విలన్ రామిరెడ్డి కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రామిరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  రామిరెడ్డి పలు చిత్రాలలో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అంకుశం సినిమాలో విలన్ పాత్ర ద్వారా పేరు సంపాదించుకున్న రామిరెడ్డి 'గాయం','అమ్మోరు','అనగనగా ఒకరోజు'తదితర చిత్రాల్లో నటించారు. రామిరెడ్డి మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 250కి పైగా చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు.  స్పాట్ పెడతా అనే ఆయన డైలాగ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనగనగా ఒకరోజు చిత్రంలో కామెడీ పాత్రలో కూడా నటించి మెప్పించారు. కోడి రామకృష్ణ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఆయన ఆఖరి చిత్రం మర్మం. ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిజంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన రామిరెడ్డి జర్నలిస్టుగా కూడా పని చేశారు.

మేమంతా మీ వెంటే తిరగడం ఎందుకు?

కడప: రాష్ట్ర ప్రజలలాగే కడప, పులివెందుల ప్రజలు కూడా వైయస్ ఆశయ సాధన కోసం జగన్‌ను, విజయమ్మను ఇంతకుముందు కంటే అధిక మెజార్టీతో గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఓ టీవీ ఛానల్ ముఖాముఖిలో చెప్పారు. విజయమ్మ ఎన్నికల ప్రచారానికి తిరుగుతుంటే ప్రజలే ఆమెను తిరగవద్దని సూచిస్తున్నారని, మేమంతా మీ వెంట ఉండగా తిరగడం ఎందుకని అంటున్నారని, అయితే ఎప్పుడూ ప్రజలలో ఉండే ఆ కుటుంబం మాత్రం ప్రజల వద్దకు వెళుతుందని అన్నారు. కాంగ్రెసు పార్టీ మాత్రం ఎన్నికల సందర్భంగా  పైశాచికంగా ప్రవర్తిస్తుందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయ వారసుడు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడో రుజువు అయిందని అన్నారు. వైయస్ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలంటే జగన్‌కు ఒక్కరికే సాధ్యమని రాష్ట్ర ప్రజానీకం గట్టి నమ్మకంతో ఉన్నారన్నారు.

పవార్‌ను చిక్కుల్లో పడేసిన రాడియా

న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా వెల్లడించిన అంశాలు కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్‌ను చిక్కుల్లో పడేసే సూచనలున్నాయి. వివాదాస్పదమైన డిబి రియాల్టీని పవార్ నియంత్రించారని, స్వాన్ టెలికమ్‌కు 2జి లైసెన్స్ కేటాయింపులో పవార్ పాత్ర ఉందని నీరా రాడియా చెప్పింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ సందర్భంగా ఆమె ఆ విషయాలు వెల్లడించింది. రాడియా 25 పేజీల నాలుగు వాంగ్మూలాలకు సంబంధించిన వివరాలను డిఎన్ఎ ప్రచురించింది. డిబి రియాల్టీ మేనేజింగ్ డైరెక్టర్ షాహిద్ బాల్వాతో తనకు ఏ విధమైన సంబంధాలు లేవని పవార్ ఇంతకు ముందు చెప్పారు.  

నిలకడగా బాబా ఆరోగ్యం

అనంతపురం: సత్యసాయి ఆరోగ్యంపై గురువారం తాజా బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ సఫాయా వెల్లడించారు. బాబా ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదని చెప్పారు. బాబా చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు. రోజు రోజుకు ఆయన చికిత్సకు స్పందించే తీరులోనూ మెరుగు కనిపిస్తుందని చెప్పారు. బీపీ, హృదయ స్పందన నార్మల్‌గా ఉందని, కిడ్నీల పనితీరు మెరుగుపడుతోందని తెలిపారు. డయాలసిస్, వెంటిలేటర్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే బాబా ఆరోగ్యంపై ఉదయం, సాయంత్రం డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నప్పటికీ భక్తులలో మాత్రం ఆందోళన తగ్గటం లేదు. బాబా ఆరోగ్యం మెరుగు పడినది అని చెప్పిన తర్వాత ఆయనకు సంబంధించిన వీడియోను బయటకు చూపించాలని భక్తులు  కోరుతున్నారు.

మంత్రుల రాజీనామాకు అధిష్టానం నో?

న్యూఢిల్లీ: కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్ళిన సిఎం బుధవారం బిజీబిజీగా గడిపారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌, ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌లతో భేటీ అయ్యారు. సోనియాగాంధీ, అహ్మద్‌పటేల్‌తో జరిగిన చర్చల్లో కడప ఉప ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలోకి జారిపోకుండా చూసుకోవాలని కాంగ్రెస్ అధినాయకత్వం కిరణ్‌కుమార్ రెడ్డికి సూచించినట్లు తెలిసింది. మంత్రి పదవికి వివేకానందారెడ్డి చేసిన రాజీనామాను ఆమోదించాలని చేసిన విజ్ఞప్తిని అధిష్టానం ఒప్పుకోలేదని తెలిసింది. వివేకా రాజీనామా ఆమోదిస్తే డీఎల్‌ రాజీనామాను కూడా ఆమోదించాల్సి ఉంటుందని అన్నట్లు తెలిసింది. రాజీనామాలు చేశాక ఇద్దరూ ఓడితే మళ్లీ వారి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం మంచి పద్ధతి కాదని, రాజీనామా చేయకుండా ఉంటే ఎన్నికలైన తర్వాత కూడా పదవుల్లో కొనసాగుతారని అధిష్టానం సిఎంకు నచ్చచెప్పినట్లు తెలిసింది. సోనియా గాంధీతో సమావేశమైనప్పుడు రెండు ఉపఎన్నికల్లో పార్టీ అనుసరిస్తున్న వ్యూహం గురించి వివరించారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులందరిని కలుపుకుని పని చేయాలని సోనియా గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రికి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్‌మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్న కడప జిల్లా కాంగ్రెస్ శాసన సభ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అంశం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. శాసన సభ్యుడు ఆదినారాయణ రెడ్డి కడపలో జగన్‌మోహన్ రెడ్డికి బాహాటంగా మద్దతు ఇవ్వటంపై ఫిర్యాదులు వచ్చాయి. కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌తో భేటీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. సోనియాతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి కడప జిల్లా బలమైందని, ఉప ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని అన్నారు. ఏ ఎన్నికలనైనా సీరియస్‌గానే తీసుకుంటున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉప ఎన్నికల్లో మంత్రులు ప్రచారం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. డిఎస్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని, మీడియా రాసుకుంటే తానేమీ చేయలేనని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడని, ఆయనను తమ పార్టీ నేతగానే ప్రచారం చేసుకుంటామని చెప్పారు. ఈ ఎన్నికలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపించబోవన్నారు.

ఇక ఆందోళనలపై ప్రభుత్వ కొరడా

హైదరాబాద్: ఉద్యమాల బాట పడుతున్న ఉద్యోగులపై కొరడా ఝళిపించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిబంధనలను కఠినంగా అమలు చేయడం ద్వారా వారికి బంధనాలు వేయాలని నిర్ణయించింది. తాజా, నో వర్క్ - నో పే జీవోను విడుదల చేసింది. గతంలో తెలంగాణకు చెందిన ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా, వారు అటువంటి ఆందోళనను తిరిగి చేపట్టకుండా ప్రభుత్వం ఆ జీవోను జారీ చేసినట్లు కనిపిస్తోంది. పని చేయకపోతే జీతం చెల్లించేది లేదంటూ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి ప్రభుత్వ కార్యాలయాలలో పని ఎగ్గొట్టి ఉద్యమాలు చేస్తామంటే కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వానికి సహాయనిరాకరణ అంటే ఊరుకునేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.  

జగన్, విజయలక్ష్మి పేర్లతో నామినేషన్లు

కడప: కడప లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో జగన్మోహన రెడ్డి పేరు ఉన్న మరోవ్యక్తి, పులివెందుల శాసనసభ స్థానానికి విజయలక్ష్మి అనే పేరు గల మరో మహిళ నామిషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని, ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి విజయలక్ష్మిలను ఓడించాలన్న ఉద్దేశంతో అధికార కాంగ్రెస్ పార్టీ వారు ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసిన చింతా జగన్మోహన రెడ్డి వీర శివారెడ్డికి దగ్గర బంధువు కాగా, విజయలక్ష్మి అనే ఆమె సింమాద్రిపురానికి చెందిన మహిళ. ఓటర్లని అయోమయానికి గురిచేయాలన్న ఉద్దేశంతో వారు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఈ పేర్లు గల నలుగురైదుగురితో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఈ విధంగా ఎంతమందితో నామినేషన్లు వేయించినా ప్రజలు అంత అమాయకులు కాదని, తమ అభ్యర్థులదే విజయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఇలాగే చేశారని, అయితా తమ అభ్యర్థే విజయం సాధించారని వారు గుర్తు చేశారు.

జగన్ ఏకైక లక్ష్యం ఒక్కటే: టీజీ

హైదరాబాద్: తన ఆస్తులను రక్షించుకోవడానికి ముఖ్యమంత్రి కావడమే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఆరోపించారు. ఆయన ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రి అని అన్నారు. జగన్ ఆకాశానికి నిచ్చెన వేయాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై జగన్ విమర్శలు చేయడం ఆయన అహంభావానికి నిదర్శనమని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హైదరాబాదులో ఆరోపించారు. ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతో జగన్ ఉప ఎన్నికల భారాన్ని మోపారన్నారు. ఎలాంటి ఉద్యమాలు చేయకుండా ఎంపీ అయిన జగన్‌కు సోనియాను విమర్శించే అర్హత లేదన్నారు. కాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మంత్రులను కుక్కల్లా కడపలో తిరుగుతున్నారన్న వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో ఖండించారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు.

లొంగిపోతానని భానుకిరణ్ ఫోన్?

హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ బుధవారం హైదరాబాదు పోలీసులకు పోన్ చేసి తాను లొంగిపోతానని చెప్పినట్టు వార్తలు మీడియాలో వచ్చాయి. సూరి హత్య అనంతరం భానుకిరణ్ పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నారు. జనవరి మొదటి వారంలో సూరిని హత్య చేసిన భాను ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో కూడా పోలీసులు కనుక్కోలేకపోయారు. భాను డ్రైవర్ మధుసూదన్ తదితరులు చెప్పిన వివరాలు మాత్రమే ఇప్పటి వరకు పోలీసులకు తెలుసు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు. అయితే బుధవారం స్వయంగా భానుకిరణ్ హైదరాబాద్ పోలీసులకు ఫోన్ చేసి తాను లొంగిపోతానని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. భాను తిరుపతి నుండి ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించి వెనువెంటనే పోలీసుల బృందాన్ని తిరుపతికి పంపించింది. తాను రాయలసీమలో ఓ ప్రాంతంలో లొంగిపోతానని చెప్పినట్టు తెలిసింది. దీంతో పోలీసులు సీమ అంతటా పోలీసులను అప్రమత్తం చేసి గాలిస్తున్నారు. అంతేకాకుండా తిరుపతిలో భానుకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. కాగా భానుకిరణ్ లొంగిపోతానని వచ్చిన కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని డిసిపి సత్యనారాయణ అంటున్నారు. మాకు ఎక్కడినుండి ఎవరి నుండి ఫోన్ రాలేదని చెప్పారు. భానును త్వరలో పట్టుకుంటామని చెప్పారు. భాను నుండి ఫోన్ వచ్చిందనేది కేవలం మీడియా కథనాలే అని చెప్పారు. పోలీసులను తప్పుదారి పట్టించడానికే భాను కిరణ్ ఫోన్ చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఆ జాబితాను బయటపెట్టిన హసన్ అలీ

న్యూఢిల్లీ: నల్లధన కుబేరుడు హసన్ అలీ ఎట్టకేలకు తనతో కలిసి స్విస్ బ్యాంకులలో దాచిన నల్లధన కుబేరుల జాబితాలను బయట పెట్టారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు హసన్ అలీ ఈడికి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఆయన వెల్లడించిన పేర్లలో ఆయా రాష్ట్రాలలో ప్రధాన పోస్టులలో ఉన్న వారేనని తెలుస్తోంది. అవినీతి కుబేరులతో కూడిన సంచలన సమాచారాన్ని ఈడికి అలీ చెప్పినట్టుగా తెలుస్తోంది. హసన్ అలీని విచారించిన సిడిని సుప్రీంకోర్టుకు ఈడి సమర్పించింది. సుమారు 20 గంటల పాటు విచారించిన సిడిని సుప్రీంకు సమర్పించారు. ఇందులో అలీ బయటపెట్టిన ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా హసన్ అలీ కేసులో ఆర్పీ గోయెంగాను కూడా ఈడి విచారించింది. అలీ, తపూరియాలు కలిసి సుమారు 94 మిలియన్ డాలర్ల లావాదేవీలు జరిపినట్లుగా తెలుస్తోంది.

అవినీతి సొమ్మును రక్షించుకోవడానికే...

హైదరాబాద్: తన అవినీతి సొమ్మును రక్షించుకోవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిఎం పదవిపై కన్ను వేశారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ఆరోపించారు. జగన్ అత్యంత అవినీతిపరుడు అని ఆరోపించారు. తెలంగాణలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ జెండా ఎగురవేసే వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. కడప ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని హెచ్చరిస్తున్న టిఆర్ఎస్ ముందుగా తెలంగాణలో జగన్ పార్టీ జెండాలు ఎగురకుండా అడ్డుకోవాలన్నారు. మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ఎవరి ఒత్తిళ్లకు లొంగి జగన్‌ను పక్కన పెట్టారో బహిర్గతం కావాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆ విషయాన్ని బయట ప్రజలకు తెలియజేయాలన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ ఫ్రంట్‌గా ఏర్పడి పోరాటం చేయాలని సూచించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని ఎవరైనా విమర్శిస్తే మంత్రులు స్పందించాలని సూచించారు. కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.

జగన్ వైపుకు ధర్మాన సోదరుడు?

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు తన కుటుంబ సభ్యుల నుంచే సమస్యలకు గురవుతున్నారు. ధర్మాన సోదరుడు, నర్సన్నపేట కాంగ్రెసు శాసనసభ్యుడు కష్ణదాసు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కడప ఉప ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని కృష్ణదాసు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కృష్ణ దాసు తన వైవు వస్తే ఆయన భార్య పద్మ ప్రియను శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవి అప్పగిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఓదార్పు యాత్ర సందర్భంగా నర్సీపట్నంలో పద్మ ప్రియ వైయస్ జగన్‌ను కలిశారు. గత మూడు నెలలుగా ప్రియతో పాటు ఆమె కుమారుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. కృష్ణదాసుతో పాటు కాంగ్రెసు టెక్కలి శాసనసభ్యురాలు కొర్ల భారతి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పలవాస కరుణాకర్ కూడా ఏప్రిల్ 27వ తేదీన వైయస్సార్ కాంగ్రెసులో చేరుతారని చెబుతున్నారు.

ఎన్నికల సంఘానికి నామా ఫిర్యాదు

న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు  కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఖురేషిని కలిశారు. కడప ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నామా ఈ సందర్భంగా ఖురేషికి విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి భారీగా డబ్బులు వెదజల్లుతుందని నామా ఈసికి ఫిర్యాదు చేశారు. అలాగే కడపలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు. మంత్రులు కడపలో తిష్టవేయకుండా చూడాలని విన్నవించారు. అనంతరం నామా మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికలకు ప్రత్యేక బృందం పంపుతామని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందని చెప్పారు. రిగ్గింగ్ కి పాల్పడే అవకాశమున్నందున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలింగ్ ఏజెంట్లకు రక్షణ కల్పించాలని తాము కోరామని చెప్పారు. సాక్షి ఛానల్, సాక్షి పత్రికల పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఆయన చెప్పారు.

సీఎం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి: మందకృష్ణ

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 16వ తేదీలోగా ప్రధానమంత్రికి లేఖ రాయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టేలా ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 17,18 తేదీల్లో గుంటూరులో జరిగే ఎమ్మార్పీఎస్ మహాసభలో కడప ఉప ఎన్నికలపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. సీఎం మౌనమే ఎస్సీ వర్గీకరణకు ఆయన వ్యతిరేకమని అర్థం అవుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకుమద్దతు ఇస్తుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం వ్యతిరేకిస్తున్నారన్నారు. అఖిలపక్షానికి సీఎం సారథ్యం వహించలేదని మందకృష్ణ గుర్తు చేశారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్ వెనకు ముఖ్యమంత్రి హస్తముందని ఆయన ఆరోపించారు.

నాని, వంశీలతో కలిసి పనిచేస్తా: ఉమ

విజయవాడ : కృష్ణా జిల్లా టీడీపీలో నెలకొన్న పరిణామాలకు తాను చింతిస్తున్నానని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీతో కలిసి పనిచేస్తానని తెలిపారు. పార్టీలో జిల్లాలో ఏ నేతలతో విభేదాలు లేకుండా చూసుకుంటానని చెప్పారు. అందరినీ కలుపుకొని వెళతానని చెప్పారు. జిల్లాలో ఎక్కడా గ్రూపులు లేవని అన్నారు. అందరూ కలిసి కట్టుగానే ఉన్నారని చెప్పారు. తన వద్ద నుండి ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటానని చెప్పారు. చల్లపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆయన అన్నారు.