పులివెందులలో వికటించిన వ్యాక్సిన్?

  కరోనా వాక్సిన్ పై ప్రజల్లో ఇంకా అనుమానాలు వీడలేదు. వరస పుకార్లతో ప్రజల్లో వ్యాక్సిన్ పై భయాందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా   కడప జిల్లా పులివెందులలో నారాయణమ్మ అనే అంగన్‌వాడి టీచర్ రిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. కరోనా వ్యాక్సిన్ వికటించి మృతి చెందిందని మృతురాలి బంధువులు రిమ్స్ ఆసుపత్రి ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. 50 లక్షలు నష్టపరిహారం,  మృతురాలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ముందు ఎలాంటి జబ్బులూ లేవని, కరోనా వ్యాక్సిన్ వేశాక అనారోగ్యానికి గురైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

రాత్రి పోస్టింగ్.. ఉదయానికి క్యాన్సిల్! ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ అధికారుల బదిలీలు.. అంతలోనే  మళ్లీ మార్పులు.. రాత్రికి రాత్రే జీవోలు వస్తుండటం ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రికి నచ్చకపోతే వెంటనే బదిలీ చేయడం, ఆయనను ప్రసన్నం చేసుకుంటే తిరిగి పోస్టింగ్ తెచ్చుకోవడం అధికారులకు పరిపాటిగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సీనియర్ ఐఎఎస్‍ అధికారి పూనం మాలకొండయ్య వ్యవహారంలో జరిగిన పరిణామాలతో ఇది  నిజమైందంటున్నారు.  సీనియర్‍ ఐఎఎస్‍ అధికారి పూనం మాలకొండయ్యపై ఆధారాలతో సిబిసిఐడి అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. రేపో మాపో పూనం మాలకొండయ్యపై ముఖ్యమంత్రి జగన్‍రెడ్డి చర్య తీసుకోవటం ఖాయమని సీనియర్‍ అధికారులు భావించారు. అయితే తాజాగా సీన్ మారిపోయింది. పూనం మాలకొండయ్యపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోరని స్పష్టం అవుతోందంటున్నారు అధికారులు. పూనం మాలకొండయ్య అదనంగా నిర్వహిస్తున్న పశుసంవర్దక శాఖ నుంచి ఆమెను తప్పించింది జగన్ సర్కార్. ఆ పోస్టులో ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న ఐఎఎస్‍ అధికారి నరేష్‍ శ్రీనివాస్‍ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు కాపు కార్పోరేషన్‍ ఎండీగా ఎవరికి బాధ్యతలు అప్పజెప్పాలన్న విషయం ఆ శాఖాదిపతికే సూచిస్తూ  ఉత్తర్వులు వెలువడ్డాయి.  ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ రాత్రికి రాత్రే పరిస్థితి మారిపోయింది. పూనం నుంచి తప్పించిన శాఖను తిరిగి ఆమె అప్పగిస్తూ తెల్లవారగానే మరో ఉత్తర్వు వచ్చేసింది.  అంతకు ముందు నరేష్‍ శ్రీనివాస్‍ బాధ్యతలు నిర్వహిస్తున్న కాపు కార్పోరేషన్‍ ఎండీగానే ఆయనను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రే ఉత్తర్వులు మారిపోయాయంటే.. పూనం మాలకొండయ్యకు జగన్‍ రెడ్డి వద్ద ఎంత పలుకుబడి ఉందో స్పష్టం అవుతోందంటున్నారు అధికారులు.  కార్యదర్శి హోదాలో ఉన్న నరేష్‍ శ్రీనివాస్‍కు ముఖ్యకార్యదర్శి హోదా ఇవ్వటమే కాకుండా ఆయనకు చాలా రోజులు ప్రభుత్వం పోస్టింగ్‍ కూడా ఇవ్వలేదు. తాజాగా ముఖ్యకార్యదర్శి హోదాను నరేష్‍కు ఇస్తూ… ముఖ్యకార్యదర్శిగా నియమించింది. అయితే  పశుసంవర్దక శాఖాదిపతిగా నియమించిన ఉత్తర్వులను నిలిపివేసి ఆయనను మళ్లీ కాపు కార్పోరేషన్‍ ఎండీగా యధావిధిగా కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముఖ్య కార్యదర్శి హోదా వచ్చిందని సంతోషపడాలో లేక పశుసంవర్దకశాఖాదిపతిగా నియమించిన ఉత్తర్వులను రద్దు చేసిన దానికి బాధ పడాలో తెలియని పరిస్థితిలో నరేష్‍ శ్రీనివాస్‍ ఉన్నారనే చర్చ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జోరుగా జరుగుతోంది.

ఓటర్లు.. తిరుపతి లడ్డు కావాలా నాయనా..!

అధికారం కోసం అక్రమ కేసులు, బెదిరింపులు, దాడులు  ఒక ఎత్తు అయితే, తిరుపతిలో ఏకంగా దేవుడితో రాజకీయం చేస్తున్నారు. తిరుపతి పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు కొత్త ప్రచారానికి తెరలేపారు. ఒక్కో ఏరియాలో ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్నారు. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయతీలో ఎన్నికల కోసం దేవుడికి కూడా రాజకీయాలను ఆపాదిస్తున్నారు. వెంకన్న తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవిదేశాల్లో ఎంత  ఫేమసో.. తిరుపతి లడ్డు కూడా అంతే ఫేమస్. ఇప్పుడు దాన్ని కూడా వైసీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రచారంలో ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే వాహనాలను ఉపయోగిస్తూ. ఓటర్ స్లిప్పులతో పాటుగా శ్రీవారి లడ్డూలను పంచిపెడుతూ. ‘‘లడ్డూ తీసుకోండి...మాకు ఓటు వేయండి’’ అని అంటున్నారు.  కరోనా తర్వాత తిరుపతికి భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడ శ్రీవారి లడ్డూలు లభించక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ నేతలకు మాత్రం లడ్డూలకు కరువే లేదు. దర్జాగా తిరుపతి నుంచి తీసుకువచ్చి పంచాయతీ ఎన్నికల్లో పంచిపెడుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం చూసీచూడనట్టుగా ఉంటున్నారు.  ప్రచారంలో వైసీపీ నేతలు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని వినియోగించడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తిరుమల ప్రసాదాన్ని ప్రలోభాలకు వినియోగించడం దిగజారుడుతనమని వ్యాఖ్యానించారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారన్నారు. దేవాదాయశాఖ మంత్రి దీనిపై ఎందురు నోరు తెరవరని ప్రశ్నించారు. దేవుడి ప్రసాదంతోనూ వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి...ఇక దేవుడిని కూడా రాజకీయాల్లోకి దింపారంటూ వైసీపీ నేతల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేనే తోపు.. నేనే నెంబర్ వన్! అధికార పార్టీ ఎమ్మెల్యే సెల్ఫ్ డబ్బా 

ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే..  ప్రభుత్వ పెద్దలకు ఆయన అత్యంత సన్నిహితుడని చెబుతారు.. ఉత్తర తెలంగాణకు చెందిన ఆ ఎమ్మెల్యే బిల్డప్ కూడా అలానే ఉంటుందని పార్టీ కార్యకర్తలే అనుకుంటూ ఉంటారు. తాజాగా ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చకు దారి తీశాయి. అంతేకాదు ఆయన ఓవరాక్షన్ పై సహచర నేతల నుంచే విమ్శలు  కూడా వస్తున్నాయి. తనకు తాను గొప్పగా చెప్పుకునే ప్రయత్నంలో... ఇతర నేతలను కించపరేచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో దుమారం రేపుతోంది.  వివాదాస్పద వ్యాఖ్యలతో కాక రేపింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.మాక్లూర్ మండలం మానిక్ భాండార్ గ్రామంలో నిర్వహించిన టీఆరెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో నేనే తోపు... నాకున్న ఫాలోయింగ్  మా పార్టీలో ఎవరికీ లేదు.. నాకున్న కార్యకర్తల బలం, రాష్ట్రంలో మరే ఇతర ఎమ్మెల్యే కు లేదు అంటూ కామెంట్ చేశారు జీవన్ రెడ్డి. గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన సురేష్ రెడ్డి, ఆకుల లలిత లాంటి నేతలు కూడా టీఆరెస్ లో చేరారని చెప్పారు. మరో మూడు తరాలు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్నారు జీవన్ రెడ్డి. దేశంలో ఎక్కువ సభ్యత్వం కలిగిన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎసేనని కూడా చెప్పారు.  అయితే టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పడం బాగానే ఉన్నా.... తనకు తానే గొప్పగా చెప్పుకుంటూ ఇతర నేతలను చులకన చేసి మాట్లాడరనే చర్చ గులాబీ పార్టీలోనే జరుగుతోంది. తనకే ఎక్కువ మాస్ ఫోలోయింగ్ ఉందని జీవన్ రెడ్డి చెప్పుకోవడంపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారట. తన గురించి చెప్పుకోవడం సరేగాని.. ఇతరులతో పోల్చుతూ తనను గ్రేట్ అని చెప్పుకోవడం ఏంటని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన కామెంట్లపై కారు పార్టీలో పెద్ద చర్చే జరుగుతుందని తెలుస్తోంది. 

దేశం లో ఉన్నవారంతా వందేమాతరం పాడాల్సిందే..

దేశం లో ఉన్నవారంతా వందేమాతరం పాడాల్సిందే. ఇది బీజీపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు మాట. శుక్రవారం పలువురు ముస్లిం నాయకులు సోమువీరాజులు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ.. దేశంలో ఉన్నవారంతా వందేమాతరం పాడాల్సిందే అని అన్నారు. దేశభక్తి, రాముడు ఆలోచనలే బీజేపీ సిద్ధాంతాలని వీర్రాజులు చెప్పారు. . అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసింది బీజేపీనే అని గుర్తుచేశారు. దేశంలో మైనార్టీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్రం చేస్తున్నదే అని సోమువీర్రాజు తెలిపారు. అయితే వీర్రాజు వ్యాఖ్యలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ భక్తి తో వందేమాతరం అని అనలిగాని.. దేశంలో ఉన్నవారంతా  వందేమాతరం పాడాల్సిందే అని బెదిరించడమేంటని వీర్రాజు వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.  

కొత్తగా వచ్చిన వారికే పదవులు! మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి తీవ్ర స్థాయికి చేరిందా?   పార్టీ పనితీరుపై నేతలు అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే చెప్పాల్సి వస్తోంది. ఆ పార్టీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు, ఆ పార్టీ లీడర్ల  కామెంట్లతో.. కారు పార్టీలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే తానొక లిమిటెడ్ కంపెనీలో ఉన్నానంటూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయ కాక రాజేశారు.      ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి మరోసారి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే మంత్రి పదవులు వచ్చాయని కామెంట్ చేశారు. టీఆర్ఎస్‌లో తాను కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి పని చేస్తున్నానని తెలిపారు. పార్టీలోకి నిన్న, మొన్న వ‌చ్చిన వారికి మంత్రి పదవులు వచ్చినా తాను ఎలాంటి గొడవ పడలేదన్నారు. పదవుల విషయంలో తన అసమ్మతిని చెబుతూనే.. మళ్లీ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ముత్తిరెడ్డి. కార్యకర్తలు, నేతలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చి.. ఏ సమస్యకైనా పరిష్కారం చూపుతారంటూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‌ కేసీఆర్‌పై న‌మ్మకం ఉంద‌ని, ప‌నిచేసే వారికి న్యాయం చేస్తార‌ని కూడా ఆయనే చెప్పారు.  జ‌న‌గామ జిల్లా స‌భ్యత్వ న‌మోదు కార్యక్రమ‌ ఇంచార్జ్ మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితతో కలిసి నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌లో కార్యకర్తలకు సముచితమైన ప్రాధాన్యాన్ని కల్పించేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పిందే వేదమని తెలిపారు. ఇకపై గ్రామాలు, పట్టణాలలో పార్టీ కార్యకర్తలు సూచించిన వారికే ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరు జరుగుతుందన్నారు. తాను కూడా కార్యకర్తల ప్రాధాన్యం కోసం ఇదే పద్ధతిని అవలంభిస్తానని స్పష్టం చేశారు.జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన తాాజా వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.   

కర్ణాటకలో కమలానికి షాక్.. కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ కుమారుడు!

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి షాక్   తగలనుంది. చిక్కబళ్లాపుర బీజేపీ ఎంపీ బచ్చేగౌడ కుమారుడు హొసకోటె స్వతంత్ర ఎమ్మెల్యే శరత్‌ బచ్చేగౌడ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.శరత్‌ బచ్చేగౌడనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. శరత్‌ కాంగ్రెస్‌లో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తోను ఇటీవల ఆయన చర్చలు జరిపారు. దీంతో ఈ నెలాఖరులోపు శరత్‌ కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైంది.  ఇటీవల శాసనసభ సమావేశాలలో హక్కుల ఉల్లంఘనపై శరత్‌ బచ్చేగౌడ చర్చకు అవకాశం కోరగా సభాపతి పట్టించుకోలేదు. ఆయనకు మద్దతుగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు మూకుమ్మడిగా పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేకు కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వడం కర్ణాటక రాజకీయాల్లో చర్చగా మారింది. అప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే అంశం తెరపైకి వచ్చింది.  2018 శాసనసభ ఎన్నికలలో శరత్‌ బీజేపీ తరుపున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంటీబీ నాగరాజ చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయ సమీకరణలు మారడంతో  ఎంటీబీ నాగరాజు సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2020లో జరిగిన ఉప ఎన్నికలలో ఎంటీబీ నాగరాజు బీజేపీ తరుపున పోటీ చేసి ఓడిపోగా శరత్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఎంటీబీ నాగరాజు ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శరత్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. బీజేపీ ఎంపీ బచ్చేగౌడ కూడా పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా  పాల్గొనడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన కూడా కొడుకు బాటలోనే కాంగ్రెస్ లో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. 

చిట్టచివరికి నిజం ఒప్పుకున్న డ్రాగన్..

గతేడాది జూన్ లో భారత్ భిన్న సరిహద్దులో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలో ప్రాణ నష్టం జరిగిన సంగతి తెల్సిందే. అప్పట్లో చైనా మిలటరీ ఘాతుకానికి కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 20 మంది భారత సైనికులు అమరవీరులయ్యారు. అయితే చైనా మాత్రం ఈ ఘర్షణలో తమ సైనికులు మరణించలేదని అప్పట్లో బుకాయించింది. 35 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారని భారత్ ప్ర‌క‌టించింది. అయితే అప్పట్లో తమ సైనికులు ఎవరు చనిపోలేదని బీరాలు పలికిన చైనా ప్రభుత్వం...చిట్టచివరికి నిజాన్ని బయట పెట్టింది భారత్, చైనా బలగాల మధ్య గాల్వాన్‌లో జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన ఐదుగురు అధికారులు, పలువురు జవాన్లు మరణించారని మొట్ట మొదటి సారి చైనా సర్కార్ ఒప్పుకుంది. అంతేకాకుండా ఆ అధికారుల పేర్లను కూడా చైనా విడుదల చేసింది. ఈ ఘటనలో మరణించిన వారికి చైనా సర్కార్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. ఈ విషయాన్ని తాజాగా చైనా మీడియానే వెల్లడించింది. మరణించిన వారిలో జిన్జియాంగ్ మిలటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంట్ కమాండర్ క్వి ఫాబావోతో పాటు క్విఫాబావో, చెన్ హాంగ్‌జున్, చెన్ జియాంగ్‌రాంగ్, జియావో సియువాన్, వాంగ్ జువారన్‌లను చైనా ప్రభుత్వం అవార్డులతో గౌరవించింది.      

పాడె మోసిన రాహుల్ గాంధీ.. 

కేంద్ర మాజీ మంత్రి సతీశ్‌ శర్మ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గోవాలో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. శుక్రవారం ఆయ‌న అంత్యక్రియలను ఢిల్లీలో జరిగాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పాడెను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌లు మోశారు. గతంలో కెప్టెన్‌ సతీశ్‌ శర్మ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నాడు. సతీశ్‌ శర్మ సికింద్రాబాద్‌లో 1947, అక్టోబరు 11న  జన్మించారు. స‌తీశ్ శ‌ర్మ‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొద‌ట‌ ప్రొఫెషనల్‌ కమర్షియల్‌ పైలెట్ గా ప‌ని చేసిన ఆయ‌న అనంత‌రం రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు‌. మూడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆయ‌న‌ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

బినామీల కోసమే విశాఖ భూముల అమ్మకం :యనమల

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం కుట్ర జగన్, విజయసాయిరెడ్డిలదే అన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల. రాజధాని పేరుతో విశాఖలోని ప్రైవేటు స్థలాలు, ఆశ్రమ భూములపై జగన్ కన్ను వేశారని ఆరోపించారు. అవి చాలక  ఇప్పుడు ఏకంగా స్టీల్ ప్లాంట్ భూములపైనే జగన్ నజర్ పడిందని మండిపడ్డారు. బినామీల పరం చేసేందుకే స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకమని... అందులో మొదటి స్టెప్ ప్రధానికి జగన్ లేఖ రాయడమని యనమల ఆరోపించారు. భూముల అమ్మకం ప్రణాళిక.. జగన్ లేఖలో రహస్య అజెండా ఉందని అన్నారు. విశాఖలో జె గ్యాంగ్ బెదిరింపులు, భూకబ్జాలకు అంతే లేదని  యనమల ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ను దిగమింగే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు. 2లక్షల కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేయడం కోసం కుట్ర చేస్తోందన్నారు. పరిరక్షణ ఉద్యమం వేదికలపైనుంచి వైసీపీ నాయకులను, విజయసాయిరెడ్డి లాంటి పందికొక్కుల్ని ప్రజలు తరమికొట్టాలని పిలుపు ఇచ్చారు. సీఎం జగన్ ఆడుతున్న డ్రామను రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకుని గట్టిగా నిలదీయాలని పట్టాభి సూచించారు. ఏడాది క్రితమే పోస్కోతో జగన్‌కు ఒప్పందం కుదిరిందని పట్టాభిరామ్ ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ భూముల కోసం సీఎం జగన్‌ నాటకం ఆడుతున్నారని.. విశాఖ ఉక్కు మన హక్కని.. వదులుకునేది లేదని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. సీఎం జగన్ డ్రామాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నామన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?.. లేక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని నడుపుతున్నారా? అని పట్టాభి ఫైర్ అయ్యారు.   

రథసప్తమి వేడుకలు

అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి చేతుల మీదుగా వేడుకలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉపముఖ్యమంత్రి  ధర్మాన కృష్ణదాస్ లతో కలిసి తొలి దర్శనం చేసుకున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం తరపున సూర్యనారాయణస్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. రథసప్తమి రోజున సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు. స్వామి వారి నిజ రూప దర్శనంతో తరించారు. అటు.. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలై, చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 9 గంటల నుంచి 10 వరకు చిన్నశేష వాహనం, 11 నుంచి 12 వరకు గరుడ వాహనంపై స్వామి వారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు. 

చింతమనేని రిలీజ్..

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. ఏలూరు రూరల్ స్టేషన్ నుండి చింతమనేని ని అర్ధరాత్రి పోలీసులు రిలీజ్ చేశారు. బి. సింగవరం కేసుకు సంబంధించి పోలీసులు చింతమనేనిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు చింతమనేని ని హాజరుపరిచారు. విచారణ జరిపిన జడ్జి 41సి నోటీసు ఇచ్చి చింతమనేనిని విడుదల చేయాలని ఆదేశించారు. మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించారు. అనంతరం అర్థరాత్రి ఆయనను ఇంటి దగ్గర పోలీసులు వదిలిపెట్టారు. చింతమనేని అరెస్ట్ తో బుధవారం హైడ్రామా నడిచింది. బి. సింగవరంలో  చింతమనేని ప్రచారానికి వచ్చివెళ్లాకా ఇరువర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అందుకు చింతమనేని బాద్యుణ్ని చేస్తూ  పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. టీడీపీ నేత అరెస్ట్ పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.చింతమనేని అరెస్టుపై పోలీసు ల తీరును తప్పు పట్టారు. చింతమనేని అరెస్ట్ సంచలనంగా మారగా, అర్ధరాత్రి అయన విడుదలతో ఉద్రిక్తత సద్దుమనిగింది.       

టీఆర్ఎస్ కీలక నేతకు బిగిస్తున్న ఉచ్చు ?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. పోలీసుల విచారణలో కొత్త వ్యక్తుల పేర్లు బయటికి వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కీలక నేత ,మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. ఆ నేత మేనల్లుడి పాత్ర తెరపైకి రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. వామన్ రావును హత్య కోసం మూడ్రోజుల ముందే పథక రచన జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరిన్ని సాక్ష్యాధారాల కోసం గుంజపడుగులో బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంటశ్రీను ఏ1,  ఏ2గా చిరంజీవి, ఏ3గా కుమార్  నిందితులుగా ఉన్నారు. తాజాగా పెద్దపల్లి జెడ్పీచైర్మన్ , మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పేరు తెరపైకి వచ్చింది. వామన్ రావు హత్య జరగడానికి ముందు కుంట శ్రీను 25సార్లు అతనితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.అంతేకాదు వామనరావు దంపతులను హత్య చేయడానికి అవసరమైన కారు, కత్తులను జెడ్పీచైర్మన్ మేనల్లుడే అందించాడని పోలీసులు నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిట్టు శ్రీను పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు.  గుంజపడుగు శివాలయం చైర్మన్ పదవిలో గత కొన్నేళ్లుగా వామన్ రావు బంధువు కొనసాగుతున్నారు. ఆ పదవికోసం కుంట శ్రీను ప్రయత్నాలు చేయడంతో వివాదం ఉందంటున్నారు. అక్రమ క్వారీ వల్ల పుట్టమధు రూ.కోట్లు గడించాడని వామన్ రావు పలుమార్లు పిటిషన్స్ వేశాడు. ఈ రెండు ఘటనలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.  తన మేనల్లుడి పేరు తెరమీదకు రావడంపై జెడ్పీ చైర్మన్ పుట్టమధు ఇంకా స్పందించలేదు. మరోవైపు లాయర్ వామనరావు దంపతుల హత్య ఘటన పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారిందనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే కుంట శ్రీనను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా.. పుట్ట మధుపైనా వేటు వేసే యోచనలో గులాబీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది.

చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం.

ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం. ఆయన కుమార్తె శిరిష్మ (27) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇంటీరియర్ డిజైనర్ అయిన శిరిష్మకు హైదరాబాద్ మణికొండలోని ట్రయల్ విల్లాస్‌కు చెందిన గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016లో వివాహమైంది. గత ఏడాది కాలంగా వీరు గచ్చిబౌలి డీ అడ్రెస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి  భర్త సిద్ధార్థ్ ఇంటికి రాగా, గదిలో ఫ్యాన్‌కి  చీరతో ఉరివేసుకున్న శిరిష్మ కనిపించింది. సిద్దార్థ్ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే శిరిష్మ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం శిరిష్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దమ్ముంటే గెలవండి.. కోట్ల సవాల్

ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం సాగుతున్న సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికలలో వైసీపీని గెలిపించకుంటే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వాలంటీర్ల ద్వారా ఓటర్లను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.అలాగే పోలీసులను పక్కనపెట్టి వైసిపి నేతలు పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. మంత్రులకు దమ్ముంటే పెండింగ్ ప్రాజెక్ట్‌లకు నిధులు విడుదల చేయాలని కోట్ల సవాల్ విసిరారు.   వైసీపీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని కోట్ల అన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అయన భరోసా ఇచ్చారు. ప్రజాసేవే తమ లక్ష్యమని, అలాగే రాష్ట్ర ప్రజలు బాగుండటమే తమకు కావాలని సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. మరోపక్క పేకాట, బెట్టింగులను ప్రోత్సహిస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు ఉందా..? అని కోట్ల సూటిగా ప్రశ్నించారు.

దయచేసి మాకు ఓటేయకండి! సర్పంచ్ అభ్యర్థుల వింత ప్రచారం 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు జరిగాయి. సొంత కుటుంబ సభ్యులే పోటీ పడ్డారు. అన్నాదమ్ముళ్లు, తోడి కోడళ్లు, అత్తా కోడళ్లు, తండ్రి కొడుకులు పంచాయతీ పదవుల కోసం పోరాడారు. నాలుగో దశకు సంబంధించి ఓ గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. తమకు ఓటేయని ప్రచారం చేయాల్సిన అభ్యర్థులే.. ఇంటింటికి తిరిగి తమకు ఓటు వేయవద్దని ఓటర్లను కోరుతున్న పరిస్థితి నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం మొగలికుదురులో జరుగుతున్న ఈ ప్రచారం అందరిలోనూ చర్చగా మారింది.   మొగలికుదురు సర్పంచ్ పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ అంతలోనే గ్రామస్తులంతా సమావేశమై ఒక్కరే పోటీలో ఉండాలి తీర్మానించారు. కడి అరుణ కుమారి పేరును ఖరారు చేశారు. అందరూ ఆమెకే ఓటు వేయాలని గ్రామస్తులకు చెప్పారు. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన మిగతా ఇద్దరు నాగలక్ష్మి, వెంటకరమణలు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వారు కూడా పోటీలో ఉన్నట్లే లెక్క. ఎన్నికల అధికారులు గుర్తులను కూడా ఖరారు చేశారు. ఇక చేసేదేం లేక, ఆ ఇద్దరు అభ్యర్థులు గ్రామంలో విచిత్ర ప్రచారం చేస్తున్నారు. తాము పోటీలో లేమని.. మాకు ఓటు వేయకూడదని ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తులను చూపించి వీటికి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అరుణ కుమారినే గెలిపించాలని కోరుతున్నారు.  

వైసీపీ సీనియర్ నేత పార్టీకి గుడ్ బై..

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిపోయింది. సామాన్య ఓటర్లను ఒకపక్క అధికార వైసిపి నేతలు, మరోపక్క గ్రామ వాలంటీర్లు భయపెడుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇది కేవలం సామాన్యుడి అభిప్రాయమే కాదు.. సాక్షాత్తు వైసిపి సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పుష్పవాణి మామగారైన శత్రుచర్ల చంద్రశేఖర రాజు నిన్న వైసిపికి రాజీనామా చేస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దారుణ పరిస్థితులు చూడలేకే పార్టీకి గుడ్ బై చెపుతున్నట్లుగా పేర్కొన్నారు. వైసిపి పార్టీలో నియంతృత్వ పోకడలు పెరిగిపోయాయని, తనకు అవి నచ్చకే పార్టీని శాశ్వతంగా వీడుతున్నట్టు చంద్రశేఖర రాజు ప్రకటించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకాపోతే పింఛన్లు, ఇళ్లు మొదలైన సంక్షేమ పథకాలు కట్ చేస్తామని గ్రామ వలంటీర్ల ద్వారా పార్టీ నాయకులు చెప్పించారని అయన ఆరోపించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన విధానం కాదని అయన అన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. సామాన్యులపై రాజకీయ దాడులు, బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ఎపి అథోగతి పాలవుతోందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వ తీరు తనను ఎంతగానో బాధించాయని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్టు అయన స్పష్టం చేశారు.

దళితులు పోటీ చేస్తే నరికేస్తారా..?

ఏపీలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, రాచరికపు పాలనా కొనసాగుతుందా..? లేక రౌడీ పాలనా కొనసాగుతుందా..? అని నిత్యం ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ప్రతిపక్షాలలో కూడా ఈ సందేహం లేకపోలేదు.  పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలు పెచ్చు రేగుతున్నాయి. దళితులపై జరుగుతున్న దాడులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామంలో దళితులపై వైసీపీ నాయకుల దాడి జగన్ రెడ్డి రాచరికపు అహంకార పాలనకి అద్దం పడుతోందని లోకేశ్ విమర్శించారు. జాతి తక్కువ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారా?... నరికి చంపేస్తాం అంటూ రాళ్లతో దళితులపై దాడి చెయ్యడం, ఇళ్లకు వెళ్లి బెదిరించడం అమానుషమన్నారు . కులం పేరుతో దూషించడమే కాకుండా, దళిత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దాడులకు తెగబడ్డ వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లింగాపురం గ్రామంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని లోకేష్ కోరారు.  దళితుల ఓట్లు కావాలి వాళ్ళు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయవద్దు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. మనం ఇంకా  ఏ సమాజం లో బతుకుతున్నాం. రాజ్యాంగం లో ఆర్టికల్ 14  చట్టం ముందు అందరు సమానులే అన్న పదాన్ని సమాధి చేసి బతుకుతున్నామా అంటూ ప్రజలు, ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ్ బక్కడ్ బాంబే బో.. డీజిల్ నబ్బే, పెట్రోల్ సౌ!

దేశంలో చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రోజులుగా  పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజల్ రేట్లు. లీటర్ పెట్రోల్ రేట్ కొన్ని ప్రాంతాల్లో సెంచరీ మార్క్ దాటేసింది. రాజస్థాన్ లోని చాలా ప్రాంతాల్లో ప్రీమియం పెట్రోల్ లీటర్ ధర వంద రూపాయలు దాటగా.. సాధారణ పెట్రోల్ కూడా వంద రూాపాయలు చేరుకుంది. మధ్యప్రదేశ్‌తోపాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో బ్రాండెడ్ పెట్రోలు ధర రూ. 100 మార్కును దాటేసింది. రాజస్థాన్‌లో రెగ్యులర్ పెట్రోలు ధర కూడా వంద రూపాయలు దాటేసి వాహనదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లీటర్ పెట్రోల్ రేట్ సెంచరీ మార్క్ దగ్గరలో ఉంది.  దేశంలో పెరుగుతూ పోతున్న పెట్రో ధరలపై బాలీవుడ్ సీనియర్ నటి, శివసేన నేత ఊర్మిళా మటోండ్కర్ సెటైరికల్‌గా స్పందించారు. చిన్నపిల్లలు పాడుకునే ‘అక్కడ్ బక్కడ్ బాంబే బో’ పాటలో మార్పులు చేసి ‘అక్కడ్ బక్కడ్ బాంబే బో.. డీజిల్ నబ్బే, పెట్రోల్ సౌ.. సౌ మే లగే ధాగా.. సిలిండర్ ఊచల్ కే భాగా’ అని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది.