చంద్రబాబు పార్టీ మూసుకోవాల్సిందే! వైసీపీ నేతల విసుర్లు 

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అధికార వైసీపీ బీసీల సమావేశాలు నిర్వహించింది. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞత చెబుతూ ఈ సమావేశాలు జరిగాయి. సీఎం అభినందన సభల్లో పాల్గొన్న వైసీపీ మంత్రులు, నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏపీలో చంద్రబాబు పని అయిపోయిందని... హైదరాబాదులో విశ్రాంతి తీసుకోవచ్చని మంత్రి అనిల్ కుమార్ హితవు పలికారు. ఆయన కుమారుడు ఈ మధ్య ట్రాక్టర్ స్టీరింగ్ వదిలేసి ప్రజలపైకి పోనివ్వబోయారని.... ఆ పార్టీ పరిస్థితి అంతే అని అనిల్ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక బీసీలకి పెద్దపీట వేసింది వైసీపీనే అని మంత్రి తెలిపారు. తన చివరి రక్తపు బొట్టు వరకు జగన్ వెంటనే నడుస్తానని... ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేనని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.     ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు.. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు ఏకకాలంలో గుప్పించారు నగరి ఎమ్మెల్యే రోజా. బీసీ కార్పొరేషన్ సభలో మాట్లాడిన రోజా .. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు. వేల కోట్ల రూపాయల సహాయం అందించారని ప్రశంసించారు. చంద్రబాబు ఇక మీదట పార్టీని మూసివేయాలని రోజా ఉచిత సలహా ఇచ్చారు. బీసీలకు చంద్రబాబు ఏం చేసారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు ఆర్కే రోజా.

గూడ్స్ రైళ్ల కోసం ఢిల్లీలో పంజాబ్ సీఎం ధర్నా! రూ.1200 కోట్లు నష్టపోయామన్న రైల్వేశాఖ 

కేంద్ర ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేశారు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. పంజాబ్‌‌కు గూడ్స్ రైళ్లను నిలిపేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన ధర్నాకు దిగారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా  ఆందోళనలో  పాల్గొన్నారు. మోడీ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు అమరీందర్ సింగ్. పంజాబ్ పరిస్థితిని రాష్ట్రపతికి తెలపడానికి  ప్రయత్నిస్తే  తమకు సమయం కేటాయించలేదని చెప్పారు. అందుకే ఢిల్లీకి వచ్చి  తామ నిరసనన తెలుపుతున్నామన్నారు. ఈ విషయంపై ఇంకా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ అడగలేదని, అదే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు అమరీందర్ సింగ్. తమకు రావాల్సిన జీఎస్టీ నిధులు ఇప్పటికీ రాలేదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు.    కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ అంతటా రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా రైల్ రోకో, ధర్నాలకు దిగుతున్నారు. దీంతో రైల్వే ఆస్తులకు, యాజమాన్యానికి నష్టాలు కలుగుతోంది. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర రైల్వే శాఖ... పంజాబ్ ప్రాంతానికి గూడ్స్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. దీనికి నిరసనగానే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ధర్నాకు దిగారు.    తమ రాష్ట్రానికి గూడ్స్ రైళ్లను రద్దు చేసి మోడీ  ప్రభుత్వం తమ గొంతు నులిమేస్తోందని పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు కూడా తీవ్రయ్యాయని, రాష్ట్రానికి అవసరమైన 14.50 లక్షల టన్నుల యూరియాను ట్రక్కుల్లో తెచ్చుకుంటున్నామని ఎమ్మెల్యేలు చెప్పారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా... కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి నిధులతో  కేంద్రం నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని చెప్పారు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.   మరోవైపు పంజాబ్‌లో రైతుల ఆందోళనలతో  తమకు రూ.1,200 కోట్ల మేరకు నష్టం వచ్చిందని రైల్వేశాఖ ప్రకటించింది. దిగ్బంధాల కారణంగా రవాణా కార్యకలాపాలు ఇప్పటికీ సస్పెండైనట్టు  తెలిపింది. నిత్యావసర సరుకలు తీసుకువెళ్తున్న 2,225 ఫ్రైట్ రేక్స్ తెరుచుకోలేదని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతవరకూ 1,350 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయని, కొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చిందని ప్రకటించారు. రైతు నిరసనల ప్రభావం పంజాబ్ మీదుగా వెళ్లే ప్యాసింజర్ రైళ్లపై కూడా పడిందని చెప్పారు. ట్రాక్‌ల భద్రత, రైల్ ఆపరేషన్ల పునరుద్ధరణ జరిపే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ అక్టోబర్ 26న రైల్వే మంత్రి పీయూష్ గోయెల్  పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసినా .. అక్కడి నుంచి స్పందన రాలేదని రైల్వే అధికారులు చెప్పారు.

మందడంలో కూలిన మూడు శిబిరం! ప్రకృతికి నచ్చలేదన్న ఆర్ఆర్ఆర్

జగన్ సర్కార్ తలపెట్టిన మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలోని మందడంలో ఏర్పాటు చేసిన శిబిరం కూలిపోయింది. నిన్న సాయంత్రం కురిసిన గాలి, వానకు ఆ శిబిరం టెంట్ కుప్పకూలిపోయింది. మందడం సీడ్ యాక్సిస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరం కూలినప్పుడు అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శిబిరం ఖాళీ చేశాక టెంట్ కూలిపోవడంతో నిర్వాహకులు, శిబిరంలో పాల్గొనేవారు ఊపిరిపీల్చుకున్నారు. ఈ రోజు ఉదయం ఈ శిబిరం ప్రారంభం కావాల్సి ఉంది.    నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ 323 రోజులుగా రైతులు, కూలీలు, మహిళలు దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. వీరి దీక్షలకు పోటీగా మూడు రాజధానులను సమర్థిస్తూ.. ఏపీ వ్యాప్తంగా 30 లక్షల మందికి సెంటు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతూ మందడంలో ఈ పోటీ శిబిరాలను ఏర్పాటు చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా మందడంలో వేసిన శిబిరం కూలిపోవడంపై ప్రజల్లో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. జగన్ సర్కార్ నిర్ణయం ప్రకృతికి నచ్చడంలేదని జనాలు అభిప్రాయపడుతున్నారు. 320 రోజులపైగా అమరావతి రైతులు ధీక్షలు చేస్తున్నా ఎలాంటి ఘటనలు జరగలేదని, ఇప్పుడు ఈ టెంట్ వేస్తుండగానే కూలిపోయిందని చెప్పుకుంటున్నారు.    నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా అలానే స్పందించారు. ప్రకృతి కూడా కొన్ని కొన్ని దుష్ట శక్తుల్ని ప్రొత్సహించదని అనటానికి ఉదాహరణగా పడిపోయిన డేరాల ఫోటోను ఆయన చూపించారు. పడిపోయిన డేరాలు ఏంటంటే... మూడు రాజధానులు కావాలని ఆటో పెయిడ్ ఆర్టిస్టుల కోసం నిర్మించిన డేరాలని.. ఆ డేరాలు కూలిపోయాయని రఘురామ అన్నారు. నిజమైన రైతులు రాజధాని అమరావతి కోసం ఎక్కడ ఆందోళన చేస్తున్నారో.. అక్కడ చిన్న గడ్డిపరక కూడా చెక్కు చెదరలేదని రాఘురామ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి న్యాయం ఎటువైపు ఉందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రకృతికి మించిన శక్తి లేదని, ప్రకృతి ఏం చెప్పిందన్నది గహించాలన్నారు రఘురామ కృష్ణం రాజు.

దుబ్బాకలో మళ్లీ షి ‘కారు’?

సగానికి తగ్గనన్న మెజారిటీ   రెండోస్థానంలో బీజేపీ?   దుబ్బాక ఉప ఎన్నికలో మళ్లీ టీఆర్‌ఎస్‌కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈసారి గత ఎన్నికలో కంటే సగం మెజారిటీ తగ్గనుంది. గత ఎన్నికలో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్.. ఈసారి మూడవ స్థానంలో, బీజేపీ రెండో స్థానంలో నిలిచే అవకాశాలున్నట్లు పోలింగ్ సరళి వెల్లడిస్తోంది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా దివంగత రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేయగా, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచారు. అయితే.. తొలి విడత ప్రచారంలో దూసుకుపోయిన కాంగ్రెస్, ఆ తర్వాత చతికిలపడింది. మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డిపై ప్రజలకు ఉన్న అభిమానం, ఆయన తనయుడైన కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాసరెడ్డికి సానుకూలంగా మారిన వాతావరణం కనిపించింది. ఆ మేరకు తొలి దశ ప్రచారమంతా,  టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగింది.   అయితే, బీజేపీ అనూహ్యంగా పుంజుకుని, కొత్త వ్యూహాలతో ప్రచారంలోకి దిగడంతో వాతావరణం మారిపోయింది. రఘునందన్‌రావు బంధువు నివాసంపై పోలీసు దాడులు, టీఆర్‌ఎస్ నేతలు బస చేసిన హోటల్‌పై బీజేపీ కార్యకర్తల దాడులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారంతో.. పోటీ కాస్తా, టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు మారింది. ఈ విషయంలో కాంగ్రెస్ ఎందుకో వెనుకబడి పోయినట్లు కనిపించింది. ఈ క్రమంలో జరిగిన పోలింగ్.. అనూహ్యంగా 82.61 శాతం నమోదుకావడం పార్టీలను కలవరపరిచింది. కరోనా కాలంలో కూడా పోలింగ్ ఆ స్థాయిలో ఓటెత్తడంతో, పెరిగిన ఆ ఓటింగ్ శాతం.. ఎవరి పుట్టి ముంచుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే పోలింగ్ సరళి పరిశీలిస్తే... టీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమయినప్పటికీ, గతంలో వచ్చిన మెజారిటీతో పోలిస్తే, సగం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా. అంటే దాదాపు 25-30 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే రావచ్చంటున్నారు. ఒక అంచనా ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 80-85 వేల ఓట్లతో మొదటి స్థానం, బీజేపీకి 50 నుంచి 55 వేలతో రెండవ స్థానం, కాంగ్రెస్‌కు 12 నుంచి 15 వేలతో మూడవ స్థానం దక్కవచ్చని తెలుస్తోంది.   అయితే, టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రచార వ్యూహకర్తగా మంత్రి హరీష్‌రావు నిలిచారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు, రాష్ట్ర నాయకులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి పిసిసి చీఫ్ ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇతర నేతలు విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.  -మార్తి సుబ్రహ్మణ్యం

విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్‌! వణికిపోతున్న ఢిల్లీ జనం 

దేశ రాజధాని ఢిల్లీని కరోనా మహమ్మారి మళ్లీ షేక్ చేస్తోంది. గతంలో తగ్గినట్లు కనిపించిన కేసులు.. కొన్ని రోజుల నుంచి మళ్లీ పెరిగాయి. వారం రోజులుగా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమైంది. కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత తొలిసారిగా డిల్లీలో 6వేలను దాటేసాయి. రోజువారీ కేసుల సంఖ్య 6000 మార్కును దాటడం ఇదే మొదటిసారి. తాజాగా వచ్చిన 6 వేల 700 సులతో మొత్తం కరోనా సంఖ్య 4 లక్షలను అధిగమించింది. అంతకుముందు అత్యధిక సింగిల్డే  స్పైక్ అక్టోబర్ 30 న  5 వేల 891 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మ‌ళ్లీ  మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతున్నక‌రోనా పాజిటివ్ కేసులు ఆందోళన  రేపుతున్నాయి.    ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ విస్త‌ర‌ణ‌ను థ‌ర్డ్ వేవ్‌గా చెప్ప‌వ‌చ్చ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు. పండుగ సీజన్, కాలుష్య స్థాయి పెరుగుతున్న మధ్య కేసులలో అకస్మాత్తుగా పెరిగినట్టు తెలుస్తోందని చెప్పారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండంతో ఢిల్లీ అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంద‌ని సీఎం కేజ్రివాల్ తెలిపారు. ప‌రిస్థితిని తాము ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌ని, మునుప‌టిలా కొత్త కేసులు విజృంభించ‌కుండా అవ‌స‌ర‌మైన‌ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు సీఎం కేజ్రీవాల్.    ఇప్పటికే భయంకరమైన కాలుష్యంతో అల్లాడిపోతున్న ఢిల్లీ ప్రజలు కరోనా మహమ్మారి విజృంభణతో వణికిపోతున్నారు, ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. శీతాకాలానికి సంబంధించిన శ్వాసకోశ సమస్యలు, బయటి నుండి పెద్ద సంఖ్యలో రోగులు రావడం, పండుగ సీజన్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రోజుకు సుమారు 15 వేల కరోనా పాజిటివ్‌ కేసులకు సిద్ధం కావాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఒక నివేదికలో ఇటీవల హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.

కమలం-కోడిగుడ్డు కథ!

కరుణించని కాంట్రాక్టర్లు   టీడీపీ నుంచి వైసీపీ వరకూ అదే కథ   కమలం పార్టీలో ఇదో ఆసక్తికర కహానీ. ఏపీ కమలదళాలకు-కోడిగుడ్లకూ ఏదో అవినావ సంబంధం ఉన్నట్లుంది. ఈ కథ ఇప్పటిది కాదు. చంద్రబాబు నుంచి మొదలయి, జగనన్న వరకూ కొన‘సాగుతోంది’. ఏపీలో బీజేపీ పెద్దాయన ఒకరు.. సందర్భం ఏదయినా గానీ, సమయం ఏదయినా గానీ.. అంటే అది తుపానయినా కావచ్చు. కరవయినా కావచ్చు. కానీ ఆయనకు గుర్తుకు వచ్చేది మాత్రం కోడిగుడ్ల కథే. అంటే పేరు కోడిగుడ్డుదయినా.. తీరు మాత్రం ఆవుకథ అన్నమాట! ఆయనకు అది ఎవర్‌గ్రీన్!!   అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు పౌష్టికాహారం కోసం, ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేస్తుంటుంది. దానికి వందల కోట్లు కేటాయిస్తుంది. నిబంధనల ప్రకారం 50-60 గ్రాముల సైజు ఉండే, కోడిగుడ్లు మాత్రమే కాంట్రాక్టర్లు సరఫరా చేయాలి. కానీ పాపం.. సదరు కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో ఉండే పెద్ద తలలు, చిన్న తలలతోపాటు, రాజకీయ పార్టీలనూ తృప్తి పరుస్తుండాలి. వీరుకాకుండా, స్థానిక విలేకరులు, విద్యార్థి సంఘాల నేతలనూ ‘చూసుకోవాలి’ మరి! కాబట్టి.. సర్కారు చెప్పిన సైజు కోడిగుడ్డు సర ఫరా చేస్తే,  వచ్చే ఆదాయం సున్నకు సున్నా, హళ్ళికి హళ్లి. అందుకే ‘కాస్తంత చిన్నసైజు’ కోడిగుడ్లు సరఫరా చేస్తుంటారు. ఇదంతా రహస్యమేమీ కాదు. బహిరంగమే.   ఈ చిదంబరహస్యం తెలిసిన ఓ కమలదళ మేధావి.. పాపం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచీ, జగన్ వరకూ ఇప్పటిదాకా కోడిగుడ్డు కాంట్రాక్టర్లపై మనసుపారేసుకుంటూనే ఉన్నారట. అప్పటి నుంచీ వీలు దొరికినప్పుడల్లా.. ‘ఆ కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో నాణ్యత లేదు. దాని సంగతి తేల్చమని’ తెగ పోరాడుతూనే ఉన్నారు. అప్పుడప్పుడూ అదే అంశంపై, సీఎంలకు లేఖ రాస్తుంటారు. వీలు దొరక్కపోయినా, దొరికించుకుని మరీ చట్టసభలో కోడిగుడ్డనే ఆవుకథను వినిపిస్తూనే ఉన్నారు. అయినా.. అక్క ఆర్భాటమే తప్ప, బావబతికుంది లేదన్నట్లు.. ఎవరూ పట్టించుకోరు. అందుకే.. సదరు నాయకుడు, తన పార్టీ వేదికలపైనే కోడిగుడ్ల కథను వినిపిస్తుంటారు.   అసలు ఇంతకూ ఈ ఆవు కథ.. సారీ... కోడిగుడ్డు కథేమిటంటే.. గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టరును, సదరు నాయకుడు ఓసారి వచ్చి తనను కలవమన్నారట. పెద్ద నాయకుడు. పైగా గవర్నమెంటులో భాగస్వామిగా ఉన్న నోరున్న నాయకుడాయె! పిలిచిన వెంటనే వచ్చి వాలిపోయిన కాంట్రాక్టరుకు, సదరు బీజేపీ నాయకుడు.. ‘అసలు’ విషయం చెప్పారట. ‘మమ్నల్నీ చూసుకోండనేది’ ఆయన కవి హృదయమన్నమాట! అయితే, ఆ కాంట్రాక్టరు అస్సలు భయపడకుండా.. ఇప్పటికే మేం ఉద్యమాలు చేసే పార్టీకి క్రమం తప్పకుండా నెలవారీ చందాలిస్తున్నాం. పైన ఉన్న ఉన్నవాళ్లకూ ఇస్తున్నాం. ఇక మీకూ ఇస్తే దివాళా తీస్తామని, చావుకబురు చల్లగా చెప్పి వెళ్లిపోయారట. దానితో బాగా హర్టయిన ఆ నాయకుడు, అప్పటి నుంచీ, కోడిగుడ్ల కథను, ఆవుకథ మాదిరిగా వినిపిస్తున్నారన్నది కమలదళాల్లో వినిపిస్తున్న చర్చ.   ఈ కోడిగుడ్డు కథకూ ఓ నేపథ్యం ఉందట. గతంలో ఉద్యమాలు చేసే పార్టీలో పనిచేసి, అంగన్‌వాడీలో యానిమేటర్‌గా పనిచేసిన ఓ మహిళా నేత బీజేపీలో చేరారు. ఆమె ‘ప్రతిభ’తెలుసుకున్న సదరు బీజేపీ నేత, ఆమెను పార్టీలో బాగా ప్రోత్సహించారట. పనిలోపనిగా ఉద్యమాలు చేసే పార్టీకి అంగన్‌వాడీల నుంచి చందాలు ఎలా వస్తున్నాయన్న దానిపై పరిశోధన చేసి, ఆమె ద్వారా ఆ వివరాలు సేకరించారట. ఆ ప్రకారంగా.. ఒక్కో సెంటర్ నుంచీ వెయ్యి రూపాయలు, ఉద్యమాలు చేసే పార్టీకి విరాళాలుగా వెళతాయని తెలుసుకున్నారట. ఇక ఆ తర్వాత కథ తెలిసిందే కదా? అదే ఈ కోడిగుడ్ల కథ! -మార్తి సుబ్మ్రహ్మణ్యం

జూనియర్ ట్రంప్ ట్వీట్ పై తీవ్రంగా మండి పడుతున్న భారతీయులు..  

హోరాహోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం ఎవరిని వరిస్తుందనే విషయం పై ప్రపంచం మొత్తం అమెరికా వైపు ఉత్కంఠతో చూస్తోంది. అయితే, ఈ ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్ తాజాగా చేసిన ఒక ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. ఆయన చేసిన ట్వీట్‌ పై అటు ఎన్నారైలు, ఇటు భారత రాజకీయ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రపంచ పటాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్రంప్ జూనియర్.. అన్ని దేశాలను రిపబ్లికన్‌ పార్టీ కలర్‌ "ఎరుపు రంగు" లో చూపించారు. ఈ దేశాలన్నీ ట్రంప్ విజయాన్ని సాధిస్తాడని విశ్వాసంతో ఉన్నాయని అయన తెలిపారు. అయితే ఆ ట్వీట్ లో భారత్, చైనా, లైబేరియా, మెక్సికో వంటి కొన్ని దేశాలను మాత్రం డెమోక్రట్‌ పార్టీ కలర్ "నీలి రంగు" లో చూపించారు. ఈ దేశాలు తమ ప్రత్యర్థి జో బైడెన్‌కు మద్దతుదారులని చెప్పుకొచ్చారు. అలాగే, తమ దేశంలోని కాలిఫోర్నియా, మేరీల్యాండ్‌ వంటి రాష్ట్రాలను సైతం ఆయన నీలి రంగులోనే చూపించారు.   అయితే భారత్‌లోని జమ్మూకశ్మీర్‌, లడఖ్, ఈశాన్య రాష్ట్రాలను మాత్రం ఎరుపు రంగులో చూపించడం వివాదాస్పదమవుతోంది. భారత్‌లోని అన్ని ప్రాంతాలను నీలి రంగులో చూపి, కొన్ని ప్రాంతాలను మాత్రం ఎరుపు రంగులో చూపడం పట్ల పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ట్రంప్ భారత్‌కు స్నేహితుడని భావిస్తే, అయన తనయుడు మాత్రం తన బుద్ధిని చూపించారంటూ బీజేపీయేతర పార్టీల నేతలు ట్వీట్లు చేస్తున్నారు.   ప్రెసిడెంట్ ట్రంప్‌తో భారత్ కు ఎంతో స్నేహం ఉందని, అయితే, ట్రంప్ జూనియర్ మాత్రం భారత్‌ను‌ జో బైడెన్‌, కమల హారిస్‌ మద్దుతుదారుగా చూపించారని జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. మరింత ఆశ్చర్యకర అంశం ఏంటంటే.. జమ్మూకశ్మీర్‌, ఈశాన్య ప్రాంతాలు మాత్రమే ట్రంప్‌కి ఓటు వేస్తాయని వెల్లడించారని అన్నారు. అసలు ఆయన వద్ద ఉన్న కలర్‌ పెన్సిల్‌ను ఎవరైనా లాక్కోవాలని సెటైర్ వేశారు.   అయితే జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని పాకిస్తాన్ లో కలుపుతూ జూనియర్ ట్రంప్ ఈ ట్వీట్ చేయడం తాజాగా భారతీయుల కోపానికి కారణమైంది. జమ్మూకశ్మీర్ భారత్ లో అంతర్భాగమని.. పాకిస్థాన్ తో ఎలా కలుపుతారంటూ ట్రంప్ జూనియర్ పై భారతీయులు నిప్పులు చెరిగారు.. మరోపక్క, పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఈ మ్యాప్‌పై స్పందిస్తూ జమ్మూకశ్మీర్‌ని పాక్ ‌లో భాగంగా చూపించారని, చాలా ప్రోత్సాహకరంగా ఉందని అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.

అర్ణబ్ ను అరెస్టు చేసిన ముంబై పోలీసులు! చొక్కా పట్టుకుని లాక్కొచ్చారంటున్న రిపబ్లిక్ టీవీ

రిపబ్లిక్ టీవీ ఎడిటర్, దేశంలోని ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో ముంబైలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ మృతి కేసులో ఆయనను ముంబై అలీబాగ్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తనతో పాటు తన అత్తయ్య, మామయ్య, కుమారుడు, భార్యపై ముంబై పోలీసులు భౌతిక దాడి చేశారని అర్ణబ్ గోస్వామి ఆరోపించారు.    అర్ణబ్ గోస్వామి అరెస్టుపై పలు ఆరోపణలు చేస్తూ రిపబ్లిక్ టీవీ ఓ ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని అర్నాబ్ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆయనను అరెస్టు చేసే క్రమంలో భౌతిక దాడికి దిగారని తెలిపింది. అర్నాబ్ గోస్వామిపై పోలీసులు దాడికి దిగి, ఆయనను చొక్కాపట్టుకుని బయటకు లాక్కొచ్చి పోలీసు వ్యాను ఎక్కించి తీసుకెళ్లారని తెలుపుతూ రిపబ్లిక్ టీవీ ఓ వీడియోను కూడా ప్రసారం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ  వైరల్ అవుతున్నాయి. అర్నాగ్ గోస్వామిపై ముంబై పోలీసులు ప్రవర్తించిన తీరును దేశంలోని ప్రజలు ఖండించాలని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించింది.    ముంబైలో 2018, మేలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో అన్వయ్ రాసిన ఆత్మహత్య లేఖ పోలీసులకు లభ్యమైంది. గోస్వామితో పాటు ఫెరోజ్ షెయిక్, నితీశ్ సర్దా అనే ఇద్దరు వ్యక్తులు తనకు 5.40 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇవ్వలేదని దీంతో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని అన్వయ్ అందులో రాశారు. అయితే ఈ కేసులో దర్యాప్తు జరిపిన రాయ్‌గడ్ పోలీసులకు అందుకు తగ్గ ఆధారాలు లభ్యం కాకపోవడంతో 2019 లో ఈ కేసును మూసివేశారు. ఈ ఏడాది మేలో   మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఈ కేసు విషయంపై అన్వయ్ నాయక్ కుమార్తె ఆధ్యనాయక్ ఆశ్రయించి, పోలీసులు ఈ కేసులో సరైన విచారణ జరపలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో కొత్తగా సీఐడీ విచారణ జరుపుతుందని హోం మంత్రి ప్రకటించారు.  

తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. తాజాగా ఎన్నంటే..  

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు వెయ్యికి దగ్గరగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఈరోజు మళ్ళీ కేసులు పెరిగాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,637 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,143కు చేరుకుంది. ఇదిఇలా ఉండగా గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందినవారి సంఖ్య 1,357 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,100 యాక్టివ్ కేసులుండగా.. 2,24,686 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారిలో 15,335 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 136 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఏపీ ఎన్జీవోల ఝలక్.. కరోనా తగ్గిన తర్వాత ఎన్నికలు జరపండి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ఎన్జీవోలు ఈ విషయంపై స్పందించారు. ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పునరాలోచన చేయాలని ఏపీ ఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరారు. కరోనా సమయంలో ఉద్యోగులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టలేరని ఆయన తెలిపారు. అంతేకాకుండా కరోనా తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులంతా అమరావతి నుండి విశాఖపట్టణం వచ్చేస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా కూడా విశాఖను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా కారణంగా నిలిపివేసిన వేతనాలను ఈ నెల నుండి చెల్లిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు ఇచ్చేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు.   మరో పక్క రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గత నెల 28వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల విషయమై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. అయితే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని రాష్ట్ర హైకోర్టు మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసిన సమయంలో ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

ఎగ్జిట్ పోల్స్ లో గందరగోళం! దుబ్బాకపై భారీగా బెట్టింగులు 

తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసినా.. ఆ సెగ మాత్రం తగ్గడం లేదు. ఉప ఎన్నికలో పోలింగ్ భారీగా జరగడంతో దుబ్బాక ఓటర్ల మెగ్గు ఎవరి వైపు అన్నదానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పోలింగ్ సరళని బట్టి పార్టీలు తమకు వచ్చే ఓట్లను అంచనా వేసుకుంటూ ఫలితం ఎలా ఉండబోతుందో లెక్క గడుతున్నాయి. ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగిందని తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయంపై ఆ రెండు పార్టీల నేతలు ధీమాగానే ఉన్నారు.    రాజకీయ పార్టీలు సవాల్ గా తీసుకుని పోరాడిన దుబ్బాక ఫలితంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేతలు, జనాల్లో ఎగ్టిట్ పోల్స్ ఫలితాలు మరింత టెన్షన్ రేపుతున్నాయి. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్  అంచనాలు పూర్తిగా భిన్నంగా రావడంతో అందరూ గందరగోళానికి గురవుతున్నారు. పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో 47 శాతం ఓట్లతో బీజేపీ లీడ్ లోఉండగా, టీఆర్ఎస్ కు 30 శాతం, కాంగ్రెస్ కు 13 శాతం ఓట్లు వస్తున్నాయి. థర్డ్ విజన్ సర్వేలో టీఆర్ఎస్ కు ఆధిక్యం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే సీపీఎస్ సర్వేలో అధికార పార్టీ 47. 4శాతం ఓట్లు, బీజేపీకి 36. 3 శాతం ఓట్లు వస్తుండగా కాంగ్రెస్ కు 14.7 శాతం ఓట్లు వస్తున్నాయి. నాగన్న సర్వేలో గులాబీ పార్టీ ఏకంగా 51.5 శాతం ఓట్లతో గుబాళీస్తోంది.     దుబ్బాక బరిలో ఉన్న ప్రధాన పార్టీలు కూడా పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల లెక్కలు వేసుకుంటున్నాయి. బీజేపీ నేతల అంతర్గత లెక్కల ప్రకారం రఘునందన్ రావు ఏడు వేల నుంచి 12 వేల ఓట్లతో విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారట. దుబ్బాక, మిరుదొడ్డి, నర్సింగ్, రాయపోల్ లో తమకు లీడ్ వస్తుందని.. దౌలతాబాద్, చేగుంట, తోగుంటలో కారు ముందంజలో ఉందని కమలం నేతలు అంచనా వేస్తున్నారట. దుబ్బాక మున్సిపాలిటీలో తమకు ఓటింగ్ బాగా జరిగిందనే అంచనాలో ఉన్న రఘునందన్ రావు.. విజయంపై ఫుల్ క్లారిటీగా ఉన్నారని చెబుతున్నారు. యువత ఓట్లు వన్ సైడ్ గా తమకే పడ్డాయని, రైతులు కూడా కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు మళ్లారని అంచనా వేస్తున్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ సానుభూతిపరులు కూడా తమకే మద్దతుగా నిలిచారని, కాంగ్రెస్ కు గండి పడే ఓట్ల ఆధారంగా తమకు మెజార్టీ పెరుగుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.    దుబ్బాకలో గెలుపు ఖాయమని గులాబీ నేతలు చెబుతున్నా.. లోలోపల మాత్రం వారిలో కొంత కంగారు కనిపిస్తోందని తెలుస్తోంది. అయితే మంత్రి హరీష్ రావు మాత్రం 25 వేల నుంచి 30 వేల ఓట్లతో సుజాత గెలవబోతుందని టీఆర్ఎస్ నేతల అంతర్గత సమావేశంలో చెప్పారని చెబుతున్నారు. నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోనూ కారుకు ఎక్కువ ఓట్లు పడ్డాయని ఆయన పక్కాగా చెబుతున్నారట. సోషల్ మీడియా ద్వారా బీజేపీ చేసిన అసత్య ప్రచారం తమకు కొంత నష్టం కలిగించిందని హరీష్ రావు పార్టీ నేతలతో అన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కు ముందు రోజు రాత్రి సిద్దిపేట హోటల్ లో జరిగిన ఘటనలు, రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో జరిగిన సోదాలపై బీజేపీ చేసిన ప్రచారం ప్రజల్లో కొంత ప్రభావం చూపిందని గులాబీ నేతలు భావిస్తున్నారట. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ.. పోలింగ్ రోజుల సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం తమకు నష్టం కలిగించిందని పోలింగ్ తర్వాత హరీష్ రావే స్వయంగా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నష్టం ఏ స్థాయిలో ఉంటుందోనని   కొందరు అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని సమాచారం.    దుబ్బాకపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు మాత్రం పోలింగ్ తర్వాత పూర్తిగా ఢీలా పడ్డారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ జరిగిన ప్రచారం తమ కొంప ముంచిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చెరుకుపై జరిగిన ప్రచారంతో కేసీఆర్ పై కసిగా కాంగ్రెస్ ఓటర్లు కూడా చివరి నిమిషంలో బీజేపీ వైపు మొగ్గుచూపారని చెబుతున్నారు. అయినా తమకు గతంలో కంటే ఓట్లు పెరుగుతాయని, తోగుంట, చేగుంట, దుబ్బాక మండలాల్లో లీడ్ సాధిస్తామని హస్తం నేతలు అంచనా వేసుకుంటున్నారట. టీఆర్ఎస్, బీజేపీలు భారీగా డబ్బులు ఖర్చు చేశాయని, ఓటర్లను భారీగా ప్రలోభాలకు గురి చేశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.   దుబ్బాక ఉప ఎన్నికపై మొదటి నుంచి భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. పోలింగ్ ముగిశాకా అవి తీవ్రస్థాయికి చేరాయి. పార్టీల అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం పందెంరాయుళ్లు బెట్టింగులు వేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ కూడా భిన్నంగా రావడంతో బెట్టింగురాయుళ్లు కూడా గందరగోళానికి గురవుతున్నారని తెలుస్తోంది. అయినా తమ తెలిసిన సోర్సుల ద్వారా క్షేత్రస్థాయిలో నుంచి సమాచారం తెప్పించుకుంటూ భారీగా బెట్టింగులు పెడుతున్నారని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు మరో ఆరు రోజులు ఉండటంతో బెట్టింగులు గతంలో ఎప్పుడు లేనంత  స్థాయిలో జరిగినా అశ్చర్యం లేదంటున్నారు.

యూఎస్ ఎన్నికల్లో హోరాహోరీ! ప్రస్తుతానికి లీడ్ లో జో బైడెన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే జరుగుతోంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకూ జో బైడెన్ 126, డొనాల్డ్ ట్రంప్ 89 ఎలక్టోరల్ ఓట్లను పొందారు. 12 రాష్ట్రాల్లో బైడెన్, 14 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించారు. పెద్ద రాష్ట్రాల ఫలితాలు వెల్లడికావాల్సి వుంది. కీలకమైన ఫ్లోరిడాలో ట్రంప్ కు బైడెన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. చాలా రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్ మధ్య  నువ్వా? నేనా?అన్నట్టుగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.    డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలను, ఎలక్టోరల్ ఓట్లను పరిశీలిస్తే, అలబామా (9), అర్కాన్సాస్ (6), ఇండియానా (11), కెంటుకీ (8), లూసియానా (8), మిసిసిపీ (6), నార్త్ డకోటా (3), ఓక్లాహామా (7), సౌత్ కరోలినా (9), సౌత్ డకోటా (3), టెన్నిస్సీ (11), వెస్ట్ వర్జీనియా (5), వ్యోమింగ్ (3) ఉన్నాయి. ఇక బైడెన్ కొలరాడో (9), కనెక్టికట్ (7), డెలావర్ (3), డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (3), ఇల్లినాయిస్ (20), మేరీల్యాండ్ (10), మసాచుసెట్స్ (11), న్యూజర్సీ (14), న్యూయార్క్ (29), రోడ్ ఐలాండ్ (4), వెర్మాంట్ (3), వర్జీనియా (13) లో విజయం సాధించారు.    ఇప్పటివరకు లెక్కించిన రాష్ట్రాల్లో వెనకబడి ఉన్న విజయంపై ధీమాగానే ఉన్నారు ప్రస్తుత ప్రెసెడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం తనకుందని ఆయన  వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టిన ట్రంప్.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ముందంజలో ఉన్నాము. కృతజ్ఞతలు" అని అందులో పెర్కొన్నారు. అంతకుముందు, "ఓటేసేందుకు మరికొంత సమయం ఉంది. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో చూసుకుని వెళ్లి, అమెరికాను గొప్పగా మార్చే డొనాల్డ్ ట్రంప్ కు ఓటేయండి" అని ట్రంప్ ట్వీట్ చేశారు.

టీఎస్ కేబినెట్ నుంచి ముగ్గురు ఔట్! దుబ్బాక ఫలితం తర్వాత ముహుర్తం 

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయా? కేబినెట్ నుంచి కొందరిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారా? అనే చర్చ అధికార టీఆర్ఎస్ లో జోరుగా జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో స్వల్ప మార్పులు ఉంటాయా లేక భారీగా మార్పులు చేర్పులు ఉంటాయా అన్న దానిపై మాత్రం గులాబీ నేతలెవరు క్లారిటీ ఇవ్వడం లేదు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని బట్టే ఇది ఆధారపడి ఉంటుందంటున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ మంచి మెజార్టీ గెలిస్తే కేబినెట్ లో స్వల్ప మార్పులే ఉంటాయని, దుబ్బాకలో కారు ఓడిపోయినా, మార్జిన్ మెజార్టీతో గెలిచినా కేబినెట్ లో పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశం ఉందని తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది.     నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గెలిచినప్పటి నుంచే మంత్రివర్గ విస్తరణపై ప్రచారం జరుగుతోంది. కవితను కేబినెట్ లో తీసుకునేందుకు ఎవరో ఒక మంత్రిని తప్పిస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి.  ఈ సమయంలోనే  కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి రాసలీలలు బయటికి రావడం పెద్ద దుమారమే రేపింది. వివాదంలో చిక్కుకున్న ఆ మంత్రిని తప్పించి కవితకు కేబినెట్ లో బెర్త్ ఇస్తారని భావించారు. అయితే కవిత ఒక్కరినే కేబినెట్ లోకి తీసుకుంటే విమర్శలు వస్తాయని భావిస్తున్న కేసీఆర్.. మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో పునర్ వ్యవస్థికరీంచే అవకాశాలే  ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.    కేబినెట్ లో మార్పులు చేర్పులు జరిగితే ముగ్గురు మంత్రులకు పదవి గండం ఉందనే ప్రచారం టీఆర్ఎస్ లో జరుగుతోంది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డి పేరు మొదటగా వినిపిస్తోంది. వేముల జూనియర్ అయినా మంత్రివర్గంలో చోటు కల్పించారు కేసీఆర్. అయితే ఆయన పనితీరు ఆశించనంతగా లేదని అభిప్రాయంలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుతోనూ వేములకు మంచి సంబంధాలు లేవంటున్నారు. జిల్లాలో ఉన్న సీనియర్ నేతలను మంత్రి పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు పార్టీ అధిష్టానానికి చాలా సార్లు వెళ్లాయంటున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీగా  పోటీ చేయాలని కవితపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. కవిత ఎమ్మెల్సీ కాగానే ప్రశాంత్ రెడ్డి ప్లేస్ లో ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇందూరు నేతలు ఇప్పటికే కేసీఆర్ ను కోరినట్లు చెబుతున్నారు.    మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గౌడ్ ను కూడా మంత్రివర్గం నుంచి తప్పించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాస్ గౌడ్ అనుకున్నంతగా పని చేయడం లేదని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా మారారు. బహిరంగగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలను కంట్రోల్  చేయడంలో శ్రీనివాస్ గౌడ్ పూర్తిగా విఫలమయ్యారని టీఆర్ఎస్ ముఖ్య నేతలు కేసీఆర్ తో చెప్పినట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోనూ మంత్రి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, పార్టీ నేతలెవరని కలుపుకుని పోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే శ్రీనివాస్ గౌడ్ ను తప్పించి ఆయన ప్లేస్ మరో బీసీ నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారనే చర్చ తెలంగాణ భవన్ లో జరుగుతోంది.     కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ పై కూడా చాలా కాలంగా కత్తి వేలాడుతుందంటున్నారు. సీనియర్ల కాదని మంత్రి పదవి ఇచ్చినా ఆయన పాత పోకడలే అవలంభించారని, తన వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీకి చెడ్డ పేరు తెచ్చారనే విమర్శలు గంగులపై ఉన్నాయంటున్నారు. జిల్లాకే చెందిన సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ తోనూ గంగులకు సఖ్యత లేదంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో  కరీంనగర్ లో పార్టీ ఓటమికి గంగుల చేసిన తప్పులే కారణమనే ఆరోపణలు కేసీఆర్ దగ్గరకు చేరాయంటున్నారు. అయితే గంగులను తొలగించాలని కేసీఆర్ భావిస్తుండగానే..  ఆయనకు ఆయనే కొత్త చిక్కులు  తెచ్చుకున్నారనే చర్చ కరీంనగర్ టీఆర్ఎస్ నేతల్లో జరుగుతోంది. ఇటీవల జరిగిన పరిణామాలతో గంగులను కేబినెట్ నుంచి తొలగించడం ఖాయమంటున్నారు.    ఒకరా ముగ్గురా పక్కాగా తెలియకున్నా మంత్రివర్గంలో కేసీఆర్ మార్పులు చేయడం ఖాయమంటున్నారు. అయితే ఒకరిని తొలగించాల్సి వస్తే గంగులే ఫస్ట్ ఛాయిస్ గా ఉండవచ్చుంటున్నారు. మార్పులు జరిగితే కేబినెట్ లోకి కొత్తగా ఎవరూ వస్తారన్న దానిపైనా జోరుగానే చర్చలు జరుగుతున్నాయి. గంగులను తొలగిస్తే ఆయన సామాజిక వర్గానికే చెందిన వరంగల్ జిల్లాకు చెందిన దాన్యం వినయ్ భాస్కర్ కు ఛాన్స్ ఉంటుందంటున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వినయ్  భాస్కర్ కు కేసీఆర్ సెకండ్ టర్మ్ కేబినెట్ లో అవకాశం వస్తుందనుకున్నారు. కాని ఆ పోస్టును ఎర్రబెల్లి ఎగరేసుకుపోయారు. అప్పటి నుంచి వినయ్ భాస్కర్  అసంతృప్తిగానే ఉన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇచ్చినా వినయ్ భాస్కర్ అంత యాక్టివ్ గా కనిపించడం లేదని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. కేబినెట్ లో ప్రస్తుతం మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి గంగుల ఒక్కరే ఉన్నారు. దీంతో  మంత్రివర్గంలో తమకు తగిన ప్రాధాన్యత దక్కలేదని మున్నూరుకాపులు కోపంగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ లో ఓటమికి ఇది ఒక కారణమని చెబుతారు. దీంతో  కేబినెట్ నుంచి గంగులను తప్పిస్తే మళ్లీ అదే సామాజికవర్గానికి చెందిన వినయ్ భాస్కర్ తోనే భర్తీ చేస్తారని చెబుతున్నారు.    కవితను కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డినే తొలగిస్తారని టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. దీనిపై నిజామాబాద్ కారు పార్టీలో ఫుల్ క్లారిటీ ఉందంటున్నారు. శ్రీనివాస్ గౌడ్ ను మారిస్తే ఆయన ప్లేస్ లో హైదరాబాద్ లో పట్టున్న దానం నాగేందర్ లేదా మరో బీసీ నేతను  కేబినెట్ లోకి తీసుకుంటారని చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ముందే కేబినెట్ లో మార్పులు జరిగితే మాత్రం దానంకు బంపరాఫర్ తగలవచ్చంటున్నారు. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో కీలక మార్పులు జరుగుతాయని, ప్రభుత్వంలోనూ మార్పులు చేర్పులు జరగడం ఖాయమని మాత్రం తెలుస్తోంది.  

‘ధరణి’కి బ్రేకులు..

కేసీఆర్ దూకుడుకు కోర్టు స్టే   పాపం గ్లోబరీనా కంపెనీ   కోర్టుకెళ్లిన బీజేపీ నేత కరుణాకర్   తెలంగాణలో ఆస్తుల వివరాలకు సంబంధించి... కేసీఆర్ సర్కారు రూపొందించిన ధరణి దూకుడుకు, పోర్టల్‌కు హైకోర్టు బ్రేకులు వేసింది. వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదుపై స్టే విధించింది. అసలు ఒక ప్రైవేటు సంస్థకు, ఆస్తుల వివరాలు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు ఈ పోర్టల్ ప్రారంభం నుంచే మొదలయ్యాయి. పైగా పాలకులతో సన్నిహిత సంబంధాలున్న గ్లోబరీనా సంస్థకు, ఈ సైట్ నిర్వహణ అప్పగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో.. ధరణి పోర్టల్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో, పాపం గ్లోబరీనా నిరాశ చెందాల్సి వచ్చింది.   అంతా ఆందోళన చెందినట్లే.. హైకోర్టు కూడా ధరణి పోర్టల్ భ ద్రతపై ఆందోళన, సందేహాలు వ్యక్తం చేయడం విశేషం. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ధరణిని డౌన్‌లోడ్ చేసుకునే సందర్భంలో.. అచ్చం అలాంటి మరో నాలుగు యాప్స్ ఉన్నందున, పౌరులు ఏది అసలైన యాప్ అన్నది గుర్తించడం కష్టమని కోర్టు వ్యాఖ్యానించింది. అసలు ధరణి యాప్‌పై అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలేమిటో చె ప్పాలని ఆదేశించింది. ఇప్పటివరకూ సేకరించిన వివరాలు ఎవరికీ ఇవ్వవద్దని ఆదేశించింది.   ధరణి ఏర్పాటు ప్రక్రియపై,  హైకోర్టు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. దానిపై ప్రజలకున్న సందేహాలను, న్యాయస్థానం గుర్తించినట్లు స్పష్టమవుతోంది. అసలు ఏ చట్టం ప్రకారం ఆధార్, కులం వివరాలు సేకరిస్తున్నారని నిలదీసింది. వ్యక్తిగత వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారని ప్రశ్నించింది. కొత్త రె విన్యూ చట్టంలో, వ్యవసాయేతర భూముల ప్రస్తావన ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నించింది. అందులో డేటా భద్రత ప్రస్తావనే లేదని గుర్తు చేసింది. అసలు దానికి ఉన్న చట్టబద్ధత-డేటా.. భద్రత వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.   నిజానికి ధరణి పోర్టల్ ప్రక్రియ ప్రారంభం నుంచే, దానిపై రాజకీయ పార్టీలు-ప్రజల్లో సందేహాలు, ఆందోళన మొదలయింది. తమ ఆస్తుల వివరాలు ఎందుకివ్వాలన్న ప్రశ్న, ప్రజల నుంచి వ్యక్తమయింది. పైగా అసలు ధరణి పోర్టల్ ప్రభుత్వానిదా? ప్రైవేటు సంస్థదా? వివరాలు ఇవ్వాలని ఏ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయన్న ప్రశ్నలకు, ఇప్పటివరకూ ఏ ఒక్క శాఖ సమాధానం ఇవ్వలేదు. పైగా ఒకరిపై మరొకరు బాధ్యత నెట్టేసుకున్నాయి. దానితో జనంలో ఆందోళన మరింత పెరిగింది.   పైగా దాని నిర్వహణ గ్లోబరీనా సంస్థకు అప్పగించారన్న వార్తలు, ప్రజలను మరింత ఆందోళనకు గురిచేశాయి. గతంలో ఇంటర్ మూల్యాంకన బాధ్యత తీసుకున్న సదరు సంస్థ తప్పిదాల వల్ల, తెలంగాణలో 25 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. దానితో ఆగ్రిహ ంచిన తలిదండ్రులు, ఇంటర్ కార్యాలయాన్ని విడతల వారీగా ముట్టడించడం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే సంస్థ చేతికి ధరణి పోర్టల్ నిర్వహణ అప్పగించడం ప్రజల ఆందోళనకు కారణమయింది. సదరు సంస్థ యజమాని, సర్కారుకు దగ్గరివారిగా పేరుంది.   తాజాగా  హైకోర్టు ఇచ్చిన స్టేతో,  ప్రజలు ఊరట చెందారు. దీనిపై  ప్రజాందోళనను తొలుత గుర్తించి, న్యాయపోరాటం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుంది. ఈ ప్రక్రియ ప్రారంభం కాకముందే, బీజేపీ సీనియర్ నేత జి.ఆర్.కరుణాకర్.. ప్రజల్లో నెలకొన్న సందేహాలపై కోర్టుకెళ్లారు. అయినా, ప్రభుత్వం పోర్టల్‌ను ప్రారంభించింది.   ‘అసలు ధరణి పోర్టల్ అనేది ప్రభుత్వానిదా? ప్రైవేటుదా? ఒకవేళ ప్రభుత్వానిదయితే, ఏ శాఖ నుంచి ఆమేరకు ఉత్తర్వులొచ్చాయి? ఒకవేళ ప్రభుత్వం కాకుండా, ప్రైవేటు సంస్థ దానిని నిర్వహిస్తే, పౌరుల వ్యక్తిగత భద్రత, గోప్యతకు భంగం కలిగితే, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అంటే కేసీఆర్ ఏది చెబితే అది చట్టమయిపోతుందా? అధికారులు వాస్తవాలు చెప్పరా? వారి మెదళ్లు ఏమైపోయాయి? ఒక ప్రైవేటు సంస్థకు ఆస్తుల వివరాలు ప్రజలు ఎందుకు ఇవ్వాలని అధికారులు చెప్పలేరా?  ధరణిపై కోర్టు స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం’ అని,  కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ సీనియర్ నేత జి.ఆర్.కరుణాకర్ వ్యాఖ్యానించారు.  విచిత్రంగా.. సీఎస్ స్వయంగా హాజరయిన సెంటర్‌లోనే,  తొలిరోజు పోర్టల్ మొరాయించిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. -మార్తి సుబ్రహ్మణ్యం

అమెరికాలో మొదలైన పోలింగ్.. కానీ మరోపక్క ఎందుకో భయం..!

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికాలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కొద్దీ సేపటి క్రితం పోలింగ్ మొదలైంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు ఎంతో ఉత్కంఠతో చూస్తున్నాయి. అయితే అమెరికాలో మాత్రం వ్యాపారస్తులు.. మాత్రం తమ షాపులను అల్లరి మూకల బారి నుండి రక్షించుకునే పనిలో తలమునకలై ఉన్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే అమెరికాను కరోనా వైరస్ కుదిపేసిన సంగతి తెలిసందే. దీంతో లక్షలాది మంది ప్రజలు మరణించారు. అంతేకాకుండా కోట్లాది మంది అమెరికన్లు ఉద్యోగాలు కూడా కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఒక పక్క కరోనా మహమ్మారి సృష్టించిన సమస్యల మధ్య అమెరికన్లు తమ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అమెరికాలో జరుగుతున్న ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి. దీంతో మరోసారి అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడం కోసం ట్రంప్ దేశ వ్యాప్తంగా పర్యటించి, మరోసారి జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే డెమొక్రటిక్ నేత జో బైడెన్ మాత్రం కరోనా విషయంలో ట్రంప్ ప్రభుత్వ వైఫల్యాన్ని బలంగా ఎత్తిచూపే ప్రయత్నం చేసారు..    ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున అల్లర్లు.. లూటీలు జరగొచ్చని అమెరికాలో పుకార్లు బయలుదేరాయి. దీంతో అమెరికాలోని వ్యాపారస్తులు తమ వాణిజ్యసముదాయాలను రక్షించుకునే పనిలో పడ్డారు. అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లోని వాణిజ్య సముదాయాల యజమానులు తమ షాపులకు ఫ్లైవుడ్‌తో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయించుకుంటున్నారు. ఒకవేళ నిరసనకారులు రాళ్లు రువ్వినా దాని వల్ల ఎటువంటి నష్టం కలగకుండా కీటికీలను, డోర్‌లను ఫ్లైవుడ్‌తో మూసివేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

దుబ్బాకలో గెలుపెవరిది! ఓటర్ల నాడి ఎలా ఉంది? 

తెలంగాణలో రాజకీయంగా కాకరేపిన దుబ్బాక ఉప ఎన్నికలో ఓటరు తీర్పు ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకుని ప్రచారం చేయడంతో భారీగా ఓటింగ్ నమోదైంది. పోలింగ్ చివరి నిమిషం వరకు పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ప్రయత్నించాయి. దీంతో గతంలో ఎప్పుడు లేనంత హోరాహోరీగా దుబ్బాక ఉప ఎన్నిక జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ ముగియడంతో ఇప్పుడు దుబ్బాక ఓటర్లు ఎటు వైపు మెగ్గుచూపారన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది. పోలింగ్‌ సరళిని బట్టి ఫలితాలను అంచనా వేస్తున్నాయి ప్రధాన పార్టీలు. గ్రామాలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా తమకు ఎన్ని ఓట్లు వస్తాయో అంచనా వేసుకుంటున్నారు బరిలో నిలిచిన అభ్యర్థులు.     దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోలు, దౌల్తాబాద్, నార్సింగి, చేగుంట మండలాలు ఉన్నాయి. తమకు అన్ని మండలాల్లో లీడ్ వస్తుందని, 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామని అధికార టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు దుబ్బాక రూరల్, నార్సింగ్ , చేగుంట, రాయపోల్ మండలాల్లో తమకు మంచి లీడ్ వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. యువత, ఉద్యోగుల ఓట్లన్ని గంపగుత్తగా తమకే పడ్డాయని, దుబ్బాకలో ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ గెలవబోతుందని చెబుతోంది కమలదళం. ఇక మల్లన్నసాగర్ ముంపు గ్రామాలున్న తోగుంట మండలంలో పోలింగ్ కాంగ్రెస్ కు వన్ సైడ్ గా జరిగిందని, మిరుదొడ్డి, చేగుంట, దుబ్బాక అర్బన్, రూరల్ లోనూ లీడ్ సాధిస్తామని హస్తం నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.                     గెలుపుపై ప్రధాన పార్టీలు ఎవరికి వారే ధీమాగా ఉన్నా రాజకీయ విశ్లేషకులు, వివిధ సర్వే సంస్థల లెక్కల ప్రకారం దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే టఫ్ ఫైట్ నడిచిందంటున్నారు. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు నార్సింగ్ మండలాల్లో బీజేపీకి లీడ్ కనిపించిందని, రాయపోల్, చేగుంట మండలాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు నడిచిందని అంచనా వేస్తున్నారు. మిరుదొడ్డి, దౌలతాబాద్, దుబ్బాక రూరల్ మండలాల్లో కారు కు ఆధిక్యత రావొచ్చని లెక్కలు వేస్తున్నారు. తోగుంట మండలంలో మాత్రమే టీఆర్ఎస్, బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సొంత మండలం కావడం, మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఉండటమే ఇందుకు కారణమంటున్నారు.    దుబ్బాక  నియోజకవర్గంలో 78,187 మంది రైతులు రైతుబంధు, 52,823 మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. 5,599 మందికి కల్యాణలక్ష్మి, 322 మందికి షాదీ ముబారక్‌ చెక్కులతోపాటు, 30,732 మందికి కేసీఆర్‌ కిట్స్‌ అందజేశారు. ఇలా నియోజకవర్గంలో 1,67,663 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాయని, వీరందరి ఓట్లు తమకే పడతాయనే ధీమాతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఉంది. ఇక నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు 30 వేలకు పైగా ఉన్నారు. వీరిపై ఆశలు పెట్టుకుంది బీజేపీ. రైతు బంధు తీసుకున్నా కేసీఆర్ సర్కార్ పై రైతులు ఆగ్రహంగా ఉన్నారని, లక్ష రుణమాఫీ అమలు చేయకపోవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మద్దతు ధర, నియంత్రిత పంటల సాగు విధానాలతో ప్రభుత్వానికి రైతులు వ్యతిరేకంగా ఉన్నారంటున్నారు. నిరుద్యోగులంతా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారని చెబుతున్నారు.    దుబ్బాక నియోజరవర్గంలో మొత్తం లక్షా 98 వేల 807 మంది ఓటర్లున్నారు. మొత్తం ఏడు మండలాల్లోని 148 గ్రామాల్లో 315 పోలింగ్‌ స్టేషన్లలో ఓటింగ్ జరిగింది. 2018లో జరిగిన ఎన్నికల్లో  లక్షా 90 వేల మంది ఓటర్లకు గాను 1,63,658 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85.92% ఓటింగ్‌ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు  రామలింగా రెడ్డికి 89,299 ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటి చేసిన మద్దుల నాగేశ్వరరెడ్డి  26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు కేవలం 22 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

కరోనా కంటే జగన్ వైరస్ ప్రమాదకరం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కంటే... అంతకంటే ఎక్కువ పీడిస్తున్న జగన్ వైరస్ ప్రమాదకరమని చెప్పారు. పార్టీ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో 175 నియోజవర్గాలకు చెందిన పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. కరోనా కంటే జగన్ ప్రమాదకరమని వీడియో కాన్ఫరెన్స్ లో  పార్టీ నేతలతో చెప్పారు చంద్రబాబు. ఫేక్ వార్తలను కూడా నిజాలుగా చూపించి, జనాలను నమ్మించగల ఘనుడు జగన్ అని విమర్శించారు.    కుల, మత విద్వేషాలను రగిలించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంలో కూడా జగన్ ఆరితేరిపోయారని టీడీపీ అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు బురద చల్లడం సాధారణ అంశంగా మారిపోయిందని మండిపడ్డారు చంద్రబాబు. కేంద్రమంత్రి పేరుతో మోసగించిన వాడితో కేసులు వేయిస్తారు. పేకాట దందాలు నడిపేవాడితో కేసులు వేయిస్తారు. క్రిమినల్స్‌ను అడ్డం పెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తున్నారు అని సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు.    ‘‘నా ఇల్లు- నా స్వంతం’’, ‘‘నా స్థలం-నాకు ఇవ్వాలి’’ అంటూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీడీపీ పిలుపునిచ్చింది. ప్రజా ఆందోళనలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని, లబ్ధిదారులైన పేద కుటుంబాలకు అండగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు చంద్రబాబు. వాళ్ల ఇళ్లు, వాళ్ల స్వాధీనం అయ్యేదాకా బాధితుల తరఫున పోరాడాలని సూచించారు. కట్టిన ఇళ్ల వల్ల టీడీపీకి మంచిపేరు వస్తుందనే అక్కసుతో వాటిని నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ పెట్టుకుందని చంద్రబాబు ఆరోపించారు. డిపాజిట్ కట్టిన పేదలకు ఇళ్లు ఇవ్వకుండా వైసీపీ నమ్మకద్రోహం చేసింద్నారు, తమ కష్టార్జితాన్ని డిపాజిట్లుగా చెల్లించి, లాటరీలో పొందిన ఇళ్లను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు. సంక్రాంతి కల్లా ఇళ్లను పేదలకు స్వాధీనం చేయాలి అని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.

విజయశాంతిని పొగడ్తలతో ముంచెత్తిన బండి సంజయ్

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి కారణంగానే ఆమె పార్టీ కార్యక్రమాలకు, దుబ్బాక ప్రచారానికి దూరంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ.. ఆమె కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి మాట్లాడడంతో ఈ వార్తలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక  తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ సైతం విజయశాంతిపై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే త్వరలోనే ఆమె కాషాయదళంలో చేరుతారన్న వాదనలకు బలం చేకూరుతోంది.   విజయశాంతి గురించి బండి సంజయ్ మీడియా ఎదుట ప్రస్తావించారు. విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని, తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారని  కొనియాడారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలను ఆమె చైతన్యం చేశారని తెలిపారు. కానీ, తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని పేర్కొన్నారు. విజయశాంతి బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం సాగుతున్న ఈ తరుణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

పరీక్ష రాయకున్నా.. డీబార్ అయినా పాసే! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు హాజరు కాని వారందరిని పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడి డిబార్ అయిన విద్యార్థులను కూడా పాసైనట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.   కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా తెలంగాణలో 27,589 మంది ఇంటర్ విద్యార్థులను పాస్ చేయాలని నిర్ణయించింది. వీరిలో డీబార్ అయిన 338 మందితో పాటు, పరీక్షలకు హాజరు కాని 27,251 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ గ్రేస్ మార్కులు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది.    సాధారణంగా పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోతే కొన్ని సందర్భాల్లో వాళ్ల విద్యా భవిష్యత్తే అంధకారంలో పడిపోతుంటుంది. కానీ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు డీబార్ అయిన విద్యార్థుల పాలిట వరంలా మారింది. తెలంగాణలో వివిధ కారణాలతో మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన విద్యార్థులంతా ఇప్పుడు కరోనా కారణంగా ఇలా బయటపడ్డారు.