బొత్సపై అధిష్టానం వేటు

  సమైక్యరాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన బొత్ససత్యనారాయణను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా నియమించబోతోందని వార్తలు వచ్చాయి. కానీ చాలా ఆశ్చర్యకరంగా ఆయన స్థానంలో రఘువీరారెడ్డిని నియమించింది. బొత్ససత్యనారాయణను పీసీసీ అధ్యక్ష పదవిలో నుండి తప్పించడమే కాకుండా ఆయనను, రఘువీరా రెడ్డి క్రింద పనిచేసే ఒక కమిటీలో ఒక సాధారణ సభ్యుడిగా నియమించడం శిక్షగానే భావించాల్సి ఉంటుంది.   బహుశః ప్రజలలో బొత్స పట్ల ఉన్న వ్యతిరేఖతను కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించినట్లు అర్ధమవుతోంది. అయితే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భావించినందునే ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పించిందని అనుకొన్నా, ఈ ఎన్నికలలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే కనబడనప్పుడు పదవిలో నుండి తప్పించడం కేవలం శిక్షగానే భావించవలసి ఉంటుంది.   ఆయన విభజన సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను అదుపుచేసి, అందరినీ ఒక్క త్రాటిపైకి తేవడంలో చాలా ఘోరంగా విఫలమయినందునే నేడు కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి దాపురించినదని చెప్పక తప్పదు. సీమాంధ్రలో పార్టీపట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత ఏర్పడినప్పుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ఆ వ్యతిరేఖతను పెంచి పోషిస్తున్నపుడు, దానిని అదుపుచేసి పార్టీని కాపాడే ప్రయత్నం చేయకపోగా, ప్రజలలో తనపట్ల మరింత వ్యతిరేఖత పెరగకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతూ ముఖ్యమంత్రితో కలిసి అధిష్టానానికి లేఖలు వ్రాసారు, ధర్నాలలో పాల్గొన్నారు. అయినప్పటికీ ఆయన ప్రజలను కానీ, తన అధిష్టానాన్ని గానీ మెప్పించలేక ఆయన పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడిన రేవడిలా తయారయింది.   ఎటువంటి రాజకీయానుభవం లేని చిరంజీవికి కూడా ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, సుదీర్గ రాజకీయానుభవం ఉన్న బొత్సకు మాత్రం  ఏ కమిటీ బాధ్యత అప్పగించలేదు. అభ్యర్ధులకు టికెట్స్ కేటాయించే ఈ కీలక సమయంలో ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పించడం ఆయనకు పెద్ద దెబ్బే కాక ప్రజల దృష్టిలో ఆయన మరింత పలుచనయ్యే అవకాశం ఉంది. అయితే తానే పదవి నుండి స్వయంగా తప్పించమని కోరానని బహుశః ఆయన రేపు సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేస్తారేమో!

ఆంధ్ర, తెలంగాణాలకు వేర్వేరు పీసీసీ అధ్యక్షుల నియామకం

  ఇంతవరకు సమైక్య రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడు ఉన్న బొత్ససత్యనారాయణను కాంగ్రెస్ అధిష్టానం ఆ పదవిలో నుండి తప్పించి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు వేర్వేరుగా పీసీసీ అధ్యక్షులను నియమించింది. మాజీ మంత్రులు రఘువీర రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణా రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షులుగా నియమించింది. ఉత్తమ కుమార్ రెడ్డిని తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది.   ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ఎన్నికల కోసం వేర్వేరుగా మ్యానిఫెస్టో కమిటీ మరియు ప్రచార కమిటీలను కూడా నియమించింది. వీరిలో అందరూ కూడా అధిష్టానానికి వీర విధేయులుగా ముద్ర పడ్డవారే. రాష్ట్ర విభజన సమయంలో అధిష్టానానికి అనుకూలంగా మాట్లాడిన, వ్యవహరించిన ప్రతీ ఒక్కరికీ తగిన విధంగా ప్రతిఫలం దక్కింది.   ఆంధ్రప్రదేశ్ మ్యానిఫెస్టో కమిటీకి చైర్మన్ గా మాజీ మంత్రి ఆనం రామినారాయణ రెడ్డిని, కో-చైర్మన్ గా కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని నియమించింది.   ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్ గా కేంద్రమంత్రి చిరంజీవిని, కో-చైర్మన్ గా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించింది.   తెలంగాణా మ్యానిఫెస్టో కమిటీకి చైర్మన్ గా మాజీ మంత్రి శ్రీధర్ బాబుని, కో-చైర్మన్ గాభట్టి విక్రమార్కను నియమించింది.   తెలంగాణా ఎన్నికల ప్రచార కమిటీకి చైర్మన్ గా దామోదర రాజనరసింహను, కో-చైర్మన్ గాషబ్బీర్ ఆలీని నియమించింది.

మళ్ళీ గోతిలో పడిన కాంగ్రెస్

  కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్ధుల కోసం తీసిన గోతులలో తరచూ తనే పడుతూలేస్తున్నా కూడా దాని తీరు మాత్రం మారడం లేదు. కాంగ్రెస్ తో విలీనానికి, పొత్తులకు కేసీఆర్ అంగీకరించకపోవడంతో, కేసీఆర్ ను దెబ్బతీద్దామనే ఆలోచనతో తెలంగాణాలో పర్యటించిన కేంద్రమంత్రి జైరామ్ రమేష్, తమపార్టీ అధికారంలోకి వస్తే దళితుడనే తెలంగాణాకు తొలి ముఖ్యమంత్రిగా చేతామని, అది తన మాటే కాదని రాహుల్ గాంధీ కూడా అదే కోరుకొంటున్నారని ప్రకటించారు. కానీ టీ-కాంగ్రెస్ నేతల ఆగ్రహాన్ని చవిచూసిన ఆయన కేవలం రెండు గంటలలోనే తన మాట మార్చి తన పరువు, పార్టీ పరువు కూడా తీసుకొన్నారు.   ఇక ఈయన మాట్లాడిన ప్రతీ ముక్కకి డిల్లీ నుండి అర్ధ తాత్పర్యాలు వివరించే దిగ్గీరాజా మీడియాతో మాట్లాడుతూ, “దళిత ముఖ్యమంత్రి అనేది జైరామ్ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చును. ఆ విషయంపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటాము," అని చెప్పి చేతులు దులుపుకొన్నారు. అయితే జైరామ్ రమేష్ మొదట మాట్లాడినప్పుడు అది కేవలం తన అభిప్రాయమే కాదని, తమ యువరాజు రాహుల్ గాంధీ అభిప్రాయంగా ప్రజలకు తెలియజేస్తున్నానని చెప్పినపుడు, ఇప్పుడు దిగ్విజయ్ ఆయన ప్రకటనతో పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని చెప్పడం చూస్తే, కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ తను గోతిలో పడ్డామని అర్ధం చేసుకొన్నందునే దానిని జైరామ్ మీదకు త్రోసేసి చేతులు దులుపుకొని ఉండవచ్చును.

జైరా౦ నోటిని అదుపులో పెట్టుకోవాలి

      టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జైరామ్ తెలంగాణ పాలిట విలన్ గా మారారని అన్నారు. ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాలని,లేకపొతే తెలంగాణ ప్రజలు తగినబుద్ది చెబుతారని హెచ్చరించారు. తెరాస, కాంగ్రెస్ మధ్య చిచ్చుపెట్టేలా జైరామ్ రమేష్ వ్యాఖ్యలు వున్నాయని అన్నారు. సోనియా గాంధీని ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జై రామ్ చేష్టలు తెలంగాణాలో కాంగ్రెస్ ను నిండా ముంచుతాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ జెఏసి నేతలకు టిక్కెట్లు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్... ఉద్యమం సమయంలో ఏం చేసిందో గుర్తు చేసుకోవాలన్నారు. ఉద్యోగాలను కేసులు పెట్టి, వేధించి కోర్టుల చుట్టు తిప్పిందన్నారు. జైరామ్ మిడిమిడి జ్ఞానంతో తెరాసపై విమర్శలు చేస్తున్నారని, తెలంగాణపై, తెరాసపై విషం కక్కుతున్నారన్నారు. జైరామ్ తీరు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని, మనిషిని చంపి పూలు చల్లినట్లుగా ఉందన్నారు.

కిరణ్ పార్టీకి ఎదురుదెబ్బ

      మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేయబోయే ‘జై సమైక్యాంధ్ర’ పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 12న పార్టీ జెండా, ఎజెండాలను ప్రకటించే బహిరంగసభకు తొలుత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు. రాజమండ్రి, అమలాపురం ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్ సన్నాహాలు ప్రారంభించారు. అయితే ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో కళాశాల మైదానంలో సభ నిర్వహణకు అనుమతించబోమన్న కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సభ కోసం తరలించిన సామగ్రిని తొలగించాలని ఆదేశించారు. దీంతో విధి లేక వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. లాలాచెరువు వద్ద ఉన్న ప్రైవేటు స్థలాన్ని ముందుగా పరిశీలించినా ఆ స్థలం సాంకేతికంగా అనుకూలంగా లేదని, చివరకు వి.ఎల్.పురం ఎల్‌ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న జెమిని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను ఖరారు చేశారు.

బొత్సకే మళ్ళీ పీసీసీ అధ్యక్ష పదవి?

  తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రకు బొత్ససత్యనారాయణ, తెలంగాణకు పొన్నాల లక్ష్మయ్య పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. మరి కొద్దిసేపటిలో పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ వారి పేర్లను అధికారికంగా ప్రకటించవచ్చును. ఇదే ఖాయమయితే, రెండు ప్రాంతాలలో ఆ పదవి కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్ నేతల అసమ్మతి, అలకలు, తిరుగుబాట్లు, బుజ్జగింపుల పర్వం త్వరలోనే మొదలవవచ్చును.   బొత్ససత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపటికీ ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక చాలా ఉంది. కానీ, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ విజయావకాశాలు కనబడటం లేదు గనుకనే ఆయన మళ్ళీ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకే మొగ్గు చూపి ఉండవచ్చును. అయితే, కొద్దిరోజుల క్రితంకాంగ్రెస్ పార్టీలో ‘మూడు నెలల ముఖ్యమంత్రి పదవి పోటీలు’ ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓపెనింగ్ బ్యాట్ మ్యాన్ గా చిరంజీవి దిగుతారని ప్రకటించారు. అంటే, ప్రస్తుతం బొత్ససత్యనారాయణని ఈ మూడు నెలల కోసం తాత్కాలికంగా పీసీసీ అధ్యక్షుడిగా నియమించి, ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికలలో గెలిస్తే అప్పుడు చిరంజీవిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించి, బొత్సను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో ఉందేమో?   ముఖ్యమంత్రి పదవికి సీమాంధ్రలో కన్నా లక్ష్మినారాయణ, చిరంజీవి, రఘువీరారెడ్డి, ఆనం రామినారాయణ రెడ్డి తదితరులు రేసులో ఉండగా, డొక్కా, కొండ్రు తదితరులు పీసీసీ అధ్యక్షపదవికి రేసులో ఉన్నారు. కనుక, ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి తగు నిర్ణయం తీసుకోవచ్చును.

ఆడాళ్లూ.. ఏడులోపే ఇంటికి చేరుకోండి.. షీలా వస్తున్నారు

      కొంతకాలం కిందట ఢిల్లీలో వైద్యవిద్యార్థినిపై కదులుతున్న బస్సులో అత్యాచారం జరిగినప్పుడు దేశమంతా ఒక్కటై నినాదించింది. కానీ ఆ సంఘటన సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న షీలా దీక్షిత్ మాత్రం.. స్త్రీలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకుండా రాత్రి ఏడు గంటల్లోపు ఇల్లు చేరుకోవాలని అన్నారు. తాజాగా షీలా దీక్షిత్ కేరళ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కేరళ నటి రీమా కళింగళ్ తన ఫేస్ బుక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''షీలా దీక్షిత్ మన రాష్ట్రానికి గవర్నర్‌గా రానున్నారు కాబట్టి ఇకపై కేరళ స్త్రీలందరూ రాత్రి 7 గంటల్లోపే ఇంటికి చేరుకోండి'' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపాయి. కేరళ నటి రీమా తమిళంలో ఇవన్ యువతి, మలయాళంలో రీతు, హ్యాపీ హజ్‌బెండ్ కమ్మత్ అండ్ కమ్మత్ చిత్రాల్లో నటించారు.

సచివాలయానికి బ్రేక్

      సచివాలయంలో మిగిలిన పనులన్నీ ఆగిపోయాయి. కేవలం రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించిన పనులు మాత్రమే శరవేగంగా, ఆగమేఘాలమీద జరిగిపోతున్నాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి 60 రోజుల సమయాన్ని నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అన్ని శాఖలకు టైంటేబుల్‌ పంపారు. ఏ శాఖ ఏ తేదీలోగా ఏ పని పూర్తి చేయాలో వివరించారు. ఈ నెల 15వ తేదీలోగా ఫైళ్ల విభజన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రికార్డు రూమ్స్‌లో ఫైళ్లను కూడా ప్రాంతాల వారీగా విభజించాలని స్పష్టం చేశారు. తర్వాత ఆ ఫైళ్లను జిరాక్స్ తీయాలని, ఒక్కో ఫైలును మూడు సెట్లు చొప్పున జిరాక్స్ తీయాలని స్పష్టం చేశారు. దీంతో సాధారణంగా జరగాల్సిన పనులను అన్ని శాఖలు నిలుపుదల చేశాయి. కేవలం విభజన పనిని మాత్రమే చేస్తున్నారు.   రాష్ట్ర విభజనతో సంబంధం లేని, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులకు పదోన్నతులను కూడా సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిన్హా నిలుపుదల చేశారు. దీంతో త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులతో పాటు వాస్తవంగా పదోన్నతి లభించాల్సిన సమయంలో పదోన్నతి రాకపోవడంతో సర్వీసుపై ప్రభావం పడుతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తూచ్! ముఖ్యమంత్రి ఎవరయినా కావచ్చు: జైరాం

    స్థలం: కరీంనగర్, సమయం: ఉదయం 10గంటలు సందర్భం: కేంద్రమంత్రి జైరామ్ రమేష్ మీడియా సమావేశం.   “అవును! తెలంగాణా రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రి దళితుడనే చేస్తాము. నూటికి నూరు శాతం కాదు 200% ఖచ్చితంగా దళితుడనే ముఖ్యమంత్రిని చేస్తాము. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, దళితుడిని తెలంగాణాకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిని చేయడం తధ్యం. ఇది నా మాటే కాదు...రాహుల్ గాంధీ మాట కూడా. మా మాటకు తిరుగు లేదు.”   స్థలం: నిజామాబాద్, సమయం: మద్యాహ్నం రెండు గంటలు. సందర్భం: కేంద్రమంత్రి జైరామ్ రమేష్ మీడియా సమావేశం.   “మా పార్టీ ఎప్పుడో 50 సం.ల క్రితమే దళితుడయిన దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. మా పార్టీ సమాజంలో అన్ని వర్గాలవారికి సమానావకాశాలు కల్పించాలనే దృడ సంకల్పంతో పంచ సూత్ర పాలసీని చాలా కాలంగా అమాలు చేస్తోంది. దాని ప్రకారం సమాజంలో అన్ని వర్గాలకు అంటే యస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మరియు మైనార్టీ వర్గాలకు చెందిన వారికి అధికారం చెప్పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మా పార్టీ తెలంగాణా విషయంలో అదే పాలసీని అవలంభిస్తుంది. ఈ వర్గాలకు చెందిన ఏ నేతనయినా తెలంగాణకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నియమిస్తాము.”   డామిట్ కధేటి ఇలా అడ్డం తిరిగింది... తెలంగాణా ఇస్తే మా పార్టీలో తెరాసను విలీనం చేస్తానని మా హ్యాండ్ పార్టీకే హ్యాండిచ్చిన కేసీఆర్, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇంత కాలం చెపుతూ వచ్చి ఇప్పుడు తానే ముఖ్యమంత్రి సీట్లో సెటిల్ అయిపోదామని చూస్తున్నాడు కదాని.. అతనికి దెబ్బేసేదామని చూస్తే.. డామిట్ కధేటి ఇలా అడ్డం తిరిగింది...అయినా మావాళ్ళు ఓ డజను మంది ముఖ్యమంత్రి కుర్చీలో కర్చీఫ్ వేసుకొని తిరుగుతుంటే, అది పట్టించుకోకుండా వాగినందుకు నాకే వాళ్ళే గడ్డేట్టేసారు మరి...షిట్...షిట్...

సైకిలెక్కుతున్న కుతూహలమ్మ?

  చిత్తూరు జిల్లా రాజకీయాలు చిత్రంగా ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉంటున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ టీడీపీలో చేరడం ఖాయమైంది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు అయోమయంలో పడ్డాయి. ఇన్నాళ్లుగా రెండు పార్టీల నాయకులు ఒకళ్లపై ఒకళ్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసుకున్నారు. 1980 ప్రాంతాల్లో వైద్యురాలిగా పనిచేస్తున్న కుతూహలమ్మను చంద్రబాబే రాజకీయూల్లోకి తీసుకొచ్చి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చేశారు. ఇది అప్పట్లో జిల్లాలో సంచలనం. కానీ తర్వాత టీడీపీలో ఎదిగిన చంద్రబాబును అప్పట్లో వ్యతిరేకించిన ప్రధాన నేతల్లో కుతూహలమ్మ ఒకరు. 30 ఏళ్లుగా కుతూహలమ్మ కాంగ్రెస్‌లో కొనసాగుతూ అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు మళ్లీ రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత, తన రాజకీయ గురువు చంద్రబాబును కలిశారు. తన కుమారుడు ఎ.హరికృష్ణకు గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబు ఆమెనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం.

సిక్కోలులో చాప చుట్టేస్తున్న కాంగ్రెస్

  శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చాపచుట్టే పరిస్థితికి వచ్చింది. ఇది కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి మింగుడు పడటంలేదు. పార్టీలో ఉన్న కొద్ది మంది నాయకులు ఎక్కువ మంది టీడీపీలోకి, ఒకరిద్దరు జగన్ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. పార్టీని నిలబెట్టేందుకు కిల్లి కృపారాణి చేసిన మంతనాలు పారడంలేదు. నిన్నమొన్నటి వరకు ఆమెకు దాదాపు కుడిభుజంగా వ్యవహరించిన 16వ వార్డు మాజీ కౌన్సిలరు గోళ్ల చంద్రరావు సోమవారం తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. మున్సిపల్ మాజీ చైరపర్సన్ లక్ష్మి భర్త దుర్గాప్రసాద్ కూడా పార్టీ మారే ఉద్దేశంలోనే ఉన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోవడం కంటే స్వతంత్రులుగా పోటీచేసి, గెలిచిన తరువాత అధికారంలోకి వచ్చే పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనలో కొందరు బలమైన అభ్యర్థులు ఉన్నట్టు సమాచారం. ఇటీవల వరుసగా 5 సార్లు పలాస పట్టణానికి కృపారాణి వచ్చి పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లతో సమావేశాలు జరిపారు. మున్సిపాలిటీలో చుట్టరికాలు చేస్తూ ప్రముఖుల ఇళ్లకు వెళ్లి పార్టీకి అండగా నిలవమని ప్రాధేయపడినా ఫలితం మాత్రం ఉండట్లేదు.

అనంత కాంగ్రెస్ లో మిగిలింది ముగ్గురే!

  అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోతోంది. సీనియర్ నాయకులు అందరూ ఒక్కొక్కరూ జారుకుంటున్నారు. దాంతో ఇక జూనియర్లకు పండగే పండగ. ఈసారి అడిగినవాళ్లకు లేదనకుండా టికెట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శివరామిరెడ్డి మాత్రమే కొనసాగుతున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జగన్ పార్టీలో చేరిపోయారు. తాడిపత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి టీడీపీలోకి దాదాపు వెళ్లిపోయినట్లే. గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదనగుప్తా కాంగ్రెస్‌ను వీడి ఏదో ఒక పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.   శింగనమల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి శైలజానాథ్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పెట్టే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి జగన్ పార్టీకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్సీ పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా ఆయన ఈ సారి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్లు ఎలా కేటాయిస్తారో చూడాల్సిందే మరి!

పొన్నాలకు కోడలి గండం

  కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు ఇంటిపోరు మొదలైంది. జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్యకు, ఆయన కోడలు వైశాలికి మధ్య విభేదాలు తలెత్తాయి. నిజానికి వైశాలి గతంలోనే పోటీ చేయాలని భావించినా, అప్పట్లో డీలిమిటేషన్ కారణంగా కుదరలేదు. దాంతో ఇప్పుడు తాను పోటీ చేసి తీరాల్సిందేనని ఆమె గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ లక్ష్మయ్య ఆలోచన వేరేలా ఉంది. జనగామ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇప్పుడు జనరల్ మహిళకు కేటాయించారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ పదవిని తీసుకుని... వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందని లక్ష్మయ్య వర్గం నుంచి వైశాలికి ప్రతిపాదనలు వెళ్లాయి. దీనికి ఆమె ససేమిరా అంటున్నారు. మహిళా కాంగ్రెస్ పార్టీకి వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవసరమైతే లక్ష్మయ్య భువనగిరి లోక్‌సభకు పోటీ చేయాలని... తాను మాత్రం ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని చెబుతున్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉంటానని.. సీనియర్ నేతగా అన్ని అర్హతలు ఉన్నాయని లక్ష్మయ్య భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటి నుంచే పోరు మొదలవడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

కిరణ్ పార్టీ పేరు ఖరారు

  ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి తన కొత్త పార్టీ పేరు, కార్యవర్గం సభ్యుల వివరాలు వగైరా ప్రకటించారు. కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర' పార్టీ పేరుని ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్టర్ చేయించుకొన్న చుండ్రు శ్రీహరిరావుని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటారని , తాను అధ్యక్షుడుగా ఉంటానని కిరణ్ ప్రకటించారు. కొత్త పార్టీకి "తెలుగువారి ఆత్మగౌరవం'' అనే ఓ ట్యాగ్ లైన్ కూడా చేర్చారు.   కాంగ్రెస్ బహిష్కృత యంపీలు-ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బం హరి, హర్షకుమార్, సాయిప్రతాప్ మరియు మాజీ మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణలు ఈ పార్టీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇక లగడపాటి రాజకీయ సన్యాసం స్వీకరించినప్పటికీ ఆయన ఈ కొత్త పార్టీకి సలహాదారుగా ఉంటారని కిరణ్ తెలిపారు. జి. గంగాధర్, తులసీరెడ్డి, రత్నబిందులను పార్టీ కార్యదర్శులుగా ఎంచుకొన్నారు. ఇక కొత్త పార్టీ విధివిధానాల గురించి, ఆశయాల గురించి ఈ నెల 12న రాజమండ్రిలో జరగనున్న బహిరంగ సభలో ప్రకటిస్తానని తెలిపారు.   రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ, కాంగ్రెస్ ను వదిలి పెట్టి చంద్రబాబు లేఖ ఇచ్చినందునే రాష్ట్ర విభజన జరిగిందని తన అధిష్టానాన్నివెనకేసుకు వచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా ముందుకు సాగడం కష్టం గనుక, సోనియమ్మకు కవచంలా జైరామ్ రమేష్, దిగ్విజయ్ సింగులను సున్నితంగా విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా తన పార్టీకి ‘జై సమైక్యాంధ్ర’ అని పెట్టుకోవడంపై వస్తున్న విమర్శలకు జవాబుగా గత ఆరేడు నెలలుగా కోట్లాది మంది ప్రజల నిత్యం జపించిన దానినే తన పార్టీ పేరుగా పెట్టుకొన్నానని సర్ది చెప్పుకొన్నారు.   సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారందరూ తన పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేసి, ఇది వాళ్ళ పార్టీయేననే భావన కలిగించే ప్రయత్నం చేసారు. డిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆమాద్మీ పార్టీ పెట్టినప్పుడు కూడా సరిగ్గా ఇటువంటి విధానమే అనుసరించి ప్రజలను ఆకర్షించగలిగారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకే పార్టీ పెడుతున్నానని చెప్పుకొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన చేసిన తన అధిష్టానం పట్ల నేటికీ అదే విధేయత కనబరచడం విడ్డూరంగా ఉంది.

చిరంజీవికి పోటీ భయం

   అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, పార్టీ పెట్టిన కొత్తల్లోనే సొంత ఊరికి దగ్గర్లో, అత్తవారి ఊళ్లోనే.. అదే పాలకొల్లులో ఓడిపోయిన చిరంజీవికి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అప్పట్లోనే, సొంత సామాజికవర్గం బలంగా ఉన్న చోట కూడా ఓ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తాను ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ మీద, అందులోనూ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రుల మీద పీకల వరకు కోపం ఉన్న సీమాంధ్ర ప్రాంతంలో పోటీ చేసి నెగ్గగలనా అన్న అనుమానం కూడా గట్టిగానే ఉంది. దాంతో ప్రత్యామ్నాయం కోసం చూసుకుంటున్న చిరుకు.. కర్ణాటకలో తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే చిక్ బళ్లాపూర్ స్థానం కనిపించింది. బెంగళూరుకు సమీపంలోని చిక్ బళ్లాపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని అంటున్నారు. ఇక్కడ తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉండటంతో పాటు చిరంజీవికి చెప్పుకోదగ్గ సంఖ్యలో అభిమానులున్నారు. చిరంజీవికి కాస్తో కూస్తో విజయావకాశాలు ఉన్నాయంటే ఇక్కడే అంటున్నారు. ప్రస్తుతం ఈ స్థానానికి కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అళగిరి పని శంకరగిరి మాన్యాలే?

  తండ్రితో విభేదాలు.. సోదరుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరికి.. ఈసారి అసలు తమ సొంత పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కూడా దక్కేలా లేదు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను డీఎంకే పార్టీ ఖరారు చేసింది. 35 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకె అళగిరికి ఇందులో చోటు దక్కలేదు. పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో అళగిరిని జనవరిలో తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు స్టాలిన్ తో వారసత్వ పోరు సాగిస్తున్న అళగిరి ఇంతకుముందు తండ్రిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. 2జీ స్పెక్ట్రం కేసులో నిందితులు, టెలికం మాజీ మంత్రులు ఎ. రాజా, దయానిధి మారన్ లకు మాత్రం టికెట్లు దక్కాయి. నీలగిరి నుంచి రాజా, చెన్నై సెంట్రల్ నుంచి మారన్ పోటీ చేయనున్నారు.

రోడ్డున్న పడుతున్న నేతలు

      అనంతపురం జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ టికెట్లు ఆశించిన కొందరు నాయకులు 2014 ఎన్నికలే లక్ష్యంగా ఏడాదిగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. నియోజకవర్గాల్లో తరచూ పర్యటించి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉన్న డబ్బుంతా వదిలించుకున్నారు. సేవలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో విజయం సాధించినా.. టికెట్లు మాత్రం దక్కే సూచనలు కనిపించలేదు. దాంతో పోయిన డబ్బులు లెక్కలేసుకుంటూ.. కక్కలేక.. మింగలేక లోలోన మధనపడిపోతున్నారు.   రాయదుర్గం నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత పార్టీ టికెట్ ఆశించి ఏడాది నుంచి విస్తృతంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాలు,  సేవా కార్యక్రమాలు అంటూ లెక్కకు మించి ఖర్చు చేసుకున్నారు. కానీ ఇప్పుడు టికెట్ దక్కే సూచనలు కనిపించట్లేదు. దాంతో సేవలకు రాం..రాం...చెప్పారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో బాగా గడించారు. దీనికి తోడు కాంట్రాక్టు పనులు చేసి అనతికాలంలోనే కోట్లు సంపాదించారు. టికెట్ వస్తుందన్న ఆశతో, గుడులు..గోపురాలకు ఇతోదిక విరాళాలు అందజేశారు. యువతకు క్రికెట్ కిట్లు, పండుటాకులకు ఖర్చులకు డబ్బులు ఇస్తూ వచ్చారు. ఇదే క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రావడంతో అయిన కాటికి ఖర్చు చేసి పార్టీ మద్దతుదారులను గెలిపించుకున్నారు. తీరా చూస్తే..ఈ నాయకునికి కాకుండా మరో నాయకునికి అధిష్టానం టికెట్టు ఖరారు చేయనున్నట్లు తెలుసుకుని కంగుతిన్నారు.

జూనియర్ యన్టీఆర్ బీజేపీలోకి జంప్?

  ఇటీవల తెదేపాలో చేరిన గల్లా జయదేవ్ తన బావమరిది మహేష్ బాబు తన కోసం (పార్టీ కోసం) ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మహేష్ బాబుతో బాటు ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తదితరులు కూడా తెదేపా ప్రచారం కోసం తరలిరావడం ఖాయమనేసుకోవచ్చును.   అయితే ఇంతవరకు తేదేపాకు స్టార్ ఎట్రాక్షన్ గా నిలచిన జూ.యన్టీఆర్ పరిస్థితి ఏమిటనే ధర్మసందేహం అందరికీ కలగడం సహజం. జూ.యన్టీఆర్ మరియు అతని తండ్రి హరికృష్ణ చాలా కాలంగా తెదేపాకు దూరంగానే ఉన్నారనే సంగతి, అందుకు కారణాలు వగైరా అందరికీ తెలిసిన సంగతే. అదేవిధంగా చంద్రబాబు, బాలకృష్ణలు కూడా వారిరువురితో అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో మళ్ళీ తనకు టికెట్ కావాలని హరికృష్ణ అడిగినప్పటికీ చంద్రబాబు ఆయన అభ్యర్ధనను పట్టించుకోకపోవడంతో ఆయన సమావేశం మధ్యలోనే అలిగి బయటకు వెళ్ళిపోయారు. ఈ నేపధ్యంలో గల్లా జయదేవ్ కోసం మహేష్ బాబు వంటి పెద్ద స్టార్ ప్రచారానికి వస్తున్నపుడు ఇక వారిని చంద్రబాబు పట్టించుకొంటారా? అనే అనుమానం కలుగక మానదు. ఇంతజరిగిన తరువాత ఒకవేళ ఆయన పిలిచినా వారిరువురూ వస్తారా లేదా? అనేది కూడా అనుమానమే.   ఒకవేళ వారి మధ్య ఈ దూరం ఇలాగే ఉండిపోతే, ప్రతిపక్ష పార్టీలు వారిరువురికీ ఆహ్వానాలు పంపితే వారు వెళ్ళకుండా ఉంటారా? ఇప్పుడు స్వయాన హరికృష్ణ సోదరి పురందేశ్వరి బీజేపీలో చేరారు గనుక, ఒకవేళ ఆమె ఆహ్వానిస్తే హరికృష్ణ, జూ.యన్టీఆర్ ఇరువురూ కూడా బీజేపీలోకి వెళ్ళినా వెళ్ళవచ్చును. కానీ, తెదేపా-బీజేపీలు గనుక ఎన్నికలు పొత్తులు పెట్టుకోన్నట్లయితే మళ్ళీ నందమూరి కుటుంబ సభ్యులు అందరూ పాత (యన్టీఆర్) సినిమాలలోగా గ్రూప్ ఫోటోకి కలుస్తారేమో!