడ్డాయి. దాంతో కిలో రెండు మూడు రూపాయలకు వచ్చే చింతచిగురు ఇప్పడు 200 రూపాయలకు చేరుకుంది. సామాన్య మద్యతరగతి వారు 20 రూపాయలు పెట్టి ఓ వంద గ్రాములు కొనుకుంటున్నారు. ఈ తరం పిల్లలకు ఆరుచి అంతగా రుచించక పోయినా పాత తరం మాత్రం ఆరోగ్యం కోసం చిహ్యచాపల్యం కోసం చింతచిగురును ఎంత ప్రియమైనా వదలలేక పోతున్నారు

లోకేష్‌ ట్విట్టర్లకు పెరుగుతున్న ఫాలోయర్లు

తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌ పరోక్షంగా రాజకీయ రంగ ప్రవేశం చేసేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా ఇటీవల జరుగుతున్న పలు సంఘటనలపై లోకేష్‌ స్పందించేస్తున్నారు. అయితే ఆ స్పందనలను ట్విట్టర్ల ద్వారా తెలియజేస్తున్నారు. తన తండ్రి చంద్రబాబునాయుడుని అవినీతిపరునిగా చూపేందుకు గతంలో వైఎస్‌ ప్రభుత్వం ఎన్నో విచారణ కమిటీలు వేశాయని లోకేష్‌ గుర్తు చేశారు. అయితే ఆ విచారణలు ఏవీ అవినీతిని నిరూపించలేకపోయాయన్నారు. వృథాప్రయాసే మిగిలిందని వ్యాఖ్యానించారు. వైఎస్‌ విజయమ్మపైన, వై.కా.పా.పైన లోకేష్‌ తన విమర్శలను ట్విట్‌లో ఉంచారు. దీనితో ఆగకుండా కోలా కృష్ణమోహన్‌ చేసిన ఆరోపణలకు వివరణలు కూడా లోకేష్‌ ట్విట్‌ చేశారు. కోలా చూపించే బ్యాంకు అకౌంట్లు ఆయనకే తెలియాలని లోకేష్‌ వ్యాఖ్యానించారు. ఏమైనా తండ్రి రోడ్డుషోల్లోనూ, ప్రచారంలోనూ విమర్శలు గుప్పిస్తే కొడుకు ఇంటర్నెట్‌లో విమర్శలు గుప్పిస్తారన్న మాట. లోకేష్‌ ట్విట్టర్లు ఆలోచింపజేసేవిగా ఉండడంతో వాటికి ఫాలోవర్లు కూడా గణనీయంగా పెరుగుతున్నారు.

కొండా సురేఖకు వై.కా.పా.ఎమ్మెల్సీ సీటు?

కేవలం 1500ఓట్లు ఎమ్మెల్యే కావాల్సిన తాజామాజీ రాతను మార్చేశాయి. ఈ లైను చదవగానే పరకాల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొండాసురేఖ గుర్తుకువస్తారు. ఈమె తన సమీప ప్రత్యర్థి తెరాస చేతిలో అతితక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. అయితే 18అసెంబ్లీ స్థానాలకు వై.కా.పా. 15చోట్ల విజయం సాధించింది. అందరూ ఎమ్మెల్యేలుగా పదవీప్రమాణం చేస్తుంటే సురేఖ మాత్రం ఇంట్లోనే ఉండిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన విజయమ్మ సురేఖ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్‌లోని సురేఖ ఇంట్లో ఆమెను కలుసుకున్న విజయమ్మ ఎమ్మెల్సీ పదవి ఆఫర్‌ చేశారట. దీనికి సురేఖ కూడా సరేనన్నారట. దీంతో వై.కా.పా. తరుపున కొండా సరేఖ శాసనమండలికి వెళతారు. దాదాపు ఎమ్మెల్యేతో సమానంగా రాజ్యమేలే పదవి ఎమ్మెల్సీ. కాబట్టి సురేఖ గెలవకపోయినా ఎమ్మెల్యే స్థాయి లభించినట్లే. ఇలా సురేఖ కూడా ఆనందపడుతున్నారు.

తూర్పు గోదావరిలో దొంగభూముల తనఖా స్కాం

దొంగడాక్యుమెంట్లతో తనకు ఉన్న దొంగభూములు చూపి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌, కడియం, మండపేట మండలాల్లో కోట్లాదిరూపాయలు బ్యాంకు రుణాలను పొందుతున్నారు. ఇలా సుమారు 50కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులు ఇచ్చేశాయి. ఆ డబ్బుతో ఉడాయించిన వినియోగదారుల మోసాలు తెలుసుకుని బ్యాంకు అధికార్లు ఘొల్లుమంటున్నారు. ఇసుకమేటలు వేసిన భూములకు, ఎకరాల కొద్ది ఇసుకపర్ర భూముల్లో మొక్కలు పెంచుతున్నామని చూపిస్తే కోట్లాది రూపాయల రుణాలు బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు మోసగాళ్లు బ్యాంకులను మోసం చేసి పరారవుతున్నారు. ఆమ్యామ్యాలు లక్షల్లో ఉండటంతో ఆ రికార్డులను సరిగ్గా చూసుకోకుండా మంజూరు చేయటం, ఆనక వినియోగదారుడు కనిపించలేదని పోలీసులను ఆశ్రయించటం ఇక్కడ పరిపాటి అయ్యింది. ఎక్కువగా కేసు పెట్టడానికి కూడా బ్యాంకు అధికారులు ఇష్టపడటం లేదు. ఎందుకంటే తమ గుట్టు కూడా బయటపడుతుందని వారు భయపడుతున్నారు. గ్రామీణబ్యాంకులు, సొసైటీలిమిటెడ్‌లు ఇలా నష్టపోయాయని అంచనా.

కేంద్ర నిధుల కోతతో కునారిల్లుతున్న గ్రామాలు?

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవటం వల్ల గ్రామాల్లో అభివృద్థి కుంటుపడుతోంది. పంచాయతీ పాలకులు లేకపోవటంతో కేంద్రం నిధులు మంజూరు చేయటం లేదు. దీంతో గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. స్పెషలాఫీసర్ల పాలనలో ప్రతీఏటా విడుదలయ్యే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. పదినెలల క్రితమే పంచాయతీల్లో సర్పంచ్‌లు, సభ్యులు పదవీకాలం పూర్తయినా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోలేదు. కనీసం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా ప్రకటించలేకపోయింది. ఉప ఎన్నికల్లో ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉండటంతో ఆర్నెళ్లపాటు ఈ ఎన్నికలకు దూరమయ్యేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ విషయాన్ని గమనించిన కేంద్రం ఈ అభివృద్థి నిధుల్లో కోతలు పెట్టింది. ఏడాదికి రెండు విడతలుగా విడుదలయ్యే ఈ నిధులు నాలుగువందల కోట్ల రూపాయలుండేది. అంటే విడతకు రెండొందల కోట్ల రూపాయలు కేంద్రం పంపించేంది. అయితే ఈసారి పంపించేదీ లేనిదీ కూడా తేల్చలేదు. 13వ ఆర్థికసంఘం నిధులు ఈ ఏడాది లేనట్లే అని కేంద్రంలో ఉన్న పెద్దలు తేల్చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఉన్న నిధులతో ఈ ఏడాది అభివృద్ధి చేసుకోమని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయని అధికారులు అంటున్నారు. మరి రాష్ట్రప్రభుత్వం ఈ చేదువార్తపై ఎలా స్పందిస్తుందో చూడాలని పంచాయతీ స్థాయి నేతలు ఎదురుచూస్తున్నారు.

అనంత విద్యార్థులకు అన్యాయం

ఒకప్పుడు కరువు విలయతాండవం చేసిన జిల్లా అనంతపురం. తల్లిదండ్రులు తమ పిల్లలు ఆకలికి తట్టుకోలేరని ప్రభుత్వపాఠశాలల్లో చేర్పించేవారు. అంతటి దయనీయమైన స్థితిలో ఉన్న ఆ జిల్లాలో ఇప్పుడు నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. 8మంది ఎంఇఓలు మధ్యాహ్నభోజన పథకం నిధులు ఉపయోగించుకోకపోవటంతో అవి వెనక్కివెళ్లిపోయాయి. రూ.31.96లక్షల రూపాయల నిధులు మురిగిపోయాయని పాఠశాల విద్యాసంచాలకుడు ఈ ఎనిమిది మందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ నివేదికను ఆయన కోరారు. దీంతో ఆ ఎనిమిది మంది ఎంఇఓలకు మెమోలు జారీ అవుతున్నాయి. అనంతపురం, హిందుపురం, కళ్యాణదుర్గం, గుడిబండ, అమరాపురం, బ్రహ్మసముద్రం, సి.కె.పల్లి, పరిగి మండలాల్లో విద్యార్థులకు అన్యాయం జరిగింది. హిందుపురం ఎంఇఓ వైఖరి కారణంగా రూ.17లక్షలు వెనక్కి వెళ్లాయి. విచిత్రంగా ఆయన లక్షరూపాయలు కావాలని ప్రతిపాదనలు పంపించారు. భోజనాలు తయారు చేసే ఏజెన్సీలకు చెల్లించాల్సిన నిధులు, కార్మికుల నిధులు వెనక్కి వెళ్లాయి. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి అనంత విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని విద్యాశాఖాధికారులు అంటున్నారు.

వెలుగుచూసిన ఎరువుల డీలర్ల అక్రమాలు

ఎరువుల డీలర్లు రైతులను పీల్చిపిప్పిచేసే జలగల్లా మారారు. తమ వ్యాపారాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఒకవైపు రైతులకు పిండి అప్పుగా ఇచ్చి ధాన్యం పండాక ఇచ్చిన దానికన్నా ఎక్కువ దోచుకుంటున్నారు. విత్తనాలు దాచేసుకోవటం, ఎరువులను తమకు తోచిన రీతిన సరఫరా చేయటం వీరికి ఉన్న హక్కు. కృత్రిమకొరత ఏర్పడటానికీ వీరు ప్రధానకారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం విజిలెన్స్‌ దాడులకు ఆదేశాలివ్వటం రైతులకు ఊరట ఇచ్చే అంశం. ఈ దాడుల్లో ఒక్కరోజే రాష్ట్రంలో దాదాపు 8కోట్ల పైచిలుకు ఎరువులు, విత్తనాలు బయటకు వచ్చాయి. అలానే అక్రమాలకు అలవాటుపడ్డ డీలర్లు విజిలెన్స్‌ అధికారులపై ప్రతిదాడులకు దిగి గాయపరిచారు. ముందుగా దాడుల సమాచారం తెలుసుకున్న గుంటూరు జిల్లా మాచర్ల ఎరువుల వ్యాపారులు తమ దుకాణాలను మూసేశారు. ఈ దుకాణాల మూసివేత డీలర్ల నెట్‌వర్క్‌ను చాటుతోంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి అక్రమంగా దాచి ఉంచిన ఎరువుల బస్తాలు స్వాధీనం చేసుకుని డీలరుపై కేసు పెట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విజిలెన్స్‌దాడులు నిర్వహించింది. ఖమ్మం జిల్లాలో రెండు దుకాణాలు జప్తు చేశారు. నల్గొండ జిల్లాలో మూడు బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఒక దుకాణంపై దాడి చేసి 1224 ప్యాకెట్ల పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు, యర్రగొండపాలెం, గిద్దలూరుల్లో మూడు దుకాణాలు మూయించారు. వరంగల్‌ జిల్లాలో విత్తనాల దుకాణాలపై తహశిల్దార్‌ దాడులు చేశారు. మెదక్‌ జిల్లా రామాయంపేటలో విజిలెన్స్‌ దాడులు నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, కడియం, తాళ్లరేవుల్లో ఐదుకోట్ల రూపాయల విలువైన ఎరువులు, పురుగుమందులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగం ్‌ఖిల్లాఘనపురం, కొత్తకోటల్లో వ్యవసాయాధికారుల దాడులు జరిగాయి.కర్నూలులో రూ.70లక్షల విలువైన బిటి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. మెదక్‌జిల్లా నర్సాపురంలో రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖలు సమన్వయంగా దాడులు నిర్వహించాయి. కరీంనగర్‌ జిల్లా పెదపల్లి మండలం చిన్నకలువలో తనిఖీ అధికారులపై వ్యాపారులు దాడుల చేశారు. ఎఇఓకు గాయాలయ్యాయి. ఇంకా దాడులు కొనసాగించి డీలర్లను లొంగదీయాలని రైతులు కోరుతున్నారు.

రేవంత్‌రెడ్డి సెటిల్‌మెంట్‌ చేశాడు,తేల్చిన సిబిసిఐడి

మహబూబ్‌నగర్‌ జిల్లా తలకొండ మండలం చల్లంపల్లిలో 25ఎకరాల 26గుంటల భూమిని ఆక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భానుకిరణ్‌, డి.కృష్ణలతో పాటు స్థలయజమాని తుమ్మల సునీతను కూర్చోపెట్టి తెలుగుదేశం కొండగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సెటిల్‌మెంట్‌ చేశారని సిబిసిఐడి వెల్లడిరచింది. దీనికి సరైన ఆధారాలు లభించాయని ఆ విచారణ సంస్థ స్పష్టం చేసింది. భానుకిరణ్‌కు సంబంధించిన అన్ని భూదందాలపై సిబిసిఐడి విచారణ చేస్తోంది. దానిలో భాగంగానే ఈ భూవివాదం పూర్తి వివరాలను సేకరించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా తలకొండ మండలం చల్లంపల్లిలో తుమ్మల సునీత, ఆమె తండ్రి బోజిరెడ్డిలు ఈ 25ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొంత కాలం తరువాత సునీత అమెరికా వెళ్లిపోయారు. హైదరాబాద్‌లోనే ఉంటూ ఫైనాన్స్‌ వ్యాపారం చేసుకునే బోజిరెడ్డి అకస్మాత్తుగా మృతి చెందారు. సునీతకు చెందిన ఈ భూడాక్యుమెంట్లు భాను సంపాదించాడు. ఆయన ఆ భూమిని కాజేసేందుకు పథకం రచించాడు. వేరే మహిళను సునీత స్థానంలో చూపించి ఆమెను తీసుకువెళ్లి తమ పేరిట రిజిస్ట్రేషను చేయించుకున్నారు. డి.కృష్ణ, భాను చేసిన ఈ పని తెలుసుకున్న రేవంత్‌రెడ్డి సునీతను అమెరికా నుంచి రప్పించారు. తానే దగ్గర ఉండి వ్యవహారాన్ని సెటిల్‌ చేశారు. అయితే తన ప్రమేయం లేదని రేవంత్‌రెడ్డి అంటున్నారు.

కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న చిరంజీవి

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్‌ చిరంజీవి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నారా? పీఆర్పీ అధినేతగా సాధించలేనిది కాంగ్రెస్‌లో ఉంటే కలిసివస్తుందంటూ తానే ఢల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఇప్పుడు ఆ పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పుడో వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆహ్వానం పలికితే చాలా ఆలస్యంగా స్పందించిన చిరంజీవిని ఒకరకంగా కాంగ్రెస్‌ పార్టీ అక్కున చేర్చుకుంది. అందుకే రాజ్యసభ సభ్యత్వం కూడా ఆయనకు ఇచ్చింది. 2014 నాటికి ఏ నాయకుడూ కలిసి రాకపోతే చిరంజీవిని కాంగ్రెస్‌ పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంటుందని సోనియాగాంధీ భావించారు. అసలే ఉప ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా లేవని, రాష్ట్రపతి ఎన్నికలు కూడా ముంచుకొచ్చాయన్న ఆందోళనలో హడావుడిగా ఉన్న కాంగ్రెస్‌ అధిష్టానంపై చిరు చేసిన వ్యాఖ్యానాలు ఘాటుగా ఉన్నాయి. 2014 ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నాయకులు ఆశలు వదులేసుకున్నారని చిరు విమర్శించారు.     రామచంద్రపురం కాంగ్రెస్‌ కార్యకర్తలతో చిరు అవసరం లేని ప్రేలాపన పేలినట్లు అయింది. కాంగ్రెస్‌లో పీఆర్పీని కలిపేశాక ఇక విడిగా పీఆర్పీ ఎక్కడ ఉంది? అని తనను తాను ప్రశ్నించుకోకుండానే చిరు తొందరపడ్డారు. పైగా, రామచంద్రపురంలో మంత్రి తోట నర్సింహం, ఎంపి జివి హర్షకుమార్‌ తదితరులు ముందుండి మరీ త్రిమూర్తులు విజయానికి కృషి చేస్తే కాంగ్రెస్‌ను అవమానించటం చిరంజీవికే చెల్లింది. దీనికి తోడు అసలు నెగ్గటానికి అవకాశం లేని స్థితిలో తోట నర్సింహం ఒకవైపు కులసమీకరణలు చేస్తూనే తెలుగుదేశం ఓటుబ్యాంకును తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఇక హర్షకుమార్‌ అయితే తన సామాజిక వర్గ నేతలు (ఎస్సీలు) తోట విజయానికి ప్రధానపాత్రధారులు కావాలని నిజాయితీగానే కోరారు. వీరిద్దరూ ఒకరకంగా నియోజకవర్గంలో రాజకీయాలను పెద్దమలుపు తిప్పటమే కాకుండా కమ్మసామాజిక వర్గాన్ని, శెట్టిబలిజ సామాజికవర్గంలో ప్రతినిధులను ఆకర్షించటంలో సఫలమవడంతో  తోట విజయం సాధ్యమైంది. అసలు చిరంజీవి రానక్కర్లేదని తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించేంత బలంగా కాంగ్రెస్‌ పని చేసింది. ఇక  తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో చిరంజీవి పీఆర్పీ కార్యకర్తలతో సమావేశం కాకపోవటం, స్థానికంగా కొందరు పి.ఆర్‌.పి.నేతలు కాంగ్రెస్‌ అభ్యర్దిని వ్యతిరేకించటమే ఆ పార్టీ అభ్యర్ది ఓటమికి కారణమని తేలింది. అంటే తిరుపతి ఓటమికి చిరంజీవే ప్రధానకారణమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అసలు తప్పు తన కింద పెట్టుకుని చిరు పీఆర్పీని ఆదరించటం లేదని కాంగ్రెస్‌పై రుసరుసలాడటం ఒకరకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్లస్‌ అయ్యే అవకాశం ఉంది.