కొవిడ్ టీకాపైనా రాజకీయం..దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కేంద్రం

హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ "కోవాగ్జిన్" ను దేశ వ్యాప్తంగా ప్రజలకు ఇస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ కోవాగ్జిన్ పై తమకు అనుమానాలు ఉన్నాయని, వేంటనే తమ రాష్ట్రానికి దీని సరఫరాను నిలిపివేయాలని చత్తీస్ గఢ్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇంకా మూడో దశ ట్రయల్స్ పూర్తికాని ఈ వ్యాక్సిన్ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదని, అంతేకాకుండా తమకు అందిన వ్యాక్సిన్ వయల్స్ పై ఎక్స్ పైరీ డేట్ కూడా లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి టీఎస్ సింగ్ దియో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యాక్సిన్ పై ప్రజలలో కూడా అసంతృప్తి ఉందని అయన తెలిపారు. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్.. "అసలు మీ రాష్ట్రం వ్యాక్సిన్ లక్ష్యాన్ని అందుకోవడంలోను, షెడ్యూల్ ప్రకారం ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ను ఇవ్వడంలోను చాలా వెనుకబడివుంది. ఈ విషయాన్ని కేంద్రం గమనిస్తోంది. మీరు ముందు ఆ సంగతి చూడండి" అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. కోవాగ్జిన్ మూడవ దశ ట్రయల్స్ ఫలితాలు ఇంకా బయటకు రాలేదన్న సంగతి తెలిసిందే. అయినా అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతానికి క్లినికల్ ట్రయిల్స్ లో భాగంగానే వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు దీనిని ఇస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేస్తున్న ఈ వ్యాక్సిన్ సురక్షితమని, మన శరీరంలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంపోందిస్తుందని.. ఈ సందర్భంగా మంత్రి హర్ష వర్ధన్ స్పష్టం చేశారు. మరోపక్క వ్యాక్సిన్ వయల్ పై ఎక్స్ పైరీ డేట్ లేదన్న అనుమానం కూడా వట్టిదేనని దానిపై ఆ తేదీ కూడా ఉందని చెబుతూ, ఒక వ్యాక్సిన్ ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా చత్తీస్ గఢ్ రాష్ట్రంలో తొలి దశలో 69.8 శాతం మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు కేవలం 9.55 శాతం మందికి మాత్రమే మొదటి డోస్ ఇచ్చారని, ఇది అత్యంత అసంతృప్తికరమని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు. వెంటనే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ను ఇస్తే, కేంద్ర ప్రభత్వం కూడా సంతోషిస్తుందని స్పష్టం చేస్తూ హర్షవర్ధన్, చత్తీస్ గఢ్ మంత్రికి ఒక లేఖ కూడా రాశారు.

గ్యాంగ్ రేప్ కేసులో సంచలనాలు!

హైదరాబాద్ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్  నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆటో ఎక్కిన యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు విషయం తెలియకుండా హత్య చేయాలని భావించారని తెలుస్తోంది. అయితే అప్పటికే పోలీసులు వస్తున్న విషయం తెలయడంతో విద్యార్థినిని వదలి పరారయ్యారని చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఓ ముఠా అని, గతంలో మరికొందరిపైనా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలిందని తెలుస్తోంది. కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కాలేజీ బస్సు దిగే బాధిత యువతి.. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలోని ఇంటికి ఆటోలో వెళ్లేది. ఈ క్రమంలో నిందితుడి ఆటోలో పలుమార్లు ఎక్కింది. దీంతో అతడి కన్ను ఆమెపై పడింది. విషయాన్ని తన స్నేహితులైన మిగతా ముగ్గురికి కూడా చెప్పి కిడ్నాప్‌కు పథకం వేశాడు.బుధవారం సాయంత్రం కూడా మామూలుగానే యువతి అతడి ఆటో ఎక్కడంతో కిడ్నాప్‌ పథకం అమలు చేయాలని నిర్ణయించాడు. స్నేహితులకు ఫోన్ చేసి ‘మ్యాటర్ రెడీగా ఉంది’ అని సమాచారం ఇచ్చాడు. బాధితురాలు ఆటో ఎక్కిన తర్వాత అప్పటికే ఉన్న ఇద్దరు మహిళలు, ఓ యువకుడు కొంతదూరం తర్వాత దిగిపోయారు.ఆ తర్వాతి స్టాపులోనే యువతి దిగాల్సి ఉండగా నిందితుడు ఆటోను ఆపకుండా యంనంపేట వైపు వేగంగా పోనిచ్చాడు. దీంతో భయపడిన యువతి తల్లికి ఫోన్ చేసి ఆటో ఆపకుండా ఎటో తీసుకెళ్తున్నాడని, తనకు భయంగా ఉందని చెప్పింది. దీంతో ఆమె బంధువుల సాయంతో సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. మరోవైపు యంనంపేట వద్ద ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కి ఆమెకు చెరోపక్క కూర్చున్నారు. మరో వ్యక్తి ఘట్‌కేసర్ శివారులో వ్యాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆటో అక్కడికి చేరుకోగానే బాధిత యువతిని అందులోకి ఎక్కించి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. అయితే అప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మాయిని ఆటోలో కిడ్నాప్ చేశారని, ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ మైక్‌లో చేస్తున్న అనౌన్స్‌మెంట్ నిందితులకు వినిపించింది. దీంతో దొరికితే ఎన్‌కౌంటర్ చేస్తారని భావించిన నిందితులు యువతిని వ్యాన్ నుంచి కిందికి దించి పక్కనే ఉన్న పొదల్లో పడేసి పరారయ్యారు.సెల్ సిగ్నల్ ఆధారంగా అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  విచారణలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులందరికీ నేరచరిత్ర ఉందని,  కాలేజీ, ఉద్యోగాలకు ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుంటారని పోలీసులు తెలిపారు. ఓ 15 రోజులపాటు వారిని గమనించిన తర్వాత ప్రణాళిక అమలు చేస్తారని వివరించారు. కిడ్నాప్ చేసిన అనంతరం తమకు సహకరిస్తే హాని చేయకుండా వదిలేస్తామని, లేదంటే చంపేస్తామని బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. గతంలో మరో నలుగురు మహిళలపైనా అత్యాచారానికి తెగబడినట్టు నిందితులు అంగీకరించారని తెలుస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్ఈసీ సీరియస్ 

ఆంధ్రప్రదేశ్  ఎస్ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్‌ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్‌, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. వైసీపీ కాకుండా వేరే పార్టీ వాళ్లు నామినేషన్లు వేస్తే.. ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామన్న జోగి రమేష్‌ వ్యాఖ్యలపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. జోగి రమేష్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని భావించిన ఎస్ఈసీ... ఆయనపై చర్యలకు ఆదేశించింది.   వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చుక్కల్లో పడ్డారు. వార్డు మెంబర్‎గా పోటీ‌చేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ’ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు‌ చేస్తున్నారని..అయినా..వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం జోగి అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

మా నాన్న రెండు సార్లు సీఎం.. నీలాగా అడ్డగోలుగా సంపాదించలేదు

ఎపి సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఉమ్మడి ఏపీకి రెండు సార్లు సీఎంగా పని చేశారని, అంతేకాకుండా తాను కూడా ఒక సారి కేంద్ర మంత్రిగా పని చేశానని... అయితే తాను ఏనాడూ డబ్బుకు కక్కుర్తి పడలేదని అయన అన్నారు. అదే సమయంలో జగన్ మాత్రం ఆయన తండ్రి వైయస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లకు కోట్లు సంపాదించాడని విమర్శించారు. కర్నూలు జిల్లా కోడుమూరు పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని కోట్ల అన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు బాగుండటమే తమకు కావాలని అయన అన్నారు. ప్రజాసేవ ఒక్కటే తమ లక్ష్యమని అయన తెలిపారు. పేకాట, బెట్టింగులను ప్రోత్సహిస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేసే దమ్ము ఈ పోలీసులకు ఉందా? అని అయన ప్రశ్నించారు.

తెలుగు అందానికి.. అందాల కిరీటం

తెలంగాణ అమ్మాయికి అందాల కిరీటం. హైదరాబాద్ కు చెందిన మానస వారణాసికి మిస్ ఇండియా 2020 టైటిల్. ముంబైలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఫైనల్‌ పోటీలో తన అందం, ప్రతిభతో మానస అందరికంటే ముందు నిలిచారు. హర్యానాకు చెందిన మణికా షియోకాండ్  మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020 కాగా, యూపీకి చెందిన మన్యసింగ్‌ మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌లుగా నిలిచారు. 2021లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పోటీ పడతారు.  మిస్ ఇండియా జ్యూరీ ప్యానెల్‌లో సినీ నటులు నేహా ధూపియా, చిత్రంగడ సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రఖ్యాత డిజైనర్  ఫాల్గుని, షేన్ పీకాక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మిస్ ఇండియా 2019 సుమన్ రావు మానసకు కిరీటాన్ని బహూకరించారు.  హైదరాబాద్‌కు చెందిన మానస గ్లోబల్ ఇండియన్ స్కూల్లో చదివారు. వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తున్నారు. మానస చిన్నతనంలనో భరతనాట్యం నేర్చుకున్నారు. కాలేజ్ డేస్ లో స్టూడెంట్ గా బ్యూటీ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి పలుమార్లు విజేతగా నిలిచారు. అప్పటి నుంచే ఆమెను అందాల పోటీల మీద, ఫ్యాషన్ రంగంపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత మోడలింగ్ పై ఫోకస్ పెట్టారు. పట్టుదలతో ప్రయత్నించి.. ఇప్పుడు ఏకంగా మిస్ ఇండియాగా నిలిచారు మానస. మానసకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. హెల్త్, ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ట్రెస్ గా ఫీలైతే మ్యూజిక్ వింటారు. 

కేసీఆర్ మీద కేటీఆర్ నారాజ్? 

కేసీఆర్ మీద కేటీఆర్ నారాజ్. అవును, మీరు విన్నది కరెక్టే. తెలంగాణ భవన్ వర్గాలు నమ్మకంగా చెబుతున్న మాట. గులాబీ బాస్ పై.. కాబోయే బాస్ అలగడానికి అనేక కారణాలు ఉన్నాయట. ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ బ్యాచ్ మీద కేసీఆర్ ఫైర్ అయిన తీరు చూసి యువరాజు అవాక్కయ్యారట. ముఖ్యమంత్రి మార్పు.. త్వరలోనే తారక రాముడికి పట్టాభిషేకం వార్తలపై ప్రగతి భవన్ పెద్దాయన ఒంటి కాలిపై లేవడంతో అంతా కంగుతున్నారు. ఆ మీటింగ్ లో కేసీఆర్ వాడిన భాష, వార్నింగ్ ఇచ్చిన తీరు.. పరోక్షంగా కేటీఆర్ తలదించుకునేలా చేసిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి మార్పుపై ఎవరైనా మాట్లాడితే బండకేసి కొడతా.. తోలు తీస్తా.. కర్రుకాల్చి వాత పెడతా.. ఇలా పరుష పదజాలంతో కొందరు మంత్రులను, ఎమ్మెల్యేలను తిట్టిపోశారు కేసీఆర్. మరో పదేళ్లు తానే సీఎం అంటూ సూటిగా, ఘాటుగా చెప్పారు.  కేసీఆర్ తిట్లన్నీ డైరెక్ట్ గా కేటీఆర్ అనుచరులకు, ఇన్ డైరెక్ట్ గా కేటీఆర్ కు తగిలాయి. యువరాజు.. రాజు అవుతారంటూ భజన చేసిందంతా కేటీఆర్ బ్యాచే. తలసాని, జీవన్ రెడ్డి, షకీల్, శ్రీనివాస్ గౌడ్ ఇలా అంతా ఆయన అనుచరులే. ఇక, డిప్యూటీ స్పీకర్ పద్మారావు అయితే.. ఓ సభలో కేటీఆర్ సమక్షంలోనే ఆయన్ను కాబోయే సీఎం అంటూ శుభాకాంక్షలు సైతం చెప్పారు. ఆ సమయంలో కేటీఆర్ మౌనంగా ఆయన విషెష్ ను స్వీకరించారే తప్ప.. ఎక్కడా, కొంచెం కూడా పద్మారావును వారించే ప్రయత్నం చేయలేదు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ వాగిన వారందరినీ కేసీఆర్ చెడామడా తిట్టారంటే.. ఆ తిట్లదండకంలో ఎంతో కొంత తనను ఉద్దేశించి కూడా అని కేటీఆర్ తెగ బాధపడుతున్నారట. అందుకే  ఆ రోజు నుంచీ నాన్నతో టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.  తండ్రీకొడుకుల మధ్య గ్యాప్.. గ్రేటర్ మేయర్ ఎలక్షన్ తో మరోసారి ముదిరిందని చెబుతున్నారు. కేకే కూతురు విజయలక్ష్మీని మేయర్ గా ఎంపిక చేయడం కేసీఆర్ డెసిషన్. ఆ నిర్ణయం కేటీఆర్ కు ఇష్టం లేదని అంటున్నారు. తన ప్రియమైన అనుచరుడు బొంత రామ్మోహన్ సతీమణి శ్రీదేవికి మేయర్ పదవి కట్టబెట్టాలని కేటీఆర్ భావించారట. అయితే.. సీనియర్ లీడర్ కె.కేశవరావుపై గౌరవంతో ఆయన కూతురిని షీల్డ్ కవర్ లో మేయర్ చేశారు గులాబీ బాస్. ఈ  పరిణామాలతో.. కేసీఆర్ పై కేటీఆర్ నారాజ్ అయ్యారట. తండ్రి దగ్గర తన మాట చెల్లుబాటు కావడం లేదని బాగా ఫీలవుతున్నారట. అందుకే గ్రేటర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో కేటీఆర్ డల్ గా కనిపించారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.  పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కేటీఆర్ అసహనంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ భవన్ సమావేశం తర్వాత ఆయన ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సోషల్ మీడియాలోనూ పోస్టులు కనిపించడం లేదు. మొత్తంగా ముఖ్యమంత్రి అవుదామనే ఆశ నెరవేరక.. ఇటు నిర్ణయాల్లో ప్రాధాన్యత దక్కక.. కేటీఆర్  తెగ బాధపడుతున్నారని చెబుతున్నారు. మరి, కల్వకుంట్ల వారి ఇంటి పోరు ముందుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో... 

ఎంఐఎంకు టీఆర్ఎస్ చెంచాగిరి ! 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. ఇదే ఇప్పుడు తెలంగాణలో కాక రేపుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ టార్గెట్ గా దూకుడుగా వెళుతున్న బీజేపీకి కొత్త అస్త్రం దొరికింది. దీంతో కమలం నేతలు అప్పుడే యాక్షన్ లోకి దిగారు. గులాబీ పార్టీతో పాటు పతంగి పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.  .టీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని  ఆయన ఆరోపించారు. జీహెచ్ఎంసీ‌లో టీఆర్‌ఎస్ స్టీరింగ్ ఎంఐఎమ్ చేతిలో ఉండటం ఖాయమని చెప్పారు.   జీహెచ్ఎంసీ‌ ఎన్నికలో బీజేపీ చెప్పిన విషయం నిజమైందని.. టీఆర్‌ఎస్-ఎంఐఎం  పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటూ  బయటకు మాత్రం తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని బండి ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేయక పోయి ఉంటే టీఆర్‌ఎస్‌కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదన్నారు బండి సంజయ్. టీఆర్‌ఎస్ పక్కా మత తత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని రుజువైందన్నారు.   సిగ్గు లేక ఎన్నికల్లో తాము వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నారు. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసిన ఈ రెండు పార్టీలను బజారుకు లాగుతామని సంజయ్ హెచ్చరించారు.  రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్ నీచ రాజకీయాలను సహించారని చెప్పారు. 

జగన్ దూతగా షర్మిలను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే 

తెలంగాణాలో రాజన్న రాజ్యం కోసం కొత్తగా పార్టీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈరోజు ఆమెను కలిశారు. లోటస్ పాండ్‌లోఈరోజు మధ్యాహ్నం షర్మిలతో అయన భేటీ అయ్యారు. షర్మిలతో భేటీ తరువాత బ్రదర్ అనిల్ కుమార్‌తో కూడా రామకృష్ణారెడ్డి చాలాసేపు మంతనాలు జరిపారు. వైఎస్ జగన్ దూతగా షర్మిలతో మాట్లాడేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారని తెలుస్తోంది . మరోపక్క వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె ఈరోజు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఆమె ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. పోడు భూముల అంశం ముఖ్య అజెండాగా ఖమ్మంలో ఈ సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులతో పాటు గిరిజనులతో షర్మిల సమావేశం కానున్నారు.

గవర్నర్ కు అవమానం.. 

  పాలకులకు భజన చేయకపోతే అవమానాలు తప్పవా.. ప్రభుత్వాలకు ఎదురు మాట్లాడే అర్హత  గవర్నర్ కు ఉండదా.. ప్రభుత్వాలు వాళ్ళు ఏం చేసిన ఆకాశానికి ఎత్తలా.. ప్రభుత్వ పోకడలను ప్రశ్నిస్తే అసౌకర్యాలు అసమ్మతులు తప్పవా.. అంటే అవుననే చెపుతుంది మహారాష్ట్ర గవర్నర్ కు జరిగిన అవమానం..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ,  ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి మధ్య అంతరం మరింత పెరుగుతోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే గత అక్టోబరులో మహారాష్ట్రలో ప్రార్థనాలయాలకు అనుమతి నిచ్చిన నేపథ్యంలో గవర్నర్ విమర్శలు చేశారు. హిందుత్వ ఓట్ల కోసం చూసే ఉద్ధవ్ ఇప్పుడు లౌకికవాదిగా మారినట్టుందని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి మహారాష్ట్ర సీఎంకు, గవర్నర్ కోష్యారీకి మధ్య సంబంధాలు క్షీణించాయి. తాజాగా, గవర్నర్ కు అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. కోష్యారీ డెహ్రాడూన్ వెళ్లేందుకు ముంబయి ఎయిర్ పోర్టుకు చేరుకోగా, ప్రభుత్వ విమానంలో ప్రయాణించేందుకు ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎయిర్ పోర్టుకు వచ్చిన గవర్నర్ విమానంలో ఎక్కేందుకే రెండు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. విమానం ఎక్కిన తర్వాత కూడా పావుగంట సేపు కూర్చున్నారు. అయితే తనకు టేకాఫ్ కు అనుమతి రాలేదంటూ ఫ్లయిట్ కెప్టెన్ చెప్పడంతో గవర్నర్ కోష్యారీ చేసేది లేక ఆ విమానం నుంచి దిగి, మరో విమానంలో టికెట్ బుక్ చేసుకుని డెహ్రాడూన్ పయనం అయ్యారు. దీనిపై గవర్నర్ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ డెహ్రాడూన్ పర్యటనపై వారం కిందటే ప్రభుత్వానికి సమాచారం అందించామని, అయినప్పటికీ అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. గవర్నర్ విమాన ప్రయాణం అంశంపై తన కార్యాలయం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుంటానని వెల్లడించారు. ప్రభుతువులకు భజన 

ఉద్యోగులను ఊరించి.. షాకిచ్చి..! పీఆర్సీ ఇక లేనట్టే..!

ఆశ.. దోశ.. అప్పడం.. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు ఇదే పాట పాడుకుంటున్నారు. వేతన సవరణపై కేసీఆర్ ప్రకటన కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ఉద్యోగులకు.. ఊహించినట్లే  షాక్ తగిలింది. రేపు మాపో పీఆర్సీపై ప్రకటన చేస్తామంటూ సర్కార్ ఊరిస్తుండగానే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రావడంతోనే .. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. దీంతో పీఆర్సీ ప్రకటన అటకెక్కింది. తెలంగాణ ఉద్యోగులను నిరాశలో ముంచింది. కేసీఆర్ సర్కార్ కావాలనే పీఆర్సీ ప్రకటనపై ఆలస్యం చేసిందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు.    పీఆర్సీతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ చాలా కాలంగా తెలంగాణ ఉద్యోగులు పోరాడుతున్నారు. దీంతో ఉద్యోగుల పీఆర్సీపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మే18, 2018న సీఆర్ బిశ్వాల్ చైర్మన్‌గా మహ్మద్ ఆలీ రఫత్, ఉమా మహేశ్వరావులతో కమిషన్ వేసింది. కమిషన్ గడువును ప్రభుత్వం మూడు సార్లు పెంచింది. చివరగా 2020 ఫిబ్రవరిలో కమిషన్ గడువును పెంచింది. సీఎం ఆదేశాల మేరకు ఎట్టకేలకు 31 నెలల తర్వాత 2020 డిసెంబర్ 31న సీఎస్ సోమేశ్ కుమార్‌కు నివేదిక ఇచ్చింది బిశ్వాల్ కమిటి. పీఆర్సీ నివేదికను జనవరి 27న ప్రభుత్వం విడుదల చేసింది.  ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు 7.5 శాతం ఫిట్‌మెంట్ పెంపును కమిటి ప్రతిపాదించింది బిశ్వాల్ కమిటి. కనీస వేతనం రూ.19వేలు,గరిష్ఠ వేతనం రూ.1,62,700గా ఉండాలని సూచించింది. సీపీఎస్ విధానంలో ప్రభుత్వ వాటాను 10 శాతం నుంచి 14శాతం పెంపుకు ప్రతిపాదించింది. హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 24శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదించడం గమనార్హం. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పెంపుకు ప్రతిపాదించింది. పీఆర్సీ కమిటి ప్రతిపాదనలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు.   అయితే పీఆర్సీ కమిటి ఇచ్చిందే ఫైనల్ కాదని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవప్రధానంగానే ఇస్తారని నమ్మకం వ్యక్తం చేసింది. కేసీఆర్ ఆదేశాలతో త్రిసభ్య కమిటీ  పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. సీఎస్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ  గత నెల 27 నుంచి చర్చలు మొదలుపెట్టింది. ఇంతలోనే అన్ని సంఘాలతో చర్చలు జరపాలనే డిమాండ్ వచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలన్నింటితోనూ చర్చలు సాగిస్తామని ప్రకటించింది. తెలంగాణలో దాదాపు 150కిపైగా ఉద్యోగ సంఘాలున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల డిమాండ్లనే సాకుగా చూపి ఫిట్మెంట్ నిర్ణయం ఆలస్యం చేసే ఆలోచనతోనే.. సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వచ్చాయి.  ఉద్యోగులు భయపడుతున్నట్లుగానే జరిగింది. సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతుండగానే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో ఎన్నికలు ముగిసేవరకు పీఆర్సీ ప్రకటన లేనట్టే. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే నాగార్జున సాగర్ అసెంబ్లీ  ఉప ఎన్నికకు షెడ్యూల్ రావచ్చని చెబుతున్నారు. అదే జరిగితే పీఆర్సీ ప్రకటనకు మరి కొంత సమయం ఆలస్యం కానుంది.  జనవరి నుంచి పీఆర్సీ ప్రకటన కోసం అశగా ఎదురుచూసిన ఉద్యోగులు ఇప్పుడు భగ్గుమంటున్నారు.  పీఆర్సీ ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఈ ప్రభావం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై భారీగానే ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేయబోతున్న అధికార పార్టీ అభ్యర్థులు కూడా కలవరపుడుతున్నారని చెబుతున్నారు.

టీడీపీ, వైసీపీ దోస్త్ మేరా దోస్తు..

  ఏపీ పంచాయితీ ఎన్నికల వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తుందని.. అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తుందన్న లేదు టీడీపీ నాయకులే మాపై దాడులు చేస్తున్నారని ఇరు పక్షాలు కత్తులు దూసుకుంటున్న విషయం తెలిసిందే.. మరికొన్ని చోట్ల అయితే ఏకంగా దాడులకు పాల్పడ్డారు ఇరువర్గాల నాయకులు ,కార్యకర్తలు..టీడీపీ, వైసీపీ  మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. గ్రామాలలో సైతం ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని కొన్ని చోట్ల వైరి వర్గీయులు శత్రుత్వాలకు ముగింపు పలుకుతూ...అభివృద్ధి అంటే విడి విడిగా చీలి కొట్టుకోవడం, చంపుకోవడం కాదు.. అందరూ ఒక్కటై సమస్యను పరిష్కరించుకోవం అనుకుంటున్నారు ఆ గ్రామ ప్రజలు. ఉన్న ఊరు వాళ్ళ మధ్య గొడవలు ఉంటే వూరి అభివృద్ధి ఎలా అనుకున్నారు..అందుకే  పార్టీ పంథాలను వీడి ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటున్నారు. ఇరుపక్షాల నాయకులు ఒప్పందానికి వచ్చారు. ఈ ఘటనే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పంచాయతీలో చోటు చేసుకుంది. ప్రత్తిపాడు పంచాయతీ సర్పంచ్ పదవిని వైసీపీ, టీడీపీలు పంచుకున్నాయి. మూడేళ్ల పాటు వైసీపీ మద్దతుదారుడు, రెండేళ్ల పాటు టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ గా ఉండేలా ఒప్పంద పత్రాలపై నేతలు సంతకం చేశారు. ఇది సాక్షాత్తు హోంమంత్రి సుచరిత  నియోజకవర్గం కావడంతో... ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ, ప్రజలు ఈ ఒప్పందాన్ని హర్షిస్తున్నారు. ఇలాంటి వాటివల్ల గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయని చెపుతున్నారు.  

టీడీపీకి బై..  వైసీపీకి సై..

ఏపీ పంచాయతీ పంచాయితీ ఎన్నికల్లో గెలిచినా అభ్యర్థులు ఉన్న పార్టీలను  విడిచి పక్క పార్టీలో చేరుతున్నారు .. బహుశా గ్రామా అభివృద్ధి అప్పుడే మొదలు పెట్టినట్లుఉన్నారు అభ్యర్థులు.. ఓ పార్టీ మద్దతుతో గెలిచిన నేతలు.. మరో పార్టీకి మారుతూ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారు అభ్యర్థులు. లీడర్ల కంటే మేము ఏం తక్కువ కామంటున్నారు గెలిచిన అభ్యర్థులు.. అంతేలెండి ఆవు చేలో మేస్తే, దూడ మాత్రం గట్టున మేస్తుందా.. నేతలు పార్టీ మారితే కానీ తప్పు మేము మారితే అవుతుందా అనుకుంటున్నారు కాబోలు..     ఇది ఇలా ఉండగా చిత్తూర్ జిల్లా బంగారుపాళ్యం నియోజక వర్గంలోని బొమ్మాయిపల్లెలో టీడీపీ మద్దతుతో గౌరమ్మ అనే అభ్యర్థి గెలిచారు. రాత్రికి రాత్రే ఆమె టీడీపీ పార్టీ కండువా వదిలి, వైఎస్ఆర్సీపీ నేత కుమార్ రాజా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు. అలాగే చిత్తూరు మండలంలోని చింతలకుంట పంచాయతీలో గెలిచిన గీతాంజలి కూడా వైఎస్ఆర్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆమె కూడా టీడీపీ మద్దతుతోనే గెలిచారు. పూతలపట్టు మండలానికి చెందిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులూ వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో చాలా చోట్ల అధికార పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద ఎక్కువైంది. చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు గెలవడంతో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. వైఎస్ ఆర్సీపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీలోకి లాక్కుంటోందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.

గులాబీదే గ్రేటర్ పీఠం.. కమలానికి మరో అస్త్రం!  

అనుకున్నట్టే అయింది. బీజేపీ అన్నట్టే జరిగింది. ఎమ్.ఐ.ఎమ్. సపోర్ట్ తోనే గ్రేటర్ పై గులాబీ జెండా ఎగిరింది. మేయర్ గా గద్వాల విజయలక్ష్మీ ఎన్నికయ్యారు. ఈ రసవత్తర పోరులో నిజంగా గెలిచిందెవరు? రాజకీయంగా లబ్ది పొందింది ఇంకెవరు? అనేది ఆసక్తికరం. అధికార పార్టీకి పదవైతే దక్కింది కానీ.. పొలిటికల్ గా పరువు పోయినంత పనైంది.  ఎమ్.ఐ.ఎమ్. తో తమకెలాంటి సంబంధం లేదంటూ.. అది కూడా తమ ప్రత్యర్థి పార్టీనేనంటూ.. గ్రేటర్  ఎలక్షన్ సమయంలో నాటకాలాడిన టీఆర్ఎస్.. ఇప్పుడదే పతంగి పార్టీ మద్దతుతో విజయపతాకం ఎగరవేయడం దిగజారుడు తనమేనంటున్నాయి ప్రతిపక్షాలు. టీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ లది అక్రమ సంబంధమని.. ఆ రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటాయంటూ కమలనాథులు విమర్శలు గుప్పిస్తున్నారు. జీహెచ్ఎమ్సీలో కారు పార్టీ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంటుందంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భగ్గుమన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ కలిసి ప్రజలను మోసం చేశాయని.. ఇద్దరు దొంగల చేతిలో మేయర్ పీఠమంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.  మేయర్ పీఠం పోయినా.. గ్రేటర్ పోరులో బీజేపీదే రాజకీయ విజయం. 48 మంది కార్పొరేటర్లతో కమలదండు గులాబీదళాన్ని దడదడలాడించింది. ఆ విజయోత్సాహంతో తెలంగాణ వ్యాప్తంగా దండయాత్రకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో జీహెచ్ఎమ్సీ మేయర్ ఎన్నిక జరగడం.. టీఆర్ఎస్ కు ఎమ్ఐఎమ్ మద్దతు ఇవ్వడం.. కమలనాథులకు అనుకోని వరంగా మారింది. బయటకు ఎన్ని మాటలు అనుకున్నా.. ఆ రెండు పార్టీల మధ్య దోస్తీ ఉందని బీజేపీ మొదటి నుంచీ చెబుతూనే ఉంది. ఆ విషయం మేయర్ ఎలక్షన్ లో బట్టబయలైంది. మజ్లిస్ పార్టీని ఓటింగ్ కు గౌర్హాజరు చేయించే అవకాశం ఉన్నా.. టీఆర్ఎస్ ఆ స్ట్రాటజీని అమలు చేయలేదు. బహిరంగంగానే ఆ పార్టీ సపోర్ట్ తీసుకొని రాజకీయంగా సాహసమే చేసిందని చెబుతున్నారు. ఎందుకంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కారు, పతంగి చెట్టాపట్టాలు వేసుకొని కనిపించడం అధికార పార్టీకి ఏమంత లాభదాయకం కాదనేది విశ్లేషకుల మాట.  ఎమ్.ఐ.ఎమ్. ను బూచీగా చూపించి తెలంగాణ వ్యాప్తంగా హిందువుల ఓట్లను ఏకీక్రుతం చేస్తోంది బీజేపీ. ఓటర్లు సైతం కాషాయ పార్టీని బాగానే ఆదరిస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్ లో సంచలన విజయాలే సాధించింది. ఇక, నాగార్జున సాగర్ లోనూ సత్తా చాటేందుకు సై అంటోంది. పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకేనంటూ ఇప్పటికే ప్రచారం నడుస్తోంది. త్వరలో జరగబోవు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాషాయ జెండా ఎగరేసేలా కాక మీదుంది కమలం పార్టీ. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ మైత్రిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఓట్లు దండుకోవడం ఖాయం.   ఓ వైపు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణ పేరుతో తెలంగాణలో ప్రతీ ఇంటినీ తడుతోంది బీజేపీ. అటు.. హిందుత్వ ఎజెండా.. ఇటు యాంటీ ముస్లిం స్ట్రాటజీతో గులాబీ దళంపై డబుల్ బ్యారెల్ గన్ ఎక్కుపెట్టింది. దూకుడు మీదున్న కమలనాథులకు మరింత బలం చేకూర్చేలా.. గ్రేటర్ లో ఎమ్.ఐ.ఎమ్ మద్దతు తీసుకొని అధికార పార్టీ పెద్ద తప్పిదమే చేసిందంటున్నారు. మేయర్ ఎన్నిక ముగిసిన వెంటనే బండి సంజయ్, రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. టీఆర్ఎస్, మజ్లిస్ ల మైత్రిని తెలంగాణ ప్రజల ముందుంచి.. కేసీఆర్ ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాడనే ముద్ర వేసి.. ఆ మేరకు రాజకీయంగా బీజేపీ మరింత బలపడటం ఖాయమని లెక్కలేస్తున్నారు. ఆ అవకాశాన్ని చేజేతులారా టీఆర్ఎసే కమలనాథులకు అందించిందని అంటున్నారు. మరి, పొలిటికల్ మాస్టర్ మైండ్ అని పేరున్న కేసీఆర్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా..?

సర్పంచ్ పోరులో భార్య భర్తలు? కృష్ణా జిల్లాలో ఆసక్తికర సమరం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో  చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులే పోటీ పడుతున్నారు. అన్నా  తమ్ముళ్లు , తోడికోడళ్లు, అత్తా కోడళ్లు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్లు కూడా కొన్ని పంచాయతీ హోరాహోరీగా పోరాడుతున్నారు. కృష్ణా జిల్లాలో భార్యభర్తలే పోటీ చేస్తుండటం ఆసక్తిగా మారింది.  ముదినేపల్లి మండలంలో అల్లూరు పంచాయతీ ఎన్నికలో భార్యాభర్తలు రంగంలో ఉన్నారు. స్తానిక సోమేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్ పర్సన్ రెడ్డి రాధిక, ఆమె భర్త రెడ్డి విఠల్ ఎన్నికల బరిలో ఉన్నారు.  గ్రామంలోని శివాలయాన్ని రెడ్డి రాధిక అభివృద్ధి చేశారు. దాదాపు మూడున్నర లక్షల రూపాయల సొంత ఖర్చుతో ఆలయంలో ఇనుప గ్రిల్స్ ను ఏర్పాటుచేయించారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో రెడ్డి రాధిక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెతోపాటు డమ్మీ అభ్యర్థిగా ఆమె భర్త రెడ్డి విఠల్ నామినేషన్ వేశారు. అయితే అనివార్య కారణాల వల్ల రెడ్డి విఠల్ తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోలేకపోయారు. దీంతో భార్యాభర్తలిద్దరూ బరిలో ఉన్నట్టయింది. భార్య రెడ్డి రాధికకు ఉంగరం గుర్తును కేటాయించగా, భర్త రెడ్డి విఠల్ కు బుట్ట గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు.  ఈ భార్యభర్తలతో పాటు అలూరు గ్రామంలో మొత్తం అయిదుగురు అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నట్టయింది. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం ఇద్దరు భార్యాభర్తలు ఉంగరం గుర్తుకు ఓటేయమనే కోరుతున్నారు. అయితే  వారు కోరుతున్నట్టు భార్యకు మాత్రమే ఓటేస్తారో లేక పొరపాటున భర్తకు కూడా ఓటేస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. 

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల 

  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మరోసారి ఊపందుకోనుంది . ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో నాగార్జున సాగర్ నియోజక వర్గంలో ఉపఎన్నిక త్వరలో జరగనుంది. అంతలోనే ఏపీ, తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఏపీలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు గడువు విధించారు. ఇక మార్చి 14న ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఫలితాలను ప్రకటిస్తారు.

మంత్రి నోట.. జవాన్ పాట.. 

దేశమును ప్రేముంచుమన్న.. మంచిఅన్నది పెంచుమన్నా .. దేశమంటే మట్టి కాదోయ్  దేశమంటే మనుషులోయ్.. అన్నాడు గురజాడ. కానీ ఇప్పుడు దేశాన్ని ప్రేమించే వారికంటే దేహాన్ని ప్రేమించే వారే ఉన్నారు ..మంచిని పెంచడం కన్నా ముంచే వారే ఉన్నారు..  దేశంలో మట్టి తప్పా మనసున్న మనుషులు మరుగునపడిపోతున్నారు. దేశాన్ని ప్రేమించే వారిలో సైనికులను మించినవారు లేరంటే అందరూ ఒప్పుకొని తీరాల్సిందే .. సైనికుల సేవలకు సెల్యూట్ చేయాల్సిందే .. వారి ఆదర్శాలకు, అంకిత భావానికి భారత దేశపు ప్రజలు ఎప్పటికి బాకీ పడి ఉండకతప్పదు..   నేను సింగర్ ను కాను.. కానీ భారత సైనికుల కోసం నేను సగర్వంగా పాట పాడుతున్నా అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాట మరోసారి దేశాన్ని ప్రేమించమంటుంది .. సైనికుల త్యాగాలను గుర్తించమంటుంది.. ఆన్లైన్లో మంత్రి చేసిన పనిని నెటిజన్లు అందరినీ ఆకట్టుకుంటోంది.. సోషల్ మీడియాలో వ్యూస్, లైకులు, షేర్లు, కామెంట్ల వరద వచ్చిపడుతోంది 100K కామెంట్లు సంపాదించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. అధికారిక కార్యక్రమంలో పాల్గొని, పాటపాడిన కేంద్ర మంత్రి సైనికుల్లో ఒకడిగా కలిసిపోవటం సైనిక కుటుంబాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.. మరోవైపు ఆయనే స్వయంగా ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. సరిహద్దుల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించిన ఆయన సైనికులతో భలే కలిసిపోయారు. అంతేకాదు వారితో తాను దిగిన ఫొటోలను కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇంజినీర్ రెజిమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సమావేశంలో రిజిజు పాల్గొని ఇలా సైనికుల్లో నయా జోష్ నింపటం హైలైట్. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్‌లో ఎవరైనా ఆయన్ను ఏదైనా అడిగితే తక్షణం స్పందిస్తారు.

వైసీపీకి పోటీగా నిలబడితే పథకాలు కట్! ఎమ్మెల్యే జోగి రమేష్ వార్నింగ్   

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల బరి తెగింపులు ఆగడం లేదు. ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చినా తమ తీరు మార్చుకోవడం లేదు వైసీపీ ప్రజా ప్రతినిధులు. ఓటర్లను బెదిరిస్తూ భయబ్రాంతులకు  గురి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతల బెదిరింపు వీడియోలు,  ఆడియా కాల్స్  తీవ్ర కలకలం రేపాయి. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి. తాజాగా కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కుడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ బెదిరించారు. వార్డు మెంబర్‎గా పోటీ‌చేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు జోగి రమేష్. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు‌ చేస్తున్నారని..అయినా వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే  జోగి రమేష్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.  

గ్రేటర్ మేయర్ గా విజయలక్ష్మి! కేకేకు కేసీఆర్ కానుకిచ్చారా?  

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త పాలక మండలి కొలువు దీరింది. గ్రేటర్ కొత్త మేయర్ గా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్మెన్ గా టీఆర్ఎస్ సీనియర్ నేత మోతే శోభన్ రెడ్డి భార్య మోతే శ్రీలతా రెడ్డి ఎంపికయ్యారు. వీరిద్దరు పేర్లను సీఎం కేసీఆర్ సీల్డ్ కవర్ లో మంత్రుల చేత పంపించారు. గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గత ఎన్నికల సమయంలోనే ఆమె మేయర్ పీఠం కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈసారి ఆమెకు అదృష్టం వరించింది. మోతే శ్రీలత సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ నుంచి విజయం సాధించారు.    గ్రేటర్ మేయర్ గా కేకే కూతురు విజయలక్ష్మిని ఎంపిక చేయడానికి బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు.  ముఖ్యమంత్రి మార్పు ఉంటుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేటీఆర్ ను సీఎం చేయాలంటూ కొందరు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే ప్రకటనలు చేశారు. కొందరు మంత్రులు కూడా కేటీఆర్ కు జై కొడుతూ అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం మారుతున్నారంటూ జరిగిన ప్రచారం.. పార్టీలో కలవరం రేపింది. అసలు ఏం జరుగుతుందో తెలియని గందరగోళం నెలకొంది. ఈ పరిణామాలు కేసీఆర్ కు ఇబ్బందిగా మారాయి. పార్టీలో జరుగుతున్న ఘటనలు, కేటీఆర్ టీమ్ ఓవరాక్షన్ పై కేసీఆర్ అసహనంగా ఉన్న సమయంలో... ఎంపీ కేశవరావు ఎంటరై అంతా సెట్ రైట్ చేశారని తెలుస్తోంది. కేటీఆర్ తో పాటు పార్టీ నేతలతో మాట్లాడి అందరిని సెట్ రైట్ చేశారంటున్నారు. అదివారం తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశానికి ముందు కేకే.. చాలా మంది నేతలతో మాట్లాడి పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించారంటున్నారు. అందుకే కేకేకు కానుకగా ఆమె కూతురు విజయలక్ష్మిని గ్రేటర్ మేయర్ గా కేసీఆర్ ఎంపిక చేశారని చెబుతున్నారు.  గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా.. ఎల్బీనగర్ జోన్ లోని లింగోజిగూడ నుంచి బీజేపీ తరపున గెలిచిన కార్పొరేటన్ చనిపోయారు. దీంతో 149 మంది కొత్త కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. ఉదయం పది గంటలకు కార్పొరేటర్లుగా గెలిచిన పార్టీ నేతలు.. ఎక్స్ అఫిషియో సభ్యులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో బల్దియా భవనానికి వెళ్లారు. ఈ సందర్బంగా బస్సులో కార్పొరేటర్లతో కలిసి వెళ్లిన ఎమ్మెల్సీ, గాయకుడు గోరటి వెంకన్న ఉత్సాహంగా పాటలు పాడారు. గోరటి పాడుతుండగా టీఆర్ఎస్ కార్పొరేటర్లు గొంతు కలిపారు. మరోవైపు మేయర్ సీటును ఆశించిన విజయా రెడ్డి... ప్రమాణ స్వీకారం తర్వాత..  జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి కోపంగా బయటికి వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఉన్న మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షాకయ్యారు. 

ఇవాళ షర్మిల.. రేపు జూనియర్ ఎన్టీఆర్.. జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

వై ఎస్ షర్మిల పెట్టబోతున్న కొత్త పార్టీపై తెలంగాణాలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఆమె వెనుక ఎపి సీఎం జగన్ ఉన్నారని.. కాదు కాదు తెలంగాణ సీఎం కేసి ఆర్ అండతోనే ఆమె పార్టీ పెడుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇది ఇలాఉండగా ఇదే అంశమే పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమిత్‌షా వదిలిన బాణం వైఎస్ షర్మిల అని అయన వ్యాఖ్యానించారు. ఈరోజు అసెంబ్లీ మీడియా హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌, జగన్‌, అసదుద్దీన్‌ అందరు కూడా అమిత్‌షా బాణాలేనని అయన ఆరోపించారు. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. "ఇవాళ షర్మిల వచ్చింది. రేపు జూనియర్‌ ఎన్టీఆర్‌, లేదంటే.. ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి మరో వ్యక్తి వచ్చి పార్టీ పెట్టవచ్చు. ఇంతోటి దానికి తెలంగాణ తెచ్చుకోవడం ఎందు కు? మళ్లీ సమైక్య రాష్ట్రం చేస్తే పోలే!’’ అని అయన వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఈ నెల 15న ఆరూరు నుంచి అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వరకు తాను పాదయాత్ర చేస్తానన్నారు.