వేటు వేసే హక్కు కాంగ్రెస్ కు లేదు: సురేఖ

హైదరాబాద్: తమపై అనర్హత వేటు వేసే హక్కు కాంగ్రెసు పార్టీకి లేదని జగన్‌ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. అనర్హత వేటుకు భయపడేది లేదని, తాను వైయస్ జగన్ వెంటే నడుస్తానని ఆమె అన్నారు. తమపై అనర్హత వేటు వేస్తారని వచ్చిన వార్తలపై ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో కాంగ్రెసుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. వైయస్ జగన్ బిజెపితో దోస్తీ కట్టారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యను ఆమె ఖండించారు. బిజెపితో కలవాల్సిన అవసరం జగన్‌కు లేదని ఆమె చెప్పారు. డి శ్రీనివాస్ దిగజారి మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.  తిట్టిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిని చేర్చుకున్నప్పుడే కాంగ్రెసు తనపై తాను వేటు వేసుకోవాలని కొండా సురేఖ అన్నారు. తన భర్త కొండా మురళికి భద్రత కుదింపుపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్నవారిని మానసికంగా హింసించడంలో భాగంగానే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగుతోందని ఆమె విమర్సించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. తాము గోడ మీది పిల్లులాంటివాళ్లం కాదని, తాము వైయస్ కుటుంబంతోనే ఉంటామని ఆమె చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకమని వైయస్ జగన్ ఇప్పటి వరకు చెప్పలేదని, అందువల్ల జగన్ తెలంగాణకు వ్యతిరేకి అనడం సరికాదని ఆమె అన్నారు. ఉప ఎన్నికల తర్వాత తెలంగాణపై వైఎస్ జగన్ తన వైఖరిని వెల్లడిస్తారని సురేఖ తెలిపారు. 177 జీవో ఉపసంహరించుకునే వరకూ తెలంగాణ మంత్రులు కేబినెట్ సమావేశాలకు హాజరు కావద్దని కోరారు.

టీడీపీలో వారసత్వ పోరు లేదన్న బాలయ్య

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 62వ ఏట అడుగుపెట్టారు. ప్రముఖ నందమూరి హీరో బాలకృష్ణ తన వియ్యంకుడు చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబును సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిలో దర్శకరత్న దాసరి తదితరులు ఉన్నారు. మరోవైపు తెదేపా చీఫ్ చంద్రబాబు 62వ జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు లేదని నందమూరి హీరో, యువరత్న బాలకృష్ణ అన్నారు. నందమూరి-నారా కుటుంబాల మధ్య ఎటువంటి వారసత్వ పోరు లేదని, అదంతా మీడియా సృష్టేనని బాలకృష్ణ కొట్టిపారేశారు. బావ, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. తమ రెండు కుటుంబాల మధ్య వారసత్వ పోరు మీడియా సృష్టేనని తోసిపుచ్చారు. మీడియా సృష్టించిన ఈ వారసత్వ పోరును మీడియానే పరిష్కరించాలని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబమంతా కలిసే ఉందని బాలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.

విజయవంతంగా నింగికెగసిన పీఎస్ఎల్ వీ సీ-16

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్ వీ సీ16) బుధవారం ఉదయం 10.12 గంటలకు నింగికెగిసింది. పీఎస్‌ఎల్ వీ సీ16 రాకెట్ మూడుదశలు పూర్తి చేసుకుని విజయవంతంగా లక్ష్యం వైపు దూసుకు వెళుతోంది. వాహకనౌక ద్వారా రిసోర్స్‌శాట్-2, యూత్‌శాట్, ఎక్స్-శాట్‌లను అంతరిక్ష కక్ష్యలోకి చేర్చనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ16 రాకెట్ ద్వారా 1,404 కిలోల బరువు కలిగిన మూడు ఉపగ్రహాలను భూమికి 822 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి పంపనున్నారు. పీఎస్ఎల్ వీ సీ-16 ప్రయోగం విజయవంతంగా పూర్తయిందని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలు కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం వెనుక సహాయ సహకారాలందించిన వారందరికీ ఆయన కృతఙ్ఞతలు తెలియజేశారు. ప్రయోజనం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకంలో మునిగిపోయారు. ఇస్రోకి ఇది 18వ ప్రయోగమని ఆయన చెప్పారు.

నారా లోకేష్ హైలెట్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు రేపు జరుగనున్నాయి. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ముందు పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో నారా లోకేష్ ఫోటోను బాగా హైలెట్ చేస్తూ వేశారు. ఇటీవల తెలుగుదేశం వారసత్వం గొడవ నేపథ్యంలో అధ్యక్ష పీఠాన్ని జూనియర్ ఎన్టీఆర్‌కు కట్టబెట్టాలంటూ వాదనలు తెరపైకి వచ్చాయి. దీనికి హరికృష్ణ కూడా లోపాయికారిగా పూర్తి మద్దతు తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రం దానికి పరోక్షంగా కట్ చెప్పి హరికృష్ణ నోరు మూయించారు. దీంతో నారా లోకేష్ వారసత్వం లాంఛనం కానున్నట్లు తెదేపాలో ప్రచారం జరుగుతోంది.

ఆ ఐదుగురిపై వేటుకు రంగం సిద్దం

హైదరాబాద్‌: వైయస్ జగన్ వెంట ఉంటున్న రైల్వే కోడూరు శానససభ్యుడు శ్రీనివాసులును కాంగ్రెసు నాయకులు బుజ్జగిస్తున్నారు. జగన్‌ను వదిలేసి తిరిగి కాంగ్రెసులోకి రావాలని వారు అడుగుతున్నారు. చాలా రోజులుగా బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ మాదిరిగానే తమ వైపు రావాలని వారు శ్రీనివాసులును అడుగుతున్నారు. కాంగ్రెసులోకి తిరిగి రావడానికి నిరాకరిస్తే శ్రీనివాసులపై కూడా అనర్హత వేటుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు నాయకులు అనుకుంటున్నారు. ఇప్పటికే ఐదుగురు శాసనసభ్యులపై అనర్హత వేటుకు కాంగ్రెసు నాయకత్వం రంగం సిద్ధం చేసింది. కొండా సురేఖ, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలపై అనర్హత వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క, విప్ కొండ్రు మురళి మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. ఆ ఐదుగురు శాసనసభ్యులపై మల్లుభట్టి విక్రమార్క, కొండ్రు మురళి శాసనసభ డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు బుధవారం ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి. ఈ ఫిర్యాదు మేరకు నాదెండ్ల మనోహర్ వారిపై అనర్హత వేటు వేస్తారని అంటున్నారు. వినకపోతే శ్రీనివాసులును కూడా ఆ ఐదుగురి జాబితాలో చేర్చే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా, ఇతర జిల్లా శాసనసభ్యులు కడప లోక్ సభ నియోజకవర్గంలోకి ప్రవేశించకుండా కాంగ్రెసు అధిష్టానం కట్టడి చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.

ప్రభుత్వానికి ప్రణాళికా సంఘం అక్షింతలు

న్యూఢిల్లీ: వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం అమలు జరుగుతున్న తీరుపై ప్రణాళికా సంఘం తీవ్ర అసంతృప్తివ్యక్తం చేసింది. ఖర్చుకు తగ్గ ఆదాయం లభించడం లేదు కనుక ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవలసిందిగా ప్రణాళికా సంఘం స్పష్టం చేసింది. గత ఆరు సంవత్సరాలలో వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు లభించలేదని ప్రణాళికా సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్ గుప్తాచెప్పారు. రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఖరారు చేయటానికి పూర్వరంగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు ప్రణాళికా సంఘం సభ్యులతో చర్చలు జరిపారు. చర్చలు ముగిసిన తరువాత అభిజిత్ సేన్ మీడియాతో మాట్లాడారు. జలయజ్ఞంలో మార్పులు చేయటంతోపాటు ఉచిత విద్యుత్ పథకం అమలులో మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. వేలాది కోట్ల రూపాయలను ఖర్చుపెట్టిన తరువాత జలయజ్ఞాన్ని అర్ధంతరంగా ఆపివేయటం సాధ్యపడదని చెబుతూ భూగర్భ జలాల మట్టాన్ని పెంచటంతో పాటు నీటి పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రప్రభుత్వంపై విపరీతమైన భారం మోపుతున్నందున పథకం అమలులో ప్రయివేట్ భాగస్వాములకు వీలు కల్పించవలసిందిగా ప్రణాళికా సంఘం సూచించింది. ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న అన్ని పథకాలను ఒక గొడుగు కిందికి తీసుకురావలసిందిగా ప్రణాళికాసంఘం సూచించిందని అధికార ప్రతినిధి తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈదిశలో ఇప్పటికే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేస్తున్నట్లు ఆప్రతినిధి తెలియచేశారు.

కెసిఆర్‌పై కేసు

మచిలీపట్నం‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రాహ్మణ యువజన సంఘం కార్యదర్శి ఫణికుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. ఆంధ్ర బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలపై ఫణిమార్ కెసిఆర్‌పై ఫిర్యాదు చేశారు. ఆంధ్ర బ్మాహ్మణులకు ఆడంబరాలు ఎక్కువని, విషయ పరిజ్ఞానం తక్కువని వ్యాఖ్యానించిన కెసిఆర్ తమను కించపరిచారని ఫణికుమార్ ఫిర్యాదు చేశారు. కెసిఆర్ వ్యాఖ్యలు ఒక ప్రాంతాన్ని, ఒక కులాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. కెసిఆర్‌కు బ్రాహ్మణులు పిండ ప్రదానం కూడా చేశారు. కాగా, కెసిఆర్ ఆంధ్ర బ్రాహ్మణులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సోమవారం చెప్పారు.

బాబా పరిస్థితి విషమమే

అనంతపురం: పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా బులిటెన్ విడుదల చేశారు. ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. అలాగే సత్యసాయి బాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ బాబా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. సత్యసాయి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బీపీ నార్మల్‌గా ఉందని, అన్నీ అవయవాలు బాగా పనిచేస్తున్నాయని, సీఆర్ఆర్‌టీ సిస్టమ్‌లో వైద్యం అందిస్తున్నామని వైద్యులు పి.వి. రమేష్ చెప్పారు. కానీ బాబా ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతూనే ఉందని రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా వెంటిలేటర్ పైనే శ్వాస అందిస్తున్నామని కాలేయం పని తీరు మెరుగు పడిందని మళ్లీ తరువాతి రోజే కాలేయం పనితీరు నెమ్మదిగా ఉందని చెబుతూ భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నారు. అవయవాలు సరిగా పని చేస్తున్నాయని చెప్పి తాజాగా అవయవాల పనితీరు మందగించిందని పొంతన లేని మాటలు చెపుతున్నారు. ఇదిలా ఉంటే బాబా త్వరలో కోలుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.

జగన్‌ అఫిడవిట్‌ తప్పుల తడక: టీడీపీ

హైదరాబాద్: కడప పార్లమెంటు నియోజకవర్గానికి వైఎస్సార్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి సమర్పించిన అఫడవిట్‌ తప్పుల తడకగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆస్తుల వివరాలన్నీ దాచిపెట్టి సమర్పించిన జగన్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టిడిఎల్పీ డిప్యూటీ లీడర్‌ మోత్కుపల్లి నర్శింహులు, ప్రధాన కార్యదర్శి పి. చంద్రశేఖర్‌లు కమిషన్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు హైదరాబాద్‌, బెంగుళూర్‌, కడప, పులివెందుల తదితర ప్రాంతాలలో కోట్లాది రూపాయల విలువ చేసే ఖరీదైన స్థిరాస్తులున్నాయని పేర్కొన్నారు. గత ఎన్నికల సందర్భంగా జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 600 ఎకరాల భూమి ఉన్నట్టు అఫడవిట్‌లో పేర్కొన్నారని, తాజా అఫడవిట్‌లో ఈ భూమిని ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. జగన్‌ ఆస్తుల ఆధారాలను సమర్పిస్తామని, దీనికి జగన్‌ ప్రస్తుతం సమర్పించిన అఫడవిట్‌కు తేడా పరిశీలించేందుకు దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

డీఎస్ డ్రామాలు పనిచేయవు

హైదరాబాద్: జననేత జగన్మోహన్‌రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ బురద చల్లడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు రెహ్మాన్ హితవు పలికారు. నిజామాబాద్‌లో మైనారిటీ ఓటర్లు డీఎస్‌కు బాగా బుద్ది చేప్పారని ఆయన అన్నారు. కడప ముస్లీం ఓటర్లను మభ్యపెట్టి ఓట్లను రాబట్టుకోవాలనే జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే మైనారిటీ ఓట్లను రాబట్టుకోవాలని డీఎస్ ఆడుతున్న డ్రామా పనిచేయదని రెహ్మాన్ అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్ మాట్లాడుతూ.. జగన్ గెలిస్తే బీజేపీకి మద్దతు పలుకుతారని అన్నారు. డీఎస్ వ్యాఖ్యలపై పలువురు నాయకులు మండిపడ్డారు.

జగన్ గెలిస్తే బీజేపీకి సపోర్ట్

హైదరాబాద్: దివంగత నేత వైఎస్‌ఆర్ తనయుడు జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటంలో పెద్ద కుట్ర వుందని పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గెలిస్తే బీజేపీకి సపోర్ట్ చేస్తారని డీఎస్ అన్నారు. గాలి జనార్ధన్‌రెడ్డి ద్వారా జగన్‌కు బీజేపీ మద్దతిస్తోందన్నారు. అందుకే ఉప ఎన్నికల్లో పోటి సోనియా, వైఎస్‌ఆర్‌ల మధ్యేనని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ విషయంలో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమ్యెల్యేలపై డీసీసీల నుంచి ఇంకా ఫిర్యాదులు అందలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్యెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం సీఎల్పీదేనన్నారు. గాంధీభవన్‌లో డీఎస్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

ప్రభుత్వంపై వైఎస్సార్ కూతురు కోర్టుకు

హైదరాబాద్‌: తమకు భద్రత తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిళ, ఆమె భర్త అనిల్ కుమార్ హైకోర్టుకెక్కారు. తమ వ్యక్తిగత భద్రతను తగ్గించాలనే అధికారుల నిర్ణయాన్ని వారు సోమవారం హైకోర్టులో సవాల్ చేశారు. ప్రమాదం ఉండడంతో తమకు 2004 నుంటి వన్ ప్లస్ వన్ భద్రతను కొనసాగిస్తున్నారని, తమకు సమాచారం ఇవ్వకుండా ఏప్రిల్ 1వ తేదీ నుంచి భద్రతను కుదించారని వారు చెప్పారు. తమ సోదరుడు వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయడంతో తమ కుటుంబ సభ్యులను పద్ధతి ప్రకారం లక్ష్యంగా చేసుకున్నారని షర్మిళ కోర్టుకు తెలిపారు. తమ ఇద్దరికి భద్రతను పునరుద్దరించాలని షర్మిళ, అనిల్ కుమార్ హైకోర్టును కోరారు. వీరి పిటిషన్‌పై నోటీసు ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి కెసి భాను ఆదేశాలు జారీ చేశారు.

వైయస్ వల్లే కానిది జగన్ వల్లా

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కూడా 3 లక్షల ఆధిక్యం ఎప్పుడూ సాధించలేదని నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి మంగళవారం అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రెండు లక్షల మెజారిటీ వస్తుందని జగన్ వర్గం నేతలు చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఖచ్చితంగా కడప, పులివెందులలో కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్, విజయమ్మల పేరుతో డమ్మీ అభ్యర్థుల దరఖాస్తులో కాంగ్రెసు పార్టీ పాత్ర లేదని అన్నారు. అలాంటి అవసరం తమకు లేదన్నారు. జగనే కాంగ్రెసు ఓట్లను కొల్లగొట్టడానికి రవీంద్రారెడ్డి పేరుతో డమ్మీ అభ్యర్థులను వేయించారని ఆరోపించారు. ఏజెంట్ల కోసమే జగన్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారన్నారు. ఎన్నికలలో ధన ప్రభావాన్ని అడ్డుకోవాలని ఆయన ఎన్నికల సంఘానికి సూచించారు. వైయస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రెసుకున్న అభిమానాన్ని ఎవరూ వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదన్నారు.

డీఎల్, బొత్సలకు చేదు అనుభవం

కడప : ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలకు మంగళవారం చేదు అనుభవం ఎదురు అయ్యింది. పెద్దపులుసులలో డీఎల్‌ను 104 సిబ్బంది నిలదీశారు. తమకు జీతాలు రావటంలేదని, మందులు లేవని రోగులు నిరసన తెలుపుతున్నారంటూ ఆయన్ని ప్రశ్నించారు. అయితే వారికి సమాధానం చెప్పకుండానే డీఎల్ వెళ్లిపోయారు. కాగా నెమళ్లదిన్నెలో డీఎల్ ప్రచారం రసాభాసాగా మారింది. ఆయన్ని చూడగానే గ్రామస్తులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. తమ గ్రామానికి ప్రచారానికి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. గ్రామస్తుల నిరసనలతో డీఎల్ ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు. డీఎల్ కాన్వాయ్‌లో పరిమితికి మించి వాహానాలు ఉండటంతో అధికారులు నాలుగు వాహనాలను సీజ్ చేశారు. దీంతో తన వాహనాలనే సీజ్ చేస్తారా అంటూ డీఎల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల ప్రచారానికి వచ్చిన బొత్స సత్యనారాయణను కొండాపురంలో గండికోట ప్రాజెక్టు నిర్వాసితులు అడ్డుకున్నారు. తమకు పరిహారం ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించారు.

కేంద్రమంత్రి జైపాల్ ని మినహాయించారా

హైదరాబాద్: కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విషయంపై గప్ చుప్‌గా ఉంటే వారిపై కోడిగుడ్లు పడవా అని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం ప్రశ్నించారు. వారు తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళనలో పాల్గొనాలని కోరారు. లేదంటే తెలంగాణ ప్రజలు వారిని ఖచ్చితంగా అడ్డుకుంటారని చెప్పారు. తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు కడప జిల్లా ఉప ఎన్నికలలో పాల్గొనే బదులు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటే ప్రజలు హర్షిస్తారని సూచించారు. మే తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. టాంకుబండుపై పెట్టాలనుకుంటున్న విగ్రహాలపై ప్రభుత్వం కాస్త సంయమనం పాటిస్తే మంచిదని సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన 177 చట్టాన్ని వెంటనే పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజశేఖర్ రెడ్డి అవినీతికి వారసుడు జగన్

కడప: కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో విజయం కోసం రాష్ట్రానికి చెందిన 15 మంది మంత్రులు ఆంబోతుల్లా తిరుగుతున్నారని ఆ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న సీనియర్ నేత ఎం.వి.మైసూరా రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి అవినీతికి వారసుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం ఉద్యమాలు సాగించి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిని తానని చెప్పుకున్నారు. తాను వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో కొనసాగలేదని ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాల కోసం నిత్యం ప్రజలతో బంధాలు కొనసాగిస్తున్నానన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు రాజ్యసభలో ఉన్న ప్రజా సమస్య పైనే దృష్టి సారించినట్లు తెలిపారు. రాజకీయాల్లో ఉంటూ కోట్లు కూడపెట్టలేదని దీనిని వ్యాపారపరంగా చూడలేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పార్టీలు అవినీతి పార్టీలేనన్నారు. ఈ రెండు ఒకే పుట్టలో నుంచి వచ్చిన పెద్ద చిన్న పాములేనన్నారు. ఐదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్.రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశ ఖజానాను దోచుకున్నారన్నారు. జలయజ్ఞం పేరుతో వేలాది కోట్ల రూపాయలు దోచుకొని ధన యజ్ఞంగా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సెజ్‌ల పేరుతో ఉన్న భూములన్నింటిని పెద్దపెద్ద కంపెనీలకు కట్టబెట్టి రైతుల నోరు కొట్టారని తీవ్ర స్థాయిలో మైసూరా రెడ్డి ధ్వజమెత్తారు.

పుట్టపర్తి లో అధ్బుతం

అనతపురం: పుట్టపర్తి సత్యసాయి బాబా విగ్రహం పాదాల నుంచి సుగంధ ద్రవ్యాలు వెలువడుతున్నాయి. మంగళవారం పుట్టపర్తిలో ఈ అద్భుతం జరిగింది. ఎనుముల పల్లె తహసీల్దార్ నారాయణస్వామి నివాసంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పుట్టపర్తిలో రహీమ్ అనే వ్యక్తి ఐదు నెలల క్రితం ఓ సత్యసాయి విగ్రహాన్ని తయారు చేశారు. దీని బరువు సుమారు 120 కిలోలు ఉంటుంది. అయితే అనుకోకుండా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం నుండి బాబా పాదాల వద్ద నుండి సెంటు ద్రవపదార్థంగా కారుతోంది. సత్యసాయిబాబా విగ్రహం పాదాల నుంచి సుగంధ ద్రవ్యాల నూనె కారుతున్న అద్భుతాన్ని తిలకించేందుకు భారీ స్థాయిలో భక్తులు, మహిళలు పుట్టపర్తికి చేరుకుంటున్నారు. సత్యసాయి విగ్రహం పాదాల నుంచి కారిన నూనెతో ఆ గది పూర్తి నూనెమయం అయ్యింది. ఇదంతా బాబా మహిమేనని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబా ఆరోగ్య పరిస్థితిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, త్వరలో కోలుకుని మీకు అండగా ఉంటాననే సందేశాన్ని తెలియజేసేందుకే ఇలాంటి అద్భుతం జరిగిందని భక్తులు నమ్ముతున్నారు.