హ్యాండ్ కి రేవంత్ బ్యాండ్! సొంత కుంపటి ఖాయమేనా?

డివైడ్ అండ్ రూల్. ఆధిపత్యం కోసం బ్రిటిషర్లు వేసిన ఎత్తుగడ. ఇదే స్ట్రాటజీని ఇప్పుడు రేవంత్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? అంటే అవుననే అనుమానం వస్తోంది. రాజీవ్ రైతు భరోసా దీక్షలు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ఊరంతా ఒకదారి.. ఉలిపిరి కట్టది ఇంకోదారి అన్నట్టు ఉంది రేవంత్ తీరు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ.. పార్టీతో సంబంధం లేకుండా తన వర్క్ తాను చేసుకుపోతున్నారు. అంతా పార్టీ పనే. అయినా.. పార్టీతో పని లేదు అన్నట్టుగా సాగుతోంది రెడ్డి గారి రాజకీయం. నేను ఒక్కడిని ఒకవైపు.. ఖమ్మంలో జరిగిన రైతు భరోసా దీక్షకు హస్తం పార్టీ పెద్దలంతా హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తో సహా బడాబడా నేతలంతా తరలివచ్చారు. పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిందా దీక్ష. ఇంత వరకూ బాగానే ఉంది. మరి, పని చేయాల్సిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడ? ఆ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టారు. దీక్షా శిబిరంలో ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ ఒక్కరే మిస్సింగ్. ఒకవైపు ఖమ్మంలో అంత పెద్ద ఎత్తున ప్రొగ్రామ్ జరుగుతుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం తనకేమీ పట్టనట్టు.. తనకు నచ్చినట్టు.. అచ్చంపేటలో వాలిపోయారు. రైతు భరోసా దీక్షను.. రైతు పాదయాత్రగా మార్చి.. అదరగొట్టారు. సర్కారుకు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సీతక్క కూడా అచ్చంపేట సభకు హాజరయ్యారు.  కాంగ్రెస్ కు షాక్..! రేవంత్ రెడ్డి నిర్ణయం కాంగ్రెస్ పార్టీని షాక్ కు గురి చేసింది. పార్టీకి సంబంధం లేకుండా.. అధిష్టానంతో చర్చించకుండా.. 10 జన్ పథ్ పర్మిషన్ లేకుండా.. సడెన్ గా.. సొంతంగా.. పాదయాత్ర నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు. కాంగ్రెస్ లో ఇది క్షమించరాని నేరం. అయినా.. రేవంత్ రెడ్డి అదేమీ పట్టించుకున్నట్టు లేదు. పార్టీ పెద్దలంతా విచ్చేసిన ఖమ్మం దీక్షకు అటెండ్ కాకపోవడమే ఓ సాహసం అనుకుంటే.. పాదయాత్రను ప్రకటించి.. సొంత జెండా ఎగరేయడం మరింత విస్మయం. ఇదే అంశంపై ఇప్పుడు హస్తం పార్టీ పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ వర్క్ స్టైల్ పై కాంగ్రెస్ నేతలంతా కస్సుమంటున్నారు. ఏళ్లుగా చేతి గుర్తులో పెత్తనం చెలాయిస్తున్న పెద్దలందరికీ.. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి వ్యవహారశైలి అసలే మాత్రం నచ్చడం లేదట. అయితే.. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. జెండా ఎగిరిందా? లేదా? అనేదే లెక్క అన్నట్టు రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నారు. రాహుల్ గాంధీ అండతో.. తనదైన స్టైల్ లో రాజకీయం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలవరానికి కారణం. హస్తానికి హ్యాండ్ ఇస్తారా? పీసీసీ చీఫ్. ఈ పదవిపైనే కొంత కాలంగా కాంగ్రెస్ లో అంతర్మథనం. రేసులో అనేకమంది. అంతాహేమాహేమీలే. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనకే పార్టీ పగ్గాలు పక్కా. ఇదీ రేవంత్ రెడ్డి లెక్క. తలచిందే జరిగితే అది కాంగ్రెస్ ఎందుకవుతుంది? ఫైర్ బ్రాండ్ లీడర్ కు పార్టీ పీఠం దక్కకుండా అనేక చిక్కుముడులు. హస్తినలో పెద్ద ఎత్తున పెద్దలంతా లాబీయింగ్. ఈ గందరగోళ రాజకీయాల్లో తన సత్తా ఏంటో.. ఎంతో.. బలంగా చాటుకునేలా.. పావులు కదుపుతున్నారు రేవంత్ రెడ్డి. ఖమ్మంను కాదని.. అచ్చంపేటలో జరిగిన రాజీవ్ రైతు భరోసా దీక్షకు హాజరవడం.. పాదయాత్రకు పిలుపివ్వడం అంతా వ్యూహాత్మకమే అంటున్నారు. కాంగ్రెస్ లో గుంపులో గోవిందలా ఉంటే.. ఎప్పటికీ అనుకున్న పదవి సాధించలేమని.. ఇలా సెపరేట్ గా ఉంటనే.. వర్కవుట్ అవుతుందనేది రేవంత్ గేమ్ ప్లాన్ లా కనిపిస్తోంది.వస్తే కొండ. పోతే వెంటుక.. అన్నట్టు డైనమిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సెపరేట్ స్ట్రాటజీ బెడిసికొడితే పోయిందేముంటుంది? పదవి రాదు. అంతేగా? అదే జరిగితే.. ఇక కాంగ్రెస్ లో కొనసాగడమెందుకు? అవసరమైతే హస్తం పార్టీని వీడేందుకూ రేవంత్ రెడ్డి వెనకాడబోరని అంటున్నారు ఆయన అనుచరులు. రేవంత్ తో వెళ్లేదెవరు? ఉండేదెవరు? రేవంత్ రెడ్డి వ్యవహారం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. చాలా ప్రమాదకరం. అతి జాగ్రత్తగా డీల్  చేస్తేనే ఫలితముంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా.. డ్యామేజ్ జరిగిపోతుంది. సీనియర్లను, పాత కాపులను, నల్గొండ రెడ్డిలను కాదని.. రేవంత్ ను పీసీసీ చీఫ్ చేస్తే.. మిగతా వారంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడం ఖాయం. రేవంత్ నాయకత్వాన్ని చాలా మంది నేతలు సహించకపోవచ్చు. వారిలో అనేక మంది పార్టీని వీడిపోవడం తప్పకపోవచ్చు. అలా జరిగితే.. ఒక్క రేవంత్ రెడ్డి కోసం అనేక మంది లీడర్లను త్యాగం చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ రేవంత్ ను కాదని మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే..ఈయన ఒప్పుకునేలా లేరు. పార్టీలో కొనసాగేలా కనిపించడం లేదు. ఇప్పటికే పార్టీతో సంబంధం లేకుండా సొంత ఎజెండా ఫాలో అవుతున్నారు. ఇక సీతక్క, వేం నరేందర్ రెడ్డిలాంటి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఓ స్థాయి ఉన్న లీడర్లు సైతం రేవంత్ కే జై కొడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి ఒక్క లీడర్ తగ్గినా.. అది పార్టీకి తీరని లోటే. కోలుకోలేని దెబ్బే. ఇలా ఎలా చూసినా.. రేవంత్ రెడ్డితో వ్యవహారం కాంగ్రెస్ కు కత్తి మీద సామే. 

114 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన అశ్విన్

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 114 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేశాడు. టెస్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఏ భారత స్పిన్నర్ కూడా టెస్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్ తీయలేదు. అంతేకాదు  ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్ తీసిన మూడో స్పిన్నర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. చెన్నై చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.   ఇంగ్లాండ్ రెండో సెకండ్ ఇన్నింగ్స్  తొలి  ఓవర్ మొదటి బాల్‌‌ని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన అశ్విన్ కొద్దిగా టర్న్ చేశాడు. దీంతో ఆ బంతిని డిఫెన్స్ చేసేందుకు ఓపెనర్ రోరీ బర్న్స్  ప్రయత్నించారు. అయితే  అదనపు బౌన్స్ కావడంతో ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లోకి వెళ్లింది. అక్కడే ఉన్న అజింక్య రహానె చక్కగా క్యాచ్‌ అందుకున్నాడు. క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకూ కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే స్పిన్నర్లు ఈ ఘనత సాధించారు. 1888లో ఇంగ్లాండ్ స్పిన్నర్ బాబీ పీల్ తొలుత ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత 1907లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ బెర్ట్ వోల్గర్ ఫస్ట్ బాల్‌కే వికెట్ పడగొట్టాడు. ఇషాంత్ శర్మ కూడా అరుదైన ఫీట్ ను అందుకున్నాడు. 300 వికెట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత పేస్ బౌలర్ గా చరిత్ర క్రియేట్ చేశాడు.  ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 6 వికెట్ల‌కు 257 ప‌రుగుల‌తో నాలుగో రోజు సోమవారం తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన భారత్‌.. మ‌రో 80 ప‌రుగులు జోడించి మిగ‌తా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్  అద్భుత పోరాటంతో  85 పరుగులు చేయడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది. రవిచంద్రన్‌ అశ్విన్ ‌కూడా 31 పరుగులతో రాణించాడు. దీంతో ఇంగ్లండ్ కంటే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 241 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. 

ఎన్నికల వేళా.. జగన్ కి వాలంటీర్ల సెగ ?

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి పంచాయతీ ఎన్నికల వేళ వాలంటీర్ల సెగ తగిలింది. ఎన్నికల సమయమే వారి సమస్యకు పరిష్కారం అనుకున్నారేమో, తక్కువ జీతాలు ఇస్తూ.. తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారంటూ వాలంటీర్లు విశాఖలో  రోడ్డెక్కారు. తక్షణమే తమ జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ..  గాజువాకలో వాలంటీర్లు జీవీఎంసీ జోన్ 5వ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వాలంటీర్ల పనితనం ఏంటో తెలపాలని రోజుకు ఎన్నిగంటలు పనిచేయాలో స్పష్టం చేయాలని అన్నారు. కరోనా కాలంలో కూడా కష్టపడి పనిచేసిన తమను ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రక్ డ్రైవర్లకు ఇచ్చిన జీతం కూడా తమకు ఇవ్వడంలేదన్నారు. సీఎం జగన్ వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. విజయవాడలో కూడా వలంటీర్లు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు  పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వేలాది మంది వలంటీర్లు రావడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమకు రూ.10 వేల జీతం, ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.   ఒకవైపు పంచాయితీ ఎన్నిలు, మరో వైపు నిరసన సెగలు ఇవే ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్న కధనాలు. మొన్న విజయవాడ లో రేషన్ వాహనాల డ్రైవర్స్ తమతో చాకిరీ చేపించుకుంటున్నారని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.. రేషన్ డ్రైవర్స్ ఆందోళన మరిచి పోక ముందే వలంటీర్లు నిరసన మొదలైంది. తమ ప్రభుత్వమే నియమించిన వలంటీర్లు, రేషన్ వాహనాల డ్రైవర్లు ఆందోళనలు చేస్తుండడం తో వైపిపి పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో కలవరం రేపుతోంది.  

విశాఖ స్టీల్ ప్లాంటుపై  జగన్ డ్రామా ? 

  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం పై కేంద్రం పై  కట్టే విరగకుండా పామును చంపే ప్రయత్నంగా జగన్ డ్రామా ఆడుతున్నాడని. విశాఖ స్టీలు పై తనకు ఎలాంటి సంభందం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని, జగన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రా లేక  కేంద్రం బంటా అని, ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పై విరుచుకుపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పైవేటీకరణ విషయం పై జగన్ తన లేఖలో నామమాత్రంగా స్పందించారని. జగన్, మోడీకి లేఖ రాయడమే కాకుండా..కేంద్ర బడ్జెట్ కు భజన చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఉండవల్లి అరుణ్ కుమార్ పేరుకొన్నారు..తన సొంత పార్టీ లోనే కేంద్ర బడ్జెట్ పై వ్యతిరేక వాదనలు వినిపిస్తుంటే, జగన్ కేంద్ర బడ్జెట్ ని పొగడడం విషమని అన్నారు..   విశాఖ స్టీలు పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. కనీసం పార్టీలకు అతీతంగా ప్రతిపక్ష నాయకులతో భేటీ అయ్యి ఉమ్మడి నిర్ణయం  తీస్కొని విశాఖ  స్టీల్ ప్లాంట్ ను కాపాడాల్సిన సందర్భంలో కూడా, జగన్ రాజకీయ లబ్ది కోసం మోడీ మోచేతి నీళ్లు తాగుతున్నారని చెప్పారు.. రాష్ట్రాన్ని కాపాడాల్సిన నాయకుడే ఆంధ్రుల హక్కును ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్ అని స్టీలు ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని.. అందుకు అన్ని పార్టీలు ముందుకు వచ్చిన జగన్ ఒక్క అడుగుకూడా కదపలేదని  జగన్ ను విమర్శించారు  . ఇప్పటికైనా జగన్ రాజకీయ లబ్ది పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల పై ద్రుష్టి కొనసాగించాలని..  అన్ని పార్టీ నాయకులతో కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలని ఉండవల్లి అన్నారు..   

దేనికైనా రె..ఢీ అంటున్న బాలయ్య.. ఇక వైసిపికి చుక్కలే..

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలయ్య తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం చేస్తున్న బోయపాటి సినిమా తర్వాత తానేం చేయబోతున్నానో ఒక అభిమానితో అయన మాట్లాడిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను దేనికైనా రెడీ అని.. అంతేకాకుండా ఇకనుండి జనంలోనే ఉంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బాలయ్య ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని రుద్రకోటలో నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు, బాలకృష్ణ అభిమానులతో ఆయన మాట్లాడారు. అదే సమయంలో బాలకృష్ణకు కోటంరెడ్డి ఫోన్ చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివరాలు బాలయ్య.అడిగి తెలుసుకున్నారు .   ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య... బోయపాటి సినిమా తర్వాత నేనేంటో చూపిస్తానంటూ ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ తాజాగా సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని.. ఇటువంటి పరిపాలన మనం గతంలో ఎన్నడూ చూడలేదని బాలకృష్ణ విమర్శించారు. యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో అరాచకాల గురించి వింటామని, అయితే వైసిపి ప్రభుత్వంలో ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నామని ఆయన ఆరోపించారు. అభిమానులతో తనది జన్మజన్మల అనుబంధమని..  ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే తాను సహించబోనని అయన స్పష్టం చేసారు. తాను మానసికంగా సిద్ధం అవుతున్నానని.. పార్టీ కేడర్ దేనికీ భయపడొద్దు, అయ్యేదేదో అవుతుందని బాలయ్య స్పష్టం చేశారు. సాక్షాత్తు శ్రీరాముడు 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడని.. ఇదీ అంతేనని అయన వ్యాఖ్యానించారు. అన్నగారితో ఆంధ్రుల అనుబంధం ఎటువంటి ప్రలోభాలకు లొంగనిదన్నారు. అధికార వైసీపీ పార్టీ ఇప్పుడు చేస్తున్న వాటికి వంద రెట్లు రుచి చూపిద్దామని బాలకృష్ణ పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు.

ఉత్తరాఖండ్‌కు మ్యాచ్ ఫీజు విరాళంగా ఇచ్చిన రిషబ్ పంత్ 

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మంచు చరియలు విరిగి పడి.. ఆ పరిణామంతో వచ్చిన జలప్రళయంతో తీవ్ర నష్టం జరిగిన సంగతి తెల్సిందే. తాజాగా అక్కడ జరుగుతున్న సహాయక చర్యలకు ఇండియన్ క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించి బాసటగా నిలిచాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా రూర్కీ పట్టణంలో జన్మించిన రిషబ్ పంత్ చమోలీ జిల్లాలోని జోషిమఠ్ వద్ద జరిగిన జలప్రళయంపై విచారం వ్యక్తం చేస్తూ పంత్ ఈ ప్రకటన చేశారు.ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అంతేకాకుండా జలప్రళయం బాధితులను ఆదుకునేందుకు అందరు ముందుకు రావాలని రిషబ్ విజ్ఞప్తి చేశారు.చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్రస్తుతం భారత్-ఇంగ్లాండు జట్ల మధ్య జరుగుతన్న ఓపెనింగ్ టెస్టులో రిషబ్ పంత్ 91 పరుగులు చేశారు. ఉత్తరాఖండ్ ప్రకృతి విలయం లో నష్టపోయిన వారికోసం మొట్టమొదటి విరాళం ప్రకటించి రిషబ్ పంత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు.

బొత్సపై వైసీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు!

పంచాయతీ ఎన్నికల వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. విజయనగరం జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణపై ఆయన సమీప బంధువు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు తిరుగుబాటు చేశారు.  తన నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు అరాచకాలు ఎక్కువయ్యాయని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. టీడీపీ నేతలతో కుమ్మకై .. డబ్బులు ఎరవేసి  ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుంటున్నారని అప్పలనాయుడు మండిపడ్డారు.  అన్నదమ్ములకి, వదినకి పదవులున్నా సంతృప్తి చెందక బొత్స లక్ష్మణరావు రాజకీయ ఉన్మాదిగా మారారని ఎమ్మెల్యే విమర్శించారు. గత ఎన్నికల్లో తనకు వచ్చిన ముప్పైవేల మెజారిటీ చూసి ఓర్వలేక రాజకీయచిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రమంతా ఒకటైతే.. తన నియోజకవర్గంలో మరోలా ఉందన్నారు. బొత్స తన సోదరుడిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని, ఎన్నికల తరువాత అధిష్టానంకు పిర్యాదు చేస్తానని, అటో ఇటో తేల్చుకుంటానని అప్పలనాయుడు అన్నారు.  

అత్తా కోడళ్ళకు ఇంట్లోనే కాదు.. ఎన్నికల్లోనూ పోరే.. 

  ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కుటుంభ సభ్యుల మధ్యే ఎన్నికల పోరు సంబరాలు జరుగుతున్నాయి . కోడలు వైసిపి అంటే అత్తా టిడిపి అంటూ..సై అంటే సై అంటున్నారు ఒబిఆర్ కండ్రిగలో అత్తా కోడళ్ళు. తిరుపతి వడమాలపేట మండలంలోని ఓబీఆర్‌కండ్రిగలో పంచాయతీ సర్పంచ్‌ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించగా, సొంత ఇంట్లోనే  కోడళ్ళు  వైసిపి నుండి పొట్టి చేస్తుండగా, అత్తా టిడిపి నుండి బరిలో నిలిచారు. 1269 మంది ఓటర్లున్న పంచాయతీలో ఓబీఆర్‌కండ్రిగకు చెందిన శ్రీవిద్య గత పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా సర్పంచ్‌ పదవికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుగా మళ్ళీ సర్పంచ్ ‌ పదవికి పోటీ పడుతున్నారు.టీడీపీ నాయకులు ఓ అడుగు ముందుకేసి శ్రీదివ్య అత్త తులసమ్మను టిడిపి తరుపున సర్పంచ్ పదవికి రంగంలోకి దింపి అత్తా కోడళ్లకు రసవత్తర పోరుకు తెరలేపారు. ఈ పోటీ ఎన్నికల వర్గాలనే కాదు, స్థానిక ఓటర్లని కూడా హార్ట్ టాపిక్ గా మారింది. ఒకే కుటుంబానికి చెందిన మహిళలు ఎన్నికల బరిలో నిలవడంతో ఓటర్ల అయోమయానికి గురి అవ్వడం తో పాటు, ఈ పోటీ ఎలా ఉండబోతుందో అని ఎదురు చూస్తున్నారనే చెప్పాలి.. మరోవైపు ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రభావతి కూడా పోటీ పడుతున్నారు..  పంచాయతీలో క్షత్రియులు, యాదవులు, ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్నారు. దీంతో అత్తాకోడళ్లు అన్ని సామాజికవర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగారు. టీడీపీ, వైసీపీ నేతలు తమ మద్దతుదారు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆయకట్టుకునే యత్నం చేస్తున్నారు. ఈ రసవత్తర ఎన్నికల పోరులో పెత్తనం ఎవరు చేస్తారో చూడాలి అత్తా కోడలు ఇద్దరిలో ఎవరికి పైచేయి అవుతుందో చూడాలి.  

సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆన్ లైన్ పిటిషన్! ఎంపీ రామ్మోహన్ నాయుడికి భారీ మద్దతు 

విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఇది 1963లో మార్మోగిన  నినాదం. కేంద్ర సర్కార్ దిగొచ్చేలా చేసిన ఉద్యమ గళం.  ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మళ్లీ ఆ నినాదం మార్మోగుతోంది. పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రులు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. తమ హక్కును కాపాడుకునేందుకు కదులుతున్నారు. రాజకీయ నాయకులు కూడా కలిసి వస్తుండటంతో విశాఖ ఉద్యమం ఊపందుకుంటోంది.    విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడి ఆన్‌లైన్ పోరాటం మొదలు పెట్టారు. ఆయన వేసిన ఆన్ లైన్ పిటిషన్ కు వేలాది మంది మద్దతు లభిస్తోంది.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ‘చేంజ్ డాట్ ఆర్గ్’లో ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ పేరుతో ఎంపీ పిటిషన్ ప్రారంభించారు.  కొన్ని గంటల్లో రామ్మోహన్ నాయుడు పిటిషన్ కు వేలాది మంది సపోర్ట్ చేశారు.  దీనికి ఆదివారం  రాత్రి 12 వరకు 31,715 మంది మద్దతు తెలిపారు. గంట గంటకు సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆ పిటిషన్‌లో రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌కు లక్ష మంది మద్దతు తెలిపిన అనంతరం దానిని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థిక, ఉక్కుశాఖ మంత్రులకు అందిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

అతడికి 23.. ఆమెకు జస్ట్ 65.. లవ్ మ్యారేజ్.. ఎక్కడంటే..

ప్రేమకు వయసు పట్టింపు లేదు. ప్రేమ గుడ్డిది. కొంత మంది లేటు వయసులో కూడా ప్రేమలో పడుతుంటారు. మరి కొంతమంది వయసులో తమకంటే బాగా పెద్దవారైనా వాళ్ళను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. అయితే పెద్ద వయసు ఉన్న మగాడు తక్కువ వయసు ఉన్న మహిళను పెళ్లి చేసుకుంటే పల్లెత్తు మాట అనని ప్రపంచం.. ఈ మధ్య వయసు ఎక్కువ ఉన్న మహిళలు తమకంటే బాగా తక్కువ వయసు ఉన్న యువకులను పెళ్లి చేసుకుంటే మాత్రం అది పెద్ద చర్చనీయాంశంగా మారిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. అక్కడ 65 ఏళ్ల మహిళ ఏకంగా 23 ఏళ్ల కుర్రాడిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ లోని గుంజరన్వాలా లో నివాసం ఉంటున్న 23 ఏళ్ల అబ్దుల్లా వృత్తిపరంగా చిత్రకారుడు. అయితే అతడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ఫేస్ బుక్ ద్వారా చెక్ రిపబ్లిక్ కు చెందిన అరియాన అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దాదాపు రెండేళ్లు సాగిన ఈ సోషల్ మీడియా పరిచయం.. ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇక్కడ మ్యాటరేంటంటే.. అబ్దుల్లా కన్నా అరియాన వయసులో 42 సంవత్సరాలు పెద్దది. అయితే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులను కూడా ఒప్పించారు. ఇది ఇలా ఉండగా ఒక సంవత్సరం పైగా వీరిద్దరూ వీసాల కోసం ప్రయత్నిస్తున్నా.. అధికారులు మాత్రం వీరి వీసాలను తిరస్కరిస్తూ వచ్చారు. మరోపక్క వీరిద్దరూ కలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయారు. దీంతో అరియాన చెక్ రిపబ్లిక్ లోని పాక్ రాయబారి కార్యాలయాన్ని సంప్రదించిన తరువాత వారి సహాయంతో.. చివరికి పరిచయం అయిన మూడు సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలుసుకున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ పాకిస్తాన్ లో పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. టీచర్ గా రిటైర్ అయిన అరియాన, అబ్దుల్లాకు త్వరలో చెక్ రిపబ్లిక్ లో కాపురం పెట్టనున్నారు. అయితే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న ఈ ప్రేమ జంట వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతా కేటీఆర్ వల్లే జరిగిందా? ఫ్యామిలీని కేసీఆర్ కూల్ చేసినట్టేనా? 

తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు పై కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే కేటీఆర్ కు మద్దతుగా ప్రకటనలు చేయడంతో మరింత అసక్తి రేపింది. కొందరు మంత్రులు కూడా ముఖ్యమంత్రి మార్పుపై సానుకూలంగా మాట్లాడటంతో.. కేటీఆర్ టైమ్ వచ్చిందనే అంతా భావించారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేశారు గులాబీ బాస్. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని తేల్చి చెప్పారు. కేసీఆర్ ప్రకటనతో సీఎం మార్పుపై క్లారిటీ వచ్చినా.. కొన్ని అనుమానాలు  మాత్రమే అలానే ఉన్నాయి. కేటీఆర్ విషయంలో కుటుంబంలో విభేదాలు వచ్చాయన్న విషయంలో కేసీఆర్ ఏం చేశారన్నది ఇప్పుడు చర్చగా మారింది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో కేసీఆర్ ఫ్యామిలీలో గొడవ జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ సతీమణి శోభ.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో పట్టుబట్టినట్లు చెబుతున్నారు. కేసీఆర్ పై ఆమె ఒత్తిడి తెచ్చారంటున్నారు. ఎమ్మెల్సీ కవిత మాత్రం  కేటీఆర్ విషయంలో సానుకూలంగా స్పందించలేదని సమాచారం. ఎంపీ సంతోష్ కూడా కేటీఆర్ సపోర్ట్ చేయలేదని తెలుస్తోంది. కేటీఆర్ మాత్రం తల్లి ద్వారా తండ్రిపై సీఎం సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే.. తన వర్గం నేతల ద్వాారా ప్రకటనలు ఇప్పించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేటీఆర్ నుంచి సిగ్నల్స్ ఉండటం వల్లే కొందరు టీఆర్ఎస్ నేతలు పోటీపడి మరీ స్టేట్ మెంట్లు ఇచ్చారంటున్నారు. తన ముందే నేతలు మాట్లాడుతున్నా కేటీఆర్ వారించకపోవడానికి కూడా ఇదే కారణమంటున్నారు.  ముఖ్యమంత్రి విషయంలో జరుగుతున్న ప్రచారం, కుటుంబంలో విభేదాలతో కేసీఆర్ కొన్ని రోజులుగా అసహనంగా ఉన్నారని తెలుస్తోంది. బయట జరుగుతున్న ప్రచారంపై ఆయన నిఘా వర్గాల నుంచి వివరాలు తెప్పించుకున్నారని అంటున్నారు. అన్ని విషయాలపై క్లారిటీ రావడం వల్లే.. తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో కేటీఆర్ టీమ్ పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారని చెబుతున్నారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించారట కేసీఆర్. ఇంకోసారి మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానని హెచ్చరించారట .  ఎక్కడైనా లూస్ టాక్ చేస్తే బండకేసి కొట్టి పార్టీ నుంచి బయట పారేస్తానని చెప్పారట. సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారట. తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఇంకో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేశారని చెబుతున్నారు. పార్టీ సమావేశంలో కేసీఆర్ సీరియస్ కామెంట్లు చేయడంపై రాజకీయ వర్గాల్లో  ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే కొందరు నేతలు అత్యుత్సాహం చేస్తూ ఇలాంటి ప్రచారం చేశారనే భావనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. కేటీఆర్ సీఎం అయితే తమకు మంచి అవకాశాలు వస్తాయనే ఆశతో కొందరు ప్రకటనలు చేశారని పార్టీ ముఖ్య నేతలు కొందరు కేసీఆర్ కు చెప్పారని తెలుస్తోంది. పార్టీ సమావేశానికి ముందు తనకు అత్యంత సన్నిహితులుగా ఉండే నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. ఎంపీ కేశవరావు, అసెంబ్లీ మాజీ స్పీకర్ మదుసూదనాచారితో పాటు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితోనూ కేసీఆర్ మాట్లాడారని తెలుస్తోంది. వారంతా ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో.. కేటీఆర్ టీమే ఈ రచ్చకు కారణమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారంటున్నారు. అందుకే వాళ్లపై కేసీఆర్ ఘాటైన పదాలతో విరుచుకుపడ్డారని చెబుతున్నారు.  మరోవైపు సీఎం మార్పు అంశాన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. సీఎం పదవికి కేటీఆర్ కన్నా ఈటల బాగా సరిపోతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లాంటి నాయకులు బహిరంగంగానే సూచనలు చేశారు.  బీసీ నాయకుడైతే బెటర్ అంటూ ఈటలకు మద్దతుగా చాలా మంది తెరపైకి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాదం మరి కొన్ని రోజులు కొనసాగితే మరి కొందరు నేతలు బయటికి వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ భయపడ్డారట. అదే జరిగితే పార్టీలో అంతర్గత విభేదాలు ఏర్పడి పార్టీ భవిష్యత్తు నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయని భావించారట. అందుకే ఈ ప్రచారాన్ని ఎక్కువ కాలం కొనసాగించవద్దనే ముఖ్యమంత్రి మార్పు అంశంలో జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ ముగింపు పలికారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సుడిగాలిలా పర్యటిస్తూ  కేడర్ లో  జోష్ నింపుతున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడికెళ్లినా జనాలు భారీగా వస్తున్నారు. రేవంత్ రెడ్డి పంచ్ ప్రసంగాలకు ఫిదా అవుతున్నారు. దీంతో రోజు రోజుకు ఆయన గ్రాఫ్ పెరుగుతోంది.కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. ఇదే అస్త్రంగా జనంలోకి వెళుతోంది కాంగ్రెస్. కేంద్రంతో పాటు కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ  దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి.    తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి ఆకస్మికంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్షలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. సభలో పాల్గొన్న మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్కలు రేవంత్ రెడ్డిని పాదయాత్ర చేయాలని కోరారు. వాళ్ల ప్రతిపాదనను  ఆమోదిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తున్నానని ప్రకటించి.. రైతు భరోసా దీక్షనే పాదయాత్రగా మార్చేశారు. అంతేకాదుఅచ్చంపేట నుంచి హైదరాబాద్ కు అప్పటికప్పుడే పాదయాత్ర మొదలు పెట్టేశారు. అచ్చంపేట సభకు వచ్చిన వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డితో పాటు పాదయాత్రగా హైదరాబాద్ వస్తున్నారు.  ఎంపీ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలంగాణలో సంచలనంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ కేడరంతా రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు ఇతర జిల్లాల నుంచి నేతలు అచ్చంపేటకు బయలు దేరారని తెలుస్తోంది. ఇటీవల నిజామాబాద్ రైతు భరోసా దీక్ష కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సభలో బీజేపీ, టీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. నిజామాబాద్ సభలో ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ కు బూస్ట్ వచ్చిందని చెబుతున్నారు.

తెలుగు వన్ చెప్పిందే అక్షర సత్యం! కేసీఆరే మరో మూడేళ్లు సీఎం! 

తెలంగాణ ముఖ్యమంత్రి మార్పుపై తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదన్నది స్పష్టమైంది. గత కొన్ని రోజులుగా కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ప్రధాన మీడియా కోడే కూస్తోంది. డిజటల్ మీడియా అయితే మరో అడుగు ముందుకేసి కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం కూడా ప్రకటించేసింది. కాని తెలుగు వన్ మాత్రమే ముఖ్యమంత్రి మార్పు ఉండదని, ఈ టర్మ్ లోనూ పూర్తి కాలం కేసీఆరే సీఎంగా కొనసాగుతారని వరుస కథనాలు ఇచ్చింది. తెలుగు వన్ చెప్పిందే నిజమని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు.     తెలంగాణ భవన్‌లో  జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో  సీఎం మార్పు ఊహాగానాలపై కేసీఆర్‌ స్పష్టతనిచ్చారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి మార్పు  విషయంలో ఎమ్మెల్యేలు అనవసర వ్యాఖ్యలు చేయవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో తెలుగు వన్ చెప్పిందే నూటికి నూరు పాళ్లు నిజమైంది.   తెలంగాణలో సీఎం మార్పు అంశంలో గతంలో తెలుగు వన్ ఇచ్చిన స్టోరీ  మరోసారి మీకోసం.. కేటీఆర్ సీఎం కావడం కష్టం!   తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలన్ని కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్ సీఎం అవుతారంటూ  గులాబీ నేతలు పోటీపడి మరీ ప్రకటనలు చేస్తున్నారు.  అయితే కేసీఆర్, కేటీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులెవరు ఈ వార్తలపై స్పందించడం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో  కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం ఖరారైందని కథనాల మీద కథనాలు వస్తున్నాయి.  అయితే  కేసీఆర్ అత్యంత సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పట్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమనే తెలుస్తోంది.    తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది. సీఎం సొండ గడ్డలో జరిగిన ఉప ఎన్నికలో అది కూడా సిట్టింగ్ సీటును కారు పార్టీ కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కమలనాధులు అధికార పార్టీకి చుక్కలు చూపించారు. వరుస షాకులతో గులాబీ పార్టీలో గుబులు రేగింది. ఆ నేపథ్యంలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక రానుంది. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ భవిష్యత్ కు అత్యంత కీలకం.ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎన్నిక అధికార పార్టీకి పెద్ద సవాల్. రాష్ట్రంలో దూకుడు మీదున్న బీజేపీని అడ్డుకోవడంతో పాటు బలమైన నేత జానారెడ్డిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అందుకే ముందు నాగార్జున సాగర్ పై ఫోకస్ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు.  టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రివర్స్ అయ్యాయి. తన నైజానికి భిన్నంగా కొన్ని పథకాలను క్యాన్సిల్ చేశారు కేసీఆర్. పీఆర్సీ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు,  ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో యువత రగిలిపోతున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తే... పాలన చేతకాక కేసీఆర్ పారిపోయారని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉందన్న వాదన కూడా కొందరు గులాబీ నేతల నుంచి వస్తుందట. పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమ నేతగా , రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు.. ఈ తరహా ప్రచారం ఇబ్బందిగా మారుతుందని వారు చెబుతున్నారట. అందుకే కేటీఆర్ ను సీఎం చేయాలన్న అంశంపై కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.  కేసీఆర్ కలల ప్రాజెక్ట్ యాదాద్రి పునర్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు, మూడు నెలల్లో ఆలయం సిద్ధమవుతుందని తెలుస్తోంది. పనుల్లో వేగం పెంచాలని యాడా అధికారులను ఆదేశించారు కేసీఆర్. యాదాద్రి ప్రారంభోత్సవాన్ని వైభవంగా జరపాలని, ఆ సందర్భంగా యాగం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా కేసీఆర్ సొంత గడ్డలో నిర్మిస్తున్న .. కాళేశ్వరంలో అతి పెద్ద రిజర్వాయర్  అయిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది. అది పూర్తయ్యాకా ముఖ్యమంత్రిగా తానే దాన్ని ప్రారంభించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. అయితే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తికా ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.       కేటీఆర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడానికి  నిఘా వర్గాల నివేదికలు కూడా  కారణమని తెలుస్తోంది.  కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న నేతలంతా హరీష్ రావు కోటరిలో ఉండగా.. బంగారు తెలంగాణ బ్యాచ్ లీడర్లంతా కేటీఆర్ వెంట ఉన్నారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే... ఉద్యమ నేతలంతా తమ దారి తాము  చూసుకునే అవకాశం ఉందని , హరీష్ రావు కూడా పార్టీ మారే అవకాశం ఉందని నిఘా సంస్థలు కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయని తెలుస్తోంది.  ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కమలం నేతలు. ఇలాంటి సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. పార్టీలో అసమ్మతి పెరిగేలా చూసుకోవడం మంచిది కాదనే భావనకు టీఆర్ఎస్ అధినేత వచ్చారంటున్నారు.  అంతేకాదు కేటీఆర్ ను సీఎం చేసే విషయంలో కుటుంబంలోనూ క్లారిటీ రాలేదంటున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఏ బాధ్యతలు అప్పగించాలన్న దానిపై విభేదాలు వస్తున్నాయంటున్నారు. ఇలా ఏ రకంగా చూసినా..కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఇప్పట్లో జరగడం కష్టమే..  

బయటికి వెళ్లొచ్చు .. ఏం మాట్లాడొద్దు!పెద్దిరెడ్డికి హైకోర్టు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్‌పై ఆదేశాలు చెల్లవని చెప్పిన హైకోర్టు.. మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. మంత్రి తరఫు.. అటు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాదుల వాదనలు తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని మాత్రమే హైకోర్టు సమర్థించింది. మంత్రి మీడియాతో మాట్లాడేందుకు వీల్లేదన్న ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. ఎన్నికల అంశాలకు సంబంధించి ఏ విషయాలనూ మీడియాతో మాట్లాడకూడదని మంత్రిని హైకోర్టు ఆదేశించింది.  ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఇంటికి ఎలా పరిమితం చేస్తారని ఎస్ఈసీని పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఏకగ్రీవాలతో పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రభుత్వ విధానమని హైకోర్టుకు న్యాయవాది తెలిపారు. అటు పెద్దిరెడ్డి వ్యాఖ్యల క్లిప్పింగులను ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఎస్ఈసీకి సహకరిస్తే అధికారులను బ్లాక్‌ లిస్టులో పెడతామనడం, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని న్యాయవాది చెప్పారు. నిబంధనల ప్రకారం పెద్దిరెడ్డి కదలికలను నియంత్రించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని న్యాయవాది కోర్టుకు తెలిపారు.  మరోవైపు హైకోర్టు తీర్పు రాకముందే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికేందుకు ఇంటినుంచి బయటికొచ్చిన పెద్దిరెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. మొదట సీఎం వైఎస్ జగన్‌కు పెద్దిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో కలిసి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.

ఉత్తరాఖండ్ లో ప్రకృతి విలయం! వందలాది మంది గల్లంతు 

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయం సంభవించింది. భారీ మంచుకొండ విరిగిపడటంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ధౌలిగంగా నది ఒక్కసారిగా ఉప్పొంగింది. నదికి ఆకస్మికంగా వరద రావడంతో ఆ ధాటికి దిగువన ఉన్న డ్యామ్ ధ్వంసమైంది. నీటి ప్రవాహ ఉద్ధృతికి ఆనకట్ట కొట్టుకుపోయింది.వరద నీరు చమోలీ జిల్లా రైనీ తపోవన్ వద్ద ఉన్న రుషి గంగా విద్యుత్ కేంద్రాన్ని ముంచెత్తగా, ఆ విద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. అందులోని 150 మంది కార్మికులు గల్లంతయ్యారు.   సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటీన రంగంలోకి దిగాయి. వరద నేపథ్యంలో ధౌలిగంగా నదీతీరంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగం సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు.  ఘటనాస్థలికి ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయపడేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఓ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. పాత వీడియోలను చూపిస్తూ వందంతులు ప్రచారం చేయవద్దని కోరారు.  భారీ వర్షాలు, అకస్మాత్తుగా వస్తున్న నీటి వల్ల చమోలీలోని రుషి గంగ గ్రామంలో రిషి గంగ ప్రాజెక్టుకు నష్టం జరగవచ్చునని ముఖ్యమంత్రి రావత్ తెలిపారు. నదిలోకి నీరు అకస్మాత్తుగా అధికంగా వస్తున్నందువల్ల అలకనంద ప్రాంతంలో వరదలు సంభవించే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతాల వెంబడి నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా భాగీరథి నదీ ప్రవాహాన్ని నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అలకనంద ప్రవాహాన్ని నిరోధించేందుకు శ్రీనగర్, హృషికేశ్ డ్యామ్‌లను ఖాళీ చేసినట్లు తెలిపారు. ఎస్‌డీఆర్ఎఫ్‌ను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అధికారులు తెలిపే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపారు.  ఉత్తరాఖండ్ వరదలతో ఉత్తర్ ప్రదేశ్ కు గండం పొంచి ఉంది. ఉత్తర ప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. గంగానది పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గంగా నది పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నీటి స్థాయిని నిరంతరం గమనించాలని తెలిపారు. అవసరమైతే ప్రజలను వేరొక చోటుకు తరలించాలని తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, పీఏసీ ఫ్లడ్ కంపెనీలను హై అలర్ట్‌లో ఉండాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. 

విశాఖలోనే స్టీల్ ప్లాంట్! ఢిల్లీకి  ఏపీ బీజేపీ నేతలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. కర్మాగారం కార్మికులకు మద్దతుగా అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా దూకుడు పెంచడంతో బీజేపీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో ఏపీ బీజేపీ నేతలు స్టీల్ ప్టాంట్ అంశంపై వివరణ ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి తాము వ్యతిరేకమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి అన్నారు. విశాఖలో  పర్యటించి పురంధేశ్వరి.. ఈ  ప్రాంత ప్రజల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాజీనామాలపై స్పందించనని, తమ పార్టీ స్టాండ్ తమకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈనెల 14వ తేదీన ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. బీజేపీకి ఎటువంటి రాజకీయ లబ్ధి ఉండదని, జాతి ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు పురంధేశ్వరి.  స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదని, ఉద్యోగులెవరికీ నష్టం జరగదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. కొత్త ఉత్పత్తులు తీసుకువచ్చే విధంగా చూద్దామన్నారు. 100 శాతం ప్రైవేటు వ్యక్తులకు అమ్మాలనే నిర్ణయానికి  మేం వ్యతిరేకమని చెప్పారు ఎమ్మెల్సీ మాధవ్. ఈ నెల 14న ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలు వివరిస్తామన్నారు. ఈ ప్రాంత వాసులమని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు కట్టుబడి ఉంటామని ఎమ్మెల్సీ మాధవ్‌ స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే గందరగోళం స్పష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.

నేను మూర్ఖుడ్ని.. తేడా వచ్చిందో..! ఓటర్లకు వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. తమ అభ్యర్థులకు పోటీకి ఇతరులెవరు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. అయినా కొందరు ధైర్యం చేసి పోటీలో నిలిచారు. ఇలా పోటీలో ఉన్నవారిని బెదిరిస్తున్నారు. విశాఖ జిల్లా ఎలమంచలి నియోజకవర్గంలో తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రచారం హోరాహోరీ సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు నామినేషన్ల సమయంలోనూ చాలా మందిని భయపెట్టాలని చూశారు. తమ అభ్యర్థికి పోటీగా చేసిన ఓ వ్యక్తిని బెదిరించిన ఆడియాలో లీకై వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఆయనపై కేసు కూడా నమోదైంది. శనివారం ఆయన్ను అరెస్టు చేసిన రాంబల్లి పోలీసులు.. స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. బెదిరింపుల కేసులో తనపై కేసు నమోదైన ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఏకంగా ఓటర్లనే టార్గెట్ చేశారు. రాంబిల్లి మండలం రాజకోడూరు పంచాయతీ ఎన్నికల ప్రచార సభలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు గ్రామస్థులకు హెచ్చరిక జారీ చేశారు.   ‘సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థిని గెలిపించాల్సిందే. మీకందరికీ క్లియర్‌గా చెబుతున్నా...తేడా వస్తే మీ ఊరికి రోడ్లు, కొళాయిలు, పైప్‌లైన్లు ఏమీ ఉండవు. నిర్మాణంలో వున్న సచివాలయం పనులు నిలిచిపోతాయి. నేను ఎంత మంచివాడ్నో, అంత మూర్ఖుడ్ని...సీఎం తర్వాత నియోజకవర్గంలో ఎవరికీ ఏది ఇవ్వాలన్నా నేనే. పనుల కోసం, పథకాల కోసం నా చుట్టూ ఊరు ఊరంతా కాళ్లరిగేలా తిరిగినా ఫలితం ఉండదు. గెలిచినా, ఓడినా ఐదేళ్లు సర్పంచ్‌ మా వాడే. అవతలి వ్యక్తి గెలిచినా కూర్చోవడానికి కుర్చీ కూడా ఉండదు. నేలపైనే కూర్చోవాల్సి ఉంటుంది. దేవుడు చెప్పినా వినను  అంటూ తీవ్ర స్థాయిలో ఓటర్లను బెదిరించారు.  అంతేకాదు టీడీపీకి చెందిన ఆంజనేయరెడ్డి, శంకరరావులకు నరకం అంటే ఎలా వుంటుందో చూపిస్తానని కూడా చెప్పారు ఎమ్మెల్యే కన్నబాబు రాజు. ‘అందరికీ ప్రభుత్వ పట్టాలు అందేశాయి అనుకుంటున్నారేమో....తేడా చేస్తే తర్వాత రావాల్సినవేవీ అందవు’ అంటూ హెచ్చరించారు. గత ఎన్నికల్లో పంచకర్ల రమేష్‌బాబు, పప్పల చలపతిరావు, బొడ్డేడ ప్రసాద్‌...ఇలా ఎందరు కలిసినా తన వెంట్రుక పీకలేకపోయారని, దీనిని గుర్తుపెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో ఓటేయకపోతే తర్వాత మీ ఇష్టమంటూ ప్రసంగాన్ని ముగించారు ఎలమంచలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు. ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రైతులపై జాగ్రతగా మాట్లాడు! సచిన్ కు పవార్  కౌంటర్ 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో  రైతులు చేస్తున్న ఆందోళనపై  అంతర్జాతీయంగా చర్చ జరగుతోంది. పాప్ స్టార్ రిహన్నా భారత రైతులకు మద్దతుగా చేసిన ట్వీట్ పై రగడ జరుగుతూనే ఉంది. రిహన్నా ట్వీట్ కు భారత్ కు చెందిన పలువురు ప్రముఖులు కౌంటరిచ్చారు. అందులో  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్  కూడా ఉన్నారు. సచిన్ వ్యాఖ్యలు వైరల్ కాగా.. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సచిన్ ను టార్గెట్ చేశారు. ఏదైనా మరో రంగం గురించి మాట్లాడే ముందు సచిన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని శరద్ పవార్ కామెంట్ చేశారు. రైతుల నిరసనల వెనుక ఖలిస్థానీలు లేదా ఉగ్రవాదులు ఉన్నారని  చేసిన వ్యాఖ్యలపై కూడా పవార్ విమర్శలు గుప్పించారు. నిరసనకారులంతా రైతులేనని ఆయన స్పష్టం చేశారు. వారంతా దేశానికి అన్నం పెడుతున్న వారని, వారిని ఖలిస్థానీలు, ఉగ్రవాదులు అనవద్దని  శరద్ పవార్ వ్యాఖ్యానించారు.రైతుల గురించి మాట్లాడేముందు అన్ని ఆలోచించాలని శరద్ పవార్ సూచించారు. 

 జనాగ్రహంతో మౌనం వీడిన జగన్! స్టీల్ ప్లాంట్ పై ప్రధానికి లెటర్ 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో కాక రేపుతోంది. విశాఖ ఉక్కు- ఆంధ్రా హక్కు అంటూ పోరాడి సాధించుకున్న కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తుండటంపై ఏపీ జనాలు భగ్గుమంటున్నారు. ఏపీ సర్కార్ కేంద్రంతో ఒత్తిడి తేవడంలో విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రం ఇంత చేస్తున్నా వైసీపీ నేతలు కూడా కనీసం మాట్లాడకపోవడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఒత్తిడి పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం జగన్ స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణపై మరోసారి సమీక్షించాలని తన లేఖలో విజ్ఞప్తి చేశారు.  విశాఖ  ప్లాంటు కారణంగా 20 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోందని, వేలాది మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారని తన లేఖలో సీఎం జగన్  వివరించారు. ప్లాంటు పరిధిలో 19,700 ఎకరాల విలువైన భూములు ఉన్నాయని, ఈ భూముల విలువ రూ.1 లక్ష కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయం భారం కావడం వల్లే విశాఖ ఉక్కు పరిశ్రమ కష్టాల్లో చిక్కుకుందని ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ వెల్లడించారు.  ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ 6.3 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందని వివరించారు.  గతేడాది డిసెంబరులో రూ.200 కోట్ల మేర లాభం కూడా వచ్చిందని, వచ్చే రెండేళ్లలో ఇదే ఒరవడి కొనసాగితే ప్లాంటు కోలుకుంటుందని చెప్పారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో ప్లాంటును బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని కోరారు.విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా గనులు లేవని, అధిక భారం మోస్తూ ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. సొంతంగా గనులు కేటాయిస్తే ఇతర ఉక్కు పరిశ్రమలతో పోటీ పడే స్థాయికి చేరుతుందని ప్రధాని మోడీకి తాను రాసిన లేఖలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వివరించారు.