బాబు దెబ్బకు దిక్కులు చూస్తున్న జగన్ !
posted on Aug 3, 2023 @ 2:17PM
భగీరథుడు చంద్రబాబు.. భస్మాసురుడు జగన్ అంటూ తెలుగుదేశం నాయకులు, శ్రేణులూ సూటిగా సుత్తిలేకుండా వైసీపీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం వైఫల్యాలకు సమాధానం చెప్పలేక విపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు పరిమితమౌతున్నారు. టీడీపీ, జనసేన పోటాపోటీగా జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలు, ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలలోకి తీసుకువెడుతున్నాయి.ఈ విషయంలో తెలుగుదేశం సూటిగా సుత్తి లేకుండా గణాంకాలు, ఆధారాలతో వైసీపీ సర్కార్ ను, జగన్ అరాచకత్వాన్ని ఎండగడుతుంటే.. వైసీపీ మాత్రం తెలుగుదేశం విమర్శలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో వాటిని వదిలేసి విపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతోంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్య వంతం చేయడానికి తాను ముందుండి పార్టీని నడిపిస్తుంటే.. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రతో తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నారు.
లోకేష్ ఊరూరూ తిరుగుతూ తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేస్తూ.. నువ్వేం చేశావో చూపించు జగన్ రెడ్డీ అంటూ సవాల్ విసురుతున్నారు. ఇదే ఊపులో చంద్రబాబు ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల సందర్శనకి తెరలేపి.. ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిందేంటి? అంటూ డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టారు.
అటు లోకేష్.. ఇటు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను, కుంటుపడిన అభివృద్ధిని సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నిస్తుంటే.. ఆ ప్రశ్నలకు బదులిచ్చే పరిస్థితి లేని వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలు టీడీపీ నేతలపై వ్యక్తిగత మాటల దాడికి దిగుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలను, యువతకి వచ్చిన ఉపాధిని, చేసిన అభివృద్ధిని లోకేష్ ఆధారాలతో సహా చూపెడుతుంటే.. వైసీపీ నేతలు లోకేష్ అప్పుడెప్పుడో విదేశాలలో స్విమ్మింగ్ పూల్ ఫోటోలను వైరల్ చేసి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తాము చేసిన అభివృద్ధి ఏంటో చెప్పుకోలేని వైసీపీ నేతలు ఇలా వ్యక్తిగత విమర్శలతో ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారు.
ఇక చంద్రబాబు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తూ ఈ నాలుగేళ్ళలో నిధులు లేక, ఎక్కడివక్కడే ఆగిపోయిన ప్రాజెక్టుల నిర్మాణాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంటే.. పవన్ కళ్యాణ్ సినిమా బ్రో లో మంత్రి అంబటిని చులకన చేసేలా డైలాగులు ఉన్నాయంటూ వైసీపీ నేతలు నంగనాచి ఏడుపులు ఏడుస్తున్నారు. ఇదిగో ఈ నాలుగేళ్ళలో ఇన్ని నిధులు ఇచ్చాం.. ఇంత కట్టాం అని చూపించాల్సిన వైసీపీ నేతలు.. ప్రజలకు ఏ మాత్రం అవసరమేలేని సినిమా డైలాగులతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా నీటి పారుదల శాఖకి మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ప్రాజెక్టుల గురించి మాట్లాడాల్సింది పోయి బ్రో సినిమాలో తనను కించపరిచేలా డైలాగులు ఉన్నాయంటూ మీడియా ముందు గంటల తరబడి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
అంబటి వ్యాఖ్యలపై చంద్రబాబు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాను ప్రాజెక్టులు, నీళ్లు వ్యవసాయం గురించి మాట్లాడవయ్యా అంటే.. బ్రో సినిమాలో తననేదో అన్నారని.. తననేదో చేశారని రోజుల తరబడి మాట్లాడతాడు. ఈయనా మనకు ఇరిగేషన్ మంత్రి. ఇదీ.. మన ఖర్మ'' అంటూ చంద్రబాబు చురకలంటించారు. అంతేకాదు, మనం చేసే పనులు బాగుంటే.. సినిమాల్లోనూ బాగానే చూపిస్తారు. ఆయన హిస్టరీని ఒక్కసారి చూసుకుంటే.. ఆ మంత్రి ఏమన్నారో .. ఏం చేశారో.. అందరికీ తెలుస్తుంది. గంట, అరగంట అని మాట్లాడేవారు.. మనకు మంత్రులుగా ఉన్నారని గతంలో వైరల్ అయిన అంబటి కాల్ రికార్దింగ్స్ ను ప్రజలకు గుర్తు చేశారు.
మొత్తంగా చూస్తే ఒకవైపు టీడీపీ రాష్ట్రంలో సమస్యలు, జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ.. 'భగీరథుడు చంద్రబాబు-భస్మాసురుడు జగన్' అనే ట్యాగ్ లైన్ ప్రజలలోకి తీసుకెళ్తుంటే.. పాపం వైసీపీ నేతలు మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతూ ప్రజా సమస్యలను ప్రశ్నించిన వారిపై బురదజల్లే పని పెట్టుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ కానీ, ప్రజలకు ఈ విషయం ఎప్పుడో అర్ధమయింది కనుక ఇక ఫలితం అనుభవించాల్సింది వైసీపీనే!