ఎవరి చిత్తశుద్ధి ఎంతో తేలిపోయింది..

తెలిసిపోయింది. తేలిపోయింది. విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం జగన్ కు ఉన్న చిత్తశుద్ధి ఎంతో తెలిసిపోయింది. ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ముఖ్యమంత్రికి ఉన్న ఆసక్తి ఎంతో తేలిపోయింది. విశాఖ విమానాశ్రయంలో కార్మిక సంఘ నేతలతో జగన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వ విధానంలో మరింత క్లారిటీ వచ్చింది.  విశాఖ ఉక్కుపై ఏపీకి అధికారం లేదు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఖాళీ భూములను లేఅవుట్లు వేసి అమ్మితే బాగా డబ్బులు వస్తాయి. వాటితో కర్మాగారం కష్టాలు తీరిపోతాయి. ఇవీ జగన్ నోటి నుంచి వచ్చిన మాటలు. ఈ స్టేట్స్ మెంట్స్  పరిశీలిస్తే జగన్ దేనికి అనుకూలమో ఇట్టే తెలిసిపోతుంది. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలతో కార్మికుల్లో తీవ్ర నిరుత్సాహం ఆవహించిందని చెబుతున్నారు. విశాఖ ఉక్కుపై మనకు అధికారం లేదని చేతులెత్తేసినట్టు మాట్లాడారని అంటున్నారు. భూములు అమ్మితే డబ్బులొస్తాయనడాన్నీ కార్మికులు తప్పుబడుతున్నారు.  అయితే.. అదే సమావేశంలో జగన్ కొన్ని నష్ట నివారణ వ్యాఖ్యలు సైతం చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు సాధ్యమైనంత వరకు సహకరిస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తాం. అఖిలపక్షం నాయకులతో పాటు వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తారు. ఇప్పటికే మోదీకి లేఖ రాశా. సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నా. ఇదీ కార్మికులకు జగన్ ఇచ్చిన భరోసా. ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేశారు. జగన్ సైతం ఇప్పుడు అందుకు అంగీకరించారు. ఇది మినహా మిగతా చర్యలేమీ స్ట్రాంగ్ గా లేవని విపక్షాలు అంటున్నాయి.  గతంలో పోస్కో ప్రతినిధులతో భేటీపైనా జగన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోస్కో బృందం తనను కలిసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని కోరితే.. కృష్ణపట్నం, భావనపాడులను పరిశీలిస్తున్నారని చెప్పారు.  ఒక రోజు వ్యవధిలో అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఇటు ముఖ్యమంత్రి జగన్ లు చేసిన పర్యటనలను పోల్చి చూస్తున్నారు. వారాల తరబడి ఉద్యమంతో విశాఖ ఉడికిపోతోంది. కార్మికులు, స్థానికుల పోరాటానికి మద్దతుగా చంద్రబాబు విశాఖ తరలివచ్చారు. సీఎం జగన్ మాత్రం విశాఖలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా వారి కోసం రాలేదు. శారదా పీఠం కార్యక్రమం కోసం వచ్చారు. ఎలాగూ వచ్చారు కాబట్టి కార్మికులతో మాట్లాడారు. అది కూడా విమానాశ్రయంలో... ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్రాన్ని దిగొచ్చేలా చేయాలంటే రాజీనామాలే బ్రహ్మాస్త్రం. అందుకే, విశాఖ ఉక్కు కోసం తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు రెడీ అని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ ఎంపీలనూ రాజీనామా చేయాలన్నారు. అయితే, జగన్ నోట రాజీనామాల అంశమే రాలేదు. కేంద్రంపై ఒత్తిడి పెంచాటానికి రాజీనామాలను మించిన అస్త్రం ఇంకేముంటుంది? మరి జగన్ ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  ఉక్కు ఉద్యమానికి జగన్ నే నాయకత్వ వహించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. భేషజాలు లేకుండా ఆయనకు మద్దతుగా నిలుస్తామని సంచలన స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. విశాఖ పర్యటనలో చంద్రబాబు చేసిన ఈ కామెంట్ తో వైసీపీ ఖంగుతింది. బాబు ఇచ్చిన ఈ ఆఫర్ పై జగన్ నుంచి నో రియాక్షన్. ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి ముఖ్యమంత్రి పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టు లేదంటున్నారు విపక్ష నేతలు. ఒక్క అఖిలపక్షం వరకూ ఓకే అన్నట్టు సిగ్నల్ ఇచ్చారు జగన్.  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో టీడీపీ దూసుకుపోతుంటే వైసీపీలో ఆందోళన మొదలైంది. సీఎం జగన్ పర్యటన తర్వాత మరింత డ్యామేజ్ జరిగింది. అదే సమయంలో ఉక్కు కోసమంటూ ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్రకు సిద్ధమై నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. ఆయన చేసే పాదయాత్ర ఉక్కు కోసమో.. గ్రేటర్ ఎలక్షన్ల కోసమో అందరికీ తెలిసిందేనని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. చంద్రబాబు, జగన్ పర్యటనల్లో బాబుకే అధిక మైలేజ్ రావడంతో అధికార పార్టీ మరింత ఇబ్బందుల్లో పడింది. ఉక్కు ఉద్యమ సెగ.. జీవీఎంసీ ఎలక్షన్లలో వైసీపీకి దిమ్మ తిరిగేలా చేస్తుందని అంటున్నారు.

చెట్లకు పైసలు కాస్తాయా..?

తెలంగాణ ఆర్భాటపు కార్యక్రమాలకు అడ్డాగా మారిందా..? సీఎం బర్త్ డే ఎంత ఘనంగా జరిగితే తెలంగాణ ప్రజలు ఘనంగా బతుకుతున్నట్టా..? తెలంగాణ వచ్చిన ఎనిమిది ఏళ్లలో తెలంగాణ ప్రజలు బతుకులు పచ్చగా ఉన్నాయా..? లేక పాలకుల బతుకుల పచ్చగున్నాయా..? ఇవీ ప్రతిపక్ష నేతల విమర్శలు. ఇటీవలే బీజీపీ లో చేరిన విజయశాంతి కేసీయార్ పై సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఒక ఆర్భాటపు కార్యక్రమం చేపట్టారని అన్నారు.  గ్రామానికి వెయ్యి మొక్కలు నాటాలని గ్రామాధికారులకు ఆదేశాలిచ్చారని. పాపం గ్రామఅధికారులు మాత్రం  గతంలో నాటిన మొక్కల బిల్లులే రాలేదని అంటున్నారని ఎద్దేవా చేశారు.    మొక్కల రేటు, ట్రీ గార్డులు, కూలీ ఖర్చులు ఎలా అని  వాళ్ళు బాధపడుతున్న వాళ్ళ గోడు పాలకులకు వినిపించడం లేదని రాములమ్మ ఫైర్ అయ్యారు. వేసవి కాలంలో నీళ్ళు లేక మొక్కలు బతక్కపోతే తమకు షోకాజులు పంపుతారని విజయశాంతి ఆవేదన చెందారు. ఇవేవీ సార్ కారుకు పట్టవని. సారుకు తమ కుటుంబం, తన ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలని. గతంలో వేల కోట్ల రూపాయలతో మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేసి చేతులెత్తేశారని. తర్వాత ఉద్యానవన శాఖ అధికారి ఒకరితో సీఎం గారి ఫౌంహౌస్ నివాసంలో కోట్లాది రూపాయల విలువైన పనులు చేయించారని ఆరోవణలు వెల్లువెత్తాయి. సమయానికి జీతాలందక ఆర్టీసీ ఉద్యోగులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు వేదనకు గురవుతున్నా... బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నా సర్కారు వారు నిర్లక్ష్యం చేస్తుందని.. ఈ అవినీతి, అసమర్థ, అబద్ధాల, విఫల ప్రభుత్వాన్నికి  గుణపాఠం చెప్పడానికి  తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె సోషల్ మీడియా పోస్ట్ లో అన్నారు. 

కాంగ్రెస్ ను దేవుడైనా కాపాడలేడు..

నూట యాభై ఏళ్లకు పైగా చరిత్ర కలిగి.. దాదాపుగా 70 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే నిజంగా జాలేస్తుంది. ప్రస్తుతం కేవలం కొన్ని చిన్న రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్న ఆ పార్టీ నేతల ధోరణి లో ఇప్పటికి ఎటువంటి మార్పు లేదు. తాజాగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ పుదుచ్చేరి పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే . దీంతో ఆయనకు తమ గోడు చెప్పుకుంటే సమస్యలు తీరతాయని ఒక మహిళ భావించింది. ఆమె తమ సమస్యలను రాహుల్ గాంధీకి చెప్పుకుంటూ బాధ పడింది. అయితే ఆమె తమిళంలో మాట్లాడటంతో రాహుల్ గాంధీకి ఏమి అర్థం కాలేదు. అయితే ఆ సమయంలో ఆమె మాటలను ట్రాన్స్ లేట్ చేయడం కోసం పుదుచ్చేరి సీఎం వీ నారాయణ స్వామి ముందుకొచ్చారు. "ఇక్కడ ఎవరూ మా గురించి పట్టించుకోవడం లేదు. ఇక్కడి సీఎంనే తీసుకోండి. తుఫాను వచ్చినప్పుడు కనీసం ఆయన మమ్మల్ని ఒక్కసారి కూడా పరామర్శించడానికి రాలేదు" అని ఆ మత్సకార మహిళ రాహుల్ కు చెప్పింది.   అయితే ఈ విషయాన్ని రాహుల్‌కు వివరించే క్రమంలో సీఎం నారాయణస్వామి.."తుఫాను వచ్చినప్పుడు నేను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రిలీఫ్ ఫండ్లు సరిగా అందేలా చూశా. ఆమె దాని గురించే మాట్లాడుతోంది" అంటూ ఏకంగా అబద్ధం ఆడేశారు. ఈ ఘటన పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి నేతలు ఉంటే ఇక కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వవైభవం సాధ్యమేనా.. అని కాంగ్రెస్ పార్టీ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు..        

ప్రాణభయంతో ఎస్ఐ పరుగులు.. 

చిన్నపుడు దొంగ పోలీస్ ఆట ఆడితే  దొంగ తప్పు చేస్తాడు కాబట్టి దాక్కునే వాడు. పోలీస్ దొంగను పట్టుకునే వాడు. కానీ ఎక్కడ అంతా రివర్స్ పోలీసులే దాక్కుంటున్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఆగడాలు మితిమీరుతున్నాయి. ఖద్దరు బలంతో ఖాకీలనే తరుముతున్నారు. కడప జిల్లా యర్రగుంట్ల మండలంలోని మాలేపాడు పంచాయతీ ఎన్నికల్లో, వైసీపీ మద్దతుతో సుబ్బారెడ్డి, రెబల్‌ అభ్యర్థిగా పరమేశ్వర్‌రెడ్డి పోటీ చేశారు. బీజేపీ నుంచి మోహన్‌రెడ్డి, మరొకరు పోటీలో ఉన్నారు. వైసీపీ రెబల్ అభ్యర్థులు పోస్టర్స్ అంటిస్తుండగా ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ చంద్రమోహన్‌రెడ్డి ఆ  గ్రామానికి వెళ్లి, ఇరువర్గాలను పిలిచి మాట్లాడుతుండగా, అందులో ఇకను దురుసుగా ప్రవర్తించగా ఆ వ్యక్తి పై ఎస్ఐ చేయి చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు డ్యూటీలో ఉన్న ఎస్ఐ పైన దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. ఎస్ఐని కొంతదూరం వెంబడించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.  దీంతో ఎస్‌ఐ ఓ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని, రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,సీఐ సదాశివయ్య గ్రామానికి వెళ్లి వైసీపీ శ్రేణులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో వివాదం తలెత్తిన మాట నిజమేనని, ఎస్‌ఐపై ఎవరూ దౌర్జన్యానికి దిగలేదని ఎస్పీ అన్బురాజన్‌ చెప్పారు.  ఇది ఇలా ఉండగా కర్నూలు జిల్లా పత్తికొండ మండలం, పులికొండలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించిన మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సులు పత్తికొండకు తరలించారు. దీంతో పులికొండ గ్రామంలో హై టెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. 

 కేసీఆర్ కు రేవంత్ భలే ఆఫర్!

రాజకీయాలలో ముఖ్యంగా, తెలంగాణ రాజకీయాల్లో నెగ్గుకురవాలంటే ఏమున్నా, ఏమి లేక పోయినా, నోరైతే ఉండాలి. నిజానికి కాలు జారినా ఫర్వాలేదు, నోరు జారితే వెనక్కి తీసుకోలేమని అంటారు. కానీ, అది రాజకీయలకు వర్తించే సామెత కాదు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు విషయాన్నే తీసుకుంటే, ఆయన ఒక  మాటల మరాఠీ. మాటలతో ఎదుటి వారి నోరు మూయించడంలో ఆయనకు ఆయనేసాటి. అవతలి వారు ఎంతటి వారైనా సరే, ఆయన అసలు పట్టించుకోరు. ప్రధానమంత్రి అయినా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా మరో మహా నేత అయిన సరే, ఆయన నోటికి చిక్కితే, నమిలి ఉమ్మేస్తారు.  అవసరం అయితే మళ్ళీ ఆయనే మాట మడత పెడతారు. వంగి వంగి దండాలు పెడతారు.అలాగే, కేటీఆర్’కూడా కోతల కోటలు కట్టడంలో కేసీఆర్ బాటలోనే ముందుకు సాగుతున్నారు.  ఇదలా ఉంటే  ఇప్పుడు ఆ ఇద్దరికీ సమ ఉజ్జీగా మాటల తూటాలు పేల్చే మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, తెరాస నాయకులపై, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ జోడీపై ఎలాంటి మాటల తూటాలు పెలుస్తున్నారో,చూస్తూనే ఉన్నాం. ఇంతవరకు బీజేపీ బాధ్యతల్లో ఉన్న నాయకులలో ఏ ఒకక్రు కూడా , కారణాలు ఏవైనా రాజకీయ ప్రత్యర్దులపై, ముఖ్యంగా తెరాస పార్టీ, ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు.  కానీ, బండి సంజయ్ అందుకు విరుద్ధంగా, ‘నువ్వొకటంటే నేను నాలుగంటా’ /నువ్వు తమల పాకుతో ఒకటంటే నేనుతలుపు చెక్కతో నాలుగేస్తా’ అన్నట్లుగా మాటకు మాట అప్పగిస్తున్నారు. అది నిజం అయినా కాక పోయినా, బండి సంజయ్ సక్సెస్’కు ఆయన ‘మాట తూలుడు’ కూడా ఒక కారణం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజిగి ఎంపీ రేవంత్ రెడ్డిది ముందునుంచి అదేతీరు. అయినా, పీసీసీ రేసులో భాగంగా చేపట్టిన రైతు భరోసా యాత్ర ముగింపు సమావేశంలో రేవంత్ రెడ్డి తనకు తానే సాటి, తనకెవ్వరు లేరి పోటీ అన్న రీతిలో రెచ్చిపోయారు.ఎక్కడా కామా, ఫుల్ స్టాప్ లేకుండా, ముఖ్యమంత్రిని, తెరాస ప్రభుత్వాన్ని, అదే నోటితో  కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎకి పారేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్’ కు వ్యతిరేకంగా ఉప్పెన సృష్టిస్తా ... కప్పెడతా’ అంటూ ఎప్పుడో కేసీఆర్ తనకు వ్యతిరేకం అనుకున్న మీడియాని  పది తాళ్ళ లోతున పాతేస్తా అంటూ గర్జించిన సందర్భాన్ని గుర్తు చేశారు.  ముఖ్యమంత్రి కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు రైతుల పచ్చని పొలాలను తక్కువ ధరకు  స్వాధీనం చేసుకుని కార్పొరేట్ సంస్థలు కోట్ల  రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి వెయ్యి ఎకరాలు ఉన్న సీఎం ఫామ్‌హౌస్‌ భూములను తాను ఎకరా రూ.25 లక్షలు ఇచ్చి తీసుకుంటానని, ఇచ్చేందుకు కేసీఆర్‌ సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. సీఎం సై అంటే 48 గంటల్లో నోట్ల కట్టలు పట్టుకు వస్తానని కూడా అన్నారు ... ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఏమాత్రం నదురు బెదురూ లేకుండా మాటల తూటాలు పేల్చారు.  అంతే కాదు, ఏఐసీసీ అనుమతితో రాష్ట్ర వ్యాప్త పాద యాత్ర చేపడతానని కూడా  రేవంత్  ప్రకటించారు. అంటే ... రేవంత్ రెడ్డి పీసీసీ పీఠం తనదే అన్న ధీమాతో ఉన్నట్లున్నారు. మొత్తానికి చాలా కాలంగా కొంత స్తబ్దుగా తెలంగాణ మీడియాకు ఇక మేతకు కొదవుండదు..  

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ బేడీ? పుదుచ్చేరికి తమిళిసై..!

కిరణ్ బేడీ. ది బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. అడ్మినిష్ట్రేషన్ లో వెరీ స్ట్రిక్ట్. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణలో వెరీ వెరీ పర్ ఫెక్ట్. టఫెస్ట్ గవర్నర్. పుదుచ్చేరికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఉండి.. ఐదేళ్లు అక్కడి ముఖ్యమంత్రి నారాయణ స్వామికి చుక్కలు చూపించిన పవర్ ఫుల్ పర్సనాలిటీ. అలాంటి డైనమిక్ అండ్ టెరిఫిక్ కేండిడేట్ ని తెలంగాణకు గవర్నర్ గా నియమించబోతున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా, పుదుచ్చేరి ఎల్జీ పదవి నుంచి కిరణ్ బేడీని తప్పించటానికి అసలు కారణం ఇదేనని అంటున్నారు.  పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి ఏరికోరి మరీ కిరణ్ బేడీని అక్కడికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా పంపించింది కేంద్ర ప్రభుత్వం.  రూల్స్ బుక్ ను పర్ ఫెక్ట్ గా ఫాలో అయ్యే బేడీ వ్యవహార శైలితో అడుగడుగునా కాంగ్రెస్ సీఎంకు ఆటంకాలే. ప్రభుత్వ విధానాలు, రోజు వారీ పాలనా వ్యవహారాల్లో గవర్నర్ అధికంగా జోక్యం చేసుకుంటున్నారంటూ సీఎం నారాయణ స్వామి పలుమార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కిరణ్ బేడీ తీరుతో విసుగు చెంది.. స్వయంగా ముఖ్యమంత్రి నారాయణ స్వామినే  నిరసన ప్రదర్శన చేశారు, ఆమె శైలిపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు. పుదుచ్చేరిలో కిరణ్ బేడీ తీరు కేంద్ర పెద్దలను విశేషంగా ఆకర్షించిందని చెబుతున్నారు. అయితే.. ఆ ఫైర్ బ్రాండ్ ఆఫీసర్ దూకుడును పుదుచ్చేరి లాంటి కేంద్ర పాలిత ప్రాంతంలో కాకుండా... రాజకీయంగా కీలకంగా మారిన తెలంగాణలో వినియోగించుకోవాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.  తెలంగాణ పోలీసుల వ్యవహార శైలిపై కేంద్రం అసంత్రుప్తితో ఉన్నట్టు సమాచారం. దుబ్బాక ఎన్నికల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే  అభ్యర్థి రఘునందన్ రావు టార్గెట్ గా పోలీసులు చేసిన హడావుడి ఏకపక్షంగా ఉందని.. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం ఖాకీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నాయకులే లక్ష్యంగా పోలీసుల దాడులు పెరగడానికి జనగాం, ఖమ్మం ఘటనలను సాక్షంగా చూపిస్తున్నారు. తెలంగాణ పోలీసులు సర్కారు కనుసన్నల్లో పని చేయడాన్ని సరి చేయడానికే.. మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని తెలంగాణ గవర్నర్ గా తీసుకురానున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లేడీ సింగంలా లా అండ్ ఆర్డర్ ను సెట్ రైట్ చేయడానికైనా.. పాలనలో ఒంటెద్దు పోకడలు పోతున్న కేసీఆర్ ను కట్టడి చేయడానికైనా.. కిరణ్ బేడీనే కరెక్ట్ కేండిడేట్ అని భావనలో కేంద్రం ఉన్నట్టు చెబుతున్నారు.  తెలంగాణకు కిరణ్ బేడీ గవర్నర్ గా రావొచ్చనే ప్రచారానికి మద్దతుగా... ఇక్కడి తమిళిసైకి పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. త్వరలో ఎన్నికలు జరగబోవు పుదుచ్చేరికి కిరణ్ బేడీ ప్లేస్ లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తమిళిసై అయితేనే కరెక్ట్ అనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారట. మామూలుగా అయితే.. ఓ గవర్నర్ పోస్ట్ ఖాళీ అయితే ఆ పక్కనే ఉన్న రాష్ట్ర గవర్నర్ కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ. కానీ, పుదుచ్చేరి విషయంలో ఏపీ, తమిళనాడు గవర్నర్ లను కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించడం అందుకే అంటున్నారు. తమిళిసైని పుదుచ్చేరికి పూర్తి స్థాయి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా చేసి.. తెలంగాణకు కిరణ్ బేడీని గవర్నర్ గా తీసుకొచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. 

హైకోర్టు లాయర్ దంపతుల మర్డర్ కేసులో బయటకొస్తున్న సంచలన నిజాలు

తెలంగాణ హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతుల దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు ప్రాణహాని ఉందని ఇటీవల హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు న్యాయవాది దంపతులు తెలిపారు. ఇది ఇలా ఉండగా వామనరావు దంపతుల హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో శీలం రంగయ్య లాకప్‌ డెత్‌పై వామనరావు, నాగమణి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసు వాపస్ తీసుకోవాలని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వామనరావును బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రామగుండం సీపీ సత్యనారాయణతో లాయర్ వామనరావు, నాగమణి వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. మరోపక్క పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకి వ్యతిరేకంగా వామనరావు పలు కేసులు వాదిస్తున్నారు. హైకోర్టు న్యాయవాది వామనరావు, నాగమణిలను దుండగులు ఈరోజు పట్టపగలే నరికిచంపిన విషయం తెలిసిందే. రామగిరి మండలం కలవచర్ల వద్ద వారు ప్రయాణిస్తున్న కారులోనే కొంత మంది దుండగులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి నరికి చంపారు. అయితే చనిపోతూ వామనరావు తన మరణ వాంగ్మూలంలో కుంట శ్రీను తనపై దాడి చేశాడని చెప్పారు.. ప్రస్తుతం కుంట శ్రీను మంథని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గా ఉన్నాడు. ఆరు బృందాలతో కేసు విచారణను పోలీసులు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సత్యనారాయణ ప్రకటించారు. మరోపక్క హైకోర్టు లాయర్ వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య‌పై హైకోర్టు న్యాయ‌వాదులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ సుపారీ హ‌త్యేన‌ని… దీనిపై హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఇటీవ‌లే హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి తెలిపిన వామ‌న‌రావును ఇలా చంపేయ‌టం దారుణ‌మ‌ని, ఈ హ‌త్య‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని, లోతైన విచార‌ణ జ‌ర‌పాల‌ని బార్ అసోసియేష‌న్ డిమాండ్ చేసింది.

బీజేపీకి వ్యవసాయ చట్టాల షాక్... అక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్

కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పంజాబ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. హోషియార్‌పూర్, కపూర్తలా, అబోహర్, పఠాన్‌కోట్, బాటలా, బటిండా, మోగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ సొంతం చేసుకోగా,.. దాదాపు 53 ఏళ్ల తర్వాత బటిండా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కు దక్కడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. బీజేపీకి ఇక్కడ సాగు చట్టాల దెబ్బ బాగా తగిలినట్టు వచ్చిన ఫలితాలు సూచిస్తున్నాయి. పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలు రైతుల ఆందోలనల నేపథ్యంలో జరగడంతో కేంద్రం తెచ్చిన సాగుచట్టాలపై ఇది రిఫరెండమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇలా ఉండగా భటిండా మున్సిపల్ కార్పొరేషన్ పై 53 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తన జెండాను ఎగరేయడం విశేషం.భటిండా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ నేతృత్వం వహిస్తుండగా ..కొన్నినెలల క్రితం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీ దళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ లోక్ సభ నియోజకవర్గానికి నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ దే పైచేయి అయింది.        

హైకోర్టు న్యాయవాది దంపతుల దారుణ హత్య ...  

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కారులో సొంత గ్రామానికి వచ్చి హైదరాబాద్‌ తిరిగి వెళ్తున్న హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు, అయన భార్య నాగమణిలు దారుణ హత్యకు గురయ్యారు. ఆ దంపతులిద్దరిని కారు ఆపి మరీ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. భర్తను కాపాడేందుకు అడ్డు వెళ్ళిన ఆయన భార్య నాగమణిపైన కూడా దుండుగులు దాడి చేయడంతో ఆమె కూడా మరణించారు. మంథని నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారులోనే విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు దుండగులు. హత్యకు గురైన లాయర్ వామనరావు‌ది మంథని మండలం గుంజపడుగు స్వగ్రామం. అయన తమ గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ఘోరం జరిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.        

కోటి బాణాల వెనుక.. కోటి మర్మాలు! 

ముందుగా షర్మిల, తర్వాత జగన్. ఆ తర్వాత చంద్రబాబు. ఆంధ్రా నేతలంతా వస్తారు. తెలంగాణను దోచుకుంటారు. ఇక్కడి నీళ్లు, కరెంట్ ఎత్తుకెళ్తారు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ కష్టాలు తప్పవు.  తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవు. కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇవీ తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలంటూ సోషల్ మీడియాలో ఈ టాపిక్ తెగ వైరల్ అవుతోంది. అదేంటి? సడెన్ గా ఈ విధ్వేషపూరిత మాటలేంటి? రెండు రాష్ట్రాల ప్రజలూ ఒకటిగా కలిసుంటుంటే మళ్లీ ఎందుకు ఇలాంటి కామెంట్లు? అని తెలంగాణ వాదులే తప్పుబడుతున్నారు. అయితే, కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న అధికార పార్టీ నేత నోటి నుంచి ఇలాంటి స్టేట్ మెంట్స్ రావడం వ్యూహాత్మకమే అంటున్నారు కొందరు. కావాలనే సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని చెబుతున్నారు. ఇటు షర్మిల పార్టీ, అటు గంగుల కామెంట్స్.. ఇలా అన్నీ కేసీఆర్ డైరెక్షన్ లోనే జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. మంగళవారం వావిరాల రణభేరీతో రేవంత్ రెడ్డి రైతు సభ గ్రాండ్ సక్సెస్. తెలంగాణ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్. ఆ వెంటనే.. షర్మిల, జగన్, చంద్రబాబు, ఆంధ్ర పెత్తనం, దోపిడీ, కొట్లాటలంటూ కలకలం రేపే కామెంట్లు. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రెండు అంశాలకు లింకున్నట్టు తెలుస్తోందని అంటున్నారు. రణభేరి సభతో రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరగడంతో కంగారు పడిన కారు పార్టీ.. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు.. మళ్లీ ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్ రాజేసేందుకు.. ప్రయత్నిస్తోందా అనే అనుమానం కలుగుతోంది. షర్మిలతో కేసీఆరే పార్టీ పెట్టించారని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. షర్మిలను ముందుంచి.. అటు ప్రతిపక్ష ఓట్లు చీల్చడంతో పాటు కావలసినప్పుడల్లా సెంటిమెంట్ మంట రాజేసేందుకూ పనికొస్తుందనేది గులాబీ బాస్ స్కెచ్ అంటున్నారు. రహస్య స్నేహితులు కేసీఆర్, జగన్ లు కలిసి.. ఉభయ ప్రయోజనాల కోసం షర్మిల పార్టీతో రాజకీయ పావులు కదుపుతున్నారని అనుమానిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే స్ట్రాటజీ ప్లే చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోవడం.. రాహుల్, చంద్రబాబులు కలిసి ప్రచారం నిర్వహించడంతో కారు పార్టీ ఖంగుతింది. ఆ వెంటనే.. చంద్రబాబు టార్గెట్ గా ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను రెచ్చగొట్టి ఎలక్షన్లలో దండిగా ఓట్లు దండుకున్నారు గులాబీ దళపతి. ఈ సారీ అదే ఎత్తుగడ అమలు చేయడానికి.. షర్మిలతో కేసీఆరే పార్టీ పెట్టిస్తున్నారనేది ఓ వాదన. ఆ ప్లాన్ లో భాగంగానే.. అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడారు మంత్రి గంగుల కమలాకర్. జగనన్న తెలంగాణలోకి ఒక బాణం వేస్తే, తాము కోటి బాణాలు వేస్తామని.. అన్న, చెల్లెల్లకు గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోండి. మాపై ఎందుకు రుద్దడం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రాయలసీమ వాసులు ఏపీలో పోరాడుతున్నారు. కావాలంటే షర్మిల అక్కడికి వెళ్లి పార్టీ పెట్టుకోవాలంటూ ప్రాంతీయ జ్వాల రగిలించారు. ఇవన్నీ అనుకోకుండా చేసిన ఆరోపణలు కావని.. పక్కా ప్లాన్డ్ గానే, కావాలనే గంగుల అలా అన్నారని కొందరు అంటున్నారు. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ వేగంగా బలపడుతోంది. అటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కాక మీదున్నారు. ప్రతిపక్షాలు ఈ రేంజ్ లో బలం పుంజుకోవడంతో కేసీఆర్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి. అందుకే.. విభజించు, పాలించు సిద్ధాంతం ప్రకారం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకో, రేవంత్ రెడ్డి వైపో మరళ కుండా.. మధ్యలో షర్మిలను రాజకీయ రంగంలో నిలిపి ఓట్లు చీల్చాలనే ఎత్తుగడతో ఉన్నారని తెలుస్తోంది. ఆలూ-సూలు లేని పార్టీకి అప్పుడే నేతల తాకిడీ పెరుగుతోంది. పలువురు వెటరన్ లీడర్లతో పాటు తటస్థులూ అటు వైపు చూస్తున్నారు. షర్మిల పెట్టబోయే పార్టీలో పని చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని ప్రముఖ మోటివేషనిస్ట్ 'బ్రదర్ షఫీ' ప్రకటించారు. ఇక, మాల, మాదిగ సంఘాల నేతలూ లోటస్ పాండ్ కు క్యూ కడుతున్నారు. ఎమ్మార్పీఎస్ నేత ఇటికే రాజు, మాల మహానాడు నేత చెన్నయ్య.. షర్మిల పార్టీ పెట్టాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు, షర్మిలపై ఉన్న 'ఆంధ్రా' ముద్ర తొలిగేలా.. ఆమె తెలంగాణ కోడలంటూ ప్రచారం మొదలుపెట్టేశారు. షర్మిల భర్త అనిల్ కుమార్ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం, షర్మిల సైతం హైదరాబాద్ లోనే చదువుకుందంటూ షర్మిల పార్టీకి 'బ్రాండ్ తెలంగాణ' క్రియేట్ చేస్తున్నారు. ఇలా.. అనేక ప్రయోగాలతో షర్మిలకు బలమైన గుర్తింపు వచ్చేలా చేసి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ, కాంగ్రెస్ వైపు వెళ్లకుండా మూడు ముక్కలయ్యేలా చేయాలనేది కేసీఆర్ పొలిటికల్ ప్లాన్ అంటున్నారు. అప్పటికీ వర్కవుట్ కాకపోతే.. ఎన్నికల నాటికి షర్మిలను బూచీగా చూపించి ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రాజేసి మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై సెటిల్ అవ్వాలనే స్కెచ్ కావొచ్చనేది మరికొందరి విశ్లేషణ. అందుకు శాంపిల్ గా.. మంత్రి గంగుల కమలాకర్ కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్ చేసుంటారని చెబుతున్నారు. గంగుల వేస్తామన్న.. కోటి బాణాల వెనుక కోటి మర్మాలు దాగున్నాయని.. ఇదంతా కేసీఆర్ డైరెక్షన్ లో జరుగుతున్న రాజకీయ దోబూచులాటని అంటున్నారు. 

పంచాయతీ అరాచకాలకు అంతే లేదా.. ?

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో అధికారపు పార్టీ ఆగడాలు పతాకస్థాయిలో పెరుగుతున్నాయి.. స్వేచ్ఛ యుతంగా జరగాల్సిన ఎన్నికలను నిత్యం దాడులు, డబ్బు,మద్యం, అక్రమ ఏకగ్రీవాలతో పెచ్చు రేగుతున్నాయి.. ఇప్పటికే అధికార పార్టీ పై ఎన్ని విమర్శలు వచ్చిన వారు మాత్రం వారి విధానాలను మార్చుకోకపోవడం అధికార పార్టీ .  తమ పట్టు కోల్పోయి ఓడిపోతామేమో అనుకున్న కొన్ని చోట్ల కొత్తగా అభ్యర్థులపై దాడులు చేస్తూ గృహనిర్భనాదాలు చేస్తున్నారు.. రక్షక భటులు అధికార పార్టీకి బంట్లుగా పనిచేస్తూ వారి మోచేతి నీళ్లు తాగుతున్నారు..   అదే తరహాలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం, టీడీపీ అభ్యర్థి గండి రామానాయుడును పోలీసులు గృహ నిర్బంధం చేసి వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరావును పోలింగ్ కేంద్రానికి అనుమతించడంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. అయితే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకే రామానాయుడును గృహ నిర్బంధం చేసినట్లు పోలీసులు తెలియజేశారు. దీంతో అంపిలి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. విజయ వాడ నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ నాయకులు 60ఏళ్ల మహిళా అని చూడకుండా దాడికి పాల్పడ్డారు.. మూడో డివిజన్ టీడీపీ అభ్యర్థి వాణి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఆమెపై దుండగులు దాడి చేశారు. వాణితోపాటు ఆమె కొడుకుపై దాడి చేసి ఇంట్లో సామానులు ధ్వంసం చేశారు. అవినాష్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తే ఊరుకోం అంటూ హెచ్చరిస్తూ. వైసీపీ కార్యకర్త తనపై దాడి చేశారని వాణి ఆరోపించారు. వైసీపీ నాయకులు ఆగడాలకు ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా కొడతారా? అంటూ ఆమె వాపోయారు. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఏమైనా ఊరకుక్కల బెదిరింపులకు భయపడేదిలేదని అన్నారు. దాడి ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.  అనంతపురం రూరల్ మండలం పరిధిలోని రాచానపల్లిలో మూడో విడతలో భాగంగా పోలింగ్ జరుగుతోంది. వైసీపీ మద్దతుదారులు గెలువడానికి వీలుగా దొంగ ఓట్లు వేయించడానికి వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేశారు. అయితే ఇది గమనించిన టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లను వేయించే ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.  ఎన్నికలను రాజకీయ నాయకులు నోట్ల రాజకీయం మారుస్తున్నారని. రాజ్యాంగ విరుద్ధమే కాక బెదిరింపులు .. గృహ నిర్బంధాలు జరగడం నీతి లేని రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు, ప్రత్యర్థి అభ్యర్థులు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు.. 

ఒక్క బాణం వేస్తే.. కోటి బాణాలు...

ఇటు షర్మిలను అటు జగన్ ను వదిలిపెట్టడం లేదు టీఆర్ఎస్ నేతలు. ఏ ముహూర్తాన షర్మిల మీటింగ్ పెట్టారో కానీ అప్పటి నుంచీ ఆమెపై తెలంగాణ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మా ప్రాంతం మేం చూసుకుంటాం.. ఇక్కడ మీకేం పని అన్నట్టు మాట్లాడుతున్నారు. షర్మిలతో పార్టీ పెట్టించింది కేసీఆరేనని కాంగ్రెస్, బీజేపీ నేతలంతా ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. సైలెంట్ గా ఉంటే అదే నిజమనే మెసేజ్ జనాల్లోకి వెళ్లిపోతుందనుకున్నారో ఏమో గులాబీ నేతలు సైతం తెగ ఆవేశపడుతున్నారు. షర్మిల వెనుకున్నది కేసీఆరా? బీజేపీనా? అనే విషయం పక్కనపెట్టి.. తెలంగాణ పార్టీలన్నీ కలిసి షర్మిల, జగన్ లపై విమర్శల డోసు పెంచుతున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్నారు షర్మిల. రాజన్న రాజ్యం రావాలంటే ఇప్పుడున్న దొర పాలన పోవాలన్నట్టేగా? అనే చర్చ జరుగుతోంది. ఇది అధికార టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. అందుకే, కారు పార్టీ నేతలు షర్మిలపై పంచ్ డైలాగులు వేస్తూ మరింత కాక రేపుతున్నారు. కొందరు షర్మిలను జగనన్న వదిలిన బాణంగా చెబుతుంటే.. ఆ అన్నాచెల్లెల్ల మధ్య గొడవలున్నాయనే వారు ఇంకొందరు. వారి ఫ్యామిలీ మేటర్ పై ఇంకా క్లారిటీ రాకున్నా.. లేటెస్ట్ గా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సైతం అన్నా, చెల్లెళ్లకు గొడవలు ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలని.. తెలంగాణ విషయంలో జోక్యం ఏంటంటూ ప్రశ్నించారు. జగన్ ఒక్క బాణం వేస్తే.. తాము కోటి బాణాలు వేస్తామంటూ బాహుబలి రేంజ్ లో డైలాగ్ వదిలారు. తెలంగాణలో షర్మిల ఎంట్రీకి కౌంటర్ గా.. మరోసారి రాయలసీమ ఎపిసోడ్ ను తెరమీదకు తీసుకొచ్చారు మంత్రి గంగుల. ప్రత్యేక రాష్ట్రం కోసం సీమ వాసులు ఎప్పటి నుంచో పోరాడుతున్నారని.. కావాలంటే షర్మిల రాయలసీమలో పార్టీ పెట్టాలని సలహా కూడా ఇచ్చేశారు. తెలంగాణలో ఆంధ్రా పెత్తనం వస్తే మళ్లీ కష్టాలు తప్పవని హెచ్చరించారు గంగుల కమలాకర్. రావిరాలలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ సూపర్ హిట్ అయిన మర్నాడే.. మంత్రి నోటి నుంచి షర్మిల పార్టీపై విమర్శలు రావడం వ్యూహాత్మకమే అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి నిలవకుండా.. షర్మిల పేరును నిత్యం వార్తల్లో ఉండేలా.. ఇలా కామెంట్లు చేస్తున్నారనే వారూ ఉన్నారు. ఇదంతా గులాబీ గేమ్ ప్లాన్ అంటున్నారు ఇంకొందరు.  

రేవంత్ రెడ్డి చెంతన.. వైఎస్ఆర్ నీడ..

తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రావిరాలలో రాజీవ్ రైతు రణభేరి సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో ఒక అనూహ్యకర ఘటన చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆ వ్యక్తి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సభకు హాజరుకావడం ఇపుడు హాట్ టాఫిక్‌గా మారింది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఉమ్మడి ఎపీ సీఎం దివంగత రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూరీడు. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సూరీడు ఆయనకు నీడలా వ్యవహరించేవారు. వైఎస్ ఎక్కడికి వెళ్లినా వెనుక సూరీడు తప్పకుండా ఉండాల్సిందే. అయితే రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం సూరీడు.. ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అయితే ఉన్నట్టుండి ఇపుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న రైతు భరోసా సభలో ప్రత్యక్షం అవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉండగా వైఎస్సార్ కుమార్తె షర్మిల తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ప్రయత్నాలలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయత్నంలో ఆమె వెనక ఎవరున్నారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఒక కథనం ప్రకారం ఒకప్పటి వైఎస్ఆర్ ప్రధాన అనుచరులు, సన్నిహితులు ఆమెతో కలిసి పని చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోపక్క వైఎస్ నీడగా భావించే సూరీడు ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ సభ వేదిక మీద ప్రత్యక్షం కావడంతో దీని వెనక కారణమేమిటనేది మరింత చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉండగా ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ సమీపంలోని రావిరాలలో రైతు రణభేరి సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభ మీద కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కొందరు అసమ్మతి వ్యక్తం చేస్తూ సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, చిన్నారెడ్డి, కొండా సురేఖ, సీతక్క, మల్‌రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, విజయ రమణా రావు, దాసోజు శ్రావణ్ వంటి మరి కొంతమంది ముఖ్య నాయకులు మాత్రం ఎంపీ రేవంత్ సభకు హాజరయ్యారు.

నోట్లతో ఓట్లు.. ఇదే వైసీపీ తీరు..

నోటు  ఉంటేనే అధికార సీటు అన్నట్టుగా మారింది ఏపీ లో పంచాయతీ ఎన్నికల తీరు. మూడో దశ పోలింగ్ లో అధికార పార్టీ నేతల ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి.  నోట్లు ,మద్యం, పంచుతూ వైసీపీ  ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. పవిత్రమైన పంచాయతీ ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారు. అధికారాన్ని దక్కించుకోడానికి వైసీపీ బలపరిచిన అభ్యర్థులు  తొక్కని అడ్డదారులు లేవు. ఒక వైపు కోర్టు, మరో వైపు ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలు పెట్టిన వాటిని తుంగలో తొక్కుతున్నారు. పోటీలో నిలిచిన ఇతర అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేయడంతో ఆగకుండా ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. పోలీసులు కూడా ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పచ్చిమ గోదావారి జిల్లా  పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల ప్రలోభాలు కొనసాగాయి. చింతలపూడి మండలం, ప్రగడవరంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు వైసీపీ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేశారు. వైసీపీ శ్రేణులు డబ్బులు పంచుతూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీరు సిద్ధమైతే మేము సిద్ధమే చంద్ర బాబు..

ఏపీలో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై  కేంద్రానికి  బుద్ధి చెప్పడానికి కార్మిక సంఘాలు , ప్రజలు పార్టీల నాయకులు  ఆందోళనలు చేస్తుండగా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు గా లేకపోగా..  ప్రజల్లో  తమ ఉనికిని కాపాడుకోవడానికి మేము సిద్దమే అంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. విశాఖ ప్రయివేటీకరణపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ..విశాఖ  ఉక్కును ప్రయివేట్ పరం చేయొద్దని. తెలుగు ప్రజల హక్కును కాపాడుకోవడానికి అందరు ఒక్కటి కావాలని. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సొత్తు.. దాన్ని దక్కించుకోవాలని అందుకు ప్రజలు, పార్టీలు కలసి కట్టుగా సిద్ధం కావాలని.. తెలుగు ప్రజల గళం విప్పి కేంద్రం మెడలు వంచాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకు రాజీనామాలకు మీరు సిద్ధమైతే మేము సిద్ధమంటూ చంద్ర బాబు నాయుడు సవాల్ విసిరాడు.. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసే ఆలోచనను వ్యతిరేకించే పక్షంలో అధికార వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, తాము ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తామని తనతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని ఆయన అన్నారు, ఈ విషయంలో తాను సీనియర్ నేతననే అహం లేకుండా ప్రజల మనోభావాలను పరిరక్షించేందుకు ముందుకు వస్తానని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు సీఎం స్థాయిలో ఉన్న జగన్ ఏం చెబితే, అది చేస్తానని, ఈ విషయంలో అధిక బాధ్యత తనపైనే ఉందని జగన్ గుర్తించాలని సూచించారు.  వ్యక్తి గత హక్కు, సామాజిక హక్కు, వ్యక్తి గత హక్కుకు భంగం కలిగితే ఒక్కరే నష్టమవుతారు.. అదే సామాజిక హక్కు కు భంగం కలిగితే కొన్ని వేల జీవితాలు నష్టపోతాయి .. ఒక రాష్ట్రాన్నికి నష్టమవుతుంది.. ఇప్పుడు ఏపీ ముందు ఉన్న ప్రశ్న కూడా అదే విశాఖ ఉక్కు ను ప్రయివేట్ పరం చేయటానికి కేంద్రం కుట్రలు పన్నుతోంది..సామజిక హక్కుకు భంగం కలుగుతుంది.. ఆ సామజిక హక్కును కాపాడుకునే బాధ్యత మనందరిది..     

ఒకే అపార్ట్ మెంట్‌లో ఏకంగా 103 మందికి కరోనా.. బెంగుళూరులో కలకలం

మనదేశ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 103 మంది ఒకేసారి కరోనా బారినపడడం తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలోని బొమ్మనహళ్లి జోన్ లోని బిలేకహళ్లిలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో 435 ఫ్లాట్లు ఉన్నాయి. ఆ ఫ్లాట్లలో మొత్తం 1500 మంది నివసిస్తున్నారు. ఒక్కసారిగా ఇంతమందికి కరోనా వైరస్ సోకడానికి ఈ నెల 6న అపార్ట్‌మెంట్ వాసులు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్న పెద్ద పార్టీ లో డ్రైవర్లు, పనిమనుషులు, వంటవాళ్ళతో సహా అందరు హాజరయ్యారు. అయితే ఈనెల 10 న మొదటి పాజిటివ్ కేసు బయటపడడంతో అందరికీ పరీక్షలు నిర్వహించగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 103 కు చేరుకుంది. ఇలా ఉండగా పాజిటివ్ వచ్చిన వారిలో 96 మంది 60 ఏళ్లకు పైబడిన వారిగా గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులు అపార్ట్‌మెంట్‌కు వద్దకు చేరుకుని సెక్రటరీ, ఇతర సిబ్బందితో మాట్లాడి వారు పాటిస్తున్న కొవిడ్ నిబంధనలపై ఆరా తీశారు. అందరు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. బీబీఎంపీ సిబ్బంది అపార్ట్ మెంట్ మొత్తం శానిటైజ్ చేశారు. కరోనా బారినపడి వారందరు ప్రస్తుతం క్వారంటైన్‌కు వెళ్లారు..

మాస్క్ గాలికొదిలేసిన జనం.. మళ్ళీ లాక్ డౌన్ దిశగా ముంబై

భారత్ లో కరోనా వ్యాప్తి కొంతవరకు తగ్గినప్పటికీ.. గత మూడు రోజులుగా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో రోజుకు మళ్ళీ నాలుగు వేల కేసులు నమోదవుతున్నాయి దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్ పెట్టబోతున్నట్లుగా అక్కడి పాలకులే సంకేతాలు ఇస్తున్నారు. నగరంలో ప్రజలు కరోనా నిబందనలు పాటించడం లేదని, ఇలా అయితే మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని ముంబై నగర మేయర్ కిషోరి పండేకర్ హెచ్చరించారు. ముంబైలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై మంగళవారం అధికారులతో చర్చలు జరిపారు. సమావేశం తరువాత మీడియాతో మాట్లాడుతూ మహమ్మారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను మరోసారి హెచ్చరించారు. ‘నగరంలోని ‘ప్రజల గురించి మాకు చాలా ఆందోళన ఉంది. రైళ్లలో ప్రయాణిస్తున్న వారిలో చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదు. అయితే మనం మరోసారి లాక్‌డౌన్‌కి వెళ్లకూడదనుకుంటే ప్రజలు అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించి, ప్ర‌భుత్వానికి స‌హాక‌రించాలి.. ముంబైలో మళ్లీ లాక్‌డౌన్ విధించడమనేది ప్రజల చేతుల్లోనే ఉంది’’ అని మేయర్ అన్నారు. గతంలో మూడు నెలల నిర్బంధ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా మంది నష్టపోయారు. ఇది ఇలా ఉండగా దేశం మొత్తంలో ప్ర‌తి రోజు సుమారు 10వేల పాజిటివ్ కేసులు కొత్త‌గా న‌మోద‌వుతుంటే… అందులో దాదాపు స‌గం కేసులు కేవలం మ‌హారాష్ట్ర, కేర‌ళ నుండే న‌మోద‌వుతుండ‌టంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆందోలన చెందుతున్నాయి.

గన్నవరం పంచాయతీలో ఊహించని ట్విస్ట్... వంశీకి షాక్ తప్పదా   

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశి టీడీపీ తరుఫున గెలిచి తరువాత వైసిపికి మారిన నాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమౌతున్న సంగతి తెల్సిందే. వంశి వైసిపిలోకి వెళ్లినా అక్కడ అప్పటికే ఉన్న రెండు గ్రూపుల నాయకులతో నిత్యా ఘర్షణ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే నియోజకవర్గం పరిధిలోని గన్నవరం పంచాయతీలో రాజకీయ సమీకరణాలు హఠాత్తుగా మారిపోయాయి. ఇక్కడ వైసీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పాలేటి మనోజ్ఞ తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మనోజ్ఞ చేరికతో గన్నవరం పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. తాజాగా మారిన సమీకరణాలతో ఈనెల 21న జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. గత కొంత కాలంగా రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా ఉన్న గన్నవరం ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాలి.

పబ్ జీ ఆడుకుంటున్నావా జగన్! విశాఖలో చంద్రబాబు విశ్వరూపం 

స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ నగరం లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే ఏపీ  ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. జగన్ ఎక్కడున్నావ్.. పబ్‌జీ ఆడుకుంటున్నావా? విశాఖను దోచుకోవాలనుకుంటున్నారా? అంటూ చంద్రబాబు నిలదీశారు.  ఆనాడు ఉక్కు ఉద్యమంలో ఎవరూ తుపాకులకు భయపడలేదని, 32 మంది ప్రాణత్యాగాలు చేశారని చంద్రబాబు అన్నారు. ఇందిరాగాంధీ అంతటివారు సైతం దిగొచ్చారని తెలిపారు. నాడు అంతమంది ప్రాణత్యాగం చేస్తే, వారి ప్రాణత్యాగాల విలువ తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఓట్లు వేశాక జగన్ రెడ్డికి ప్రజలతో అవసరం తీరిపోయిందని, అందుకే హోదా గురించి మాట్లాడడంలేదని అన్నారు. ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో విధ్వంస పాలన షురూ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.  ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అని, దీని ద్వారా రూ.33 వేల కోట్ల పన్నులు చెల్లించారని చంద్రబాబు వివరించారు. ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు కూడా పన్నులు కట్టారని తెలిపారు.తాను మెచ్చే నగరం ఎప్పటికీ విశాఖపట్నమేనని ఉద్ఘాటించారు. విశాఖ మంచివాళ్లు ఉండే నగరం అని చంద్రబాబు అభివర్ణించారు. ఇక్కడి ప్రజలు ఎంతో నీతి నిజాయతీపరులని, అందుకే ఈ నగరాన్ని తాను అమితంగా ఇష్టపడతానని వివరించారు. ఒకప్పుడు చిన్నగ్రామంగా ఉన్న విశాఖ నేడు ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉందన్నారు టీడీపీ అధినేత.  ‘విశాఖ ఆత్మను అమ్మితే మీరు ఆమోదిస్తారా? విశాఖ స్టీల్ సిటీని స్టోలెన్ సిటీగా చేస్తే మీరు అంగీకరిస్తారా? విశాఖ ఉక్కపై సీఎం ఎందుకు మాట్లాడటం లేదు. నోరు పడిపోయిందా? విశాఖ ప్రజలు మంచివాళ్ళు అయినా పిరికివారు. విశాఖ ఉక్కు సంకల్పాన్ని అమ్మిస్తే.. ఊరుకోం. విశాఖపట్నం నాకు ప్రాణం.. అందర్నీ అడిగే అమరావతి ప్రకటించాను. విజయసాయిరెడ్డి అంతు చూస్తాం.  ముఖ్యమంత్రి తేలు కుట్టిన దొంగ. రేపు దొంగ స్వామిని కలవటానికి సీఎం వస్తున్నారు. అందరూ నన్ను నువ్వు చేతగానివాడివి... తిట్టలేవు అని అంటారు. విశాఖ స్టీల్ సాధిస్తావా? లేక నా వల్ల కాదు అని రాజీనామా చేసి జైలుకు పోతావో పో’ అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.   విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైజాగ్ లో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన దీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలికారు. విశాఖ వచ్చిన చంద్రబాబు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లాను కలిసి సంఘీభావం ప్రకటించారు. దీక్ష శిబిరం వద్ద భారీగా హాజరైన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.  ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమానికి పల్లా శ్రీనివాసరావు తన దీక్షతో ఊపిరి పోశారని చెప్పారు చంద్రబాబు.