నేను మూర్ఖుడ్ని.. తేడా వచ్చిందో..! ఓటర్లకు వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
posted on Feb 7, 2021 @ 11:26AM
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. తమ అభ్యర్థులకు పోటీకి ఇతరులెవరు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. అయినా కొందరు ధైర్యం చేసి పోటీలో నిలిచారు. ఇలా పోటీలో ఉన్నవారిని బెదిరిస్తున్నారు. విశాఖ జిల్లా ఎలమంచలి నియోజకవర్గంలో తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రచారం హోరాహోరీ సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు నామినేషన్ల సమయంలోనూ చాలా మందిని భయపెట్టాలని చూశారు. తమ అభ్యర్థికి పోటీగా చేసిన ఓ వ్యక్తిని బెదిరించిన ఆడియాలో లీకై వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఆయనపై కేసు కూడా నమోదైంది. శనివారం ఆయన్ను అరెస్టు చేసిన రాంబల్లి పోలీసులు.. స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.
బెదిరింపుల కేసులో తనపై కేసు నమోదైన ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు ఏకంగా ఓటర్లనే టార్గెట్ చేశారు. రాంబిల్లి మండలం రాజకోడూరు పంచాయతీ ఎన్నికల ప్రచార సభలో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు గ్రామస్థులకు హెచ్చరిక జారీ చేశారు. ‘సర్పంచ్గా వైసీపీ అభ్యర్థిని గెలిపించాల్సిందే. మీకందరికీ క్లియర్గా చెబుతున్నా...తేడా వస్తే మీ ఊరికి రోడ్లు, కొళాయిలు, పైప్లైన్లు ఏమీ ఉండవు. నిర్మాణంలో వున్న సచివాలయం పనులు నిలిచిపోతాయి. నేను ఎంత మంచివాడ్నో, అంత మూర్ఖుడ్ని...సీఎం తర్వాత నియోజకవర్గంలో ఎవరికీ ఏది ఇవ్వాలన్నా నేనే. పనుల కోసం, పథకాల కోసం నా చుట్టూ ఊరు ఊరంతా కాళ్లరిగేలా తిరిగినా ఫలితం ఉండదు. గెలిచినా, ఓడినా ఐదేళ్లు సర్పంచ్ మా వాడే. అవతలి వ్యక్తి గెలిచినా కూర్చోవడానికి కుర్చీ కూడా ఉండదు. నేలపైనే కూర్చోవాల్సి ఉంటుంది. దేవుడు చెప్పినా వినను అంటూ తీవ్ర స్థాయిలో ఓటర్లను బెదిరించారు.
అంతేకాదు టీడీపీకి చెందిన ఆంజనేయరెడ్డి, శంకరరావులకు నరకం అంటే ఎలా వుంటుందో చూపిస్తానని కూడా చెప్పారు ఎమ్మెల్యే కన్నబాబు రాజు. ‘అందరికీ ప్రభుత్వ పట్టాలు అందేశాయి అనుకుంటున్నారేమో....తేడా చేస్తే తర్వాత రావాల్సినవేవీ అందవు’ అంటూ హెచ్చరించారు. గత ఎన్నికల్లో పంచకర్ల రమేష్బాబు, పప్పల చలపతిరావు, బొడ్డేడ ప్రసాద్...ఇలా ఎందరు కలిసినా తన వెంట్రుక పీకలేకపోయారని, దీనిని గుర్తుపెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో ఓటేయకపోతే తర్వాత మీ ఇష్టమంటూ ప్రసంగాన్ని ముగించారు ఎలమంచలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు. ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.