సూత్రధారి సోనియా గాంధీ: కిషన్

నల్గొండ: దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సూత్రధారి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కాగా, పాత్రధారి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన నల్గొండలో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్ని రకాల అవినీతి కుంభకోణాలు సోనియాకు బాగా తెలుసన్నారు. ప్రధాని డ్రైవర్ సీటులో ఉన్నా సోనియా చేతిలోనే స్టీరింగ్ ఉందని చెప్పారు. సుస్థిరమైన ప్రభుత్వాలు లేకపోవడం వల్లే దేశంలో అవినీతి పెరిగిపోతున్నదన్నారు. జాతీయ పార్టీల ప్రభావం తగ్గిపోవటానికి కారణాలు అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. అన్నా హజారే దీక్షకు అనూహ్యరీతిలో దేశ ప్రజల నుంచి మద్దతురావడం చూస్తుంటే అవినీతి నిర్మూలన కోసం వారు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతున్నదన్నారు. అవినీతి అంతంతోపాటు ఎన్నికల సంస్కరణలు కూడా తీసుకురావాలన్నారు. వారసత్వ రాజకీయాలకు కూడా స్వస్తి పలకాలన్నారు.

పరిటాల కేసులో జగన్ హస్తం: డీఎల్

కడప: అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పరిటాల రవిని అంతం చేసేందుకు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగలి కృష్ణకు 5 లక్షల రూపాయలు ఇచ్చారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఓ సమావేశంలో అన్నట్టుగా సమాచారం. జగన్ వెంట ఉన్న వారంతా అక్రమాలు, క్రిమినల్స్ చేసే నేరగాళ్లు ఉన్నారని ఆరోపించారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మంగలి కృష్ణలపై పులివెందులలో క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. కాగా కాంగ్రెసు పార్టీపై జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలో విమర్శలు చేశారు. జగన్‌ను ఎదుర్కొనడానికి కాంగ్రెసు పార్టీ 15 మంది మంత్రులను కడప జిల్లాలో తిష్ట వేయించిందన్నారు. అయినప్పటికీ గెలుపు మాత్రం జగన్‌, విజయమ్మలదే అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రూ.150 కోట్లు కడపకు మళ్లించారని ఆరోపించారు.

ఉండవల్లికి గోనె సవాల్

హైదరాబాద్: రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చరిత్ర ఉండవల్లికే కాదని, తమకు కూడా తెలుసునని ఆయన ఎద్దేవా చేశారు.ఉండవల్లికి దమ్ముంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆయన సోమవారం సాగర్ సొసైటీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉండవల్లికి చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజమండ్రిలో మళ్లీ గెలవాలన్నారు. ఉండవల్లి దగ్గర ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో అంతకంటే తమ దగ్గర ఎక్కువ సాక్ష్యాలున్నాయన్నారు. వాటిని ఉండవల్లి బయటపెడితే తాము కూడా బయటపెడతామని గోనె డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దోషిగా నిలబెట్టేందుకు మోసపూరిత కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఉండవల్లి ఆరోపణలు చేస్తున్నారని గోనె మండిపడ్డారు.

బ్రాహ్మిణిని ప్రారంభిస్తాం

చిత్తూరు: బ్రాహ్మిణి పరిశ్రమను త్వరలో ప్రారంభిస్తానని కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సోమవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. బ్రాహ్మిణి పరిశ్రమపై ఒక్క రూపాయి కూడా ఏ బ్యాంకు నుండి తాను లోను తీసుకోలేదని చెప్పారు. కొందరు అనవసరంగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అవినీతి నిరోధానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందన్నారు. అందుకే అన్నాహజారే చేపట్టిన జన్ లోక్‌పాల్ ఉద్యమానికి తాము మద్దతు ప్రకటించామన్నారు. అవినీతిపై ఎవరు పోరాటం చేసిన పార్టీ మద్దతు పలుకుతుందన్నారు. లోక్ పాల్ బిల్లుకు బిజెపి మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు.

వంశీ దారిలోనే కొడాలి నాని

విజయవాడ: కృష్ణా జిల్లా రాజకీయాల్లో సంక్షోభం ముదురుతోంది. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొడాలి నాని కూడా రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణను కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు అవమానించారంటూ తొలుత బహిరంగ విమర్శించింది కొడాలి నానీయే. ఆ తర్వాతనే వంశీ బయటకు వచ్చారు. కాగా, వంశీ రాజీనామాను అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే, వంశీ వారి మాటలు వినలేదు. తాను కొడాలి నాని కలిసే నడుస్తామని ఆయన చెప్పారు.

రాజీనామాచేసినా ఎన్టీఆర్ కుటుంబంతోనే

విజయవాడ: పార్టీ పదవికి తాను రాజీనామా చేసినా ఎన్టీ రామారావు కుటుంబంతోనే ఉంటానని తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ చెప్పారు. గ్రూపు రాజకీయాలు నడపడం తన వల్ల కాదని, వెన్నుపోటు పొడవలేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీకి నారా, నందమూరి కుటుంబ సభ్యులు రెండు కళ్లలాంటివారని ఆయన అన్నారు. తనకు చంద్రబాబుపై గౌరవం ఉందని, చంద్రబాబుపై తనకు అసంతృప్తి లేదని ఆయన అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు నందమూరి కుటుంబ సభ్యులతో ముడిపడి ఉందని ఆయన చెప్పారు. నందమూరి హరికృష్ణకు క్షమాపణ చెప్పాలని అడిగితే ఇంత రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న వంశీ పార్టీ అర్బన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దేవినేని ఉమా మహేశ్వర రావును కూడా అహ్వానించారు. పార్టీ పదవికి రాజీనామా చేయడం తన వ్యక్తిగత నిర్ణయమని ఆయన అన్నారు. తన అనుచరులతో మాట్లాడి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.

కార్పోరేటర్లు రాష్ట్ర పరువు తీశారు

విశాఖపట్నం: విశాఖపట్నం నగర కార్పోరేటర్లు కింగ్‌ఫిషర్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌పై అసభ్యంగా ప్రవర్తించారు. తెలుగు రాదనే ఉద్దేశంతో ఆమెను వారు బూతులతో సత్కరించారు. విమానం పైలట్‌పై దురుసుగా వ్యవహరించారు. విశాఖపట్నానికి చెందిన 26 మంది కింగ్ ఫిషర్ విమానంలో విహార యాత్రకు బయలుదేరారు. దాదాపు 26 లక్షల రూపాయల ఖర్చుతో వారి ఉల్లాస యాత్ర ప్రారంభమైంది. విశాఖపట్నంలో విమానం ఎక్కిన కార్పోరేటర్లు విమానంలో పాటలు పాడడం, కేకలు వేయడం, వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలతో ఇతర ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అడ్డు చెప్పబోయిన ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె సిఎస్ఐఎఫ్‌కు పిర్యాదు చేసింది. దీంతో దాదాపు 30 మంది సిబ్బంది విమానాన్ని పూణేలో చుట్టుముట్టి సదరు కార్పోరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా కార్పోరేటర్లు వారి అదుపులోనే ఉన్నారు. వారిపై సిఎస్ఎఫ్ఐ బైండోవర్ చేసింది. విశాఖపట్నం కార్పోరేటర్లు క్షమాపణలు చెప్పారు, హామీలు ఇచ్చారు. దీంతో వారిని సిఎస్ఎఫ్ఐ వదిలేసింది. మొత్తం మీద, కార్పోరేటర్ల వ్యవహారం రచ్చకెక్కింది.

బ్రాహ్మణి స్టీల్స్‌ను గాలి అమ్మేశారా!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో తలపెట్టిన బ్రాహ్మణి స్టీల్స్‌ను కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తమ్ గాల్వా స్టీల్స్‌కు గాలి జనార్దన్ రెడ్డి దాన్ని అమ్మినట్లు సమాచారం. అయితే, డీల్ ధరను ఇరు కంపెనీలు కూడా రహస్యంగా ఉంచాయి. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పేర బ్రాహ్మణి స్టీల్స్‌ను స్థాపించాలని గాలి జనార్దన్ రెడ్డి తలపెట్టారు. బ్రాహ్మణి స్టీల్స్ ఇక ఉత్తమ్ గాల్వా ఫెర్రస్ కానుంది. నిజానికి, రతన్ టాటాకు దాన్ని విక్రయించే ప్రయత్నాలు జరిగాయి. అయితే, జగన్‌తో కేంద్ర స్థాయిలో ఉన్న సంబంధాల వల్ల అది ఆగిపోయింది. కాగా, బ్రాహ్మణి స్టీల్స్‌కు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కడప జిల్లాలో ఎకరాకు 18,500 రూపాయల చొప్పున 10,670 ఎకరాలు కేటాయించారు. దానికి వాడుకునేందుకు అనంతపురం జిల్లాలో ఇనుము గనులను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అప్పగించింది. బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణంలో జాప్యం చేస్తూ ఇనుప ఖనిజాన్ని గాలి జనార్దన్ రెడ్డి ఎగుమతి చేసి పెద్ద యెత్తున సొమ్ము సంపాదించారనే విమర్శలు ఉన్నాయి. ఆయన అక్రమ మైనింగ్‌కు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణి స్టీల్స్ ప్రగతిని సమీక్షించి, నోటీసులు ఇవ్వాలని ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో గాలి జనార్దన్ రెడ్డి పనులకు ఆటంకాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ వాతావరణంలో గాలి జనార్దన్ రెడ్డి దాన్ని విక్రయించినట్లు చెబుతున్నారు.

రాజీనామాకు సిద్దమైన వల్లభనేని వంశీ

విజయవాడ: తమ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి వల్లభనేని వంశీ రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా అధ్యక్ష పదవికి దేవినేని ఉమా మహేశ్వర రావు రాజీనామా చేయడంతో తాను పార్టీ పదవిలో కొనసాగుతానని వంశీ ప్రకటించారు. అయితే, దేవినేని ఉమా మహేశ్వర రావు రాజీనామాను చంద్రబాబు తిరస్కరించారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దేవినేని ఉమ నాయకత్వంలో పనిచేయలేనని చెప్పిన వంశీ తిరిగి రాజీనామా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ కమిటీ సమావేశాన్ని వంశీ సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వంశీ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.

హరికృష్ణకు చంద్రబాబు ట్విస్ట్

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, తన బావమరిది నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విస్ట్ ఇచ్చారు. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి దేవినేని ఉమా మహేశ్వర రావు చేసిన రాజీనామాను చంద్రబాబు తిరస్కరించారు. పార్టీ పదవిలో కొనసాగాలని ఆయన ఉమను అదేశించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కృష్ణా జిల్లాలోని పార్టీలో నెలకొన్న విభేదాలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆయన పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరిని ఆదేశించారు. హరికృష్ణ అనుచరుడు వంశీ తిరుగుబాటును చంద్రబాబు లెక్కచేయలేదనే భావించవచ్చు. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుకు, విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీకి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దేవినేని ఉమ నాయకత్వంలో తాను పని చేయలేనని, పార్టీ పదవికి రాజీనామా చేస్తానని వంశీ ప్రకటించారు. దాంతో తన పార్టీ పదవికి దేవినేని ఉమా మహేశ్వర రావు రాజీనామా చేశారు.

ఇక ఉమ్మడి ఉద్యమం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మళ్లీ ఉమ్మడి రాజకీయ వేదిక సిద్ధమవుతోంది. వేర్వేరు కుంపట్ల కంటే, ఉమ్మడి ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న నిర్ణయాలు బలపడుతున్నాయి. ఇందుకోసం ఉమ్మడి రాజకీయ వేదిక ఎక్కేందుకు కాంగ్రెస్, టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం మే 10 వరకూ గడువు కోరిందని, అప్పటి వరకూ వేచిచూసి, జూన్ మొదటివారంలో రాజీనామాలకైనా మేము సిద్ధమేనంటూ కాంగ్రెస్ నేతలు చేసిన సూచనకు మిగిలిన పార్టీలూ సరేనన్నాయి. కాంగ్రెస్ నేతల సూచన తమకు అంగీకారమేనంటూ తెలంగాణ టిడిపి ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రధాన పార్టీల మధ్య కుదిరిన సయోధ్యకు టిఆర్‌ఎస్ సైతం అంగీకరిస్తూనే, ఉమ్మడి నిర్ణయానికి మద్దతు ప్రకటించింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల ఉమ్మడి పోరాటం నిర్ణయానికి హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ నిర్వహించిన సమావేశం వేదికైంది. తెలంగాణ సాధన ఉద్యమానికి ఏ ఒక్క రాజకీయ పార్టీ నేతృత్వం వహించకుండా, చుక్క రామయ్యలాంటి పెద్దల నేతృత్వంలో పదిమందితో ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరేది అంగీకరించబోమని, ఇప్పటికే తమ పార్టీ ఎంపీలమంతా రాజీనామా లేఖలను అధిష్ఠానానికి అందజేశామని కేశవరావు, మధుయాష్కి వెల్లడించారు. అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున మే 10 వరకూ ఆగాలని ఆధిష్ఠానం కోరిందన్నారు. మే పది వరకే కాదు, అదనంగా మరో 20 రోజులైనా ఆగుతాం, జూన్ ఒకటి వరకు తెలంగాణపై నిర్ణయం తీసుకోనట్టయితే, రాజీనామాలను ఆమోదించాలని కోరామని మధుయాష్కి వివరించారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరే రాజీనామాలు చేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందన్న నమ్మకం లేదని, తమతోపాటు తెలంగాణలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామా చేద్దామని కేశవరావు సూచించారు. ఆ ప్రతిపాదనకు టిడిపి ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి అంగీకరించారు.

సోనియా కుట్రలో పురందేశ్వరి పావు

హైదరాబాద్: కేంద్ర మంత్రి పురందేశ్వరి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఆదివారం విమర్శించారు. సోనియా మెప్పు పొందడం కోసం ఆమె ఎలా ఆడిస్తే పురందేశ్వరి అలా ఆడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేయడానికి సోనియాగాంధీ కుట్రలో పురందేశ్వరి పావుగా మారిందన్నారు. పురందేశ్వరి తన పదవి కాపాడుకోవడం కోసం టిడిపిని ముక్కలు చేయాలని చూస్తుందన్నారు. 2014లో సోనియా తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం కోసం దేశవ్యాప్తంగా ఇమేజ్ కలిగిన చంద్రబాబు ఆధ్వర్యంలోని టిడిపిని దెబ్బతీయడం ద్వారా రాహుల్‌ని ప్రధానిని చేయవచ్చని భావిస్తుందన్నారు. ఆ కుట్రలో భాగమే టిడిపి విచ్ఛిన్నం లక్ష్యం అన్నారు.

ప్యానెల్ మార్చబోం

న్యూఢిల్లీ: తాను ఎప్పటికీ రాజకీయాలలోకి రానని ప్రముఖ సంఘసంస్కర్త, ఇటీవల జన్ లోక్‌పాల్ బిల్లుపై నిరాహార దీక్ష చేసిన అన్నాహజారే అన్నారు. ప్యానెల్‌లో ఒకే కుటుంబం నుండి ఇద్దరు ఉండటాన్ని తప్పుపట్టిన యోగా గురువు రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఒకే కుటుంబంనుండి ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. బిల్లు ముఖ్యం కానీ ప్యానెల్ ముఖ్యం కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యానెల్ మార్చబోం అని చెప్పారు. అవినీతి అధికారులను ఉరితీయాలని హెచ్చరించారు. అవినీతిని రూపుమాపేందుకు గట్టి చట్టం ఉండాలన్నారు. కొన్ని స్వార్థ శక్తులే ప్యానల్ అంశాన్ని లేవనెత్తుతున్నాయని అన్నారు. పార్లమెంటుపై తనకు నమ్మకం ఉందన్నారు. లోక్‌పాల్ బిల్లుపై వచ్చేవారం భేటీ ఉంటుందన్నారు. ప్రజలు తన ఆందోళనకు ఇంతగా మద్దతు ఇస్తారని అనుకోలేదన్నారు. బిల్లు ఆమోదం పొందే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు.

లోక కళ్యాణం కోసం బాబా జీవిస్తారు

అనంతపురం: లోక కళ్యాణం కోసం బాబా తప్పకుండా చాలాకాలం జీవిస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యం గురించి వాకబు చేయడానికి ఆయన పుట్టపర్తి వచ్చానని మీడియాతో అన్నారు. వైద్యులను బాబా ఆరోగ్యంపై గురించి అడిగి తెలుసుకున్నారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీకి ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారో చెప్పడానికి తాను జ్యోతిష్కుడను కానని అన్నారు. కడప, పులివెందులలో కాంగ్రెసు పార్టీ విజయం ఖాయమని చెప్పారు. ఉప ఎన్నికలలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గెలుపు మాత్రం ఖాయమని చెప్పారు. పార్టీ ప్రచారం చేసే బాధ్యతలు అప్పగిస్తే ప్రచారానికి తప్పకుండా వెళతానని చెప్పారు. కడప, పులివెందులకు సరైన అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసిందన్నారు.

హరికృష్ణ లేఖకు పార్టీకి సంబంధం లేదు

విజయవాడ: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అవినీతిపై సంధించిన లేఖాస్త్రం తమ పార్టీపై కాదని కృష్ణా జిల్లా టిడిపి అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీ ఆదివారం అన్నారు. హరికృష్ణ ఆ లేఖను కూడా నిన్న రాయలేదన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే అవినీతిపై నిరాహార దీక్ష చేపట్టిన ఆరంభంలోనే రాశారన్నారు. ఆ లేఖ రాసి నాలుగైదు రోజులు అవుతుందని చెప్పారు. హరికృష్ణ లేఖ కేవలం అవినీతిపైనే అన్నారు. ఆయన రాసిన లేఖకు పార్టీకి సంబంధం లేదన్నారు. లేఖను వేరే కోణంలో చూపవద్దని సూచించారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో, రాష్ట్రంలో ఐకమత్యంగానే ఉందని చెప్పారు.

కృష్ణాలో లగడపాటి సర్వేల వింత పోకడ

విజయవాడ: సిద్దిపేట పార్లమెటు సభ్యుడు సర్వే సత్యనారాయణ, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విలేకరుల సమావేశంలో విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి కోనేరు రంగారావు విగ్రహావిష్కరణకు ఒకరి భుజంపై ఒకరు చేయి వేసుకొని వెళ్లారు. లగడపాటి సమైక్యాంధ్ర అంటూ స్జేజి డ్రామాలు నడపడం సరికాదని అంతకుముందు సర్వే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. లగడపాటి అంటే జగడపాటి అని అనిపించుకోవద్దని సూచించారు. తాను వివాదాలకు వ్యతిరేకం అన్నారు. జాగో తెలంగాణ బాగో ఆంధ్రావాలా వంటి నినాదాలకు తాను దూరం అన్నారు. తెలంగాణలో కూడా ఆంధ్రావాళ్లు సంతోషంగా ఉండాలన్నారు. కాకానిని స్ఫూర్తిగా తీసుకొని లగడపాటి సీమాంధ్ర ప్రత్యేక రాష్ట్రానికి నడుం బిగించాలని కోరారు. అప్పుడు ఆయనకు ఇరుప్రాంతాల ప్రజల మద్దతు ఉంటుందన్నారు. కాగా తన వద్దకు కొత్త పంచాయతీలు తేవద్దని లగడపాటి వ్యాఖ్యానించారు.