డిఎల్‌ను అడ్డుకున్న జగన్ వర్గం

కడప: పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెసు పార్టీ కడప ఎంపీ అభ్యర్థి, మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి గురువారం చుక్కెదురయింది. ప్రచారంలో భాగంగా ఆయన కడప జిల్లాలోని కాశీనాయన మండలం అమగంపల్లెకు ప్రచారం కోసం వెళ్లారు. అయితే గ్రామంలో ఉన్న జగన్ వర్గం కార్యకర్తలు కొందరు ఆయనను అడ్డుకున్నారు. డిఎల్ ప్రచారం చేస్తుండగా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కలుగ జేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రచారం కోసం వెళ్లిన మరో మంత్రి టిజి వెంకటేష్‌ను కూడా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టిజి పొద్దటూరు మండలం ఎర్రన్నకోటలో కాంగ్రెసు తరఫున ప్రచారం కోసం వెళ్లారు. అయితే ఎర్రన్నకోటలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు టిజిని అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై తేల్చాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎంతకీ మంత్రిని ముందుకు కదలనివ్వలేదు. దీంతో టిజి వెనుదిరగక తప్పలేదు.

అవినీతిపై బాబా రామ్‌దేవ్ సత్యాగ్రహం

న్యూఢిల్లీ: యోగా గురు బాబా రామ్‌దేవ్ జూన్ 4వ తేదీ నుంచి అవినీతికి వ్యతిరేకంగా సత్యాగ్రహం పేరుతో ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నారు. రామ్‌దేవ్ అధికార ప్రతినిధి ఒకరు ఈ విషయం చెప్పారు. భారత్ స్వాభిమాన్ యాత్ర పూర్తయిన తర్వాత రామ్‌దేవ్ సత్యాగ్రహ ఉద్యమాన్ని చేపడుతారు. స్వాభిమాన్ యాత్రను ఆయన గత సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ద్వారకలో ప్రారంభించారు. అది మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో జూన్ 1వ తేదీన ముగుస్తుంది. అవినీతి వ్యతిరేక పోరాటం గురించి రామ్‌దేవ్ ఏప్రిల్ 2వ తేదీన ప్రకటన చేస్తారు. మూడు అంశాలపై బాబా రామ్‌దేవ్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. స్వతంత్ర నిష్పాక్షిక లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని, విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న 400 కోట్ల రూపాయల విలువ చేసే నల్లధనాన్ని దేశానికి రప్పించాలని, బ్రిటిష్ వ్యవస్థలోని పాలన, పన్నుల విధానం, విద్య, శాంతిభద్రతల స్థానంలో స్వదేశీ నమూనాలను ప్రవేశపెట్టాలని ఆయన ప్రధానిని కోరారు.

పుట్టపర్తిలో 144 సెక్షన్

పుట్టపర్తి : పుట్టపర్తిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. బాబా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందనే వార్తలు వెలువడంతో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. బుధవారం రాత్రికే సుమరు 4 వేల మంది పోలీసులు పుట్టపర్తికి చేరుకున్నారు. చెక్ పోస్ట్ ల వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యుల ప్రకటనల నేపథ్యంలో పుట్టపర్తికి భారీసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కాగా, బాబా ఆరోగ్య పరిస్థితులపై వైద్యుల ప్రకటనల నేపథ్యంలో గురువారం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న ట్రస్టు సభ్యులను పుట్టపర్తికి పిలిపిస్తున్నట్లు సమాచారం. ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి, సభ్యులు ఎస్వీ గిరి, రత్నాకర్‌ పుట్టపర్తిలోనే ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు ఇందులాల్‌షా, జస్టిస్‌ భగవతి, శ్రీనివాసన్‌లు గురువారం రానున్నారు. ట్రస్టు ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు నాగానంద, జేవీ శెట్టి, భగవత్‌లకు సమాచారం పంపినట్లు తెలిసింది. పుట్టపర్తిలో జరిగే ట్రస్టు సమావేశానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. సత్య సాయిబాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు, చికిత్స ద్వారా ప్రాణాలు నిలబెట్టడం సాధ్యం కానట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఏం చేయాలనే విషయంపై చర్చించేందుకు సత్య సాయి ట్రస్టు అత్యవసరంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. సత్య సాయిబాబా భక్తుల్లోని ప్రముఖులు హైదరాబాదులో సమావేశమయ్యారు.

బాబా ఆరోగ్యమే ముఖ్యం: కేంద్రం

న్యూఢిల్లీ : సత్య సాయిబాబా ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే దేశ విదేశాల్లో బాబాకు చెందిన వివిధ సంస్థల ఆస్తులు, ఆర్థిక అక్రమాలపై దృష్టి సారించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్న సత్యసాయి సంస్థలు, దాదాపు 142 దేశాల్లో ఉన్న సేవా కేంద్రాల లావాదేవీలు, ఆస్తుల గురించి కేంద్రం నివేదిక తెప్పించుకుంది. ఆర్థిక అవకతవకలు, నిధుల స్వాహా గురించి పలు ఆరోపణలు తమ దృష్టికి వచ్చినప్పటికీ ప్రస్తుతం బాబా అనారోగ్యంతో ఉన్నందున వాటిపై ఇప్పుడు చర్యలు తీసుకోవడం మంచిది కాదని కేంద్రం భావిస్తున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థలు సత్యసాయిబాబాకు చెందిన సంస్థల ఖాతాలు, వాటి లావాదేవీలపై నివేదికలు తెప్పించుకుంటున్నాయని ఈ వర్గాలు చెప్పాయి. కాగా బాబా ఆరోగ్య పరిస్థితి, ఆయన ట్రస్టు, ఇతర సంస్థల్లో అవకతవకల గురించి వచ్చిన ఆరోపణలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ మాజీ మంత్రి సోనియాకు ఈ వివరాలను ఇప్పటికే పంపించారని, వ్యక్తిగతంగా ఆమె అపాయింట్‌మెంట్ కోరారని తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ కాంగ్రెస్ నేత సోనియాను కలుసుకునే అవకాశాలున్నాయి.

మా అన్నదమ్ముల్లో విభేదాలు లేవు: చిరు

కడప: తన సోదరులు తనతో కలిసే ఉన్నారని, అన్నదమ్ముళ్లమంతా ఐక్యంగానే ఉన్నామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. కడపలో కాంగ్రెసు తరఫున పోటీ చేయడానికి వచ్చిన ఆయన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగాకుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయని, కుటుంబం విడిపోయిందని వెలువడ్డ వార్తలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తన తమ్ముళ్ళు తన కుటుంబం అంతాకలిసే ఉన్నామని, తమ మధ్య ఎటువంటి అంతరాలు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి వార్తలు ప్రసారం చేయడం చూస్తుంటే జర్నలిజం ఎటు ప్రయాణం చేస్తోందో తనకు అర్థకావడం లేదని ఆయన ఆవేధన వ్యక్తంచేశారు. పీఆర్పీ ఎమ్మెల్యేల సంబంధించిన అనర్హతవేటు గురించి జరగబోయే పార్టీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

బ్రాహ్మణికి ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో సీట్లు

హైదరాబాద్ : సినీ హీరో బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణికి నాలుగు ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో చదవడానికి సీట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌ను పెళ్లి చేసుకున్న బ్రాహ్మణి ఇక విదేశాల్లో చదవడానికి సిద్ధపడింది. ఆమె స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబిఎ చదవడానికి మక్కువ చూపుతోంది. తన కూతురుకు నాలుగు ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో చదవడానికి అవకాశాలు లభించడంపై బాలకృష్ణ తెగ ఆనందపడిపోతున్నారు. ఈ విషయంపై బాలకృష్ణ స్పందిస్తూ ''మొదట్నుంచీ స్టడీస్‌లో టాప్‌ ర్యాంకర్‌గా పేరు తెచ్చుకున్న మా పెద్దమ్మాయి బ్రహ్మణికి కేవలం మెరిట్‌ మీదే నాలుగు టాప్‌ యూనివర్సిటీల్లో సీటు రావడం చాలా ఆనందంగా వుంది. ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా పేరు పొందిన స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎంబిఎ చెయ్యడానికి బ్రహ్మణి నిర్ణయించుకుంది'' అన్నారు.

ఆ ఎమ్మెల్యేలపై చర్యలు: చిరంజీవి

హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టి అధ్యక్షడు చిరంజీవి కూడా జగన్ వెంట వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించినట్లు సమాచారం. పీఆర్పీ ఎమ్మెల్యేలు అయినటువంటి శోభా నాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇద్దరూ జగన్ వెంట వెళ్తున్న విషయం తెలిసిందే. దీంతో పీఆర్పీలో పెద్దలు వీరిద్దరిపై డిప్యూటి స్పీకర్‌కి ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని పీఆర్పీ పార్టీ విప్ వంగా గీత ధృవీకరించారు. ఇది మాత్రమే కాకుండా పీఆర్పీలో మరో ముఖ్యనేత గంటా శ్రీనివాసరావు కాడా పీఆర్పీ జెండా పెట్టుకోని గెలిచి ఇప్పుడు పార్టీని కాదని జగన్‌కి సోపర్టు చేయడం పద్దతి కాదన్నారు. లేకుంటే వైయస్ జగన్ మాదిరి కాంగ్రెస్ ‌కి రాజీనామా చేసి సొంతంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలవాలని సూచించారు. వంగా గీత డిప్యూటి స్పీకర్‌కి వీరిద్దరి మీద రేపు పార్టీ ఉల్లంఘనలు క్రింద ఫిర్యాదు చేయనున్నారు.

విషమంగా సత్యసాయి ఆరోగ్యం

పుట్టపర్తి : గత 25 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యసాయి ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యంపై సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ సఫాయా గురువారం ఉదయం తాజా బులెటిన్ విడుదుల చేశారు. బాబా శరీరంలోని అవయువాలు చికిత్సకు నెమ్మదిగా స్పందిస్తున్నాయని తెలిపారు. కాలేయం పనిచేయకపోవడం, తగ్గినా రక్తపోటు ఆందోళనకు గురిచేస్తోందన్నారు. వెంటిలేటర్ ద్వారా శ్వాస, మూత్రపిండాలకు డయాలసిస్ కొనసాగుతుందని సఫాయా తెలిపారు. బాబా ఆరోగ్యంపై వైద్యులు ఆందోళనకరంగా ఉన్నారన్నారు. బాబా లోబీపీతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. బాబా ఆరోగ్య పరిస్థితి మెరుగుపర్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నామన్నారు.

పుట్టపర్తికి భారీగా పోలీసు బలగాలు

పుట్టపర్తి: సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి విశామించినట్లు వార్తలు వస్తుండటంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి వైద్యులు ఆయన పరిస్థితి విషమంగా ఉందని తప్ప నిలకడగా ఉందని చెప్పకపోవటం పలు అనుమానాలకు తావిచ్చింది. బాబాకు లోబీపీ ఉందని అది కాలేయంపై ప్రభావం చూపుతోందని, హార్ట్ బీట్ తగ్గిందని వైద్యులు అంటున్నారు. వెంటిలేటర్ ద్వారా శ్వాస కొనసాగిస్తున్నారు. సిఆర్ఆర్ థెరపీ కొనసాగిస్తున్నారు. డాక్టర్ రవిరాజ్ హడావిడిగా పుట్టపర్తి చేరుకున్నారు. దీనికి తోడు జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసులను ఉన్నపళంగా పుట్టపర్తి రావాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో జిల్లా నలుమూలల నుంచి పోలీసులు పుట్టపర్తి బయలుదేరారు.

జగన్‌కు ఓటు వేస్తే గాలికి వేసినట్లే

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనడానికి కాంగ్రెసు శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి కొత్త నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. వైయస్ జగన్‌కు ఓటు వేస్తే కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి ఓటు వేసినట్లేనని ఆయన అంటున్నారు. ఇద్దరూ అక్రమార్కులేనని అంటున్నారు. వారు వారి అక్రమ సంపాదన రక్షించుకోవాడనికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్‌కు ఓటు వేస్తే గాలికి ఓటు వేసినట్లే అని చెప్పడం ద్వారా కడపలో ఉన్న మైనార్టీలను తమ వైపుకు మరల్చుకోవాలనే యోచనలో పడినట్లుగా తెలుస్తోంది. కడప పార్లమెంటులో జగన్‌కు ఓటు వేసినా, పులివెందుల అసెంబ్లీ నుండి విజయమ్మకు ఓటు వేసినా కర్ణాటక బిజెపిలో ఉన్న గాలికి ఓటు వేసినట్లేనని అన్నారు. జగన్ ఉప ఎన్నికల తర్వాత బిజెపితో కలవడం ఖాయమని అన్నారు. జగన్ పదవీ కాంక్ష వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని అన్నారు. కాగా మంగళవారం పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్నాటకానికి సూత్రదారి బిజెపి అని చెప్పడం విశేషం. పిసిసి అధ్యక్షుడు బిజెపి సూత్రదారి అని చెప్పగానే పొంగులేటి ఈ కొత్త నినాదాన్ని అందుకున్నాడు.

రెండుగా చీలిన సత్యసాయి ట్రస్ట్

పుట్టపర్తి: సత్యసాయి బాబా ట్రస్ట్ రెండుగా చీలినట్లు తెలుస్తోంది. ఆస్తుల కోసమే ట్రస్ట్లో చీలిక వచ్చినట్లు భావిస్తున్నారు. బాబా ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఆస్తుల విలువ లక్షన్నర కోట్ల రూపాయలు పైనే ఉంటుందని అంచనా. ఆదిపత్యం కోసం పోరాటం జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాబా ఆస్తులపై గత కొద్దిరోజులుగా అనేక ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఏవిధమైన చర్యలు తీసుకున్న దాఖలాలులేవు. బాబాకు భక్తులు కానుకలుగా ఇచ్చిన కోటానుకోట్ల రూపాయల విలువైన వస్తువులు ప్రశాంతి నిలయంలోని గ్రీన్ హౌస్ లో ఉన్నట్లు చెబుతున్నారు. అవి అక్రమంగా తరలిపోతున్నా పట్టించుకునే నాధుడులేడని భక్తులు బాధపడుతున్నారు. బాబా ఆరోగ్యం కూడా గోప్యంగా ఉంచడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయడంలేదు.

సుప్రీంకోర్టులో కూడా ఇంతే: నాగం

హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై హైకోర్టులో చుక్కెదురయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వం పాటిస్తే బావుండేదన్నారు. అయితే ప్రభుత్వం హైకోర్టు నిర్ణయంతో విభేదిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లడం విచారకరమన్నారు. అయితే సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ జెఏసి నాయకులు నాగంను కలిశారు. ఇప్పటికైనా ప్రభుత్వం 8వ అధ్యాయాన్ని ప్రజల ముందు పెడితే బావుంటుందని అన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 177 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గడువులోగా ప్రభుత్వం 177 చట్టాన్ని వెనక్కి తీసుకోకుంటే తీవ్ర ఆందోళనలకు దిగుతామని చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడం చేస్తామని చెప్పారు.

డీఎల్ పై భూమా ఫైర్

హైదరాబాద్: కడప లోక్ సభకు పోటీ చేస్తున్న మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చరిత్ర హీనుడని మాజీ పార్లమెంటు సభ్యుడు భూమా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. మొన్నటి వరకు దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి పంచన వుండి, మరణించిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని భూమా చెప్పారు. డీఎల్ రవీంద్రారెడ్డికి నైతిక విలువలు తెలియవని భూమా విమర్శించారు. డీఎల్ రవీంద్రారెడ్డి రోజుకో మాట మారుస్తున్నాడని, బద్వేల్ ఎమ్మెల్యే కమలమ్మ డీలర్ల దగ్గర రూ. ఐదువేలు డబ్బులు తీసుకుని విమర్శించిన డీఎల్ ప్రస్తుతం ఆమెను వెంటపెట్టుకుని ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌కు అధిష్టానం ఢిల్లీలో వుంటే జగన్‌కు అధిష్ఠానం ప్రజలేనన్నారు.

పురందేశ్వరిని కాంగ్రెసు వాదిగా ఒప్పుకోం

విజయవాడ: దగ్గుపాటి పురందేశ్వరిని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత ఎన్టీఆర్ కూతురిగా తాము గౌరవిస్తామని అయితే కాంగ్రెసు వాదిగా మాత్రం వ్యతిరేకిస్తామని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ఇంఛార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం అన్నారు. పురందేశ్వరిపై తమకు వ్యక్తిగతంలా ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. కాగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. బాబు జన్మదినాన్ని సంక్షేమ దినంగా జరుపుకుంటామని చెప్పారు. వల్లభనేని వంశీ - దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య విభేదాలు తొలగిపోయాయయని చెప్పారు.

జగన్ వ్యాఖ్యలను ఖండించిన తులసిరెడ్డి

కడప: ఉప ఎన్నికల్లో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, విజయమ్మల పేర్లతో నామినేషన్‌లను వేయించి అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్లను గందరగోళం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం ఓటర్లను తికమకపెట్టే ప్రయోగాలు చేయాల్సిన ఆగత్యం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్దంగా ఎవరైనా భారతదేశంలో చట్టసభలకు సంబంధించి అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు అర్హులన్న విషయాన్ని జగన్ గుర్తుకు పెట్టుకుంటే మంచిదన్నారు. జగన్ తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో ఎన్నికల ప్రచారంలో మాట్లాడేటప్పు డు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన జగన్‌కు హితవు పలికారు. పదేపదే ఆత్మగౌరవం గురించి మాట్లాడే జగన్‌మోహన్‌రెడ్డి తన బాబాయ్‌కి మంత్రి పదవి ఇస్తే ఆత్మగౌరవానికి భంగం కలిగినట్లు జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల తరువాత వైయస్ జగన్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని తులసిరెడ్డి జోస్యం చెప్పారు.

బాబు ఇంటికి నాగం

హైదరాబాద్: సుమారు రెండు నెలల దీర్ఘ కాలం తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లారు. ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టిన రోజు కారణంగా నాగం జనార్ధన్ రెడ్డి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు బాబు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు విషెస్ చెప్పేందుకే తాను వచ్చానని అన్నారు. తెలంగాణపై నిర్ణయం గురించి ప్రశ్నించగా తెలంగాణ విషయంలో తన వైఖరి మారదని స్పష్టం చేశారు. అయినా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటానికి సమయం కాదని ఆయన అన్నారు. కాగా గత కొంతకాలంగా నాగం - బాబు మధ్య అగాధం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరి మధ్య అగాధం పెరిగిన అనంతరం నాగం మొదటిసారి బాబు ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వేటు వేయవద్దంటున్న జగన్ వర్గం

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులలో పలువురికి అనర్హత వేటు భయం పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. తాము కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతామని తమపై వేటు వేయవద్దని పార్టీకి చెప్పినట్లుగా తెలుస్తోంది. కడప పార్లమెంటుకు, పులివెందుల శాసనసభకు ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులపై అధికార కాంగ్రెసు పార్టీ దృష్టి సారించిన విషయం తెలిసిందే. వేటు పేరుతో జగన్ వర్గం ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలకు మరింత పదును పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యే కమలమ్మను దారిలోకి తెచ్చుకున్నారు. తదుపరి లక్ష్యంగా శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేలతో చీప్ విఫ్ మల్లుభట్టి విక్రమార్క సమావేశం అయినట్లుగా సమాచారం. శ్రీనివాసులు కాంగ్రెసులో ఉండాలా, జగన్‌తో ఉండాలా అనే విషయంపై ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. దీంతో అలాంటి వారిని సాధ్యమైనంత తొందరగా తమ వైపుకు తిప్పుకోవాలనే యోచనలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే హుటాహుటినా శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులును హైదరాబాదుకు రప్పించి వారితో మల్లుభట్టి సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. సాయంత్రంలోగా కాంగ్రెసులోనికి తిరిగి వస్తున్నట్లుగా ప్రకటించాలని వారిని పార్టీ అదేశిస్తున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం పార్టీ ఉప సభాపతి నాదెండ్ల మనోహర్‌కు జగన్ వర్గం ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిపై ఫిర్యాదు చేయకూడదంటే వారు తాము కాంగ్రెసులోనే ఉంటున్నట్లు ప్రకటించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసమే మల్లుభట్టి వారితో భేటీ అయినట్లుగా సమాచారం. అయితే వారు సమయం తీసుకుంటామని చెప్పినప్పటికీ అందుకు పార్టీ నేతలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. పార్టీలో ఉంటారా, జగన్‌తో వెళతారా అనే విషయంపై ఈరోజు బహిరంగంగా ప్రకటిస్తేనే ఫిర్యాదుపై వెనక్కి తగ్గుతామని చెప్పినట్లుగా తెలుస్తోంది. తమపై ఫిర్యాదును తప్పించుకోవడానికి కమలమ్మ బాటలోనే శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి పయనించనున్నారని, ఈ విషయంపై సాయంత్రంలోగా ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది.

వైఎస్సార్ ఫోటో కాంగ్రెస్ కే సొంతం

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారని ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి కొనియాడారు. అందుచేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సొంతమని, ఆయన ఫోటో కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆనం వ్యాఖ్యానించారు. కడప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించిపెట్టేందుకు కృషి చేస్తున్నారని ఆనం వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి పోటీలో ఉన్నారని ఆనం గుర్తుచేశారు. పార్టీని సమన్వయం చేస్తూ ప్రతి నాయకున్ని, కార్యకర్తలను కలుస్తామన్నారు. కాగా, జగన్‌పై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ధ్వజమెత్తారు. తమ పార్టీ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవులు త్యాగం చేస్తే వైయస్ జగన్ పదవి కోసం పాకులాడుతున్నారని ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ సోనియాకు, వైయస్సార్‌కు మధ్యనే అని వైయస్ జగన్ అనడం మూర్ఖత్వమని ఆయన అన్నారు. వైయస్ జగన్ తన పరిధిని మించి విమర్సలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా తమ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని ఆయన అన్నారు.

'జాతీయ రాజకీయాల్లోకి బాబు రావాలి'

కడప: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజకీయాల్లో నుండి తప్పుకొని దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెసు ఆధ్వర్యంలోని యుపిఐ అవినీతిని ప్రక్షాళన చేయాలంటే బాబు ప్రధాని కావడమే సముచితమని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు 1996లోనే ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు. చంద్రబాబుకు ముందు ముందు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కాగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, రాష్ట్రంలో మరొకరు పార్టీ పగ్గాలు అంది పుచ్చుకోవచ్చునని చెప్పారు. అందరి ఆమోదంతో ఎవరైనా పార్టీ పగ్గాలు చేపట్టవచ్చునని అన్నారు. కాగా ఇటీవల నందమూరి వంశానికి పార్టీ పగ్గాలు అందించాలనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను బాలకృష్ణకు అప్పగించాలని గాలి ముద్దుకృష్ణమ నాయుడు కోరుకుంటున్నారా, లేదంటే నారా లోకేష్‌కు అప్పగించాలని వాంఛిస్తున్నారా అనేది తెలియడం లేదు.