బదిలీల కత్తి పట్టిన ఉగ్ర నరసింహన్

  ఉగ్ర నరసింహన్ తన కత్తికి పదును పెంచుతున్నారు. పాలనలో తనదైనా మార్కు చూపిస్తున్నారు. నిన్న కాక మొన్న పెట్రోలు బంకుల సమ్మెను గంటల వ్యవధిలోనే ఆపించిన ఆయన.. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చివరి నిమిషంలో చేసిన నియామకాలు, బదిలీలపై దృష్టి పెట్టారు. సీఎం పదవికి రాజీనామా చేయడానికి ఒకటీ రెండు రోజుల ముందు తన పేషీలో పనిచేస్తున్న కార్యదర్శులకు ఇచ్చిన కీలక పోస్టింగులను గవర్నర్ రద్దు చేశారు. అజయ్ కల్లాం మినహా జవహర్‌రెడ్డి, ఎన్.శ్రీధర్, శంషేర్‌సింగ్ రావత్, సురేందర్‌ల బదిలీలను రద్దు చేశారు. వారిని ఇతర శాఖలకు బదిలీ చేశారు.   కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఇచ్చిన పోస్టింగ్‌లను ఒకటి తరువాత ఒకటి రద్దు చేస్తూ కొత్త పోస్టింగ్‌లు ఇస్తున్నారు. కిరణ్ వెళ్తూ వెళ్తూ తన వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఎన్.శ్రీధర్‌ను ఏపీ బ్రూవరీస్, డిస్టిలరీస్, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించగా.. ఇప్పుడు ఆయన్ను ప్రాధాన్యం లేని రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఓలో ఓఎస్డీగా పనిచేసిన సురేందర్‌ను కిరణ్ చివరిరోజున రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా నియమించారు. ఆయనను ఏపీఐఐసీకి బదిలీ చేశారు. తన వద్ద గతంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసి, తర్వాత ఐఏఎస్‌కు ఎంపికై చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వెళ్లిన బసంత్‌కుమార్‌ను గవర్నర్ మళ్లీ రాజ్‌భవన్‌కు రప్పించుకున్నారు. బసంత్‌కుమార్‌ను గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. ఎస్‌పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ మీనన్‌ను రాష్ట్ర ప్రింటింగ్, స్టేషనరీ విభాగం కమిషనర్‌గా, ఆక్టోపస్ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావును ఎస్‌పీఎఫ్ డీజీగా బదిలీ చేశారు. ఆక్టోపస్ బాధ్యతలను రాష్ట్ర ఆపరేషన్స్ విభాగం డీజీపీ జేవీ రాముడుకు అప్పగించారు.

దెయ్యమని తిట్టినా.. సోనియానే తెలంగాణ ఇచ్చారు

  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని దెయ్యమని కేసీఆర్ తిట్టినా .. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీఆర్ఎస్ ను విలీనం చేయమని ఎవరూ కేసీఆర్ ను అడగలేదని పొన్నాల ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కేసీఆరే స్వయంగా చెప్పిన విషయాన్ని పొన్నాల గుర్తుచేశారు. సీమాంధ్రలో పార్టీ పరిస్థితి ప్రతికూలంగా మారే అవకాశమున్నా.. తెలంగాణ ఏర్పాటుకు ధైర్యంతో సోనియా తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ మాట మార్చి.. ఎదో కుంటిసాకులు చెప్పడం తగదని, విలీన నిర్ణయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పొన్నాల వ్యాఖ్యానించారు. కేసీఆర్ రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని.. అయితే సోనియాను విమర్శించే నైతికత కేసీఆర్‌కు లేదని పొన్నాల మండిపడ్డారు.

సీమాంధ్రకి ‘ప్యాకేజీ’ సినిమా

   సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీది పూర్తిగా డిఫరెంట్ ఇస్టోరీ. తెలంగాణా తెచ్చామని ఇక్కడ.. ప్యాకేజి ఇచ్చామని అక్కడ.. టముకు వేయమని రాష్ట్రాన్ని విడదీసిన తెల్లదొర జైరాం రమేష్ ను సోనియమ్మ పురమాయించడంతో ఆయన సీమాంధ్రలో రెక్కలు కట్టుకొని వాలిపోయి మన రాజమౌళి డైరెట్రు కంటే బాగా ఎఫెక్టివ్ గా అరచేతిలో వైకుంటం చూపిస్తూ ఊర్లు చుట్టబెట్టేస్తున్నాడు. అయితే ఆయన కంటే ముందే డిల్లీ నుండి ఊడిపడి సీమాంధ్ర మీద కర్చీఫ్ వేసుకొని కూర్చొన్న వెంకయ్య నాయుడు తన ప్రాస బాషలో అలవోకగా కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే, జైరాం రమేష్ కి ఆయన తమను తిడుతున్నాడో లేక పొగుడుతున్నాడో అర్ధం కాక నోరు వెళ్ళబెట్టేసాడు. అది చూసి కంగారు పడిన సోనియమ్మ పార్లమెంటులో విభజనపై చర్చ జరగకుండా చక్కగా మేనేజ్ చేసి, మూజువాణి ఓటింగ్ తో బిల్లుని గట్టేకించిన ఘనుడు కమల్ నాథ్ ని జైరాంకి తోడుగా ఉండమని పురమాయించింది.   ఇక తమతో పొత్తులు పెట్టుకునే ధైర్యం ఎవరూ చేయరని గ్రహించిన బొత్సబాబు ఈసారి తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేసి క్లీన్ స్వీప్ చేసేస్తామని ప్రకటించి లౌక్యం ప్రదర్శించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రం నుండి క్లీన్ స్వీప్ చేసేస్తానని దానర్ధమని గిట్టని వాళ్ళు పెడర్ధాలు తీసి ఒకటే ఇకఇకలు పకపకలు. ఇక్కడ సీమంధ్రలో బొత్స బాబు పార్టీని క్లీన్ స్వీప్ చేసేస్తానని హామీ ఇస్తుంటే, అక్కడ గులాబీ బాసు క్లీన్ స్వీప్ చేసేందుకు కమిట్ అయిపోవడంతో సోనియమ్మకు మా చెడ్డ చిక్కు వచ్చి పడింది పాపం!  

హస్తంలో గులాబీ ముళ్ళు

  సీమాంధ్రలో పూర్తిగా మునిగిపోయిన హస్తం పార్టీ వారు గులాబీ కారుకి లిఫ్ట్ కోరుతూ హస్తం చూపించారు. కారు ఆపి ఎక్కించుకొంటే, వెనుక సీటులో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ తెలంగాణలో షికారు చేద్దామని ఊహల్లో తేలిపోయింది. కానీ కారు ఆగలేదు. పోతూ పోతూ... (పొత్తుల) స్టీరింగ్ నా చేతుల్లో లేదు...మీ కేశవన్న కమిటీయే స్టీరింగ్ తిప్పుతోంది...సారీ...అంటూ కాంగ్రెస్ కంట్లో దుమ్ముకొట్టి రివ్వున ముందుకు దూసుకుపోయింది గులాబీ కారు.   “మా బంగారు తల్లి సోనియమ్మ మా దేవత” అంటూ ఫ్యామిలీతో సహా గ్రూప్ ఫోటోలు దిగిన గులాబీ బాస్ అందరికీ హ్యాండ్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి హ్యాండివడమే కాకుండా మళ్ళీ “కాంగ్రెస్ పార్టీయే మాకు హ్యాండిచ్చింది” అని సన్నాయి నొక్కులు నొక్కారు. అప్పుడు కాంగ్రెస్ నేతలు “ఇప్పటికీ మా హ్యాండ్ మీ హ్యాండ్స్ లోనే ఉన్నాయని” చాలా ఏమ్మోషనల్ అయిపోతూ జవాబిచ్చారు. షబ్బీర్ అలీ అయితే ఉక్రోషం పట్టలేక కెసిఆర్ పిట్టలదొర అని నోరుజారేసారు కూడా.   అయినా హస్తాలు కాలాక పొత్తులు పట్టుకుంటే మాత్రం ఏమి లాభం? అని కాంగ్రెస్ నేతలు మేకపోతుని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కడుపులో నుండి పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఉగ్గబట్టుకొనేందుకు ‘ఇక తెరాసతో చేడుగుడే’ అంటూ కాంగ్రెస్ కండువాలు నడుంకి బిగించి పోటీకి సై అంటూ తమ ముసలి తొడలు ‘టపీ టపీమని’ సోనియమ్మకు వినబడేలా చరుచుకొన్నారు టీ-కాంగ్రెస్ నేతలు.   సోనియమ్మ కూడా వారిని డిల్లీకి పిలిచి టీ-పార్టీ ఇచ్చి “వాళ్ళకి తెలంగాణా ఉంటే, మీతో కలిసి పోరాడేందుకు అనేక ఎన్నికలలో పార్టీకి శల్యసారధ్యం చేసిన మన యువరాజు ఉన్నాడు. అదైర్య పడకండి” అని ఓదార్చారు.

పొత్తులకు పైఎత్తులు

  కాలం కలిసొస్తే .. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఐదేళ్ళకోసారి నిర్వహించే పెజాస్వామ్య కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుద్ది. పరస్పరం కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులతో రంగంలోకి దిగుతాయి. చేతిలో చెయ్యేసి కలిసి సాగిన వేర్వేరు పార్టీల నేతలు సై అంటే సై అంటూ ఈవీఎమ్ ఫైట్ కు సిద్ధమవుతారు. గెలుపే పరమావధి.. అధికారమే లక్ష్యంగా పొత్తులు కుదురుతాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు అనే ఒక ప్రకటనతో ఓటర్లను ఓదార్చుతారు.   ఎవరి గోల వారిదే: ఎన్నికలకు ముందు ఏదో ఒక పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరిగే లెఫ్ట్ పార్టీలు... ఈసారి మాత్రం లెఫ్ట్... రైట్... అంటూ చెరో దారి చూసుకుంటున్నాయి. తెలంగాణా ఏర్పాటుకు మద్దతు పలికిన సీపీఐ, సమైక్యాంధ్ర నినాదంతో ఉన్న సీపిఎం చెరో దారి వెతుకుంటున్నాయి. అవినీతిపై పోరాడి అలిసిపోయిన సీపీఎం జగన్ తో సెటిల్ అయిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు కామ్రేడ్స్ గుసగుసలాడుకుంటున్నారు. సీపీఐకి సీపిఎం హ్యాండ్ ఇవ్వడంతో కొత్త మిత్రులను వెతికే పనిలో పడింది నారాయణ గ్యాంగ్. తెలుగుదేశంతో వెళ్తే తెలంగాణలో నష్టపోయే పరిస్థితి. అందుకని “ఒంటరినైపోయాను...ఇక ఎన్నికలకు ఎలాగు పోనూ...” అంటూ విషాదంగా పాత పాటను కొత్తగా పాడుకుంటు గులాబీ బాస్ చుట్టూ తిరుగుతున్నారు. ఆయన కనుక దయ తలిస్తే ఈసారికి గండం గట్టెక్కినట్లే అని ఆశగా చూస్తున్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ అయినా తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోదా? అని కామ్రేడ్స్ ఆశగా ఎదురు చూస్తున్నారని ఊరంతా ఒకటే పుకార్లు.

కేసిఆర్ రాజకీయ గురువు నేనె: బాబు

      తెలంగాణ తెలుగుదేశం త్వరలో ఖాళీ అవడం ఖాయమని వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఖాళీ అవడానికి తెలుగుదేశం పార్టీ బ్రాందీ సీసా కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదవాళ్ళకు అందాల్సిన నిధులను కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని, సోనియా గాంధీయే అవినీతి అనకొండని ఆరోపించారు. టిడిపి హయంలో లక్షలాది మందికి ఉద్యోగ అవకశాలు కల్పించమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత టిడిపిదేనని గుర్తుచేశారు. కేసిఆర్ పార్టీ పెట్టినప్పుడు అతని ఆస్థి ఎంతని? ఇప్పుడు ఎంతని? ప్రశ్నించారు. కేసిఆర్ రాజకీయ గురువు తానేనని, మంచి దారిలో వెళ్తాడని అనుకుంటే..అడ్డదారిలో వెళ్తున్నాడని అన్నారు.

రాజీనామా చేస్తా...విలీనం చేస్తారా?..విజయశాంతి

      కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తే, టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారా? అని ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మెదక్ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ విలీనంపై మీడియాతో మాట్లాడారు. ఒకవేళ తనని కాంగ్రెస్ పార్టీలో చేర్చుక్కునందుకే విలీనంపై వెనక్కి తగ్గినట్లయితే..తాను రాజీనామా చేయడానికి సిద్దంగా వున్నానని స్పష్టం చేశారు.   తనను కాంగ్రెస్ లో చేర్చుకోవడం తప్పు అయితే , కాంగ్రెస్ ఎమ్.పిలను మందా జగన్నాధం, వివేక్ లను టిఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీని విలీనం చేస్తానని చెప్పిన కేసిఆర్ కుంటిసాకులతో తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన టీఆర్ఎస్, ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలని పేర్కొన్నారు. ఆ మాట అడిగితె ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.   తెరాసలో తనని చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు. షోకాజ్ నోటిసులు ఇవ్వకుండా పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం అప్పగించే బాధ్యతలు నిర్వహించేందుకు సిద్దంగా వున్నానని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అన్నారు.

పురుగుల మందు తాగిన ఎమ్మెల్యే

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తన సర్పంచ్ లను కౌన్సెలింగ్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఈ ఘటనకు పాల్పడ్డారు. వైకాపా కార్యకర్తల వేధింపులకు నిరసనగా రామచంద్రరెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట భైఠా౦యి౦చారు. కారణం లేకుండానేతన అనుచరులను వేధింపులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించి కిందపడిపోయారు. దీంతో అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైకాపా నేతలు రాయదుర్గం బంద్ కు పిలుపునిచ్చారు.

పవన్ 'పవర్' కోసం జేపీ ఆరాటం

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయాలలోకి రావడం ఖాయమని వార్తలు వస్తుండడంతో ఆయన స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోవాలని రాజకీయపార్టీలు ఆరాటపడుతున్నాయి. రాజకీయాల్ని క్యాష్ చేసుకోవడాన్ని ఎప్పుడు విమర్శించే లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ కూడా పవన్ 'పవర్' ను క్యాష్ చేసుకోవాలని చూడడం విశేషంగా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. ప్రజా సేవ చేయాలనుకొనే వారికి లోక్ సత్తా బహిరంగ వేదికని అన్నారు. పవన్ తమ పార్టీలో చేరుతానంటే స్వాగతిస్తామని అంటున్నారు. పవన్ తనకు మంచి మిత్రుడని, దీనిపై ఆయనతో చర్చలు చేస్తామని తెలిపారు.

కేసిఆర్ పై సమరానికి 'టీ కాంగ్రెస్' సిద్దం

      టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అమీతుమీకి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను వీలినం చేయమని ప్రకటించడంతో ఆయనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కెసిఆర్ విలీనం చేయనని తేల్చడంతో తెలంగాణ ప్రాంత ఎంపీలు ఇక ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఓట్లు చీలకుండా ఉండేందుకే తాము తెరాస విలీనం అడిగామని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెసు చిత్తశుద్ధితో పని చేసిందన్నారు. పునర్ నిర్మాణం కాంగ్రెసుతోనే సాధ్యమన్నారు. కేసీఆర్ ఎప్పుడూ అబద్దాలే చెబుతారని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ఆరోపించారు. పార్లమెంట్‌లో పిట్టలదొర కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని, తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్రలేదని ఆయన అన్నారు. తెలంగాణపై చర్చ సందర్భంగా ఎంఐఎం పార్టీ బిల్లులో సవరణలు చేసిందని, కేసీఆర్ బిల్లులో ఒక్క సవరణ ఏమైనా ప్రతిపాదించారా అని ప్రశ్నించారు. ఉద్యమం చేసిన వారంతా ఒక్కటి కావాలనే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేయాలని కోరామన్నారు. అయితే కేసీఆర్ నైజం అందరినీ మోసం చేయడమే అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి సోనియా కాళ్లెందుకు మొక్కారని ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇతరులపై ఎప్పుడు ఆధారపడలేదని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టీఆర్ఎస్ తో పోత్తుగాని, వీలినంపై కాంగ్రెస్ ఎప్పుడు ఆలోచనలు చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెసు చిత్తశుద్ధితో పని చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేనని అన్నారు. 

వి.హెచ్. ఆవేదన..కేసిఆర్ పునరాలోచించుకోవాలి

      తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో వీలినం చేస్తానని మాటిచ్చిన కేసిఆర్, ఇప్పుడు సడన్ గా మాట మార్చడంపై పునరాలోచించుకోవాలని ఎంపీ వి. హనుమ౦తరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని తెలిసినా, తెలంగాణ విద్యార్ధుల ఆత్మబలిదాలను చూసి చలించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వచ్చారని అన్నారు. కేసిఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాలేదని అన్నారు. కేసిఆర్ స్వార్ధరాజకీయపరుడని ఆరోపించారు. కుటుంబంతో వెళ్ళి సోనియాని కలిసిన కేసిఆర్, అమరవీర కుటుంబాలను ఎందుకు తీసుకువెళ్ళలేదని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు తప్పదని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అన్న మాటలు నిజమవుతుంటే భరించలేక ఆయన ఆవేదన చెందుతున్నారు!

అరచేతిలో స్వర్గం చూపిస్తున్న జైరాం రమేష్

  రాష్ట్ర విభజనతో ఆగ్రహంగా ఉన్నసీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు, రాష్ట్ర విభజనలో ముఖ్యపాత్ర పోషించిన కేంద్రమంత్రి జైరాం రమేష్ నే కాంగ్రెస్ అధిష్టానం ఎంచుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ ఆయనను ఎంచుకొని కాంగ్రెస్ అధిష్టానం చాలా తెలివయిన నిర్ణయమే తీసుకొందని ఆయన నిరూపిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో లక్షలాది ప్రజలు స్వచ్చందంగా రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసినా పట్టించుకొని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వస్తుండటంతో వారిని ప్రసన్నం చేసుకొనేందుకు జైరాం రమేష్ ను సీమాంధ్రలో పర్యటనకు పంపింది.   రానున్న పదేళ్ళలో వైజాగ్, విజయవాడలకు మెట్రో రైళ్ళు, ప్రత్యేక రైల్వే డివిజన్ల ఏర్పాటు, వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు, హైకోర్టు, శాసనసభ, సచివాలయం తదితర భవనాల నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులు అంటూ కలలో కూడా ఎవరూ ఊహించలేని స్వర్గాన్ని ఆయన అరచేతిలో చూపిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు.   ఆయన చెపుతున్నవన్నీ ఏర్పడితే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ప్రధమ స్థానంలో నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే కనబడనప్పుడు జైరాం చేస్తున్నవాగ్దానాలకు విలువేమి ఉంటుంది? అవి ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప వేరెందుకు ఉపయోగపడవు. ఒకవేళ ఎన్నికల తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే, తలకు మించిన భారంగా తయారయ్యే కాంగ్రెస్ ప్రకటిస్తున్న ఈ వరాలన్నిటినీ ఎందుకు అమలు చేస్తుంది? ఎలా అమలు చేస్తుంది? ఎంతవరకు అమలు చేస్తుంది? అని ప్రశ్నించుకొంటే సరయిన సమాధానాలు దొరకవు.   గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో, రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నపుడు ఇప్పుడు ఆయన చెపుతున్న వాటిలో ఏ ఒక్కటీ చేయాలని కాంగ్రెస్ ఎందుకు భావించలేదు? అవి చేయకుండా కాంగ్రెస్ పార్టీని ఎవరు అడ్డుకొన్నారు? ఇవన్నీ ఇప్పుడే చేయాలని ఎందుకు భావిస్తోంది? అంటే ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచేందుకేనని ఎవరికయినా అర్ధం అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ అదృష్టం బాగుండి ఎన్నికలలో గెలిచినా గత పదేళ్లలలో చేయని పనులు అప్పుడు మాత్రం ఎందుకు చేస్తుంది?     వైజాగ్ కు రైల్వే జోన్ కావాలని, కనీసం ఒకటి రెండు కొత్త రైళ్ళు కావాలని గత పదేళ్లుగా యంపీలు, కేంద్రమంత్రులు కోరుతున్నపటికీ వారి అభ్యర్ధనలను  పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ఊరికొక మెట్రో రైలుని ఊరకే పంచిపెట్టేస్తామని, జిల్లాకో రైల్వే జోన్ ఇచ్చేస్తానని వాగ్దానం చేయడం హాస్యాస్పదం.   ఇంతకాలం సీమాంధ్ర ప్రజలను, వారి ప్రతినిధులను, వారి అభిప్రాయాలను పూచిక పుల్లెత్తు విలువీయని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సీమాంధ్ర పై ఇంత అవ్యాజమయిన ప్రేమ కురిపించేయడం చాలా ఆహేతుకంగా, అసంబద్దంగా నాటకీయంగా ఉంది. ఈ ప్రేమ, వరాలు అన్నీ కూడా ఎన్నికలలో గెలవడం కోసమే. ఎన్నికలలో గెలిస్తే ఇక మళ్ళీ సీమాంధ్ర ప్రతినిధులు కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళ దగ్గర పడి బ్రతకవలసిందే. వారు చెప్పే పోసుకోలు కబుర్లు వింటూ ప్రజలు మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు ఐదేళ్ళు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడాల్సిందే.

పెట్రోల్ బంక్ సమ్మె..గవర్నర్ ఫైర్

      రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతో గవర్నర్ నరసింహన్ తన పవర్ చూపిస్తున్నారు. అనూహ్యంగా మొదలైన పెట్రోల్ బంకుల బంద్‌ను గంటల వ్యవధిలో ఆయన ఉపసంహరింపజేశారు. అంతకుముందు సమ్మె సాకుతో లీటరు పెట్రోలు ఏకంగా 220 వరకు అమ్ముడైంది. దీంతో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, తూనికలు, కొలతల డెరైక్టర్ జనరల్‌తో మాట్లాడారు. సాయంత్రానికల్లా పెట్రోల్ బంకులు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలను గవర్నర్ ఇచ్చారు. దీంతో పెట్రోల్ బంకుల యజమాన్యాలతో అధికారులు చర్చలు జరిపారు. గంటల వ్యవధిలోనే బంద్‌ను యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి. అంతేకాదు, సర్కారుతో కాళ్లబేరానికి కూడా వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కాదు: చంద్రబాబు

  మునిసిపల్ ఎన్నికల విషయంలో హైకోర్టు కలుగజేసుకోదని తేల్చి చెప్పడంతో ఇక ఎన్నికలు అనివార్యమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇటువంటి అగ్ని పరీక్షలు ఎదుర్కోవడం ఏ పార్టీకయినా ఇబ్బందే. ఎన్నికలలో ఓడిపోతే ఆ ప్రభావం తరువాత వచ్చే ఎన్నికలపై పడుతుంది గనుక అధికారంలో ఉన్న పార్టీకయితే మరీ ఇబ్బంది. అయినా ఎదుర్కోక తప్పడం లేదు. కోర్టులు చేత మొట్టికాయలు వేయించుకొంటే తప్ప మునిసిపల్ ఎన్నికలను కూడా నిర్వహించలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని చంద్రబాబు ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టినా అది పూర్తి కాలం సుస్థిరంగా పాలించలేదని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించడంతో అది మరోమారు స్పష్టమయిందని చంద్రబాబు విమర్శించారు. ఆయన కాంగ్రెస్ హయాంలో పెరిగిన ధరలను, అదుపు తప్పిన పాలనను ఎత్తి చూపుతూ, ఒకప్పుడు దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని, హైదరాబాదుని కాంగ్రెస్ ప్రభుత్వం తన అవినీతి, అసమర్ధ పాలన కారణంగా అట్టడుగు స్థానానికి చేర్చి చేతులు దులుపుకొని వెళ్లిపోతోందని ఆయన కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాల మీదకు ఎక్కించాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.   చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై ఈవిధంగా దాడి చేయడం కొత్తేమీ కాకపోయినా, కేవలం కాంగ్రెస్ అసమర్ధత కారణంగానే రాష్ట్రంలో మళ్ళీ నలబై ఒక్క ఏళ్ల తరువాత రాష్ట్రపతి పాలన విదించబడిన నేపధ్యంలో ఆయన చేస్తున్న ఆరోపణలు, విమర్శలు వాస్తవ పరిస్థితులకి అద్దం పడుతున్నాయి గనుక ఆయన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

తెరాసను చూసి జడుసుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలు

  ఊహించినట్లుగానే కేసీఆర్ ‘హస్తం’ పార్టీకి హ్యాండిచ్చి విలీనం బాధ నుండి బయటపడ్డారు. ఆయన కావాలనుకొంటే పొత్తులు కూడా ఉండవని నిన్ననే ప్రకటించి ఉండవచ్చును. కానీ ప్రకటించలేదు. కాగల కార్యం గంధర్వులే చేస్తారన్నట్లుగా, నేటి నుండి కాంగ్రెస్ నేతలందరూ కేసీఆర్, తెరాసను లక్ష్యం చేసుకొని దాడికి దిగి ఇక తెరాసతో పొత్తులు అవసరం లేదని వారే చెపుతారు గనుక ఆయన ఆశ్రమ తీసుకోలేదు. కేసీఆర్ ఆడిన మాట తప్పి మోసం చేసారని, తెరాస విలీనం కాకపోయినా కాంగ్రెస్ కు వచ్చే నష్టం ఏమీ లేదని, తెలంగాణా ఇచ్చినందుకు ప్రజలందరూ తమ వెంటే ఉంటారని కాంగ్రెస్ నేతలందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవచ్చు గాక, కానీ తెరాస విలీనం కాలేదనే వారి ఆక్రోశమే వారు తెరాసను చూసి ఎంత భయపడుతున్నారో అద్దం పడుతోంది. టీ-కాంగ్రెస్ నేతల సామర్ధ్యాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయకపోయినప్పటికీ, తెరాస విలీనం గురించి పదేపదే మాట్లాడుతూ తమ సామర్ధ్యంపై తమకే నమ్మకం లేనట్లుగా చాటుకొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనం కాబోదు: కేసీఆర్

  దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన తెరాస పోలి బ్యూరో సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనం, పొత్తులపైనే ప్రధానం చర్చ జరిగింది. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోదని ప్రకటించారు. సమావేశంలో మాట్లాడిన దాదాపు 85మంది పార్టీ నేతలు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేఖించినందున ఇక విలీనం ప్రసక్తి లేదని ఖరాఖండీగా ప్రకటించేశారు. ఇక కే.కేశవ్ రావు అధ్యక్షతన ఏర్పడే కమిటీ కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ పార్టీలతో ఎన్నికల పొత్తుల గురించి ఒక నిర్ణయం తీసుకొంటుందని ఆయన ప్రకటించారు. అందువల్ల ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం కానీ, ఎన్నికల పొత్తులు కూడా లేనట్లే స్పష్టమయింది. కాంగ్రెస్ పార్టీ విలీనం కాకూడదని నిర్ణయం వెనుక బలమయిన కారణాలు చాలానే ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. అవి ప్రధానంగా:   1. రాష్ట్రవిభజన/తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెరాసను పరిగణనలోకి తీసుకోలేదు. అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకొంది.   2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినట్లే, తెలంగాణాలో వెనుకబడిన 8 జిల్లాలకు మేము ప్రత్యేక ప్రతిపత్తి కోరితే కాంగ్రెస్ అధిష్టానం మా మాట పట్టించుకోలేదు.   3. అదేవిధంగా పోలవరానికి జాతీయ హోదా కల్పించినట్లే తెలంగాణాలోని చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించమని మేము చేసిన విజ్ఞప్తిని కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు.   4. తెలంగాణా రాష్ట్రం ఏర్పరుస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రింద వచ్చే ఏడూ మండలాలను సీమంధ్రలో కలుపుతూ ఏకపక్షంగా ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.   5. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తూనే ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాదుపై సర్వాదికారాలను గవర్నర్ చేతికి అప్పగించావద్దని మేము చేసిన విజ్ఞప్తులను కాంగ్రెస్ అధిష్టానం పేద చెవిన పెట్టింది.   6. ఇక మా పార్టీపై కేంద్రమంత్రి జైరాం రమేష్ చేసిన అనుచిత వ్యాక్యలు మమ్మల్ని చాలా భాదించాయి.   కలిసి పనిచేద్దామని కోరుతూనే, మా పార్టీ నుండి బహిష్కరించిన నేతలని కాంగ్రెస్ లో చేర్చుకోవడం మేము ఖండిస్తున్నాము. “చెప్పాలంటే ఇంకా ఇటువంటి వంద కారణాలున్నాయి. ఇంతకాలంగా కాంగ్రెస్ నేతలు మా పార్టీని మమ్మల్నీ ఎంతగా అవమానించినప్పటికీ, మావల్ల తెలంగాణా బిల్లు ఆగిపోకూదదనే ఉద్దేశ్యంతోనే భరించాము. కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు మాపట్ల ఇంత అనుచితంగా,నిర్లక్ష్యంగా వ్య్వహరిస్తున్నపుడు మేము వారితో కలవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇక ముందు కూడా తెరాస స్వంతంత్రంగా పనిచేస్తూ ఎన్నికలలో పోటీ చేస్తుంది. తెలంగాణా పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుల విషయం కేశవ్ రావు అధ్యక్షతన పనిచేసే కమిటీయే నిర్ణయిస్తుంది,” అని కేసీఅర్ స్పష్టం చేసారు.