ఎప్పుడూ 'చేయి' దాటడమేనా?

ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది మొదలు పోలింగ్ పూర్తయ్యేంత వరకూ కాంగ్రెస్ (హస్తం గుర్తు)పార్టీ నిబంధనల అతిక్రమణలో ముందువరసలోనే ఉంది. ఎప్పుడూ చేయి దాటడమేనా పని అని ఆ పార్టీని తెలుగుదేశం, ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. అలానే వచ్చీరాని తెలుగుమాట్లాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పదే పదే ఎన్నికల కమీషన్ నోటీసులు అందుకున్నారు. ఇక మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఏకంగా హెచ్చరికలే భరించాల్సి వచ్చింది. ఆ తరువాత రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా ఈసి నోటీసులు అందుకున్నవారే. ఇలా వరుసగా కాంగ్రెస్ నేతలు నోటీసులు అందుకుంటుండగానే పోలింగ్ కూడా పూర్తయింది. ఇక పోలింగ్ లో నిలబడ్డ వృద్ధులు, మహిళలలను చూపి అందరు ఓటర్లకు బిర్యానీ ప్యాకెట్లు, టిఫిన్ పోట్లాలు పంపిణీ చేశారు. ఇది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగింది. ముందు నిబంధనలను ఉల్లంఘించినట్లే ఇప్పుడు పోలింగ్ రూల్స్ ను అతిక్రమించిన ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఈ బిర్యానీ ప్యాకెట్ల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదు.

మాచర్ల రిగ్గుంగు కుట్ర విఫలం!

రిగ్గింగ్ కోసం రెండు పార్టీలు ముందుగా చేసుకున్న ప్రణాళికలకు ఎన్నికల కమీషన్ చెక్ పెట్టింది. అక్రమాలకూ పాల్పడేవారిని వెబ్ కెమెరాల ద్వారా ఈసి అదుపు చేస్తున్నందున వాటి కేబుల్స్ కట్ చేయాలనీ ఆ రెండు పార్టీలు పన్నిన కుట్రను కనుగొన్న ఈసి దాన్ని భగ్నం చేసింది. ముందుగా అందిన సమాచారం మేరకు ఈసి గుంటూరు జిల్లా మాచర్ల పోలింగ్ కేంద్రం వద్ద అధికార్లను అప్రమత్తం చేసింది. ఈపాటికే వెబ్ కెమెరాల వద్ద కేబుల్స్ ఎక్కడైనా కట్ చేశారేమో చూడాలని ఆదేశించింది. దీంతో అధికాలు అప్రమత్తమై జిల్లా ఎన్నికల అధికారిని సంప్రదించారు. ఆయన ఈసి ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఎవరూ వెళ్ళకుండా బందోబస్తు పెంచారు. పారామిలటరీ దళాలను భారీస్థాయిలో పోలింగ్ కేంద్రాల ముందుంచారు. ప్రత్యేకించి వెబ్ కెమెరాల దగ్గరికి ఎవరినీ రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల బందోబస్తు చూసి రిగ్గింగ్ చేద్దామనుకున్న రెండు పార్టీల నేతలు మౌనంగా ఉండక తప్పలేదు. దీంతో ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి.

ఓటు నొక్కకుండానే,ఆగిన గుండె

వృద్ధాప్యం ... అసలు నడవటమే కనా కష్టం. కాళ్ళు సాగాదీసుకుని కొంచెం ఓపిక చేసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్ళింది. అక్కడ సిబ్బంది ఎన్నికల నిబంధనల ప్రకారం ఆమె అర్హతను పరీక్షించారు. వృద్దురాలైనా సరైన ఆధారాలతో ఓటెయ్యటానికి వచ్చిందని సంతృప్తి చెందారు. ఆమె ఎడమచేతి చూపుడువేలికి ఇంకు వేశారు. నెమ్మదిగా ఆమె ఈవిఎం దగ్గరకు చేరుకుంది. చుట్టూ ఒకసారి చూసింది. చేయి నెమ్మదిగా ఈవిఎం వైపు ఎత్తి సరిగ్గా ఓటు వేసే సమయానికి కుప్పకూలింది. ఆమె గుండె ఆగిపోయింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మర్రిపాలెం మండలం కండ్రిక పోలింగ్ స్టేషన్ లో జరిగింది. ఆ వృద్ధురాలి పేరు శేషమ్మ. ఈవిఎం నోక్కకుండానే చేనిపోయిన శేషమ్మ అసలు ఆమె ఎవరికీ ఓటు వేయటానికి వచ్చిందనే సందేహాన్ని మిగిల్చింది. అన్నీ ఉచితంగా అందజేస్తామన్న తెలుగుదేశం పార్టీకా? సానుభూతి ప్రచారంతో ముందుకు వచ్చిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకా? వచ్చీరాని తెలుగు మాట్లాడే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకా? అన్నది మాత్రం తేలలేదు.

విజయమ్మ కన్నీటిబొట్లకు విలువ!

ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన కుమారుడి గురించి రాల్చిన కన్నీటి బోట్లకు మన ఆంధ్రా ఓటర్లు విలువ ఇచ్చారు. అందుకే ఫలితాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, సానుబూతి బాగా పనిచేసిందని సర్వేలు, మీడియా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంచనాల ప్రకారం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 16 స్థానాల వరకూ రావచ్చని లెక్కలు వినిపించాయి. సహజంగా ఇటువంటి లెక్కలు ఎక్కడ వచ్చినా ముందస్తు భవిష్యత్తు చెప్పే విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ కూడా ఈ అంచనాలు కరెక్టే అంటున్నారు. ఆయన వేసిన లెక్కల ప్రకారం కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 16 స్థానాలు రావచ్చట. కాంగ్రెస్ కు 1 నుంచి 3 సీట్లు, తెలుగుదేశంపార్టీకి 2సీట్లు వచ్చే అవకాశముందని ఆయన తేల్చేస్తున్నారు. పరకాలలో మాత్రం టి.ఆర్.ఎస్. గెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే తన లెక్క తెలుగుదేశంపార్టీ విషయంలో ఏమైనా మార్పు ఉండొచ్చు కానీ, మిగతా ఎక్కడా మారాడని లగడపాటి జోస్యం చెప్పేశారు. ఎన్నికలు పూర్తయ్యాక ఈయన చెప్పిన జోస్యం ఇంతకు ముందు అన్ని మీడియాలు చెప్పినవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి! కానీ, ఆయనే సొంతంగా శోధించి కనుగొన్న విషయంలా లగడపాటి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం మాత్రం అవే విషయాలు రాసి ఉన్న ప్రతినిథులకు బాధగా అనిపించాయి. మేము రాసిన సర్వేలే మాకు చెప్పి తిరిగి రాయమంటున్నారని ఆ ప్రతినిథుల ఆత్మఘోష మాత్రం లగడపాటి పట్టించుకోకుండా జాన్తానై అన్నట్లు చూస్తారు.

పోరాడి ఓడిపోతున్న తెలుగుదేశం అభ్యర్థులు?

పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణా సెంటిమెంటు పాళ్ళు ఎక్కువయ్యాయి. మిగిలిన 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ అరెస్టు సెంటిమెంటు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ దశలో సెంటిమెంట్లపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చివరిదాకా పోరాడారు. ఆయన ఎంతలా పోరాడినా బలమైన సెంటిమెంట్లు వర్కవుట్ అయితేనో? అయినా ఫర్వాలేదు తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు ఖాయమని మాజీ మంత్రి శంకరరావు తేల్చేశారు. ఈయన అలా అంటే విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ కూడా గుంటూరు జిల్లాలో తెలుగుదేశానికి కలిసొస్తుందని అంచానా వేశారు. ఆయన అంచనా ప్రకారం కూడా రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది. దీనికి పెద్దగా కష్టపదక్కర్లేదు. వీరిద్దరి మాటలు బాబు చెవిన పడ్డట్టున్నాయి. అందుకే కొంచెం శ్రద్ధగా గుంటూరు జిల్లాపై దృష్టి సారించారు. నిజంగా సెంటిమెంట్లు వేడి ముందు తాను ప్రచారం ఎంత చేసినా నిలువదని బాబూకూ తెలిసిందే. అందుకే తమకు రెండు సీట్లు వచ్చినా బోనస్ గానే భావిస్తామని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. అసలు ఎన్నికల్లో విజయం కావాలి కానీ, ఉప ఎన్నికల్లో పెరిగే సీట్లన్నీ తమకు బోనస్ అని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ బోనస్ లెక్కలు ఎలా ఉన్నా అసలు సెంటిమెంట్లు ఎంత వరకూ వర్కవుట్ అయిందో ఈ నెల 15వ తేదీన ఫలితాలు వెలువడేంత వరకూ ఆగకతప్పదు.

నాలుగు చాల్లే అంటున్న కాంగ్రెస్ నేతలు

రాష్ట్రంలో 18అసెంబ్లీ స్థానాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి 14స్థానాలు వస్తాయని పలు సర్వేల్లోనూ, మీడియా విశ్లేషణల్లోనూ అంటున్నారు. మాకు నాలుగంటే నాలుగుస్థానాలు వస్తే చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మా పార్టీ తరుపున సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కలిసి చేసిన ప్రచారం వల్ల ఆల్లగాడ్డం రామచంద్రాపురం, నర్సాపురం, తిరుపతి స్థానాల్లో తమ పార్టీ విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశంపార్టీ 2 నుంచి 4స్థానాలకు ఎగపాకిందనీ మీడియా చెప్పే వార్తలను బట్టి చూసినా తమకు ఆ నాలుగుస్థానాలూ ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. తమకు అందిన నివేదికల ప్రకారం ఈ నాలుగుస్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బలమైన వారిగా గుర్తింపుకూడా ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఏమైనా సరే మాకు ఆ నాలుగుస్థానాలు దక్కితే చాలని వారు భావిస్తున్నారు. వీరిలా సర్ధుకుపోవటానికి సిద్ధమైనా ఫలితాలు వెలువడితే కదా కాంగ్రెస్ కల నెరవేరిందా? లేదా? అన్నది తేల్చటానికి సిఎం మాత్రం మాకు అత్యధికస్థానాలు వస్తాయని ఎన్నికల తరువాత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన ధీమా, ఈ సర్థుబాటు సంతృప్తి విషయం తేలాలంటే ఈ నెల 15వ తేదీన ఫలితాలు వెలువడేంత వరకూ వేచిచూడాల్సిందే!

ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకు ఓటడిగారా?

తాము చేస్తున్న ఉద్యోగాన్ని ఫణంగా పెట్టి కొందరు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని కోరారు. అదీ ఎన్నికల సమయంలోనే. దీన్ని వెబ్ కెమెరాల్లో గుర్తించి ఈసి వారిపై కొరడా ఝుళిపించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ పివిఆర్ స్కూల్ 60వ నెంబరు పోలింగ్ బూత్ లో ప్రిసైడింగ్ అధికారి వి.శేషగిరి, మైక్రో అబ్జర్వర్ ఎన్. శేషగిరి ఓటర్లను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని కోరుతూ వెబ్ కెమెరాలో ఈసీకి దొరికిపోయారు. వీరిద్దరినీ విధులనుంచి తప్పించారు. అలానే జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనిత రాజేంద్ర వీరిద్దరినీ అరెస్టు చేయించారు. అనంతపురం విద్యారణ్య ఓరియంటల్ ఎయిడెడ్ ఉన్నతపాఠశాల పోలింగ్ బూత్ నెంబర్ 69లో బి.ఎల్.ఓ. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తుండగా జోనల్ అధికారి ఆమెను విధులనుంచి తప్పించి ఉన్నతాధికార్లకు విషయాన్ని చేరవేశారు. అలానే చెమకూరు మండలం కోర్నేపాడులో పోలింగ్ బూత్ లో మొత్తం ఎన్నికల సిబ్బంది, పోలీసులు కలిసికట్టుగా ఓటర్లను వదలకుండా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఒటేయించారు. దీంతో ఓటర్లు పోలింగ్ ను ఆపుచ్జేయించారు. తెలుగుదేశంపార్టీ అభ్యర్థి వచ్చి నచ్చచెప్పడంతో మళ్ళీ పోలింగ్ రెండు గంటల తరువాత ప్రారంభమైంది. జగన్ పార్టీ నేతలు తమ అనుచరులతో వచ్చి కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ను అడ్డగించారు. ఒంగోలు సెయింట్ జేవియర్స్ పోలింగ్ బూత్ లో జగన్ పార్టీ నేతలు పోలింగ్ ను అడ్డుకున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన అనుచరులతో వచ్చి పోలింగ్ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. డబ్బుతో ఓట్లు కొనుగోలు నేరానికి పాల్పడిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బారెడ్డి, జానకీరామయ్యలను కడపజిల్లా సిద్ధవటం మండలం మాధవపురంలో అరెస్టు చేశారు.

ఉప పోలింగ్ పై మావోల ప్రభావం?

తమ సమస్యలు పట్టించుకోవటం లేదన్న కోపంతో ఆగ్రహించిన పలుగ్రామాల వారు ఉప ఎన్నికలను బహిష్కరించారు. తమ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తే అప్పుడు ఈవిఎంల మీట నొక్కుతామని సమైక్యతతో నిరసన స్వరాన్ని వినిపించారు. నేతల వాగ్థానాలతో విసిగిపోయి ప్రత్యక్షచర్యలకు సిద్ధపడ్దామని స్పష్టం చేస్తున్నారు. కొన్ని చోట్ల మావోయిస్టుల పిలుపులమేరకు ఎన్నికల బహిష్కరణ జరిగింది. నెల్లూరుజిల్లా కావలి మండలం చౌదరి పాలెంలో 677మంది గ్రామస్థులు ఈ ఎన్నికలను బహిష్కరించారు. అదే జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడులోనూ గ్రామస్థులు ఇఫ్కోకిసాన్ సెజ్  కు నిరసనగా పోలింగ్ కు హాజరుకాలేదు. తమ భూములను తిరిగి ఇవ్వాలని గ్రామస్థులు డిమాండు చేశారు. అలానే ఇదే జిల్లాలోని చిననట్టు, పెదనట్టు గ్రామాల్లో కూడా ఎన్నికలు బహిష్కరించారు. ఈ గ్రామాలు నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం పరిథిలోనివే. పీపుల్స్ వార పిలుపు మేరకు పోలవరం నియోజకవర్గం పరిథిలోని గుమ్ముటూరులోనూ ఎన్నికలను బహిష్కరించారు. విద్యుత్తు కోతపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ పరిథిలోని త్రోవగుంట ఎస్సీ కాలనీలో కూడా ఎన్నికలను బహిష్కరించారు.

ఉపఎన్నికల్లో మధ్యాహ్నం వరకు 50శాతం పోలింగ్

రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం ఒంటి గంటకు 50 శాతం పోలింగ్ అయినట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.   పరకాల నియోజకవర్గం 35 శాతం నరస్నపేట - 45 శాతం పాయకరావుపేట - 52 శాతం రామచంద్రాపురం - 47 శాతం నర్సాపురం - 52 శాతం పోలవరం - 46 శాతం ప్రత్తిపాడు - 48 శాతం మాచర్ల - 55 శాతం ఒంగోలు - 51 శాతం ఉదయగిరి - 52 శాతం రాజంపేట - 51 శాతం రైల్వే కోడూరు - 48 శాతం రాయచోటి - 51 శాతం ఆళ్లగడ్డ - 51- శాతం ఎమ్మిగనూరు -50 శాతం రాయదుర్గం 52 శాతం అనంతపురం - 38 శాతం తిరుపతి - 39 శాతం నెల్లూరు లోక్సభ నియోజకవర్గం 50 శాతం సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ పిలుపు మేరకు పోలవరం నియోజకవర్గం చింతపల్లి, తుములూరు గ్రామాలలో పోలింగ్ని బహిష్కరించినట్లు భన్వర్ లాల్ తెలిపారు. నెల్లూరు లోక్సభ అభ్యర్థి టి.సుబ్బరామిరెడ్డిపై ఫిర్యాదు అందిందని చెప్పారు. కలెక్టర్ని నివేదిక కోరినట్లు చెప్పారు.

14 స్థానాల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గెలుపు ఖాయం?

14 స్థానాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ గెలుపు ఖాయం? మూడు స్థానాల్లో పోటాపోటీ! పరకాలలో టి.ఆర్.ఎస్. కు ఛాన్స్?   రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలి ధాటికి ప్రత్యర్థులు కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగువన్.కామ్ కు సమాచారం ప్రకారం ఉప ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 14 స్థానాల్లో (నరసన్నపేట, రామచంద్రాపురం, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, అనంతపురం, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్ళగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు) నియోజకవర్గాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాయకరావు పేటలో తెలుగుదేశం అభ్యర్థి చెంగల వెంకట్రావు, నరసాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ, పరకాలలో టి.ఆర్.ఎస్. అభ్యర్థి భిక్షపతి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన రెడ్డి విజయం సాధించే అవకాశం ఉంది. 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 17 నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ఒక్క పరకాల నియోజకవర్గంలో మాత్రమే బహుముఖ పోటీ ఉంది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్దేశించబోతున్న ఈ ఎన్నికలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగానూ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పెను సవాల్ గానూ మారాయి.     ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ఈ పార్టీలు మొదటిసారిగా డబ్బు, మద్యంతో పాటు వెండి, బంగారం ఆభరణాలు కూడా పంచినట్లు వార్తలు వచ్చాయి. 2009లో రాష్ట్రంలో 42లోక్ సభ, 294 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పోలీసులు కేవలం 32కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకోగా, ప్రస్తుత 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానం పరిథిలో ఇప్పటికే 54కోట్ల రూపాయల నగదు స్వాధీనపర్చుకున్నారు .నగదుతో పాటు కోట్లాది రూపాయల విలువైన మద్యం, బంగారం, వెండి వస్తువులు కూడా స్వాధీన పర్చుకున్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ఈ గణాంకాలే వెల్లడిచేస్తున్నాయి.       రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 18మంది జగన్ అభిమాన శాసనసభ్యులు ఓటు వేయడంతో స్పీకర్ వారి శాసన సభ్యత్వాలను రద్దు చేశారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్రమాస్తుల కేసులో సిబీఐ జగన్ ను అరెస్టు చేసింది. జగన్ అరెస్ట్ వల్ల కాంగ్రెస్ కు లాభం లేకపోగా నష్టమే జరిగింది. సోనియా ఆదేశాలతో సిబీఐ జగన్ ను అరెస్టు చేసిందనే అభిప్రాయం సామాన్యప్రజల్లో ఏర్పడింది. తర్వాత వై.ఎస్. రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ, ఆయన కూతురు షర్మిల ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. వీరు ప్రచారానికి వెళ్ళిన ప్రతిచోటా ప్రజలు అసంఖ్యాకంగా హాజరయ్యారు. మధ్యతరగతి, పెదవర్గాల్లో వై.ఎస్. అంటే ఇంకా అభిమానం ఉంది. వై.ఎస్. కుటుంబసభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలను వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. అన్ని పార్టీల్లోనూ అవినీతిపరులు ఉన్నారని, డబ్బు, పదవుల కోసమే వారు రాజకీయాల్లోకి వస్తున్నారని, వై.ఎస్. తింటే తిన్నాడు పేదలకు ఎంతో కొంత చేశాడనే ఉదాసీన భావన ఓటర్లలో పేరుకుపోయింది. ఈ భావనే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కారణమవుతోంది. దీనికితోడు ఓదార్పు యాత్ర పేరుతొ రాష్ట్రమంతటా తిరుగుతున్నా జగన్ ను అరెస్టు చేయడంతో సాధారణ ఓటర్లు ఆయనపై సానుభూతి చూపుతున్నారు. 2009లో 72 కోట్ల ఆస్తి తన పేరా ఉన్నదని జగన్ ప్రకటించాడు. 2011 నాటికి ఆ ఆస్తుల విలువ 430 కోట్లకు పెరిగింది అంటే రోజుకు 50లక్షల రూపాయల చొప్పున జగన్ ఆస్తుల విలువ పెరిగింది. ఆస్తులతో పాటు అవినీతి ఆరోపణలు కూడా రావడంతో ప్రస్తుతం కస్టడీలో ఉన్న జగన్ కు ఇప్పటికీ ప్రజామద్ధతు లభిస్తుండడం విశేషం.

ప్రలోభాలకు లొంగబోమని రామయ్యకాలనీ వాసుల ప్రమాణం

ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ప్రలోభాలకు తాము లొంగబోమని అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిథిలోని రామయ్యకాలనీ వాసులు ప్రమాణం చేశారు. కాలనీవాసులందరూ ఏకతాటిపై నిలబడి మరీ ఈ ప్రమాణం చేశారు. తమకు నచ్చిన వారికి ఓటేస్తామని వారు ప్రకటించారు. ఓటు హక్కు మన జన్మహక్కు అని ఓటర్లందరూ గుర్తించాలని కాలనీవాసులు ప్రచారం కూడా చేస్తున్నారు. నేతలు ఎన్నికల్లో చేసే హామీలను నమ్మకుండా ఓటర్లందరూ ఇప్పటివరకూ తమకు ఎవరు కలిసొస్తే వారికే ఓటేయాలని సూచిస్తున్నారు. నిజాయితీతో చేసే ఓటు అభివృధికి పునాది వంటిదని కాలనీవాసులు అభిప్రాయపడ్డారు. ఐదేళ్ళపాటు సేవలందించే నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాలనీవాసులు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏడుకొండల వెంకన్న ...రఘువీరాకు సాక్షినా?

ఈ ఉప ఎన్నికల పుణ్యమా అని దేవుళ్ళకూ కష్టకాలం వచ్చేసింది. ఎందుకంటే అభ్యర్థుల హామీలకు వీరు సాక్షులవుతున్నారు. తమను ఎవరూ నమ్మకపోతే దేవుడిని సాక్షిగా చూపడం అరుదుగా జరిగే ఘటన. అయితే అభ్యర్థులూ ఈ సాక్ష్యం చూపటం లేదు. అభ్యర్థులతో పాటు ప్రచార బాధ్యతను పంచుకున్న మంత్రైనా తన మాట నిజమని నిరూపించుకోవాలనిపించిందేమో! అందుకే వేరే దారిలేక ఆ ఏడుకొండల వెంకన్న సాక్షిగా చెబుతున్నానని మంత్రి ప్రకటించారు. పాపం మంత్రేమి చేస్తాడు ఆ దేవుడిని సాక్ష్యంగా చూపగలడే కానీ, నిరూపించలేరు కదా! అన్ని హామీలు తామే నెరవేరుస్తామని మంత్రి రఘువీరా ఏడుకొండల వాని సాక్షిగా ప్రకటించారు.

విగ్రహాలకు ముసుగులు?

ఎన్నికల్లో పాల్గొనే ఓటరును ప్రభావితం చేసే విగ్రహాలకు ముసుగులేయ్యాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. అలానే అభ్యర్థులు గుర్తుల గురించి ప్రచారం చేయరాదని ఆదేశించింది. అదీ పోలింగ్ బూత్ కు వెళ్ళేదారిలో గుర్తులు, విగ్రహాలు కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అవసరమైతే జాతీయనాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకూ ముసుగులు వేయాలని సూచించింది. దీని ప్రకారం అన్ని జిల్లాల్లోనూ నేతల విగ్రహాలకు ఈసి ముసుగులు వేయిస్తోంది. ప్రత్యేకించి తక్కువే అనుకున్నా ఎన్టీఆర్ విగ్రహాలకూ, నెహ్రూ విగ్రహాలకూ కూడా ముసుగులు తొడిగించింది. కడపజిల్లా రాయచోటిలో వై.ఎస్.ఆర్. విగ్రహాలకు అధికారులే దగ్గర ఉండి ముసుగులు తొడిగించారు. ఉప ఎన్నికలు జరుగుతున్నా మొత్తం 12 జిల్లాల్లో అదీ 5413 పోలింగ్ బూత్ లకు సమీపంలో ఉన్న విగ్రహాలకూ ముసుగులు తొడిగించాలని ఈసి అధికారులను ఆదేశించింది.

ఉప ఎన్నికల గెలుపే లక్ష్యంతో అక్రమాల నేపథ్యంలో

ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు అక్రమాల నేపథ్యం వైపు సాగుతున్నారు. వీరి పోకడ ఒకింత ఆన్దోలకరంగా ఉంది. తెలుగువన్.కామ్ గతంలో హెచ్చరించినట్లే అభ్యర్థులు తమ ప్రచారం, పార్టీలపై నమ్మకం వదులుకొని ఓటరల్ను కొనుక్కుంటున్నారు. ముగ్గురున్న కుటుంబానికి రాష్ట్రంలో అత్యధికంగా 15వేల 500రూపాయలు వెలకట్టారంటే ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి అక్రమాలు అందలమెక్కాయనటానికి? కులసంఘాలు, భావన సముదాయాల సంక్షేమ సంఘాలు, సామాజిక సేవాసంస్థలు, కళాకారుల సంక్షేమసంఘాలు, వర్తక సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ లు ఇలా ఒకటేమిటి నియోజకవర్గంలో పదిమంది కలిసే ప్రతిదాన్ని డబ్బు పంపిణీతో తమవైపు తిప్పుకోవటం కోసం అభ్యర్థులు కసరత్తులు చేస్తున్నారు. దీంతో సమాజాన్ని మంచివైపు నడిపించాల్సిన ఉపాధ్యాయసంఘాలు కూడా కొత్తగా ఓట్ల రాజకీయంలోకి వచ్చేశాయి. సమాజానికి బుద్ధులు నేర్పే గురువులు కూడా లొంగిపోయారు. దీంతో నేతలు మరింత రెచ్చిపోయి డబ్బు వెదజల్లి విజయం సాధించాం అని ధైర్యంగా చెప్పుకోగలిగేస్థాయి ఈ ఎన్నికల్లో కుదురుతోంది. ఆధారాల్లేకపొతే మాట్లాడలేని ఈసి సంగతి పక్కన పెడితే అక్రమాలకూ పాల్పదని పార్టీ అనేది లేదు. అయితే ఎక్కువగా ఈ అక్రమాలకూ తెగబడుతున్నది మాత్రం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీనే. మళ్ళీ అనంతపురం జిల్లా రాయదుర్గంలో 16 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు జరిగిందని ఓటర్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మందాదిలో ఓటర్లకు డబ్బు పంచుతూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు దొరికారు. వీరి దగ్గర రూ.50వేలు దొరికాయి. ఇక ప్రకాశంజిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అడిగిందే తడవుగా మందు బాటిల్స్ అందజేస్తూనే ఉన్నారు. తాగుబోతు కదలటానికి వీలులేనంత చీప్ లిక్కర్ ను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరిట అందజేస్తుంది. అంతే కాకుండా ప్రతి ఇంటికీ మాంసం కూడా ఆ పార్టీ పంపించిందని తెలుస్తోంది.

జగన్ అరెస్టు అన్యాయమంటూ సాక్షి బుక్ లెట్ లు?

రాష్ట్రంలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంచేందుకు సాక్షి పత్రిక ముద్రించిన బుక్ లెట్ లు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటుతున్నాయి. అలాగే జగన్ అరెస్టు అక్రమమంటూ ఆర్ధికనేరాలతో ఆయనకేమీ సంబంధం లేదంటూ పలురకాల వ్యాసాలను ఈ బుక్ లెట్ లో భాగంగా ముద్రించారు. ఇంతటితో ఆగకుండా సిబీఐ సోనియా చేతుల్లో విశ్వాసం ఉన్న ఓ ఏజెన్సీగా అభివర్ణిస్తూ పలురకాల వ్యాసాలూ అందులో కనిపిస్తున్నాయి. అందమైన రంగుల్లో కవర్ పేజీ వేసి మరీ ఈ బుక్ లెట్ ను విడుదల చేస్తున్నారు. ఈ బుక్ లెట్ ఈనాడు ముద్రించిన జగన్ ఆస్తుల విలువకు పూర్తి వ్యతిరేకమైన ఆధారాలతో రూపొందించినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి. అయితే ఈ విషయంలో జగన్ కు తగిలిన మరో షాక్ ఏమిటంటే ఈ బుక్ లెట్ లను లక్ష కాపీలు ముద్రించి విడుదల చేసే సమయంలో రాజమండ్రి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకో గమ్మత్తు ఏమిటంటే మరో లక్షన్నర కాపీలు ముద్రణలో ఉన్నాయని తెలుసుకున్న పోలీసుల వాటి కోసం ఎదురుచూస్తున్నారు.

5413 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం

రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలకు 242మంది పార్లమెంటు స్థానానికి 13మంది పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 12 జిల్లాలకు చెందిన 46లక్షల 13వేల 589మంది ఓటర్లు పాల్గొనే అవకాశం ఉంది. వీరి కోసం 5413పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 3200 కేంద్రాలు సమస్యాత్మకమని ఎన్నికల కమీషన్ గుర్తించింది. అంతేకాకుండా ఎన్నికల పేరు చెప్పి నేరాలకు పాల్పడకుండా 3373 ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లెక్కల్లో లేని అక్రమసొమ్ము 42కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. రూ 12.72 కోట్ల విలువైన బంగారాన్ని, లక్షా 92వేల 647లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. 3390 బెల్టుషాపులను ఎక్సైజ్ సిబ్బంది మూయించారు. 12 జిల్లాల్లోనూ మద్యం డ్రైడేలను ప్రకటించి మంగళవారం సాయంత్రం ఐదుగంటల వరకూ మద్యం దుకాణాల మూసివేతకు ఎక్సైజ్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 10,746మంది నేరగాళ్ళపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నుంచి పోలింగ్ కేంద్రాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతవాతావరణంలో ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయగలిగామని ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి భాన్వర్ లాల్ తెలిపారు. అక్రమాలకూ పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మొత్తం 50వేల మంది పోలింగ్ సిబ్బంది పటిష్టవంతమైన ఈ ఉప ఎన్నికల్లో పాల్గొంటారని తెలిపారు. ఓటర్లు స్వచ్చందంగా ఓటెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

బిజెపికి గెలుపు ఆరాటం!

పరకాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి ఆరాటపడుతోంది. ఈ ఆరాటంలోనే నేతలు చేసే ప్రసంగాలు బిజెపి మాత్రమే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం తెస్తుందన్నట్లుగా అర్థం వస్తోంది. ఇదే బాణీలో బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్ చేసిన ప్రసంగమూ సాగింది. టిఆర్ ఎస్ ఎం తెస్తుందీ? అని ఆమె వేసిన ప్రశ్న ఓటర్లను ముందు గందరగోళానికి గురి చేసింది. మేము మాత్రమే తెలంగాణా తేగాలమన్నారు. అందుకే ఓటర్లందరూ పాలమూరు విజయాన్ని పరకాలలోనూ రిపీట్ చేయాలని కోరారు. ప్రభుత్వాలపై విమర్శలకన్నా ఆమె ఓట్లు అడగటానికే తన ప్రసంగంలోనూ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే బిజెపికి పరకాల ఎన్నికల్లో విజయం అందిస్తే తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం తెచ్చేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.

నలుగురు బోసులు, ఇద్దరు త్రిమూర్తులు రామచంద్రాపురంలో పోటీ?

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల చీలిక కోసం మారుపేరున్న అభ్యర్థులను రంగంలోకి దించారు. ఈ అసెంబ్లీ స్థానం నుంచి మొత్తం 16మంది పోటీ చేస్తున్నారు. అందులో నలుగురు సుభాష్ చంద్రబోష్ లు, ఇద్దరు త్రిమూర్తులు రంగంలో ఉన్నారు. రామచంద్రరావులు కూడా ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఈ మూడు పేర్లు ప్రధానపార్టీల అభ్యర్థులతో మ్యాచ్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున తోట త్రిమూర్తులు, తెలుగుదేశం పార్టీ తరుపున చిక్కాల రామచంద్రారావు, వై.కా.పా అభ్యర్థిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ రంగంలో ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లు కలిసిన వారిని వెదికి మరీ అభ్యర్థులే తన ప్రత్యర్థులను ఓడించేందుకు రంగంలోకి దించారు. అభ్యర్థుల ఈ చీలిక రాజకీయం వల్ల ఓట్లు ఎవరు నష్టపోతారనేది ఎన్నికల ఫలితాల్లోనే తేలాలి.

ఉప ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుల పోటీ!

గుంటూరు జిల్లా ఓటర్లకు శుభవార్త. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్ని ఎన్నికలు వచ్చినా గుంటూరు జిల్లా నుంచి మాత్రం ఉన్నత విద్యావంతులు పోటీ చేయలేదు. తొలిసారి ఈ జిల్లా నుంచి ఉన్నతవిద్య చదువుకున్న ఇద్దరు అభ్యర్థులు రంగలో ఉన్నారు. వీరిలో ఎంబిఎ చదివిన సుధాకరబాబు ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలానే కంప్యూటర్స్ లో బిఇ చేసి అమెరికాలో బాగా గడించిన చిరుమామిళ్ల మధు మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఉన్నతవిద్యావంతులు ఈ ఎన్నికల రంగలో ఉంటే వారిని గెలిపించుకుని సేవలందుకునేందుకు ఓటర్లు సిద్ధంగా ఉండాలి మరి. లేకపోతే ఓటరు తీర్పు వీరికి వ్యతిరేకమైతే మళ్లీ ఈ అభ్యర్థులు తమ రంగాలకు వెనక్కి వెళ్లి పోయే అవకాశాలున్నాయి. దీన్ని గమనించిన ఆ రెండు నియోజకవర్గ ఓటర్లు ఎటువంటి తీర్పు ఇస్తారోనని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు.