హైదరాబాద్ ను యుటీ చేయండి... గాలి

తెలుగుదేశం సీనియర్ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తెరాస, వైకాపాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఒంటరిగా ఎదుర్కోలేక వైకాపా, తెరాస, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని.. తెదేపాను దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని.. లేకపోతే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుండి తరిమి కొట్టడానికి హైదరాబాద్ ఏమీ కేసీఆర్ సొత్తు కాదని.. కేసీఆర్ నోరు అదుపులో పట్టుకొని మాట్లాడాలని విమర్శించారు. కేసీఆర్ అలా మాట్లాడుతున్నా గవర్నర్ ఏం పట్టనట్టు ఉండటం మంచిది కాదని.. ఆయన వివక్షతను చూపడం ఆపాలని ఎద్దేవ చేశారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో ఇక్కడ ఇంత తతంగం జరుగుతుంటే తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి అమెరికా ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టుంది

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించాలని తెగ తాపత్రయపడుతున్న తెరాస ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది. నిన్నటి వరకూ పోన్ ట్యాపింగ్ జరగలేదు.. జరగలేదు అని మొత్తుకున్న తెరాస ప్రభుత్వం.. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలన్నీ మావద్ద ఉన్నాయని చంద్రబాబు, మంత్రులు హెచ్చరించేసరికి అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. "ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం.. ఇది ఒట్టి ఆరోపణ కాదు.. తెలంగాణ ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేశారన్న దానికి మావద్ద ఆధారాలు ఉన్నాయి దీంతో తెరాస ప్రభుత్వం పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని" చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెరాస నేతలలో వణుకుపుట్టించినట్టుంది. లేకపోతే అలా చంద్రబాబు హెచ్చరించేసరికి ఇలా కేసీఆర్ ట్యాపింగ్‌కు సంబంధించిన సమాచారమేదీ ఇవ్వడానికి వీలులేదంటూ అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేయడం అశ్చర్యకరం. అసలు వాళ్లు ఫోన్లు ట్యాపింగే చేయనప్పుడు సమాచారం ఇవ్వడానికి వీలులేదని ఎందుకు చెపుతారు. దానితో పాటు ఏపీ సర్కారుకు చెందిన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారంట.   మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన మత్తయ్య వాంగ్మూలం కూడా కీలకం కానుంది. చంద్రబాబును ఈ కేసులో ఇరికించడానికి చూస్తున్నారని, చంద్రబాబు పేరు చెప్పాలని తనను బెదిరిస్తున్నారని.. రూ కోటి రూపాయలు తీసుకొని స్టీఫెన్ సన్ కు కేసీఆర్ ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టారని చెప్పాడు. దీంతో ఏపీ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. దీనిని బట్టి కేసీఆర్ ఏదో చేయబోయి. ఏదో చేసి చంద్రబాబును ఇరికించబోయి తాను ఇరుక్కునేలా ఉన్నాడు.

నోటుకు ఓటు కేసు రంగంలోకి హోంశాఖ కార్యదర్శి?

ఇరు రాష్ట్రాల రాజకీయాలు ప్రస్తుతం చాలా వేడెక్కి ఉన్నాయి. దీనంతటికి కారణం రేవంత్ రెడ్డి కేసు అని ప్రత్యేకించి ఎవరూ చెప్పనవసరం లేదు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుండి ఈ కేసుకు సంబంధించి రోజుకో వార్త వింటూనే ఉన్నాం. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికి వరకూ ఎక్కువ చొరవ తీసుకోకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగాయంటూ.. రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినప్పటికీ కేంద్రం మాత్రం ఈ కేసులో అంత చొరవ తీసుకోలేదు. మరోవైపు జీజేపీకి, టీడీపీకి పొత్తు ఉండటంతో ఈ కేసు వ్యవహారంలో తల దూర్చలేని పరిస్థితి ఏర్పడింది.   ఇప్పుడు ఈ కేసును ఈ సమస్యను తీర్చడానికి ప్రతినిధులను రంగంలోకి దించనుంది. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అలోక్ కుమార్ త్వరలో హైదరాబాద్‌కు రానున్నట్టు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఆయన ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో.. గవర్నర్ తో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించి ఇరు రాష్ట్రాల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది.. ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో అని.. శాంతి భద్రతల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని గవర్నర్ కు సూచించారు.   మరోవైపు అసలు కేంద్ర ప్రభుత్వం ఈ కేసు గురించి ఇన్ని రోజులూ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం వల్లే పరిస్థితి ఇంత ఉద్రిక్తంగా తయారైందని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందే రంగంలోకి దిగి ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించినట్టయితే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదేమో అంటున్నాయి రాజకీయవర్గాలు. కానీ ఇది ఏదో మామూలు కేసు అయితే కేంద్ర ఎప్పుడో చర్యలు తీసుకునేది.. కానీ ఈ కేసు చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉండటంతో.. పైగా రెండు రాష్ట్రాల సీఎంలకు సంబంధించిన విషయం కావడంతో తగిన సమయం కోసం చూసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

కీలకమైన వాంగ్మూలాలు.. సమరానికి సై అంటున్న సీఎంలు

ఓవైపు స్టీఫెన్ సన్ వాంగ్మూలం.. మరోవైపు ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య ఇచ్చిన వాంగ్మూలం వల్ల నోటుకు ఓటు కేసులో ఏలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఈ కేసులో అత్యంత కీలకమైన తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపన్ సన్ వాంగ్మూలాన్ని నాంపల్లి ఏసీబీ కోర్టులో నమోదు చేసుకున్నారు. స్టీఫెన్ సన్ వాంగ్మూలం బట్టి తను చెప్పే పేర్లను బట్టి తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో "చంద్రబాబును ఇరికించాలని చూస్తున్నారని, చంద్రబాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారని.. కోటీ రూపాయలు స్టీఫెన్ సన్ దగ్గర తీసుకొని కేసీఆర్ తనకి ఎమ్మెల్యే పదవి ఇచ్చారని"... విజయవాడలో మేజిస్ట్రేట్‌ ముందు మత్తయ్య తన వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఏపీ సీఐడీ ఈకేసు దర్యాప్తును ముమ్మరం చేసి మత్తయ్య ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.   దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పోటాపోటీగా నోటీసులు జారీ చేసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా వాళ్లు నోటీసులు పంపిస్తే మనం నోటీసులు పంపిద్దాం.. వాళ్లు కేసు పెడితే మనం కూడా కేసు పెడదాం.. అంటూ ఏపీ అధికారులకు ముందే తేల్చి చెప్పారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏ ఒక్క ఆధారం కూడా వదిలిపెట్టకుండా ఎలాగైనా చంద్రబాబును ఇరికించాలని పట్టువీడని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తుంది. దీంతో రెండు రాష్ట్రాలు సై అంటే సై అనే పరిస్థితికి వచ్చాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నువ్వా నేనా అని తేల్చుకునే పరిస్థితికి వచ్చారు.

స్టీఫెన్ సన్ వాంగ్మూలం నమోదు..

రేవంత్ రెడ్డి కేసులో అత్యంత కీలకమైన స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్నీ నాంపల్లి ఏసీబీ కోర్టులో మూడో అదనపు మెట్రో పాలిటన్‌ మెజిస్ర్టేట్‌ నమోదుచేసుకున్నారు. స్టీఫెన్ సన్ తోపాటు కుమార్తె జెస్సీకా, మిత్రుడు మార్క్ టేలర్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. ఇప్పుడు స్టీఫెన్ సన్ ఇచ్చిన వాంగ్మూలం బట్టే అసలు కేసు ఆధారపడి ఉంది. స్టీఫన్ సన్ వాంగ్మూలం బట్టి అసలు కథ ఎలా మొదలైంది.. ఎవరెవరూ దీనిలో ఉన్నారు.. అనే అంశాలు బయటకొస్తాయి. దీనిని బట్టే ఏసీబీ అధికారులు కూడా ఎవరెవరికి నోటీసులు జారీ చేయాలో ఒక నిర్ణయానికి వస్తారు. మరోవైపు చంద్రబాబు స్టీఫెన్ సన్ లతో చేసిన సంభాషణల ఆడియో టేపులు, రేవంత్ రెడ్డి అరెస్ట్ ఆడియో వీడియో టేపుల గురించి కూడా స్టీఫెన్ సన్ ఇచ్చే వాంగ్మూలం బట్టి ఎంత వరకూ నిజమో తెలుస్తుంది.

వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు బయలుదేరిన సీఫెన్ సన్

నోటుకు ఓటు కేసులో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తయితే ఇప్పుడు అత్యంత కీలకమైన తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలంతో జరగబోయే పరిణామాలు ఒక ఎత్తు. ఈ కేసులో కీలక సాక్షి స్టీఫెన్ సన్ తన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ముందు తెలియజేయడానికి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు బయలుదేరారు. ఏసీబీ అధికారులు ఈ కేసు గురించి దర్యాప్తు చేసి ఎంతో సమాచారాన్ని సేకరించిన స్టీఫెన్ సన్ ఇచ్చే వాంగ్మూలం మాత్రం అత్యంత కీలకమైంది. స్టీఫెన్ సస్ ఇచ్చే వాంగ్మూలం బట్టే ఎవరెవరికి నోటీసులు జారీ చేయాలో ఏసీబీ అధికారులు ఒక నిర్ణయానికి వస్తారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం స్టీఫెన్ సన్ కు పూర్తిస్థాయి భద్రత కల్పించింది. 20 మంది వరుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పటిష్టమైన భద్రత మధ్య.. బులెట్ ఫ్రూఫ్ కారులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు వెళ్లారు స్టీఫెన్ సన్. ఈయన ఇచ్చే వాంగ్మూలం బట్టే ఈ కేసులో ఉన్నది ఎవరు.. తనతో ఎవరు బేరసారాలు జరిపారు అనే విషయం తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందరిలోనూ చాలా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నాంపల్లి కోర్టు బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రేవంత్ కు బెయిల్ వచ్చెనా?

నోటుకు ఓటు కేసులో ప్రధాన నిందితుడైన తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మాత్రం బెయిల్ విషయంలో ఊరట కలగడంలేదు. ఇప్పటికే ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో రేవంత్ రెడ్డితో పాటు ఈకేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహాలు కూడా హైకోర్టు తలుపులు తట్టారు. అసలు నాలుగు రోజులు ఏసీబీ కస్టడీలో విచారణ చేసిన వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేయోచ్చు కానీ సాక్ష్యాలను తారుమారు చేస్తారు.. సాక్ష్యులను బెదిరిస్తారు అని ఏవో మాటలు చెప్పి రేవంత్ కు బెయిల్ రాకుండా చేశారు ఏసీబీ అధికారులు. తన కూతురి నిశ్చితార్ధ కార్యక్రమానికి వెళ్లినా రేవంత్ రెడ్డి నిబంధనలు అన్నీ కచ్చితంగా పాటించి ఏ కారణాలు తన బెయిల్ కు ఆటంకం కలిగించకూడదని ఇంకా సమయం ఉన్నా కానీ రెండు గంటల ముందే తానే స్వచ్ఛందంగా జైలుకు వెళ్లారు. అయినా కానీ అవేమీ ఏసీబీ లెక్కలోకి పరిగణించలేదు.   ఇదే విషయంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ నేను చెప్పాల్సింది ఆ నాలుగు రోజుల విచారణలోనే చెప్పేశా ఇంకా చెప్పడానికి నాదగ్గర ఏం లేదు అని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇక ఏసీబీ కోర్టు ద్వారా తనకు బెయిల్ రాదని హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయమని ఏసీబీ ని ఆదేశించింది. రేవంత్ బెయిల్ పిటిషన్ పై తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. ఇక హైకోర్టు అయినా రేవంత్ రెడ్డికి బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి.అయితే రేవంత్ రెడ్డికి ఈ నెల 29 వరకూ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన సంగతి తెలిసిందే.

50 లక్షలు నావని రుజువైతే రాజీనామా చేస్తా.. మరో 20 మందికి నోటీసులు?

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో గంట గంటకి ఉత్కంఠ పెరిపోతోంది. తెలంగాణ ప్రభుత్వ వ్యూహాలు ఏంటి.. వాటికి ఏపీ ప్రభుత్వ ప్రత్యూహాలేంటే అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు ప్రభుత్వాల నాయకులు ఒకరిమీద ఒకరు సవాళ్లు విసురుకోవడం.. మాటల యుద్ధాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలకు పాటు ఎంపీ సీఎం రమేశ్ కు కూడా నోటీసులు జారీ చేయనుంది. ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కాగా ఈ కేసు గురించి సీఎం రమేష్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో దొరికిన 50 లక్షల రూపాయలు నావని తెలిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కావాలనే తన మీద ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.   ఇదిలా ఉండగా వీరితో పాటు మరో 20 మందికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడానికి సన్నద్ధమయినట్టు తెలుస్తోంది. ఈలిస్టులో చంద్రబాబుతో పాటు పార్టీలో అతి ముఖ్యులైన వారి పేర్లు కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే దశల వారిగా వారికి నోటీసులు జారీ చేయాలని ఏసీబీ చూస్తుండగా ఎప్పుడు ఎవరికి నోటీసులు వెళతాయో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు తెదేపా నాయకులు. మరోవైపు కేంద్ర హోంశాఖ ప్రతినిధులు ఇవాళ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ లో సెక్షన్-8 అమలు, ఓటుకు నోటు కేసు, ఇతర సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ చర్చించనుంది.

ఏసీబీ విచారణలో వేం నరేందర్ రెడ్డి

ఓటుకు నోటు కేసులో భాగంగా టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ ఓటుకు నోటు కేసులో ఇద్దరు టీడీపీ నేతలు వేం నరేందర్ రెడ్డికి, సండ్ర వెంకట వీరయ్యల హస్తం ఉందని గత రాత్రే ఏసీబీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. కేసులో విచారణకు రావాల్సిందిగా ఏసీబీ అధికారులు వేం నరేందర్ రెడ్డిని కోరగా తనకు గుండె సంబంధ వ్యాదితో బాధపడుతున్నానని, బుధవారం ఉదయం విచారణకు హాజరవుతానని చెప్పడంతో ఏసీబీ అధికారులు అక్కడినుండి వెళ్లిపోయారు. కాగా ఈరోజు కేసు విచారణ నిమిత్తం వేం ఏసీబీ ముందు హాజరయ్యారు. మరోవైపు సండ్ర వెంకట వీరయ్యను కూడా ఏసీబీ విచారించనుంది.

చంద్రబాబుకు కోర్టు నుండి నోటీసులు?.. కేసీఆర్ కు కూడా నోటీసులు?

ఓటుకు నోటు కేసు క్లైమాక్స్ దశకు చేరుకుందనే అనిపిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏసీబీ, పోలీసు అధికారులు కలిసి చాలా పకడ్భందీగా ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీనిలో భాగంగానే ఏసీబీ అధికారులు మంగళవారం అర్ధ్రరాత్రి ఇద్దరు టీడీపీ నేతలు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యల ఇంటికి నోటీసులు జారీ చేసేందుకు వెళ్లారు. నోటుకు ఓటు కేసులో వీరి ప్రమేయం కూడా ఉందని.. ముందు వీరికి నోటీసులు ఇచ్చి.. ఆతరువాత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అయితే మొదట ఏసీబీనే చంద్రబాబుకు నోటీసులు జారీ చేద్దామనుకున్నా.. కేసీఆర్, పోలీసు అధికారులతో చర్చించిన అనంతరం కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకుంది. కాగా.. ఆడియో వీడియో రికార్డింగులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు వెళ్లగా అక్కడి నుండి వచ్చే నివేదిక ఆధారంగా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని చూసినా.. నివేదిక రావడానికి ఇంకా సమయం పడుతుండటంతో ఇప్పటికివరకు తాము సేకరించిన ఆధారాలతో కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో అత్యంత కీలకమైన తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఈరోజు తీసుకోనున్నారు. స్టీఫెన్ సన్ వాంగ్మూలంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అందరిలో ఆసక్తి నెలకొంది.   ఇదిలా ఉండగా ఈకేసులో చంద్రబాబు కూడా తెలంగాణ ప్రభుత్వంపై అమితుమీ తేల్చుకోవడానికి రె'ఢీ' అయ్యారు. తెలంగాణ సర్కార్ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తరువాత స్టెప్ ఏంటని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు జరుపుతున్ననేపథ్యంలో ఆయన ఏదైతే అది అయింది వారు నోటీసులు పంపిస్తే.. మనం నోటీసులు పంపిద్దాం.. కేసు పెడితే.. మనం కేసు పెడదాం.. వాళ్లు కోర్టు ద్వారా నోటీసు పంపిస్తే.. మనం కూడా కోర్టు ద్వారా నోటీసు పంపిద్దాం అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరమని.. మా ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆధారాలు పక్కగా ఉన్నాయని ట్యాపింగ్‌కు సంబంధించి ఇద్దరు ఐపీఎస్‌, ఒక ఐఏఎస్‌ అధికారితో పాటు ఇద్దరు ప్రధాన వ్యక్తులు పాత్ర ఉందని వారిని చట్టప్రకారం అరెస్టు చేసి జైలుకు పంపుతామని టీడీపీ నేతలు అంటున్నారు.   ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, అటు ఆంధ్రాప్రభుత్వానికి మధ్య ఓ పెద్ద రాజకీయ పోరే జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రా మధ్య వివాదాలు ఉన్నా ఈ ఓటుకు నోటు కేసు వల్ల అవి మరింత పెరిగాయనడంలో సందేహం లేదు. చూద్దాం.. ఈ పోరులో గెలుపు ఎవరిదవుతుందో.

నా వెనుక ఎవరూ లేరు: స్టీఫెన్ సన్

  ఓటుకు నోటు కేసు గురించి ఎసిబి అధికారులకు లికిత పూర్వకంగా పిర్యాదు చేసిన నామినేటడ్ ఎమ్యల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని ఈరోజు ఎసిబి అధికారులు మేజిస్ట్రేట్ ముందు సేకరించబోతున్నారు. ఆయనతో బాటు ఈకేసులో రెండవ నిందితుడిగా పేర్కొనబడిన సెబాస్టియన్ యొక్క కుమార్తె జెస్సీని , వారు నివాసముంటున్న ఫ్లాట్ యజమాని వాంగ్మూలాలను కూడా సేకరించనున్నారు. వారిచ్చిన వాంగ్మూలాలను బట్టి ఎసిబి అధికారులు ఎవరెవరికి నోటీసులు జారీ చేయాలనే విషయంపై ఒక తుది నిర్ణయం తీసుకొంటారు.   ఈ వ్యవహారంలో ఎమ్యల్యే స్టీఫెన్ సన్ చాలా ధైర్యంగా, నిజాయితీగా వ్యవహరించినందుకు ఆయన్ని నిన్న క్రీస్టియన్ సంఘాలు సికిందరాబాద్ సెయింట్ మేరీ కాలేజీలో ఘనంగా సన్మానించాయి. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ వ్యవహారంలో నేను నా అంతరాత్మ ప్రభోదంతోనే నడుచుకొన్నాను తప్ప నాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. అనేక దశాబ్దాలుగా నేను చేస్తున్న వ్యాపారం ద్వారా కనీసం కోటి రూపాయలు కూడా సంపాదించలేకపోయాను. నేను చాలా సామాన్యుడిని మధ్యతరగతికి చెందినవాడిని. అయినా డబ్బు కోసం ఆశపడకుండా నాకు ఏది మంచిది అనిపిస్తే అదే చేసాను. ఇందులో ఎవరి ఒత్తిడి, ప్రమేయం లేదు. దేశం కోసం ప్రజల కోసం త్యాగాలు చేయగలిగినప్పుడే నాయకుడనిపించుకొంటాడని నా అభిప్రాయం. ఇంతకాలం నన్ను మన క్రీస్టియన్ సోదరులు నన్ను కేవలం ఒక ఆంగ్లో ఇండియన్ గా మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు మీరందరూ నన్ను మీ ప్రతినిధిగా గుర్తించి గౌరవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు.

సండ్ర వీరయ్యకు ఎసిబి నోటీసులు జారీ

  ఓటుకు నోటు వ్యవహారంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి తెదేపా ఎమ్యల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఎసిబి నిన్న సాయంత్రం నోటీసులు జారీ చేసింది. కానీ హైదర్ గూడాలో గల ఎమ్యల్యే క్వార్టర్స్ లో ఆయన నివసించే క్వార్టర్ నెంబర్:208కి తాళం వేసి ఉండటంతో ఇక చేసేదేమీ లేక గోడకి ఆ నోటీసు అంటించి వెనుతిరిగారు. తక్షణమే ఎసిబి విచారానాదికారుల ముందు విచారణకు హాజరు కావలసిందిగా నోటిసులో పేర్కొన్నారు. ఈ సంగతి తెలుసుకొన్న వీరయ్య మీడియాతో మాట్లాడుతూ, నాకు ఇంతవరకు ఎటువంటి నోటీసులు అందలేదు. ఒకవేళ అందినట్లయితే నిర్దేశిత సమయంలోగా వారికి జవాబు ఇస్తాను,” అని అన్నారు.

వేం నరేందర్ రెడ్డికి కూడా ఎసిబి నోటీసులు జారీ

  ఇటీవల జరిగిన తెలంగాణా శాసనమండలి ఎన్నికలలో తెదేపా అభ్యర్ధిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డికి ఎసిబి అధికారులు నిన్న రాత్రి నోటీసులు అందజేశారు. ఓటుకు నోటు వ్యవహారం ఆయనను గెలిపించుకోనేందుకే మొదలయింది కనుక ఈకేసులో ఆయనను కూడా ప్రశ్నించాలని ఎసిబి అధికారులు భావిస్తునందునే ఆయనకీ నోటీసులు జారీ చేసారు. ఆయనని తమతో పాటు విచారణకు రావలసిందిగా వారు కోరినప్పుడు, తాను గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాని, కనుక బుదవారం ఉదయం విచారణకు హాజరవుతానని ఆయన హామీ ఇవ్వడంతో వారు ఆయన చేతికి నోటిసు అందజేసి వెనుతిరిగారు. కానీ ఆ మరుక్షణమే ఆయన ఇంటి చుట్టూ పోలీసులను మొహరించారు. బహుశః ఆయన తప్పించుకొని పారిపోకుండా చూసేందుకే పోలీసులను ఆయన ఇంటి చుట్టూ మొహరించారేమో?

చంద్రబాబు ఇంటికి నో ఎంట్రీ

ఓటుకు నోటు కేసు వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరికి వారు సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబును ఈ కేసులో ఎలా ఇరికించాలా అని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు వారిని ఎలా ఎదుర్కోవాలా అని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏసీబీ మాత్రం ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా వదలకుండా మరీ దర్యాప్తు చేస్తుంది. దీనిలో అత్యంత కీలకమైన తెలంగాణ నామినేటెట్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఆధారంగా ముఖ్యమంత్రితో పాటు పలువరికి నోటీసులు జారీ చేసేందుకు సన్నద్దమయ్యారు.   మరోవైపు చంద్రబాబు తన నివాసం వద్ద గట్టి భద్రతే ఏర్పాటు చేశారు. తమ సమాచారాన్ని లీక్ చేసే ప్రమాదం ఉందన్న అనుమానంతో కనీసం ఎవరిని తన ఇంటి వద్ద కలిసేందుకు కూడా ఒప్పకోవడం లేదు. ఎదైనా పనుంటే సెక్రటేరియట్‌కో లేదా క్యాంప్‌ ఆఫీసుకో కుదరకపోతే పార్టీ ఆఫీసులో వచ్చి కలవాలని కఠిన అదేశాలే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన గత ఐదురోజులనుండి వరుసగా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు జరుపుతున్నా.. సమాచారం బయటకు పొక్కే అవకాశం ఉందనే అనుమానంతో కనీసం పార్టీ నేతలను సమావేశాలకు దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది.

సెక్షన్-8 ఎందుకు చెల్లదు... దేవినేని

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా నిప్పుల వర్షం చెరిగారు. కుట్రలు పన్ని ఏపీ తెదేపా నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ధైర్యం ఉంటే ఎదురుదాడికి తిరగాలికాని.. ఇలా దొంగదారిలో చేయడం చాలా నీచమని మండిపడ్డారు. హైదరాబాద్ ఏమి కేసీఆర్ సొత్తుకాదని కావాలనే హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుకు ఒప్పుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర పునర్విజభన చట్టం చెల్లినప్పుడు... సెక్షన్-8 ఎందుకు చెల్లదని కేసీఆర్ను ఆయన ప్రశ్నించారు. సెక్షన్ 8 ప్రకారం అమలుచేయాలని, దాని ప్రకారమే గవర్నర్కు తన బాధ్యతలు నిర్వర్తించాలని అన్నారు.

అందరూ బాలకృష్ణ వెంటపడుతున్నారెందుకో?

  నేడు కాకపోతే రేపయినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోక తప్పదన్నట్లుగా మాట్లాడుతున్న కాంగ్రెస్, వైకాపా, తెరాస పార్టీల నేతలందరూ, ఆయన స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలో కూడా వారే నిర్ణయించేయడం విశేషం. బాలకృష్ణకు ముఖ్యమంత్రి కాగల అన్ని అర్హతలు ఉన్నాయని తెరాస, కాంగ్రెస్ నేతలు సర్టిఫై చేస్తున్నారు కూడా. అయితే వారందరూ బాలకృష్ణ వెంటపడుతున్నారెందుకు? ఆయనంటే వారికి అంత అభిమానమా? అని ఆలోచిస్తే కాదని అందరికీ తెలుసు.   పార్టీలో ఎవరికి ఎటువంటి స్థానం కల్పించాలి? అనే విషయం ఆయా పార్టీల అంతర్గత విషయమేనని అందరికీ తెలుసు. కనుక ఇతర పార్టీలు బాలకృష్ణ పేరును ప్రతిపాదించడం వెనుక వారికి ఏవో దురుదేశ్యాలున్నట్లు స్పష్టమవుతోంది. బాలకృష్ణ పేరును ప్రతిపాదిస్తే తెదేపాలో ఎవరూ కూడా అభ్యంతరం చెప్పే సాహసం చేయలేరని ఇతర పార్టీలకి తెలుసు. అలాగని ఎటువంటి రాజకీయ, పరిపాలనానుభవం లేని బాలకృష్ణను ముఖ్యమంత్రిగా నియమించే సాహసం కూడా చేయలేదని వారికి తెలుసు. ఈ సంగతి తెలిసే వారు బాలకృష్ణ పేరును వారు ప్రతిపాదిస్తున్నారు. ఒకవేళ ఆయన ఏమాత్రం ఆసక్తి చూపించినా లేదా పార్టీలో ఆయన మద్దతుదారులు ఆ ప్రతిపాదనను బలపరిచినా తెదేపాలో మరో ముసలం పుట్టడం ఖాయం. అందుకే వారు ఆయన పేరును ముందుకు తీసుకువచ్చి తెదేపాలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.   అయితే ఒకవేళ తెదేపా నిజంగానే బాలకృష్ణను ముఖ్యమంత్రిగా చేసినట్లయితే, అందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఇప్పుడు సర్టిఫికేట్ జారీ చేస్తున్న ప్రతిపక్షాలే రేపు ఆయన అనుభవరాహిత్యం కారణంగా సరిగ్గా ప్రభుత్వాన్ని నడిపించలేకపోయినా, తప్పటడుగులు వేసినా తెదేపా ప్రభుత్వంపై విరుచుకుపడి అదొక అసమర్ధ ప్రభుత్వమని విమర్శించడం ఖాయం. అయితే సుదీర్ఘ రాజకీయ, పరిపాలనానుభవం ఉన్న చంద్రబాబు నాయుడి పరిపాలననే తప్పుపడుతూ నిత్యం ధర్నాలు, దీక్షలు నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీలు, ఎటువంటి పరిపాలనానుభవం లేని భోళాశంకరుడు వంటి బాలకృష్ణ ముఖ్యమంత్రి అయినట్లయితే ఆయనతో చెడుగుడు ఆడేసుకొంటాయని వేరేగా చెప్పనవసరం లేదు. ఇక సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన అంశాలను పట్టుకొని తెరాస మంత్రులు కూడా ఆయనతో ఒక ఆటాడేసుకొంటారని వేరేగా చేపనవసరం లేదు. అందుకే వారు ముక్త కంఠంతో బాలకృష్ణ పేరును ప్రతిపాదిస్తున్నారని భావించవచ్చును.   అయితే చిరకాలంగా రాజకీయాలలో ఉన్న బాలకృష్ణ ప్రతిపక్షాల ఈ ఆలోచనలను పసికట్టలేనంత అమాయకుడేమీకారు కనుకనే ఆయన వారి మాటలను పట్టించుకోలేదు, స్పందించడం లేదు. ఇక మరో కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయడం తప్పదనే భావన ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా తెదేపా శ్రేణుల మనోధైర్యం దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు ఈవిధంగా ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతోంది. ప్రతిపక్షాలు ఆడుతున్న ఈ “మైండ్ గేమ్స్”ని తెదేపా నేతలు ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.

సెక్షన్ 8 పై ఇద్దరు సీఎంల పోరు... కేంద్రాన్నైనా ఢీకొంటాం.. కేసీఆర్

ఒకవైపు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయమని పట్టుబడుతుంటే.. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు అనసరం లేదని చెపుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఅర్, గవర్నర్ భేటీ అయి గంటన్నరపాటు చర్చించుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయంలో చాలా మొండిగా ఉన్నట్టు తెలుస్తోంది. నోటుకు ఓటు కేసులో చట్టం తన పని తాను చేసుకపోతుందని, దీనిని అడ్డంపెట్టుకొని సెక్షన్ 8 అమలు చేస్తామంటే ఊరుకునేది లేదని దీనిని మేము ప్రతిఘటిస్తామని గవర్నర్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్రంతో పోటీ పడటానికైనా సిధ్దమని కేసీఆర్ తెలిపారు. తెదేపా నేతలు తమ ఫోన్ ట్యాపింగ్ లకు గురయ్యాయని తెగ మొత్తుకుంటున్నారు కానీ అలా చేయలేదని దానికి సంబంధించిన నివేదికలు కూడా ఏసీబీ కేంద్రానిక సమర్పించిందని కేసీఆర్ అన్నారు.   మరోవైపు ఏపీ చంద్రబాబు కూడా సెక్షన్ 8 అమలుపై చాలా పట్టుదలతో ఉన్నారు. దీనిలో భాగంగా ఆయన గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్‌ శర్మ, ఏకే మహంతిలతో సమావేశమయ్యారు. సెక్షన్‌ 8 అమలు విషయంలో చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే సమంజసంగా ఉంటుందని సలహాదారులిద్దరూ గవర్నర్‌కు సూచించారు. చూడాలి ఇద్దరి సీఎంలలో ఎవరి పట్టదల నెగ్గుతుందో.