స్పీడ్ న్యూస్ 1
posted on Jul 27, 2023 @ 11:04AM
ప్రేమ జంటకు శ్మశానంలో వివాహం
1. ఓ ప్రేమ జంటకు స్మశానంలో అతి వైభవంగా వివాహం జరిగిన అరుదైన ఘటన శిర్డీ సమీపంలోని రహతా గ్రామంలో జరిగింది. స్థానిక శ్మశానంలో కాటికాపరిగా పని చేస్తున్న వ్యక్తి కుమార్తె ప్రేమ వివాహాన్ని ఆమె పుట్టి పెరిగిన చోటే చేయాలన్న తలంపుతో ఆ జంట వివాహం శ్మశానంలో అంగరంగ వైభవంగా జరిపించారు.
...............................................................................................................................................
పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకం నిషేధం : యునెస్కో
2. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని యూనెస్కో సూచించింది. మనుషుల మధ్య సంబంధాలను డిజిటల్ టెక్నాలజీతో భర్తీ చేయకూడదని అభిప్రాయపడింది. కాగా, ఇప్పటికే పలు దేశాల్లో ప్రభుత్వాలు స్కూళ్లల్లో మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల వినియోగంపై నిషేధం విధించాయి.
..............................................................................................................................................................
ముత్యాల జలపాత సందర్శనకు వెళ్లి చిక్కుకున్న పర్యాటకులు
3. ములుగు జిల్లా వీరభద్రవరం ముత్యాల జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన 84 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న ఉదయం ఈ జలపాతం చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా భారీ వర్షాలకు వాగు ఉప్పొంగింది. దీంతో పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. డయల్ 100 ద్వారా పర్యాటకులు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది.
.......................................................................................................................................................
బీజేపీ నుంచి జిట్టా సస్పెన్సన్
4. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది. చాలాకాలంగా బీజేపీలో ఉన్న జిట్టా ఇటీవల బీజేపీలో గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ అయ్యాయని, అందుకే పార్టీకి మానసికంగా దూరమయ్యాయనీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్ఠానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
.......................................................................................................................................................
జగన్ ఓ కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్ : లోకేష్
5. జగన్కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ఒంగోలులో బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన జగన్ ను కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గా అభివర్ణించారు. దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక నాయకుడు జగనే అంటూ విమర్శించారు.
.........................................................................................................................................................
ఏపీలో బాలికలు, మహిళల అదృశ్యం
6. ఆంధ్రప్రదేశ్ లొ 2019- 2021 మధ్య 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమైనట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు. దీనిపై జనసేనానిని కేంద్రం విడుదల చేసిన గణాంకాలను కాదనగలరా జగన్ అంటూ ట్వీట్ చేశారు.
...................................................................................................................................................
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వనమాలే: షర్మిల
7. బీఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో కేసీఆర్ పార్టీలోని ఎమ్మెల్యేలందరూ వనమాలే అంటే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అన్నారు.
.........................................................................................................................................................
అవిశ్వాసంతో ఒరిగేదేమీ లేదు: కిషన్ రెడ్డి
8.కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లఅాడిన ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ ఒక్కటేని చెప్పారు. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.
..................................................................................................................................................
సీఎస్ శాంత కుమారి టెలీ కాన్ఫరెన్స్
9.తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్ శాంత కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని, ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
..........................................................................................................................................................
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
10. భారీ వర్షాలకు గోదావరి పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50.2 అడుగులకు చేరింది రికార్డు స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో రాత్రి 12 గంటల సమయానికే 350 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.