క్రికెట్ లెజెండ్ చనిపోలేదు.. బ్రతికే ఉన్నాడు..
posted on Aug 11, 2016 @ 5:11PM
పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్, పాక్ లిటిల్ మాస్టర్గా పేరుగాంచిన హనిఫ్ మహ్మద్ చనిపోయారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించారని వార్తలు పొక్కడంతో అందరూ నిజమే అనుకున్నారు. అంతేకాదు తన కుమారుడు హనిఫ్ మహ్మద్ షోయబ్ మహ్మద్ కూడా తన తండ్రి మరణించినట్టు తెలిపారు. అయితే మళ్లీ అతనే తన తండ్రి బతికే ఉన్నారని స్పష్టం చేశారు. తన తండ్రి బతికే ఉన్నప్పటికీ వైద్యులు తనతో ఆయన మృతి చెందినట్లు చెప్పారని.. అందుకే తాను కూడా పొరపాటు పడి మీడియా ముందుకు వచ్చి తన తండ్రి చనిపోయినట్లుగా ప్రకటించానని, కానీ హనిఫ్ మహ్మద్ ప్రాణాలతోనే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. 81 సంవత్సరాల హనీఫ్ గత కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్ తో బాధపడుతున్నారు. కరాచీలోని అగాఖాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా టెక్నికల్, స్టైలిష్ బ్యాట్స్మన్గా పేరున్న హనీఫ్ మహ్మద్ 1958-59లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో లాంగెస్ట్ ఇన్నింగ్స్ ఆడి 337 పరుగులు చేసిన ఏకైక పాక్ క్రికెటర్గా పేరుగాంచారు. 43.98 యావరేజ్తో మొత్తం 3,915 పరుగులు చేశారు. ఆయన ఫస్ట్క్లాస్ హైయస్ట్ స్కోరు 499 పరుగులు. రెండు చేతులతోనూ బౌలింగ్ చేయగలరు. తన కెరీర్లో మొత్తం 12 సెంచరీలు సాధించారు.