నెల్లూరు టీడీపీలో ఆదాల x మాగుంట
posted on Mar 7, 2014 @ 10:26AM
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి పేరు ఖాయమైందన్న తరుణంలో తాజాగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి త్వరలోనే టీడీపీలో చేరనున్నారని, ఈ మేరకు బాబుతో చర్చలు ముగిశాయని సమాచారం. మాగుంటకు ఆంతరంగికులైన గోపాల్రెడ్డి, మస్తాన్రెడ్డి గత ఆదివారం టీడీపీ అధినేతను కలిసి శ్రీనివాసులురెడ్డి పార్టీలో చేరే విషయమై చర్చించారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి కూడా చెన్నైలో మాగుంటతో మంతనాలు సాగించారు. చంద్రబాబుతో మాగుంట శ్రీనివాసులురెడ్డికి బలమైన వ్యక్తిగత సంబంధాలున్నాయి. మాగుంట బలంగా పట్టుబడితే ఆయనకు టికెట్ దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే జరిగితే ఆదాల పరిస్థితి ఏంటో అనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ముఖ్యనేత కంభంపాటి రామమోహన్రావు అండదండలు ఆదాలకు బలంగా ఉన్నాయి. తాను ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు ఇప్పటికే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎంపీ స్థానం ఆదాలకా? మాగుంటకా ? అని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిత్వం టీడీపీ నుంచి ఎవరికి లభిస్తోందో చూడాల్సిందే. ఇక నెల్లూరు రూరల్ నియోజక వర్గానికి కొత్తతరం నాయకుడిగా ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డిని రంగంలో దించుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇందులో ట్విస్టు ఏమిటంటే, ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అంటున్నారు.