చిట్టచివరికి నిజం ఒప్పుకున్న డ్రాగన్..

గతేడాది జూన్ లో భారత్ భిన్న సరిహద్దులో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలో ప్రాణ నష్టం జరిగిన సంగతి తెల్సిందే. అప్పట్లో చైనా మిలటరీ ఘాతుకానికి కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 20 మంది భారత సైనికులు అమరవీరులయ్యారు. అయితే చైనా మాత్రం ఈ ఘర్షణలో తమ సైనికులు మరణించలేదని అప్పట్లో బుకాయించింది. 35 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారని భారత్ ప్ర‌క‌టించింది. అయితే అప్పట్లో తమ సైనికులు ఎవరు చనిపోలేదని బీరాలు పలికిన చైనా ప్రభుత్వం...చిట్టచివరికి నిజాన్ని బయట పెట్టింది భారత్, చైనా బలగాల మధ్య గాల్వాన్‌లో జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన ఐదుగురు అధికారులు, పలువురు జవాన్లు మరణించారని మొట్ట మొదటి సారి చైనా సర్కార్ ఒప్పుకుంది. అంతేకాకుండా ఆ అధికారుల పేర్లను కూడా చైనా విడుదల చేసింది. ఈ ఘటనలో మరణించిన వారికి చైనా సర్కార్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. ఈ విషయాన్ని తాజాగా చైనా మీడియానే వెల్లడించింది. మరణించిన వారిలో జిన్జియాంగ్ మిలటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంట్ కమాండర్ క్వి ఫాబావోతో పాటు క్విఫాబావో, చెన్ హాంగ్‌జున్, చెన్ జియాంగ్‌రాంగ్, జియావో సియువాన్, వాంగ్ జువారన్‌లను చైనా ప్రభుత్వం అవార్డులతో గౌరవించింది.      

పాడె మోసిన రాహుల్ గాంధీ.. 

కేంద్ర మాజీ మంత్రి సతీశ్‌ శర్మ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గోవాలో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. శుక్రవారం ఆయ‌న అంత్యక్రియలను ఢిల్లీలో జరిగాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పాడెను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌లు మోశారు. గతంలో కెప్టెన్‌ సతీశ్‌ శర్మ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నాడు. సతీశ్‌ శర్మ సికింద్రాబాద్‌లో 1947, అక్టోబరు 11న  జన్మించారు. స‌తీశ్ శ‌ర్మ‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొద‌ట‌ ప్రొఫెషనల్‌ కమర్షియల్‌ పైలెట్ గా ప‌ని చేసిన ఆయ‌న అనంత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు‌. మూడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆయ‌న‌ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

బినామీల కోసమే విశాఖ భూముల అమ్మకం :యనమల

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం కుట్ర జగన్, విజయసాయిరెడ్డిలదే అన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల. రాజధాని పేరుతో విశాఖలోని ప్రైవేటు స్థలాలు, ఆశ్రమ భూములపై జగన్ కన్ను వేశారని ఆరోపించారు. అవి చాలక  ఇప్పుడు ఏకంగా స్టీల్ ప్లాంట్ భూములపైనే జగన్ నజర్ పడిందని మండిపడ్డారు. బినామీల పరం చేసేందుకే స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకమని... అందులో మొదటి స్టెప్ ప్రధానికి జగన్ లేఖ రాయడమని యనమల ఆరోపించారు. భూముల అమ్మకం ప్రణాళిక.. జగన్ లేఖలో రహస్య అజెండా ఉందని అన్నారు. విశాఖలో జె గ్యాంగ్ బెదిరింపులు, భూకబ్జాలకు అంతే లేదని  యనమల ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ను దిగమింగే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు. 2లక్షల కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేయడం కోసం కుట్ర చేస్తోందన్నారు. పరిరక్షణ ఉద్యమం వేదికలపైనుంచి వైసీపీ నాయకులను, విజయసాయిరెడ్డి లాంటి పందికొక్కుల్ని ప్రజలు తరమికొట్టాలని పిలుపు ఇచ్చారు. సీఎం జగన్ ఆడుతున్న డ్రామను రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకుని గట్టిగా నిలదీయాలని పట్టాభి సూచించారు. ఏడాది క్రితమే పోస్కోతో జగన్‌కు ఒప్పందం కుదిరిందని పట్టాభిరామ్ ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భూముల కోసం సీఎం జగన్‌ నాటకం ఆడుతున్నారని.. విశాఖ ఉక్కు మన హక్కని.. వదులుకునేది లేదని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. సీఎం జగన్ డ్రామాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నామన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?.. లేక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని నడుపుతున్నారా? అని పట్టాభి ఫైర్ అయ్యారు.   

రథసప్తమి వేడుకలు

అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి చేతుల మీదుగా వేడుకలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి  ధర్మాన కృష్ణదాస్ లతో కలిసి తొలి దర్శనం చేసుకున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం తరపున సూర్యనారాయణస్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. రథసప్తమి రోజున సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు. స్వామి వారి నిజ రూప దర్శనంతో తరించారు. అటు.. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలై, చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 9 గంటల నుంచి 10 వరకు చిన్నశేష వాహనం, 11 నుంచి 12 వరకు గరుడ వాహనంపై స్వామి వారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు. 

చింతమనేని రిలీజ్..

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. ఏలూరు రూరల్ స్టేషన్ నుండి చింతమనేని ని అర్ధరాత్రి పోలీసులు రిలీజ్ చేశారు. బి. సింగవరం కేసుకు సంబంధించి పోలీసులు చింతమనేనిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు చింతమనేని ని హాజరుపరిచారు. విచారణ జరిపిన జడ్జి 41సి నోటీసు ఇచ్చి చింతమనేనిని విడుదల చేయాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించారు. అనంతరం అర్థరాత్రి ఆయనను ఇంటి దగ్గర పోలీసులు వదిలిపెట్టారు. చింతమనేని అరెస్ట్ తో బుధవారం హైడ్రామా నడిచింది. బి. సింగవరంలో  చింతమనేని ప్రచారానికి వచ్చివెళ్లాకా ఇరువర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అందుకు చింతమనేని బాద్యుణ్ని చేస్తూ  పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. టీడీపీ నేత అరెస్ట్ పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.చింతమనేని అరెస్టుపై పోలీసు ల తీరును తప్పు పట్టారు. చింతమనేని అరెస్ట్ సంచలనంగా మారగా, అర్ధరాత్రి అయన విడుదలతో ఉద్రిక్తత సద్దుమనిగింది.       

టీఆర్ఎస్ కీలక నేతకు బిగిస్తున్న ఉచ్చు ?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. పోలీసుల విచారణలో కొత్త వ్యక్తుల పేర్లు బయటికి వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కీలక నేత ,మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. ఆ నేత మేనల్లుడి పాత్ర తెరపైకి రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. వామన్ రావును హత్య కోసం మూడ్రోజుల ముందే పథక రచన జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరిన్ని సాక్ష్యాధారాల కోసం గుంజపడుగులో బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంటశ్రీను ఏ1,  ఏ2గా చిరంజీవి, ఏ3గా కుమార్  నిందితులుగా ఉన్నారు. తాజాగా పెద్దపల్లి జెడ్పీచైర్మన్ , మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పేరు తెరపైకి వచ్చింది. వామన్ రావు హత్య జరగడానికి ముందు కుంట శ్రీను 25సార్లు అతనితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.అంతేకాదు వామనరావు దంపతులను హత్య చేయడానికి అవసరమైన కారు, కత్తులను జెడ్పీచైర్మన్ మేనల్లుడే అందించాడని పోలీసులు నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిట్టు శ్రీను పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు.  గుంజపడుగు శివాలయం చైర్మన్ పదవిలో గత కొన్నేళ్లుగా వామన్ రావు బంధువు కొనసాగుతున్నారు. ఆ పదవికోసం కుంట శ్రీను ప్రయత్నాలు చేయడంతో వివాదం ఉందంటున్నారు. అక్రమ క్వారీ వల్ల పుట్టమధు రూ.కోట్లు గడించాడని వామన్ రావు పలుమార్లు పిటిషన్స్ వేశాడు. ఈ రెండు ఘటనలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.  తన మేనల్లుడి పేరు తెరమీదకు రావడంపై జెడ్పీ చైర్మన్ పుట్టమధు ఇంకా స్పందించలేదు. మరోవైపు లాయర్ వామనరావు దంపతుల హత్య ఘటన పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారిందనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కుంట శ్రీనను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా.. పుట్ట మధుపైనా వేటు వేసే యోచనలో గులాబీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది.

చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం.

ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం. ఆయన కుమార్తె శిరిష్మ (27) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇంటీరియర్ డిజైనర్ అయిన శిరిష్మకు హైదరాబాద్ మణికొండలోని ట్రయల్ విల్లాస్‌కు చెందిన గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016లో వివాహమైంది. గత ఏడాది కాలంగా వీరు గచ్చిబౌలి డీ అడ్రెస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి  భర్త సిద్ధార్థ్ ఇంటికి రాగా, గదిలో ఫ్యాన్‌కి  చీరతో ఉరివేసుకున్న శిరిష్మ కనిపించింది. సిద్దార్థ్ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శిరిష్మ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శిరిష్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దమ్ముంటే గెలవండి.. కోట్ల సవాల్

ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం సాగుతున్న సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికలలో వైసీపీని గెలిపించకుంటే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వాలంటీర్ల ద్వారా ఓటర్లను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.అలాగే పోలీసులను పక్కనపెట్టి వైసిపి నేతలు పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. మంత్రులకు దమ్ముంటే పెండింగ్ ప్రాజెక్ట్‌లకు నిధులు విడుదల చేయాలని కోట్ల సవాల్ విసిరారు.   వైసీపీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని కోట్ల అన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అయన భరోసా ఇచ్చారు. ప్రజాసేవే తమ లక్ష్యమని, అలాగే రాష్ట్ర ప్రజలు బాగుండటమే తమకు కావాలని సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. మరోపక్క పేకాట, బెట్టింగులను ప్రోత్సహిస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు ఉందా..? అని కోట్ల సూటిగా ప్రశ్నించారు.

దయచేసి మాకు ఓటేయకండి! సర్పంచ్ అభ్యర్థుల వింత ప్రచారం 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు జరిగాయి. సొంత కుటుంబ సభ్యులే పోటీ పడ్డారు. అన్నాదమ్ముళ్లు, తోడి కోడళ్లు, అత్తా కోడళ్లు, తండ్రి కొడుకులు పంచాయతీ పదవుల కోసం పోరాడారు. నాలుగో దశకు సంబంధించి ఓ గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. తమకు ఓటేయని ప్రచారం చేయాల్సిన అభ్యర్థులే.. ఇంటింటికి తిరిగి తమకు ఓటు వేయవద్దని ఓటర్లను కోరుతున్న పరిస్థితి నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం మొగలికుదురులో జరుగుతున్న ఈ ప్రచారం అందరిలోనూ చర్చగా మారింది.   మొగలికుదురు సర్పంచ్ పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ అంతలోనే గ్రామస్తులంతా సమావేశమై ఒక్కరే పోటీలో ఉండాలి తీర్మానించారు. కడి అరుణ కుమారి పేరును ఖరారు చేశారు. అందరూ ఆమెకే ఓటు వేయాలని గ్రామస్తులకు చెప్పారు. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన మిగతా ఇద్దరు నాగలక్ష్మి, వెంటకరమణలు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వారు కూడా పోటీలో ఉన్నట్లే లెక్క. ఎన్నికల అధికారులు గుర్తులను కూడా ఖరారు చేశారు. ఇక చేసేదేం లేక, ఆ ఇద్దరు అభ్యర్థులు గ్రామంలో విచిత్ర ప్రచారం చేస్తున్నారు. తాము పోటీలో లేమని.. మాకు ఓటు వేయకూడదని ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తులను చూపించి వీటికి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అరుణ కుమారినే గెలిపించాలని కోరుతున్నారు.  

వైసీపీ సీనియర్ నేత పార్టీకి గుడ్ బై..

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిపోయింది. సామాన్య ఓటర్లను ఒకపక్క అధికార వైసిపి నేతలు, మరోపక్క గ్రామ వాలంటీర్లు భయపెడుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇది కేవలం సామాన్యుడి అభిప్రాయమే కాదు.. సాక్షాత్తు వైసిపి సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పుష్పవాణి మామగారైన శత్రుచర్ల చంద్రశేఖర రాజు నిన్న వైసిపికి రాజీనామా చేస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దారుణ పరిస్థితులు చూడలేకే పార్టీకి గుడ్ బై చెపుతున్నట్లుగా పేర్కొన్నారు. వైసిపి పార్టీలో నియంతృత్వ పోకడలు పెరిగిపోయాయని, తనకు అవి నచ్చకే పార్టీని శాశ్వతంగా వీడుతున్నట్టు చంద్రశేఖర రాజు ప్రకటించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకాపోతే పింఛన్లు, ఇళ్లు మొదలైన సంక్షేమ పథకాలు కట్ చేస్తామని గ్రామ వలంటీర్ల ద్వారా పార్టీ నాయకులు చెప్పించారని అయన ఆరోపించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన విధానం కాదని అయన అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. సామాన్యులపై రాజకీయ దాడులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ఎపి అథోగతి పాలవుతోందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వ తీరు తనను ఎంతగానో బాధించాయని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్టు అయన స్పష్టం చేశారు.

దళితులు పోటీ చేస్తే నరికేస్తారా..?

ఏపీలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, రాచరికపు పాలనా కొనసాగుతుందా..? లేక రౌడీ పాలనా కొనసాగుతుందా..? అని నిత్యం ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ప్రతిపక్షాలలో కూడా ఈ సందేహం లేకపోలేదు.  పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలు పెచ్చు రేగుతున్నాయి. దళితులపై జరుగుతున్న దాడులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామంలో దళితులపై వైసీపీ నాయకుల దాడి జగన్ రెడ్డి రాచరికపు అహంకార పాలనకి అద్దం పడుతోందని లోకేశ్ విమర్శించారు. జాతి తక్కువ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారా?... నరికి చంపేస్తాం అంటూ రాళ్లతో దళితులపై దాడి చెయ్యడం, ఇళ్లకు వెళ్లి బెదిరించడం అమానుషమన్నారు . కులం పేరుతో దూషించడమే కాకుండా, దళిత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దాడులకు తెగబడ్డ వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లింగాపురం గ్రామంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరారు.  దళితుల ఓట్లు కావాలి వాళ్ళు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయవద్దు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. మనం ఇంకా  ఏ సమాజం లో బతుకుతున్నాం. రాజ్యాంగం లో ఆర్టికల్ 14  చట్టం ముందు అందరు సమానులే అన్న పదాన్ని సమాధి చేసి బతుకుతున్నామా అంటూ ప్రజలు, ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ్ బక్కడ్ బాంబే బో.. డీజిల్ నబ్బే, పెట్రోల్ సౌ!

దేశంలో చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రోజులుగా  పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజల్ రేట్లు. లీటర్ పెట్రోల్ రేట్ కొన్ని ప్రాంతాల్లో సెంచరీ మార్క్ దాటేసింది. రాజస్థాన్ లోని చాలా ప్రాంతాల్లో ప్రీమియం పెట్రోల్ లీటర్ ధర వంద రూపాయలు దాటగా.. సాధారణ పెట్రోల్ కూడా వంద రూాపాయలు చేరుకుంది. మధ్యప్రదేశ్‌తోపాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో బ్రాండెడ్ పెట్రోలు ధర రూ. 100 మార్కును దాటేసింది. రాజస్థాన్‌లో రెగ్యులర్ పెట్రోలు ధర కూడా వంద రూపాయలు దాటేసి వాహనదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లీటర్ పెట్రోల్ రేట్ సెంచరీ మార్క్ దగ్గరలో ఉంది.  దేశంలో పెరుగుతూ పోతున్న పెట్రో ధరలపై బాలీవుడ్ సీనియర్ నటి, శివసేన నేత ఊర్మిళా మటోండ్కర్ సెటైరికల్‌గా స్పందించారు. చిన్నపిల్లలు పాడుకునే ‘అక్కడ్ బక్కడ్ బాంబే బో’ పాటలో మార్పులు చేసి ‘అక్కడ్ బక్కడ్ బాంబే బో.. డీజిల్ నబ్బే, పెట్రోల్ సౌ.. సౌ మే లగే ధాగా.. సిలిండర్ ఊచల్ కే భాగా’ అని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది.

కేసీఆర్ బర్త్ డేతో మైండ్ గేమ్!

ఫిబ్రవరి 17. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. పూజలు, పాలాభిషేకాలు, రక్త దానాలు, ఫ్లెక్సీలు, ప్రకటనలు, కేక్ కటింగ్స్, స్పెషల్ సాంగ్స్ తో పాటు కోటి వృక్షార్చన ఈసారి హైలైట్. ఇంతకు ముందెప్పుడు కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్ గా జరిగింది లేదు.  గతంలోనైతే కేసీఆర్ పుట్టిన రోజు ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో జనాలకు తెలిసేది కూడా కాదు. ఈ సారి మాత్రం అలా కాదు. దేశ, విదేశాల్లో బ్యానర్లు. ఊరూరా హోర్డింగ్స్. వాడవాడలా కటౌట్స్. అన్ని చోట్లా కేసీఆర్ కు విషెష్. అబ్బో.. ఓ రేంజ్ లో హోరెత్తింది కేసీఆర్ బర్త్ డే జోష్.  ఎందుకు? సడెన్ గా ఇప్పుడే ఎందుకు? ముఖ్యమంత్రి అయ్యాక ఏడేళ్లుగా లేనిది ఇప్పుడే ఎందుకిలా? షష్ఠి పూర్తి, ప్లాటినం జూబ్లీ ఇయర్ కూడా కాదు. జస్ట్ 67వ పుట్టిన రోజు. పెద్దగా ఇంపార్టెన్స్ లేని ఇయర్. 67 ఏళ్లను పండగలా జరుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే ఆసక్తికర చర్చ తెలంగాణలో నడుస్తోంది. ఇవి అనుకోకుండా జరిగిన వేడుకలు కాదని.. దాని వెనుక ప్లానింగ్, పొలిటికల్ ఈక్వేషన్ దాగుందని అంటున్నారు.  కోటి వృక్షార్చన... ఈ సారి కేసీఆర్ బర్త్ డే స్పెషల్ కోటి వృక్షార్చన. ముఖ్యమంత్రి సమీప బంధువు, ప్రగతి భవన్ లోనే ఉండే ఎంపీ సంతోశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిందీ కార్యక్రమం. అనేక ప్రముఖులు, సామాన్యులు చెట్లు నాటి కేసీఆర్ కు బర్త్ డే విషెష్ చెప్పారు. కోటి మొక్కలతో పెద్ద ఎత్తున సాగింది ఈ ఈవెంట్. ఆ క్రెడిట్ అంతా సంతోశ్ కుమార్ దే. వృక్షార్చనపై కేసీఆర్ సైతం సంతోషం, ఆనందం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలంతా సంతోశ్ కుమార్ చుట్టూనే తిరిగాయి. మీడియాలో రోజంతా కేసీఆర్ తో పాటు సంతోశ్ పేరే మారు మోగింది. ఎక్కడ చూసినా సంతోశ్.. సంతోశ్.. సంతోశ్.. ఫిబ్రవరి 17 కేసీఆర్ బర్త్ డే అయితే.. సంతోశ్ కుమార్ కు మరో రాజకీయ పుట్టిన రోజు అంటున్నారు కొందరు.  గులాబీ బాస్ బర్త్ డే జోష్ లో సంతోశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తే.. కేటీఆర్ పేరు పెద్దగా ప్రస్తావనకు రాలేదు. ఫిబ్రవరి 17న చిన్న బాస్ ఉనికి అంతంత మాత్రమే. గ్రామాల్లో వెలిసిన ఫ్లెక్సీల్లో కూడా సంతోష్ ఫోటోనే ప్రముఖంగా కనిపించింది. కేసీఆర్ బర్త్ డే పేరుతో ఈ సారి హడావుడి చేసిన బ్యాచ్ కూడా కొత్తది. వారంతా ఓ వర్గమనే వాదన వినిపిస్తోంది.  అంతలా కేటీఆర్ స్పేష్ ను బర్తీ చేసేశారు సంతోశ్ కుమార్ అని చెబుతున్నారు.  పవర్ సెంటర్ మారుతోందా? ఈ పరిణామాలను రాజకీయ వర్గాలు పలు రకాలుగా విశ్లేషిస్తున్నాయి. కేసీఆర్ కు, కేటీఆర్ కు మధ్య గ్యాప్ పెరిగిందనేది అందులో ఒకటి. కొంత కాలంగా ఆ ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయని, గ్రేటర్ మేయర్ ఎంపిక విషయంలో అవి తారాస్థాయికి చేరాయని అంటున్నారు. అందుకే, ఈ మధ్య కేసీఆర్ విషయాల్లో కేటీఆర్ అంటీముట్టనట్టుగా ఉంటున్నారని చెబుతున్నారు. కేటీఆర్ ను సీఎం చేస్తున్నారంటూ ఫుల్ గా ప్రచారం జరగడం.. ఇక రేపోమాపో కిరీటం ఖాయం అనుకున్న వేళ.. అంతా తూచ్ అంటూ కేసీఆర్ ఓ రేంజ్ లో నేతలపై ఫైర్ అవడం సంచలనంగా మారింది. ఆ ఎపిసోడ్ తో కేటీఆర్ బాగా హర్ట్ అయ్యారని.. మేయర్ ఎన్నిక విషయంలో మరింత అసంత్రుప్తి చెందారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే, ఈ సారి కేసీఆర్ బర్త్ డే వేడుకలు కేటీఆర్ ఆధ్వర్యంలో కాకుండా సంతోశ్ కుమార్ డైరెక్షన్ లో జరిగాయని పొలిటికల్ సర్కిల్ లో టాక్. కల్వకుంట్ల కుటుంబంలో ఏదో ఫ్యామిలీ డ్రామా నడుస్తోందని.. ప్రగతి భవన్ లో పవర్ సెంటర్ మారుతోందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  టాపిక్ డైవర్ట్ చేసేందుకేనా? మరో వాదనా ప్రచారంలో ఉంది. టాపిక్ ను డైవర్ట్ చేయడంలో కేసీఆర్ ఎక్స్ పర్ట్. దుబ్బాకలో పరాజయం, గ్రేటర్ ఎన్నికల్లో పరాభవం నుంచి ప్రజల ద్రుష్టి మళ్లించేందుకే కేటీఆర్ ను సీఎం చేస్తారనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. కొంత కాలం పాటు ముఖ్యమంత్రి మార్పు చుట్టూనే చర్చ జరిగిందని.. దుబ్బాక, గ్రేటర్ టాపిక్ పక్క దారి పట్టిందని చెబుతున్నారు. ఇక చాలు అనుకున్నాక.. వెంటనే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆవేశంతో ఊగిపోతూ సీఎం కుర్చీ దిగేది లేదంటూ కస్సుమని.. చర్చకు క్షణాల్లో పుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు.  కేసీఆర్ మైండ్ గేమా? రోజు రోజుకీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటం.. కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుండటం.. ఇదే సమయంలో నాగార్జున సాగర్ బై పోల్.. రెండు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్.. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నిక.. బీజేపీ దూకుడు.. రేవంత్ రెడ్డి పాదయాత్ర, రణభేరితో కాక మీదుండడం... ఇలా వరుస పరిణామాలతో కంగారెత్తిన కేసీఆర్ జనాలను కన్ఫూజ్ చేసే పని చేస్తున్నారని అంటున్నారు. హాలియా సభలో ప్రతిపక్షాలను తిట్టిపోయడం ఆయనలోని అసహనానికి నిదర్శణమని చెబుతున్నారు. ప్రజల్లో మళ్లీ కేసీఆర్ పై క్రేజ్ పెంచేలా.. ఎన్నికలు, రేవంత్ రెడ్డి టాపిక్ ను డైవర్ట్ చేసేలా.. బర్త్ డే సెలబ్రేషన్స్ తో రాష్ట్రమంతా హోరెత్తించారని అంటున్నారు. ఇదంతా కేసీఆర్ మైండ్ గేమ్ అని.. అందుకే సడెన్ గా పుట్టిన రోజు వేడుకలంటూ ఊదరగొట్టారనేది విశ్లేషకుల వర్షన్. మరి, ఇందులో నిజమెంతో కేసీఆర్ కే తెలియాలి..  

చింతమనేని అరెస్ట్.. లోకేశ్ ఫైర్.. 

ఏపీ టీడీపీ  ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ టీడీపీ నేత లోకేష్‌ ప్రకటించారు. ఎన్నికల్లో చింతమనేని ప్రచారానికి వచ్చివెళ్లాకా సింగారవంలో ఇరువర్గీయుల మధ్య ఘర్షణకు దిగాయి. ఈ కారణాన్ని అడ్డం పెట్టుకొని  చింతమనేనిని అరెస్ట్ చేశారని. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు హద్దు మీరుతున్నాయని నారా లోకేష్ మండిపడ్డారు. చింతమనేని అరెస్టుపై పోలీసు ల తీరును ఖండిస్తూ. తక్షణమే  ప్రభాకర్‌ను విడుదల చేయాలని  లోకేష్ డిమాండ్ చేశారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులు సీఎం జగన్ పిరికిపంద చర్యకు నిదర్శనమని . ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని నారా లోకేష్‌ మండిపడ్డారు.    

బీజేపీ అమ్ములపొదిలో రామబాణం

దేశమంతా కాషాయ జెండా ఎగరేయడమే బీజేపీ ఎజెండా. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని పట్టు సాధించింది. దక్షిణాదిపై ఎప్పటి నుంచో గురి పెట్టింది. అయితే.. కర్ణాటక మినహా సదరన్ స్టేట్స్ అంత ఈజీగా కాషాయ పరం కావటం లేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే, జాతీయ పార్టీల కూటమిల ఆధిపత్యం ఉన్న కేరళపై కన్నేసింది కమలదళం. అందుకు, కేరళపై బీజేపీ వదల బోతున్న రామబాణం మెట్రో మ్యాన్ శ్రీధరన్. దేశవ్యాప్తంగా కామ్రేడ్ల ప్రభ కనుమరుగవుతోంది. బెంగాల్, త్రిపురలో ఎర్రదండు తోక ముడిచింది. ఒక్క కేరళలోనే సీపీఐ(ఎమ్) అధికారంలో ఉంది. అక్కడ కమ్యూనిష్టులను గద్దె దింపితే.. ఇక ఇండియా మ్యాప్ నుంచి వామపక్ష అధికారాన్ని తొలగించినట్టే. అయితే.. అది అంత ఈజీగా జరిగే పని కాదని బీజేపీకీ తెలుసు. కేరళలో ఆ పార్టీ ఖాతా తెరవడమే కష్టంగా మారింది. ఢిల్లీలో రైతుల ఆందోళనతో మోదీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. డీజిల్, పెట్రోల్ ధర సెంచరీ వైపు పరుగులు పెడుతుండటం, సామాన్యుడిపై గ్యాస్ గుదిబండగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కేరళలో మళ్లీ ఎల్.డి.ఎఫ్ అధికారంలోకి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్టే.. త్వరలో జరగబోవు కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ లో వామపక్షాలకు లేదంటే కాంగ్రెస్.. ఆ ఇద్దరిలో ఒకరికి అధికారం దక్కుతుందని తేల్చి చెబుతున్నారు. పరిస్థితులు ఇంత వ్యతిరేకంగా ఉన్నా.. కమలనాథులు కేరళపై ఏమాత్రం ఆశ వదులుకోవడం లేదు. కేరళలో కమ్యూనిస్టుల పాలనను అంతం చేసేందుకు బీజేపీ రామబాణం సిద్ధం చేస్తోంది.  ఢిల్లీ మెట్రో రూపకర్త, మెట్రో మ్యాన్ గా పేరున్న కేరళకు చెందిన శ్రీధరన్ ను బీజేపీలో చేర్చుకునేలా సన్నాహాలు చేస్తోంది. శ్రీధరన్ తమ పార్టీలో చేరుతున్నారంటూ కేరళ రాష్ట్ర బీజేపీ ప్రకటించింది.  ఈ నెల 21న కేరళలో బీజేపీ ‘విజయ యాత్ర’ నిర్వహించనుందని. ఆ సందర్భంగా శ్రీధరన్ బీజేపీలో చేరుతారని కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రన్ ప్రకటించారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని, బీజేపీ ఒప్పుకుంటే తాను ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగానే ఉన్నానని శ్రీధరన్ గతంలోనే ప్రకటించారు. ఆయనొస్తే.. పార్టీ ఇమేజ్ మరింత పెరుగుతుందని.. విద్యావంతులు అధికంగా ఉండే కేరళలో శ్రీధరన్ కు చాలా క్రేజ్ ఉంటుందని అంచనా వేస్తోంది. అయితే.. ఎలాంటి రాజకీయ, పాలనా అనుభవం లేని శ్రీధరన్ ఇమేజ్ బీజేపీకి ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.   

కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడిపోయింది.. 

కుప్పంలో వైసీపీ గెలవలేదని.. ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు చంద్రబాబు. వైసీపీ నాయకులూ చరిత్ర హీనులని అన్నారు.  వాలంటీర్లు, అధికారులు అడుగడుగునా బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజాదరణ ఉన్నవాళ్లే ఎన్నికల్లో గెలుస్తారనే మాట  ఏపీలో అబద్దం అయిందని అన్నారు  ఏకగ్రీవాలను ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.. అభ్యర్థులను బెదిరిస్తున్నారన్నారు. వాలంటీర్లతో బెదరింపులకు దిగుతున్నారని. ఎన్నికల పోటీలో ఉంటే సంక్షేమ పథకాలు నిలిపేస్తామంటున్నారని, వాలంటీర్లు కూడా రౌడీలుగా ప్రవర్తిస్తున్నారని, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ ఎన్నికల సంఘం, కోర్టు చెప్పినట్లు కౌంటింగ్‌ను ఎందుకు రికార్డ్ చెయ్యలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కౌంటింగ్ హాల్‌లో పోలీసులకు ఏం  పని అని నిలదీశారు. డబుల్ డిజిట్ ఓట్ల మెజారిటీతో గెలిచిన చోటా రీకౌంటింగ్ ఎందుకు చేశారన్నారు. రాత్రి 10 గంటల తరువాత గెలుపు మార్చేశారని ఆయన ఆరోపించారు. కుప్పంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొంటే అధికారులు ఏమి చర్యలు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ‘కుప్పం ప్రజలు నా కుటుంబ సభ్యులు...దాన్ని కలుషితం చేస్తారా..? అని ప్రశ్నించారు. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన ఏజెన్సీలో ఎక్కువ చోట్ల టీడీపీ గెలిచిందన్నారు. వైసీపీ నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి తనతో మైండ్ గేమ్ ఆడలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిందని. టీడీపీ గళం ఎత్తడం వల్లనే ప్రజలు ఓటింగ్ వరకు వచ్చారని, మొదటి విడతలో 38 శాతం, రెండో విడతలో 39, మూడో విడతలో 40 శాతం స్థానాలు టీడీపీ గెలుచుకుందన్నారు. మూడు విడతల్లో పోలింగ్ జరిగిన చోట్ల 38-40 శాతం గెలుచుకున్నామన్నారు. పులివెందుల, పుంగనూరు, మాచర్లలో వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా నిలిచిపోతారన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేకు గట్టి షాక్ ఇచ్చిన జనం...

ఎన్నికల ప్రచారం అంటే ఎవరైనా ఓటర్లను బతిమాలో.. బామాలో గెలిచే ప్రయత్నం చేస్తారు. ఇక పంచాయతీ ఎలక్షన్లలో అయితే ప్రతి ఓటు కీలకం కాబట్టి నాయకులూ మరింత జాగ్రత్తగా వొళ్ళు దగ్గరబెట్టుకుని మరీ ఓటర్లను ఓటు వేడుకుంటారు. కానీ ఏపీలో వైసిపి నేతలు మాత్రం ఓటర్లను భయపెట్టి మరీ గెలవాలనే స్ట్రేటజీ ఫాలో అయిపోతున్నారు..అంతేకాకుండా తమ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పధకాలు కట్ చేస్తామంటూ జనాన్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా పెడన వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ మరో అడుగు ముందుకేసి కృత్తివెన్ను మండలానికి చెందిన నీలిపూడి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓటర్లకు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు తీవ్ర హెచ్చరికలు జరీ చేసారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులకు వ్యతిరేకంగా వార్డ్ మెంబర్ పదవికి, పంచాయతీ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడే అభ్యర్థుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన వీడియో బయటకు రావడంతో ఎస్ఈసీ ఆయనపై ఆంక్షలు విధించారు. అయితే జోగి రమేష్ హైకోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు. మూడో విడత ఎన్నికలలో ఆయనకు ప్రజాకోర్టులో షాక్ తప్పలేదు. జోగి రమేష్ ప్రజలను హెచ్చరించిన నీలిపూడి గ్రామంలో అయన బెదిరింపులు ఏమాత్రం పనిచేయలేదు. ఆ గ్రామంలోని 10కి 10 వార్డులు జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారు. అంతేకాకుండా సర్పంచ్ స్థానాన్ని కూడా ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థే కైవసం చేసుకున్నారు. ఎమ్మెల్యే చేసిన తీవ్ర వ్యాఖ్యల కారణంగా అయన ప్రచారం చేసిన గ్రామంలోనే ఇలా జరగడంతో స్థానిక వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లైంది. నీలిపూడి గ్రామంలో మొత్తం 1,408 ఓట్లు ఉండగా.. అందులో వెయ్యికి పైగా ఓట్లు జనసేన బలపరిచిన అభ్యర్థి పాశం కృష్ణకు పోల్ కాగా.. . కేవలం 270 ఓట్ల వైసీపీ మద్దతుదారులకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోపక్క పెడన నియోజకవర్గంలో జనసేన మద్దతదారులు ఇప్పటివరకు 11 పంచాయతీలను గెలుచుకున్నారు. జనసేన ఖాతాలో పడిన వాటిలో కంకటావ, ములపర్రు, కాకర్లమూడి, చోడవరం, బల్లిపర్రు, నీలిపూడి, ఉరిమి, నేలకొండపల్లి, కోమలపూడి, ఆకులమన్నాడు, ముల్లపర గ్రామాలున్నాయి.

హైకోర్టు లాయర్ల హత్య కేసును ఎన్‌కౌంటర్‌తో సరిపెడతారా.. బండి సంజయ్ సూటి ప్రశ్న

తెలంగాణాలో నిన్న హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను నడిరోడ్డు మీద పట్టపగలే దారుణంగా హత్య చేసిన ఘ‌ట‌న సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వామన్‌రావు తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై మండి పడ్డారు. న్యాయవాదుల హత్య ప్రభుత్వ హత్యేనని ఆయ‌న‌ ఆరోపించారు. పథకం ప్రకారమే న్యాయ‌వాద‌ దంపతులను చంపేశార‌ని, అంతేకాకుండా ఈ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజలు తిరగబడతారని ఆయ‌న హెచ్చ‌రించారు. ఎన్‌కౌంటర్ చేయడమా ద్వారా కేసు పక్కదారి పట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచార‌ణ‌‌ జరిపిన తరువాతే చర్యలు తీసుకోవాలని అయన టిఆర్ఎస్ సర్కార్ ను డిమాండ్ చేసారు. ఈ హ‌త్యల‌ ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ వెంటనే ‌ స్పందించాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. టీఆర్ఎస్ నేతలు ఈ దారుణం పై ఎందుకు స్పందించడం లేదని అయన నిల‌దీశారు.

కేసీఆర్ చెప్పిన వారికే పీసీసీ అధ్యక్ష పదవి?

కేసీఆర్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పని చేస్తోందా? సీఎం చెప్పినట్టే హస్తం నేతలు యాక్షన్ చేస్తున్నారా? ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న విమర్శ. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ నేతలు కొందరు గతంలో ఆరోపించారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో జరిగే చర్చల అంశాన్ని ఎప్పటికప్పుడు కేసీఆర్ కు చేరవేస్తుంటారని అంటుంటారు. గతంలో రైతులకు ఉచిత ఎరువుల ప్రకటన సమయంలోనూ ఇలానే జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని.. దాన్ని కేసీఆర్ కు లీకులు ఇచ్చారంటూ స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డే ఆరోపించడం గతంలో సంచలనంగా మారింది. తాజాగా.. కేసీఆర్ కనుసన్నల్లోనే కాంగ్రెస్ పని చేస్తుందంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్లు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన వారికే పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని అన్నారు. ఎంపీ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు కాంగ్రెస్ లో కల్లోలం రేపుతున్నాయి. ఇందులో నిజముండే అవకాశమూ లేకపోలేదని అంటున్నాయి. పీసీసీ చీఫ్ పదవి కోసం హస్తం పార్టీలో వారాల తరబడి మంత్రాంగం నడుస్తోంది. ఆశావహులంతా హస్తిన వెళ్లి పెద్దలను కలుస్తున్నారు. రేసులో రేవంత్ రెడ్డి అందరి కన్నా ముందుండగా... సీనియర్లంతా కలిసి ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ కు పగ్గాలు అప్పగితే.. తామంతా పార్టీ వదిలి వెళ్లిపోతామంటూ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒక్కడు ఒకవైపు.. సీనియర్లు మరోవైపు చేరి... పీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ నేతల తీరు చూసి కాంగ్రెస్ అధిష్టానం సైతం ఎటూ తేల్చుకోలేని దుస్థితి. రాహుల్ గాంధీ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి వైపే హైకమాండ్ మొగ్గు చూపుతున్నా.. ఆయన్ను పీసీసీ చీఫ్  చేస్తే సీనియర్ల నుంచి ఎలాంటి తలనొప్పులు వస్తాయోనని భయపడుతోంది. అందుకే, కేండిడేట్ ఫైనల్ అయినా కూడా ఇంకా డెసిషన్ పెండింగ్ లోనే ఉంచింది. ఈ లోపు కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి, వీహెచ్ లాంటి నేతలంతా తమ వంతుగా పీసీసీ సీటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే.. అంతా అనుకున్నట్టు కాదని, కేసీఆర్ కు కాంగ్రెస్ కు చీకటి ఒప్పందం ఉందనేది బీజేపీ నేతల ఆరోపణ. తెలంగాణలో కమల దండయాత్రను అడ్డుకోడానికి ఆ రెండు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని చెబుతున్నారు. అందుకే, కేసీఆర్ సూచించిన వారికే పీసీసీ చీఫ్ పదవి వస్తుందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారని అంటున్నారు.