కిరణ్ పార్టీ వెనక టీడీపీ నేతలు
posted on Mar 7, 2014 7:42AM
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం ఖాయమైపోయింది. ఇంతకుముందే కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద ‘జై సమైక్యాంధ్ర‘ పేరుతో రిజిస్టర్ చేసిన పార్టీనే కొనసాగించాలని కిరణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ గుర్తును ‘చెప్పు‘ అని చెబుతున్నారు. ఈ పార్టీ ఏర్పాటుకు చిరునామాను తూర్పుగోదావరి జిల్లా మాచవరంగా పేర్కొన్నారు. ఇంతకీ ఈ పార్టీ వెనక ఉన్నది ఎవరో తెలుసా.. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీలు. పార్టీని ముందుగా రిజిస్టర్ చేసింది మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి రావు. ఆయనతో పాటు మరో మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర కూడా పార్టీ కసరత్తులో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ తోడల్లుళ్లు. మరో విశేషం ఏమిటంటే, ఇటీవలి కాలంలో చంద్రబాబుతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న నందమూరి హరికృష్ణకు చుండ్రు శ్రీహరి వియ్యంకుడు. వీరిద్దరితో పాటు ఉండవల్లి అరుణ్కుమార్, హర్షకుమార్ సూచనలతోనే తొలి సభను రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని కిరణ్ నిర్ణయించారు. ఇప్పటికే కొత్త పార్టీకి సంబంధించిన జెండాలు, ఇతర ప్రచార సామగ్రి తయారీ పూర్తయింది. ఈనెల 12న రాజమండ్రిలో జరిగే సభలో టీడీపీకి చెందిన ఈ మాజీ ఎంపీలతోపాటు మరి కొంతమంది నాయకులు పాల్గొంటారని తెలుస్తోంది. కిరణ్ కొత్తపార్టీ ప్రకటన సమయంలో ఆయన వెంట కాంగ్రెస్ బహిష్కృత ఎంపీ రాయపాటి సాంబశివరావు లేరు. మీడియా సమావేశం తర్వాత కిరణ్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కిరణ్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఇంతకుముందు కిరణ్ పార్టీ తరఫున తాను గుంటూరు ఎంపీ పదవికి పోటీ చేస్తానని కూడా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.