టీడీపీ నేతల విస్తృత ప్రచారం

కడప: కడప పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు బుధవారం నుంచి ప్రచారం చేయనున్నారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 90 మంది వరకు ఈ ప్రచార కార్యక్రమంలో నిమగ్నం కానున్నారు. ఈ ప్రచారానికి వచ్చే ప్రజాప్రతినిధులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలకు కొన్ని ప్రాంతాలను అప్పగించారు. ఆ ప్రాంతాల్లోనే వారు మకాం వేసి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇప్పటికే నేతలకు ఏ ఏ నియోజకవర్గాలకు ఎవరూ ఇన్‌చార్జీలుగా ఉంటారు, ఎవరూ ఏక్కడా బస చేయాలన్న వ్యూహాంపై స్పష్టమైన ప్రణాళిక ఖరారైంది. దాదాపుగా కడప పార్లమెంట్ పరిధిలోని అన్నీ మండలాలలోను నేతలు తిష్ట వేసి ప్రచారం సాగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రచారంలో పాల్గొనే సీనియర్ నేతల్లో ఎర్రంనాయుడు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బుచ్చయ్యచౌదరి, దేవేందర్‌గౌడ్, లాల్‌జాన్‌బాష, వేణుగోపాలాచారి, అశోక్‌ గజపతిరాజు వంటి వారు ఉన్నారు. ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు సాగిస్తున్న ప్రచారాలను, వారి అగడాలను బట్టబయలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు, కడప జిల్లా ఓటర్లకు తెలియవచ్చేలా ఎన్టీఆర్ భవన్‌లో ముగ్గురు అధికార ప్రతినిధులు ప్రతి రోజు మీడియా సమావేశం నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే జిల్లాలో ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి పోలింగ్ బూత్‌లోనూ, తమకంటూ ప్రత్యేక ప్రతినిధి ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ నెల 18వ తేదీ నుంచి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారం రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న దృష్ట్యా ఈలోపల బాబుకు పూర్తి స్థాయిలో నివేదికను అందిచేందుకు కూడా ప్రక్రియ మొదలైంది.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బుధవారం ఉదయం చెనైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు సరైన తీర్పు ఇస్తారని, ఎన్నికల్లో తామే గెలిచితీరతామని ధీమా వ్యక్తం చేశారు. విరుగంబాక్కంలో విజయ్‌కాంత్ ఓటు వేశారు. అలాగే కేరళలో కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తమిళనాడులో మళ్లీ డీఎంకే అధికారంలోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ జోస్యం చెప్పారు. డీఎంకే 220 స్థానాలకు పైగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం స్టాలిన్ గోపాలపట్నంలోని పోలింగ్‌బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎంకే పట్ల ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోవటం లేదని స్టాలిన్ అన్నారు.

ఓటు వేయని ప్రధానా పాలించేది: టీడీపీ

హైదరాబాద్: ప్రధానమంత్రి తన ఓటు హక్కు వినియోగించుకోకపోవడం బాధ్యతారాహిత్యం అని టిడిపి అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల విమర్శించారు. అసోం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు దీస్‌పూర్ నియోజకవర్గంలో ఓటు ఉందని తెలిపారు. 11న పోలింగ్ జరిగితే ఆయన ఓటు వేయలేదని తెలిపారు. ఓటు హక్కును ఎందుకు ఉపయోగించుకోలేదో ఆయన దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఓటు వేయలేదని, ఓటు వేయని ప్రధాని, ప్రజలను ఓటువేయాలని ఎలా కోరుతారని ప్రశ్నించారు. గత ఏడేళ్లలో దేశ వ్యాప్తంగా అనేక కుంభకోణాలు జరిగాయని, కుంభకోణాల్లో బిజీగా ఉన్న ప్రధాని ఓటు వేయడం మరిచిపోయినట్టుగా ఉన్నారని విమర్శించారు.

సమసిన టీడీపీ కృష్ణాజిల్లా వివాదం

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా విభాగంలో కొద్దిరోజులుగా నెలకొన్న వివాదం సమసిపోయింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేసిన ఆ పార్టీ విజయవాడ పట్టాన అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ వెనక్కు తగ్గారు. తొందరపాటులో తప్పు చేసానని, ఆవేశపడ్డానని క్షమించమని కోరారు. ఉమామహేశ్వరరావు నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. నందమూరి హరికృష్ణ, పార్టీ అధినేత చంద్రబాబుల మధ్య విభేదాల్లెవని వెల్లడించారు. విజయవాడ పట్టాన పార్టీ అధ్యక్షా పదవికి చేసిన రాజీనామా వంశీ ఉప సంహరించుకున్నట్లు ప్రకటించారు. వంశీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. విజయవాడ పరిణామాలపై చంద్రబాబుకు వంశీ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ అన్ని సమస్యలను ఒక్కోటీ అధిగమించి ఇప్పుడిప్పుడే కడప ఉప ఎన్నికలపై దృష్టి సారిస్తున్న తరుణంలో ఇరువురు నేతలు విబేధాలతో రోడ్డున పడి పార్టీని భ్రష్టు పట్టిస్తారా? వ్యక్తిగత అజెం డాతో పార్టీకి నష్టం కలిగే విధంగా మీడియాకు ఎక్కుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌చార్జీగా పార్టీ ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య చౌదరికి చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగత విబేధాలు, ఇగోలు పార్టీపై రుద్దడం సరికాదని మందలించినట్లు తెలిసింది. మరోవైపు చంద్రబాబును కలిశాక వంశీ ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లా పార్టీ వ్యవహారంలో తానూ తొందరపాటుగా వ్యవహరించినందుకు క్షమాపణ కోరుతున్నానని, రాజకీయాల్లో ఉన్నంతకాలం చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తానని అందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెప్పుడూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించబోనని హామీ ఇస్తున్నట్లు విజయవాడలో విడుదల చేసిన ఆ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబును కలవడానికి ముందుగ వంశీ జూ.ఎన్టీఆర్ భేటీ అయ్యారని తెలిసింది. కృష్ణా జిల్లాలో జరిగిన వ్యవహారాలు, పార్టీలోని అంతర్గత పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం.

మూడు రాష్ట్రాల్లో నేడే పోలింగ్‌

న్యూఢిల్లి: కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో బుధవారం పోలింగ్‌ జరగనుంది. కేరళలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ పోటీ పడుతుండగా తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె కూటములు ఎన్నికల బరిలో ఉన్నాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలోని 2జి సెక్ట్రమ్‌, కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణ, ఆదర్శ్‌ వంటి కుంభకోణాలతోపాటు పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కరుణానిధి కుటుంబ అవినీతి పాలన వంటి అంశాలపై అన్నాడిఎంకె కూటమి ఎన్నికల ప్రచారం చేసింది. ఈ మూడు రాష్ల్రాల్లోనూ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే విషయం తెలియాలంటే మరో నెల రోజులు వేచి ఉండాలి. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఎన్నికలు ముగిసిన అనంతరం మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. డీఎంకే కూటమిలో డీఎంకే 119 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 63, పీఎంకే 30, కొంగునాడు మున్నేట్ర కళగం ఏడు, విడుదలై చిరుతైగల్ పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇంకా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మూడు, మూవేందర్ మున్నేట్ర కళగం, పెరుందలైవర్ మక్కల్ కట్టి ఒక్కో స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీల అభ్యర్థులు డీఎంకే గుర్తుపైనే ఎన్నికల బరిలోకి దిగారు. అన్నాడీఎంకే కూటమిలో అన్నాడీఎంకే 162 స్థానాల్లో పోటీ చేస్తుండగా, డీఎండీకే 41, సీపీఎం 12, సీపీఐ పది, మనిదనేయ మక్కల్ కట్చి మూడు, సమత్తువ మక్కల్ కట్చి రెండు, ఫార్వర్డు బ్లాక్, ఆలిండియా మూవేందర్ మున్నేట్ర కళగం, ఆర్‌పీఐ, కొంగు ఇలైంజర్ పేరవై ఒక్కో స్థానం నుంచి పోటీ చేస్తున్నాయి. కేరళ శాసనసభలో 140 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ముమ్మరంగా సాగిన ప్రచారం ప్రతిపక్ష యుడిఎఫ్‌ సాగించిన చెదురుమదురు హింసాత్మక సంఘటనలతో సోమవారం ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే పోలింగ్‌లో మొత్తం 2,31,47,871 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యా ప్తంగా 20,758 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేస్తున్న ప్రవాస కేరళీయులు ఓటేసే హక్కును పొందిన తొలి ఎన్నికలు ఇవి. దీని కోసం 8,862 దరఖాస్తులను ఆమోదించారు. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు గానూ 187 మంది పోటీలో ఉన్నారు. అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8.1 లక్షలు. 867 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ 17, డీఎంకే 10, ఆల్‌ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ 17, ఏఐఏడీఎంకే 10 స్థానాల్లో బరిలో ఉన్నాయి. పోటీలో ఉన్న ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వైతిలింగం, ఆయన మంత్రివర్గ సహచరులు, అసెంబ్లీ స్పీకర్ ఆర్ రాధాకృష్ణన్, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి.. తదితరులున్నారు.

కడపలో 55 లక్షల పట్టివేత

కడప: కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా పంపిణీ అవుతోంది. నిన్న రూ. 27.90 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు తాజాగా ఈరోజు రూ.55 లక్షల నగదు పట్టుకున్నారు. బద్వేలు సమీపంలో పీపీకుంట చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో ఈ నగదు బయటపడింది. పెద్ద మొత్తంలో ఈ నగదును నెల్లూరు జిల్లా పొదలకూరు నుంచి మైదుకూరుకు తరలిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి అయ్యింది. ఇందుకు సంబంధించి పొదలకూరు వాసి ప్రభాకర్‌రెడ్డి సహా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉప ఎన్నికల వేల భారీ మొత్తంలో డబ్బులు తరలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కమలమ్మ కాంగ్రెస్ సభ్యురాలే : డీఎల్

కడప: కమలమ్మ కాంగ్రెస్ సభ్యురాలేనని డిఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం నుంచి కాంగ్రెస్‌పార్టీకి కమలమ్మ ప్రచారం చేస్తారని అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే కడప లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్నట్లు తెలిపారు. మరికొంతమంది జగన్ వర్గం శాసనసభ్యులు తమవైపు వస్తారని డీఎల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కమలమ్మ కాంగ్రెస్‌లో చేరితే జగన్‌కు కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది. జగన్‌ను మొదటి నుంచి గట్టిగా సమర్థిస్తూ వస్తున్న బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ కాంగ్రెసు గూటికి చేరారు. జగన్ వర్గానికి చెందిన తోటి ఎమ్మెల్యే ఒకరితో కమలమ్మకు విభేదాలు తలెత్తినట్లు కొద్ది రోజుల క్రితం జరిగింది. దాంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురై తన మాతృ సంస్థ కాంగ్రెసు వైపు తిరిగి రావడానికి సిద్ధపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆమె బుజ్జగించడానికి వైయస్ జగన్ వర్గం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించినట్లు లేవు.కమలమ్మ కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయానికి వచ్చి మంత్రి అహ్మదుల్లా, డిఎల్ రవీంద్రారెడ్డితో సమావేశమయ్యారు. ఇదే బాటలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కూడా నడవనున్నారని సమాచారం. కొరముట్లను కూడా తిరిగి కాంగ్రెస్‌లో కొనసాగేలా పార్టీ ప్రముఖులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించనున్నాయని తెలుస్తోంది.

హరీశ్ వ్యాఖ్యలపై మండిపడ్డ గోనె

హైదరాబాద్ : కడప, పులివెందుల ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లే తెలంగాణ నేతలను ద్రోహులుగా ప్రకటిస్తామన్న సిద్ధిపేట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలపై జగన్ వర్గం నేత గోనె ప్రకాశరావు మండిపడ్డారు. ఫత్వాలు జారీ చేయటం హరీశ్‌రావు మానుకోవాలని హితవు పలికారు. ఆయన మాట్లాడుతూ కుటుంబ ఆధిపత్య పోరులో ముందు ఉన్నానని చెప్పుకోవటానికే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్య తీసుకోలేదని గోనె ప్రశ్నించారు. కడప, పులివెందుల్లో ప్రచారానికి వెళతామని ఆయన స్పష్టం చేశారు.

కడపలో కాంగ్రెస్‌ది ఓవర్ యాక్షన్

హైదరాబాద్: కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓవర్ యాక్షన్ చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పదిమంది మంత్రులను కడపలో ఉంచి ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజా సమస్యలకు గాలికొదిలేసి మంత్రులు కుక్కల్లా పులివెందుల, కడప చుట్టూ తిరుగుతున్నారని నారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కిరణ్ కుమార్ సర్కార్... వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా చెక్ పెట్టాలన్న అంశంపైనే దృష్టి సారించిందని నారాయణ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వం కోమాలో పడిపోయిందని ఆయన అన్నారు. కడపలో టీడీపీ తరపున తాము ప్రచారం చేయనున్నట్లు నారాయణ తెలిపారు.

కన్నులపండువగా సీతారాముల కల్యాణం

భద్రాచలం: భూలోక వైకుంఠమైన భద్రాచలంలో మంగళవారం శ్రీసీతారామచంద్రస్వాముల వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామాలయ సమీపంలోని మిథిలా స్టేడియంలో సరిగ్గా మధ్యాహ్నం 12.గంటలకు ఆగమ శాస్త్ర ప్రకారం అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. ఆతర్వాత రామదాసు చేయించిన తాళిబొట్టుతో కూడిన మంగళ సూత్రాన్ని రాముని తరపున అర్చకులు సీతమ్మకు అలంకరించారు. అనంతరం సీతమ్మ, రామయ్యల తలంబ్రాల వేడుక జరిగింది. ఈ వేడుకను కన్నులారా తిలకించి తరించేందుకు దేశనలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో భద్రాచలం పట్టణంలోని వీధులన్నీ జనసంద్రమయ్యాయి. 12సంవత్సరాలకో మారు జరిగే పుష్కర పట్టాభిషేకాన్ని కూడా తిలకించాలనే తలంపుతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, రెండు గంటలకు తిరువారాధన, నాలుగు గంటలకు అభిషేకరం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు దేవాలయంలోని ధ్రువ మూర్తుల కళ్యాణం, తొమ్మిది గంటలకు అలంకారం చేశారు. తొమ్మిదిన్నర గంటలకు మూర్తులను ఊరేగింపుగా మంటపానికి తెచ్చారు. సరిగ్గా పన్నిండు గంటలకు కళ్యాణం జరిగింది. రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు వాహన సేవలో భాగంగా చంద్రప్రభ వాహనంపై స్వామివారికి తిరువీధీ సేవ నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున ఆయన భద్రాద్రి రాముడికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.

భారీ మెజార్టీతో గెలిస్తేనే మంత్రిపదవి చేపడతా

కడప: పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తేనే తాను మంత్రి పదవి చేపడుతానని వైఎస్.వివేకానంద రెడ్డి అన్నారు. పులివెందుల లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అనుకోని పరిస్థితుల కారణంగా పులివెందుల, కడప ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపిస్తేనే మంత్రి పదవిని చేపడుతానని ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా పులివెందుల ప్రాంతంలో ఓటమి ఎరుగని నేతగా, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా నిజాయితీగా, నిబద్దతగా ఎటువంటి వారికైనా వారివారి సమస్యలను పరిష్కరిస్తూ వచ్చానన్నారు. ఇపుడు విధేయతతో వినమృడనై మీ ముందుకు వచ్చానని, ఈ ఎన్నికల్లో నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని, అందుకు మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను ఉప ఎన్నికల్లో గెలవడం వల్ల దివంగత నేత వై.ఎస్‌ ఆశయాలు నెరవేరుస్తామని చెప్పారు.

ఆ తర్వాతే తెలంగాణపై జగన్ ప్రకటన

హైదరాబాద్: కడప లోక్ సభ స్థానంలో గెలిచిన తర్వాత పార్లమెంటు సభ్యుడి హోదాలో తెలంగాణపై తమ పార్టీ నాయకుడు వైయస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు చెప్పారు. కడపలో కాంగ్రెసు పార్టీకి ఓటమి తప్పదని, ప్రభుత్వం ఆభాసు పాలవుతుందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఉప ఎన్నికల్లో విజయం జగన్‌దేనని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఇటలీ అహంకారానికి, కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరులో వైయస్ జగన్ విజయం సాధిస్తారని ఆయన అన్నారు. జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ విరుచుకుపడ్డారు. ఉండవల్లి వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శమని ఆయన మీడియాతో అన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ పాత్రపై మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి విచారణ జరిపించుకోవచ్చునని ఆయన అన్నారు.

కమిటీ నుంచి తప్పుకోమన్న హజారే

న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరగదని కేంద్ర టెలికామ్ శాఖామంత్రి కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే తీవ్రంగా మండిపడ్డారు. ఈ బిల్లు ప్రజా సమస్యలు పరిష్కరించదని భావిస్తే.. ముసాయిదా రూపకల్పన కోసం రూపొందించే సంయుక్త కమిటీ నుంచి తప్పుకోవచ్చని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. అంతేకాకుండా, పౌర సమాజం నాయకులు కిరణ్ బేడి, అరవింద్ కజ్రేవాలా సైతం ఇదే వాదనతో కపిల్ సిబల్‌పై ఎదురు దాడికి దిగారు. కపిల్ సిబాల్ వ్యాఖ్యలపై కపిల్ సిబాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లు విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి కపిల్ సిబల్ వ్యాఖ్యలు చాలన్నారు. లోక్‌పాల్ బిల్లు వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని భావిస్తున్న కపిల్ సిబల్ సంయుక్త కమిటీలో కొనసాగటం ద్వారా తన సమయాన్ని, మా సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని నిలదీశారు. ఇలాంటి వారు కమిటీలో కొనసాగటం ద్వారా సమయాన్ని వృథా చేసే బదులు తప్పుకోవటం మంచిదని సలహా ఇచ్చారు. లోక్‌పాల్ బిల్లు విషయంలో తీవ్రమైన ప్రకటనలు చేయటం ద్వారా సర్కారుకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. లోక్‌పాల్ చట్టం వలన ఎలాంటి లాభం లేదనుకుంటే సంయుక్త కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని సిబల్‌కు ఆయన డిమాండ్ చేశారు. లోక్‌పాల్ బిల్లు తయారు కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా తాము ఎదుర్కొంటామన్నారు.

భక్తులతో కిటకిటలాడుతున్న భద్రాచలం

భద్రాచలం: నేడు భద్రాచలంలో జరిగే సీతారామచంద్రుల కల్యాణోత్సవం ప్రత్యక్షంగా తిలకించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారి దర్సనం కోసం అర్థరాత్రి నుంచి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీరామనవమి కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. రాష్ట్రపాటి ప్రతిభాపాటిల్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లు దేశ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మానవాళికి ఆదర్శప్రాయుడైన శ్రీరామచంద్రుడు ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.

వైద్యానికి స్పందిస్తున్న బాబా

అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ సఫయా మంగళవారం తాజా బులెటిన్ విడుదల చేశారు. బాబా ఆరోగ్యం మరింత మెరుగు పడిందని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. తాము చేస్తున్న వైద్యానికి సత్యసాయి బాబా స్పందిస్తున్నారని చెప్పారు. చికిత్స కొనసాగుతుందని చెప్పారు. చికిత్సకు పాజిటివ్‌గానే స్పందిస్తున్నారని చెప్పారు. బాబా రక్తపోటు, గుండెచప్పుడు సాధారణంగా ఉన్నాయన్నారు. అయితే డయాలసిస్ కొనసాగుతుందని చెప్పారు. బాబా ఆరోగ్యంపై భక్తులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. బాబా త్వరలోనే అందరి ముందుకు వస్తారని చెప్పారు. కాగా పదిహేను రోజులుగా చికిత్స పొందుతున్న బాబా ఆరోగ్యం రోజు రోజుకు మెరుగు పడుతుండటం భక్తులను కుదుట పరుస్తుంది.

౩ రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం

న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్ఛేరి, కేరళలల్లో ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది.  బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పోలింగ్‌లో ఓటర్లు అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. కేరళలో మళయాళీలు చెరోసారి చెరో కూటమికి అధికారాన్ని అప్పగిస్తుండగా, ఈ దఫా అధికార ఎల్‌డిఎఫ్‌, ప్రతిపక్ష యుడిఎఫ్‌ నువ్వా, నేనా అన్నట్లు ప్రచారం నిర్వహించాయి. తమిళనాట అధికార డిఎంకె మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా ప్రజాతీర్పు కోరుతూ ప్రచారం నిర్వహించగా, ప్రతిపక్ష అన్నాడిఎంకె సైతం తానేమీ తీసిపోలేదన్నట్లు ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. అధికార డిఎంకె, ప్రతిపక్ష అన్నాడిఎంకెలు ప్రజలకు ఉచిత హామీలనివ్వడంలో పోటీ పడ్డాయి. అంతటితో ఆగక అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగత దూషణలతో ప్రచారాన్ని హోరెత్తించాయి. ఎన్నడూ లేని విధంగా ప్రధాన పార్టీలన్నీ ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యతనిచ్చాయి. తమ పట్ల ఇసి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అధికార డిఎంకె ఆరోపించగా, అదేమీ లేదని ఇసి స్పష్టం చేసింది. మరోవైపు జయలలిత వివాహంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినందుకు స్టాలిన్‌కు ఇసి నోటీసులు జారీ చేసింది. అన్నా డిఎంకె అధినేత జయలలిత, డిఎండికె అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ తదితరులు సైతం కరుణానిధి కుటుంబంపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. ఓటర్లను ప్రలోభ పరిచేందుకు డిఎంకె, అన్నా డిఎంకెలు చేసిన ప్రయత్నాలను ఇసి అధికారులు నియంత్రించి రూ.25 కోట్ల మేరకు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. పొరుగునే ఉన్న పుదుచ్ఛేరిలో కాంగ్రెస్‌ నేత, కేంద్ర మంత్రి నారాయణస్వామి, రంగనాథం ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచారు. ఇటు కేరళలో అధికార ఎల్‌డిఎఫ్‌, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తుండగా, అధికారంలోకి వస్తే తాము ఆ పథకాన్ని అమలు చేస్తామని ప్రతిపక్ష యుడిఎఫ్‌ హామీనిచ్చింది. కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌, కేరళ సిఎం అచ్యుతానందన్‌ పరస్పర వ్యాఖ్యలు దుమారం లేపాయి.