పరకాలలొ పచ్చనోట్ల రాజకీయం?

పరకాల అసెంబ్లీ నోయోజకవర్గంలో పచ్చనోట్లు రాజకీయాంశమవుతున్నాయి. ప్రచార ఘట్టం చివరికి వచ్చేస్తున్నందున అభ్యర్థులు తమ గెలుపు ఖాయం చేసుకునేందుకు పచ్చనోట్లతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. అయితే విషయం వెలుగులోకి వస్తే మాత్రం ఆ నోట్లకూ తమకూ ఏమాత్రం సంబంధంలేదని చేతులెత్తేస్తున్నారు. తాజామాజీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై ఈ పచ్చనోట్ల పంపిణీ ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఆమె కరపత్రంతో పాటు 500రూపాయల నోటు ఓటరుకు ఇచ్చిందని మీడియా కోడైకూసింది. విషయం వెలుగులోకి వచ్చాక ఆమె మీడియా ముందుకువచ్చి తానంటే గిట్టని టి.ఆర్.ఎస్. నేతలే ఇటువంటి తప్పుడుపనులు చేస్తున్నారన్నారు. తాను నోటు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అడ్డదారుల్లో గెలవటానికి టి.ఆర్.ఎస్. తాపత్రయపడుతోందని, తానైతే ఒక్క కరపత్రం మాత్రమే ఇచ్చానని అంటున్నారు. 15రోజుల క్రితం కూడా వుద్దురాలిని తాను ఓటడిగితే దాన్ని తప్పుడు ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సురేఖ మాటలు నమ్మొద్దని, ఆమెను అనర్హురాలిగా ఎన్నికల కమీషన్ ప్రకటించాలని టి.ఆర్.ఎస్. కోరుతోంది.

పోలవరంలో ద్విముఖ పోటీ?

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజాగావర్గంలో త్రిముఖపోటీ నెలకొంది. ప్రధానపోటీ మాత్రం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల మధ్య ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తెల్లం రామరాజు, తెలుగుదేశం పార్టీ తరుపున మొడియం శ్రీనివాసు, కాంగ్రెస్ తరుపున నూపా పార్వతి పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో లక్షా 72వేల 187మంది ఓటర్లున్నారు. కొత్తగా ఏడు వేల పైచిలుకు ఓట్లు పెరిగాయి. ఈసారి రంగంలో ఉన్న ముగ్గురిలోనూ రామరాజు సీనియర్. తనకున్న అనుభవంతో ఓట్లను మలుచుకోగలరని పరిశీలకులు అంచనా వేశారు. ఈయన తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనల వల్ల నియోజకవర్గంలో ఆ పార్టీకి మద్దతు పెరిగింది. దీంతో అభ్యర్థి మొడియం శ్రీనివాస్ కు రామరాజుతో పోటీపడే అవకాశాలున్నాయి. శ్రీనివాస్ తమ పార్టీ అధినేత పర్యటనలతో పాటు సీనియర్ కార్యకర్తలను సమీకరించుకుని ప్రచారాలు చేస్తున్నారు. ఇది కూడా సత్ఫలితాలు ఇవ్వవచ్చని దేశం ధీమాగా ఉంది. అయితే రాజకీయాలకే కొత్త అయిన నూపా పార్వతికి కాంగ్రెస్ అవకాశమిచ్చింది. అసలు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేని ఆమె కాంగ్రెస్ నేతల ప్రచారంపైనా, సీనియర్ కార్యకర్తల సలహాలపైన ఆధారపడ్డారు. దీంతో ఆమెకు విజయావకాశాలు తక్కువని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. పేరుకే నియోజకవర్గంలో మూడు ప్రధానపార్టీలు ఉన్నా పోటీ మాత్రం తెలుగుదేశంపార్టీ, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఉంటుందని అంచనా.

హీరో బాలకృష్ణ ఇంట్లో దొంగలు,15లక్షల నగలు చోరీ

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో దొంగలు పడి 15 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ ఇంట్లో స్వల్ప మరమ్మతులు నిర్వహిస్తుండటంతో ఆయన తోడల్లుడు ఎంఆర్‌వీ ప్రసాద్ ఈనెల 6న బాలయ్య ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న ఆభరణాలు కనపడకపోవటంతో విషయం గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులు లకు పిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, పిల్లలు విదేశీ యాత్రలో ఉన్నారు. చోరీకి గురైన ఆభరణాల్లో బంగారు వడ్డాణం, రూబీ డైమండ్ నెక్లెస్, డైమండ్ నెక్లెస్, రెండు జతల డైమండ్ చెవి రింగులు, బ్రాస్‌లెట్, ఒమేగా వాచ్, డైమండ్ బ్రాస్‌లెట్ ఉన్నట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందని అంచనా వేశా రు. గుర్తు తెలియని వ్యక్తులు లేదా పనిమనుషులు దొంగతనానికి పాల్పడి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని డాగ్ స్వ్కాడ్, ఫింగర్ ప్రింట్స్ సిబ్బంది ద్వారా ఆధారాలు సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నర్సాపురంలో వెనుకబడ్డ తెలుగుదేశం

పశ్చిమ గోదావరి వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యకేంద్రంగా విరాజిల్లుతున్న నర్సాపురంలో ప్రధానంగా ద్విముఖపోటీ ఉంటుందని పరిశీలకులు అంచనాకు వచ్చారు. కాంగ్రెస్, వై,ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు రెండూ 2012 ఉప ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు పోటీ పడతాయని వారు తేల్చిచెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తపల్లి సుబ్బారాయుడు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ఎం.ఎన్.వి.ప్రసాదరాజు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓటుబ్యాంకు ఉన్నా ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా స్పందన రాకపోవచ్చని అంచనాలున్నాయి. అయితే గెలిచే అభ్యర్థి మెజార్టీపై తెలుగుదేశం ప్రభావం చూపుతుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం లక్షా 41వేల 834 మంది ఓటర్లున్నారు. కొత్తగా 7 వేలమంది ఓటర్లు పెరిగారు. ఈ నియోజకవర్గం పరిథిలో మొగల్తూరు, నర్సాపురం, భీమవరం (పాక్షికంగా) మండలాలున్నాయి. 1951లో ద్విసభా నియోజకవర్గంలో ఇక్కడ నుంచి పాడెల శ్యామసుందరరావు, భూపతిరాజు లక్ష్మీనరస రాజు గెలుపొందారు. 1955లో గ్రంథి వెంకటరెడ్డి, 1967లో ఎస్.ఆర్.రుద్రరాజు శాసనసభ్యులయ్యారు. 1962, 1972, 197ల్లో పరకాల శేషావతారం విజయం సాధించారు. 1983, 1985ల్లో చేగొండి వెంకట హరి రామజోగయ్య, 1989, 1994, 1999, 2004 ల్లో కొత్తపల్లి సుబ్బారాయుడు విజయం సాధించారు. 2004లో టిడిపి అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు కనగ్రేస్ అభ్యర్థి నాగరాజవరప్రసాదరాజుపై 3518 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సుబ్బారాయుడు 63288 ఓట్లు, వరప్రసాదరాజుకు 59770 ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఎన్.వి.ప్రసాదరాజు, తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడుపై 17500 ఓట్లు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈసారి ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయటంతో కాంగెస్ అభ్యర్థిగా కొత్తపల్లి సుబ్బారాయుడు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ లోనే ఉన్న ప్రసాదరాజు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కు మారారు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ జరుగుతోంది. కాంగ్రెస్ తరుపున ఇటీవల నియోజకవర్గంలో ప్రచారం చేసిన సిఎం, కాంగ్రెస్ పెద్దలు ప్రసాదరాజును విమర్శించటంతో ఆయన సుబ్బారాయుడుపై ఏమైనా సరే గెలుపొందాలని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. సుబ్బారాయుడు కూడా ప్రసాదరాజును చిత్తూ చేసి గతంలో ఆయన సాధించిన మెజార్టీని దాటాలని కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. దీంతో పార్టీలమధ్య పోరు కాస్తా వ్యక్తిగత పట్టుదలగా మారింది. కార్యకర్తలు దీన్ని సానుకూలంగా మలుచుకుంటున్నారు. 

కేసీఆర్ పై కన్నెర్ర చేసిన ఓయూ విద్యార్థులు

నువ్వు తెలంగాణా రావాలని కోరుకుంటున్నావా? అయితే కారు గుర్తుపై బటన్ దబాయిస్తానని ప్రమాణం చెయ్! అంటూ టి.ఆర్.ఎస్. అధినేత కేసీఆర్ ఓటర్లపై ఒత్తిడి చేస్తున్నారు. సహజంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఓటరుతో ప్రయాణం చేయించటం అమానుషమైన చర్య అని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)విద్యార్థులు కేసీఆర్ పై కన్నెర్ర చేశారు. పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో కేసీఆర్ తంతును విద్యార్థులు ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి భాన్వర్ లార్ దృష్టికి తీసుకెళ్ళారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయటం తెలంగాణావాదుల హక్కు అయితే ఓటు తమకు నచ్చిన వారికి వేయటం కూడా హక్కేనని విద్యార్థులు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదులో విచిత్రమేమిటంటే ఇప్పటి దాకా టి.ఆర్.ఎస్. వెనుక ఉండి నడిచిన విద్యార్థులు ఎన్నికల సమయంలో తమ గళం విప్పటం. అదీ కేసీఆర్ రెచ్చగొడితే రెచ్చిపోయిన గతాన్ని మరచిపోవటం. పోనీ ఈ అనుభవంతోనైనా విద్యార్థులు రాజకీయనాయకులకు దూరంగా ఉంటే నాడు యువకుల ఆత్మహత్యల గతం పునరావృత్తం కాదని మానవతావాదులు కోరుకుంటున్నారు. విద్యార్థులూ కళ్ళు తెరిచి తప్పును ఎత్తి చూపాలని ఫిర్యాదు చేసిన ఓయూ విద్యార్థులను అభినందిస్తున్నారు. నీతిబాహ్యమైన రాజకీయాలకు దూరంగా ఉండి ప్రగతిరథచక్రాలుగా విద్యార్థులు ఎదగాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఎన్నికల కమీషన్ కూడా విద్యార్థుల స్ఫూర్తిని అభినందించింది.

విథి నిర్వహణలో వెనుకబడ్డ ఈసి?

రాష్ట్ర ఎన్నికల కమీషన్ (ఈసి) తన విధినిర్వహణలో వెనుకబడింది. ఇది ఒకరిమాట కాదు. ఎన్నికల కమీషన్ విడుద్కాల చేసిన గణాంకాలే ఈ విధయాన్ని చాటుతున్నాయి. హైటెక్ స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు చేయటంలో సఫలీకృతమైన ఈసి ఫిర్యాదుల విషయంలో నత్తకు నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. అంతేకాకుండా నియోజకవర్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసేందుకు ఆదేశించిన ఈసి వాటి పర్యవేక్షణలో ఉదాసీనత ప్రదర్శించింది. లేకపోతే అభ్యర్థులు లోపాయికారిగా చేసే ఎన్నికల ఖర్చుతో పోలిస్తే చెక్ పోస్టుల ద్వారా కేవలం 25 శాతం మాత్రమే రాబట్టగలిగింది. అంటే, రూ. 5కోట్ల లోపే లెక్కల్లోకి రాణి డబ్బును పోలీసులు పట్టుకుంటే అది తమ ఘనతగా చాటుకుంది. ఈసి కేవలం చెక్ పోస్టులు ఏర్పాటు చేయమని మాత్రమే ఆదేశాలిచ్చింది. దాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించి ఉంటే అభ్యర్థులు చేసే ఖర్చులో 50శాతమైనా (రూ.100కోట్లు) లెక్కల్లో చూపని డబ్బు ప్రభుత్వానికి చేరేదని విశ్లేషకులు తేలుస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఫిర్యాదులు చేసిన పార్టీగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఆ పార్టీ నాయకులు దాదాపు 98 ఫిర్యాదులు చేశారు. వీరి తరువాతి స్థానంలో తెలుగుదేశం ఉంది. దేశం 45 ఫిర్యాదులు, అధికార కాంగ్రెస్ 13 ఫిర్యాదులు చేశాయి. ఫిర్యాదుల పరిష్కారంలోనూ ఈసి ఎక్కువగా  చొరవ చూపలేదు. వై.ఎస్.ఆర్. కాంగెస్ ఫిర్యాదుల్లో 48, తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుల్లో 21, కాంగ్రెస్ ఫిర్యాదుల్లో 8 పరిష్కరించింది. మొత్తం 275 ఫిర్యాదులు వస్తే వాటిలో కేవలం 117 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. మొత్తం 149 జిల్లాల నుంచి తమకు సమాచారం అందలేనందున ఏమీ చేయలేకపోయామని ఈసి చేతులు కూడా ఎత్తేసింది.  9 కేసులు కేంద్ర ఎన్నికల సంఘంలో పెండింగ్ ఉన్నాయని గట్టిగా చెబుతోంది. ఇటీవల మహిళలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో బంగారం పంపిణీకి అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. బంగారం కొనుగోళ్ళు దాదాపు 50కోట్ల రూపాయల పైచిలుకే ఉంటుందని వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్నా 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం నుంచి బంగారం రికవరీ రూ.12కోట్లు ఉంటుందని అంచనా. ఈసి ఆదేశాల మేరకు పోలీసులతో పాటు ఆదాయపన్ను శాఖ చురుకుగా వ్యవహరించిందని కితాబులు వినిపిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో కీలకవ్యక్తులు, జాతీయనేతలు, మంత్రులు ఉపన్యాసం చేసిన వారం తరువాతే నోటీసు అందజేసిన ఘనత మన రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు దక్కింది.

జగన్ ఆస్తుల కేసు: సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

జగన్ కు విధించిన ఐదు రోజుల సీబీఐ కస్టడీ నేటితో ముగియడంతో, మరో మూడు రోజులు కస్టడీ పోడగించాలంటు లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఐదు రోజుల కస్టడీలో జగన్ సహకరించలేదంటు, పలు కీలక అంశాలపైన జగన్ సమాధానం చెప్పలేదంటు సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. మరో మూడు రోజులు కస్టడీకి జగన్ ను ఇస్తే కొంత ఉపయోగం ఉంటుదని సీబీఐ చెప్పింది. రేపు హైకోర్టులో సిబిఐ మరోసారి పిటిషన్‌ దాఖలు చేయనుంది. ఉప ఎన్నికల సందర్భంగా తన వాణిని వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టులో జగన్ బుధవారం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ఇరువైపుల వాదనలను విన్న కోర్టు విచారణను 21వ తేదికి వాయిదా వేసింది. పూర్తి వివరాలతో రెండు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఉప ఎన్నికలు ఈ నెల 12వ తేదిన ముగుస్తున్నాయి. 10వ తేదినే ప్రచారం ముగుస్తుడడంతో, ఇది జగన్‌కు నిరాశ కలిగించే అంశమేనని అంటున్నారు.

పశ్చిమగోదావరి నియోజకవర్గాల్లో 'సారా' ప్రవాహం

ఒకప్పుడు రాజమండ్రి కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లాకు నాటుసారా తరలివెళ్లేది. ఇప్పుడు నర్సాపురం, పోలవరం ఉప ఎన్నికల పుణ్యమా అని నేరుగా నియోజకవర్గాల్లోనే సారా కేంద్రాలు వెలుస్తున్నాయి. రెడీమేడ్ గా దొరికే పులిసిన బెల్లం ఊటను కొనుగోలు చేసి మరీ సారా కాస్తున్నారని తెలుస్తోంది. ఈ నల్లబెల్లం ఊటను తూర్పుగోదావరి సబ్ ప్లాన్ ఏజెన్సీ ఏలేశ్వరం, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల ను౦చి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకూ సుమారు రెండు లక్షల లీటర్లు బెల్లం ఊటను ఎక్సయిజ్ సిబ్బంది ఈ రెండు నియోజకవర్గాల్లో దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. పోలవరం నియోజకవర్గంలో ఓటర్లను ఎక్కువగా సారా ప్రభావితం చేస్తుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ నియోజకవర్గ ఓటరును సారాతో లొంగదీసుకోవాలని అభ్యర్థులు ఉబలాటపడుతున్నారు. అయితే ఇటీవల ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఓటర్ల కోసం నిల్వ ఉంచిన 5వేల మద్యం బాటిళ్లనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంత నిఘా ఉన్నా ఈ రెండు నియోజకవర్గాలకూ సబ్ వేలు ఉన్నాయని భౌగోళిక పరిశీలనలో అర్థం అవుతోంది. అందువల్ల సారా తయారీదార్లు ఈ దారుల్లోనే నల్లబెల్లం ఊటను తెచ్చుకుని సారా కాచేస్తున్నారట. ఈ దారులతో బొత్తిగా పరిచయం లేని సిబ్బంది ఎక్సయిజ్ శాఖలో ఉన్నందు వల్ల ఈ ఉప ఎన్నికలు పుణ్యమా అని ఓటరు సారా నిషాలో మునగటం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మహిళా ఓటర్లకు ముక్కెరలు, చీరలతో ఎర ?

ఉప ఎన్నికల్లో నోటుకు వేసే రోజులు పోయాయి. అందుకే మగువ అందాన్ని పెంచే ముక్కెరతో ఓటు వేయించుకోవాలని ఒంగోలు అభ్యర్థులు తహతహలాడుతున్నారు. మొత్తం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల ఐదువేల 43మంది ఓటర్లున్నారు. వీరిలో 98వేల ముగ్గురు పురుష ఓటర్లు. లక్షా 2వేల 511మంది మహిళలున్నారు. సుమారు నాలుగువేల మంది మహిళలు ఆధిక్యంగా ఉన్న ఈ నియోజకవర్గంలో తీర్పు వారి ఆలోచనలకు అనుగుణంగానే వెలువడుతుంది. అందుకే అభ్యర్థులు మహిళలకు ముచ్చటైన ముక్కెర,  చెవికమ్మలు పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో బంగారం పనివారికి చేతినిండా పని తగులుతోంది. అలానే హోల్ సేల్ గా బంగారం అమ్మే వర్తకులను అభ్యర్థులు మచ్చిక చేసుకుంటున్నారు. తక్కువ ఖరీదులో అద్భుతమైన డిజైన్లను అందించాలని అభ్యర్థులు బంగారు పని వారలను కోరుతున్నారు. చేవికమ్మల్లో లేటెస్ట్ డిజైన్ లను తెప్పించుకుని అభ్యర్థులు తమ ఇంట్లో ఇతర ఆడవారి సాయంతో ఎంపిక చేస్తున్నారు. చెవికమ్మలు,ముక్కెర భరించలేమనుకున్న ఓ అభ్యర్థి సుమారు 75వేల చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా పోటాపోటీగా నియోజకవర్గం ప్రచారంతో పాటు ప్రలోభాల్లోనూ మంచి పేరు గడించింది. ఇక్కడి తెలగుదేశం కార్యాలయంలో లెక్కల్లో చూపని రూ. 14లక్షలు దొరికాయి. ఒక గోదాములో 686 మద్యం (ఓటి) కేసులు దొరికాయి. అలానే ఆటోల్లో గోతాల్లో తరలిస్తున్న మద్యం కూడా ఎక్సయిజ్ శాఖ స్వాధీనం చేసుకుంది.

కాంగ్రెస్ జెండాలను కాల్చి బూడిద చేసిన చిరు అభిమానులు

ఇటీవల అనంతపురం జిల్లాకు ప్రచారానికి వచ్చినప్పుడు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయభాస్కరరెడ్డి పై ఫైర్ అయ్యారు. ఆ సమయంలో మంత్రి శైలజానాథ్ మొదలుకుని మిగిలిన నేతలందరూ చిరంజీవికి క్లాసుపీకారు. ఆయన అసహనం తగ్గక అక్కడ నుంచి ప్రచారం మానుకుని తిరిగివెళ్లిపోయారు. ఈ జిల్లాకు పొరుగున ఉన్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రిలో చిరంజీవి మాదిరిగానే ఆయన అభిమానులూ ఫైర్ అయ్యారు. వీరు అసహనంతో కాంగ్రెస్ జెండాలను కాల్చేసి పూలదండలను మంటల్లో పడేశారు. రోడ్డుషోలో భాగంగా చాగలమర్రి వచ్చిన చిరంజీవి తమను ముత్యాలపాడు బస్సుస్టాండు వద్ద కలవలేదన్న కోపంతోనే అభిమానులు ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. అభిమానులను కాంగ్రెస్ బాధ్యుడు గంగుల ప్రభాకరరెడ్డి శాంతపరిచారు. ఒకసారి చిరంజీవి ఫైర్, తరువాత అభిమానుల ఆగ్రహం చూసిన కాంగ్రెస్ పార్టీకి 'చిరు' తిప్పలు తప్పేలా లేవని పలువురు వ్యాఖ్యానించారు.

చిదంబరం హోంశాఖ పదవికి రాజీనామా చేయాలి: జయ

కేంద్ర హోంశాఖ పదవికి చిదంబరం రాజీనామా చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిమాండ్ చేసింది. మద్రాస్ హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న చిదంబరం కేంద్ర హోంశాఖ పదవి నుంచి వైదొలకపోతే మంత్రివర్గం నుంచి ఆయనను ప్రధాని తప్పించాలన్నారు. చిదంబరం మంత్రివర్గంలో కొనసాగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఆయన మోసపూరితంగా గెలిచారని తాము ముందునుంచి వాదిస్తున్నామని జయలలిత తెలిపారు. 2009 ఎన్నికలలో శివగంగ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చిదంబరం అన్నాడీఎంకే అభ్యర్థి ఆర్ఎస్ రాజా కన్నప్పన్ పై 3354 ఓట్ల స్వల్పమెజారిటీతో గెలిచారు. చిదంబరం ఎన్నికను సవాల్ చేస్తూ కన్నప్పన్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై చిదంబరం వేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు గురువారం తిరస్కరించింది.

ఎస్.ఎం.ఎస్.లతో ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాల్లో జూన్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ అన్ని పార్టీల నేతలు స్వయంగా ఇతర పార్టీలపై నేరుగా బురదజల్లే ప్రయత్నాలు చేశారు. అదీ ప్రచార సమయంలో మాత్రమే. కానీ, కొందరు తెలివైన వ్యక్తులు ఈ ఎస్ ఎంఎస్ లను కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు.ఇలా ప్రచారంలో ఓట్లు అభ్యర్థించటంతో సరిపెట్టకుండా ప్రత్యర్థుల పై ఆరోపణలు గుప్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఫలానా అభ్యర్థికి మీరు ఓటు వేస్తే నియోజకవర్గానికి నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత ఆరోపణలకు టెక్నాలజీని వినియోగించే వారందరిపైనా చర్య తీసుకోవాలని ఇసి నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ఇటీవల గుంటూరులో వెలుగులోకి వచ్చిన ఈ నెగిటీవ్ ప్రచార ఎస్ ఎంఎస్ లపై చర్య తీసుకోవాలని పోలీసులను కోరింది. ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఈ ఎస్ ఎంఎస్ లపై మండిపడి పోలీసులు ఎలాగైనా ఈ కేసును చేధించాలని ఆదేశించారు. కోడ్ ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించొద్దని పోలీసులకు తెలిపారు. దీంతో గుంటూరు జిల్లా ఎస్పీ కూడా స్పందించి ఎవరికైనా ఇటువంటి ఎస్ ఎంఎస్ లు వస్తే తనకు తెలియజేయాలని కోరారు.

అంబటికి చేదు అనుభవం?

వై.కా.పా. నేత అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన అనంతపురం జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గంలోని బొజ్జావారిపల్లెకు వెళ్లినప్పుడు ఈ చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. వై.కా.పా.లోకి చేరతామన్న కార్యకర్తలను చేర్చుకునేందుకు అంబటి రాంబాబు ఈ గ్రామానికి వచ్చారు. ఆయనకు సహాయాకునిగా మాజీ ఎమ్మెల్యే కొరమట్ల వచ్చారు. వీరిద్దరూ వచ్చారని తెలుసుకున్న కొందరు వై.కా.పా. లో చేరారు. ఈ చేరిక జరిగిన ఇంటి బయట కాంగ్రెస్ కార్యకర్త్జలుగుంపులు గుంపులుగా చేరారు. ఇదేమిటీ అని అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే ఆశ్చర్యపోయే లోపే వారు అంబటి తదితరులను ముట్టడించటానికి సన్నద్ధమయ్యారు. దీంతో వారు ప్రధాన రహదారిని వదిలేసి గత్యంతర లేని స్థితిలో వీరిని కొత్త కార్యకర్తలు దొంగాదారిన తప్పించారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ చేదు అనుభవాన్ని అంబటి మొత్తం మీద దిగమింగారు. అయితే విషయం మాత్రం వెలుగులోకి వచ్చేసింది. రాజకీయంలో ఇదంతా సహజమని అంబటి సరిపెట్టుకుంటారో? కాంగ్రెస్ కార్యకర్తలపై కసి పెంచుకుంటారో? అర్థం కావటం లేదని ఆ పార్టీ నేతలంటున్నారు.

ఉప ఎన్నికలకు నాలుగు వేల మంది విద్యార్థులు సిద్దం

ఈ నెల 12న జరగనున్నఉప ఎన్నికలు హైటెక్ స్థాయిని తలపిస్తున్నాయి. ల్యాప్ టాప్ ల హడావుడితోనూ, లైవ్ టెలీకాస్ట్ లతోనూ ఈ ఎన్నికలు హోరెత్తనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానానికి నిలువుటద్దంలా ఈ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. అక్రమాలకూ తావు ఇవ్వకుండా జాగ్రత్తలను తీసుకున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు నాలుగు వేలమంది ఈ ఉప ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరికి సాంకేతిక సహాయం అందించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుంచి సాంకేతిక నిపుణులు నలుగురిని రాష్ట్రానికి రప్పించింది. వీరితో పాటు హైదరాబాద్ లో ఉన్న మరో ఇద్దరు నిపుణులను కూడా ఎన్నికల కమిషన్ పంపిస్తోంది. నూజివీడు ట్రిపుల్ ఐటి నుంచి 1600మంది, ఆర్కేవాలీ నుంచి 2000మంది, బాసర నుంచి 400మంది ఇంజనీరింగు విద్యార్థులు ఎన్నికలను అంతర్జాలంలో ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు పైన చెప్పిన ఆరుగురు నిపుణులూ నూజివీడు వచ్చారు. ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించటంతో పాటు ఎన్నికల్లో పాల్గొన్నందుకు 500రూపాయలు, మోంటారుకు వెయ్యిరూపాయలు పారితోషికాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పాయకరావుపేట. ఒంగోలు, రామచంద్రపురం, నర్సాపురం, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, కందుకూరు, కావలి ఎన్నికల్లో ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు సేవలందించనున్నారు. అలానే శ్రీకాకుళంలోని 260 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను ఉంచాలని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కోరారు.

జగన్ ను టార్గెట్ చేస్తే వోట్లు రాలతాయా?

పార్టీల ప్రచారానికి కౌంట్ డౌన్ మొదలైంది. కొద్ది రోజుల్లో ఈ ప్రచార పర్వం ముగియనున్నది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీలు తమ ప్రత్యర్థులపై చేసే విమర్శలకు పదును పెట్టాయి. ఒకరిని మించి మరొకరు ఘాటుగా విమర్శించుకుంటున్నారు. నిప్పులు చెరిగే ఎండలో విమర్శల వేడిని ఓటర్లకు చవి చూపుతున్నారు. ప్రత్యర్థుల దగాకోరుతనాన్ని ఎండగట్టడంలో పోటీ పెరిగింది. దిగజారుడు పార్టీల జోలికి వెళ్లొద్దనే హితవాక్యాలు కూడా ఘాటుగానే వినిపిస్తున్నాయి. పార్టీల జాతీయ, రాష్ట్ర నేతలను మూకుమ్మడిగా ప్రచారంలో పాల్గొంటూ విమర్శలను ఎంత పదునుగా వదలచ్చో ద్వితీయశ్రేణికి నేర్పుతున్నారు. నేతల లక్ష్యం (ఒకే పార్టీ అయితే) ఒకటే అయినా వ్యక్తిగతంగా విమర్శించటంలో బాణీలు వేరని చాటుకుంటున్నారు. సిబిఐ విచారణలో ఉన్న వై.కా.పా. అధినేత జగన్మోహనరెడ్డిపై కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టులూ విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ జగన్ ఒక పెద్దటార్గెట్ అయ్యారన్నది వాస్తవం. అలానే ఆ పార్టీకి ఉండే ప్రజాదారణ తగ్గేందుకు విమర్శల్లో కొత్తకోణాలు కూడా వెదుకుతున్నారు. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణా అన్న ప్రాంత బేధం లేకుండా నేతలందరూ జగన్ పార్టీపైనే గురిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ గులాంనబీఆజాద్, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పిసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి జగన్ తో పాటు తెలుగుదేశం పార్టీనీ నమ్మోద్దని గట్టిగా ప్రచారం చేస్తున్నారు.     కాంగ్రెస్ దొంగల పార్టీ అయితే వై.కా.పా. గజదొంగల పార్టీ అంటూ టిడిపి అధినేత చంద్రబాబు తన ప్రచారంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే బాబు ఆవేశమంతా ముఖం, కళ్లలో కనపడుతుందని, రెప్ప కిందకి వాల్చకుండా ఎంత ఘాటైన పదాలనైనా వదలగలడన్నవిమర్శలకు అభిప్రాయాన్ని ఆయన నిజం చేసేందుకు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన తన ప్రసంగంలో పరిటాల రవి హత్య కేసులో జగన్ కుట్రదారుడని ఆరోపించారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాల్లో 48మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. మంత్రి రఘువీరారెడ్డి ఉత్త అబద్దాల కోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పార్టీ తరుపున ప్రచారం చేస్తున్న సినీనటి కవిత అయితే చిరంజీవిని మెగారౌడీగా అభివర్ణించారు. ఇక వై.కా.పా. తరుపున ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆ పార్టీ నాయకులు భూమా శోభానాగిరెడ్డి, కొండాసురేఖ తదితరులు కాంగ్రెసును ఘాటుగా విమర్శిస్తున్నారు. సినీనటి రోజా తిరుపతి నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా దగ్గరుండి మరీ తమ పార్టీ అధినేత జగన్ ను అరెస్టు చేయించారని ఆరోపించారు. తన ఆరోపణలకు ఆధారాలున్నాయంటూ ఓటర్ల ముందు హావభావాలను వ్యక్తీకరిస్తున్నారు. ఇలా పార్టీలు విమర్శల్లో ఘాటు పెంచి ప్రచారానికి ఉన్న కౌంట్ డౌన్ ను లెక్కించుకుంటూ తమ నేతలను నియోజకవర్గాలకు రప్పించుకుంటున్నారు. ఇప్పటికే 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు రౌండ్లు తిరిగిన టిడిపి అధినేత చంద్రబాబు మూడో రౌండ్ కు, అలానే కాంగ్రెస్ నేతలు కూడా మరో రౌండ్ ప్రచారానికి సిద్ధమయ్యారు.

రామ్ చరణ్ పెళ్ళికి హాజరుకానున్న రాహుల్, సోనియాగాంధీ

జూన్ 14న జరిగే రామ్ చరణ్, ఉపాసనల పెళ్ళికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హాజరుకానున్నారని సమాచారం. రామ్ చరణ్, ఉపాసనల పెళ్ళి మొయినాబాద్ లోని ఉపాసనల ఫార్మ్ హౌస్ లో జరగను౦ది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఇంట పెళ్ళి సందడీ మొదలైంది. ఇప్పటికే పెళ్ళికి రానున్న అతిథులందరినీ ఆహ్వానించారు. కామినేని, మెగా మ్యారేజ్ కు అన్ని ఏర్పాట్లు తొందరగా సాగుతున్నాయి. రామ్ చరణ్ పెళ్ళికి పదిహేను రోజుల ముందుగానే తన సినిమాల షూటింగ్ కి సెలవు తీసుకున్నారు. తన హనీమూన్ అయ్యేంత వరుకు రామ్ చరణ్ సినిమాలకు దూరంగా ఉండనున్నారు. ఉపాసన తాజాగా కరీంనగర్ జిల్లా వేములవాడలోని రాజన్న దర్శనం చేసుకున్నారు. పెళ్ళికి ముందు రాజన్న దర్శనం చేసుకోవటం కామినేని ఫ్యామిలీ ఆచారం. అత్యంత వైభవంగా జరగనున్న రామ్ చరణ్, ఉపాసన పెళ్ళికి దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

పెంచడానికి లేని నిబంధనలు,తగ్గించడానికి ఎందుకు?

పెట్రోల్ ధరలను కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సాహంగా పెంచినప్పటికీ సమయంలో అడ్డురాని ఎన్నికల నిబంధనలు తగ్గించడానికి ఏ విధంగా అడ్డువస్తాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చమురు కంపెనీలు పెంచిన ధరలో రెండు రూపాయలు తగ్గించడానికి ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతం పన్ను తగ్గించుకోవడం ద్వారా మరో 1.30 పైసలు తగ్గించడానికి ముందుకు వచ్చింది. ఈ స్థితిలో పెట్రోల్ ధర 3నుంచి 3.50రూపాయల వరకు తగ్గే అవకాశం వుంది. కాని ఎన్నికల నియమావళి అమల్లో వున్నందున ధర తగ్గించడానికి వీలులేదని ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు కేంద్రం లీటరుకు 2రూపాయలు తగ్గించింది. కాని రాష్ట్రప్రభుత్వం మాత్రం ఇంకా పన్ను తగ్గించలేదు. 15వ తేదీ వరకు ఎన్నికల నియమావళి అమల్లో వుంటుంది..అంటే జూన్ 15 తేదీ వరకూ ధరలు తగ్గించడం సాధ్యం కాదు. ఈ వ్యవధిలో ప్రజలు పెంచిన ధరల ప్రకారమే పెట్రోలు కొనుగోలు చేయాలి. అసలు ఉప ఎన్నికలే దండగమారి వ్యవహారం అని భావిస్తున్న ప్రజలు, ధరలు తగ్గించకుండా ఎన్నికల కమీషన్ అడ్డుపడుతున్నందుకు పెట్రోల్ వినియోగించే ప్రతి వ్యక్తి నష్టపోతుంటే, పన్నువసూలు చేసే ప్రభుత్వాలు ఈ 16రోజులలో వందలకోట్ల రూపాయలు లాభం పొందే అవకాశం కలిగింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పన్ను తగ్గిస్తుందా? పెంచిన ధరకు ప్రజలు అలవాటు పడ్డారులే అని వదిలేస్తుందా? చూడాలి.

లగడపాటి దూకుడు !

ఉప ఎన్నికల ప్రచారంలో, జగన్ పై విమర్శలు చేయడంలో విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ తనదైనా శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. జగన్ తల్లి విజయమ్మకు సుద్దులు చెప్పడం మొదలుకొని జగన్ తప్పుచేయలేదని బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పగలరా? అంటూ రోజుకో కొత్త ప్రకటనతో వార్తలలోని వ్యక్తిగా వుంటున్నారు. ఇదే సమయంలో ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఆయన చేస్తున్న యాత్రకు కూడా మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి నేత బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు చిరంజీవిలకు పోటీగా ప్రజలలో గుర్తింపు పొందుతున్నారు. ఈ ఉప ఎన్నికల ద్వారా లగడపాటి కోస్తా ప్రాంతంలో ప్రజా గుర్తింపు పొందిన నాయకునిగా తయారవుతున్నారు. ఈయన ప్రచార శైలి, దూకుడు గమనిస్తే రానున్న రోజులలో రాష్ట్రం రాజకీయాలలో లగడపాటి కీలకపాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి రెండో పర్యాయం లోకసభ సభ్యునిగా ఎన్నికైనా లగడపాటి భవిష్యత్తులో శాసన సభ్యునిగా పోటీచేసి రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర వహించాలనే భావనలో వున్నట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా అయితే పిసిసి అధ్యక్ష పదవి, అధికార పరంగా అయితే ముఖ్యమంత్రి పదవి దృష్టిలో పెట్టుకొని ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నట్టుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సానుభూతి కరిగిపోతోందా?

"జగన్ ను అక్రమంగా అరెస్టు చేశారు" అనే ప్రచారం ద్వారా సానుభూతి పొందాలనే వైకాపా నేతల ఆశ క్రమంగా కరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. జగన్ ఆస్తులకు అక్రమంగా సంపాదించిన విధానం చాలా మంది సామాన్యులకు అర్థం కాలేదు. అవినీతిపై విస్తృతంగా ప్రచారం జరగడం, మీడియాలో వివరంగా జగన్ అక్రమాలపై ప్రచారం జరగడం వల్ల క్రమంగా జగన్ అక్రమాలు సామాన్యులకు కూడా అర్థం అవుతున్నాయి. దీనికి తోడు న్యాయస్థానాలు బెయిల్ తిరస్కరించడం, గాలి జనార్ధనరెడ్డి బెయిల్ నిమిత్తం కూడా కోట్ల రూపాయలు ఖర్చుచేయడం వంటి అంశాలు ప్రజలలో జగన్ పట్ల వున్న సానుభూతి క్రమంగా తగ్గిపోతోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జగన్ కు బెయిల్ రావాలని కోరుకునేవారి కంటే నేడు ఆమాట స్థానంలో జగన్ కు బెయిల్ వస్తుందా? ఎంతకాలం జైలులో వుంటారు? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త సత్యం రామలింగరాజు ఏడాదిన్నర పైగా జైలులో వుండగా, కేంద్రమాజీ మంత్రి రాజా 11నెలల పాటు జైలులో వున్నారు. కనిమోళి 9 నెలల పాటు ఉన్నారు. ఈ స్థితిలో జగన్ ఎంతకాలం వుంటారు అనే అంశంపైచర్చ జరుగుతోంది.