తెలంగాణ మంత్రి సమైక్య రాష్ట్ర గళం 

తెలంగాణలో కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన తర్వాత కొత్త కొత్త వాదనలు, ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో వినిపించిన వాదాలు కూడా మళ్లీ  చర్చగా మారాయి. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తుందంటూ లోక్ సభలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటన ప్రకంపనలు స్పష్టిస్తోంది. అసద్ వ్యాఖ్యలపై వివిధ పార్టీల నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు. హైద్రాబాద్ జోలికి వస్తే ఊరుకునేది లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఆ వివాదం కొనసాగుతుండగానే తెలంగాణ మంత్రి  గంగుల కమలాకర్ మరో బాంబ్ పేల్చారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన గంగుల...  వైఎస్ షర్మిల పార్టీపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న బాణం షర్మిల వస్తోందని..  తర్వాత మెల్లగా జగన్ వస్తాడని చెప్పారు. జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని గంగుల కామెంట్ చేశారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని, కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని, లేకపోతే సమైక్య రాష్ట్రం అవుతుందని గంగుల హెచ్చరించారు. ఆంధ్రా నేతలు కరెంటు, నీళ్లు ఎత్తుకుపోతారని, తెలంగాణకు కేసీఆరే రక్షకుడని గంగుల హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ మంత్రి నోట మళ్లీ సమైక్య రాష్ట్రం నినాదం వినిపించడం ఇప్పుడు చర్చగా మారింది. 

ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో సంచలనం! 

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై  ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ వేసి స్క్రూట్నీలో ఆమోదం పొందిన అభ్యర్థులు ఎవరివైన బలవంతంగా విత్ డ్రా అయితే వారు ఆర్వోకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్ఈసీ సూచించింది. అటువంటి దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా ఆర్వోలకు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అటువంటి నామినేషన్లను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులుగా ప్రకటించాలని ఆదేశించింది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తన ఉత్తర్వుల్లో ఎస్‌ఈసీ పేర్కొంది. పలు రాజకీయపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను సోమవారం ప్రకటించింది ఎన్నికల సంఘం.  మార్చి 10న 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగునుంది. గత మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై... కరోనా కారణంగా నిలిచిపోయింది.  గతంలో ఆగిపోయిన దగ్గర నుంచే మళ్లీ ఎన్నికల ప్రక్రియను  కొన‌సాగుతుందని ఎస్ఈసీ ప్రకటించింది. అయితే ఎస్ఈసీ నిర్ణయంపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. గత మార్చిలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, తమ అభ్యర్థులను బెదిరించి పోటీ నుంచి విత్ డ్రా చేయించిందని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపించాయి. మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ కొత్త షెడ్యూల్ ఇచ్చి... మొదటి నుంచి నిర్వహించాలని కోరాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం విపక్షాలకు కొంత ఊరట ఇస్తుందనే అభిప్రాయం వస్తోంది.  

ఓట్ల లెక్కింపును వీడియో తీయాల్సిందే! ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒక్క ఓటర్ కోరినా ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వాన్ని మొత్తం వీడియో తీయాల్సిందేనని స్పష్టం చేసింది. వీడియో చిత్రీకరణ చేయాలన్న పిటిషన్‌పై మంగళవారం విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటుచేసుకోకుండా ఆ ప్రక్రియను వీడియో తీయాలంటూ ఇటీవల ఎస్ఈసీ ఆదేశాలు ఇవ్వగా, ఆ ఆదేశాలు అమలు జరిగేలా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టెక్నాలజీ షాకులు చెప్పొద్దని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.  కృష్ణా జిల్లాకు చెందిన శ్రీపతి నాంచారయ్య, గుంటూరు జిల్లాకు చెందిన ప్రతాప్ నాయక్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు సోమవారం  విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వీడియోగ్రఫీ విషయంలో ఎస్ఈసీ ఆదేశాలు అమలు కావడంలేదని, కనీసం మూడు, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనైనా ఓట్ల లెక్కింపును వీడియో తీసేలా ఆదేశించాలని కోరారు. ఈ విచారణలో ఎస్ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. వీడియో తీసే అంశంలో ఈ నెల 13న ఇచ్చిన ఉత్తర్వులకు రెండ్రోజుల తర్వాత సవరణ ఉత్తర్వులు కూడా జారీ చేశామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు  ఉండడంతో అక్కడ పూర్తిగా సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యం కాదని కోర్టుకు వివరించారు. దాంతో జస్టిస్ సోమయాజులు ధర్మాసనం స్పందిస్తూ, సున్నితమైన, అత్యంత సున్నితమైన ప్రాంతాలను ఎలా వర్గీకరిస్తారంటూ ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని ప్రశ్నించింది. తగిన వివరాలు అందించాలంటూ ఈ కేసును మంగళవారానికి  వాయిదా వేసింది. దీనిపై హైకోర్టు తీర్పునిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఏ ఒక్క ఓటరు కోరినా, ఆ మేరకు వీడియో చిత్రీకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. టెక్నాలజీ సాకులు చెప్పొద్దని హితవు పలికింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వీడియో తీయాలంటూ ఈ నెల 13న ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని ఆదేశించింది. అదే సమయంలో, ఎన్నికలు పక్షపాతానికి తావులేకుండా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీదేనని పేర్కొంది. 

పుదుచ్చేరి ప్రభుత్వానికి గండం? 

రాష్ట్రం ఏదైనా, అది కేంద్ర పాలిత ప్రాంతమే అయినా రాజకీయం మాత్రం ఒకటిగానే ఉంటుంది.ఫిరాయింపులు ఎక్కడైనా ఒక్కలానే జరుగ్తుఅయి. ఇందుకు తాజా ఉదాహరణ పుదుచ్చేరి. కొద్ది కాలం క్రితం మధ్య ప్రదేశ్’లో అంతకు ముందు మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఫిరాయింపుల ప్రభావంతో ప్రభుత్వాలు కూలిపోవడం చూశాం. ఇప్పుడు మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరిలో అదే పరిస్థితి తలెత్తింది. బొటాబొటి మెజారిటీతో ఇంతకాలం ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన ముఖ్యమంత్రి నారాయణ స్వామి  ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో పడింది.  పుదుచ్చేరి శాసన సభలో ముగ్గురు నామినేటెడ్ సభ్యులతో కలిపి మొత్తం సభ్యుల సంఖ్య 33. ఐదు సంవత్సరాల క్రితం 2016లో 30 స్థానాలకు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలుచుకుంది. మరో ఇద్దరు డీఎంకే సభ్యుల మద్దతుతో నారాయణ స్వామి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.అయితే ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో, కేవలం పది రోజుల వ్యవధిలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.  ఇదిలా ఉంటే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ఉద్దేశించిన రాహుల్ గాంధీ పర్యటనకు ఒక రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత నెల 25న నమశివాయం, తీప్పయింజన్‌ అనే ఇద్దరు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సోమవారం ఒకరు, మంగళవారం మరొకరు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం 15 నుంచి 11కు పడిపోయింది.  ఎమ్మెల్యేల ఫిరాయింపులతో అప్రమత్తమైన ముఖ్యమత్రి నారాయణ స్వామి.. హడావుడిగా మంత్రి వర్గ సమావేం ఏర్పాటు చేశారు. అసెంబ్లీని  రద్దుచేసి  ముదస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో నారాయణ స్వామిఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడి సహకరిస్తారా లేక కేంద్ర పాలనకు సిఫార్సు చేస్తారా అనేది కీలకంగా మారనుంది. 

హిట్లర్ పద్దతులను ఫాలో అవుతున్నారు..ఇలాగైతే కష్టమే...

అయోధ్యలో శ్రీ రాముడి మందిరం నిర్మాణం కోసం ఒకపక్క భక్తులు స్వచ్చందంగా విరాళాలు ఇస్తుండగా .. మరోపక్క ఈ విరాళాల సేకరణ కోసం కొందరు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా కర్ణాటకలో రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వని ఇళ్లకు మార్క్ పెడుతున్నారని అక్కడి యడియూరప్ప సర్కార్‍‌పై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అయన ఆర్ఎస్‌ఎస్, బీజేపీల‌ను జర్మనీలోని నాజీలతో పోల్చారు. ఈ వ్యవహారంపై తాజాగా ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై వరుస ట్వీట్లలో తీవ్రంగా మండి పడ్డారు. కుమారస్వామి తన తాజా ట్వీట్లలో "హిట్లర్ పాలనలో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అనుసరించిన విధానమే ఇప్పుడు కర్ణాటకలో అనుసరిస్తున్నారు. రామాలయానికి విరాళాల సేకరిస్తున్న వారు.. ఇళ్ల వద్ద వేరువేరుగా మార్కింగ్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదని గుర్తించేందుకే ఈ మార్కింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది" అని ఒక ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ దేశంలో ఏ ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే పరిస్థితి కనిపించడం లేదని.. ఒకవేళ ప్రభుత్వ అభిప్రాయాలను మీడియా కూడా సమర్ధిస్తూ పోతే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో, సామాన్యుడి పరిస్థితి ఏమి కానుందో కూడా ఊహించడం కష్టమని" అయన వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ నేత‌లంతా క‌లిసి రామ మందిర నిర్మాణానికి విరాళం ఇవ్వ‌ని వారంద‌రి ఇంటిని ప్ర‌త్యేకంగా మార్క్ చేస్తున్నార‌ని అయన అన్నారు. అసలు ఇలాంటి మార్కింగ్‌ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని కుమారస్వామి పేర్కొన్నారు. జర్మనీలో నాజీలు ఏం చేశారో ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు అదే చేస్తోందని విమర్శించారు. జర్మనీలో నాజీ పార్టీ ఏర్పాటు చేసినప్పుడే ఆర్ఎస్ఎస్ పుట్టిందని, ప్రజలు ఎవ్వరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేని అప్రకటిత ఎమర్జెన్సీ ప్రస్తుతం దేశంలో ఉందని ఆరోపించారు.దీనిపై దేశం మొత్తం చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఉద్యమ పార్టీ నుంచి ఎన్నికలల పార్టీగా..! టీఆర్ఎస్ 20 ఏండ్ల ప్రస్థానం 

తెలంగాణ రాష్ట్ర సమితి  మరో రెండు నెలలలో 20 నిండి 21లోకి అడుగుపెడుతోంది. ఒక రాజకీయ పార్టీ చరిత్రలో రెండు దశాబ్దాలు తక్కువ కాలం కాదు. అందులోను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఉద్యమ పార్టీగా అవతరించిన పార్టీ ఇంతలోనే లక్ష్యాన్ని చేరుకొని, కొత్తగా ఏర్పడిన  తెలంగాణ రాష్ట్ర అధికార పగ్గాలను చేపట్టడం మాములు విషయం కాదు.అదొక అసాధరణ విజయం.  టీడీపీ స్థాపించి సంవత్సరం తిరగకుండా అధికారంలోకి వచ్చిన ఎన్టీఅర్’ది ఓ చారిత్రక విజయం అయితే  కొంత ఎక్కువ సమయం తీసుకున్నా ఏకంగా రాష్ట్రాన్ని సాధించి, కొత్త రాష్ట్రంలో వరుసగా రెండవసారి అధికార పగ్గాలను చేపట్టిన కల్వకుట్ల చంద్రశేఖర రావు అనే కేసీఆర్ సాధించిన విజయం నిస్సందేహంగా అంతకు మించిన చారిత్రక విజయం.   2001 ఏప్రిల్  27 న కొండా లక్ష్మణ బాపూజీ ఆశీస్సులతో జలదృశ్యంలో పురుడు పోసుకున్న తెరాసకు ఇప్పటి టీఆర్ఎస్ ఒకటేనా అంటే, కాదు.స్వాతంత్ర పోరాటానికి సారధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకి అనంతరం సుదీర్ఘ కాలంపాటు దేశాన్ని పాలించిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యత్యాసం ఉందో, అంతే వ్యత్యాసం ఉంది.దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే మహాత్మా గాంధీ కాంగ్రెస్’ను రద్దు చేయమని సూచించారు.ఇతర నాయకులు గాంధీ ప్రతిపాదనని పక్కన పెట్టారు. తెలంగాణ బాపూజీ కొండలక్ష్మణ్ బాపూజీ అలాంటి ప్రతిపాదన చేయలేదు గానీ, కేసీఆర్ పార్టీని రద్దు చేయక పోయినా పార్టీ స్వరూప,స్వభావాలను మాత్రం మార్చి వేశారు.ఎన్నికలల పార్టీగ  మార్చి వేశారు. కుటుంబ పార్టీగా తీర్చి దిద్దారు.   నిజానికి  ఎంతమందికి గుర్తుందో ఏమో గానీ, 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన, తెరాస అధికారంలోకి వచ్చిన సందర్భంలో, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని హోదాలో కేసీఆర్, ఉద్యమ పార్టీ అధ్యాయం ముగిసిందని ప్రకటించారు. ఇక పై తెరాస ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా వ్యవవహరిస్తుందని స్పష్టం చేశారు. గడచిన ఆరేడేళ్ళలో తెరాస  మరో అడుగు ముందుకేసింది, ఫక్తు పదహారణాల కుటుంబ పార్టీగా రూపాంతరం చెందిందని, ఉద్యమ పార్టీలో కీలక పాత్రను పోషించిన నాయకులు ఆరోపిస్తున్నారు.  ఉద్యమ పార్టీ నేతగా, పదవులు ఆశించను, రాష్ట్రానికి కావలి కుక్కలా ఉంటా ... దళితుని ముఖ్యమంత్రి చేస్తా... అని ప్రకటించిన కేసీఆర్, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఒట్టుతీసి గట్టున పెట్టారు. ముఖ్యమంత్రి గద్దె నెక్కారు. అంతే కాదు వారసుని సిద్ధం చేశారు. కొడుకు కేటీఅర్’కు పార్టీ పగ్గాలు అప్పగించారు. కేటీఆర్ పట్టాభిషేకానికి కూడా సర్వం సిద్దమైంది. అయితే, ముహూర్తబలం సరిగా లేకనో ఏమో, కథ కాస్త అడ్డం తిరిగింది.  కానీ ఈ రోజు కాకపోతే రేపు కేసీఆర్ వారసుడు కేటీఆరే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదు. అయితే అది ఎప్పుడు అన్నదే  ప్రస్తుతానికి ప్రశ్న. అలాగే మరో రెండు నెలలలో జరిగే తెరాస ద్విశతాబ్ది ఉత్సవాలలో అయినా వారసుని పట్టాభిషేకం ఉంటుందా ...ఈ లోగా ఇంకాఏమైనా జరుగుతుందా ... కుటుంబ పార్టీలోంచి సామాజిక తెలంగాణ నినాదంతో మరో ఉద్యమ పార్టీ పుట్టుకొస్తుందా? ఇవ్వన్నీ కూడా ప్రస్తుతానికి ఎన్నో కొన్ని డాలర్ల ప్రశ్నలనే అంటున్నారు, విజ్ఞులు,విశ్లేషకులు.

మంత్రిపై డాక్టర్ షాకింగ్ కామెంట్స్ !

అతనో సీనియర్ డాక్టర్. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరిండెంట్ గా పని చేస్తున్నారు. సడెన్ గా ఆ డాక్టరును బదిలీ చేశారు. డిప్యూటేషన్ పై మరో ప్రాంతానికి పంపించారు. తనను బదిలీ చేశారన్న విషయం తెలిసి ఆ సూపరిండెంట్  షాకయ్యారు. 16 నెలల్లో రిటైర్ కాబోతున్న తనను.. కక్ష పూరితంగానే ట్రాన్స్ ఫర్ చేశారంటూ  ఆవేదన వ్యక్తం చేశారు,  ఏకంగా మంత్రినే టార్గెట్ చేశారు. తన బంధువుకు పోస్టింగ్ ఇవ్వడం కోసం తనను .. అకారణంగా బదిలీ చేయించారంటూ మంత్రిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.    మహబూబా బాద్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ భీమ్ సాగర్ బదిలీ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. తనను బదిలీ చేయడం పట్ల డాక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌పై డాక్టర్ ఆరోపణలు గుప్పించారు. మంత్రి సత్యవతి రాథోడ్ తనను టార్గెట్ చేసి మానసికంగా వేధించారని..కావాలనే తనను హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించారని విరుచుకుపడ్డారు. ఇక్కడ వైద్యుడిగా పనిచేసే మంత్రి కుమారుడు నెలలో  వారం రోజుల మాత్రమే డ్యూటీకి వస్తాడని తెలిపారు. నెల రోజుల జీతం ఇవ్వాలని అధికారులపై వత్తిడి తెస్తాడన్నారు. అలా ఇవ్వకపోవడంతోనే తనను టార్గెట్ చేశారని డాక్టర్ భీమ్ సాగర్  ఆరోపించారు.  ఏ తప్పు చేయకున్నా తనను అకారణంగా శిక్షించారన్నారు డాక్టర్ భీమ్ సాగర్ .  సీబీఐ, సీబీసీఐడీ విచారణకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.జిల్లా హాస్పిటల్ సూపరిండెంట్ బదిలీయే రాజకీయ వివాదంగా మారగా.. ఆయన చేసిన కామెంట్లు మరింత కలకలం రేపుతున్నాయి. అంతేకాదు మంత్రిని టార్గెట్ చేసిన డాక్టర్ భీమ్ సాగర్.. టీఆర్ఎస్ పార్టీకే చెందిన మాజీ మంత్రి రెడ్యా నాయక్ , ఎంపీ మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనకు సహకరించారని చెప్పారు. దీంతో సూపరిండెంట్ బదిలీ వ్యవహారం టీఆర్ఎస్ లోనూ రచ్చ రాజేసే సూచనలు కనిపిస్తున్నాయి. 

డ్యూటీలోనే కానిస్టేబుళ్ల మందు పార్టీ!  

ఫ్రెండ్లీ పోలీస్.. ఇది తెలంగాణ పోలీసుల నినాదం. ఈ విధానం గురించే దేశ వ్యాప్తంగా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది కేసీఆర్ సర్కార్. అయితే  కొందరు హైదరాబాద్ పోలీసులు మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పాటు పార్టీ పోలీసింగ్ కూడా చేస్తున్నారు. తమ కార్యాలయాన్నే  ఓపెన్ బార్ గా మార్చేశారు. విధులను పక్కన పెట్టి దర్జాగా మందు కొట్టారు. షాడో పోలీస్ దీన్ని చిత్రీకరించడంతో వాళ్ల మందు బండారం బయటపడింది.  నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు.. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారు డ్యూటీలో ఉండగానే మందు పార్టీ చేసుకున్నారు.  ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే ఫుల్లుగా మందు కొట్టారు. ఈ ఘటననంతా షాడో పోలీస్ రికార్డ్ చేశారు. అయితే ఆ షాడో పోలీస్‌పై మద్యం సేవించిన ముగ్గురు కానిస్టేబుళ్లు దాడికి పాల్పడ్డారు. ఎస్బీ రిపోర్ట్ ఆధారంగా ముగ్గురు కానిస్టేబుళ్లను సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. కానిస్టేబుళ్ల వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.

కేసీఆర్ ఆంధ్రా బిడ్డ.. షర్మిల  తెలంగాణ బిడ్డ! టీకాంగ్రెస్ నేత సంచలనం  

వైఎస్ షర్మిల కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. కొత్త పార్టీ కోసం  షర్మిల చకచకా ఏర్పాట్లు చేసుకుంటుండగా.. ఆమెకు మద్దతు కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న నాయకులు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత మాగం రంగారెడ్డి లోటస్ పాండ్ వెళ్లి షర్మిలతో సమావేశమయ్యారు. అంతేకాదు షర్మిలతో సమావేశం తర్వాత హాట్ కామెంట్స్ చేశారు మాగం రంగారెడ్డి.  వైఎస్ షర్మిల తెలంగాణ బిడ్డ అని.. ఇదే గడ్డమీద జన్మించింది అన్నారు మాగం. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ బిడ్డకాదని చెప్పారు. ఎంపీ  కే.కేశవరావు తండ్రి కూడా ఆంధ్రా నుంచి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు రంగారెడ్డి. తెలంగాణలో పనిచేసేందకు వస్తున్న మహిళను అందరూ స్వాగతించాలని సూచించారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజం అని.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా కేరళకు చెందిన మహిళ అని గుర్తుచేశారు.షర్మిలపై అవాకులు చెవాకులు పేలవద్దని వార్నింగ్ ఇచ్చారు మాగం రంగారెడ్డి. గతంలో వైఎస్ తో లబ్ది పొందిన వారు కూడా ఇప్పుడు షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.  తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న మాగం రంగారెడ్డి  తెలంగాణలో పార్టీకి ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్న షర్మిలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఆమెతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన కూడా తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన చెబుతున్నా.. షర్మిలకు రాజకీయంగా రంగారెడ్డి అండగా ఉండబోతున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కన్న బిడ్డను బ్లేడ్ తో కోసేసింది! రంగారెడ్డి జిల్లాలో కసాయి తల్లి 

అమ్మంటే దేవతకి ప్రతిరూపం అంటారు. అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఎక్కడా ఉండదంటారు. బిడ్డలను లాలించి, ప్రేమించడమే అమ్మలకు తెలుసు. కానీ ఓ తల్లి మద్యం మత్తులో కసాయిగా మారింది. కన్నకొడుకుపైనే కిరాతకంగా వ్యవహరించింది. పీకల దాకా మద్యం తాగిన ఆ మహా తల్లి... మద్యం మత్తులో,  ఏం చేస్తుందో కూడా స్పృహ లేకుండా  కుమారుడిపై బ్లేడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో  జరిగిందీ ఈ దారుణ ఘటన.  రంగారెడ్డి జిల్లా హైదర్షాకోట్ మండలం గంధంగూడలో తాగిన మైకంలో ఓ తల్లి కుమారుడిని బ్లేడ్‌తో విచక్షణారహితంగా కోసి గాయపర్చింది. గాయాల బాధను బరించలేని బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెళ్లారు. అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను అడ్డుకుని, బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా తల్లి మద్యం మత్తులో ఉండే ఈ ఘాతుకానికి పాల్పడ్డినట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించారు. దాడికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

వేధించిన కుర్రాళ్లకు బుద్ధి చెప్పిన ఎద్దు..   వైరల్ అవుతున్న వీడియో

మూగ జీవాల జోలికి వెళ్ళవద్దు.. వాటిని హింసిస్తే భగవంతుడు కూడా క్షమించడు అంటారు మన పెద్దలు. అయినా కొంతమంది ప్రబుద్ధులు తమ రాక్షస ఆనందం కోసం అమాయకమైన జంతువులను హింసిస్తూనే ఉంటారు. ఇటువంటి వారు మనకు మంచి చేసే మూగజీవాల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుంటారు. మనదేశంలో ఎన్ని జంతు పరిరక్షణ చట్టాలు ఉన్నా ఇలాంటి వారి నుండి ఈ మూగ ప్రాణులను మాత్రం కాపాడలేకపోతున్నాయి. అయితే ఇలాంటి వారిపైకి ఒక్కోసారి ఆ జంతువులే తిరగబడి తమను వేధిస్తున్న వారిని శిక్షించిన ఘటనలు కొన్ని మనం చూశాం తాజాగా ఇలాంటి ఘటన కు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను గమనిస్తే.. ఇద్దరు యువకులు చెట్టు కొమ్మల మధ్య ఓ ఎద్దు తలను ఉంచి దాన్ని తీవ్రంగా వేధించారు. దాని కొమ్మలను పట్టి లాగుతూ దాని తలకు గాయమయ్యేలా చేసి వారు రాక్షసానందం పొందారు. ఇలా ఆ యువకులు చాలాసార్లు చేశారు. అంతేకాకుండా తమ క్రూరత్వాన్ని వారు వీడీయో కూడా తీశారు. అయితే ఆ యువకుల హింస మితిమీరడంతో ఆ ఎద్దు ఆగ్రహించి.. ఒక్కసారిగా వారి మీదకు దూసుకెళ్లింది. అంతేకాకుండా ఇద్దరిని తన కొమ్ములతో గుద్ది కింద పడేసింది. అక్కడి నుండి వేగంగా పరుగెత్తి తనను తాను రక్షించుకుంది. ఈ వీడియోను అవనీశ్ శరణ్​ అనే ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "మంచితనానికి ఇవి రోజులు కావు" అంటూ అయన ఆ వీడియోకు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చారు . తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనకు పాల్పడ్డ యువకులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేధించిన యువకుల తిక్కను ఆ ఎద్దు బాగా కుదిర్చిందని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. దేశంలో ఎక్కడో ఒక చోట కొంత మంది శాడిస్టులు ఇలా జంతువులను వేధించడం మామూలైపోయిందని, ఇలా చేసే వారికి తప్పకుండ శిక్ష పడాల్సిందేనని కామెంట్లు పెట్టారు.

సెంచరీ కొట్టిన పెట్రోల్..  హెల్మెట్ పైకి ఎత్తి నిరసన! 

దేశంలో చమరు ధరలు అకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో  ఇప్పటికే పెట్రోల్ రేట్ సెంచరీ మార్క్ దాటగా.. తాజాగా  భోపాల్‌లో ప్రీమియం పెట్రోల్ ధర లీటరు వంద రూపాయలు  దాటేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇతర నగరాల్లోనూ ఇంధనం ధరలు సెంచరీ మార్క్ దాటేశాయి. పెట్రోల్ ధర వంద రూపాయలు దాటేయడంపై వాహనదారులను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భోపాల్ లో ఓ వాహనదారుడు వినూత్న నిరసన తెలిపారు. ఒక పెట్రోల్ పంప్ వద్ద ఒక చేత్తో హెల్మెట్, మరో చేతితో బ్యాట్ ధరించి 'సెంచరీ' సంకేతమిచ్చాడు.         పెట్రోల్, డీజిల్ ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఆయిల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతుండటంతో వినియోగదారుల గుండెల్లో మరిన్ని రైళ్లు పరిగెడుతున్నాయి. చమురు ధరలపై సోషల్ మీడియాలో కుప్పలు తెప్పులుగా పోస్టులు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు. 'కఠోర శ్రమ, పోరాటంతో ఎట్టకేలకు పెట్రోల్‌ సెంచరీ చేసింది' అంటూ ఒక ట్విట్టర్ యూజర్ భోపాల్ యువకుడి ఫోటోను షేర్ చేశాడు. పెట్రోల్ ప్రైజ్ అంటూ దానికి హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.పెట్రోల్ ధర రూ.100కు చేరువైనందున భారత్ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతోందంటూ ట్విట్టర్ లో వ్యంగ్యోక్తులు సంధించాడు. 

వారి కోసం నా ప్రాణమైనా ఇస్తా... బాలకృష్ణ సంచలనం

ఏపీలో జరుగుతున్న అరాచకాలపై టీడీపీ నేత, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ మద్దతుదారులపై అధికార వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. అసలు నామినేషన్లు కూడా వేయవద్దని బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామాలలోని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ హిందుపూరానికి వెళ్లి.. టీడీపీ మద్దతుదారులు, వారి కుటుంబాలను, కార్యకర్తలను పరామర్శించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "‘కార్యకర్తల కోసం నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. వారికోసం నా ప్రాణాన్ని ఫణంగా పెడతా. రాష్ట్రమంతా వైసిపి నాయకులు భయాందోళనలు సృష్టిస్తున్నారు..వాళ్ళ అఘాయిత్యాలకు అడ్డుకట్టవేసే వాళ్లు లేరనుకుంటున్నారు. దీనిపై నేను హెచ్చరిస్తున్నా.. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే దానికి రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాం. కార్యర్తలు అందరు సమాయత్తంగా ఉండండి. ఒకాయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతూ ఉక్కు కారాగారం అంటాడు. సీబీఐ కేసులలో ఇరుక్కుని జైలుకు వెళ్లి కారాగారం పదం బాగా అలవాటైంది. పోటీచేసే అభ్యర్థుల కుటుంబీకులు ఆఘాయిత్యాలకు పాల్పడేలా అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాష్ట్రంలో గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది" అని బాలకృష్ణ వాసిపై సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ అరాచకాలు పెరిగిపోతుండడం పై గత కొంత కాలంగా బాలకృష్ణ ఘాటైన వ్యాఖ్యలు చేస్తుండడంతో ఒక పక్క వైసిపి నేతలు కొంత వెనక్కు తగ్గుతుండగా.. మరోపక్క టీడీపీ కేడర్ లో మానసిక స్థైర్యం పెరుగుతోంది.

టీడీపీ నేత దీక్ష భగ్నం! విశాఖలో హై టెన్షన్

విశాఖపట్నంలో హై టెన్షన్ నెలకొంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆరు రోజులుగా పల్లా ఆమరణ దీక్ష చేస్తున్నారు. పల్లాకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం విశాఖ రానున్నారు. చంద్రబాబు నగరానికి రావడానికి ముందే పోలీసులు పల్లా దీక్షను భగ్నం చేశారు. దీక్ష శిబిరం నుంచి ఆయనను బలవంతంగా కృషి ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తరలింపును అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలోనే పల్లా దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పల్లా పరిస్ధితిని చూసి మహిళా కార్యకర్తలు కంటతడిపెడుతున్నారు. చంద్రబాబు వస్తున్నారనే దీక్షను భగ్నం చేశారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాసరావుకు అమరావతి రైతులు మద్దతు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి విశాఖ చేరుకున్న మహిళా రైతులు నేరుగా దీక్షా శిబిరానికి వెళ్లి శ్రీనివాస్ రావు మద్దతు ప్రకటించి, సంఘీభావం తెలిపారు.

టీడీపీకి ఓటేశారని ఇంటి మెట్లను కూల్చేశారు!

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందనే ఆరోపణలు మొదటి నుంచి వస్తున్నాయి. అధికారులు కూడా వైసీపీ నేతలు చెప్పినట్లే చేస్తున్నారని, టీడీపీ సానుభూతిపరులను టార్గెట్ చేస్తున్నారని తెలుస్తోంది.  తాజాగా గుంటూరు జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది.    నరసరావుపేట మండలం ఇసప్పాలెం పంచాయతీలో అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయలేదన్న కారణంతో ఓ వీధిలో బిల్డర్ నిర్మించిన పది ఇంటి మెట్లను కూల్చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ మద్దతుదారులకు ఓటు వేయాలని తమపై ఒత్తిడి చేశారని, వేయకపోవడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  రొంపిచర్ల మండలంలోని గోగులపాడుకు చెందిన జవ్వాజి రమేశ్ బిల్డర్.. ఏడాది క్రితం ఇసప్పాలెంలోని సరస్వతి శిశుమందిర్ సమీపంలో పది ఇళ్లు నిర్మించి అందులో కొన్నింటిని విక్రయించాడు. అందులోని ఓ ఇంట్లో రమేశ్ కుటుంబం నివసిస్తోంది.  గోగులపాడు సర్పంచ్ ఎన్నికల్లో రమేశ్ బంధువులు టీడీపీ మద్దతుదారులకు ఓట్లు వేశారని తెలిసి తనపై గ్రామ పెద్దలు కక్ష కట్టారని, ప్రజా ప్రతినిధితో ఒత్తిడి తెచ్చి తాను నిర్మించిన ఇళ్ల మెట్లను కూల్చివేశారని రమేశ్ ఆరోపించారు. కూల్చివేత సమయంలో తాను ఇంట్లో లేనని, తన అత్తమామలు జేసీబీకి అడ్డంపడినా ప్రయోజనం లేకపోయిందని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.తాను నిర్మించిన ఇళ్లకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. ఇంటి ముందు మెట్లు, ర్యాంపులను కూల్చివేశారన్నారు. విషయం తెలిసి ఇంటికి వచ్చి అధికారులను ప్రశ్నిస్తే ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఆయనతో మాట్లాడుకోవాలని చెప్పారని రమేశ్ వాపోయారు.

షర్మిల పార్టీలోకి మాజీ ఎమ్మెల్సీ! 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల  మరింత దూకుడు పెంచారు. పార్టీ ఏర్పాట్లపై ఆమె కీలక సమావేశాలు జరుపుతున్నారు.  భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆమె జిల్లాల పర్యటన కూడా ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు షర్మిల సిద్దమవుతున్నారని తెలుస్తోంది. షర్మిల పార్టీకి మద్దతు కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. గతంలో వైఎస్ తో సన్నిహితంగా ఉన్న నాయకులంతా షర్మిలతో టచ్ లోకి వస్తున్నారని తెలుస్తోంది.  షర్మిలను మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కలిసి  చర్చలు జరిపారు.  కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న  సమయంలో  రంగారెడ్డి ఎమ్మెల్సీగా పని చేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి అత్యంత సన్నిహితుడు. అతను షర్మిలతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది. సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన రంగారెడ్డి.. మర్యాదపూర్వకంగానే షర్మిలను కలిశానని చెప్పారు.షర్మిల గురించి కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, అది సరికాదని అన్నారు.  వైయస్ ఈ లోకంలో లేకపోయినా, వారి పిల్లలు ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నారని కితాబునిచ్చారు మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి. వైఎస్ బతికున్నప్పుడు ఆయన కాళ్లు, ఏళ్లు పట్టుకుని తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు.. ఆయనను విమర్శించడం సరికాదని అన్నారు. షర్మిలపై అవాకులు, చెవాకులు మాట్లాడొద్దని తమ పార్టీ నేతలకు సూచిస్తున్నానని చెప్పారు మాగం రంగారెడ్డి. దీంతో షర్మిల పార్టీలో మాగం రంగారెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారనే చర్చ జరుగుతోంది.  

విజయసాయి రెడ్డి, రమణ దీక్షితులు కు పింక్ డైమండ్ షాక్ 

ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ పోయిందని టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ ను బదనాం చేసేందుకు ఆ ఇద్దరు తీవ్రంగా కృషి చేసారు ఈ పింక్ డైమండ్ పేరుతొ సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడిని కూడా రాజకీయ వివాదాల్లోకి లాగారు. టీటీడీపై నిందలు వేయడంతోపాటు .. శ్రీవారి ప్రతిష్టను దిగజార్చడంతో టీటీడీ రూ. రెండుకోట్ల ఫీజు కట్టి మరీ రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై చెరో వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది. అయితే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత.. టీటీడీ ఆ కేసును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో కోర్టులో ఉపసంహరణ పిటిషన్ కూడా టీటీడీ దాఖలు చేసిన నేపథ్యంలో కేసును విత్ డ్రా చేసుకోడానికి వీల్లేదని, కేసులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని తెలంగాణ హిందూ జనశక్తితోపాటు, మరో న్యాయవాది పిటిషన్ వేశారు. టీటీడీతోపాటు పార్టీలుగా ఉండడానికి తిరుపతి పదవ అదనపు జడ్జి అనుమతించారు. దీంతో ఈకేసులో రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. తాజా పరిణామాలను బట్టి ఈ కేసు టీటీడీ పరిధిని దాటిపోయినట్లుగా కనిపిస్తోంది. దీంతో రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డికి ఈకేసులో షాక్ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.    

ఫాస్టాగ్ కంపల్సరీ ఓకే ! వాలెట్ లో నిధులకు భద్రతేది? 

సమయం ఆదా.. ఇంధనం మిగులు.. వీటితో  పాటు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కోసం ఫాస్టాగ్ వ్యవస్థను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 16 నుంచి అన్ని వాహనాలకు కంపల్సరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనానికి డబుల్ ఛార్జీ వసూల్ చేస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వేచి ఉండం వల్ల గతంలో ఇంధనంతో పాటు ప్రయాణికుల సమయం వృథా అయ్యేదని.. వీటిని అధిగమించేందుకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేశామని కేంద్రం చెబుతోంది. అయితే ఫాస్టాగ్ తో ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా నిధుల విషయంలో వాహనదారుల నుంచి చాలా సందేహాలు,  అభ్యంతరాలు వస్తున్నాయి.  ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కలిగి ఉన్న ప్రభుత్వం అందించే ట్యాగ్. టోల్ కట్టాల్సిన అన్ని పెద్ద వాహనాలు FASTagను వాహనం మీద విండ్ షీల్డ్‌పై అతికిస్తారు. టోల్ ప్లాజాలోకి వాహనం వెళ్లగానే అక్కడ ఉండే RFID రీడర్ FASTagను స్కాన్ చేసి వివరాలు పరిశీలిస్తుంది. ఈ ట్యాగ్‌పై వాహనదారులు అందించిన ఖాతా నుంచి టోల్ ట్యాక్స్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. SMS ద్వారా మీకు సమాచారం లభిస్తుంది. ప్ర‌స్తుతం గుర్తింపు ఉన్న బ్యాంకులు, పేటీఎం వంటి డిజిట‌ల్ వాలెట్లు ఫాస్టాగ్‌ను అందిస్తున్నాయి.  వాహనం వివ‌రాల‌ను న‌మోదు చేసి సంబంధిత కేవైసీ ప‌త్రాల‌తో ఫాస్టాగ్‌కు రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ప‌త్రాల వెరిఫికేష‌న్ పూర్త‌యి ఫాస్టాగ్ వ‌స్తుంది. దాన్ని వాహ‌నంపై నిర్దిష్ట‌మైన భాగంలో అతికించాలి. ఇక ఫాస్టాగ్‌కు క‌నెక్ట్ అయి ఉండే డిజిట‌ల్ వాలెట్‌లో న‌గ‌దును లోడ్ చేయాలి. దీంతో టోల్ ప్లాజాల గుండా వెళ్లిన‌ప్పుడు న‌గ‌దు ఆటోమేటిగ్గా క‌ట్ అవుతుంది. దీనిలో వినియోగదారులు  కనీసం 100 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి. మీరు KYC చేసిన ఫాస్టాగ్ ఖాతాలో  100,000 రూపాయల వరకు ఉంచవచ్చు.  ఇప్పుడు దీనిపైనే వినియోగదారుల నుంచి సందేహాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ  దాదాపు 3  కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేశామని కేంద్రం చెబుతోంది. వాహనదారులు కూడా తమ ఫాస్టాగ్ అకౌంట్ లో ఒకేసారి ఎక్కువ మొత్తంలో లోడ్ చేస్తున్నారు. కోట్లాది మంది వాహనదారులు రీచార్జ్ చేస్తున్న వేల కోట్ల రూపాయల డబ్బు.. ఎవరి ఖాతాలో ఉంటుంది.. వాటికి భద్రత ఏంటన్న చర్చ వస్తోంది. వాహనదారులు ఫాస్టాగ్ లో లోడ్ చేసిన అమౌంట్ కు జవాబుదారి ఎవరూ... అది మిసి యూజ్ అయ్యే అవకాశం లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు కొన్ని సార్లు ఫాస్టాగ్ ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్ అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రిటర్ జర్నీ డబ్బులు కూడా ముందే కట్ తీసేసుకుంటున్నారని చెబుతున్నారు. కట్టాల్సిన టోల్ కంటే డబుల్ చార్జీ కొన్ని సార్లు పేమెంట్ అవుతుందని కూడా తెలుస్తోంది. ఈ సమస్యలపై అడగడానికి సరైన ఫ్లాట్ ఫామ్ లేదనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వస్తున్నాయి.  రెగ్యులర్ గా  వినియోగించేవారితో సమస్య లేకున్నా... అప్పుడప్పుడు వాహనాల్లో తిరిగేవారి విషయంలోనే కొత్త అనుమానాలు వస్తున్నాయి. ఫోర్ వీలర్ ఉన్నవారందరికి కంపల్సరి కావడంతో అంతా ఫాస్టాగ్ తీసుకుంటున్నారు. అయితే ఎక్కువగా బయటికి వెళ్లని వారు ఫాస్టాగ్ లో జమ చేసిన నిల్వ చాలా కాలంపాటు అలాగే ఉండిపోతోంది. ఇలాంటి ఖాతాలు లక్షల్లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంటే వందల కోట్ల రూపాయలు అలా ఉంటాయన్న మాట. ఆ డబ్బులకు ఇంట్రెస్ట్ కూడా రాదు. అదే బ్యాంకుల్లో మనం జమ చేసిన డబ్బుకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాలెట్లలో మనం జమ చేసిన డబ్బును.. దేనికైనా వాడుకోవచ్చు. కాని ఫాస్టాగ్ కోసం రీచార్జ్ చేసిన డబ్బును... కేవలం టోల్ ప్లాజా దగ్గర మాత్రమే వినియోగించుకోవాలి. మనం టోల్ ప్లాజా ద్వారా వెళ్లనప్పుడు ఆ డబ్బంతా ఖాతాలో వృధాగనే ఉండిపోతుంది.            దేశంలో ఇప్పటికే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్ కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కొట్టేసింది. డీజీల్ కూడా అదే దారిలో ఉంది. ఎల్పీజీ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఫాస్టాగ్ అదనపు భారంగా మారిందనే అభిప్రాయం వాహనదారుల నుంచి వస్తోంది. అయితే ఫాస్టాగ్ తో మనం ఎంత రీచార్జ్ చేసుకున్నా సమస్య ఉండదని, మనం వాడుకుంటేనే అది ఖర్చు అవుతుందని, మిగిలినదంతా వాలెట్ లో భద్రంగానే ఉంటుందని ఫాస్టార్ సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాలెట్ల మాదిరిగానే ఇది పని చేస్తుందని, దీనిపై ఎవరికి సందేహాలు ఉండాల్సిన పని లేదని స్పష్టం చేస్తున్నారు.   

వాట్స్ యాప్ పై సుప్రీమ్ వేటు..

ఇండియాలో ప్రజల భద్రత కోసం ప్రైవసీ యాప్ పై సుప్రీం కొత్త చట్టం తేనుందా.. ఒకపుడు సీక్రెట్స్ నాలుగు గోడల మధ్యనో .. ఇద్దరి వ్యక్తుల మధ్యనో ఉండేవి,  కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా చేతుల్లోకి వచ్చిందో.. సీక్రెట్స్ కి చోటులేకుండా పోయింది.. అంతరంగం లో ఉండాల్సిన విషయాలు.. వార్తలుగా బహిర్గతం అవుతున్నాయి.. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే సుప్రీమ్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి.   ప్రజలు  ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్, దానికి చెందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇండియాలో ఇటీవల  ప్రవేశపెట్టిన వాట్స్ యాప్ నూతన విధానంపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మీ సంస్థ రెండు లేదా మూడు ట్రిలియన్ డాలర్ల సంస్థ కావచ్చు... కానీ మీ కంటే దేశ ప్రజల గోప్యతకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. ప్రజల గోప్యతను కాపాడటంలో సుప్రీమ్ కోర్టు మరోసారి తన బాధ్యత అని స్పష్టం చేసింది. ప్రజలకు భద్రత లేకపోవడంతో  ఆందోళన చెందుతున్నారని వివరించింది. ఎవరికైనా మెసేజ్ పంపితే అది ఫేస్ బుక్ కు అందుబాటులో ఉంటోందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పింది. విచారణ సందర్భంగా ఫేస్ బుక్, వాట్సాప్ తరపున కపిల్ సిబాల్ వాదిస్తూ... నూతన గోప్యతా విధానం వల్ల యూజర్ల సమాచారం బయటకు వెళ్లదని అన్నారు. ప్రైవసీపై యూరప్ లో ఒక ప్రత్యేక చట్టం ఉందని, ఇండియా కూడా అలాంటి చట్టాలనే తీసుకొస్తే, దాన్ని అనుసరించడం జరుగుతుందని చెప్పారు.