వైసిపి ఆఫీసు పై టీడీపీ జెండా.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

ఏపీలో పంచాయతీ ఎన్నికల హడావిడి నెలకొన్న సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల ఫలితాలు కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం లోని గుంటుపల్లి పంచాయతీ ఎన్నికల ఫలితాలు స్థానికంగా చిచ్చురేపాయి. ఇక్కడ వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం తలెత్తడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్థానిక వైసీపీ కార్యాలయంపై టీడీపీ జెండా కట్టడమే ఈ ఉద్రిక్తతకు కారణమని తెలుస్తోంది. మొన్న మంగళవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి భూక్యా కవిత విజయం సాధించారు. దీంతో టీడీపీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఒక అభిమాని వైసీపీ ఆఫీసుపై టీడీపీ జెండా కట్టాడని.. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో ఆగ్రహనికి గురైన వైసీపీ శ్రేణులు కార్యాలయం వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించి టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపించివేశారు. ఇది ఇలా ఉండగా వైసీపీ కార్యాలయంపై అద్దెకు ఉంటున్న ఒక కార్యకర్తే టీడీపీ జెండా కట్టాడని వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు.

తెలంగాణలో కొత్త రికార్డ్.. 

  తెలంగాణలో కొత్త రికార్డ్.. దాదాపు సంవత్సర కాలంగా ప్రపంచమంతా కరోనా చేస్తున్న విలయతాండవం తెలిసిందే.. కరోనాకి ఎవరు అతిథులు కారని .. కరోనా కాటుకు అందరూ బలిఅవ్వాల్సిందే అన్నట్లుగా ప్రపంచంపై కరోనా విరుచుకుపడింది.. ఇంకా ప్రపంచంలో   కరోనా పెనవేసుకొని ఉండగా.. తెలంగాణలో కరోనా  కేసుల్లో కొత్త రికార్డు నమోదైంది. కరోనా నియంత్రణలో ముందడుగు వేస్తోంది. కరోనా కేసులు తగ్గుముఖంతో పాటు..మరణాల సంఖ్య కూడా తగ్గిపోతోంది. అధికారిక లెక్కల ప్రకారం గురువారం కరోనాతో ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు.. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో146 కరోనా కేసులు నమోదు కాగా.. ఒక్క మరణం కూడా సంభవించలేదు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,96,134కి చేరింది. 1,613 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 1,825 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కరోనా చికిత్స నుంచి కోలుకుని 2,92,696 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 765 మంది బాధితులు ఉన్నారని, జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 25 కరోనా కేసులు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.  

టిఆర్ఎస్ లీడర్ని.. నా కారునే ఆపుతారా.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ లో నేత వీరంగం

హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు నిత్యం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెట్లు చేస్తూ మందుబాబులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డ్రైవ్ లలో మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా మంగళవారం రాత్రి సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా రామ్‌కోఠి చౌరస్తాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఆ సమయంలో హిమాయత్‌నగర్‌ నుంచి కాచిగూడ వెళ్తున్న ఏపీ 10 ఏఎస్‌ 3000 కారును పోలీసులు అడ్డుకొని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఫుల్‌గా మద్యం సేవించిన కేపీ శ్రీకాంత్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తాను టీఆర్‌ఎస్‌ నాయకుడినని.. నా కారునే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై చిందులేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి కారు డోర్లు తెరిచి చూడగా డ్రైవర్‌ సీటు పక్కన, అలాగే వెనక సీట్లలో మద్యం సీసాలు కనిపించాయి. దీంతో పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్ పెట్టి శ్రీకాంత్‌ను ఊదమని కోరగా, దాదాపు 45 నిమిషాల పాటు అతడు పోలీసులకు చుక్కలు చూపించాడు. దీంతో అతడిని సముదాయించిన పోలీసులు, అతడిపై కేసు నమోదు చేసి కార్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కోవిడ్ కు భారత్ ముక్కు టీకా.. 

  భారత్ టీకాలలకు ప్రపంచవ్యాపితంగా గుర్తింపు లభిస్తుంది.. భారత్ బయోటెక్  దేశీయంగా తయారుచేసిన ‘కొవాగ్జిన్’ టీకా వినియోగం దేశంలో ఇప్పటికే ప్రారంభం కాగా, ఇప్పుడు ముక్కు ద్వారా ఇచ్చే మరో టీకాను అభివృద్ధి చేసింది. ఇప్పుడీ టీకాకు క్లినికల్ పరీక్షల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, గ్రీన్ సిగ్నల్ లభించింది. పూర్తిస్థాయి చర్చల అనంతరం నాజల్ టీకా క్లినికల్ పరీక్షలకు అనుమతి ఇస్తున్నట్టు కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) పేర్కొంది. నిబంధనల మేరకు 75 మంది వలంటీర్లపై ఈ పరీక్షలు నిర్వహించి సేఫ్టీ-ఇమ్యునోజెనిసిటీ సమచారాన్ని సేకరించాలని నిపుణుల కమిటీ సూచించింది. నాజల్ టీకా అభివృద్ధి కోసం భారత్ బయోటెక్ గతేడాది సెప్టెంబరులో అమెరికాలోని వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్-సెయింట్ లూయిస్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ టీకా కనుక అందుబాటులోకి వస్తే అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు మినహా మిగిలిన దేశాల్లో విక్రయించే హక్కులు భారత్ బయోటెక్‌కు ఉంటాయి.

ఏప్రిల్ లో షర్మిల పార్టీ! 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఖరారైంది. పార్టీ కోసం ఆమె ఏర్పాట్లు కూడా వేగంగా చేసుకుంటున్నారు. అయితే  షర్మిల పాార్టీని ఎప్పుడు ప్రకటిస్తారన్నది ఇప్పుడు చర్చగా మారింది. అయితే షర్మిల పార్టీకి సంంబంధించి కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఏప్రిల్ 10న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. షర్మిల కూడా ఏప్రిల్ 10నే కొత్త పార్టీని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.  వైఎస్ సెంటిమెంట్ గా భావించిన చేవెళ్లలోనే వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఆ రోజునే భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సభకు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి జనాలను సమీకరించాలని నిర్ణయించారట.  ఆ రోజున పార్టీ కనుక ప్రకటించకుంటే, అదే రోజున చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ లోపు పార్టీ జెండా, విధివిధానాలను ఖరారు చేయాలని వైఎస్ షర్మిల ముందుకు వెళుతున్నట్లు సమాచారం. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల..  పార్టీ ఏర్పాటుపై దూకుడు పెంచారు .మంగళవారం లోటస్ పాండ్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమై చర్చించిన షర్మిల.. జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 20న ఆమె ఖమ్మంకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో గతంలో వైసీపీ బలంగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీతో పాటు మూడు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. అందుకే మొదటగా షర్మిల.. ఖమ్మం జిల్లాపైనే ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. కొత్త పార్టీ కార్యాలయం కోసం హైదరాబాద్ లో విశాలమైన భవనాన్ని తీసుకుంటున్నారని సమాచారం.    

ఫార్మసీ విద్యార్థినిపై హత్యాయత్నం!హైదరాబాద్ శివారులో దారుణం

హైదరాబాద్ శివారులో మరో దారుణం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో ఎక్కిన ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు.. హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో యువతి ప్రాణాలతో బయటపడింది.  పోలీసుల కథనం ప్రకారం బుధవారం కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరిన విద్యార్థిని  సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో కళాశాల వద్ద ఆటో ఎక్కింది.కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఆటోలో అప్పటికే ఉన్న వృద్ధురాలు, పాప దిగిపోయారు.  ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్లగానే ఇద్దరు యువకులు ఆటో ఎక్కారు. ఇంతలో విద్యార్థిని దిగాల్సిన ఆర్ఎల్ఆర్ నగర్ స్టేజీ వచ్చినా ఆటోను ఆపలేదు. ఆమె అరిచేలోగానే ఆటోలో అప్పటికే ఎక్కి కూర్చున్న ఇద్దరు యువకులు ఆమె నోరు నొక్కి పట్టుకున్నారు. ఆటో ఘట్‌కేసర్ మండలంలోని యంనంపేట రాగానే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వ్యాన్‌లోకి ఆమెను ఎక్కించారు. యువతి చాకచక్యంగా తన వద్దనున్న ఫోన్‌తో కిడ్నాప్‌కు గురైనట్టు తల్లికి సమాచారం అందించింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్సల్ ఆధారంగా యంనంపేట చేరుకున్నారు. యువతి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విషయం తెలుసుకున్న వ్యాన్, ఆటో డ్రైవర్లతోపాటు ఆటోలో ఎక్కిన ఇద్దరు యువకులు యువతిని వ్యాన్ నుంచి దించి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి  కర్రలతో దాడి చేశారు. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఆమెను వదిలి దుండగులు పరారయ్యారు. గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల  కోసం గాలిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో పిటిషన్ వేసిన కేఏ పాల్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఏపీలో ఆందోళనలు ఉధృతమౌతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేఏ పాల్‌ ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారంటూ అయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్రం డిజిన్వెస్ట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తోందని... ఇలా చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పాల్‌ తన పిటిషన్‌ ద్వారా హైకోర్టును కోరారు. అంతేకాకుండా విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా కలసిరావాలని అయన కోరారు. ఈ అంశంపై సీఎం జగన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పాల్ డిమాండ్ చేశారు.

ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. తొక్కిపడేస్తాం జాగ్రత్త! విపక్షాలకు కేసీఆర్ వార్నింగ్

నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ విపక్షాలకు విరుచుకుపడ్డారు.  కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లే కదా నల్గొండ జిల్లాకు ఈ గతి పట్టిందన్నారు. తమ ప్రాజెక్టులన్నీ కమీషన్ కోసం కడుతున్నామని ఎద్దేవా చేస్తున్నారు.. మరి నాగార్జున సాగర్ కూడా కమీషన్ కోసమే కట్టారా..? అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు కేసీఆర్.  బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.  కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. హద్దు మీరినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసన్నారు. తొక్కిపడేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. తమకు ప్రజలు తీర్పు ఇచ్చారని.. ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు పలికే అర్హత లేదన్నారు. మేము తలుచుకుంటే మీరు దుమ్ము దుమ్ము అయిపోతారని.. తమ దేమీ ఎవరో నామినేట్ చేస్తే వచ్చిన ప్రభుత్వం కాదని ఫైర్ అయ్యారు గులాబీ బాస్.  హాలియా సభలో నల్గొండ జిల్లాపై వరాల జల్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. నల్గొండ జిల్లా అభివృద్ధికి రూ.186 కోట్లు ప్రకటించారు.  జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉండగా.. ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రానికి రూ.30లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5 కోట్లు ప్రకటించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధుల విడుదలకు సంబంధించి గురువారమే జీవో విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. జిల్లాలోని పెండింగ్ లిఫ్ట్ ప్రాజెక్టుల పూర్తికి రూ.2500 కోట్లు ఇస్తానన్నారు. ఏడాదిలోగా లిఫ్టులు పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని వెల్లడించారు హాలియా బహిరంగ సభలోన్ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు కేసీఆర్. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు త్వరలో పెన్షన్లు ఇస్తామని  ప్రకటించారు.  రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని వెల్లడించారు.  నల్గొండ జిల్లాపై వరాల జల్లు కురిపించడంపై వెనుక కేసీఆర్ వ్యుహం ఉందని అందరూ అనుకుంటున్నారు. త్వరలో జరిగే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు కోసమే ముఖ్యమంత్రి జిల్లా వాసులకు ప్రత్యేక వరాలు ప్రకటించినట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి.   అంతకుముందు నాగార్జునసాగర్‌ నియోజకర్గంలో నెల్లికల్ వ‌ద్ద 13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్‌, సాగర్‌, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్‌ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్‌ ఇరిగినేషన్‌ ప్రాజెక్టులను చేపడుతున్నారు. 

2019 అక్టోబర్ లోనే పోస్కోతో విశాఖ డీల్! అన్ని తెలిసినా స్పందించని జగన్ సర్కార్ 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక ఉన్న అసలు నిజం బయటపడింది. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల చీకటి బాగోతం వెలుగు చూసింది. రాజ్యసభ సాక్షిగా కేంద్ర ఉక్కుశాఖా మంత్రి స్టీల్ ప్లాంట్ అంశంలో సంచలన విషయాలు బయటపెట్టారు.  విశాఖ స్టీల్ ప్లాంట్‌ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు  ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి ..  పోస్కో ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో 2019 అక్టోబర్‌లోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఒప్పందం తర్వాత సీఎం జగన్‌ను పోస్కో ప్రతినిధులు కలిశారని చెప్పారు.   విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికే 3 సార్లు పోస్కో బృందం సందర్శించిందని  కూడా  కేంద్రమంత్రి రాజ్యసభలో తెలిపారు. పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం కుదిరిందన్నారు. పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు జాయింట్ వర్కింగ్‌ గ్రూప్‌ను.. ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త ప్లాంట్‌లో పోస్కో వాటా 50 శాతంగా ఉంటుందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని సమాధానమిచ్చారు.           పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని కేంద్రం రహస్యంగా ఉంచడంపై పలువురు మండిపడుతున్నారు.2019 అక్టోబర్ లో డీల్ కుదిరిన విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా దాచి పెట్టారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రా హక్కు అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారం ప్రైవేటీకరణ అవుతుందని తెలిసినా జగన్ సర్కార్ మౌనంగా ఉండటంపై విశాఖ వాసులు మండిపోడుతున్నారు. కేంద్రంతో కుమ్మక్కై జగన్ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అన్ని తెలుసు కాబట్టే.. ఆంధ్రా జనమంతా ఆందోళన చేస్తున్నా వైసీపీ నేతలు స్పందించడం లేదంటున్నారు.  

ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు! 

వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టబోతున్న కొత్త పార్టీ రాజకీయ సెగలు రేపుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.  వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై స్పందించారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ పెడుతున్నానని షర్మిల చెబుతుంటే.. ఏ2 మాత్రం లేదంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. షర్మిల పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోను ఆయన ప్లే చేశారు.  ఆనాడు జగనన్న వదిలిన బాణం విశ్వసనీయత ఏమైందన్నారు చంద్రబాబు. విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్.. షర్మిల పార్టీ పెట్టడంపై స్పందించాలన్నారు. ఇంట్లో వాళ్ళకే జగన్ వెన్నుపోటు పొడిచారని టీడీపీ అధినేత ఎద్దేవా చేశారు. బాబాయ్ హత్య ఇంకా తేల్చ లేదని విమర్శించారు. వివేకా హత్య కేసులో అప్పుడు సీబీఐ కావాలని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు వద్దు అంటున్నారన్నారు. బాబాయ్‌ని చంపిన వారితో కలిసిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. నాడు వివేకా కూతురు... నేడు షర్మిల పోరాడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.     

గ్రేటర్ మేయర్ గా కేకే కూతురు ! 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మెన్ పై క్లారిటీ వచ్చేసింది. గ్రేటర్ మేయర్ గా  రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి పేరును  సీఎం కేసిఆర్ ఖరారు చేశారని తెలుస్తోంది. గురువారం  ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్  ఎన్నిక జరగనుంది. ఉదయం పది గంటలకు కార్పొరేటర్లుగా గెలిచిన పార్టీ నేతలు.. ఎక్స్ అఫిషియో సభ్యులు తెలంగాణ భవన్ కు చేరుకోవాలని.. అక్కడి నుంచి బస్సులో బల్దియా భవనానికి వెళ్లాలని కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీల్డ్ కవర్ లో మేయర్ పేరును పంపనున్నారు కేసీఆర్.     రెడ్డి సామాజిక వర్గానికి ఈ పదవిని ఇస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. కానీ తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేసిఆర్.. విజయలక్ష్మి వైపు మెగ్గు చూపారని తెలుస్తోంది. బీసీలకు రాజ్యాధికారం దక్కలేదన్న ఆగ్రహం తెలంగాణలో నెలకొంది. దీని ప్రభావం గ్రేటర్, దుబ్బాకలో కనబడిందని నిర్ణయానికి వచ్చిన కేసిఆర్ మేయర్ పదవిని బీసీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం. పార్టీ సీనియర్ నేత కేకే మంగళవారం ప్రగతి భవన్ కు వెళ్ళి ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీని గుర్తు చేసిన కేకే తన కూతురు గద్వాల విజయలక్ష్మికి మేయర్ పదవిని ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇదే సమయంలో బీజేపీ బీసీలకు రాజ్యాధికారం అప్పగించాలని చేస్తున్న డిమాండ్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కేసిఆర్ కు కేకే సూచించారని వార్తలు వినబడుతున్నాయి. కేకే నిర్ణయంతో ఏకీభవించిన కేసిఆర్ బీసీలకే మేయర్ పదవిని ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో బాటు గద్వాల విజయలక్ష్మి పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.  జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గత ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ 56 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. 48 వార్డులు గెలిచి బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.  పాతబస్తీలో మరోసారి సత్తా చాటిన ఎంఐఎం 44 వార్డులు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకే పరిమితమయింది. బీజేపీ భారీగా వార్డులను గెలవడంతో టీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ నెలకొంది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సంఖ్య 150 కాగా.. కరోనాతో బీజేపీ కార్పొరేటర్  మరణించారు. ప్రస్తుతం ఉన్నది 149 మంది. మొత్తం 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికలో ఓటువేసే వారి సంఖ్య 193కి చేరనుంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మేజిక్ ఫిగర్ 97. మొత్తం 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు అధికంగా 31, బీజేపీకి ఇద్దరు, కాంగ్రెస్‌కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి టీఆర్ఎస్ బలం 87గా ఉంది. మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవాలంటే టీఆర్ఎస్‌కు మరో 10 ఓట్లు అవసరం.ఐతే మేయర్ పదవి దక్కాలంటే మ్యాజిక్ నెంబర్ అవసరం లేదని.. మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన అత్యధిక మంది సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల బలమున్న టీఆర్ఎస్‌కే మేయర్ పీఠం దక్కనుంది.                మరోవైపు మేయర్ ఎన్నికకు సంబంధించి బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.  మేయర్, ఉపమేయర్ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించింది. తమకు బలం లేకున్నప్పటికీ టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు గురించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఎంఐఎం కూడా మేయర్ బరిలో నిలలబోతుందని చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ కోసమే ఎంఐఎం మేయర్ సీటుకు పోటీ చేస్తుందని చెబుతున్నారు. 

తెలంగాణను ఆంధ్రాలో కలిపేయండి ! రాజకీయ డ్రామాలేంటన్న జగ్గారెడ్డి 

తెలంగాణలో  రాబోతున్న వైఎస్ షర్మిల కొత్త పార్టీపై రాజకీయ పార్టీలు నేతల హాట్ కామెంట్స్ చేస్తున్నారు. షర్మిల పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పేరుతో  తెలంగాణలో డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల కొత్త పార్టీ తో వస్తుందన్నారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కి రాకుండా బిజెపి పావులు కదుపుతోందన్నారు జగ్గారెడ్డి. బిజెపి డైరెక్షన్లో కెసిఆర్ పని చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ క్రీడ ఆడుకోవడానికి తెలంగాణను బాల్ లా తయారు చేశారన్నారు. ఆంధ్రా నేతలు ఇక్కడికి వస్తున్నప్పుడు ఇంకా తెలంగాణకు ఎందుకు... ఉమ్మడి రాష్ట్రంలో కలిపేయండి అంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని హైదరాబాద్ నుంచి పంపించడానికి  ఎన్నో కుట్రలు చేసిన కెసిఆర్..  షర్మిల పార్టీ పై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.  రాజశేఖర్ రెడ్డి పేరుతో రాజకీయ సొమ్ము చేసుకునేందుకు షర్మిల వస్తుందన్నారు జగ్గారెడ్డి. బీజేపీ, అమిత్ షా, కేసీఆర్ స్క్రిప్ట్ ని షర్మిల చదువుతోందని ఆయన విమర్శించారు. ఈ నాలుగు పార్టీలకు మెగా కృష్ణా రెడ్డి పండింగ్ చేస్తున్నారని తెలిపారు. రక్తం పంచుకున్న కూతురుతో రాజశేఖర్ రెడ్డి సీఎం అవలేదు .. రక్తం పంచుకున్న కాంగ్రెస్ అభిమానులతో రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారన్నారు. రాజశేఖర్ రెడ్డి వారసురాలువు అయితే .. రాజన్న కోరిక నెరవేర్చలనుకుంటే  కాంగ్రెస్ లో చేరాలని షర్మిలకు సూచించారు జగ్గారెడ్డి. రాజశేఖర్ రెడ్డి కల అయిన రాహుల్ గాంధీ ని ప్రధాని చేసేందుకు తమతో కలిసి రావాలన్నారు. అన్న మాట చెల్లి వినదు ..చెల్లి మాట అన్న వినదు  అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల మధ్యే విభేదాలుంటే... వాళ్లు రాజశేఖర్ రెడ్డి వారసులు ఎట్లా అవుతారన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్, జగన్, పవన్ కల్యాణ్, షర్మిలలు అమిత్ షా బాణాలన్నారు జగ్గారెడ్డి.   

చైనాపై డబ్ల్యూ హెచ్ ఓ చెబుతున్నది నిజమెనా?

కరోనా వైరస్ జంతువుల్లో మొదలైయింది డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందం వెల్లడించింది.. ఈ మేరకు ఉహాన్ లోని హిల్టన్ హోటల్ లో వర్చువల్ పద్దతిలో నిర్వహించిన విశ్లేషణ అంశాలను డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందానికి నేతృత్వం వహిస్తున్న పీటర్ ఎంబార్బక్ పలు కీలక అంశాలను వెల్లడించారు.. అయితే చైనా లోని వుహాన్ ల్యాబ్ కరోనా వ్యాప్తికి కారణమంటూ చేస్తున్న ప్రచారాన్ని ఎంబార్క్ కొట్టిపారేశారు.. నెల రోజులుగా  డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందం ఉహాన్ లోని ఆస్పత్రులు, ల్యాబ్ లు , మార్కెట్లు, చేపల మార్కెట్లను సందర్శించామని ఎంబర్క్ స్పష్టం చేశారు.. డిసెంబర్ 19 నుండి మొత్తం ముఖ చిత్రం మారిపోయిందని.. అది మన చేతిలో వుండదని పీటర్ బెన్ ఎంబెర్క్ వెల్లడించారు.. డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందంలో ఆహార సంరక్షణ, జంతువుల రోగాలలో నిపుణులైన శాస్త్రజ్ఞులు పాల్గొన్నారని వివరించారు.. కొన్ని అంశాలను అర్థం చేసుకుని పరిశీలన చేసిన అనంతరం మాత్రమే వివరిస్తున్నామని ఎంబెర్క్ స్పష్టం చేశారు.. వైరస్ జంతువుల నుండి మానవులకు సంక్రమించి ఉండవచ్చని..దీనిని పూర్తిగా నిర్ధారించలేమని ఈ అంశం పై మరింత లోతైన విశ్లేషణ అవసరమని ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉందని ఈ బృందం అభిప్రాయపడింది.. అయితే చైనీయులు మాత్రం కోవిడ్-19 ప్రొజన్ మీట్ నుంచి విస్తరించి ఉండవచ్చునని ఇదే నిజమని వెల్లడించడం.. అనుమానాలకు తావిస్తుంది..   వుహాన్ లోని వైరాలజి ఇనిస్ట్యూట్ సిడిసి ల్యాబ్ ను పరిశీలించింది, కోవిడ్ 19 బ్రేక్ అవుట్ గల కారణాలు కనుగొనలేకపోయామని శాస్త్రజ్ఞులు వివరించారు.. డిసెంబర్ కు ముందే వైరస్ బాగా వ్యాప్తి చెందిందని గుర్తించినట్టు డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందం  పేర్కోంది.. ఇది కేవలం వుహాన్ సముద్ర ఆహారం అందించే మార్కెట్ ద్వారానే విస్తరించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తుంది. ప్యాండమిక్ గల కారణాలు, కీలక అంశాల పై పరిశోధనలు చేసేందుకు మరో 10 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.. 1970 నుండి ఎబోలాపై జరిగిన పరిశోధనలు నేటికీ కొనసాగుతున్నాయని.. వీటికి గల కారణాలు కనుగొనలేకపోయామని, సార్స్ కోవిడ్ పై పరిశోధనలకు మరింత సమయం పట్టవచ్చని శాస్త్రజ్ఞుల బృందం స్పష్టం చేసింది.. ఇది చాల సున్నితమైన  అంశమని అలా జరిగిందా లేదా అన్న అంశంపై నిజమా..? కాదా ..? ఊహా మాత్రమేనా..? అనే అంశాన్ని భవిష్యత్ లో జరిగే పరిశోధనలు వెల్లడిస్తాయని తేల్చిచెప్పారు.. జంతువుల నుండి మానవులకు ఎలా వ్యాప్తి చెందింది అన్న అంశం పై పరిశోధనలు చేపడుతామని కరోనా వైరస్ శాంపిల్స్ ను పరిశీలించాల్సిందని అన్నారు.. జతువుల నుండి వైరస్ సోకిందనడాని పూర్తిగా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు.. గతం లో డబ్ల్యూ హెచ్ ఓ కరోనా వైరస్ కేవలం గబ్బిలాల నుంచి వచ్చిందన్న అంశాన్ని ప్రచారం చేసిందా అన్న అనుమానం కలుగుతుంది.. అయితే గబ్బిలాల నుంచి జంతువులకు, జంతువుల నుండి మనుషులకు అక్కడినుంచి ఇతర సముద్రపు ఆహారపు ఉత్పత్తుల ద్వారా వచ్చిందనడానికి ఆధారాలు ఉన్నాయని.. మార్కెట్ లో జరిగిన జంతు మాంసం అమ్మకాలు కారణం కావచ్చని అనుకుంటున్నారు.. చైనాకు చెందిన సిడిసి మాత్రం మార్కెట్ నుండి శాంపిల్స్ సేకరించినప్పటికీ అక్కడ వైరస్ ప్రారంభం అయిందని నిర్ధారించలేమని పేర్కొంది.. అక్కడ మార్కెట్ కి వైరస్ ఎలా వచ్చిందనేది సందేహం.. ఆ ప్రకటలు చూస్తే డబ్ల్యూ హెచ్ ఓ శాస్త్రజ్ఞుల బృందం పై చైనా ప్రభావం ఉందని అసలు వాస్తవాలు వెల్లడిచేయకుండా మరుగున పడేసేందుకే ఈ అంశం తెర మీదికి తెచ్చారని వైద్య బృందం అనుమానాలు వ్యక్తం చేస్తుంది.  

అన్నను ప్రశ్నించు అంటూ షర్మిలకు హరీష్ చురక!

షర్మిల కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుంది వివిధ పార్టీల నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు..సంగారెడ్డి జిల్లాలో రైతు వేదిక సభలో మాట్లాడిన హరీష్ రావు  షర్మిలకు చురకలు అంటించారు.. ఇంటి గుట్టు (రాష్ట్రము) చక్కబెట్టుకొని వాళ్ళు ‘‘ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారని. తెలంగాణకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తే,  ఆ మొసలి కన్నీరును నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని’’ అంటూ పరోక్షంగా షర్మిలను  హరీష్ రావు ఏదేవా చేశారు..  షర్మిల కు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా? అభిమానం ఉంటే, అధికారం దక్కదని, ప్రజల ఆదరణ, ఆలోచన విధానమే ఫలితాలు ఇస్తాయని.. ఏపీ లో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ. 12.500 మాత్రమే ఇస్తున్నారని, అదే తెలంగాణాలో అయితే  ఎకరానికి పదివేల చొప్పున, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని హరీష్ గుర్తు చేశారు. ఏపీలో రైతుల కు జరుగుతున్న అన్యాయాలపై తన సొంత అన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిచలేని  షర్మిల, తెలంగాణ రైతుల గురించి మాట్లాడం హాస్యాస్పదమని హరీష్ రావు అన్నారు..   

ఈ అమావాస్య ముహూర్తమేంది సారు.. తలలు పట్టుకుంటున్న కార్పొరేటర్లు

జీహెచ్ఎంసీ ఎన్నికలలో నెగ్గిన కార్పొరేటర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చేసింది. ప్రమాణ స్వీకారం చేసి కార్పొరేట‌ర్ సీటులో కూర్చుందామని ‌ త‌హ‌త‌హ‌లాడుతున్న ఆ నేత‌ల కోరిక తీర‌బోతోంది. అయితే ఇన్ని రోజులు ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మం ముహూర్తం కొత్త కార్పొరేట‌ర్లను వ‌ణికిస్తోంది. వారి భయానికి కల ముఖ్య కారణం ఏంటంటే ఐదేళ్లపాటు ఉండాల్సిన ప‌ద‌వి కోసం చేసే ప్రమాణ స్వీకార కార్యక్రమం అమావాస్య రోజు పెట్ట‌డ‌మేంట‌ని తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అసలే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ రాలేదు. తమకు కావాల్సిన బ‌లం లేక‌పోయినా అధికార టిఆర్ఎస్ పార్టీ మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ల‌ను నిలబెడుతోంది. దీంతో గ్రేటర్ పాల‌క మండ‌లిలో ఏ క్షణం ఎలాంటి ముస‌లం పుడుతుందో.. త‌మ ప‌ద‌వుల‌కు గండం ముంచుకొస్తుందోన‌ని కొత్త కార్పొరేటర్లు టెన్ష‌న్ ‌ప‌డుతున్నారు. దీంతో ప్ర‌మాణ స్వీకార ముహుర్తంపై తమ అభ్యంత‌రాల‌ను అధికారుల దృష్టికిపార్టీలు తీసుకెళ్లాయి . అయితే ఇది ఎన్నికల సంఘం నిర్ణ‌య‌మ‌ని, దీంతో తామేం చేయ‌లేమ‌ని అధికారులు కూడా చేతులెత్తేశారు. దీంతో దేవుడిపై భారం వేసి కార్పొరేటర్లు ప్ర‌మాణ‌స్వీకారానికి సిద్ద‌మ‌వుతున్నారు.

విశాఖ ఉక్కును కాపాడుకుందాం.. కానీ !  విజయసాయి వ్యాఖ్యలతో రచ్చ  

సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతమవుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వైసీపీ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమయంలో కార్మికులకు అండగా నిలవాల్సిన వైసీపీ నేతలే .. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మరింత గందరగోళ పరుస్తున్నారు. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో  ఇప్పుడు రచ్చ జరుగుతోంది.              విశాఖలో జరుగుతున్న అఖిలపక్ష నిరసన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు ఎంపీ విజయసాయి రెడ్డి. అయితే  విజయసాయి మాట్లాడుతుండగా  కొందరు కార్మికులు అభ్యంతరం చెప్పారు. విశాఖ ప్లాంటును కొనసాగించే ప్రయత్నం చేద్దామని, కొన్ని సార్లు లక్ష్యం నెరవేరుతుందని, కొన్ని సార్లు నెరవేరకపోవచ్చని.. దేనికైనా పట్టువిడుపు ఉండాలి   అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనకు వ్యతిరేక నినాదాలు వినిపించాయి. ఎంపీ విజయ్ సాయి రెడ్డి ప్రసంగాన్ని కార్మికులు అడ్డుకున్నారు. ఉక్కు మంత్రి, ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయన్ని కలిసేలా ప్రయత్నిస్తానని విజయ్ సాయి రెడ్డి సర్ది చెప్పారు.    విజయసాయి వ్యాఖ్యలపై సీపీఎం నేతలు అభ్యంతరం తెలిపారు. ‘‘మీకు నచ్చినా...నచ్చకపోయినా నేను చెప్పేది వాస్తవం’’ అని విజయసాయి వాదించారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ సహా మిగితా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెనుదిరిగారు. విజయసాయిరెడ్డి కారును ఆందోళనకారులు  అడ్డుకున్నారు. చివరకు పోలీసుల సహాయంతో ఎంపీ విజయసాయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విజయసాయి తీరుపై కార్మికులు భగ్గుమంటున్నారు. కార్మికులకు భరోసా కల్పించాల్సింది పోయి... కష్టమనే అర్ధం వచ్చేలా మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విజయసాయి వ్యాఖ్యలతో  కేంద్రంతో కలిసి రాష్ట్ర సర్కారే ఈ కుట్ర చేస్తుందనే అనుమానాలు వస్తున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్! 

పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికలు  ముంచుకొస్తున్న వేళ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ టీచర్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ కీలక నేత పూల రవీందర్ గులాబీ పార్టీకి రాజానామా చేశారు. తనకు పార్టీ కంటే ఉపాధ్యాయ సమస్యలే ముఖ్యమని ప్రకటించారు. తాను రాజీనామా చేయమడే కాదు.. మిగితా టీచర్ ఎమ్మెల్సీలతోనూ రాజీనామా చేయిస్తానని ప్రకటించారు పూల రవీందర్.  పీఆర్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన మహాధర్నాకు పూల రవీందర్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. అయితే కొందరు ఉపాధ్యాయులు ఆయన మాట్లాడుతుండగా అడ్డగించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీచర్లను అవమానిస్తున్న టీఆర్ఎస్ నుంచి బయటికి రావాలని డిమాండ్ చేశారు. దీంతో పీఆర్టీయూ సభ్యుల కోరిక మేరకు.. ఆ సభా వేదికపైనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పూల రవీందర్. రాష్ట్ర సాధన కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించకపోతే హైదరాబాద్‌లో జరిగే మహాధర్నారోజు పీఆర్‌టీయూ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిద్దామన్నారు. టీఆర్‌ఎస్‌పార్టీ ముఖ్యం కాదని, పీఆర్‌టీయూ ముఖ్యమన్నారు పూల రవీందర్. పీఆర్‌టీయూ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాల సమస్యలు పరిష్కారానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం 45శాతం పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ విధానం పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమోషన్స్‌, బదిలీల షెడ్యూల్‌ ప్రకటించి, అన్ని పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలన్నారు.  నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గత ఏడాది వరకు పని చేశారు పూల రవీందర్. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసిన తర్వాత ఆయన ఆ పార్టీకి కొంత దూరంగానే ఉంటున్నారు.   

బంధువు పెళ్ళికి వెళ్లి కరోడ్ పతి అయ్యాడు.. లక్ కలిసొస్తే అంతే...

ప్రతి వ్యక్తి జీవితంలో అదృష్టం ఏదో ఒక సమయంలో ఎదో ఒక రూపంలో తలుపు కొడుతుందని చెబుతూరు మన పెద్దలు. తాజాగా కర్ణాటకకు చెందిన ఒక యువకుడికి ఇలాగె అనుకోని అదృష్టం తలుపుతట్టింది. బంధువుల ఇంట్లో పెళ్లికి పక్క రాష్ట్రానికి వెళ్లి.. మరీ కోటీశ్వరుడయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...  కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని సోమనహళ్ళి గ్రామానికి చెందిన సోహాన్‌ బలరామ్ అనే యువకుడికి కేరళలో ఏకంగా రూ.కోటి లాటరీ తగిలింది. సోహాన్ ఈ నెల 5వ తేదీన తన కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లి కోసం కేరళకు వెళ్లాడు. అక్కడ శుభకార్యానికి హాజరై.. తరువాత తన స్నేహితుడు దేవదాసు ప్రభాకర్‌ ఇంటికి వెళ్లాడు. స్నేహితుల బలవంతంపై తనకు ఇష్టం లేకపాయినా.. దేవదాసు దుకాణంలో ఉన్న కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ను రూ.100 పెట్టి కొన్న సోహన్.. కుటుంబంతో కలిసి కారులో మాండ్య కు బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో సోహన్ మొబైల్‌కు ఫోన్‌ వచ్చింది. నువ్వు కొన్న టికెట్‌కు రూ. 1 కోటి లాటరీ వచ్చిందని ఫ్రెండ్ చెప్పడంతో అతడు ఏదో తమాషా చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ మళ్లీ మరో కాల్ చేసిన ఫ్రెండ్ వెంటనే టికెట్‌ తీసుకుని వెనక్కు రా అని ఒత్తిడి చేయడంతో దారిలోనే వెనుదిరిగాడు. వెనక్కు వెళ్లిన సోహన్ డ్రాలో వచ్చిన నంబర్‌ చూసుకుంటే నిజంగానే అతడి టికెట్ కు లాటరీ తగిలింది.దీంతో సోహన్ సంతోషం పట్టలేక స్వీట్లు కొని పంచిపెట్టాడు. అంతేకాకుండా లాటరీలో వచ్చిన డబ్బుతో తమకు వారసత్వంగా ఉన్న రైస్‌మిల్‌ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలిపాడు. తాజాగా సోషల్ మీడియాలో అతడి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది.

కన్నబాబుకు ఓటర్ల షాక్..

   వివాదాస్పద ఎమ్మెల్యే కన్నబాబుకు  ఓటర్లు బుద్దిచెప్పారు.. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు నోటి దురుసుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కన్నబాబు, ఇతర వైసీపీ నాయకులు నాలుగు రోజుల క్రితం రాంబిల్లి మండలం వి.ఆర్‌.అగ్రహారం వెళ్లారు. తాను బలపరచిన సర్పంచ్‌ అభ్యర్థితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో తాను చెప్పిన అభ్యర్థినే సర్పంచ్‌గా గెలిపించాలని, లేకుంటే పంచాయతీకి ఎటువంటి సంక్షేమ పథకాలు రావని హెచ్చరించారు. ఒకవేళ ప్రత్యర్థి వర్గానికిచెందిన వ్యక్తిని గెలిపిస్తే తన ఇంటి గుమ్మం ఎక్కనివ్వనని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఓపిగ్గా విన్న గ్రామస్థులు... ఒక్కసారిగా కదిలి, ఎమ్మెల్యేపైకి దూసుకొచ్చారు. వెంటనే ఎమ్మెల్యే గన్‌మన్‌ అప్రమత్తమై రక్షణ చర్యలకు దిగారు. అయినా గ్రామస్థులు వెనుకంజవేయకుండా నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే కోపంతో ఊగిపోతూ, చేతిలో వున్న మైకును పడేసిన.. గ్రామస్థుల్లో ఆగ్రహం చల్లారకపోవడంతో ఎమ్మెల్యే కన్నబాబురాజు తన వాహనం వద్దకు బయలుదేరగా. గ్రామస్థులు కూడా కన్నబాబు వెంటనడుస్తూ నిరసన తెలియజేశారు. అతికష్టంమీద వాహనం ఎక్కి అక్కడ నుంచి వెళ్లిపోయారు.. వివరాల్లోకి వెళితే ఏపీ పంచాయతీ ఎన్నికలలో ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అత్యధిక పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినా...కొన్నిచోట్ల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. రాంబిల్లి మండలం రాజకోడూరులో ఎమ్మెల్యే బలపరిచిన చిరంజీవిపై వైసీపీ తిరుగుబాటు అభ్యర్థి ముత్తా శంకరరావు విజయం సాధించారు. ఇక్కడ పది వార్డులకు తొమ్మిది వార్డులు శంకరరావు వర్గీయులు కైవసం చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబు తనదైన శైలిలో బెదిరించారు. తన బెదిరింపులకు ప్రజలు ఎదురుకున్నారు.. నాయకుడైన.. సేవకుడైన.. లీడర్ అయినా.. ఫ్లీడర్ అయినా .. అధికారి అయినా.. అచొచ్చిన అంబోతైన ప్రజలకు కోపం రానంత వరకే.. ఒక సారి ప్రజల్లో కోపం పతాక స్థాయికి చేరితే ఎదురుతిరుగుతారు నాయకుల ఆధిపత్య విధానాలను ఎండగడతారు  అవసమైతే ఉప్పుపాతరేస్తారని.. యలమంచి ప్రజలు మరోసారి నిరూపించారు.