డిఎల్ విశిష్ట నాయకుడు: తులసిరెడ్డి

కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఓ బచ్చా అని పీసీసీ అధికార ప్రతినిధి.తులసిరెడ్డి అన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై జగన్ వర్గం చేస్తున్న వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. డిఎల్ అంటే డిపాజిట్ లాస్ నాయకుడు కాదన్నారు. డిఎల్ విశిష్ట నాయకుడు అన్నారు. అందుకే ఆయనను ఆరుసార్లు ప్రజలు శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కడప ఉప ఎన్నికలలో ప్రచారం చేయమని ఆశిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి వేరుగా చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు గెలుపు ఖాయమని అన్నారు. రెండు స్థానాలలోనూ కాంగ్రెసు పార్టీయే విజయం సాధిస్తుందన్నారు. ప్రజలు కాంగ్రెసుకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

రైతులకు రూ.1019 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ

హైదరాబాద్: ముఖ్యమంత్రి హామీ మేరకు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద 1019 కోట్ల రూపాయలను అందజేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వచ్చే వ్యవసాయ సీజన్ కు అవసరమైన 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు, ఇతర రకాలైన విత్తనాల నిల్వలు, 90 లక్షల బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ లు సిద్ధంగా ఉంచి సకాలంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ప్రజాపథం పూర్తైన తర్వాత ప్రతీ సంవత్సరం మాదిరిగానే రైతు చైతన్య యాత్రలు ప్రారంభమవుతాయని, వాటికి అవసరమైన చర్యలన్నింటినీ తీసుకోవాలని ముఖ్యమంత్రి యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపింది. కడప జిల్లా మినహా రాష్ట్రంలో త్వరలోనే కొత్తగా 10 వేల అంగన్ వాడీ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. నాబార్డు సాయంతో దశలవారీగా అంగన్ వాడీ కేంద్రాల భావనల నిర్నామానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కార్యాలయం అధికారులు తెలిపారు. ఈ పథకం అమలు ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. సంబంధిత ఏఎన్ఎం, ఆసా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్లు స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంతో నిర్దేశించిన రోజుల్లో పౌష్టికాహార, ఆరోగ్య దినోత్సవాలను ఖచ్చితంగా నిర్వహించేటట్లు చూడాలని ముఖ్యమంత్రి కోరారు. సంబంధిత సీనియర్ అధికారులు ఆయా రోజుల్లో అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించి వాటిని పర్యవేక్షించాలని సూచించారు.

మెజార్టీ తగ్గించడానికి కుట్ర: సురేఖ

కడప: కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డిని ఓడించగలిగే సత్తా లేదని కాంగ్రెస్ వారికి ఇప్పటికే అర్ధమైపోయిందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో ఆమె ప్రసంగించారు. ఓడిపోతామని తేలిసిపోయినందున ఇక మెజార్టీ తగ్గించడం కోసమే వారు తాపత్రయపడుతున్నారన్నారు. డబ్బులు ఇచ్చి లేదా బెదిరించి ఓట్లు సంపాదించడానికి వారు అనేక కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఓటర్లకు పంచడానికి వారు 150 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచారని తెలుస్తోందన్నారు. డబ్బు ఇస్తే మాత్రం తీసుకోండి, ఓటు మాత్రం జగన్మోహన రెడ్డికి వేయమని ఆమె కోరారు. ఆ డబ్బుని వారు అవినీతి ద్వారా సంపాదించినందున ఇస్తే తీసుకోవచ్చన్నారు. అయితే మన వద్ద అసలైన ఆయుధం ఉన్న విషయం మరచిపోవద్దని ఆమె గుర్తు చేశారు. ఆ ఆయుధంతో వారిని ఓడించాలని పిలుపు ఇచ్చారు. వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి, ఆమోదింపజేసుకున్నారని, అది మంచి పద్దతి అన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని ఆమె అన్నారు. ఓడిపోతే మంత్రి పదవి మళ్లీ ఇవ్వరని, ఆయన రాజీనామా చేయడంలేదన్నారు. లోక్ సభ సభ్యుడుగా పోటీ చేస్తూ నైతిక విలువలు పాటించకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు.

అనర్హులం మేం కాదు: ఆదినారాయణ రెడ్డి

కడప: పార్టీ తనను అనర్హుడినా ప్రకటించినా తనను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత, జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి ఓ టీవీ కార్యక్రమంలో అన్నారు. అయినా అనర్హులం మేం కాదని చెప్పారు. అసలైన అనర్హులు కాంగ్రెసు పార్టీకి చెందిన వారే అని అన్నారు. కాంగ్రెసు పార్టీ తనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైతే తాను అందుకు సిద్ధంగా ఉన్నానని  చెప్పారు.  కడప, పులివెందులలో జగన్, విజయమ్మలు భారీ ఆధిక్యంతో గెలుస్తారని అన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉన్న వైయస్ వివేకానందరెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీలో ఉన్నత స్థాయిలో చూడాలని ఉందని అన్నారు. వివేకాను అలా చూస్తే తనకు సంతోషంగా ఉంటుందన్నారు. మంత్రి డిఎల్ బయటపెట్టని ఆస్తులు చూపిస్తే తాను సవాల్‌కు సిద్ధమని ప్రకటించారు. కాగా తాను వైయస్ జగన్‌కు చెందిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీలోనే ఉన్నానని మాజీ శాసనసభ్యుడు ఎంవి రమణారెడ్డి వేరుగా చెప్పారు. జగన్ విజయం కోసం కడప జిల్లాలో శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

జైపాల్రెడ్డి, సబితలపై దాడి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నవాబ్ పేట మండలం గంగిరాల వద్ద కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, రాష్ట్ర హొం మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై తెలంగాణ వాదులు కోడిగుడ్లతో దాడి చేశారు. గ్రామంలో సభ జరుగుతుండగా ఈ దాడి జరిగింది. జైపాల్ రెడ్డిని కదలనివ్వం అని తెలంగాణ విద్యార్థి సంఘాల నేతలు పట్టుపట్టారు. ఎవరి అనుమతి తీసుకొని గ్రామంలోకి వచ్చారని వారిని నిలదీశారు. తెలంగాణవాదులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా జైపాల్ రెడ్డిని నిలదీశారు. ఏడాది తరువాత ఇప్పుడు తాము కనిపించామా అని వారు అడిగారు. దాదాపు అయిదు వందల మంది పోలీసుల వలయంలో మంత్రులు ఉన్నారు.

సిఎం మార్పు ఖాయం: గోనె

హైదరాబాద్: వైఎస్ఆర్ జిల్లాలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తరువాత ముఖ్యమంత్రి మార్పు ఖాయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గోనె ప్రకాశరావు అన్నారు. ఉప ఎన్నికలలో ప్రచారానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులు అందరినీ పంపుతున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళా మంత్రులు అందరినీ పులివెందుల వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రజలు, ఎమ్మెల్యేల బలంలేని భవనం వెంకట్రామ్ ని గతంలో ముఖ్యమంత్రిని చేసి ఇందిరా గాంధీ చేసిన తప్పునే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో సోనియా గాంధీ చేశారని ఆయన అన్నారు.సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి సొంత జిల్లా చిత్తూరులోనే ప్రజా బలం, ఎమ్మెల్యేల బలం లేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొదటి నుంచి వ్యాపార కుటుంబం అని ఆయన తెలిపారు. రాజకీయాలలోకి రాకముందే ఆయన ఆదాయపు పన్ను చెల్లించారని చెప్పారు.

కెసిఆర్ పై ఆంధ్రా బ్రాహ్మణుల ఆగ్రహం

విశాఖపట్నం: ఆంధ్రా బ్రాహ్మణులపై విపరీత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రా బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆంధ్రా బ్రాహ్మణులు ఆదివారం విశాఖపట్నంలోని శంకరమఠంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. ఎక్కడైనా బ్రాహ్మణులు చేసే పూజ ఒకటే విధంగా ఉంటుందన్నారు. వేదం ఒక్కటే, పూజ ఒక్కటే అనే విషయం తెలుసుకోవాలని సూచించారు. కెసిఆర్ వ్యాఖ్యలు సరికావన్నారు. అందరూ బావుండాలని కోరుకునేది బ్రాహ్మణులు అని అన్నారు. తాము మాత్రమే బావుండి ఇతరులు చెడిపోవాలని కోరుకుంటే సరికాదన్నారు. దానికి ప్రాంతాలతో సంబంధం లేదన్నారు. ఎవరి ఉద్యమం వారు చేసుకోవచ్చునని చెప్పారు. కానీ మధ్యలో తమను కించపరిస్తే సరికాదన్నారు. కెసిఆర్ ఇంతకుముందు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించారు, ఇప్పుడు బ్రాహ్మణుల మధ్య అఘాధం సృష్టించాలని అనుకుంటున్నారన్నారు. కాగా కెసిఆర్ వ్యాఖ్యలను తెలంగాణ బ్రాహ్మణులు కూడా పలువురు ఖండిస్తున్నారు.

దోపిడి దొంగను ఎన్నుకునే స్థితి దాపురించింది

ఒంగోలు: కడప ఉప ఎన్నికలలో దోపిడి దొంగను ఎన్నుకునే పరిస్థితి ప్రజలకు దాపురించిందని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆదివారం ప్రకాశం జిల్లాలో అన్నారు. రాజకీయ పార్టీలు అన్నీ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నాయని ఆరోపించారు. పాలనలో దోచుకున్న డబ్బులను మళ్లీ ఎన్నికలలో గెలవడానికి ఖర్చు పెడుతున్నాయని, ఎన్నికల్లో గెలిచి మళ్లీ కోట్లకు కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. దోచుకోవడానికి ఏ రాజకీయ పార్టీ ఇందుకు మినహాయింపు కాదని అన్నారు. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో పార్టీలు సుమారు రూ.200 కోట్లను వెదజల్లుతున్నాయని ఆరోపించారు. దోపిడీ దారులను ఎన్నుకోవడం మినహా ప్రజలకు మరో అవకాశం లేకుండా పోయిందన్నారు.

ఎన్టీఆర్ పథకాలే కాంగ్రెస్ పథకాలు

కడప: ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ తమ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలేనని కడప లోక్‌సభ అభ్యర్థి ఎం.వి.మైసూరా రెడ్డి అన్నారు. కడపలో జోరుగా ప్రచారం చేస్తున్న ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ తెదేపా పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ నేడు కాంగ్రెస్ పార్టీ ఆ పథకాల దారిలోనే వెళ్తుందన్నారు. ప్రస్తుత పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. కొందరు నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు, ప్రజలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు, కార్మికులకు, బలహీనులకు అండగా నిలుస్తుందన్నారు.

డీఎల్ పై భూమా చిర్రుబుర్రులు

హైదరాబాద్: కడప లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీఎల్ రవీంద్రా రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, నంద్యాల మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి చిర్రుబుర్రులాడారు. డీఎల్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే తాను పెట్టిస్తానని హెచ్చరించారు. అంతేకాకుండా, తనను రాయలసీమ గడ్డపై నుంచి తరిమి కొట్టాలంటే డీఎల్ మరో జన్మఎత్తాలన్నారు. నీవు రాజకీయ సన్యాసం తీసుకొనేటట్లు నీ నియోజకవర్గ ప్రజలతోనే గుణపాఠం చెప్పిస్తానని హెచ్చరించారు. మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నత విలువలు కలిగిన నేతలు ఉన్నారనుకున్నానని కానీ ఏ మాత్రం విలువలు లేని డీఎల్ వంటి వ్యక్తులు ఉన్నారని ఇపుడే తెలిసిందన్నారు. నీళ్లల్లో ఉన్నంత సేపే ముసలి రాజుగా ఉంటుందని, ఒడ్డున పడితే కుక్కలు పడి కరుస్తాయని, అలాగే డీఎల్ పదవులు ఉంటేనే, పదవులు లేకపోతే ఎవరూ పట్టరన్నారు. కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్న డీఎల్‌కు కనీసం డిపాజిట్ గల్లంతు అవుతుందని భూమా జోస్యం చెప్పారు.

భారత్ కజక్‌ల మధ్య ఏడు ఒప్పందాలు

న్యూఢిల్లీ: తన హయాంలో పాకిస్థాన్-భారత్‌ల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తే తాను చాలా సంతోషిస్తానని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రెండు రోజుల కజకిస్థాన్ పర్యటనను ముగించుకుని ఆయన స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రత్యేక విమానంలో మీడియాతో మాట్లాడుతూ.. పాక్‌తో భారత్ సంబంధాలను మామూలు స్థాయికి తీసుకురావడంలో విజయం సాధిస్తే తన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించినట్లుగా భావిస్తానని చెప్పారు. సరిహద్దుల నిర్వహణపై నూతన ద్వైపాక్షిక విధానం ఏర్పాటుకు చైనాతో కలిసి తీసుకున్న నిర్ణయం సమీప భవిష్యత్తులో సత్ఫలితాలిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. జీ20, డబ్ల్యూటీవో, ఐరాస భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వేదికలపై పరస్పరం సహకరించుకునే విషయమై కూడా చైనా అధ్యక్షుడు జింటావోతో కూడా చర్చించినట్టు తెలిపారు. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం అవినీతిపై పోరాటం చేసిన అన్నా హజారే అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. అవినీతిపై పోరాటంలో భాగంగా హజారే ఇటీవల ఆమరణ దీక్ష చేయడం, అందుకు ప్రజామద్దతు వెల్లువెత్తడం గురించి అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు. కాగా, ప్రధాని కజకిస్థాన్ పర్యటనలో ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని సంకల్పించాయి. ఇందులో భాగంగా పౌర అణు సహకార ఒప్పందం సహా ఏడు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. కజక్ రాజధాని అస్తానాలో ఆ దేశాధ్యక్షుడు నజర్‌బయేవ్‌తో చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పంద పత్రాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య కుదరిన ఒప్పందాల్లో అణు శక్తిని శాంతియుత ప్రయోజనాలకు వాడుకోవడానికి వీలుగా ఇరు దేశాలు ముసాయిదా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అణు ఇంధన సరఫరా, అణు విద్యుత్కేంద్రాల నిర్మాణం - నిర్వహణ, పరిశోధనల సమాచారం బదిలీలకు ఇది దోహదపడేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాల్లో భాగంగా భారత్‌కు 2014 నాటికి 2,100 టన్నుల యురేనియాన్ని సరఫరా చేస్తామని కజక్ అధ్యక్షుడు నజర్‌బయేవ్ హామీ ఇచ్చారు. హైడ్రోకార్బన్ రంగంలో రూ.1,773 కోట్ల విలువగల మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి కింద భారత ప్రభుత్వ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్‌కు కాస్పియన్ సముద్రంలోని సప్తాయెవ్ చమురుక్షేత్రంలో 25 శాతం వాటా దక్కుతుంది.

177 జిఓని రద్దు చేయాలి: కాంగ్రెస్ ఎంపిలు

హైదరాబాద్: ప్రభుత్వం ఉద్యోగులను నియంత్రించడానికి జారీ చేసి 177 జిఓని రద్దు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికే 177 జిఓ తెచ్చారని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు సమావేశమై పలు విషయాలపై చర్చించారు. భేటీ అనంతరం పొన్నం ప్రభాకర్, వివేక్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయానికి సంబంధించి కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లడం సబబు కాదని కూడా వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వ్యతిరేకి అయిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహ్ రెడ్డి పార్టీ అయిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ జెండాను తెలంగాణలో ఎగరకుండా చూడాలని తెలంగాణ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు హెచ్చరించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో జగన్ ఫ్లకార్డు పట్టుకున్నారని అప్పుడే ఆయన తెలంగాణ వ్యతిరేకి అని తెలంగాణ ప్రజలకు అర్థమై పోయిందన్నారు. తెలంగాణపై కడప ఉప ఎన్నికల అనంతరం కాకుండా ఎన్నికలకు ముందే తెలంగాణపై తన పార్టీ అభిప్రాయాన్ని వెలువర్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన ఉద్దేశ్యం చెప్పాలన్నారు. జగన్ పార్టీ జెండాలు తెలంగాణలో ఎగురవేసిన వారు తెలంగాణ వ్యతిరేకులే అన్నారు. అయినా జగన్ పార్టీ అభిప్రాయం అవసరం కూడా లేదని అన్నారు. ప్రచారానికి ఎవరు వెళతారనే విషయంతో తమకు సంబంధం లేదన్నారు. అయితే ఎవరు గెలిచినా తెలంగాణకు వ్యతిరేకులే అన్నారు.

సీఎంకు ‘కడప’ ఫీవర్

హైదరాబాద్: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తన పదవికి ముప్పు వస్తుందన్న భయం సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిని వెంటాడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం వల్లనే ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు కడపలో ఇంటింటికి తిరిగి ఓట్లడిగే పరిస్థితి వచ్చిందని అన్నారు. జీవో 151 ప్రకారం వేతనాలు అమలు చేయాలని కోరుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఎసీఎస్) ఉద్యోగులు ఇందిరాపార్కు వద్ద చేస్తున్న రిలేనిరాహార దీక్ష శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఆరో రోజు దీక్షల్లో విశాఖపట్నం జిల్లా ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకు ముందు తమ సమస్యల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడి విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు