మా కొత్త పార్టీలోకి రావచ్చుగా...ప్లీజ్..

‘   నేను సీఎంగా ఉన్నప్పుడు మీరు అడిగిన పనులు చేశానుగా. ఈ సారి ఎన్నికల్లో మా పార్టీ తరపున పోటీ చేయొచ్చుగా. ఒక సారి వచ్చి కలిస్తే అన్నీ మాట్లాడుకుందాం’ పలు జిల్లాల్లోని ముఖ్యమైన నాయకులకు కిరణ్ కుమార్ రెడ్డి నుంచి వస్తున్న ఫోన్ల సారాంశమిది. ‘అన్న మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఒక సారి హైదరాబాద్‌కు వచ్చి కలవచ్చుగా’ అని కిరణ్ సోదరులు సంతోష్, కిషోర్ కూడా మరికొందరికి ఫోన్లు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల విషయంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డితో కిరణ్‌కు చెడింది. అప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్న ఆదాల సైకిలెక్కేందుకు వేగంగా నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ పార్టీ పెడతారో లేదోనన్న అనుమానాలు రావడంతో ఆయన వైపు నిలిచిన ఒకరిద్దరు నేతలు కూడా మెల్లగా జారుకున్నారు. దాదాపు ఇదే పరిస్థతి అన్ని జిల్లాల్లోనూ కనపడుతోంది. మరోవైపు ముహూర్తం (12వ తేదీ) ముంచుకురావడంతో ఆ రోజుకు స్టేజీ నిండేంత మంది నేతలను పోగేయడానికి రంగం సిద్ధమవుతోంది.

రండి బాబు రండి..టికెట్లిస్తాం బాబూ.. రండి బాబు రండి....

  తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. కానీ అభ్యర్థులు దొరక్క పార్టీలు తల పట్టుకుంటున్నాయి. కోనసీమలోని ఏకైక మున్సిపాలిటీ అమలాపురంలో తెలుగుదేశం అభ్యర్థి ఎంపికలో మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుకు తలబొప్పి కడుతోంది. తన అనుచరులే ఇద్దరు పోటీపడుతుండటంతో ఎవరికి బొట్టు పెట్టాలో తెలియని అయోమయంలో ఆయన ఉన్నారు. కాంగ్రెస్‌లో అయితే పార్టీ తరఫున పోటీ చేయమని బతిమలాడుతున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగానైనా బరిలోకి దిగుతాము తప్పితే కాంగ్రెస్ నుంచి పోటీచేసేది లేదని చాలామంది తెగేసి చెబుతున్నారు.   తుని, పెద్దాపురంలలో టీడీపీ, తునిలో చైర్మన్ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించాయి. పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్న తరుణంలో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ మున్సిపల్ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. మండపేట మున్సిపాలిటీలో 29 వార్డులుండగా ఇంతవరకూ ఏ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయింది. పార్టీ నాయకులతో వార్డు స్థాయిలో రోజుకు నాలుగైదు ప్రాంతాల్లో భేటీలు జరుగుతున్నాయి. ఈ రకంగా దాదాపు అన్ని మున్సిపాలిటీలలోను అభ్యర్థుల ఎంపిక కోసం నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ప్రకాశం కాంగ్రెస్ ఖాళీ?

  ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ఖాళీ అవుతోంది. డీసీసీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ ఇప్టికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, వివిధ పదవుల్లో కొనసాగుతున్న నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా క్రమంగా కాంగ్రెస్ కు దూరం అవుతున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి కూడా అదే దారిలో ఉన్నట్లు సమాచారం. వీళ్లతో పాటు మాజీ మునిసిపల్ చైర్మన్ నుంచి సర్పంచ్‌ల వరకు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కూడా ఏదో ఒక దారి చూసుకుంటున్నారు. ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభావంతో ఎక్కువ మంది జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే మరికొందరు మాత్రం సైకిల్ ఎక్కే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ మరిన్ని చిత్రాలు వెలుగుచూసేలా ఉన్నాయి.

మెగా సమస్యకు పరిష్కారం ఉందా?

  పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంతో మెగా కుటుంబంలో, మెగాభిమానులలో చీలికలు రానున్నాయి. ఇటువంటి పరిస్థితులని నివారించడానికి నేటికీ రెండు మార్గాలున్నాయి. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రవేశం ఆలోచన విరమించుకోవాలి లేదా చిరంజీవి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తమ్ముడుకి అండగా నిలబడాలి. ఈ రెంటిలో రెండవ ఆలోచనే ఇద్దరికీ శ్రేయస్కరం. వారిరువురూ చేతులు కలిపితే రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ వంటి నిజాయితీపరుడు, రాజకీయాలలోకి రావాలనుకొన్నపుడు, చిరంజీవి కుటుంబ సభ్యులు అతనిని వారించే ప్రయత్నాలు చేసే బదులు, అతనికి అండగా నిలబడితే ప్రజలందరూ హర్షిస్తారు.   చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రమంత్రి అయి ఉండవచ్చు గాక, కానీ ఆయన నాలుగు దశాబ్దాలుగా రేయింబవళ్ళు కష్టపడి సంపాదించుకొన్న పరువు ప్రతిష్టలు, సమాజంలో గౌరవం అన్నీకూడా కేవలం రెండేళ్ళలోనే పూర్తిగా మసకబారిపోయాయి. అవినీతిమయమయిన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక తప్పయితే, రాహుల్ గాంధీ కోసం రాష్ట్రాన్ని విడదీస్తున్నపటికీ, తమ అభిప్రాయాలకు పూచికపులెత్తు విలువీయకపోయినప్పటికీ, తన స్వంత పార్టీ నేతల రాజకీయ జీవితాలని, భవిష్యత్తుని సర్వనాశనం చేసినప్పటికీ, ముఖ్యమంత్రి పదవి కోసం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చంపుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం మరో పెద్ద తప్పు. కాంగ్రెస్ పార్టీలో తెలుగు వాళ్ళకు ఎంత గౌరవ మర్యాదలున్నాయో ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొన్న తరువాత కూడా ఇంకా ఆ పార్టీ అధిష్టానానికి సలాములు చేస్తూ గులాములా ఎందుకు కొనసాగాలి? అని ప్రశ్నించుకోవాలి.   ఒక పరాయి (దేశ) వ్యక్తి అయిన సోనియాగాంధీ ముందు తలవంచగా లేనిదీ రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు కోసం తన అహం, బేషజం పక్కనబెట్టడం పెద్ద కష్టమయిన పనేమీ కాదు. పైగా దానివలన ప్రజల దృష్టిలో అయన గౌరవం పెరుగుతుందే తప్ప తరగదు. అందువల్ల ఇప్పటికయినా చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అండగా నిలబడితే ప్రజలు, అభిమానులు కూడా హర్షిస్తారు. తమ్ముడు రూపంలో వచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనే బదులు అతనికి అడ్డంకులు సృష్టిస్తే, దానివలన ఆయనే ప్రజల దృష్టిలో మరింత పలుచన అవుతారు. ఇటువంటి పరిస్థితిని నివారించడం ఇప్పుడు ఆయన చేతిలోనే ఉంది.   ఆయనకంటే కాంగ్రెస్ అధిష్టానానికి వీరవిధేయులు, తలపండిన నేతలే పార్టీ తమకు ద్రోహం చేసిందని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అటువంటప్పుడు నిన్నగాక మొన్న పార్టీలో చేరిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి, దాని అధిష్టానానికి ఆత్మాభిమానం వదులుకొని ఊడిగం చేయనవసరం లేదు. నిజం చెప్పాలంటే ఆయన ఎంత ఊడిగం చేసినా ఆయన ఎన్నడూ ముఖ్యమంత్రి కాలేరు. ఆవిషయం మొన్ననే ఆయనకి అనుభవం అయింది కూడా. ఇక అటువంటప్పుడు మునిగిపోయే టైటానిక్ షిప్ వంటి కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎందుకు కొనసాగాలో ఆయనే ఆలోచించుకోవాలి.   ఆయన కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన్నఆ టైటానిక్ షిప్ మల్లెపూల నావలా ఎన్నికలలో తేలుతూ సాగిపోదు. అలాగని వదిలిపెట్టినా అది మునిగిపోకా మానదు. ఆ టైటానిక్ షిప్పుని పట్టుకొని వ్రేలాడితే దానితో బాటు ఆయన కూడా మునగడం ఖాయం. దేశముదురు కాంగ్రెస్ నేతలందరికీ తమ షిప్ మునిగితే ఈదుకొని క్షేమంగా ఏవిధంగా ఒడ్డున పడాలో బాగా తెలుసు. కానీ, అది తెలీని చిరంజీవి వంటి వారే ఆ టైటానిక్ క్రింద మునిగిపోయే ప్రమాదం ఉంది. గనుక అది ఇంకా మునగక ముందే మళ్ళీ లైఫ్ (బోట్) ఇస్తున్న పవన్ చెంతకి చేరి క్షేమంగా బయటపడటం మేలేమో ఆయనే ఆలోచించుకోవాలి.

పవన్ పార్టీకి మద్దతివ్వను: చరణ్

      పవన్ కళ్యాణ్ కొత్త పార్టీపెడతారన్న ప్రచారం నేపధ్యంలో రామ్ చరణ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ బాబాయి కొత్త పార్టీ పెట్టినా తన మద్దతు నాన్న చిరంజీవికేనని ఆయన స్పష్టం చేశారు. "బాబాయ్ దారి బాబాయ్‌దేనని... నా దారి నాదే''నని అన్నారు. తన మద్దతు నాన్నకే ఉంటుందని స్పష్టం చేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, రాజకీయాలపై తనకు అవగాహన లేదని రామ్ చరణ్ తేజ అన్నారు. ఎవరి దారులు వారికి ఉంటాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీలో ముసలం సాగుతోందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నా....మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్, నాగ బాబు అలాంటివేమీ లేవు అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నారు.

పవన్ పొలిటికల్ ఎంట్రీ 14న..!!

      ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ నాయకుల చూపులన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ మీదనే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ అరంగేట్ర విషయాన్ని వాయిదా వేసుకుంటూ పోతున్నారు. మొన్న 9వ తేది మీడియా ముందుకు వస్తానన్న పవన్..ఇప్పుడు దానిని 14వ తేదికి మార్చినట్లు సమాచారం. దీనికి సంబందించి మాదాపూర్ హైటెక్స్ లో అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లును పివిపి సంస్థ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అదే రోజున రాజకీయాలపై తాను రాసిన పుస్తకాన్ని రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం 6.30 గంటల నుండి 7.15 వరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి..ఆ వేదికపై పవన్ ఒక్కడే తన అభిప్రాయాల్ని తెలియజేయనున్నారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆహ్వానాలు అందాయి. అయితే ఆయన ఏ బుల్లెట్ పేల్చబోతున్నారనే దానిపై అభిమానులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

టీటీడీపై మండిపడ్డ జయసుధ

      తిరుమలలో టీటీడీ సిబ్బంది తీరుపై సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ మండిపడ్డారు. తిరుమలలో డిక్లరేషన్ తీసుకోవాలని టీటీడీ సిబ్బంది తనపైన ఒత్తిడి తెచ్చారని, అందుకే డిక్లరేషన్ పైన సంతకం చేశానని అన్నారు. అయితే డిక్లరేషన్ తీసుకోవాలని జయసుధపై ఎలాంటి ఒత్తిడి తెలేదన్న టీటీడీ ఈవో గోపాల్ వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. అసలు తిరుమలలో టీటీడీ ఆఫీసు ఎక్కడ వుందో తనకు తెలియదని, అలాంటిది తాను అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ పై సంతకం ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. నేను తప్ప, మా కుటుంబ సభ్యులంతా హిందువులేనని అన్నారు. అనుమానం రావడానికి తానేమైనా ఉగ్రవాదినా అని జయసుధ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి ఒక రూలు..తమకో రులా అని ఆమె ప్రశ్నించారు. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటామన్న టీటీడీ, ఎందుకు తీసుకోలేదని అడిగారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.

కాంగ్రెస్ వెర్సెస్ కాంగ్రెస్

  కాంగ్రెస్ నేతలు చాలా మంది తమ పార్టీని దేశంలో ఏ ఇతర పార్టీ ఓడించలేదని, కేవలం తమని తాము ఓడించుకొన్నపుడే ఇతరులు విజయం సాధిస్తుంటారని చాలా గర్వంగా చెప్పుకొంటుంటారు. వారి మాట అక్షరాల నిజమని అనేక సార్లు నిరూపించబడింది. మళ్ళీ రేపు ఎన్నికలలో మరోమారు నిరూపింప బడబోతోంది. అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ తనని తాను ఓడించుకోవడానికి గతంలో లాగ గ్రూపులుగా విడిపోయి కొట్టుకోకుండా, ఈసారి మరి కొంచెం ఆధునిక పద్దతిలో పార్టీలుగా విడిపోయి కొట్టుకోబోతోంది. అయితే ఈసారి ఓడిపోయేందుకు గాక గెలిచేందుకే అలా విడిపోయి తనలో తాను పోరాడుకొంటున్నట్లు నటిస్తోంది. కానీ కాంగ్రెస్ నేతల మాట ఎన్నడూ వమ్ము కాలేదు. కనుక ఈసారి కూడా కాంగ్రెస్ తనని తాను ఓడించుకొని రాష్ట్రంలో, దేశంలో ప్రతిపక్షాలను గెలిపించబోతోంది.   రాష్ట్ర విభజన చేసినందుకు ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజలు, ఇంకా పార్టీని  పట్టుకొని వ్రేలాడుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర విభజనను సమర్ధిస్తూ, ప్యాకేజీల గురించి మాట్లాడటం చూసి కాంగ్రెస్ పార్టీపై మరింత రగిలిపోతున్నారు. బహుశః ఈ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ వ్యతిరేఖతను మరింత పెంచి పోషించి, కొత్తగా పార్టీ పెడుతున్న కిరణ్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకొన్న జగన్మోహన్ రెడ్డి కి కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లు దండిగా పడాలని ఉద్దేశ్యపూర్వకంగానే వారు ఆవిధంగా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దానివలన వారాశించిన ఫలితం రాకపోగా, పూర్తి వ్యతిరేఖ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.   ఎందువలన అంటే, లగడపాటి, పురందేశ్వరి, హర్ష కుమార్, ఉండవల్లి, కిరణ్ కుమార్ రెడ్డి వంటి కరడు గట్టిన కాంగ్రెస్ వాదులే తమ పార్టీ జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకొందని చెపుతున్నారు. మళ్ళీ వారిపై ఇప్పుడు కాంగ్రెస్ లో మిగిలిన బొత్స, డొక్కా,కొండ్రు, రఘువీరా వంటి నేతలు కిరణ్, జగన్ ఇద్దరూ అవకాశ వాదులని, వారిరువురూ ప్రజలను వంచిస్తున్నారని పదేపదే గట్టిగా వాదిస్తున్నారు.   ఈవిధంగా కాంగ్రెస్ నేతలు పార్టీలుగా విడిపోయినప్పటికీ, అలా ఎందుకు విడిపోయారో మరచి పోయి, ఒకరి చరిత్రలు మరొకరు బయటపెట్టుకొని, ప్రజలకి వారి నాటకం కళ్ళకు గట్టేవిధంగా వారే ప్రదర్శించుకొని వారిని వారే ఓడించుకొబోతున్నారు. కొందరు మనుషులు జీవితంలో త్వరగా పైకి ఎదగడానికి అడ్డు దారులు త్రొక్కి అదః పాతాళానికి పడిపోతుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక వినాశాకరమయిన ప్రయోగం చేస్తోందిపుడు. దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికే స్పష్టంగా కనబడుతున్నాయి. తమని తామే ఓడించుకొంటామనే కాంగ్రెస్ నేతల మాట ఎన్నడూ వమ్ము కాదని ఎన్నికల తరువాత వారే నిరూపిస్తారు.

కొత్త ప్లేయర్స్ ఎవరు ఎవరితో ఆడుకొంటారు?

  తెలుగు ప్రజల సేవ చేసుకొని తరించాలని తపించిపోతున్నమరో అరడజను కొత్త పార్టీలు తరలి వస్తున్నాయి గనుక వాటిలో ఇప్పుడు ఏ పార్టీ చేత సేవచేయించుకోవాలో ఎంచుకొనే చాయిస్ ప్రజలకి దొరుకుతోంది. అయితే ప్రజాసేవ చేసేందుకు తెగ ఆరాటపడిపోతున్నఈ పార్టీలు తమతో పోటీలో ఉన్న ఇతర పార్టీలకు మాత్రం ఎసరు పెట్టేయడం ఖాయం.   ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టబోయే పార్టీని తీసుకొంటే, గత ఎన్నికలలో మెగా బ్రదర్ చిరంజీవి తేదేపాకు గండి కొట్టినట్లే, ఈసారి కూడా తేదేపాకు పవన్ బాబుతో మెగా ప్రాబ్లెం రావచ్చును. అందువల్ల తెదేపా మళ్ళీ తన టైగర్లని, సింహాలని ముందుకు తీసుకు వచ్చి తన స్టార్ పవర్ అంతా ధారపోసి పోరాడవలసి ఉంటుంది.   ఇక మొన్నటి దాక గాలిలో బ్యాటు తిప్పుతూ అదిగో లాస్ట్ బాల్..ఇదిగో లాస్ట్ బాల్ అంటూ కనబడని ఆ బాల్స్ అన్నిటినీ ఫోర్లు,సిక్సర్లు బాదిపడేసిన కెప్టెన్ కిరణ్, విడిపోతున్న రాష్ట్రంలో సమైక్యగానం ఆలపిస్తూ గాయపడిన ప్రజల హృదయాలకు ఏదో మందు పూసేందుకు వస్తున్నట్లు ప్రకటించేరు. ఆయన టీం వేరే కలర్ టోపీలు, డ్రెస్సులు, వేసుకొస్తున్నపటికీ అది (హోం టీమ్) టీమ్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొనే గ్రౌండ్లోకి దిగుతోందని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ టీమ్ ముందు ‘హోం టీమ్’ తోనే ఆడుకొని వైడ్ బాల్స్ నో బాల్స్ తో రన్స్ సంపాదించుకొనే ప్రయత్నం చేస్తుంది. పనిలో పనిగా తనలాగే హోం టీమ్ తో మ్యాచు ఫిక్సింగ్ చేసుకొని అదే గ్రౌండ్లో తెలుగు తమ్ముళ్ళతో గేమ్ ఆడుకొంటున్న వైకాపా టీమ్ పై కూడా గుగ్లీలు విసురుతూ అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అవుట్ చేయబోదు.   ఇక డ్రీం బాయ్ బొత్స నేతృత్వంలో హస్తం పట్టుకొని గ్రౌండులోకి వస్తున్న హోమ్ టీమ్ కాంగ్రెస్ లో మిగిలిన వారు అందరూ ఫుట్ బాల్ తో క్రికెట్, క్రికెట్ బాల్ తో బాస్కెట్ బాల్ అఆడగల సమర్దులు గనుక, గ్యాలరీ ఉన్న ప్రేక్షకులకి ఏవో ప్యాకేజీలు ఇచ్చి టోపీలు పెట్టి మ్యాచ్ గెలిచేందుకు గట్టిగా కృషి చేస్తారు. ఈ మూడు (కాంగ్రెస్) టీమ్స్ కి కూడా పవన్- ఎఫ్ఫెక్ట్ తప్పదు.   అయితే కిరణ్, జగన్, బొత్స ప్రజాసేవ చేసేందుకు తమలో తాము పోరాడుకొంటుంటే, మధ్యలో తెలుగు తమ్ముళ్ళుకొంత మేర లాభపడే అవకాశం ఉంది. ఎందుకంటే వారందరూ విడివిడిగా ఆడుతున్నపటికీ అందరూ కూడా ఒకే కాంగ్రెస్ టీమ్ తరపునే ఈ మ్యాచ్ ఆడుతున్నారని గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొడుతున్న ప్రేక్షకులకి అందరికీ తెలిసు.   ఇక గ్రౌండ్ క్లీన్ చేసేందుకు చీపురు పట్టుకొని వస్తున్న ఆమాద్మీ టీం, అందరూ ఫౌల్ గేమ్ ఆడుతున్నారని విజిల్ వేసే లోక్ సత్తా, నల్ల జెండాలు పట్టుకొనొస్తున్న మందకృష్ణ మాదిగ, సీమ సింహం బైరెడ్డి అందరూ తలా పిడికెడు ఓట్లు పట్టుకుపోవడం ఖాయం గనుక, తెదేపా, వైకాపాలకు మెజార్టీ ఓట్లు, సీట్లు సంపాదించుకోవడం కష్టమే అవుతుంది.

రాజకీయాలకు దగ్గుబాటి గుడ్ బై

      ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ రోజు తన అనుచరులతో సమావేశమైన దగ్గుబాటి భవిష్యత్తు కార్యాచరణపై చర్చి౦చినట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఆయన భార్య పురందేశ్వరి బిజెపి అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. నిన్ననే దగ్గుబాటి దంపతులిరువురూ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించి, మళ్ళీ ఇంతలోనే ఆయన మనసు మార్చుకొని ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకొంటున్నట్లు ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పరుచూరు శాసనసభ నియోజక వర్గం నుండి మళ్ళీ పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్లు సమాచారం. అదేవిధంగా గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేసినందున, త్వరలో బీజీపీ సీమాంధ్ర శాఖను ఏర్పాటు చేసినట్లయితే ఆయనకు పార్టీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కూడా ఉంది. ఇటువంటి మంచి తరుణంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకోవాలని భావించడం వెనుక బలమయిన కారణాలే ఉండి ఉండవచ్చును.  

నెల్లూరు టీడీపీలో ఆదాల x మాగుంట

  నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి పేరు ఖాయమైందన్న తరుణంలో తాజాగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి త్వరలోనే టీడీపీలో చేరనున్నారని, ఈ మేరకు బాబుతో చర్చలు ముగిశాయని సమాచారం. మాగుంటకు ఆంతరంగికులైన గోపాల్‌రెడ్డి, మస్తాన్‌రెడ్డి గత ఆదివారం టీడీపీ అధినేతను కలిసి శ్రీనివాసులురెడ్డి పార్టీలో చేరే విషయమై చర్చించారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి కూడా చెన్నైలో మాగుంటతో మంతనాలు సాగించారు. చంద్రబాబుతో మాగుంట శ్రీనివాసులురెడ్డికి బలమైన వ్యక్తిగత సంబంధాలున్నాయి. మాగుంట బలంగా పట్టుబడితే ఆయనకు టికెట్ దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే జరిగితే ఆదాల పరిస్థితి ఏంటో అనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ముఖ్యనేత కంభంపాటి రామమోహన్‌రావు అండదండలు ఆదాలకు బలంగా ఉన్నాయి. తాను ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు ఇప్పటికే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీ స్థానం ఆదాలకా? మాగుంటకా ? అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిత్వం టీడీపీ నుంచి ఎవరికి లభిస్తోందో చూడాల్సిందే. ఇక నెల్లూరు రూరల్ నియోజక వర్గానికి కొత్తతరం నాయకుడిగా ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డిని రంగంలో దించుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇందులో ట్విస్టు ఏమిటంటే, ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అంటున్నారు.

దేశం బాటలో సీమ నేతలు

  ఎన్నికల వేడి మొదలైంది. కొత్త పార్టీలు వస్తున్నాయి, సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు కూడా వచ్చేసింది. నాయకులు నెమ్మదిగా ఎవరికి వాళ్లు జంపింగులు మొదలుపెట్టారు. రాయలసీమ ప్రాంతంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి, ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో తగిన గుర్తింపు లేకుండా పడి ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు ఈ దిశగా పయనిస్తున్నట్లు సమాచారం. తాజాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో మాజీ మంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు వీళ్ల మంతనాలు సాగాయి. జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికే దేశంలో చేరికపై ఓ నిర్ణయం తీసేసుకున్నారు. ఆయన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులతో భుజాలు కలుపుకుని తిరుగుతున్నట్లు సమాచారం. ఇక మరో మాజీ మంత్రి డీఎల్ కూడా చంద్రబాబు వద్దకు వెళ్లడం, ఇంతకుముందే ఆయన ఓ విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోయడం చూస్తుంటే ఆయన కూడా నిర్ణయం తీసేసుకున్నట్లే కనిపిస్తోంది. ఇక ప్రకటించడమే తరువాయి.   చంద్రబాబు కూడా కాంగ్రెసోళ్లందరూ చెడ్డోళ్లు కారని, వాళ్లలో మంచివాళ్లను మాత్రమే తాము చేర్చుకుంటున్నామని చెప్పారు. ఇక తెలంగాణ జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరీ అనుకున్నంత ఏమీ బలహీనంగా లేదు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు. మెదక్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ బట్టి జగపతి, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి చెందిన వై.మురళీధర్‌రెడ్డి గురువారం టీడీపీలో చేరారు.

చిత్తూరులో పార్టీల ముమ్మర కసరత్తు

  చిత్తూరు జిల్లాలో మునిసిపల్ ఎన్నికల సందడి పూర్తిస్థాయిలో కనిపిస్తోంది. ఎన్నికలు అన్ని పార్టీల నేతలను పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రధాన పార్టీలు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల చైర్మన్లు, చిత్తూరు కార్పొరేషన్‌కు మేయర్ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. నామినేషన్లు వేసేందుకు గడువు దగ్గర పడుతుండడంతో మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు వార్డుల వారీగా, రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల జాతకాలను పరిశీలిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న ఒకే ఒక కార్పొరేషన్ చిత్తూరు కావడంతో అందరి దృష్టీ చిత్తూరు పైనే ఉంది. టీడీపీ రాష్ట్ర నాయకత్వం మేయర్ అభ్యర్థి ఎంపికతోపాటు డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలుపు గుర్రాలను పట్టుకునేందుకు నానా తంటాలు పడుతోంది. అదే సమయంలో వైఎస్సాఆర్ సీపీ డివిజన్ల వారీగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది. మాజీ ఎమ్మెల్యే సీకేబాబు తన భార్యను మేయర్ అభ్యర్థిగా దించుతారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో 50 డివిజన్లలో తమ ప్యానల్‌గా బరిలోకి దిగే దీటైన అభ్యర్థులు ఎవరనే కసరత్తును ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇలా ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారు మేయర్ అభ్యర్థితోపాటు, కార్పొరేటర్లుగా పోటీచేసే వారి జాబితాను రెండురోజుల్లో ఖరారు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కిరణ్ పార్టీ వెనక టీడీపీ నేతలు

  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం ఖాయమైపోయింది. ఇంతకుముందే కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద ‘జై సమైక్యాంధ్ర‘ పేరుతో రిజిస్టర్ చేసిన పార్టీనే కొనసాగించాలని కిరణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ గుర్తును ‘చెప్పు‘ అని చెబుతున్నారు. ఈ పార్టీ ఏర్పాటుకు చిరునామాను తూర్పుగోదావరి జిల్లా మాచవరంగా పేర్కొన్నారు. ఇంతకీ ఈ పార్టీ వెనక ఉన్నది ఎవరో తెలుసా.. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీలు. పార్టీని ముందుగా రిజిస్టర్ చేసింది మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి రావు. ఆయనతో పాటు మరో మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర కూడా పార్టీ కసరత్తులో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ తోడల్లుళ్లు. మరో విశేషం ఏమిటంటే, ఇటీవలి కాలంలో చంద్రబాబుతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న నందమూరి హరికృష్ణకు చుండ్రు శ్రీహరి వియ్యంకుడు. వీరిద్దరితో పాటు ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్ సూచనలతోనే తొలి సభను రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని కిరణ్ నిర్ణయించారు. ఇప్పటికే కొత్త పార్టీకి సంబంధించిన జెండాలు, ఇతర ప్రచార సామగ్రి తయారీ పూర్తయింది. ఈనెల 12న రాజమండ్రిలో జరిగే సభలో టీడీపీకి చెందిన ఈ మాజీ ఎంపీలతోపాటు మరి కొంతమంది నాయకులు పాల్గొంటారని తెలుస్తోంది. కిరణ్ కొత్తపార్టీ ప్రకటన సమయంలో ఆయన వెంట కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ రాయపాటి సాంబశివరావు లేరు. మీడియా సమావేశం తర్వాత కిరణ్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కిరణ్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఇంతకుముందు కిరణ్ పార్టీ తరఫున తాను గుంటూరు ఎంపీ పదవికి పోటీ చేస్తానని కూడా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాన్ రాజకీయ ప్రవేశంపై వేడివేడి తాజా వార్త!!!

  పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పుడే ఒక వేడివేడి సమాచారం అందింది. ఆయన ఈ ఆదివారం ప్రెస్ మీట్ పెట్టడం లేదు. కానీ, ఆ దగ్గరలోనే ఓ మంచి రోజు చూసుకొని ( బహుశః బుదవారం, ఏకాదశి) కొత్త పార్టీ ప్రకటించడం ఖాయమని అభిజ్ఞవర్గాల తాజా సమాచారం. మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు పార్టీని స్థాపిస్తున్నట్లు లాంచనంగా ప్రకటించినప్పటికీ, ఆయన మార్చి 12న రాజమండ్రీలో బహిరంగ సభలో కొత్తపార్టీ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పడం గమనిస్తే, ఆరోజు ఏకాదశి గనుక పవన్ కళ్యాణ్ కూడా అదే రోజు పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటిస్తారేమో!   ఇంతవరకు చిరంజీవి మరియు మెగా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ పై పార్టీ పెట్టవద్దని తీవ్ర ఒత్తిడి తేవడం వలన ఆయన రాజకీయాలలోకి రాకపోవచ్చని వార్త ప్రచారంలోకి వచ్చినా, ముందే చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఒకసారి కమిట్ అయితే ఇక కష్టమయినా, నష్టమయినా వెనక్కి తగ్గరని నిరూపిస్తూ కొత్తపార్టీ స్థాపనకే సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇక కొత్త పార్టీ పేరు రిజిస్టర్ చేయించడం, లోగో, జెండా, అజెండా, మ్యానిఫెస్టో, తదితర ఏర్పాట్లన్నీఇప్పటికే పూర్తయిపోయాయని ఈలోగా మిగిలిన పనులు కూడా చక్కబెట్టి పార్టీని ప్రకటించాలని పవన్ కళ్యాణ్ మరియు ఆయన సన్నిహితులు భావిస్తున్నట్లు సమాచారం.   ఇక అన్నిటికంటే మరొక ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, ప్రజారాజ్యం ప్రయోగం విఫలమవడంతో చాలా బాధపడిన పవన్ కళ్యాణ్ మన రాజకీయ వ్యవస్థలో తను చూసిన లోపాలను, వాటికి తనదయిన శైలిలో పరిష్కారాలు, రాజకీయ వ్యవస్థలో రావలసిన మార్పులు గురించి తన మనసులో భావనలకు అక్షర రూపం ఇచ్చారు. తన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇప్పుడు ఆయన వ్రాసిన పుస్తకావిష్కరణ కూడా చేసేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఏమయినప్పటికీ, పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంతో మళ్ళీ రాష్ట్ర రాజకీయాలలో కలకలం మొదలవడం ఖాయం. ఒకేసారి కిరణ్, పవన్ పార్టీలు ఆవిర్భవిస్తే ఇక రాజకీయాలలో సందడే సందడి.

రాజమండ్రిలో 12న కిరణ్ కొత్త పార్టీ

      మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన బుధవారం నాలుగు గంటలకు రాజమండ్రిలో బహిరంగ సభ ద్వారా పార్టీ పేరును, విధివిధానాలను ప్రకటిస్తామని తెలిపారు. గాయపడిన తెలుగువాడి హృదయాలకు ఉపశమనం కలిగించేందుకు పార్టీని నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణే ప్రధానంగా కొత్త పార్టీ స్థాపించాలని నిర్ణయించామని చెప్పారు.   విభజనకు కారణమైన పార్టీలే నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయన్నారు. వారికి అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమం పట్టదన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలది అధికార దాహమే అన్నారు. తమ పార్టీ లక్ష్యం మాత్రం తెలుగు వారి గుండె చప్పుడు వినిపించేందుకే అన్నారు. తెలుగు వారి ప్రతిస్పందనలే తమ పార్టీ ప్రణాళికలని చెప్పారు. తాను పదవులు వదులుకొని పార్టీ పెడుతున్నానని చెప్పారు. అలాంటప్పుడు పదవుల కోసమే పార్టీ అనడంలో అర్థం లేదన్నారు.

'ప్రశ్నించడం' కోసం వస్తున్న పవన్!

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతానని ప్రకటించిననాటి నుండి మీడియాలో చెలరేగిన ఊహాగానాలు, విశ్లేషణలకు ఈ నెల తొమ్మిదో తేదిన తెరపడనుంది. అదే రోజున పవన్ రాజకీయాలపై తనకున్న అవగాహనను, అనుభవాలను పుస్తకం రూపంలో ప్రజల ముందుకు తీసుకురానున్నారు. పదవి కోసం కాదు..ప్రశ్నించడం కోసమే అనే నినాదంతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ పార్టీ అభ్యర్ధులు రెండు రాష్ట్రాలలోను పోటీ చేయనున్నారు. 9 లోక్ సభ, 40 శాసన సభ స్థానాలలో ఇండి పెండెంట్లుగా అభ్యర్ధులు బరిలోకి దిగనున్నారు. పవన్ కళ్యాణ్ మల్కాజిగిరి లేదా ఏలూరు నుంచి పోటీ చేయవచ్చని సమాచారం.

విభజనకు వ్యతిరేకంగా 12 పిటీషన్లు

      రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 12 పిటీషన్లు దాఖలైనట్లు సమాచారం. వీటిపై శుక్రవారం సుప్రీం విచారణ చేపట్టనుందని న్యాయవాది రమేష్ తెలిపారు. ఇంతకుముందే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పిటీషన్లు వేశారు. అయితే అప్పటికి తెలంగాణ విభజన ప్రక్రియ పూర్తికాలేదు. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోలేదని వాటిని తోసిపుచ్చింది. పార్లమెంటు ఓ నిర్ణయం తీసుకునే సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవని, నిర్ణయం తీసుకున్న తరవాత తాము వాటిని పరిశీలిస్తాం అని కోర్టు తెలిపింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అపాయింటెడ్ డే కూడా ప్రకటించారు. విభజన ప్రక్రియ ఇప్పుడు చట్టరూపం దాల్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.