పవన్ కల్యాణ్ కు వైసీపీ ఆహ్వానం 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయ కాక రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉక్కు కర్మాగారం కార్మికులు భగ్గుమంటున్నారు. పోరాడి  హక్కుగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను  కాపాడుకుంటామని విశాఖ వాసులు రోడ్డెక్కుతున్నారు. ఏపీ సర్కార్ కు తెలిసే డీల్ అంతా జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. 2019లో పోస్కోతో ఒప్పందం జరిగిన విషయం తెలిసినా.. సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని మండిపడుతోంది. తమపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక ఒడిషా కుట్ర ఉందని చెబుతున్నారు.  విశాఖ‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ ప్ర‌య‌త్నాల‌పై తాగా స్పందించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై  వైసీపీ ఎంపీలు కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్‌ షాను కలుస్తున్నారని తెలిపారు. త్వరలోనే ప్రధాని మోడీని కూడా కలిసి.. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని విన్నవిస్తారని చెప్పారు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తాము చేస్తున్న పోరాటానికి కలిసి రావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు మంత్రి అవంతి శ్రీనివాస్. పవన్‌ కల్యాణ్‌ కూడా త‌మ‌తో క‌లిసి పోరాటం చేయాల‌ని కోరారు. స్టీల్ ప్లాంట్  భూములు కాజేయాలని పోస్కో ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంద‌ని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. బెంగాల్, ఒడిషాలో పరిశ్రమ పెట్టుకోవచ్చు కదా అని మండిపడ్డారు. ప్రజల ఆస్తిని ప్రైవేట్‌పరం చేసే హక్కు ప్రధాని, సీఎంకు ఉండదని అన్నారు. పక్క రాష్ట్ర కేంద్ర మంత్రి వల్ల ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారం వ‌ద్ద కార్మికులు చేస్తున్న దీక్షకు మంత్రి అవంతి శ్రీనివాస్ మ‌ద్ద‌తు తెలిపారు.   

పంచాయతీ ఏకగ్రీవానికి వైసీపీ ప్లాన్! చంద్రబాబు ఎంట్రీతో సీన్ రివర్స్ 

ఏపీలో పంచాయతీ ఎన్నికలను టీడీపీ సవాల్ గా తీసుకుంది. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ..సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలు కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల వారీగా వివరాలు తెలుసుకుంటూ... అన్ని చోట్ల అభ్యర్థులు పోటీలో ఉండేలా చూస్తున్నారు. ఎక్కడైనా టీడీపీ తరపున ఎవరూ నామినేషన్ వేయలేదని గుర్తిస్తే.. వెంటనే స్థానిక నేతలను అప్రమత్తం చేస్తున్నారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఒక గ్రామంలో కేవలం వైసీపీ నుంచే నామినేషన్లు వేశారన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు.. పార్టీ లోక్ సభ అధ్యక్షుడినే  ఆ గ్రామానికి పంపించారు. చంద్రబాబు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యేతోపాటు లోక్ సభ టీడీపీ అధ్యక్షుడు.. హుటాహుటిన అర్దరాత్రే ఆ గ్రామానికి వెళ్లి టీడీపీ నేతలతో చర్చలు జరిపారు.  తిరుపతి సెగ్మెంట్ పరిధిలో శెట్టిపల్లె ఏకైక పంచాయతీగా ఉంది. ఈ గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా, తొమ్మిది వార్డులు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లోకి, మిగిలిన మూడు వార్డులు చంద్రగిరి సెగ్మెంట్ పరిధిలోకి వెళ్తాయి. ఈ గ్రామం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. గత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన బత్తుల స్వప్న శెట్టిపల్లిలో  గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ గ్రామంలో టీడీపీకి ఆధిక్యం వచ్చింది. చాలా ఏళ్లుగా ఈ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న భూములకు ల్యాండ్ పూలింగ్ ద్వారా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తామని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. ఈ గ్రామాన్ని ఏకగ్రీవం చేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే శెట్టిపల్లె గ్రామ సమస్యకు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే పరిష్కారం చూపుతూ జీవోను కూడా జారీ చేశామని, ఆ జీవో అమలు విషయంలో ఆలస్యం కారణంగానే సమస్య అలాగే మిగిలిపోయిందన్నది టీడీపీ నేతల వాదన. అయితే ఇక్కడ శుక్రవారం మాత్రమే నామినేషన్లకు ఆఖరు తేదీ. గురవారం వరకు కేవలం వైసీపీ సర్పంచ్, వార్డు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. టీడీపీ మద్దతుదారుల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ విషయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలిసింది. దీంతో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు, తిరుపతి లోక్ సభ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ కు పోన్లు చేసి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. శెట్టిపల్లెలో నామినేషన్లు ఎవరూ వేయకపోవడం గురించి ఆరా తీశారు. దీంతో సుగుణమ్మ, నరసింహ యాదవ్ హుటాహుటిన గురువారం రాత్రి శెట్టిపల్లెకు వెళ్లారు. గ్రామంలోని టీడీపీ మద్దతుదారులతో మాట్లాడారు. పార్టీ రహితంగా ఏకగ్రీవం అయితే ఫరవాలేదనీ, అధికార పార్టీ తరపున ఏకగ్రీవం అని ప్రకటిస్తే మాత్రం పోటీ పెట్టాల్సి వస్తుందని వారు వ్యాఖ్యానించారు. తమ మద్దతుదారులను బెదిరించి పోటీలో లేకుండా చేస్తున్నారన్నారు.  

ప్రధాని మోదీ పిరికి వ్యక్తి.. 

  ప్రధాని నరేంద్ర మోదీ పిరికివాడిని, మోదీ కనీస బాధ్యతలు మరిచాడని.. భారత్ ,చైనా వివాదాలపై దాగుడుమూతలు ఆడుతున్నారని. చైనా ముందు నిలబడలేక చైనాకు వంగి సలాం చేస్తున్నాడన్నట్లుగా మాట్లాడారు రాహుల్ గాంధీ. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధికార కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, భారత భూభాగాన్ని పరిరక్షించడంలో ఇప్పటికే మోదీ విఫలమయ్యారని, ఆయన కనీసం తన బాధ్యతలు కూడా గుర్తుంచుకోలేదని ఆరోపించారు. భారత సైనికుల త్యాగాలను మోదీ భారత్, చైనా సరిహద్దుల్లో అపహాస్యం చేస్తున్నారని, దీన్ని భారతీయులు ఎవరూ అంగీకరించే పరిస్థితి లేదని అన్నారు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఒక దేశ ప్రధానిని అలా మాట్లాడొచ్చా.. అలా మాట్లాడడం వెనక రాజకీయ ఎత్తుగడలు ఉంటాయనుకున్నా ఒక దేశ ప్రధానిని అలా మాట్లాడడం ఎంత వరకు సమంజసమో మీరే చూడండి..  భారత్ , చైనాలకు వైరం ఉన్న విషయం తెలిసిందే.. తూర్పు లడఖ్ ప్రాంతంలోని పాంగ్యాంగ్ సరస్సు సమీపంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మోహరించిన చైనా, భారత సైనికులను వెనక్కు మళ్లించాలన్న నిర్ణయం వెలువడిన మరుసటి రోజున రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం మాట్లాడుతూ, చైనా, భారత్ ల మధ్య జరిగిన సీనియర్ కమాండర్ల స్థాయి చర్చల్లో 48 గంటల్లోగా పాంగ్యాంగ్ సరస్సు ప్రాంతాన్ని సైనికులు ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారని, మిగతా సమస్యలు సైతం త్వరలోనే పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఏప్రిల్ 2020 నుంచి సరిహద్దుల్లో ఇరు దేశాలూ నిర్మించిన కట్టడాలను తొలగించాలని కూడా ఇరు దేశాలూ ఓ ఒప్పందానికి వచ్చాయి. ఇక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా నిలిచిన గోగ్రా, చాండింగ్ నిగులాంగ్ నల్లా, ట్రాక్ జంక్షన్, డెమ్ చోక్ సెక్టార్ల విషయంలో తదుపరి దశ చర్చల్లో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, పాంగ్ యాంగ్ సరస్సులో ఫింగర్ 4 వరకూ ఉన్న ప్రాంతమంతా భారత్ దేనని ఇండియా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సైనికులు ఫింగర్ 3 వరకూ భారత సైన్యం వెనక్కు రావాలని ప్రధాని కోరడంపై దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, భారత దేశానికి చెందిన భూమిని చైనాకు అప్పగించారన్న విషయం స్పష్టమవుతోందని రాహుల్ అన్నారు. గోగ్రా నుంచి ఇంకా చైనా దళాలు వెనక్కు వెళ్లలేదని గుర్తు చేసిన ఆయన, కైలాశ్ రేంజ్ ని వీడి వెనక్కు వెళతామని భారత్ అంగీకరించడాన్ని తప్పుబట్టారు.  

పోస్కోకు విజయసాయిరెడ్డి మద్దతు! 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతమవుతోంది. కార్మికులకు మద్దతుగా పార్టీలకు అతీతంగా నేతలు కదిలివస్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడుతామని చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సంచలన ఆరోపణలు చేశారు సీపీఐ జాతీయ నేత నారాయణ. పోస్కోకు వ్యతిరేకంగా ఒరిస్సా నుండి తరిమికొట్టే వరకు పోరాటం చేశామని చెప్పారు. ఇప్పుడు విశాఖ రాకుండా పోస్కోను తన్ని తరిమేస్తే సముద్రంలోకి పోవాల్సిందేనని చెప్పారు. భార్యాభర్తలు కలవకుండా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని.. అలాగే పరిశ్రమకి.. ఐరన్ ఓర్ లేకపోతే ప్రయోజనం లేదన్నారు నారాయణ. నష్టాల్లో ఉన్న పరిశ్రమని ప్రైవేటు వాళ్ళు ఎందుకు కొంటారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉంది కాబట్టే కొంటున్నారన్నారు నారాయణ.  పోస్కోకు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి లాంటి వారి మద్దతు ఉందని నారాయణ ఆరోపించారు. ఒకవేళ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటు అయితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. విశాఖలో పుట్టి పెరిగిన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్లారని, ఇప్పుడు ఉక్కు ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై వెంకయ్య నాయుడు  మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.  విశాఖ ఉక్కు కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ఉద్యమాన్ని సాగించాలని పిలుపు ఇచ్చారు నారాయణ.  

నవరత్నాలతో నయవంచన.. 

  ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందంటా.. ఇంకెవ్వరని మోసం చెయ్యను అని..  పులి పచ్చాత్తాపం ప్రకటించిందంటా.. తోటి జంతువులను సంహరించను అని  ఈ కథ వినికూడా గొర్రెలింకా పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి .. అని అన్నాడు ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్   ఏపీలో ప్రజల తీరు, పాలకుల తీరు  కూడా ఇలాగే ఉందని చెప్పాలి.. ఎన్నికల్లో  వైసీపీ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తన మన బేధాలు లేకుండా పోతున్నాయి .. అధికారం కోసం సొంత పార్టీ వర్గాలపైనే దాడులకు దిగడమే కాకుండా.. నోటి దగ్గర కూడు కూడా లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నాయకుల మాటలు వినకపోతే నామినేషన్ వేయనివ్వడం లేదు.. ఒకవేళ రెబెల్ గా నామినేషన్ వేసిన వారి జీవితాలను కాలరాస్తామంటున్నారు వైసీపీ నాయకులు.. హోమ్ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గంలో  సొంత పార్టీ వారికే  రక్షణ లేకుండా పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. వట్టిచెరుకూరు మండలం కర్నూతల వైసీపీ రెబల్‌గా నామినేషన్‌ వేయడానికి వెళ్తున్న  వారిపై దాడి చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్‌ వేసిన రెబల్‌ వర్గంపై ఇప్పుడు బెదిరింపుల పర్వం ప్రారంభమైంది. ఈ వర్గంలో ఎక్కువ శాతం పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు.  ఈ క్రమంలో గురువారం పొలాలకు వెళ్లే నీటి పైపులను పగల గొట్టడమే కాకుండా నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటేనే పంటకు నీరిచ్చేది అంటూ బెదిరించారు. పొలాల్లో ట్యూబులు, ఇంజన్లు పగలగొడుతున్నారన్న సమాచారంతో పోలీసులు వచ్చేసరికి వారంతా పరారయ్యారు. బాధితులు గుంటూరు సౌత్‌ జోన్‌ డీఎస్పీ ప్రశాంతితో పాటు స్థానిక పోలీసుల వద్ద తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలు కూడా ఇవ్వమంటున్నారని, మా నోటి వద్ద కూడు లేకుండా చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.   

కొవిడ్ టీకాపైనా రాజకీయం..దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కేంద్రం

హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ "కోవాగ్జిన్" ను దేశ వ్యాప్తంగా ప్రజలకు ఇస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ కోవాగ్జిన్ పై తమకు అనుమానాలు ఉన్నాయని, వేంటనే తమ రాష్ట్రానికి దీని సరఫరాను నిలిపివేయాలని చత్తీస్ గఢ్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇంకా మూడో దశ ట్రయల్స్ పూర్తికాని ఈ వ్యాక్సిన్ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదని, అంతేకాకుండా తమకు అందిన వ్యాక్సిన్ వయల్స్ పై ఎక్స్ పైరీ డేట్ కూడా లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి టీఎస్ సింగ్ దియో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యాక్సిన్ పై ప్రజలలో కూడా అసంతృప్తి ఉందని అయన తెలిపారు. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్.. "అసలు మీ రాష్ట్రం వ్యాక్సిన్ లక్ష్యాన్ని అందుకోవడంలోను, షెడ్యూల్ ప్రకారం ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ను ఇవ్వడంలోను చాలా వెనుకబడివుంది. ఈ విషయాన్ని కేంద్రం గమనిస్తోంది. మీరు ముందు ఆ సంగతి చూడండి" అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. కోవాగ్జిన్ మూడవ దశ ట్రయల్స్ ఫలితాలు ఇంకా బయటకు రాలేదన్న సంగతి తెలిసిందే. అయినా అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతానికి క్లినికల్ ట్రయిల్స్ లో భాగంగానే వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు దీనిని ఇస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సరఫరా చేస్తున్న ఈ వ్యాక్సిన్ సురక్షితమని, మన శరీరంలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంపోందిస్తుందని.. ఈ సందర్భంగా మంత్రి హర్ష వర్ధన్ స్పష్టం చేశారు. మరోపక్క వ్యాక్సిన్ వయల్ పై ఎక్స్ పైరీ డేట్ లేదన్న అనుమానం కూడా వట్టిదేనని దానిపై ఆ తేదీ కూడా ఉందని చెబుతూ, ఒక వ్యాక్సిన్ ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా చత్తీస్ గఢ్ రాష్ట్రంలో తొలి దశలో 69.8 శాతం మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు కేవలం 9.55 శాతం మందికి మాత్రమే మొదటి డోస్ ఇచ్చారని, ఇది అత్యంత అసంతృప్తికరమని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు. వెంటనే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ను ఇస్తే, కేంద్ర ప్రభత్వం కూడా సంతోషిస్తుందని స్పష్టం చేస్తూ హర్షవర్ధన్, చత్తీస్ గఢ్ మంత్రికి ఒక లేఖ కూడా రాశారు.

గ్యాంగ్ రేప్ కేసులో సంచలనాలు!

హైదరాబాద్ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్  నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆటో ఎక్కిన యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు విషయం తెలియకుండా హత్య చేయాలని భావించారని తెలుస్తోంది. అయితే అప్పటికే పోలీసులు వస్తున్న విషయం తెలయడంతో విద్యార్థినిని వదలి పరారయ్యారని చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఓ ముఠా అని, గతంలో మరికొందరిపైనా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలిందని తెలుస్తోంది. కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కాలేజీ బస్సు దిగే బాధిత యువతి.. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలోని ఇంటికి ఆటోలో వెళ్లేది. ఈ క్రమంలో నిందితుడి ఆటోలో పలుమార్లు ఎక్కింది. దీంతో అతడి కన్ను ఆమెపై పడింది. విషయాన్ని తన స్నేహితులైన మిగతా ముగ్గురికి కూడా చెప్పి కిడ్నాప్‌కు పథకం వేశాడు.బుధవారం సాయంత్రం కూడా మామూలుగానే యువతి అతడి ఆటో ఎక్కడంతో కిడ్నాప్‌ పథకం అమలు చేయాలని నిర్ణయించాడు. స్నేహితులకు ఫోన్ చేసి ‘మ్యాటర్ రెడీగా ఉంది’ అని సమాచారం ఇచ్చాడు. బాధితురాలు ఆటో ఎక్కిన తర్వాత అప్పటికే ఉన్న ఇద్దరు మహిళలు, ఓ యువకుడు కొంతదూరం తర్వాత దిగిపోయారు.ఆ తర్వాతి స్టాపులోనే యువతి దిగాల్సి ఉండగా నిందితుడు ఆటోను ఆపకుండా యంనంపేట వైపు వేగంగా పోనిచ్చాడు. దీంతో భయపడిన యువతి తల్లికి ఫోన్ చేసి ఆటో ఆపకుండా ఎటో తీసుకెళ్తున్నాడని, తనకు భయంగా ఉందని చెప్పింది. దీంతో ఆమె బంధువుల సాయంతో సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. మరోవైపు యంనంపేట వద్ద ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కి ఆమెకు చెరోపక్క కూర్చున్నారు. మరో వ్యక్తి ఘట్‌కేసర్ శివారులో వ్యాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆటో అక్కడికి చేరుకోగానే బాధిత యువతిని అందులోకి ఎక్కించి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. అయితే అప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మాయిని ఆటోలో కిడ్నాప్ చేశారని, ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ మైక్‌లో చేస్తున్న అనౌన్స్‌మెంట్ నిందితులకు వినిపించింది. దీంతో దొరికితే ఎన్‌కౌంటర్ చేస్తారని భావించిన నిందితులు యువతిని వ్యాన్ నుంచి కిందికి దించి పక్కనే ఉన్న పొదల్లో పడేసి పరారయ్యారు.సెల్ సిగ్నల్ ఆధారంగా అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  విచారణలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులందరికీ నేరచరిత్ర ఉందని,  కాలేజీ, ఉద్యోగాలకు ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుంటారని పోలీసులు తెలిపారు. ఓ 15 రోజులపాటు వారిని గమనించిన తర్వాత ప్రణాళిక అమలు చేస్తారని వివరించారు. కిడ్నాప్ చేసిన అనంతరం తమకు సహకరిస్తే హాని చేయకుండా వదిలేస్తామని, లేదంటే చంపేస్తామని బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. గతంలో మరో నలుగురు మహిళలపైనా అత్యాచారానికి తెగబడినట్టు నిందితులు అంగీకరించారని తెలుస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యేపై ఎస్ఈసీ సీరియస్ 

ఆంధ్రప్రదేశ్  ఎస్ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్‌ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్‌, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. వైసీపీ కాకుండా వేరే పార్టీ వాళ్లు నామినేషన్లు వేస్తే.. ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామన్న జోగి రమేష్‌ వ్యాఖ్యలపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. జోగి రమేష్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని భావించిన ఎస్ఈసీ... ఆయనపై చర్యలకు ఆదేశించింది.   వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చుక్కల్లో పడ్డారు. వార్డు మెంబర్‎గా పోటీ‌చేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ’ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు‌ చేస్తున్నారని..అయినా..వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం జోగి అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

మా నాన్న రెండు సార్లు సీఎం.. నీలాగా అడ్డగోలుగా సంపాదించలేదు

ఎపి సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఉమ్మడి ఏపీకి రెండు సార్లు సీఎంగా పని చేశారని, అంతేకాకుండా తాను కూడా ఒక సారి కేంద్ర మంత్రిగా పని చేశానని... అయితే తాను ఏనాడూ డబ్బుకు కక్కుర్తి పడలేదని అయన అన్నారు. అదే సమయంలో జగన్ మాత్రం ఆయన తండ్రి వైయస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లకు కోట్లు సంపాదించాడని విమర్శించారు. కర్నూలు జిల్లా కోడుమూరు పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని కోట్ల అన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు బాగుండటమే తమకు కావాలని అయన అన్నారు. ప్రజాసేవ ఒక్కటే తమ లక్ష్యమని అయన తెలిపారు. పేకాట, బెట్టింగులను ప్రోత్సహిస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేసే దమ్ము ఈ పోలీసులకు ఉందా? అని అయన ప్రశ్నించారు.

తెలుగు అందానికి.. అందాల కిరీటం

తెలంగాణ అమ్మాయికి అందాల కిరీటం. హైదరాబాద్ కు చెందిన మానస వారణాసికి మిస్ ఇండియా 2020 టైటిల్. ముంబైలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఫైనల్‌ పోటీలో తన అందం, ప్రతిభతో మానస అందరికంటే ముందు నిలిచారు. హర్యానాకు చెందిన మణికా షియోకాండ్  మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020 కాగా, యూపీకి చెందిన మన్యసింగ్‌ మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌లుగా నిలిచారు. 2021లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పోటీ పడతారు.  మిస్ ఇండియా జ్యూరీ ప్యానెల్‌లో సినీ నటులు నేహా ధూపియా, చిత్రంగడ సింగ్, పుల్కిత్ సామ్రాట్, ప్రఖ్యాత డిజైనర్  ఫాల్గుని, షేన్ పీకాక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మిస్ ఇండియా 2019 సుమన్ రావు మానసకు కిరీటాన్ని బహూకరించారు.  హైదరాబాద్‌కు చెందిన మానస గ్లోబల్ ఇండియన్ స్కూల్లో చదివారు. వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తున్నారు. మానస చిన్నతనంలనో భరతనాట్యం నేర్చుకున్నారు. కాలేజ్ డేస్ లో స్టూడెంట్ గా బ్యూటీ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి పలుమార్లు విజేతగా నిలిచారు. అప్పటి నుంచే ఆమెను అందాల పోటీల మీద, ఫ్యాషన్ రంగంపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత మోడలింగ్ పై ఫోకస్ పెట్టారు. పట్టుదలతో ప్రయత్నించి.. ఇప్పుడు ఏకంగా మిస్ ఇండియాగా నిలిచారు మానస. మానసకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. హెల్త్, ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ట్రెస్ గా ఫీలైతే మ్యూజిక్ వింటారు. 

కేసీఆర్ మీద కేటీఆర్ నారాజ్? 

కేసీఆర్ మీద కేటీఆర్ నారాజ్. అవును, మీరు విన్నది కరెక్టే. తెలంగాణ భవన్ వర్గాలు నమ్మకంగా చెబుతున్న మాట. గులాబీ బాస్ పై.. కాబోయే బాస్ అలగడానికి అనేక కారణాలు ఉన్నాయట. ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేటీఆర్ బ్యాచ్ మీద కేసీఆర్ ఫైర్ అయిన తీరు చూసి యువరాజు అవాక్కయ్యారట. ముఖ్యమంత్రి మార్పు.. త్వరలోనే తారక రాముడికి పట్టాభిషేకం వార్తలపై ప్రగతి భవన్ పెద్దాయన ఒంటి కాలిపై లేవడంతో అంతా కంగుతున్నారు. ఆ మీటింగ్ లో కేసీఆర్ వాడిన భాష, వార్నింగ్ ఇచ్చిన తీరు.. పరోక్షంగా కేటీఆర్ తలదించుకునేలా చేసిందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి మార్పుపై ఎవరైనా మాట్లాడితే బండకేసి కొడతా.. తోలు తీస్తా.. కర్రుకాల్చి వాత పెడతా.. ఇలా పరుష పదజాలంతో కొందరు మంత్రులను, ఎమ్మెల్యేలను తిట్టిపోశారు కేసీఆర్. మరో పదేళ్లు తానే సీఎం అంటూ సూటిగా, ఘాటుగా చెప్పారు.  కేసీఆర్ తిట్లన్నీ డైరెక్ట్ గా కేటీఆర్ అనుచరులకు, ఇన్ డైరెక్ట్ గా కేటీఆర్ కు తగిలాయి. యువరాజు.. రాజు అవుతారంటూ భజన చేసిందంతా కేటీఆర్ బ్యాచే. తలసాని, జీవన్ రెడ్డి, షకీల్, శ్రీనివాస్ గౌడ్ ఇలా అంతా ఆయన అనుచరులే. ఇక, డిప్యూటీ స్పీకర్ పద్మారావు అయితే.. ఓ సభలో కేటీఆర్ సమక్షంలోనే ఆయన్ను కాబోయే సీఎం అంటూ శుభాకాంక్షలు సైతం చెప్పారు. ఆ సమయంలో కేటీఆర్ మౌనంగా ఆయన విషెష్ ను స్వీకరించారే తప్ప.. ఎక్కడా, కొంచెం కూడా పద్మారావును వారించే ప్రయత్నం చేయలేదు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ వాగిన వారందరినీ కేసీఆర్ చెడామడా తిట్టారంటే.. ఆ తిట్లదండకంలో ఎంతో కొంత తనను ఉద్దేశించి కూడా అని కేటీఆర్ తెగ బాధపడుతున్నారట. అందుకే  ఆ రోజు నుంచీ నాన్నతో టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది.  తండ్రీకొడుకుల మధ్య గ్యాప్.. గ్రేటర్ మేయర్ ఎలక్షన్ తో మరోసారి ముదిరిందని చెబుతున్నారు. కేకే కూతురు విజయలక్ష్మీని మేయర్ గా ఎంపిక చేయడం కేసీఆర్ డెసిషన్. ఆ నిర్ణయం కేటీఆర్ కు ఇష్టం లేదని అంటున్నారు. తన ప్రియమైన అనుచరుడు బొంత రామ్మోహన్ సతీమణి శ్రీదేవికి మేయర్ పదవి కట్టబెట్టాలని కేటీఆర్ భావించారట. అయితే.. సీనియర్ లీడర్ కె.కేశవరావుపై గౌరవంతో ఆయన కూతురిని షీల్డ్ కవర్ లో మేయర్ చేశారు గులాబీ బాస్. ఈ  పరిణామాలతో.. కేసీఆర్ పై కేటీఆర్ నారాజ్ అయ్యారట. తండ్రి దగ్గర తన మాట చెల్లుబాటు కావడం లేదని బాగా ఫీలవుతున్నారట. అందుకే గ్రేటర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో కేటీఆర్ డల్ గా కనిపించారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.  పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కేటీఆర్ అసహనంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ భవన్ సమావేశం తర్వాత ఆయన ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సోషల్ మీడియాలోనూ పోస్టులు కనిపించడం లేదు. మొత్తంగా ముఖ్యమంత్రి అవుదామనే ఆశ నెరవేరక.. ఇటు నిర్ణయాల్లో ప్రాధాన్యత దక్కక.. కేటీఆర్  తెగ బాధపడుతున్నారని చెబుతున్నారు. మరి, కల్వకుంట్ల వారి ఇంటి పోరు ముందుముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో... 

ఎంఐఎంకు టీఆర్ఎస్ చెంచాగిరి ! 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. ఇదే ఇప్పుడు తెలంగాణలో కాక రేపుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ టార్గెట్ గా దూకుడుగా వెళుతున్న బీజేపీకి కొత్త అస్త్రం దొరికింది. దీంతో కమలం నేతలు అప్పుడే యాక్షన్ లోకి దిగారు. గులాబీ పార్టీతో పాటు పతంగి పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.  .టీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని  ఆయన ఆరోపించారు. జీహెచ్ఎంసీ‌లో టీఆర్‌ఎస్ స్టీరింగ్ ఎంఐఎమ్ చేతిలో ఉండటం ఖాయమని చెప్పారు.   జీహెచ్ఎంసీ‌ ఎన్నికలో బీజేపీ చెప్పిన విషయం నిజమైందని.. టీఆర్‌ఎస్-ఎంఐఎం  పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటూ  బయటకు మాత్రం తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని బండి ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేయక పోయి ఉంటే టీఆర్‌ఎస్‌కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదన్నారు బండి సంజయ్. టీఆర్‌ఎస్ పక్కా మత తత్వ పార్టీ అయిన ఎంఐఎం చెంచా అని రుజువైందన్నారు.   సిగ్గు లేక ఎన్నికల్లో తాము వేర్వేరు అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నారు. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసిన ఈ రెండు పార్టీలను బజారుకు లాగుతామని సంజయ్ హెచ్చరించారు.  రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్ నీచ రాజకీయాలను సహించారని చెప్పారు. 

జగన్ దూతగా షర్మిలను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే 

తెలంగాణాలో రాజన్న రాజ్యం కోసం కొత్తగా పార్టీ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈరోజు ఆమెను కలిశారు. లోటస్ పాండ్‌లోఈరోజు మధ్యాహ్నం షర్మిలతో అయన భేటీ అయ్యారు. షర్మిలతో భేటీ తరువాత బ్రదర్ అనిల్ కుమార్‌తో కూడా రామకృష్ణారెడ్డి చాలాసేపు మంతనాలు జరిపారు. వైఎస్ జగన్ దూతగా షర్మిలతో మాట్లాడేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారని తెలుస్తోంది . మరోపక్క వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె ఈరోజు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఆమె ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. పోడు భూముల అంశం ముఖ్య అజెండాగా ఖమ్మంలో ఈ సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులతో పాటు గిరిజనులతో షర్మిల సమావేశం కానున్నారు.

గవర్నర్ కు అవమానం.. 

  పాలకులకు భజన చేయకపోతే అవమానాలు తప్పవా.. ప్రభుత్వాలకు ఎదురు మాట్లాడే అర్హత  గవర్నర్ కు ఉండదా.. ప్రభుత్వాలు వాళ్ళు ఏం చేసిన ఆకాశానికి ఎత్తలా.. ప్రభుత్వ పోకడలను ప్రశ్నిస్తే అసౌకర్యాలు అసమ్మతులు తప్పవా.. అంటే అవుననే చెపుతుంది మహారాష్ట్ర గవర్నర్ కు జరిగిన అవమానం..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ,  ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి మధ్య అంతరం మరింత పెరుగుతోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే గత అక్టోబరులో మహారాష్ట్రలో ప్రార్థనాలయాలకు అనుమతి నిచ్చిన నేపథ్యంలో గవర్నర్ విమర్శలు చేశారు. హిందుత్వ ఓట్ల కోసం చూసే ఉద్ధవ్ ఇప్పుడు లౌకికవాదిగా మారినట్టుందని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి మహారాష్ట్ర సీఎంకు, గవర్నర్ కోష్యారీకి మధ్య సంబంధాలు క్షీణించాయి. తాజాగా, గవర్నర్ కు అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. కోష్యారీ డెహ్రాడూన్ వెళ్లేందుకు ముంబయి ఎయిర్ పోర్టుకు చేరుకోగా, ప్రభుత్వ విమానంలో ప్రయాణించేందుకు ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎయిర్ పోర్టుకు వచ్చిన గవర్నర్ విమానంలో ఎక్కేందుకే రెండు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. విమానం ఎక్కిన తర్వాత కూడా పావుగంట సేపు కూర్చున్నారు. అయితే తనకు టేకాఫ్ కు అనుమతి రాలేదంటూ ఫ్లయిట్ కెప్టెన్ చెప్పడంతో గవర్నర్ కోష్యారీ చేసేది లేక ఆ విమానం నుంచి దిగి, మరో విమానంలో టికెట్ బుక్ చేసుకుని డెహ్రాడూన్ పయనం అయ్యారు. దీనిపై గవర్నర్ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ డెహ్రాడూన్ పర్యటనపై వారం కిందటే ప్రభుత్వానికి సమాచారం అందించామని, అయినప్పటికీ అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. గవర్నర్ విమాన ప్రయాణం అంశంపై తన కార్యాలయం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుంటానని వెల్లడించారు. ప్రభుతువులకు భజన 

ఉద్యోగులను ఊరించి.. షాకిచ్చి..! పీఆర్సీ ఇక లేనట్టే..!

ఆశ.. దోశ.. అప్పడం.. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు ఇదే పాట పాడుకుంటున్నారు. వేతన సవరణపై కేసీఆర్ ప్రకటన కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ఉద్యోగులకు.. ఊహించినట్లే  షాక్ తగిలింది. రేపు మాపో పీఆర్సీపై ప్రకటన చేస్తామంటూ సర్కార్ ఊరిస్తుండగానే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రావడంతోనే .. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. దీంతో పీఆర్సీ ప్రకటన అటకెక్కింది. తెలంగాణ ఉద్యోగులను నిరాశలో ముంచింది. కేసీఆర్ సర్కార్ కావాలనే పీఆర్సీ ప్రకటనపై ఆలస్యం చేసిందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు.    పీఆర్సీతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ చాలా కాలంగా తెలంగాణ ఉద్యోగులు పోరాడుతున్నారు. దీంతో ఉద్యోగుల పీఆర్సీపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మే18, 2018న సీఆర్ బిశ్వాల్ చైర్మన్‌గా మహ్మద్ ఆలీ రఫత్, ఉమా మహేశ్వరావులతో కమిషన్ వేసింది. కమిషన్ గడువును ప్రభుత్వం మూడు సార్లు పెంచింది. చివరగా 2020 ఫిబ్రవరిలో కమిషన్ గడువును పెంచింది. సీఎం ఆదేశాల మేరకు ఎట్టకేలకు 31 నెలల తర్వాత 2020 డిసెంబర్ 31న సీఎస్ సోమేశ్ కుమార్‌కు నివేదిక ఇచ్చింది బిశ్వాల్ కమిటి. పీఆర్సీ నివేదికను జనవరి 27న ప్రభుత్వం విడుదల చేసింది.  ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు 7.5 శాతం ఫిట్‌మెంట్ పెంపును కమిటి ప్రతిపాదించింది బిశ్వాల్ కమిటి. కనీస వేతనం రూ.19వేలు,గరిష్ఠ వేతనం రూ.1,62,700గా ఉండాలని సూచించింది. సీపీఎస్ విధానంలో ప్రభుత్వ వాటాను 10 శాతం నుంచి 14శాతం పెంపుకు ప్రతిపాదించింది. హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 24శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదించడం గమనార్హం. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్ల పెంపుకు ప్రతిపాదించింది. పీఆర్సీ కమిటి ప్రతిపాదనలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు.   అయితే పీఆర్సీ కమిటి ఇచ్చిందే ఫైనల్ కాదని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవప్రధానంగానే ఇస్తారని నమ్మకం వ్యక్తం చేసింది. కేసీఆర్ ఆదేశాలతో త్రిసభ్య కమిటీ  పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. సీఎస్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ  గత నెల 27 నుంచి చర్చలు మొదలుపెట్టింది. ఇంతలోనే అన్ని సంఘాలతో చర్చలు జరపాలనే డిమాండ్ వచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలన్నింటితోనూ చర్చలు సాగిస్తామని ప్రకటించింది. తెలంగాణలో దాదాపు 150కిపైగా ఉద్యోగ సంఘాలున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల డిమాండ్లనే సాకుగా చూపి ఫిట్మెంట్ నిర్ణయం ఆలస్యం చేసే ఆలోచనతోనే.. సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వచ్చాయి.  ఉద్యోగులు భయపడుతున్నట్లుగానే జరిగింది. సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతుండగానే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో ఎన్నికలు ముగిసేవరకు పీఆర్సీ ప్రకటన లేనట్టే. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే నాగార్జున సాగర్ అసెంబ్లీ  ఉప ఎన్నికకు షెడ్యూల్ రావచ్చని చెబుతున్నారు. అదే జరిగితే పీఆర్సీ ప్రకటనకు మరి కొంత సమయం ఆలస్యం కానుంది.  జనవరి నుంచి పీఆర్సీ ప్రకటన కోసం అశగా ఎదురుచూసిన ఉద్యోగులు ఇప్పుడు భగ్గుమంటున్నారు.  పీఆర్సీ ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, ఈ ప్రభావం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై భారీగానే ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేయబోతున్న అధికార పార్టీ అభ్యర్థులు కూడా కలవరపుడుతున్నారని చెబుతున్నారు.

టీడీపీ, వైసీపీ దోస్త్ మేరా దోస్తు..

  ఏపీ పంచాయితీ ఎన్నికల వైసీపీ అధికార దుర్వినియోగం చేస్తుందని.. అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తుందన్న లేదు టీడీపీ నాయకులే మాపై దాడులు చేస్తున్నారని ఇరు పక్షాలు కత్తులు దూసుకుంటున్న విషయం తెలిసిందే.. మరికొన్ని చోట్ల అయితే ఏకంగా దాడులకు పాల్పడ్డారు ఇరువర్గాల నాయకులు ,కార్యకర్తలు..టీడీపీ, వైసీపీ  మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. గ్రామాలలో సైతం ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని కొన్ని చోట్ల వైరి వర్గీయులు శత్రుత్వాలకు ముగింపు పలుకుతూ...అభివృద్ధి అంటే విడి విడిగా చీలి కొట్టుకోవడం, చంపుకోవడం కాదు.. అందరూ ఒక్కటై సమస్యను పరిష్కరించుకోవం అనుకుంటున్నారు ఆ గ్రామ ప్రజలు. ఉన్న ఊరు వాళ్ళ మధ్య గొడవలు ఉంటే వూరి అభివృద్ధి ఎలా అనుకున్నారు..అందుకే  పార్టీ పంథాలను వీడి ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటున్నారు. ఇరుపక్షాల నాయకులు ఒప్పందానికి వచ్చారు. ఈ ఘటనే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పంచాయతీలో చోటు చేసుకుంది. ప్రత్తిపాడు పంచాయతీ సర్పంచ్ పదవిని వైసీపీ, టీడీపీలు పంచుకున్నాయి. మూడేళ్ల పాటు వైసీపీ మద్దతుదారుడు, రెండేళ్ల పాటు టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ గా ఉండేలా ఒప్పంద పత్రాలపై నేతలు సంతకం చేశారు. ఇది సాక్షాత్తు హోంమంత్రి సుచరిత  నియోజకవర్గం కావడంతో... ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ, ప్రజలు ఈ ఒప్పందాన్ని హర్షిస్తున్నారు. ఇలాంటి వాటివల్ల గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయని చెపుతున్నారు.  

టీడీపీకి బై..  వైసీపీకి సై..

ఏపీ పంచాయతీ పంచాయితీ ఎన్నికల్లో గెలిచినా అభ్యర్థులు ఉన్న పార్టీలను  విడిచి పక్క పార్టీలో చేరుతున్నారు .. బహుశా గ్రామా అభివృద్ధి అప్పుడే మొదలు పెట్టినట్లుఉన్నారు అభ్యర్థులు.. ఓ పార్టీ మద్దతుతో గెలిచిన నేతలు.. మరో పార్టీకి మారుతూ తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారు అభ్యర్థులు. లీడర్ల కంటే మేము ఏం తక్కువ కామంటున్నారు గెలిచిన అభ్యర్థులు.. అంతేలెండి ఆవు చేలో మేస్తే, దూడ మాత్రం గట్టున మేస్తుందా.. నేతలు పార్టీ మారితే కానీ తప్పు మేము మారితే అవుతుందా అనుకుంటున్నారు కాబోలు..     ఇది ఇలా ఉండగా చిత్తూర్ జిల్లా బంగారుపాళ్యం నియోజక వర్గంలోని బొమ్మాయిపల్లెలో టీడీపీ మద్దతుతో గౌరమ్మ అనే అభ్యర్థి గెలిచారు. రాత్రికి రాత్రే ఆమె టీడీపీ పార్టీ కండువా వదిలి, వైఎస్ఆర్సీపీ నేత కుమార్ రాజా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొన్నారు. అలాగే చిత్తూరు మండలంలోని చింతలకుంట పంచాయతీలో గెలిచిన గీతాంజలి కూడా వైఎస్ఆర్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆమె కూడా టీడీపీ మద్దతుతోనే గెలిచారు. పూతలపట్టు మండలానికి చెందిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులూ వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో చాలా చోట్ల అధికార పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద ఎక్కువైంది. చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు గెలవడంతో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. వైఎస్ ఆర్సీపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీలోకి లాక్కుంటోందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.

గులాబీదే గ్రేటర్ పీఠం.. కమలానికి మరో అస్త్రం!  

అనుకున్నట్టే అయింది. బీజేపీ అన్నట్టే జరిగింది. ఎమ్.ఐ.ఎమ్. సపోర్ట్ తోనే గ్రేటర్ పై గులాబీ జెండా ఎగిరింది. మేయర్ గా గద్వాల విజయలక్ష్మీ ఎన్నికయ్యారు. ఈ రసవత్తర పోరులో నిజంగా గెలిచిందెవరు? రాజకీయంగా లబ్ది పొందింది ఇంకెవరు? అనేది ఆసక్తికరం. అధికార పార్టీకి పదవైతే దక్కింది కానీ.. పొలిటికల్ గా పరువు పోయినంత పనైంది.  ఎమ్.ఐ.ఎమ్. తో తమకెలాంటి సంబంధం లేదంటూ.. అది కూడా తమ ప్రత్యర్థి పార్టీనేనంటూ.. గ్రేటర్  ఎలక్షన్ సమయంలో నాటకాలాడిన టీఆర్ఎస్.. ఇప్పుడదే పతంగి పార్టీ మద్దతుతో విజయపతాకం ఎగరవేయడం దిగజారుడు తనమేనంటున్నాయి ప్రతిపక్షాలు. టీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ లది అక్రమ సంబంధమని.. ఆ రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటాయంటూ కమలనాథులు విమర్శలు గుప్పిస్తున్నారు. జీహెచ్ఎమ్సీలో కారు పార్టీ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంటుందంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భగ్గుమన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ కలిసి ప్రజలను మోసం చేశాయని.. ఇద్దరు దొంగల చేతిలో మేయర్ పీఠమంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.  మేయర్ పీఠం పోయినా.. గ్రేటర్ పోరులో బీజేపీదే రాజకీయ విజయం. 48 మంది కార్పొరేటర్లతో కమలదండు గులాబీదళాన్ని దడదడలాడించింది. ఆ విజయోత్సాహంతో తెలంగాణ వ్యాప్తంగా దండయాత్రకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో జీహెచ్ఎమ్సీ మేయర్ ఎన్నిక జరగడం.. టీఆర్ఎస్ కు ఎమ్ఐఎమ్ మద్దతు ఇవ్వడం.. కమలనాథులకు అనుకోని వరంగా మారింది. బయటకు ఎన్ని మాటలు అనుకున్నా.. ఆ రెండు పార్టీల మధ్య దోస్తీ ఉందని బీజేపీ మొదటి నుంచీ చెబుతూనే ఉంది. ఆ విషయం మేయర్ ఎలక్షన్ లో బట్టబయలైంది. మజ్లిస్ పార్టీని ఓటింగ్ కు గౌర్హాజరు చేయించే అవకాశం ఉన్నా.. టీఆర్ఎస్ ఆ స్ట్రాటజీని అమలు చేయలేదు. బహిరంగంగానే ఆ పార్టీ సపోర్ట్ తీసుకొని రాజకీయంగా సాహసమే చేసిందని చెబుతున్నారు. ఎందుకంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కారు, పతంగి చెట్టాపట్టాలు వేసుకొని కనిపించడం అధికార పార్టీకి ఏమంత లాభదాయకం కాదనేది విశ్లేషకుల మాట.  ఎమ్.ఐ.ఎమ్. ను బూచీగా చూపించి తెలంగాణ వ్యాప్తంగా హిందువుల ఓట్లను ఏకీక్రుతం చేస్తోంది బీజేపీ. ఓటర్లు సైతం కాషాయ పార్టీని బాగానే ఆదరిస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్ లో సంచలన విజయాలే సాధించింది. ఇక, నాగార్జున సాగర్ లోనూ సత్తా చాటేందుకు సై అంటోంది. పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకేనంటూ ఇప్పటికే ప్రచారం నడుస్తోంది. త్వరలో జరగబోవు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాషాయ జెండా ఎగరేసేలా కాక మీదుంది కమలం పార్టీ. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ మైత్రిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఓట్లు దండుకోవడం ఖాయం.   ఓ వైపు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణ పేరుతో తెలంగాణలో ప్రతీ ఇంటినీ తడుతోంది బీజేపీ. అటు.. హిందుత్వ ఎజెండా.. ఇటు యాంటీ ముస్లిం స్ట్రాటజీతో గులాబీ దళంపై డబుల్ బ్యారెల్ గన్ ఎక్కుపెట్టింది. దూకుడు మీదున్న కమలనాథులకు మరింత బలం చేకూర్చేలా.. గ్రేటర్ లో ఎమ్.ఐ.ఎమ్ మద్దతు తీసుకొని అధికార పార్టీ పెద్ద తప్పిదమే చేసిందంటున్నారు. మేయర్ ఎన్నిక ముగిసిన వెంటనే బండి సంజయ్, రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. టీఆర్ఎస్, మజ్లిస్ ల మైత్రిని తెలంగాణ ప్రజల ముందుంచి.. కేసీఆర్ ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాడనే ముద్ర వేసి.. ఆ మేరకు రాజకీయంగా బీజేపీ మరింత బలపడటం ఖాయమని లెక్కలేస్తున్నారు. ఆ అవకాశాన్ని చేజేతులారా టీఆర్ఎసే కమలనాథులకు అందించిందని అంటున్నారు. మరి, పొలిటికల్ మాస్టర్ మైండ్ అని పేరున్న కేసీఆర్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా..?

సర్పంచ్ పోరులో భార్య భర్తలు? కృష్ణా జిల్లాలో ఆసక్తికర సమరం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో  చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులే పోటీ పడుతున్నారు. అన్నా  తమ్ముళ్లు , తోడికోడళ్లు, అత్తా కోడళ్లు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్లు కూడా కొన్ని పంచాయతీ హోరాహోరీగా పోరాడుతున్నారు. కృష్ణా జిల్లాలో భార్యభర్తలే పోటీ చేస్తుండటం ఆసక్తిగా మారింది.  ముదినేపల్లి మండలంలో అల్లూరు పంచాయతీ ఎన్నికలో భార్యాభర్తలు రంగంలో ఉన్నారు. స్తానిక సోమేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్ పర్సన్ రెడ్డి రాధిక, ఆమె భర్త రెడ్డి విఠల్ ఎన్నికల బరిలో ఉన్నారు.  గ్రామంలోని శివాలయాన్ని రెడ్డి రాధిక అభివృద్ధి చేశారు. దాదాపు మూడున్నర లక్షల రూపాయల సొంత ఖర్చుతో ఆలయంలో ఇనుప గ్రిల్స్ ను ఏర్పాటుచేయించారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో రెడ్డి రాధిక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెతోపాటు డమ్మీ అభ్యర్థిగా ఆమె భర్త రెడ్డి విఠల్ నామినేషన్ వేశారు. అయితే అనివార్య కారణాల వల్ల రెడ్డి విఠల్ తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోలేకపోయారు. దీంతో భార్యాభర్తలిద్దరూ బరిలో ఉన్నట్టయింది. భార్య రెడ్డి రాధికకు ఉంగరం గుర్తును కేటాయించగా, భర్త రెడ్డి విఠల్ కు బుట్ట గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు.  ఈ భార్యభర్తలతో పాటు అలూరు గ్రామంలో మొత్తం అయిదుగురు అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నట్టయింది. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం ఇద్దరు భార్యాభర్తలు ఉంగరం గుర్తుకు ఓటేయమనే కోరుతున్నారు. అయితే  వారు కోరుతున్నట్టు భార్యకు మాత్రమే ఓటేస్తారో లేక పొరపాటున భర్తకు కూడా ఓటేస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.