మంత్రులపై కిరణ్ పట్టు సాధించలేకపోయారు

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట శాసనసభ్యులు జి.కిషన్ రెడ్డి మంగళవారం గుంటూరులో వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులపై ఇప్పటి వరకు పట్టు సాధించలేక పోయారన్నారు. కిరణ్ తన ఛాంబర్‌కే పరిమితం అయ్యారని ఆరోపించారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయయని ఆరోపించారు. ప్రభుత్వం శాంతిభద్రతలు రక్షించడంలో విఫలమయిందన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పోలీసు శాఖపై పట్టు సాధించలేక పోయారని ఆరోపించారు.

వైయస్ మంచి చెడులలో మాకూ బాధ్యత

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన పనులకు మంత్రులుగా తమ బాధ్యత కూడా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వైయస్ మంచి చేసినా, చెడు చేసినా అందులో మంత్రులుగా తమ బాధ్యత కూడా ఉందని చెప్పారు. వైయస్ హయాంలో భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేయటంలో తప్పు లేదన్నారు. పారదర్శకత కోసమే హౌస్ కమిటీ వేశామని చెప్పారు. ఉచిత విద్యుత్‌పై కేంద్రం రాసిన లేఖకు వివరణ ఇస్తామని చెప్పారు. ఉచిత విద్యుత్‌ను తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. అధిష్టానం అనుమతి లేకుండా వైయస్ రాజశేఖరరెడ్డి ఏ పథకాన్ని అమలు చేయలేదన్నారు. కాగా కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలలో జగన్, విజయమ్మల డమ్మీ అభ్యర్థులతో తమకు సంబంధం లేదని బొత్స చెప్పారు.

జగన్ ఆస్తుల వెలికితీత పనిలో కాంగ్రెస్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, కడప లోకసభ సీటు అభ్యర్థి వైయస్ జగన్ ఆస్తుల్లో లొసుగులను పట్టుకునేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. లోకసభ సీటుకు నామినేషన్ వేసినప్పుడు జగన్ సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఆ ప్రయత్నాలు మొదలు పెట్టింది. జగన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌పై అధ్యయనం చేసేందుకు కాంగ్రెసు పార్టీ నాయకత్వం ముగ్గురు హైకోర్టు న్యాయవాదులను నియోగించింది. దీనిపై కాంగ్రెసు కడప అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డితో పాటు ముగ్గురు రాష్ట్ర మంత్రులు కడపలో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. అఫిడవిట్‌లో వైయస్ జగన్ చూపించని ఆస్తులు ఏం ఉన్నాయనేది వెలికి తీయాలనేది కాంగ్రెసు నాయకత్వం ఆలోచన. వాటిని బయట పెట్టడం ద్వారా కడప ఉప ఎన్నికలో లబ్ధి పొందాలని కాంగ్రెసు భావిస్తోంది.

హైదరాబాద్ యూటీ చేయడం కుదరదు

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు ఎవడబ్బ సొత్తని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ప్రశ్నించారు. కొంతమంది సీమాంధ్ర నేతలు కోరుతున్నట్టుగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం సాధ్యంకాదన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను యూటీ చేయడానికి అనేక సాంకేతిక చిక్కులు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కాంగ్రెస్‌కే నష్టమన్నారు. ఆ పార్టీ తెలంగాణలో బతకిబట్టకట్టాలంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పదన్నారు. అలాగే కడపలో జరిగే ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ అంశంపై ఎలాంటి ప్రభావం చూపబోవని అంటూనే, సీమాంధ్ర రాజకీయ పరిణామాలతో తెలంగాణ అంశానికి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదని సీమాంధ్ర నేతలంతా అడ్డుకోవడం లేదని, వారిలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం సాధ్యం కాదన్నారు. కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటే హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలంతా ఏం కావాలని ఆయన ప్రశ్నించారు.

సాక్షి కధనాలను తీవ్రంగా పరిగణిస్తున్నాం

న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటరీ స్థానం అభ్యర్థి జగన్‌కు చెందిన దినపత్రిక, ఛానల్‌లలో వస్తున్న కథనాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్(డీజీ) అక్షయ్ రావత్ వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అనుకూలంగా వారి సొంత ఛానెళ్లు, పత్రికల్లో వస్తున్న కథనాలపై తాము త్వరలోనే స్పష్టమైన విధివిధానాలను రూపొందిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. జగన్‌కు అనుకూలంగా వస్తున్న వార్తలన్నింటినీ పెయిడ్ న్యూస్‌గా పరిగణించి, ఎన్నికల ఖర్చులో లెక్కించాలని టీడీపీ నేత నామా నాగేశ్వరావు ఈసీని ఇటీవల కోరారు. దీనిపై విలేకరుల సమావేశంలో ప్రశ్నించగా- దేశంలో చాలా మంది రాజకీయ నేతలకు సొంత ఛానెళ్లు, పత్రికలు ఉన్నాయని, మరికొందరికి అనుకూల మీడియా ఉందని చెప్పారు. ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో స్పష్టమైన విధానాలను రూపొందించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కెవిపి రాజీనామా ఆమోదం పొందేనా?

హైదరాబాద్: రాష్ట్ర భద్రతా సలహాదారు పదవికి రాజ్యసభ సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆమోదిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటి సలహాదారు సిఎస్ రావు, పారిశ్రామిక సలహాదారు సిసి రెడ్డి చేసిన రాజీనామాలను ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. వీరిద్దరు కూడా వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఈ నేపథ్యంలో కెవిపి రామచందర్ రావు రాజీనామాను కూడా ప్రభుత్వం ఆమోదించవచ్చుననే ప్రచారం జరుగుతోంది. కెవిపి రామచందర్ రావు రాజీనామాతో పాటు సలహాదారుల పదవులకు పీటర్ హసన్, సోమయాజులు చేసిన రాజీనామాలు కూడా పెండింగులో ఉన్నాయి. వైయస్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కెవిపి రామచందర్ రావు పదవిలో కొనసాగారు. రోశయ్యతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అయితే, తాను ముఖ్యమంత్రి కాగానే ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కెవిపి రామచందర్ రావుతో పాటు మిగతా ప్రభుత్వ సలహాదారులు పదవులకు రాజీనామాలు చేశారు.

సాయి ట్రస్ట్‌లో సంపూర్ణ అధికారం బాబాదే

పుట్టపర్తి: సత్యసాయి సెంట్రల్ ట్రస్టు వ్యవహారాల్లో వ్యవస్థాపక అధ్యక్షులైన భగవాన్ సత్యసాయికే సంపూర్ణ అధికారాలు ఉన్నాయని సెంట్రల్ ట్రస్ట్ స్పష్టం చేసింది. ఈమేరకు తొలి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ట్రస్టుపరంగా ఖర్చు చేసే ప్రతి పైసాకూ పక్కాగా లెక్కలు ఉన్నాయని సెంట్రల్ ట్రస్టు ప్రకటన సారాంశాన్ని ట్రస్టు సభ్యుడు, బాబా సోదరుడి కుమారుడు ఆర్‌జె రత్నాకర్‌ సంతకంతో కూడిన ప్రకటనను సోమవారం రాత్రి పత్రికలకు విడుదల చేశారు. ట్రస్టుపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. గత కొంతకాలంగా ట్రస్టు వ్యవహారాలపై మీడియాలో విభిన్న కథనాలు వెలువడుతున్న తరుణంలో, వాటికి ముగింపు పలకాలనే లక్ష్యంతో ట్రస్టు సభ్యులు సోమవారం అత్యవసరంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ట్రస్టు లావాదేవీలు, దాతలు ఇచ్చే విరాళాలకు జవాబుదారీతనం ఎలా ఉంటుందో ఎనిమిది పేరాల్లో వివరిస్తూ సత్యసాయి ఆరోగ్యం కుదుటపడటానికి భక్తులు ప్రార్థనలను చేపట్టాలని కోరారు. ట్రస్టు ద్వారా విరాళాలను నగదు రూపేణా తీసుకునే అవకాశమే లేదని, ట్రస్టుకు అందే చెక్కులు, డ్రాఫ్టులను ట్రస్టు ఆర్థిక అధికారి ప్రతి రోజూ బ్యాంకులో డిపాజిట్‌ చేస్తున్నారని ,విదేశాల నుంచి వచ్చే విరాళాలను జమ చేయటానికి ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, 1976 విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద కేంద్ర హోంశాఖ ఆమోదంతో ఖాతాలు నిర్వహిస్తున్నామని రత్నాకర్ తెలిపారు. ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన అన్ని పనులకు ట్రస్టు వ్యవస్థాపకులు సత్యసాయిబాబా అనుమతి తప్పనిసరి అని, నేరుగా ఎవరికీ నగదు చెల్లింపులు చేసే ప్రసక్తి లేదని చెప్పారు. ట్రస్టు సభ్యుల నియామకాలన్నీ సత్యసాయి బాబా స్వీయ నిర్ణయం మేరకే జరిగాయని, ట్రస్టులో ఉన్న సభ్యులెవరూ ఎలాంటి గౌరవ వేతనం, ఇతర ప్రయోజనాలు పొందటం లేదని, బాబా చేపట్టిన పనులకు వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించేలా చూడటమే సభ్యుల కర్తవ్యమని స్పష్టం చేశారు. ట్రస్టుకు అందే విరాళాలు.. ఖర్చులకు సంబంధించి లెక్కలను పక్కాగా నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించిన లెక్కలను ఆడిట్‌ నిర్వహించి ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్నామని, ప్రతి ఖర్చుకు కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని, దీనివల్ల నిధులను మళ్లించటం, లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేసే ప్రశ్నకు తావే లేదని చెప్పారు. బాబా అనారోగ్యంగా ఉన్న సమయంలో మీడియాలో వచ్చిన కథనాలు ట్రస్టు సభ్యులను బాధకు గురిచేశాయని రత్నాకర్ పేర్కొన్నారు. బాబా కోలుకున్న తర్వాత వీటన్నింటికీ సరైన సమాధానం వస్తుందన్నారు. సత్యసాయి తనను ప్రపంచ దైవంగా ఎన్నో ఏళ్ల క్రితమే ప్రకటించారన్నారు. బాబా ఆరోగ్య పరిస్థితపైగానీ, ట్రస్టు వ్యవహారాల్లోగానీ వచ్చే వార్తలపై భక్తులు కలత చెందరాదన్నారు. అందరూ సంయమనం పాటించి బాబా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. సత్యసాయి బాబా సంపూర్ణంగా కోలుకోవడంపైనే తామంతా దృష్టి కేంద్రీకరించినట్టు ఆర్‌జె రత్నాకర్ తెలిపారు. సత్యసాయి కాలేయం పనితీరు కొంత ఆందోళన కలిగిస్తోందని పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ ఎఎస్ సఫాయా వెల్లడించారు.  పుట్టపర్తి సత్యసాయి బాబా అనారోగ్యానికి గురికావడానికి మునుపే సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కార్యవర్గంలో సమూల మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అంతేగాక అనుబంధ ట్రస్టులన్నింటినీ రద్దు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆవిర్భావం అనంతరం 9మంది సభ్యులు అందులో ఉన్నారు. దీనికి సత్యసాయి అధ్యక్షులు. దీంతోపాటు మెడికల్ ట్రస్టు, ఎడ్యుకేషనల్ ట్రస్టు, సాధనా ట్రస్టు, బుక్స్ అండ్ పబ్లికేషన్ ట్రస్టు, ఉమెన్ వెల్ఫేర్ ట్రస్టు ద్వారా పరిపాలన ప్రక్రియలు అమలయ్యేవి. అయితే సత్యసాయి బాబా 85వ జన్మదినానికి ముందు సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కార్యనిర్వాహకవర్గంలో సమూల ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్టు సమాచారం.

ఉదయం బెటర్ సాయంత్రం డౌట్

అనంతపురం: పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితిపై ఇపుడు భక్తుల్లో అయోమయం నెలకొంది. ఆయన పరిస్థితిపై వైద్యులు ఎప్పటికపుడు వైద్య బులిటెన్ విడుదల చేస్తున్నా... భక్తుల్లో మాత్రం అనుమానాలు నివృత్తికావడం లేదు. బాబా ఆరోగ్యం ఉదయం పూట ఓ మోస్తరుగా ఉందని చెపుతూ, మధ్యాహ్నానికి కుదుట పడిందనీ, సాయంత్రానికి ఆందోళనకరంగా ఉందనీ... ఇలా రకరకాల బులిటెన్లతో బాబా ఆరోగ్యం ఎలా ఉందన్న దానిపై గందరగోళాన్ని సృష్టిస్తున్నారని వారంటున్నారు. అంతేకాదు బాబాకు ట్రస్ట్ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందంటూ పుట్టపర్తి పోలీస్‌స్టేషన్‌లో బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు సోమవారం ఫిర్యాదు కూడా చేశారు. కాగా, బాబా కాలేయం తీరు ఆందోళనకరంగా ఉందని ప్రశాంతి నిలయం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా చెప్పారు. సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోమవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేశారు. సత్య సాయిబాబా ఊపిరితిత్తుల పనితీరు కూడా ఆందోళనకరంగానే ఉందని ఆయన చెప్పారు. రక్తంపోటు కూడా సరిగా లేదని ఆయన అన్నారు. సత్య సాయిబాబా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు. మిగతా అవయవాలు మెరుగు పడుతున్నట్లు ఆయన తెలిపారు. వెంటిలేటర్ ద్వారా సత్యసాయిబాబాకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. డయాలసిస్ కొనసాగుతోందని అన్నారు. ఇదిలావుండగా సత్యసాయి ట్రస్ట్ ఆస్తులపై పత్రికల్లో ఇప్పటికే పలు రకాల కథనాలు ప్రచురితమయ్యాయి. ట్రస్ట్ ఆస్తులపై కొంతమంది కన్ను వేశారనీ, అందులో భాగంగానే బాబాను గతంలో మానసికంగా ఇబ్బందికి గురి చేశారంటూ వాదనలు సైతం వస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటి..? బాబా ఆరోగ్యస్థితి వైద్యులు చెప్పినట్లు ఉన్నదా.. లేదా..? అసలు బాబా జీవించే ఉన్నారా? జీవించి ఉంటే.. ఆయన ఫోటోలను మీడియా ద్వారా కోట్లాది మంది భక్తులకు విడుదల చేసేందుకు వైద్యులు ఎందుకు జంకుతున్నారు? అనే ప్రశ్నలను వారు సంధిస్తున్నారు. బాబా ఆరోగ్యంపై ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఆరంభంలో పుట్టపర్తిలోనే మకాం వేసి హడావుడి చేసిన ఆ ఇద్దరు మంత్రులు.. ఆ తర్వాత నోరు మెదపక పోవడానికి కారణం ఏంటి? బాబా ఆరోగ్యంపై తితిదే మాజీ ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు సంచలన ఆరోపణలు చేసి ఆ తర్వాత కిమ్మనకుండా ఉండిపోవడం వెనుక ఆంతర్యమేంటి? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, సత్య సాయిబాబా ఆరోగ్యంపై ఈ నెల 29వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.

జగన్ పై పోసాని ప్రశంసల వర్షం

హైదరాబాద్: మాజీ పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తెలుగు సినీ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి ప్రశంసల వర్షం కురిపించారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత ఉందని పోసాని చెప్పారు. వైఎస్సార్, ఎన్టీఆర్‌లు ఇచ్చిన వాగ్ధానానికి కట్టుబడి ఉంటారని పోసాని వెల్లడించారు. జగన్‌ను నమ్ముకుంటే చివరి వరకు నమ్మినోళ్ల వెంట ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ అవినీతిని నిరూపిస్తే తన తల నరుక్కుంటానని పోసాని సవాలు చేశారు. ఇప్పుడు రాజకీయాల్లో వైయస్ జగన్ మాత్రమే మంచివాడని మీడియా ప్రతినిధులతో తెలిపారు. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు, వైయస్సార్ కుటుంబ సభ్యులు మాత్రమే నిజాయితీపరులని ఆయన అన్నారు.  

కడపలో గెలుపుపై ధీమా

కడప: ఎలాంటి అవినీతి జరగకుండా, ధన ప్రభావం లేకుంటే తన గెలుపు ఖాయమని మైసూరారెడ్డి అన్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు తనను తప్పకుండా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా తనను ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్లలో వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. జగన్ అఫిడవిట్‌లో చూపించని ఆస్తులు ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. జగన్‌పై కాంగ్రెసు ఎంపీ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి కూడా నిప్పులు కక్కారు. ఇప్పటికే రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దోచుకోవచ్చుననే ఆశతో ఉన్నారని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు తనను ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పారు. మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు ఎమ్మెల్యే జేసి దివాకర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెసుకే ఓటర్లు మొగ్గు చూపుతారని అన్నారు.

విషవృక్షం కొమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మహా విషవృక్షమని.. దానికి పుట్టిన కొమ్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రంన్నాయుడు ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అవినీతిమయమైనవిగా ఆయన అభివర్ణించారు. ఈ అవినీతి పార్టీలను భూస్థాపితం చేసేందుకు ఓటర్లు సిద్ధం కావాలని ఆయన పిలువునిచ్చారు. దీనిపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పదవిని అడ్డుపెట్టుకుని వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గజ దొంగలా దోచుకున్నాడన్నారు. 18 నెలలు పార్లమెంట్ సభ్యునిగా ఉన్న వైఎస్.జగన్ ఒక్కరోజైనా పార్లమెంట్‌లో జిల్లా ప్రజల సమస్యల గురించి లేవనెత్తారా అని ప్రశ్నించారు. జిల్లా ప్రజలు ఐదేళ్ల పాటు ప్రజలకు సేవచేయాలని వైఎస్.జగన్‌ను పార్లమెంట్ సభ్యునిగా గెలిపించారని ఎర్రం గుర్తు చేశారు. అయితే, తన స్వార్థపు అవసరాల కోసం పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నిలకు కారకుడయ్యాడన్నారు. కడప, పులివెందుల ప్రాంతానికి అన్యాయం ఏమైనా జరిగిందా అని ప్రశ్నించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోంచి దిగిపోయిన తర్వాత పులివెందుల్లో రిగ్గింగ్ ఆరంభమైందన్నారు.

జగన్ ను వెనకేసుకొస్తున్న కేసీఆర్

హైదరాబాద్: దివంగత మాజీముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోట్లకు కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని పలువురు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను కేసీఆర్ కొట్టిపారేశారు. జగన్‌కు ఉన్న ఆస్తిపాస్తులు అక్రమంగా వచ్చాయని చెప్పేందుకు ఆధారాలేమైనా ఉన్నాయా..? అని ఆయన ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా అబద్ధపు ప్రచారం చేయడం కొంతమంది నాయకుల పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ సంపాదించిన ఆస్తి అక్రమంగా వచ్చిందని రుజువు చేసే సాక్ష్యాలేమైనా ఉంటే బహిర్గతం చేసి తర్వాత మాట్లాడాలన్నారు. అంతేతప్ప బురద జల్లుడు కార్యక్రమం చేయకూడదని హితవు పలికారు. హఠాత్తుగా తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కు మద్దతు పలుకడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 2014 నాటికి తెలంగాణా నాది... సీమాంధ్ర నీది అనే ఫార్ములాతో వీరిద్దరూ ముందుకు వస్తారన్న ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చినట్లయ్యింది.

దమ్ మారో దమ్’కు లైన్ క్లియర్

ముంబై: దమ్ మారో దమ్ చిత్ర విడుదలపై దాఖలు చేసిన పిటీషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో దమ్ మార్ దమ్ చిత్ర విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఈ చిత్రంలో గోవా సంస్కృతిని కించపరిచే విధంగా, ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వున్నాయని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అభ్యంతరకరంగా వున్న సన్నివేశాల్ని చిత్ర నిర్మాత తొలగించారని జస్టిస్ ధర్మాధికారి, రియాజ్‌లు పిటిషన్ కొట్టివేశారు. అయితే తొలగించిన సన్నివేశాలు సినిమాలో వున్నాయో లేదో ధృవీకరించుకోవడానికి తమకు ప్రదర్శనను ఏర్పాటు చేయాలని కోర్టును ఫిర్యాదు తరపున న్యాయవాది డిమాండ్ చేశారు. గోవాలో మద్యం చాలా చవక అని, దానికంటే మహిళలు ఇంకా చవకని.. ఇలాంటి సన్నివేశాలు ఇంకా ఎన్నో వున్నాయని గోవా మీడియాకు చెందిన వ్యక్తి ఫిర్యాదులో తెలిపారు.

ఆంధ్ర-తెలంగాణ బ్రాహ్మణుల బాహాబాహీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా బ్రాహ్మణుల మధ్య చిచ్చురేపాయి. సోమవారం హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద జరిగిన రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య సభలో ఇరు ప్రాంతాల బ్రాహ్మణులు బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు కలుగ జేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలువురు ఇరు వర్గాలకు నచ్చజెప్పి శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు. అంతకుముందు సభలో ఆంధ్ర బ్రాహ్మణులు కెసిఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆంధ్ర బ్రాహ్మణుల పూజా విధానాలను కెసిఆర్ వ్యాఖ్యానించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కెసిఆర్‌పై బ్రాహ్మణుల సభలో వ్యాఖ్యానించడం తగదని తెలంగాణ బ్రాహ్మణులు హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి తెరలేసింది.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ సంపాదించారు

కడప: తాను ముప్పయ్యేళ్ల నుండి కష్టపడి డబ్బు సంపాదించానని, కానీ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా, అవినీతితో వందల కోట్లు సంపాదించారని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. అవినీతిపరుడైన జగన్ లా అత్యధిక ప్రాపర్టీ కలిగిన ఎంపీగా తనకు రికార్డులు అవసరం లేదని నామా నాగేశ్వరరావు కడప జిల్లాలో టిడిపి ఎంపీ అభ్యర్థిగా మైసూరారెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా చెప్పారు. మూడేళ్లలోనే జగన్ అంత ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిని గెలిపించవద్దని ఆయన ఓటర్లను కోరారు. ప్రజలు అవినీతిపై స్పందిస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల అన్నాహజారే చేపట్టిన అవినీతి ఉద్యమమే అందుకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధికార దుర్వినియోగం, జగన్ ధన మదంతో వీర్రవీగుతున్నారని అన్నారు. టిడిపి అభ్యర్థి గెలుపొందడం ఖాయమన్నారు. బెంగుళూరు, హైదరాబాదులలో ఉన్న జగన్ రెండు ఇళ్ల విలువే వందల కోట్లని చెప్పారు. అఫిడవిట్‌లో తప్పుడుగా పేర్కొన్నారని ఆరోపించారు. కాంగ్రెసు, టిడిపి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ప్రజలను తప్పుదారి పట్టించడానికే అని మరో నేత పయ్యావుల కేశవ్ అన్నారు. కాంగ్రెసు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాహుకేతువుల్లాంటి వారన్నారు. జగన్ ఉప ఎన్నికల్లో రూ.200 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. జగన్ నోట్లతో గెలుస్తానని భ్రమ పడుతున్నారని అన్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనకు ఓటర్లు బుద్ది చెప్పిన విషయం అర్థమవుతుందన్నారు. 20 సంవత్సరాలలో ఎప్పుడూ ఎన్నికలు ప్రశాంతంగా జరగలేదని, వైయస్ కుటుంబం నిత్యం రిగ్గింగ్‌కు పాల్పడిందన్నారు. ఈసారి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే టిడిపి ఖచ్చితంగా గెలుస్తుందన్నారు.

నైట్ రైడర్స్ ఫైనల్‌కెళితే షారుక్ షో

కోల్‌కతా: కోల్‌కతా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవడంతో ఫుల్ సంతోషంలో ఉన్న జట్టు యజమాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తమ టీం ఐపీఎల్-4 సీజన్ ఫైనల్‌కు చేరితే... దాదా సౌరభ్ గంగూలీలా చొక్కా విప్పి..గాలిలోకి ఎగిరేసి.. సిక్స్ ప్యాక్ కండలను ప్రదర్శిస్తానని పేర్కొన్నాడు. ‘మేము ఫైనల్‌కు చేరితే..నేను చొక్కా విప్పి..గాలిలో విసిరేసి..నా సిక్స్‌ప్యాక్స్ లేదా ఎయిట్ ప్యాక్ బాడీని ప్రదర్శిస్తాన’ని షారుక్ తెలిపారు. ఈడెన్ గార్డెన్స్'లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై నైట్‌రైడర్స్ విజయం సాధించిన అనంతరం ఆయన మీడియా అన్నారు. 2002లో లార్డ్స్ మైదానంలో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోపి ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలవడంతో గంగూలీ పట్టలేని ఆనందంతో చొక్కా విప్పి గాలిలో తిప్పుతూ హల్‌చల్ చేశారు. దీనిపై గంగూలీని బ్రిటిష్ మీడియా విమర్శించింది. ప్రస్తుత ఐపీఎల్‌లో గంగూలీని ఏ జట్టు కొనుగోలు చేయకపోవడంతో ఆయన ఆడడం లేదు.

కోల్‌కత్తా సీఎం కు బెదిరింపు కాల్

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్యపై ఓ బెదిరింపు కాల్ వచ్చింది. బుద్దదేవ్‌ను చంపేస్తామంటూ ఓ కాల్ వచ్చింది. ఈ బెదిరింపు కాల్‌పై ముఖ్యమంత్రి పోలింగ్ ఏజెంట్ వికాస్ భట్టాచార్య ప్రధాన ఎన్నికల అధికారి అయిన సునీల్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. కాగా ముఖ్యమంత్రిని చంపుతామని వచ్చిన కాల్స్‌పై ఆరా తీస్తున్నారు. ఎవరు చేశారో ఎక్కడనుండి చేశారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లోని 54 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య మాట్లాడారు. టాటాలు సింగూరులో కారు ప్రాజెక్టును ఉపసంహరించుకోవడం వల్లనే తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీకి పేరు వచ్చిందని అన్నారు.