ఎంబీబీఎస్ అమ్మాయి.. 9 వ క్లాస్ అబ్బాయి..

వాడు పిల్లోడే..కానీ కిలాడీగాడు.. కేడి గాడు.. అమాయకంగా కనిపించే అపరిచితుడు. మాయగాడు. మోసగాడు టెక్నాలజీ తో మోసం చేసే టక్కరోడు. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి.  ఆమె ఎంబీబీఎస్‌. ఆ పిల్లాడు 9వ తరగతి. పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. ఆమె తమ్ముడే కదా అనుకుంది. అందుకే అమాయకంగా కనిపించే పిల్లాడికి అప్పుడప్పుడు తన ఫోన్‌ను అతడికి ఇచ్చేదామె. పిల్లోడి కదా అనుకుంది.  కానీ ఆ పిల్లాడు అమాయకపు మాటున ఆమెకు కాదు వేశాడు. ఆ తర్వాత  తెలిసింది. వాడు మాత్రం పిల్లోడు కాదు పిడుగు అని.  కట్  చేస్తే కొద్దీ రోజుల తర్వాత వన్ ఫైన్‌ మార్నింగ్‌..ఆమె పేరుతో ఆన్‌లైన్‌ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అశ్లీలచిత్రాలు పోస్ట్‌చేయడం వంటి చర్యలతో ఆమెను మానసికంగా చిత్రహింసకు గురిచేశాడు. ఈ విషయం తెలియని ఆ యువతి.. తన ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు హ్యాక్‌ చేశారదు అతడి దగ్గరే తన గోడు వెళ్లబోసుకునేది. ఆమె అలా బాధపడినప్పుడల్లా అతడు కూడా.. తన అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయంటూ అపరిచితుడు సినిమాలో విక్రమ్ రేంజ్ లో యాక్ట్ చేస్తూ వచ్చాడు.  ఈ మానసిక వేదనను చాలా రోజులపాటు భరించిన ఆ యువతి ఇక తట్టుకోలేక సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఆ బాలుడి గుట్టు రట్టు చేశారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. ఇతరుల ఫోన్‌లు తీసుకొని వారి మెయిల్స్‌ ఓపెన్‌ చేయడం, పాస్‌వర్డులు మార్చడం, తర్వాత వేరే సిస్టంలో మెయిల్‌ ఓపెన్‌ చేసి అసభ్యకర మెసేజ్‌లు పంపడం తనకు అలవాటు అని చెప్పాడు. దీంతో బాలుణ్ని పోలీసులు జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. కాగా.. తనతో స్నేహంగా ఉన్న పక్కింటి బాలుడే ఇలాంటి నీచమైన పనికి పాల్పడ్డాడు.  మీ ఇంటి పక్కింట్లోనో.. మీ ఎదురింట్లోనో ఇలాంటి వాళ్ళు లేకపోలేదు.. జెర భద్రం.. బతుకు పయిలం.. ఆగమరిచి నమ్మినారా ఇక అంతే మీ బతుకు చిందర వందర. ఎందుకంటే ఇపుడు ఉన్న రోజుల్లో మన నీడని కూడా మనము అనుమానించే పరిస్థితి దాపురించింది మరి. ఎంత క్లోజ్ గా ఉన్న సంత అన్న, తమ్ముడు, చెల్లెలు, అక్క లా ఉన్న వెంటనే కరిగిపోకండి.. ఆ తర్వాత మోసపోకండి.

కష్టాల్లో కొవిడ్ టీకా?

ఏడాది నుండి కరోనా ప్రపంచాన్నిగడగడలాడిస్తుంది. కరోనా కాటుకు టీకా వేయాలనుకుంది దేశం. అందుకు చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలు అయ్యాయి. అందులో  ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికాలు సంయుక్తంగా తయారు చేశాయి. ఆ తర్వాత  కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పుడు కష్టాల్లో పడింది. దేశంలో వ్యాక్సిన్ పంపిణి ఆలస్యం చేస్తున్నారంటూ తెలిపింది. అదార్ పూనావాలా ఆధీనంలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఆస్ట్రాజెనికా లీగల్ నోటీసులు పంపింది. ఈ విషయాన్ని 'బిజినెస్ స్టాండర్డ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనావాలా తెలిపారు. వ్యాక్సిన్ సరఫరా ఆలస్యం జరుగుతుందని. ఆ విషయం భారత ప్రభుత్వానికి కూడా తెలుసునని. లీగల్ నోటీసులు కాన్ఫిడెన్షియల్ కాబట్టి, ఇంతకన్నా తాను ఏమీ వ్యాఖ్యానించలేనని అన్నారు.ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, ఇండియాకు వ్యాక్సిన్ సరఫరాపైనే ప్రధానంగా దృష్టిని సారించినందునే అనుకున్న ప్రకారం, టీకాను సరఫరా చేయలేకపోయామని ఆయన స్పష్టం చేశారు. ఈ నోటీసుల సమస్య నుంచి బయటపడేందుకు మార్గాలను ప్రభుత్వం సైతం ఆలోచిస్తుందని తెలిపారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, నిజం చెప్పాలంటే, తనపై ఎంతో ఒత్తిడి ఉందని అదార్ పూనావాలా బుధవారం నాడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇతర దేశాలకు భారీఎత్తున వ్యాక్సిన్ సరఫరాకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని, ఈ విషయంలో విదేశాలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని అన్నారు. ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్ చాలా అవసరమన్న విషయం తమకు తెలుసునని, చాలా దేశాల్లో వ్యాక్సిన్ తయారీ ఖర్చుతో పోలిస్తే, అధిక ధరకు విక్రయాలు జరుగుతున్నాయని, ఇండియాలో మాత్రం తాము సబ్సిడీ ధరకే అందిస్తున్నామని ఆయన అన్నారు.

భయంకరంగా కరోనా వైరస్.. భారత ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేదం 

భారత్‌లో కరోనా మహమ్మారి భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. ఎవరూ ఊహించని విధంగా పంజా విసురుతోంది. గత ఏడాదిని మించి అల్లకల్లోలం రేపుతోంది. రోజు వారి కొత్త కేసులు లక్షకు పైగా నమోదువుతన్నాయి. ఐతే గడిచిన 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డు కేసులు వచ్చాయి.  భారత్‌లో బుధవారం  ఏకంగా 1,26,789 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు మనదేశంలో నమోదైన రోజు వారి కేసల సంఖ్యలో ఇదే అత్యధికం. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో  685 మంది కరోనాతో చనిపోయారు. దీంతో కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 1,66,862కి చేరింది. ప్రస్తుతం మనదేశంలో 9,10,319 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.  గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అక్కడ 59,907 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఛత్తీస్‌గఢ్‌లో 10,310, కర్నాటకలో 6,976, కేరళలో 3502, తమిళనాడులో 3,986, పంజాబ్‌లో 2963, మధ్యప్రదేశ్‌లో 4043, గుజరాత్‌లో 3575 మందికి కొత్తగా కరోనా సోకింది. అయితే కొవిడ్ వ్యాక్సినేషన్‌లో కూడా భారత్ ముందు వరుసలోనే ఉంది.  భారత్‌లో ఇప్పటివరకు 9,01,98,673 మంది టీకా పంపిణి చేశారు.  భారత్‌లో కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. న్యూజిలాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి న్యూజిలాండ్ వచ్చే భారత ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ నుంచి న్యూజిలాండ్ వెళ్లే ఆ దేశపు పౌరుల రాకపై కూడా న్యూజిలాండ్ తాత్కాలికంగా నిషేధం విధించింది. భారత్ నుంచి న్యూజిలాండ్ ప్రయాణాలపై రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్రకటన చేశారు. భారత్‌  ప్రయాణాలపై న్యూజిలాండ్ విధించిన ఆంక్షలు ఏప్రిల్ 11 నుంచి 28 వరకూ కొనసాగనున్నాయి. న్యూజిలాండ్‌లో క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, బుధవారం 7 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ దేశ ప్రధాని తెలిపారు. గురువారం ఒక్కరోజే న్యూజిలాండ్‌కు వెళ్లిన వారిలో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ 23 మందిలో 17 మంది భారతీయులే కావడంతో అక్కడి సర్కార్ అప్రమత్తమైంది. భారత్ నుంచి ప్రయాణాలపై తాత్కాలికంగా నిషేధం విధించాలని న్యూజిలాండ్ నిర్ణయించింది.

టీడీపీ మహిళా నేత ఇంటిపై వైసీపీ దాడి 

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చిపోయారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండంలోని కృష్ణవరంలో వీరంగం వేశారు. టీడీపీ నాయకురాలు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బుదిరెడ్ల పుష్పరత్నం ఇంటిపై వందమందికిపైగా వైసీపీ వర్గీయులు ఇనుపరాడ్లు, కర్రలతో  దాడిచేశారు. ఇంటి ఆవరణలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు, కిటికీ అద్దాలు, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పుష్పరత్నం ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వెంటనే ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ, డీఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి విషయం చెప్పారు. అనంతరం నెహ్రూ మాట్లాడుతూ.. భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనే వైసీపీ నేతలు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గోపీనాథ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో 150 మంది వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏఎస్ఐ, కానిస్టేబుళ్ల ముందే ఈ దౌర్జన్యం జరిగిందన్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు తప్పితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన గోపీనాథ్ రాజకీయాలు చేయడం సరికాదని, అతడిపై చర్యలు తీసుకోవాలని నెహ్రూ డిమాండ్ చేశారు.

దేశానికి తాళాలు! లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు..

ముంబై, ఢిల్లీ, పంజాబ్‌, బెంగ‌ళూరు, రాయపూర్.. ఇలా ఒక్కో రాష్ట్రం, ఒక్కో న‌గ‌రం లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. క్ర‌మంగా దేశ‌మంతా క‌రోనా గుప్పిట్లోకి జారుకుంటోంది. ఒక్క రోజులోనే ల‌క్ష‌కు పైగా పాజిటివ్ కేసుల‌తో కొవిడ్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ఓ వైపు దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ వేగంగా సాగుతుండ‌గా.. మ‌రోవైపు లాక్‌డౌన్‌, నైట్ క‌ర్ఫ్యూ, 144 సెక్ష‌న్లూ అంతే వేగంగా అమ‌లు చేస్తున్నారు. ఇలా కొవిడ్ క‌ట్ట‌డికి డ‌బుల్ బ్యారెల్ గ‌న్‌తో యుద్దం చేస్తున్నారు. కరోనా ఉద్ధృతితో కర్ణాటక ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. బెంగళూరు నగర పరిధిలో బుధ‌వారం నుంచి 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, నివాస సముదాయాల్లోని ఈత కొలనులు, జిమ్‌లు, పార్టీ హాళ్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  బెంగళూరులో ఒక్క రోజులోనే 4,266 కేసులు న‌మోదు కాగా.. వారిలో 26మంది చ‌నిపోవ‌డంతో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం న‌గ‌రంలో క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టికే దేశ రాజ‌ధాని ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ విధించింది అక్క‌డి ప్ర‌భుత్వం. ఢిల్లీ స‌మీపంలోని పంజాబ్‌లోనూ క‌రోనా కేసులు భారీగా పెరుగుతుండ‌టంతో ఆ రాష్ట్రంలోనూ రాత్రి క‌ర్ఫ్యూ ప్ర‌క‌టిస్తూ ఆదేశాలు జారీ చేసింది అమ‌రీంద‌ర్‌సింగ్ ప్ర‌భుత్వం. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఉద్యోగులందరూ విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. పంజాబ్‌లో ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని ఆంక్ష‌లు విధించారు. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నేతలతో పాటు ఇతరులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే పంజాబ్‌లో విద్యాసంస్థ‌లు మూసి వేశారు. మరోవైపు, పంజాబ్‌లో కొవిడ్ వ్యాక్సినేష‌న్‌నూ వేగ‌వంతం చేస్తోంది అక్క‌డి ప్ర‌భుత్వం. రోజుకు 2 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం రోజుకు 90,000 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక‌, ప్రతిరోజూ జరిపే కోవిడ్ పరీక్షల సామర్థ్యాన్ని 50,000కు చేర్చాలని, పాజిటివ్ పేషెంట్ల ట్రేసింగ్ కూడా చురుగ్గా జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు.    ఇక చిన్న రాష్ట్రం ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ క‌రోనా పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. రాయ‌పూర్ జిల్లాలో శుక్ర‌వారం నుంచి 10 రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. 9వ తేదీ రాత్రి 6 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 6 గంటల వరకూ పూర్తి కోవిడ్-19 కంటైన్‌మెంట్ జోన్ చర్యలు అమలు చేయనున్నట్టు జిల్లా యంత్రాగం తెలిపింది. లాక్‌డౌన్ సమయంలో జిల్లా సరిహద్దులన్నీ మూసివేస్తున్నట్టు రాయపూర్ జిల్లా కలెక్టర్ ఎస్.భారతి దాసన్ చెప్పారు.  ఇలా ఒక్కో స్టేట్‌.. ఒక్కో సిటీ లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తూ దేశానికి అన‌ధికారికంగా తాళాలు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజు వారీ కేసులు భారీగా న‌మోదు అవుతుండ‌టంతో మన‌కూ త్వ‌ర‌లోనే లాక్‌డౌన్ కానీ, మ‌రింత క‌ఠిన ఆంక్ష‌లు కానీ రావొచ్చంటున్నారు. అవి తప్పాలంటే.. ప్ర‌జ‌లంతా కొవిడ్ జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందే.‌‌‌‌‌

కొవిడ్ రెండో డోసు తీసుకున్న ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా రెండో డోసు తీసుకున్నారు.ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న ఆయనకు భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా రెండో డోసు ఇచ్చారు. ప్రధాన నర్సు పి. నివేదా మోదీ చేయిని పట్టుకోగా, మరో నర్సు నిషా శర్మ వ్యాక్సిన్ వేశారు. మార్చి  ఒకటో తేదీన కరోనా టీకా తొలి డోసు తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీ 37 రోజుల తర్వాత ఈ ఉదయం రెండో డోసు తీసుకున్నారు.  తొలి డోసు వేయించుకున్నప్పటిలా కాకుండా ప్రధాని మోడీ ఈసారి మాస్కుతో కనిపించారు. వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.‘‘ఎయిమ్స్‌లో ఈ ఉదయం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నాను. వైరస్‌ను ఓడించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్ ఒకటి. టీకా వేయించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరు వెంటనే టీకా తీసుకోండి. కొవిన్ యాప్ ద్వారా టీకా కోసం రిజిస్టర్ చేసుకోండి’’ అని ఆ ట్వీట్‌లో మోదీ కోరారు.

తెలంగాణలో లాక్ డౌన్! మంత్రి ఈటల క్లారిటీ..

తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని దవాఖానల్లో సాధారణ వైద్య చికిత్సలతోపాటు కరోనా బాధితులకు చికిత్స అందించేలా చర్యలు చేపట్టింది.కరోనా వ్యాప్తి వచ్చే 4 వారాల్లో తీవ్రరూపు దాల్చే ప్రమాదముందని, జనం అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలంగాణ  వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస రావు సూచించారు. రాష్ట్రంలోనూ కరోనా వేగంగా విస్తరిస్తోందని  తెలిపారు. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. రోగుల  సంఖ్య పెరిగితే అందరికీ పడకలు దొరకడం కష్టమన్నారు  శ్రీనివాస రావు . వచ్చే 4 వారాలు దేశానికి, రాష్ట్రానికి చాలా కీలకమని అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే లక్షయాభైవేల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెలంగాణలోని 33 జిల్లాల పరిధిలో ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామాల్లోని పీహెచ్‌సీ( PHC) స్థాయి వరకు కూడా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులను అందుబాటులో ఉంచామన్నారు మంత్రి ఈటల రాజేందర్. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని గాంధీ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. 11 వేల బెడ్స్‌ని ఆక్సిజన్ బెడ్స్‌గా మళ్లీ పునరుద్ధరించామన్నారు మంత్రి.  అత్యవసర సమయంలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల సేవలను ఉపయోగించుకుంటామని మంత్రి ఈటల తెలిపారు. ఆరోగ్య శాఖలో ఇప్పటికే అన్ని విభాగాల్లోని అధికారులు సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నారని అన్నారు. కరోనాతో సహజీవనం తప్పదని పేర్కొన్నారు.  ప్రజలు కూడా వారి వంతుగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కోవిడ్‌ నిబంధనలను పాటించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.  ప్రజలు సహకరిస్తేనే కోవిడ్ మహమ్మారిని అరికట్టగలమన్నారు రాజేందర్. 

టీఆర్ఎస్ లో టీడీఎల్పీ విలీనం

తెలంగాణలో తెలుగు దేశం పార్టీ అధికార పార్టీలో విలీనం అయింది. టీఆర్ఎస్ లో తెలంగాణ టీడీపీ శాసనాసభా పక్షాన్ని విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు ప్రకటించారు. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శాసనసభా వ్యవహరాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో మెచ్చా నాగేశ్వరరావు సమావేశమయ్యారు. అనంతరం మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి లేఖ అందించారు. టీడీపీ శాసనాసభా పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌కి లేఖ ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగు దేశం పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు.సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వర్ రావు గెలిచారు. అయితే గెలిచిన కొన్ని రోజుల నుంచే టీఆర్ఎస్ కు మద్దతుగా ఉంటున్నారు సండ్ర. అధికారికంగా టీఆర్ఎస్ లో చేరకపోయినా.. ఆ పార్టీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు. గతంలోనే మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరిగినా... మెచ్చా ఖండించారు.తాను తెలుగు దేశం పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. అయితే కొంత కాలంగా మాత్రం మెచ్చా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.  తాజాగా మెచ్చా నాగేశ్వరరావు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన మెచ్చా... టీఆర్ఎస్ లో చేరారు. బుధవారం అసెంబ్లీ స్పీకర్ ను కలిసి టీడీపీ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్న‌ట్టు లేఖ ఇచ్చారు. లేఖ‌ను స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌తో క‌ల్సి స్పీక‌ర్‌కు అందించారు మెచ్చా నాగేశ్వ‌ర‌రావు. 

10 రోజులు సంపూర్ణ లాక్ డౌన్

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా కట్టడి కోసం అనేక రాష్ట్రాలు కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కరోనా వైరస్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గడ్‌ ముందు స్థానంలో ఉంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చర్యలు తీవ్రం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 19 వరకు మొత్తం బంద్‌ చేస్తున్నట్లు ఛత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు పది వేలకు చేరువగా కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీవ్ర ఆంక్షలు విధిస్తోంది.  ఒక్కరోజే ఛత్తీస్‌గడ్‌లో 9,921 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వాటిలో అత్యధికంగా రాజధాని రాయ్‌పూర్‌లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘేల్‌ వైద్య ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ కట్టడి చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ దశలో రాజధానిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి 14 వరకు రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేశారు.    

మల్లారెడ్డి ప్లేస్ లో పల్లా! ఆడియో లీక్ వెనుక?

తెలంగాణలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తారని టాక్.. ఇంతలోనే మంత్రి మల్లారెడ్డి ఆడియో కాల్ లీక్.. ఓ వెంచర్ విషయంలో వాటా కావాలంటూ మంత్రి  మల్లారెడ్డి బెదిరింపులకు సంబంధించిన ఆ ఆడియో వైరల్.. మంత్రి మల్లారెడ్డి ఆడియో లీక్ తర్వాత ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. కేసీఆర్ కేబినెట్ లో మార్పులకు, మంత్రి మల్లారెడ్డి ఆడియో లీక్ కావడానికి లింక్ ఉందనే ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి మంత్రి పదవికి ఎసరు పెట్టే కుట్రలో భాగంగానే... కొందరు టీఆర్ఎస్ నేతల డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనే చర్చ జరుగుతోంది.  ఓ వెంచర్ లో విషయంలో వాటా కావాలంటూ  మంత్రి మల్లారెడ్డి స్వయంగా ఆయనే బెదిరింపులకు దిగారు. సర్పంచ్‌లకు వాటాలు ఇస్తే.. ఎమ్మెల్యే, మంత్రులకు ఇవ్వారా అంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు చెప్పి పొట్టు పొట్టు చేయిస్తాం.. ఏమైనా బిచ్చమెత్తుకోవాల్నా.. వాటా ఇచ్చే వరకు వెంచర్‌ను ఆపేయండి అంటూ సదరు మంత్రి హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించిన ఆడియోనే లీకై కలకలం రేపింది. మంత్రి మల్లారెడ్డి ఆడియో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రచ్చగా మారింది. మంత్రి మల్లారెడ్డి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.  గతంలోనూ ఇలానే జరిగింది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గెలవగానే  మంత్రివర్గ విస్తరణపై ప్రచారం జరిగింది. కవితను కేబినెట్ లో తీసుకునేందుకు ఎవరో ఒక మంత్రిని తప్పిస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి.  ఈ సమయంలోనే  కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి రాసలీలలు బయటికి రావడం పెద్ద దుమారమే రేపింది. వివాదంలో చిక్కుకున్న ఆ మంత్రిని తప్పించి కవితకు కేబినెట్ లో బెర్త్ ఇస్తారని భావించారు. కవితకు కేబినెట్ బెర్త్ కోసం.. గులాబీ నేతలే ఆ మంత్రికి సంబంధించిన ఫోటోలు లీక్ చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కవిత ఒక్కరినే కేబినెట్ లోకి తీసుకుంటే విమర్శలు వస్తాయని భావించిన  కేసీఆర్.. గంగుల ప్లేస్ లో కవితను తీసుకునే సాహసం చేయలేకపోయారని చెబుతారు.  ఇప్పుడు మల్లారెడ్డి విషయంలోనూ గంగల తరహాలోనే  జరిగిందని అంటున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి రెండో సారి గెలిచారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పల్లా.. అధికార పార్టీ గెలవడం అసాధ్యమనుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకుని సత్తా చాటారు. ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత పల్లాకు మంత్రివర్గంలో చోటు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో ప్రస్తుతం ఖాళీలు లేవు కాబట్టి... పల్లాను తీసుకోవాలంటే ఎవరో ఒక మంత్రిని తొలగించాలి. దీంతో పల్లాకు బెర్త్ కోసం మల్లారెడ్డిని కేబినెట్ నుంచి తొలగిస్తారనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి బెదిరింపుల ఆడియో లీక్ కావడంతో.. దీని వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.  మంత్రివర్గంలో మార్పులు చేస్తే నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డిని తొలగించవచ్చంటున్నారు. వేముల జూనియర్ అయినా మంత్రివర్గంలో చోటు కల్పించారు కేసీఆర్. అయితే ఆయన పనితీరు ఆశించనంతగా లేదని అభిప్రాయంలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుతోనూ వేములకు మంచి సంబంధాలు లేవంటున్నారు. జిల్లాలో ఉన్న సీనియర్ నేతలను మంత్రి పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు పార్టీ అధిష్టానానికి చాలా సార్లు వెళ్లాయంటున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీగా  పోటీ చేయాలని కవితపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ రెడ్డి ప్లేస్ లో కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇందూరు నేతలు కేసీఆర్ ను కోరినట్లు చెబుతున్నారు.  గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న గంగుల కమలాకర్ ను మార్చవచ్చంటున్నారు. గంగులను మారిస్తే.. ఆయన సామాజిక వర్గానికే చెందిన దాస్యం వినయ్ భాస్కర్ కు అవకాశం ఉంటుందంటున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కొప్పుల ఈశ్వర్ కు గండం ఉండే అవకాశం ఉంది. కొప్పుల స్థానంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కేబినెట్ లోకి తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్ ఆశతోనే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బాల్క సుమన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన సురభీ వాణిదేవీ మండలి చైర్మెన్ లేదా డిప్యూటీ చైర్మెన్ ఖావడం ఖాయమంటున్నారు. వాణిదేవికి మండలి చైర్మెన్ ఇస్తే.. గుత్తా సుఖేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే నల్గొండ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డికి గండం ఉన్నట్లే.  మొత్తంగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్.. తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించడం ఖచ్చితంగా జరుగుతుందనే అభిప్రాయమే మెజార్టీ టీఆర్ఎస్ నేతల నుంచి వ్యక్తమవుతోంది.

అమ్మాయికి గుండు కొట్టిన గ్రామ పెద్దలు ..12 మంది అరెస్ట్.. 

అమ్మాయి, అబ్బాయిలది ఒకే ఊరు.  ముందు వారి మనసులు కలిశాయి. ఆ తర్వాత కలిసి బతుకుదాం అనుకున్నారు.  ఆ విషయం ఇరు కుటుంబాలకు చెప్పారు.. వాళ్ళు కుదరదన్నారు. వారి పెళ్ళికి ఒప్పుకోలేదు. తల్లి దండ్రుల మాట, ఆ ఊరి పెద్దల మాట ఆ ప్రేమికులకు నచ్చలేదు.. అందుకే కన్నా వాళ్ళను, ఉన్న ఊరిని వదిలి వెళ్ళిపోయి ఒక్కటవుదామనుకున్నారు. సమయం చూసుకుని ఒక రోజు ఊర్లో నుండి వెళ్లిపోయారు.  ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వారి మాట ధిక్కరించి వెళ్లినందుకు ఆ పెద్దలు ఆ అమ్మాయిపై పగ పట్టారు. ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని గ్రామానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత గ్రామ పంచాయితీ పెద్దలు.  వారి పెద్దరికాన్ని మరిచి. అదే పెద్దరికం అనే అహంకారంతో  అమానుషంగా ప్రవర్తించారు. ఆమెకు కఠిన శిక్ష విధించారు. ఆ యువతికి గుండు కొట్టించారు. నలుపు రంగు పూశారు. ఆ యువతిని  వీధుల గుండా ఊరేగించారు.. గ్రామంలో ఎవరు ఇలాంటి పని మళ్ళీ చేయకూడదని చెప్పి యువతికి గుండు కొట్టించి, ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. ఆమె భర్తను సైతం విచక్షణరహితం కొట్టారు. సమాచారం అందుకున్న పోలిస్లు సంఘటనా స్థలానికి చేరుకొని ఈ ఘటనలో సంబంధమున్న 12 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని పాల‌ము జిల్లాలోని సెమ్రా పంచాయ‌తీలో చోటు చేసుకుంది.  

నల్గొండ కలెక్టర్‌కు ఖ‌త‌ర్నాక్ శిక్ష‌

వారానికి 2 గంట‌లు అనాథాశ్ర‌మంలో గ‌డ‌పాలి. ఇలా ఒక‌టి, రెండు సార్లు కాదు.. ఏకంగా 6 నెల‌ల పాటు అనాథ‌ల‌కు సేవ చేయాలని కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో న‌ల్గొండ జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్‌కు శిక్ష విధించింది హైకోర్టు.  విశ్రాంత పౌర సరఫరాల జిల్లా అధికారి సంధ్యారాణికి సైతం ఇలాంటి ప‌నిష్మెంటే ఇచ్చింది ఉన్న‌త న్యాయ‌స్థానం. ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో అనాథాశ్రమంలో భోజనాలు పెట్టాలని సంధ్యారాణిని హైకోర్టు ఆదేశించింది. ఈ ఇద్ద‌రికీ  హైకోర్టు విధించిన శిక్ష‌లు తెలంగాణ‌లో సంచ‌ల‌నంగా మారాయి.‌ గతంలో కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్‌ జడ్జి ఈ ఇద్దరికి 2వేల చొప్పున జరిమానా విధించారు. ఆ ఉత్తర్వులను కొట్టేయాలంటూ ధర్మాసనం ఎదుట అప్పీల్‌కు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది. అటు, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డిపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుపైనా హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ అధికారుల కోర్టు ధిక్కరణ చర్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు కోర్టు ఆదేశాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని న్యాయస్థానం ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. ధిక్కరణ శిక్ష పడితే.. అప్పీల్‌ చేస్తే చాలని భావిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ధిక్కరణ కేసులకే ముగ్గురు జడ్జిలను పెట్టాల్సి వచ్చేలా ఉందని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది హైకోర్టు.

ఇదిగో కోబ్రా క‌మెండో ఫోటో.. మ‌రి, విడుద‌ల‌?

ఛ‌త్తీస్‌గ‌డ్ ఎన్‌కౌంట‌ర్‌లో కోబ్రా క‌మాండ‌ర్ మిస్సింగ్‌. అత‌ను మా ద‌గ్గ‌రే బందీగా ఉన్నాడంటూ మావోయిస్టుల స్టేట్‌మెంట్‌. ఇదిగో సాక్షం అంటూ కోబ్రా క‌మాండ‌ర్ రాకేశ్‌సింగ్‌ ఫోటో‌ ‌రిలీజ్ చేశారు మావోయిస్టులు.  అడ‌విలో తాటాకుల గుడిసె. నేల‌పై ప్లాస్టిక్ క‌వ‌ర్‌. కోబ్రా యూనిఫాం వేసుకొని.. కింద కూర్చొని.. కులాసాగా క‌నిపిస్తున్నాడు ఆ క‌మెండో. మావోయిస్టుల చెర‌లో బందీగా ఉన్నాన‌నే భ‌యం అత‌ని క‌ళ్ల‌ల్లో క‌నిపించ‌డం లేదు. ధైర్యంగా, క్షేమంగా ఉన్నాడు రాకేశ్‌సింగ్‌.  చ‌ర్చ‌ల‌కు మ‌ధ్య‌వ‌ర్తుల‌ను ప్ర‌క‌టిస్తే బందీగా ఉన్న జ‌వాన్‌ను విడిచిపెడ‌తామ‌ని ష‌ర‌తు పెట్టారు మావోయిస్టులు. వాళ్లు విడుద‌ల చేసిన లేఖలో మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ‘ఆపరేషన్ ప్రహార్-3’ పేరుతో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, దేశంలో హక్కుల ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వాలు, పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. పోలీసుల కూంబింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని మావోలు లేఖలో డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర కాల్పుల తర్వాత కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్వర్‌సింగ్ అనే జవాన్ కనిపించకుండా పోయారు. తాజాగా ఆయ‌న బందీగా ఉన్న ఫోటోను విడుద‌ల చేశారు మావోయిస్టులు. చ‌ర్చ‌ల‌కు మధ్యవర్తులు ఎవరో చెబితే విడుదలపై ప్రకటన చేస్తామని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో పోలీసుల కూంబింగ్‌ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ సరిహద్దుల్లోనే అప్పగించే యోచనలో మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.‌

తిరుపతి ప్రచారానికి జగన్.. నిఘా వర్గాల నివేదికే కారణమా? 

5 ల‌క్ష‌ల మెజారిటీ. తిరుప‌తిలో బంప‌ర్ విక్ట‌రీ. ఇదీ అధికార పార్టీ హ‌డావుడి. తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం త‌మ‌కు పెద్ద విష‌య‌మేమీ కాదు. ఎంత మెజార్టీతో గెలుస్తామ‌న్న‌దే టార్గెట్‌. ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా 5 ల‌క్ష‌ల ఓట్ల ఆధిక్యంతో విజ‌యం సాధిస్తామంటూ వైసీపీ నేత‌లు ఊద‌ర‌గొడుతున్నారు. మెజార్టీ పేరుతో ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జల‌తో మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ఇదంతా ఇంత‌కు ముందుమాట‌. ఇప్పుడు సీన్ మారిపోయింది. వైసీపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. అందుకే, తొలిసారి జ‌గ‌న్ సైతం రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 14న తిరుప‌తిలో ప్ర‌చారం నిర్వ‌హించ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. ఇంత‌కీ.. అధికార పార్టీలో అంత క‌ల‌వ‌రం ఎందుకు వ‌చ్చింది? స్వ‌‌యంగా సీఎం జ‌గ‌నే తిరుప‌తిలో ప్ర‌చారం చేసేంత అవ‌స‌రం ఏమొచ్చింది? ప్ర‌చారం జోరందుకుంటున్న కొద్దీ అధికార పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తిరుప‌తిలోనే తిష్ట వేసి.. ఓట‌ర్ల‌లో అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నారు. వైసీపీ ఆగడాలు, అరాచ‌కాల‌ను ఎం‌డ‌గ‌డుతూ.. టీడీపీకే మీ ఓటు అంటూ తెగ ప్ర‌చారం చేస్తున్నారు. నారా లోకేశ్ ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌‌స్తోంది. డివిజ‌న్ల వారీగా టీడీపీ రాష్ట్ర స్థాయి నాయ‌కుల‌ను మోహ‌రించ‌డం.. వైసీపీకి ఓటు వేయ‌క‌పోతే ప‌థ‌కాలు వ‌ర్తించ‌వ‌ని బెదిరిస్తే ఆ వీడియో, ఆడియోలు త‌మ‌కు పంప‌మంటూ వాట్సాప్ నెంబ‌ర్ ప్ర‌క‌టించ‌డంతో అధికార పార్టీ ఓవ‌రాక్ష‌న్‌కి చెక్ ప‌డిన‌ట్టైంది. టీడీపీ దూకుడుతో ‌ ఓట‌ర్ల మూడ్ వేగంగా మారుతోంది.గురువారం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగుతున్నారు. టీడీపీ యువ నేతలు కూడా వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇవన్ని టీడీపీకి ప్లస్ గా మారాయంటున్నారు.  అటు  బీజేపీ-జ‌న‌సేన సైతం ప్ర‌చారంతో హోరెత్తిస్తోంది. ర‌త్న‌ప్ర‌భ గెలుపు కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే ప్ర‌చారం నిర్వహించారు. అధికార పార్టీని ఏకి పారేశారు. పవన్ ప్రచారం తర్వాత బీజేపీ గ్రాఫ్ కొంత పెరిగిందంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తిరుపతి ప్రచారానికి వస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రోడ్ షో కు మంచి స్పందన వచ్చింది. ఆధ్యాత్మిక కేంద్ర‌‌మైన తిరుప‌తిలో బీజేపీకి ఎంతో కొంత క్షేత్ర బ‌లం ఉంటుంద‌నేది ఆ మేర‌కు అధికార పార్టీకి గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌ల‌మ‌నేది బీజేపీ లెక్క‌. ఇక అభ్య‌ర్థుల ప‌రంగానూ అంద‌రికంటే బ‌ల‌హీన‌మైన కేండిడేట్ వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తే అంటున్నారు. ఆయ‌న‌కు ఉన్న అర్హ‌త‌ల్లా పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు పాద సేవ చేయ‌డ‌మే. జ‌గ‌న్ కాళ్ల‌కు మ‌సాజ్ చేసినంత ఈజీ కాదు ఓట‌ర్ల‌ను మేనేజ్ చేయ‌డం. ఎవ‌రేమిటో వారికి బాగా తెలుసు. మాజీ ఎంపీ టీడీపీ అభ్య‌ర్థి పిన‌బాక ల‌క్ష్మి సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్‌. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం డిల్లీలో గ‌ట్టిగా పోరాడిన నేత. అలాంటి స్ట్రాంగ్ లీడ‌ర్ మ‌ళ్లీ తిరుప‌తి ఎంపీ బ‌రిలో నిలిచారు. ఆమె గెలుపు కోసం టీడీపీ శ్రేణులు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. పనబాక ల‌క్ష్మి ముందు వైసీపీ అభ్య‌ర్థి గురుమూర్తి చాలా వీక్ కేండిడేట్‌గా తిరుప‌తివాసులు భావిస్తున్నారు. అందులోనూ గురుమూర్తి తిరుప‌తి కోసం చేసిందేమి లేదు. అటు, వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల ప్ర‌తిష్ట బాగా దిగ‌జారుతోంది. ఆ ప్ర‌భావం ఎన్నిక‌ల‌పై ప‌డటం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో.. గురుమూర్తికి గెలిచే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతున్నాయి.  తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆశించిన మేరకు లేదని పార్టీ వర్గాల సమాచారం. ఇంటెలిజెన్స్ నివేదిక‌లూ ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లాయ‌ట‌. తిరుప‌తిలో ఈసారి గ‌త మెజార్టీ కూడా క‌ష్టమేన‌ని.. ఓడి పోయే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని నివేదిక‌లు ఇచ్చాయ‌ని తెలుస్తోంది. దీంతో.. న‌ష్ట నివార‌ణా చ‌ర్య‌ల్లో భాగంగా సీఎం జ‌గ‌న్ తానే స్వ‌యంగా తిరుప‌తిలో ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ నెల 14న తిరుప‌తి ప్ర‌చార బ‌రిలో దిగ‌బోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం జనంలోకి వెళ్లనున్నారు.  ముఖ్య‌మంత్రి అయ్యాక జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన‌ ఎలాంటి ఎన్నిక‌ల్లోనూ ప్ర‌చారం చేయ‌లేదు. తిరుప‌తిలోనూ ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని భావించినా క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేక‌పోవ‌డంతో తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చార బ‌రిలో దిగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి సీఎం జ‌గ‌న్‌రెడ్డిది.   

అత్తింటి వారు..చెట్టుకు కట్టేసి కొట్టారు.. 

అతని పేరు లక్ష్మణ్. వయసు 26 సంవత్సరాలు. పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఎల్లమ్మబండలో ఉండే  మేనత్త ఇంటికి వెళ్ళినప్పుడు. అక్కడ భవాని అనే అమ్మాయిని చూశాడు. ప్రేమించాడు. అప్పటికే భవాని కి మరొకరితో విడాకులు అయ్యాయని పెద్దలు చెప్పారు.. అయిన సరే చేసుకుంటాను అని పెద్దలను ఒప్పించాడు. భవాని ని 2020 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు కాపురం బాగానే సాగింది. తర్వాత లక్ష్మణ్ ఏ పని చేయడం లేదు. గాలికి తిరుగుతున్నాడని భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఇంతలో భవానీ గర్భవతి కావడంతో పుట్టింటికి వెళ్లింది. చేసేది ఏమిలేక  లక్ష్మణ్ కూడా అత్తారింట్లో చేరాడు. ఒకటి కాదు, రెండు కాదు నాలుగు  నెలలుగా లక్ష్మణ్‌ అత్తగారింటి వద్దే ఉంటున్నాడు. నెల రోజుల క్రితం పాప పుట్టింది. మార్చి 31న పాప ఫంక్షన్‌ చేశారు. అదే రోజు రాత్రి భవానీ తల్లిదండ్రులు, బంధువులు పని విషయంలో లక్ష్మణ్‌ను నిలదీశారు. మాటామాటా పెరిగింది. లక్ష్మణ్‌ అక్కడి నుంచి అలిగి ఇంటి దారి పట్టాడు. ఇంతలో అత్తింటి వారు లక్ష్మణ్‌ను పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. రాత్రి మొత్తం అలాగే, కట్టేసి ఉంచారు. మరునాటి ఉదయం కాలకృత్యాలు తీర్చుకుంటానని చెప్పడంతో కట్లు విప్పారు. అక్కడి నుంచి తప్పించుకున్న లక్ష్మణ్‌ యూసుఫ్‌గూడ అంజయ్యనగర్‌కు వచ్చి తల్లిదండ్రులు, బాబాయ్‌ కొడుకు సంపత్ కు  జరిగిన విషయాన్ని పూస గుచ్చినట్లు చెప్పాడు. ఒంటి మీద వాళ్ళు కొట్టిన  దెబ్బలు చూపించాడు. ఆ రోజంతా అదే దిగులుతో ఉన్నాడు. రాత్రి లక్మన్ ఇంట్లో  బయటకు వెళతానని చెప్పి, తిరిగి రాలేదు. బాధలో ఉన్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు.  కట్ చేస్తే.. లక్ష్మణ్‌ బాబాయి రాము ఉండే ఇంట్లోని సెల్లార్‌ నుంచి దుర్వాసన వస్తుండడాన్ని రాము భార్య కళ గమనించింది. వెళ్లి చూడగా లక్ష్మణ్‌ ఫ్యాన్‌కు మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితికి చేరింది. లక్ష్మణ్‌ సోదరుడు శేఖర్‌ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీలో పరిషత్ ఎన్నికలకు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు లైన్ క్లియరైంది. పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఎన్నికలను యధాతథంగా నిర్వహించుకోవచ్చని తీర్పు ఇచ్చిన ధర్మాసనం.. కౌంటింగ్ మాత్రం చేపట్టవద్దని ఆదేశించింది. సింగిల్ బెంచ్ జడ్జీ దగ్గరకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో ఏపీ ఎస్ఈసీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఏప్రిల్ 8 గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.  పరిషత్ ఎన్నికలను నిలుపదల చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు ధర్మాసనం ముందు మంగళవారం రాత్రి అప్పీల్‌ దాఖలు చేశారు. ఈపిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనంలో‌ బుధవారం విచారణ జరిగింది. ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, పిటిషనర్ వర్ల రామయ్య తరపు వాదనలను సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు.  వర్ల రామయ్య తెదేపా తరఫున పిటిషన్‌ వేయలేదని, వ్యక్తిగతంగా రిట్‌ పిటిషన్‌ వేయకూడదని ఎస్‌ఈసీ తరపున న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 28 రోజులు కోడ్‌ ఉండాలనేది సుప్రీం ప్రత్యేక సందర్భంలో ఇచ్చిందని పేర్కొన్నారు. కోడ్‌ నిబంధన ఈ ఎన్నికలకు వర్తింప జేయాల్సిన అవసరం లేదన్నారు. 

చంపేస్తామని బెదిరింపులు! కడప బ్యాచ్ పనేనంటున్న ఎంపీ 

తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు  తనకు చాలా మంది ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని చెప్పారు. రాక్షసులను అంతమొందించేపనిలో పడిన తనకోసం కడప బ్యాచ్‌ను దించాలనుకుంటున్నారని అన్నారు. తనపై దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నారని, ప్రధానికి ఫిర్యాదు చేస్తానన్నారు రఘురామ కృష్మం రాజు. బాబాయిని చంపారు.. ఇప్పుడు ఎంపీని చంపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిపై  హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చెస్తానన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలంటూ సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాసినట్లు రఘురామకృష్ణం రాజు చెప్పారు. ఏపీ సీఎం జగన్ రాముడో.. రావణుడో తేలేవరకు ఏపీలో కాలుపెట్టనని ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. తన గురించి ఎన్ని పోస్టర్లు వేసినా... ఏం చేసినా రాష్ట్రానికి రానన్నారు. తానోక మహా యజ్ఞం చేపట్టానని, సర్పయాగమని.. అది పూర్తయ్యే వరకు రానన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కేసులో హైకోర్టులో ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమన్నారు. సుప్రీంకోర్టు గత తీర్పు చెల్లదని సుప్రీంకోర్టుకు వెళ్లినా ఆశ్చర్య పోనక్కరలేదన్నారు. ఉదయం చార్జీ తీసుకుని సాయంత్రానికి ఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకన్న సంక్షేమ పథకాలకు ఇస్తున్న నిధులు తక్కువగా ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రూ. 1500 వందల కోట్ల కోసం ఇప్పుడు విశాఖలో భూములు అమ్మాలని చూస్తున్నారని.. త్వరలో రాష్ట్రాన్ని అమ్మకానికి పెడతారని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి రాముడని అనుకుంటున్నా.. రావణుడని కొందరు అనుకుంటున్నారని చెప్పారు.  జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఉంటే బావుంటుందన్నారు. తిరుపతిలో వైసీపీకి  రెండు లక్షల మెజారిటీ వస్తుందని రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు.

ఇంటి రక్షణలో తూముకూరు పోలీసులు.. మనకేవి అలాంటి వసతులు! 

సెల‌వుల్లో ఊరెళ్లుతున్నారా?  పెళ్లికి బంధువుల ఇంటికి వెళుతున్నారా? మ‌రేదైనా ప‌ని కోసం కొన్ని రోజులు ఇల్లు వ‌దిలిపెట్టాలా? మ‌రి, ఇంట్లో ఎవ‌రూ లేక‌పోతే దొంగ‌లు ప‌డ‌తార‌నే భ‌యం ఉంటుంది కదా? కాని కర్ణాటక రాష్ట్రంలోని తూమ‌కూరు జిల్లా జనాలకు మాత్రం అలాంటి భయమేమి లేదు. అందుకంటే దొంగల భయం లేకుండా ఎక్కడి పోలీసులు ఉపాయం ఆలోచించారు. మీరు నిశ్చింత‌గా ఊరెళ్లండి.. మీరు వ‌చ్చే వ‌ర‌కూ మీ ఇంటి ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు మావంటూ భ‌రోసా ఇస్తున్నారు. జ‌స్ట్ మాట‌లే కాదు, టెక్నాల‌జీ సాయంతో తాళం వేసి ఉన్న ఇంటికి గ‌ట్టి సెక్యూరిటీ అరేంజ్ చేస్తున్నారు. లాక్డ్ హౌజ్ మానిట‌రింగ్ సిస్ట‌మ్‌-ఎల్‌హెచ్ఎమ్‌ఎస్ ప‌రిజ్ఞానంతో ఇంటిని సుర‌క్షితంగా ఉంచుతున్నారు.  ఇందుకోసం ముందుగా ఎల్‌హెచ్ఎమ్‌ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వ‌ర‌కూ ఇంట్లో ఉండ‌రో స‌మీప పోలీస్ స్టేష‌న్‌కు మెసేజ్ ఇవ్వాలి. వెంట‌నే పోలీసులు మీ ఇంటికొచ్చి.. ఇంట్లో ఎల్‌హెచ్ఎమ్‌ఎస్ కెమెరాలు ఫిక్స్ చేస్తారు. వాటిని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తారు. తాళం వేశాక‌.. ఇంట్లో ఏవైనా క‌ద‌లిక‌లు క‌నిపిస్తే.. వెంట‌నే పెద్ద శ‌బ్దంతో సైర‌న్ మోగుతోంది. కంట్రోల్ రూమ్‌కూ మెసేజ్ వెళ్తుంది. వెంట‌నే పోలీసులు అల‌ర్ట్ అవుతారు. క్ష‌ణాల్లో ఆ ఇంటికి చేరుకుంటారు.  లాక్డ్ హౌజ్ మానిట‌రింగ్ సిస్ట‌మ్‌ తో తాళం వేసిన ఇళ్ల‌ల్లో దొంగ‌త‌నం జ‌రిగే ఛాన్సెస్ దాదాపు ఉండ‌దంటున్నారు తూమకూరు పోలీసులు. 8 నెల‌ల క్రితం ఈ ఎల్‌హెచ్ఎమ్‌ఎస్ విధానాన్ని అమ‌ల్లోకి తీసుకొచ్చారు పోలీసులు. ఇప్ప‌టి వ‌ర‌కూ దాదాపు 400 కుటుంబాలు ఈ స‌దుపాయాన్ని వినియోగించుకున్నారు. ఈ సేవ‌లు పూర్తిగా ఉచితం. ఇందుకోసం పోలీసులు ఒక్క రూపాయి కూడా తీసుకోరు. దీంతో.. ఇంటికి తాళం వేసి బ‌య‌ట‌కు వెళ్లాల‌నే భ‌య‌మే ఉండ‌టం లేదు అక్కడి ప్ర‌జ‌ల‌కు.  క‌ర్ణాట‌క రాష్ట్రం తూమ‌కూరు జిల్లా పోలీసులు ఇంత అద్బుతమైన ఉపాయం చేయగా.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఊద‌ర‌గొట్టే తెలంగాణ‌లో కానీ, బెస్ట్ పోలీసింగ్ అంటూ బిల్డ‌ప్ కొట్టే ఏపీలో కానీ.. ఇలాంటి స‌దుపాయం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు హడావుడి చేయడం తప్ప ప్రజలకు పనికొచ్చే ఇలాంటి ప్రయత్నాలు చేయరనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. ప్ర‌జ‌ల కోసం కాకుండా పాల‌కుల కోస‌మే ఇక్కడి పోలీసులు ఎక్కువ ప‌ని చేస్తారని.. వారి అడుగుల‌కు మ‌డుగులు ఒత్తుతారని అంటారు.  తెలంగాణలో  సీసీకెమెరాలు మ‌న‌మే పెట్టుకోవాలి. క‌మ్యూనిటీ కెమెరాల పేరుతో బ‌ల‌వంతంగా మ‌న‌తోనే వీధుల్లో కెమెరాలు పెట్టిస్తారు పోలీసులు. పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లాలంటేనే కాస్త భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి. పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే ఆరోప‌ణ‌లు తెలుగు రాష్ట్రాల్లో కామ‌న్. ఇక క‌ర్ణాట‌క స్టేట్ తూమ‌కురు జిల్లాలో అమ‌లవుతున్న లాక్డ్ హౌజ్ మానిట‌రింగ్ సిస్ట‌మ్‌-ఎల్‌హెచ్ఎమ్‌ఎస్ విధానం మన ద‌గ్గ‌ర సాధ్య‌మేనా? మ‌న పోలీసులు ఆ విధంగా ప్రజాసేవ చేయ‌గ‌ల‌రా? తూమ‌కూరు విధానాన్ని తెలుగు రాష్ట్రాలు అందిపుచ్చుకోగ‌ల‌వా?.. చూడాలీ మరీ..

ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ 

దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏకంగా 630 మంది మృతి చెందారు. ఒక్క రోజులో ఇంత మంది చనిపోవడం ఇదే రికార్డు. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గఢ్ లో కరోనా తీవ్రత అత్యంత దారుణంగా తయారైంది. బెంగళూరు, ఢిల్లీలోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా ఆయన  ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. తనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. కరోనా నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.  కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీ హైకోర్టు కరోనా కట్టడికి పలు సూచనలు చేసింది. మాస్క్‌ను సురక్షణ కవచంగా పేర్కొంటూ, ఎవరైనా సరే కారులో ఒంటరిగా డ్రైవ్ చేస్తున్నప్పటికీ వారు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. మాస్క్ అనేది కోవిడ్-19 వైరస్‌ను అడ్డుకుంటుందని తెలిపింది. కాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం నైట్‌కర్ఫ్యూను విధించింది. కరోనా వైరస్ చైన్ తెగ్గొట్టేందుకు నైట్ కర్ఫ్యూ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.  ఢిల్లీలో మాస్క్ పెట్టుకోని వారి నుంచి రెండు వేల రూపాయల జరిమానా వసూలు చేస్తున్నారు.