జగన్ ఆస్తులపై వ్యాఖ్యానించలేం

హైదరాబాద్: తమనేత దివంగత వైఎస్ఆర్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై తామేమీ వ్యాఖ్యానించలేమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. అదేసమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆస్తిగా ఆయన పేర్కొన్నారు. అందువల్ల వైఎస్ఆర్ ముమ్మాటికీ తమ పార్టీనేతేనని అన్నారు. దీనిపై ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న ఉప ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్‌పై సాగుతున్న చర్చను ఆయన నిరర్థక చర్చతో పోల్చారు. వైఎస్ కాంగ్రెస్ నాయకుడు కాదని పార్టీవారెవరూ అనలేదన్నారు. వైఎస్ఆర్ పార్టీ కోసం దశాబ్దాల పాటు పని చేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సారథ్యం వహించారని ఆయన గుర్తు చేశారు.

బాబా ఆరోగ్యంపై తాజా బులెటిన్

పుట్టపర్తి: సత్య సాయిబాబా ఆరోగ్యపరిస్థితి మేరుగుపడినా ఇంకా ఆందోళనకరంగానే ఉందని డా. సఫాయా పేర్కొన్నారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు ఈరోజు ఉదయం బాబా ఆరోగ్యపరిస్థితిపై తాజా నివేదిక వెలువరించారు. మూత్రపిండాలకు సీఆర్ఆర్ థెరపీ కొనసాగిస్తున్నామని, వెంటిలేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నామని డా. సఫాయా పేర్కొన్నారు. కాగా, సత్యసాయి బాబా తన సహాయకుల చేతిలోనే బందీ అయిపోయాడంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనంపై రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేగింది. దీంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. వెంటనే డాక్టర్లు రవిరాజ్, నాగేశ్వరరావుతో అత్యవసరంగా భేటీ అయ్యారు. బాబా ఆరోగ్యం ఇంకా ఎన్నాళ్లకు కుదుట పడుతుంది, ఏమయింది అనే విషయంపై వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది. కాగా సత్యసాయి బాబాను చూపించకుండా డాక్టర్లు కేవలం ఉదయం, సాయంత్రం పూటలలో హెల్త్ బులెటిన్ మాత్రమే విడుదల చేయడంపై అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ మండి పడింది. బాబాను వెంటనే చూపించాలంటూ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం వద్ద ఆందోళనకు దిగింది. లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది. పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు.

నీతికి అవినీతికి మధ్య ఎన్నికలు: డీఎల్

కడప: కడపలో జరిగే ఉప ఎన్నికలు నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటే రాష్ట్రాన్నే అమ్మేస్తారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని వనరులను దోచేస్తారని ఆయన అన్నారు. జగన్ కి కర్ణాటక రాజధాని బెంగుళూరులోని రూ.400 కోట్ల బిల్డింగ్ ఉందని ఆయన ఆరోపించారు. జగన్ తన ప్రాపర్టీని 365 కోట్లుగా చూపించడాన్ని డిఎల్ ప్రశ్నించారు. ఒక్క బిల్డింగ్ రూ.400 కోట్లు ఉంటే జగన్ ఆస్తి ఆయన అఫిడవిట్‌లో చెప్పినంతనే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 2004 ఎన్నికలకు ముందు జగన్ ఆస్తి రూ.9 లక్షల చిల్లర ఉందని అది ఇప్పుడు వందల కోట్లకు ఎలా చేరిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

శ్రీకృష్ణ కమిటీపై కేసు

హైదరాబాద్‌: జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తప్పుడు వివరాలతో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నివేదిక ఇచ్చిందని సభ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు శుక్రవారం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ అధికారులను ఆదేశించింది. కమిటీ తమకు అప్పగించిన పనులే కాకుండా అప్పగించని పనులను సైతం భుజానెత్తుకుని అపమార్గం పట్టిందని దాఖలైన ఒక పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. శ్రీకృష్ణ కమిటీ తమ నివేదిక 8వ చాప్టర్‌లో తెలంగాణాను కించపరిచే వ్యాఖ్యలు చేసిందని, మతపరమైన విద్వేషాలు సృష్టించేలా ఉందంటూ తెలంగాణా పీపుల్స్‌ ఫోరమ్‌కు చెందిన వలీలూర్‌ అనే న్యాయవాది తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకు సమర్ధనంగా ఆయన మీడియాలో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు. ఈ ఆధారాల ప్రాతిపదికన నాంపల్లి కోర్టు శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఐపీసీ 158ఏ, 478, 504, 595(2) తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది.

మంత్రి వివేకా రాజీనామా ఆమోదం

హైదరాబాద్: వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ప్రజల నుంచి వచ్చే అధికారమే తనకు కావాలని, నామినేటెడ్ అధికారం వద్దంటూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అధిష్ఠానం పెద్దలు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలు వివేకానంద రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినా ఫలించలేదు. మంత్రి పదవికి వైఎస్ వివేకానందరెడ్డి చేసిన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. తన రాజీనామా ఆమోదిస్తే తప్ప పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసేది లేదని వివేకానందరెడ్డి పలుమార్లు సీఎంకు స్పష్టం చేశారు. శనివారం ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. ఈలోగా తన రాజీనామాను ఆమోదించాల్సిందేనని వివేకా పట్టుబట్టారు. అధిష్ఠానం సూచన మేరకు వివేకాను ఒప్పించేందుకు చివరి వరకూ ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఒకరోజు ముందుగా వివేకా మంత్రి పదవి రాజీనామాను అమోదించాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు సీఎం సిఫారసు చేశారు. దీనితో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వివేకా నామినేషన్ దాఖలు చేయడంపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి.

కేసీఆర్‌ కు చరమగీతం పాడితేనే సాధ్యం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర్ రావును హుస్సేన్ సాగర్‌లో పడేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్ కస్తూరి జయప్రకాష్ అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే.. తెరాసను రద్దు చేసి, కేసీఆర్‌ను, ఆయన కుటుంబ నాయకత్వానికి చరమగీతం పాడితేనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమన్నారు. దీనిపై జయప్రకాష్ మాట్లాడుతూ తెరాస పదేళ్ళ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి, వారి రాజకీయ ప్రాతినిథ్యం కోసం ఏనాడు ఉద్యమించలేదన్నారు. ఆయన నాయకత్వంలో ఈ వర్గాలకు అన్యాయమే జరిగిందని దీనికి నిదర్శనం తెలంగాణ ఎమ్మెల్యేపై దాడి అని గుర్తు చేశారు. ఇకపోతే.. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 177 జీవో ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నీరుకార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అందువల్ల దీన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జగన్ కోటలో కాంగ్రెస్ పాగా

కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి కి కడప లోక్ సభ నియోజకవర్గంలో పెట్టని కోటల్లా ఉన్న ప్రాంతాల్లో రిగ్గింగ్ నిరోధానికి కాంగ్రెసు నాయకత్వం తగిన ప్రణాళికను రచిస్తోంది. జగన్ కోటలో కాంగ్రెస్ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. కడప లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు డజను మందికి పైగా మంత్రులను ఇంచార్జీలుగా వేసిన కాంగ్రెసు నాయకత్వం ఇప్పుడు స్థానిక నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. జగన్‌తోనూ ఇతర పార్టీలతోనూ ఉన్న స్థానిక నాయకులను తన వైపు తిప్పుకునేందుకు కార్యాచరణ రూపొందించింది. జమ్మలమడుగు, బద్వేలు, కడప శాసనసభా స్థానాల పరిధిలోని స్థానిక నాయకులపై కాంగ్రెసు దృష్టి పెట్టింది. 2009 ఎన్నికల్లో జగన్ విజయానికి సహకరించినవారిని బుజ్జగిస్తోంది. తమ పార్టీ ఏ మాత్రం లేని ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ఇతర పార్టీలు పోలింగ్ అక్రమాలకు పాల్పడకుండా చూసేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ నుంచి తెగదెంపులు చేసుకున్న తర్వాత స్థానిక కాంగ్రెసు నాయకులు ఆయన వైపు వెళ్లారు. దాంతో వారిని తిరిగి కాంగ్రెసులోకి తేవడానికి కాంగ్రెసు పార్టీ నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తోంది. దాంతో కొంతమందిని తన వైపు తిప్పుకోగలిగింది. జమ్మలమడుగు శాసనసభ స్థానానికి జగన్ వర్గానికి చెందిన ఆదినారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఈ నియోజకవర్గంలోని చాలా మంది స్థానిక నాయకులను తమ వైపు తిప్పుకోగలిగామని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ నాదే: భాషా

కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని కడప జిల్లాకు చెందిన మహబూబ్ బాషా కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పైన అభిమానంతో తాము వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని స్థాపించుకున్నామని ఆ పేరుతో జగన్ ప్రచారం చేసుకోవడం సరికాదని ఆ పార్టీని తానే స్థాపించానని చెబుతున్న మహబూబ్ బాషా అన్నారు. వైయస్ఆర్ పార్టీని తాను స్థాపించానని బాషా అన్నారు. ఆ పేరుతో జగన్ ప్రచారం చేసుకోడాన్ని ఖండిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జగన్ యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీని నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ వద్ద నుండి తీసుకున్నారని అలాంటప్పుడు వారు అలాగే ప్రచారం చేసుకోవాలని వైయస్ఆర్ పార్టీ పేరున ప్రచారం చేసుకోవద్దని కోరారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ పేరు తనది అని శివకుమార్ అనడంపై తాను కోర్టులో కేసు వేశానని చెప్పారు. కోర్టులో ఉన్న పార్టీ పేరును ఉపయోగించకుండా చూడాలని కోరారు.

ప్రభుత్వానికి చుక్కెదురు..వినాయక్ సేన్‌కు బెయిల్

న్యూఢిల్లీ: పౌరహక్కుల కార్యకర్త వినాయక్ సేన్ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. పౌరహక్కుల నేత బినాయక్‌సేన్ (61) కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. నక్సలైట్లకు బినాయక్ సేన్ సహాయ సహకారాలు అందిస్తున్నారని, వాళ్లతో సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వం కోర్టులో వాదించింది. ఆ ఆరోపణలపై తగిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంటూ, ఆయన నక్సలైట్ సానుభూతిపరుడు మాత్రమే కావచ్చునని అభిప్రాయపడుతూ ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. ఛత్తీస్‌గఢ్ కోర్టు సేన్‌కు బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విధితమే. తనపై సరైన సాక్ష్యాధారాలు లేకుండానే తనను కింది కోర్టు దోషిగా ప్రకటించిందని సేన్ ఆరోపించారు. సేన్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఆయనకు మావోయిస్టులతో లోతైన సంబంధాలున్నాయని ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం అఫి డవిట్ దాఖలు చేసింది. వినాయక్ సేన్ ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్ రాజధాని రాయపూర్ జైలులో ఉన్నారు .

సీఎం పదవి కోసమే కేసీఆర్ చండీయాగం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు తాను ముఖ్యమంత్రి కావడం కోసమే చండియాగం చేశారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. గతంలో విశ్వశాంతి యాగం పేరుతో విజయశాంతిని ఎంపీగా చేశారని, ఇప్పుడు తన కోసం యాగం చేస్తున్నారని అన్నారు. ఆయన చేసేది చండియాగం మాట్లాడేది మాత్రం చండాలం అని దుయ్యబట్టారు. కెసిఆర్ తెలుగుదేశం పార్టీని విమర్శించడం మానుకుంటే మంచిదని సూచించారు. కాగా త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని మరో సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం అటు యుపిఏ ప్రభుత్వంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ముసలం ఖాయమని చెప్పారు. కె చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రానికి సిఎం కావాలని అభిప్రాయ సేకరణ చేస్తున్నారని ఆరోపించారు.

జగన్ వ్యాఖ్యల్లో నిజం లేదు

కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇద్దరూ కాంగ్రెసు పార్టీ కుటుంబానికి సంబంధించిన వారేనని అలాంటప్పుడు వారిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందని వైయస్ వివేకానందరెడ్డి ప్రశ్నించారు. ఇటీవల ప్రచారంలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలు సోనియాగాంధీకి, వైయస్‌కు మధ్య పోటీ కాదని యుద్ధం అని చెప్పిన విషయం తెలిసిందే. మంత్రులు కేవలం జిల్లాలో సమన్వయం చేయడానికే వచ్చారని అన్నారు. వారు వచ్చి ప్రచారం చేసినంత మాత్రం అక్రమాలు జరుగుతాయని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మంత్రులు రావడాన్ని ఎవరూ తప్పు పట్టవద్దని అన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఏమాత్రం లేదన్నారు.

సద్భావన యాత్రలో లగడపాటి వీరంగం

విజయవాడ: విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ శుక్రవారం సద్భావన యాత్రలో వీరంగం సృష్టించారు. కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జువరం సద్భావన యాత్రలోభాగంగా లగడపాటి మాట్లాడుతున్న సమయంలో జానీ అనే వ్యక్తి స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాడు. దాంతో ఆగ్రహం చెందిన లగడపాటి ఆ వ్యక్తిని గాడిద అంటూ నెట్టేశారు. ఎంపీ దురుసు ప్రవర్తనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా,  మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు నేతలు లగడపాటి రాజగోపాల్ స్పీచ్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. జగన్‌కు మద్దతు పలకాల్సిందిగా డిమాండ్ చేశారు. గొడవ సద్దుమణిగిన అనంతరం ఆయన తన స్పీచ్ కొనసాగించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలకు అంతగా ప్రాధాన్యం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీల బలం ఈ ఎన్నికలలో తెలియవని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే ఆయా పార్టీల బలం తెలుస్తుందని చెప్పారు. ఇప్పుడు పార్టీని వీడిన వారు 2014లో తప్పకుండా కాంగ్రెసు పార్టీలోకి వస్తారని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

బాబా ఆరోగ్యంపై ఆదికేశవులు సంచలన వ్యాఖ్యలు

చిత్తూరు: సత్యసాయి బాబా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ డి.ఆదికేశవులు నాయుడు చెప్పారు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొన్నిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా ఆరోగ్యంపై ఆదికేశవులు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బాబా వద్ద ఉన్న అయ్యర్ వైద్యుడు కాడని, అతను సత్యజిత్ స్నేహితుడని, సత్య సాయిబాబా వద్ద వైద్యులే లేరని ఆయన అన్నారు. సత్య సాయిబాబాకు విదేశాల్లో వైద్యం చేయించవచ్చునని ఆయన అన్నారు. సత్య సాయిబాబాకు ఆహారం, వైద్యం అందిస్తే తప్ప కోలుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ వల్లే బాబాకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. బాబా అనారోగ్యంగా ఉంటే ఎలాంటి చికిత్స చేయించలేదన్నారు. మూడు నెలలుగా సరిగా అన్న పానీయాలు పెట్టడం లేదన్నారు. ఆరు నెలలుగా బాబాను ఎవరూ దర్శించుకోకుండా సత్యజిత్ ఆయన స్నేహితుడు డాక్టర్ అయ్యర్‌లు అడ్డుకున్నారని ఆరోపించారు. బాబా ఆరోగ్య పరిస్థితి గురించి ప్రభుత్వానికి, ప్రశాంతి నిలయ ట్రస్టుకు వాస్తవ పరిస్థితులు తెలుసన్నారు. రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, రఘువీరా రెడ్డిలు ఇప్పటికైనా నిజాలు వెల్లడించాలన్నారు. పూర్తి వాస్తవాలు తెలియకుండా మాట్లాడితే బాగుండదని ఇంత కాలం తాను మౌనంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వాస్తవాలు ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. రత్నాకర్ వంటి వారు వాస్తవాలను భక్తులకు వివరించాలని ఆదికేశవులు నాయుడు డిమాండ్ చేశారు.

బాబా ఆరోగ్యంపై పిటిషన్

అనంతపురం: సత్యసాయి బాబా ఆరోగ్యంపై పెనుగొండ కోర్టులో న్యాయవాది భాస్కర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బాబా ఆరోగ్యస్థితి, ట్రస్టు వివరాలు వేల్లదిన్చాలంటూ న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు. బాబా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించినవారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. బాబాను భక్తులకు చూపించాలంటూ ఆయన ప్రైవేట్ కేసును వేశారు. కాగా, సత్యసాయి బాబా ఆరోగ్యంపై నిజానిజాలు వెల్లడించాలని మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు అయ్యింది. చికిత్స పేరుతో బాబాను ఆస్పత్రిలో ఉంచి ఆయన వివరాలు దాచి పెడుతున్నారంటూ దళిత జనసభ అధ్యక్షుడు గద్ద శ్రీనివాస్ హెచ్‌ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సత్యసాయి ట్రస్ట్, ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన తన పిటిషన్‌లో డిమాండ్ చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న బాబా దొంగ భక్తులపై చర్య తీసుకోవాలని కోరారు. ట్రస్ట్ సభ్యులు, ఆస్పత్రి యాజమాన్యం కుమ్మక్కై బాబా ఆరోగ్య వివరాలు రహస్యంగా ఉంచుతున్నారన్నారు. బాబా ఆరోగ్యంగా ఉంటే భక్తులందరికీ దర్శనమిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని దళిత జనసభ తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే మీడియాను కూడా ఆస్పత్రిలోకి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

ఓటర్లు మోసం చేయరు: పద్మావతి

కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని కడప జిల్లా ఓటర్లు మోసం చేయరని శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి అన్నారు. శుక్రవారం జగన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆమె పాల్గొని విలేకరులతో మాట్లాడారు. ఎంతమంది ఏకమైనా జగన్ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు వైయస్ వారసత్వం కాంగ్రెసు పార్టీది అని చెబుతున్నారని కానీ అసలైన వైయస్ వారసులం తామేనని చెప్పారు. వైయస్‌ని తామంతా గుండెల్లో పెట్టుకున్నామన్నారు. జగన్, విజయమ్మలను విమర్శించిన వారికి కడప జిల్లా ప్రజలు జీవితాంతం గుర్తుండేలా బుద్ధి చెబుతారని తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. జగన్ నాయకులను నమ్ముకొని రాలేదని ప్రజలను నమ్ముకొని వచ్చిన వాడన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ డి శ్రీనివాస్, మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఎన్ని కుట్రలు చేసినా జగన్ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని సినీ నటి రోజా అన్నారు.  వైఎస్‌ను దూషించనవారికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ ఫోటో లేకపోతే ఓట్లు పడవని ఆయన ఫోటోతో ప్రచారానికి దిగాయని రోజా దుయ్యబట్టారు.

కాంగ్రెస్ కే కమలమ్మ విధేయత

హైదరాబాద్:  కాంగ్రెసు పార్టీకి కడప జిల్లా బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ విధేయతను ప్రకటించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతోనే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నట్లు ఆమె తెలిపారు. శుక్రవారం ఉదయం ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను ఏ రోజు కూడా లేనని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగానే తాను ఎన్నికల్లో గెలిచానని, కాంగ్రెసు పార్టీని తాను ఏనాడూ విమర్శించలేదని ఆమె చెప్పారు. కడప లోక్ సభ స్థానంలో తాను కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి విజయానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

నామినేషన్ వేసిన వైఎస్ జగన్

కడప : కడప పార్లమెంట్ స్థానానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి కలెక్టర్‌కు ఆయన శుక్రవారం తన నామినేషన్ పత్రాలు అందచేశారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలి వచ్చారు. కాగా పులివెందుల శాసనసభ స్థానానికి శనివారం వైఎస్ విజయలక్ష్మి నామినేషన్ వేయనున్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్ విజయమ్మను ఓడించటానికి ప్రభుత్వం కుఠిల ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓటుతోనే ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కొందరిని భయపెట్టి పార్టీకి దూరం చేస్తున్నారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తమను ఎన్ని ఇబ్బందులు పెట్టిని వైఎస్‌ఆర్ కుటుంబాన్ని వీడేదిలేదని, వారి వెన్నంటే ఉంటామని ఆమె తేల్చి చెప్పారు.

రాహుల్ తో అమూల్ కు కలిసొచ్చింది

అహ్మదాబాద్: కేరళ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్యుతానందన్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ మధ్య నెలకొన్న ప్రచార వాగ్భాణాలు గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యకు కలిసి వచ్చినట్లుగా ఉంది. కురువృద్ధుడు అయిన కేరళ ముఖ్యమంత్రి, యువకుడు అయిన రాహుల్ గాంధీ ఇద్దరూ అమూల్ బేబీలే అంటూ ఆ కంపెనీ తన తాజా ప్రకటనలో పేర్కొంది. వారిద్దరూ అమూల్ బేబీలే అంటూ ఓ కార్టూన్ వేసి ప్రకటన చేసింది. కార్టూన్ వేసి కింద అమూల్ వృద్ధులకు, యువకులకోసం అంటూ రాసి అందరినీ ఆకట్టుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌ వయసును ఉద్దేశించి మాట్లాడారు. 87 ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించడంపై రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనికి స్పందించిన అచ్యుతానందన్ రాహుల్ గాంధీ అమూల్ బేబీ అని, నలభై ఏళ్లుగా ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అచ్యుతానందన్ అమూల్ బేబీ అనడంతో గుజరాత్‌కు చెందిన అమూల్ కంపెనీ దానిని తన ప్రచారానికి వినియోగించుకుంది. వారి వ్యాఖ్యలతో ఆ కంపెనీ ఆనందంలో తేలియాడుతోంది. వారి వ్యాఖ్యల ద్వారా దేశవ్యాప్తంగా తమకు మరింత ప్రచారం జరిగిందని సంబరపడుతోంది.