ఇండియాలో 30 కోట్ల మందికి కరోనా! సీరో సర్వేలో తేల్చిన ఐసీఎంఆర్
posted on Feb 5, 2021 @ 9:35AM
ప్రపంచాన్ని ఇంకా వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఏడాది దాటినా ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉంది. రూపు మార్చుకుని కొన్ని దేశాల్లో మరింత ప్రమాదకరంగా మారింది మాయదారి వైరస్. ఇండియాలోనూ కరోనా కేసులు ఇంకా వేలల్లోనే నమోదవుతున్నాయి. ఆరు నెలల క్రితంతో పోల్చితే కేసుల సంఖ్య భారీగానే తగ్గినా.. ఇంకా ముప్పు పూర్తిగా పోలేదంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఇండియాలో కరోనాకు సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన సీరో సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి.
ఇండియాలో గత సంవత్సరం డిసెంబర్ నాటికే ప్రతి ఐదుగురిలో ఒకరికి పైగా కరోనా బారిన పడ్డారని ఐసీఎంఆర్ సీరోలాజికల్ సర్వే గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలో దాదాపు 28 కోట్ల మందికి డిసెంబర్ నాటికే కరోనా సోకిందన్నమాట. ఢిల్లీ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో సీరో సర్వే నిర్వహించగా, 21.4 శాతం మందికి కరోనా సోకి తగ్గిపోయి, యాంటీ బాడీలు వృద్ధి చెందాయని తేలింది. 10 నుంచి 18 సంవత్సరాల వయసున్న వారిలో 25.3 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయి. ఈ గణాంకాల ఆధారంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్ సోకిందన్న నిర్ధారణకు వచ్చామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ తెలిపారు.
ఆగస్టులో జరిపిన సీరో సర్వేతో పోలిస్తే కరోనాను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తిని కలిగివున్న వారి సంఖ్య 0.7 శాతం నుంచి 21.4 శాతానికి పెరిగింది. 18 సంవత్సరాల కన్నా అధిక వయసున్న వారిలో 21.4 శాతం, టీనేజ్ లో ఉన్న వారిలో 25.3 శాతం, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో ఉంటున్న వారిలో 31.7 శాతం, పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 26.2 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.1 శాతం వరకూ కరోనా రోగ నిరోధక శక్తి ఉందని తమ సీరో సర్వేలో వెల్లడైంది. మగవారిలో 20.3 శాతం, ఆడవారిలో 22.7 శాతం మంది కరోనాను ఎదుర్కొన్నారని ఐసీఎంఆర్ డైరెక్టర్ వివరించారు.
హెల్త్ కేర్ విభాగానికి వస్తే డాక్టర్లు, నర్సుల్లో 26.6 శాతం, పారామెడికల్ స్టాఫ్ లో 25.4 శాతం, ఫీల్డ్ స్టాఫ్ లో 25.3 శాతం, అడ్మిన్ స్టాఫ్ లో 24.9 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాలకు చెందిన 700 పట్టణాలు, గ్రామాల్లో ఈ సర్వే జరిగిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.
ఇక ఢిల్లీలో తాజాగా నిర్వహించిన సీరో సర్వేలో ఢిల్లీలోని 56.1 శాతం మంది శరీరంలో యాంటీ బాడీల వృద్ధి కనిపించిందని వెల్లడైంది. ఢిల్లీ వాసుల్లో సగం మందికి పైగా కరోనా బారిన పడి ఏ విధమైన మందులు తీసుకోకుండానే కోలుకున్నారని తేలింది. ఏ ప్రాంతంలోనైనా ఓ వ్యాధి ప్రబలితే.. 50 శాతానికి పైగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన తరువాతే దాని వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినట్టని వైద్యశాఖ నిర్దారిస్తుంది.ఈ లెక్కన కరోనా మహమ్మారిని దేశ రాజధాని ఢిల్లీ జయించిందని చెబుతున్నారు.