నిజమవుతున్న చంద్రబాబు అనుమానాలు!

కడపనుంచి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఎన్నికైన తరువాత తమ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అనేకమంది హత్యకు గురయ్యారని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఈ ఆరోపణను అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించు కోలేదు. రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత కూడా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నెగ్గితే ఈ పరిస్థితి తప్పదని బాబు అనుమానించారు. ఆయన అనుమానం నిజమైంది. ఉపఎన్నికల ఫలితాల తరువాత ఫ్యాక్షనిస్టులు రెచ్చిపోతున్నారని ఆందోళనలు ఎక్కువయ్యాయి. ప్రత్యేకించి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో దీని ప్రభావం కనిపిస్తోందని తెలుగుదేశం నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. గెలుపు ఆనందంలో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అనంతపురం బత్తలపల్లి మండలంలోని లింగారెడ్డి పల్లిలో రచ్చబండపై కూర్చుని ఉన్న తెలుగుదేశం కార్యకర్త లక్ష్మన్నతో ముందు వాగ్యుద్ధానికి దిగారు. తరువాత ఆయన్ని తీవ్రస్థాయిలో గాయపరిచారు. ఈయన్ని బెంగళూరు ఆసుపత్రికి బంధువులు తరలించేలోపే మార్గమధ్యంలో మరణించారు. ఎన్నికల అంశంపై జరిగిన చర్చకే ఇలా తెగిస్తే ఇంక మామూలుగా మా పరిస్థితి ఏమిటని తెలుగుదేశం కార్యకర్తలు, జిల్లా నేతలు చంద్రబాబు దృష్టికి ఈ సంఘటనను తీసుకువెళ్ళారు. ఆయన ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఆలోచించి సమాధానమిస్తానని తెలిపారని సమాచారం.

త్వరలో మరో పదిఅసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు?

రాష్ట్రంలో మళ్ళీ ఉపఎన్నికలు తప్పవనిపిస్తోంది. 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఈ ఉపఎన్నికల ప్రస్థానానికి ఎమ్మెల్యేలు సిద్ధమవు తున్నారు. ఈసారి ఉపఎన్నికలు కనీసం పదిస్థానాల్లో ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆల్ రెడీ కాంగ్రెస్ నుంచి ముగ్గురు, తెలుగుదేశంపార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాకినాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి, బొబ్బిలి కాంగ్రెస్ అమ్మేల్యే రావువెంకట సుజయ్ కృష్ణ రంగారావు, పార్వతీ పురం ఎమ్మెల్యే సవరపు జయమణి, తెలుగుదేశంపార్టీ నుంచి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని), ఆ పార్టీ నుంచే మరొక ఎమ్మెల్యే కూడా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం జగన్ తో వీరందరూ మంతనాలు జరుపుతున్నారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో గంటన్నరసేపు మాట్లాడిన జగన్ వారికి సమీపంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహపడుతున్న ఎమ్మెల్యేల వివరాలను తెలిపారని సమాచారం.   మొత్తం పదిమంది ఎమ్మెల్యేలతో రెండోసారి ఉపఎన్నికల్లో విజయఢంకా మోగిస్తే ప్రభుత్వమే లొంగివస్తుందని ఎమ్మెల్యేలు కూడా జగన్ తో ఏకీభవించారట. ఈ సమాచారం మరోసారి సానుభూతి ఓట్లకు జగన్ పార్టీ సిద్ధమయింది. మరి తెలుగుదేశం, అధికార కాంగ్రెస్ పార్టీలు ఏమంటాయో మరి. చిత్రంగా కాంగ్రెస్ విప్ తులసిరెడ్డి మాట్లాడుతూ తాము మరోసారి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని విజయమ్మతో సవాల్ చేసే సమయానికే ఆ పార్టీ సిద్ధమైంది. ఆ విషయం ఆయనకు తెలియకుండా జగన్ పార్టీ సిద్ధమా అని విజయమ్మను ప్రశ్నించారు. మరోవైపు అసలు 294 స్థానాలకు ఎన్నికలు పెడితే జగన్ సిఎం అయిపోతారు కదా అన్న ఆలోచనలో కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ, ఈ రెండేళ్ళ సమయాన్ని కాంగ్రెస్ వదులుకోదలచుకోలేదు. ఈ రెండేళ్ళలో గట్టి పునాది వేసుకుని 2014 కల్లా బలమైన పార్టీగా ఎలా తయారవ్వాలనే సమాలోచనల్లో మునిగింది. ఏదేమైనా మరోసారి కనీసం పదిస్థానాల్లో ఉపఎన్నికకు జగన్ పార్టీ సిద్ధమైంది. దీనికి ఎమ్మెల్యేల రాజీనామాలకు రంగం సిద్ధమవుతోంది. ఆ పార్టీ ఉపఎన్నికల ద్వారా తాము బలంగా ఉన్నామని నిరూపించుకునే ఏ అవకాశాన్నీ వదులుకోదలచుకోలేదు. అంతేకాకుండా రాష్ట్రపతి ఎన్నికల గురించి కూడా జగన్ ను సంప్రదిస్తున్న ఈ సమయంలోనే మరోసారి సత్తాచాటుకునే అవకాశాన్ని వదులుకోకూడదని ఆ పార్టీ పెద్దలు నిర్ణయించేశారు. అందుకే ఇప్పటిదాకా రాజీనామా చేద్దామా వద్దా అన్న ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అలానే జాతీయస్థాయికి ఎదిగేందుకు ఇంకో ఎంపి ఉంటే బాగుంటుందని ఎంపి సబ్బం హరి కూడా రాజీనామా చేయాలని జగన్ ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. మళ్ళీ రోజుల్లోనే ఈ రాజీనామాలు తెరపైకి వస్తాయని పరిశీలకులూ భావిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందో ఈ రాజానామాల తరువాతే అర్థమవుతుంది.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 34 మంది షిర్డీ యాత్రికుల మృతి

హైదరాబాదు లక్డిడికాపూల్ నుంచి 50 మంది షిర్డీ యాత్రికులతో బయలుదేరిన కాళేశ్వర ట్రావెల్స్‌కు చెందిన బస్సు శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 34 మంది ఆంధ్రప్రదేశ్ యాత్రికులు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. ఈ బస్సులో ప్రయాణించినవారిలో 14 మంది టిసిఎస్ ఉద్యోగులున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో కొందరి వివరాలు వెల్లడయ్యాయి. మృతుల్లో సుమిత్‌ అశోక్‌, హిందు వెంకటేష్, సుబ్బారావు, జోసెఫ్‌, పూజితలుగా గుర్తించారు.     మిగతా వారిని చంద్రావతి, దీపిక, రంజిత్‌కుమార్‌, సాయిప్రణీద్‌, ఆజమ్మ, సావిత్రి, రాధిక, రామారావు, కిరణ్, సుష్మ, రజిత, గౌతమ్‌, సునిల్‌, ప్రవీణ్‌, సంతోష్‌కుమార్‌ గుప్త, వెంకట్రావు, జ్యోతికుమార్‌, యాదగిరి కిష్టయ్య, ఉమా మహేశ్వరి, దివ్య, వాణీమానస, జయవర్ధన్‌లుగా మహారాష్ట్ర అధికారులు గుర్తించారు. కాగా ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

కాంగ్రెస్ తిరుక్షవరానికి కారణమేంటి?

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిందేమిటీ అన్న అంశం పై జరిగిన చర్చ వాడీవేడిగా సాగుతోంది. ఆ రోజు ఎన్నికల వాతావరణం పరిశీలిస్తే అసలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పని చేస్తున్నట్లే కనిపించిన గల్లా అరుణకుమారి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పార్టీకి కలిసి రాలేదు. ప్రత్యేకించి అరుణకుమారి తన కుమారునికి టిక్కెట్టు ఇవ్వలేదు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎవరకీ ఓటేసినా ఇబ్బంది లేదన్న సంకేతాలను ఆమె తన భర్త అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమలో పని చేసే ఉద్యోగులకు పంపించారు. అదే సమయంలో ఫ్యాక్టరీ బయట ఉద్యోగులను, కార్మికులను వై.కా.పా. కార్యకర్తలు కలిశారు. అరుణకుమారి కుమారుడు జయదేవ్ కు టిక్కెట్టు కూడా ఇవ్వని కాంగ్రెస్ కు మీరు ఓటెయ్యడం అవసరమా అని ఉద్యోగుల ముందు ప్రశ్న లేవదీశారు. దానికి వారు సమాధానం వెదుక్కునేలోపు తమకు ఓటేస్తే కాంగ్రెస్ పై కోపంగా ఉన్న అరుణాకుమారి ఆనందిస్తారని ప్రచారం చేశారు. సమయానుకూలంగా చేసిన ఈ ప్రచారం కూడా ఓటర్లను వై.కా.పా వైపు మళ్లించగలిగింది. అయితే ఇంకో విషయం ఏమిటంటే తన కన్నా సిఎంకు ఎక్కువ పేరు వస్తుందని పెద్దిరెడ్డి తాను ఎటువంటి పిలుపులూ ఇవ్వకుండానే నేతల ముందు ఢాంబికాలతో కాలక్షేపం చేసేశారు. అంతే కాకుండా తన కార్యకర్తలను కొందరిని ఇంటికే పిలిపించుకుని వారి వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికలు పూర్తయ్యే వరకూ బయటకే రాలేదు. చిత్రంగా ఈయన కార్యకర్తలు వై.కా.పా. నాయకులతో చేతులు కలిపి సొమ్ముచేసుకున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు పంచిన సొమ్ము కూడా వై.కా.పా.దని పోలీసుల దాడుల్లో వెల్లడయ్యేటప్పటికే బోలెడు ఆలస్యమైంది.     అభ్యర్థి పరంగా చూస్తే వెంకటరమణ పార్టీ కార్యకర్తలు, నేతలు చెప్పినట్లే నడుచుకున్నారు. సిఎం కిరణ్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిలపై ఆయన భరోసాతో ఉండిపోయారు. సొంతంగా గెలుపుకోసం కొత్తదారులు వెదుక్కోలేదు. ఇక సిఎం విషయానికి వస్తే ఆయన ఢిల్లీ నేతలు మొదలుకుని అందరినీ తిరుపతి తీసుకువచ్చారు. రాజకీయంగా ఎదిగే సమీకరణలకు ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ, అలా వచ్చిన నేతలు ఎంత వరకూ ఉపయోగపడుతున్నారో సమీక్షించలేదు. దీనికి తాజా ఉదాహరణ మున్సిపల్ మాజీ చైర్మన్ శంకరరెడ్డి. ఈయన కాంగ్రెస్ లోకి వచ్చాక కార్యకర్తలు కొందరు తెలుగుదేశంలోనే ఉండిపోయారు. మరికొందరు వై.కా.పా. లోకి మారారు. ఈ విషయాన్ని శంకరరెడ్డి గమనించేటప్పటికి పోలింగ్ దగ్గరపడిపోయింది. ఇక చిరంజీవి విషయానికొస్తే ప్రచారం చేశారు. ఒక్క ప్లానింగ్ కూడా లేకుండా అటు నియోజకవర్గ ప్రజలకు, ఇటు నేతలకు దొరికిపోయారు. పైపెచ్చు పీఆర్పీ మాజీ అధినేతగా ఆ పార్టీ తరుపున పని చేసిన వారందరినీ స్వయంగా కలిసైనా కాంగ్రెస్ లోకి ఆహ్వానించలేదు. నేతలతో పాటు రోడ్డుషో చేశామా, ప్రచారం చేశామా లేదా? అన్నదే చిరంజీవి చూసుకున్నారు. దీంతో ఫలితం లేని పని చేసినట్లు అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడు చావుకున్నన్ని కారణాలు కాంగ్రెస్ ఓటమి వెనుక దాక్కున్నాయి. 

గాలిలోకాల్పులు మన సాంప్రదాయం కాదు

మన చట్టాల ప్రకారం ఆయుధాలు బహిరంగంగా ప్రదర్శించడం నేరం. కాని ఉప ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు లభించిన ఆనందంలో ఆ పార్టీ నాయకుడు, శాసనమండలి మాజీ సభ్యుడు రెహ్మాన్ రెచ్చిపోయారు. జేబులో నుంచి తుపాకీ తీసి గాలిలోకి ఓ నాలుగుసార్లు పేల్చేశారు. తనకు తుపాకీ లైసెన్స్ ఉంది కదా అని పేలిస్తే పోలీసు ఊరుకుంటారా? వెంటనే జూబ్లిహిల్స్ లోని వై.కా.పా. కార్యాలయంలో కాలుమోపారు. రెహ్మాన్ ను అదుపులోకి తీసుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అసలు నాలుగురౌండ్ల కాల్పులు జరపాల్సింత అవసరం ఎందుకు వచ్చిందని కూడా ప్రశ్నించారు. రెహ్మాన్ ను అదుపులోకి తీసుకుంటున్నారని అర్థమై కొందరు కార్యకర్తలు కొంచెం హడావుడి కూడా చేశారు. అయితే పోలీసులు తమను కూడా వేదిస్తారేమో అన్న అనుమానంతో కార్యకర్తలు పోలీసులకు అవకాశమిచ్చారు. దీని తరువాత కార్యకర్తలు మూకుమ్మడిగా చెంచల్ గూడా జైలుకు చేరుకున్నారు. అక్కడ లోపలికి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించి భారీగా మోహరించిన పోలీసులను చూసి వెనక్కితగ్గారు. ఇలా గెలుపు ఆనందం అందరినీ కలవరపెట్టింది. సంబరాల్లో తుపాకులు గాలిలో పేల్చడమనే సంప్రదాయం ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. అక్కడ అక్రమ ఆయుధాలతో ప్రజలు బహిరంగంగానే తిరుగుతుంటారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ జరిపిన సంబరాల్లో అక్రమ ఆయుధాలు ధరించిన సమాజ్ వాదీయులు విచ్చల విడిగా గాలిలో కాల్పులు జరిపారు. కాని అక్కడి పోలీసులు ఇదంతా మామూలేనంటూ కాల్పులు జరిపిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాని మన రాష్ట్రంలో మాత్రం పోలీసులను వెంటనే స్పందించి రెహ్మాన్ ను అరెస్ట్ చేయడం మంచి పరిణామంగా భావిస్తున్నారు.

పిల్లి పరాజయాన్ని ముందే తెలిపిన తెలుగువన్ డాట్ కామ్

అంతా అనుకున్నట్లే అయింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాయంగా 14స్థానాల్లో గెలుపొందుతుందని, మరో స్థానం పెరిగే అవకాశమూ ఆ పార్టీకి ఉందని తెలుగువన్.కామ్ '14స్థానాల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గెలుపు' అనే శీర్షికతో విశ్లేషణ చేసింది. వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ విశ్లేషణకు అనుగుణంగా ఉన్నాయి. అంతే కాకుండా ఈ విశ్లేషణలో చెప్పినట్లే పరకాల అసెంబ్లీ స్థానాన్ని టిఆర్ ఎస్ గెలుపొందింది. ఇదే విశ్లేషణలో డబ్బు, మద్యం ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో కూడా విశదీకరించింది. వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టేలా విశ్లేషణ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రత్యేకించి రామచంద్రపురం అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు గెలిచే అవకాశాలున్నాయని తెలుగువన్.కామ్ 'అభినవ అన్నాకు శృంగభంగం తప్పదా' అన్న శీర్షికతో కూడిన విశ్లేషణలో విశదీకరించింది. ప్రత్యేకించి తాజామాజీ పిల్లి సుభాష్ చంద్రబోష్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసినా సామాజిక కులాల మద్దతు తోటకు ఉందని తెలియజేసింది. ఎన్నికల ఫలితం కూడా ఈ విశ్లేషణకు తగినట్టుగానే ఉంది. ఈ విశ్లేషణలకు మంచి స్పందనా కూడా వచ్చింది. అలానే వై.కా.పా. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ జగన్ ను సిబిఐ అరెస్టు చేశాక ప్రచార బాధ్యతలు చేపడతారనీ, ఆమెకు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఇచ్చిన శిక్షణ వల్ల విజయమ్మ రాల్చే కన్నీటి బొట్లకు సానుభూతి ఓట్లు పడతాయని కూడా తెలుగువన్. కామ్ ముందుగానే చెప్పింది.

సుబ్బిరామిరెడ్డిని మట్టికరిపించిన మేకపాటి

నెల్లూరు లోక్ సభ ఉప ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డి ఘనవిజయం సాధించారు. ఇక్కడ ఆయన తన సమీప ప్రత్యర్ధి, పారిశ్రామికవేత్త అయిన టి.సుబ్బరామిరెడ్డి రెండు లక్షల 91వేల 745 ఓట్ల తేడాతో ఓడించారు. నిజానికి సుబ్బరామిరెడ్డి ఇంత దారుణంగా ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. డబ్బు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టినప్పటికీ, తారలతో ప్రచారం చేయించినప్పటికీ సుబ్బరామిరెడ్డి ఈ నియోజకవర్గంలో పెద్దగా ఓట్లను పొందలేకపోయారు. ఆఖరినిమషంలో బరిలోకి దిగిన సుబ్బరామిరెడ్డి విజయం కోసం తన శాయశక్తులా కృషి చేశారు. విజయం సాధిస్తే ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి లభించే అవకాశాలు ఉండటంతో ఆయన ఖర్చుకు వెనుకాడకుండా ఎన్నికల్లో పాల్గొన్నారు. కానీ, నెల్లూరు ఓటర్లు సుబ్బరామిరెడ్డికి గట్టిషాక్ ఇచ్చారు. ఎన్నికల్లో మేకపాటి రాజమోహనరెడ్డి గెలుపొందటంతో లోక్ సభలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం రెండుకు పెరిగింది. జగన్మోహనరెడ్డి ఇప్పటికే లోక్ సభ అభ్యర్ధిగా ఉన్నారు.   

కాంగ్రెస్ కు ఐదుచోట్ల , దేశంకు రెండు చోట్ల డిపాజిట్లు గల్లంతు

రాష్ట్రంలో 18 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అటు కాంగ్రెస్ కు, ఇటు తెలుగుదేశం పార్టీ తీవ్రనిరాశను మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదుచోట్ల, తెలుగుదేశం పార్టీకి రెండు చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ పార్టీ  అభ్యర్దులు పరకాలలో పాటు అనంతపురం, ప్రత్తిపాడు, మాచర్ల, పోలవరం నియోజకవర్గాల్లో దారుణంగా డిపాజిట్లు కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ  అభ్యర్డులకు నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కలేదు. తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయిన ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్దులు గెలుపొందడం విశేషం.     శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్ధి ధర్మాన కృష్ణదాసు 7,312 ఓట్లు మెజారిటితో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో లక్షా 74 వేల 930 ఓట్లుండగా, ధర్మాన కృష్ణదాసుకు 54,454 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో కృష్ణదాసు గెలుపు ఆయన తమ్ముడు, మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావును గట్టి దెబ్బ తీసినట్లు అయింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్  అభ్యర్దిగా ధర్మాన సోదరుల్లో ఒకరైన రామదాసు పోటీ చేశారు.  ఆయనకు 47,142 ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరంగా సాగిన పరకాల ఎన్నికల్లో టిఅర్ఎస్ అభ్యర్ధి మొలుగూరి భిక్షపతి అతికష్టం మీద తమ సమీప ప్రత్యర్ధి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖపై 1562 ఓట్ల తేడాతో గెలుపొందారు. లక్షా 87 వేల 268 కోట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో భిక్షపతికి 51,936ఓట్లు, సురేఖకు 50,374ఓట్లు వచ్చాయి. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సమ్మారావుకు 5,099ఓట్లు, తెలంగాణా తెచ్చేదీ ఇచ్చేదీ మేమే అంటూ ప్రగల్బాలు పలికిన మరో జాతీయ పార్టీ అయినా బిజెపి అభ్యర్ధి విజయచంద్రారెడ్డికి 9,160ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పరకాలలో ఈ రెండు పార్టీల అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోగా టిడిపి అభ్యర్ధి ధర్మారెడ్డికి ఎవరూ ఊహించని విధంగా 30, 850 ఓట్లు పోలయ్యాయి. ఈ ఫలితాలు టిఆర్ఎస్ కు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. భిక్షపతి మంచి మెజార్టీతో గెలుస్తారని భావించగా, ఆయనకు చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా అయింది. తెలంగాణపై గుత్తాధిపత్యం తమదే అని ప్రకటించుకుంటున్న టిఆర్ఎస్ 51,936 ఓట్లు రాగా, సమైక్యవాదపార్టీలుగా పేరుపొందిన టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు కలిపి సుమారు 86వేల ఓట్లు పోలవడం విశేషం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది తోట త్రిమూర్తులు గెలిచారు. అయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది, పిల్లి సుభాష్ చంద్రబోస్ పై 11,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్, టిడిపిలు కుమక్కు అయినట్టుగా కనిపిస్తోంది. త్రిమూర్తులు 77,298 ఓట్ల సాధించగా, టిడిపి అభ్యర్ది చిక్కాల రామచంద్రరావు కేవలం 6,256 ఓట్లు పొంది డిపాజట్లు కోల్పోయారు. ఇక్కడ బోస్ కు 65,373 ఓట్లు పోలయ్యాయి. తిరుపతి నియోజకవర్గంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది భూమా కరుణాకరరెడ్డి 18,117 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి గెలిచినా చిరంజీవికి 15 వేల ఓట్ల  మెజార్టీ మాత్రమె వచ్చింది. ఈ స్తోత నియోజకవర్గంలో విసృతంగా ప్రచారం చేసిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్సీని విలీనం చేయటం వాళ్ళ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరగాలి. కానీ, అందుకు భిన్నంగా ఓట్లు గణనీయంగా తగ్గటం ఆ పార్టీకి దిగ్బాంతిని కలిగించింది. దీనికి చిరంజీవి వైఖరి కారణమని కొందరు కాంగ్రెస్ నాయుకలు విమర్శిస్తున్నారు. వైయస్ఆర్ జిల్లాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గల్లో ఆ పార్టీ అభ్యర్దులు అమరనాథ్ రెడ్డి 22,768 ఓట్ల మెజార్టీతోనూ, శ్రీనువాసులు 22,148 ఓట్ల మెజార్టీతోనూ, శ్రీకాంత్ రెడ్డి 49 వేల  మెజార్టీతోనూ ఘన విజయం సాధించారు.                   అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి 32,472 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిడిపి అభ్యర్థి దీపక్ రెడ్డికి 46,695ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డికి 32,995ఓట్లు వచ్చాయి. దేశంలోనే అత్యంత ధనిక అభ్యర్ధిగా పేరుపొందిన దీపక్ రెడ్డి ఈ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను వెదజల్లినా దానికి తగ్గట్లుగా ఓట్లను పొందలేకపోయారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి 36,896ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఆమెకు 88,697ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థికి 25,374ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 51,801ఓట్ల పోలయ్యాయి. ఎమ్మిగనూరులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి 20,103ఓట్ల మెజార్టీతోనూ, పోలవరంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం బాలరాజు 35,767ఓట్ల మెజార్టీతోనూ, ఒంగోలు వై.కా.పా. అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ 27,403ఓట్ల తేడాతో గెలుపొందారు.

త్వరలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిన తరువాత టిడిపి నేతలు ఆ పార్టీకి దగ్గరవుతున్నారు. టిడిపి నేత తలసాని శ్రీనివాసయాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన విషయం రాజకీయ వర్గాల వారికి తెలిసిందే. ఆయనతో పాటు టిడిపి శ్రేణుల్లో చాలా మందిని తీసుకురావచ్చని వైకాపా నాయకులు భావిన్నారు. అయితే తాజాగా ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. బిసి వర్గ నాయకుడిగా పేరుగాంచిన తలసాని సికింద్రాబాద్ లో గెలుపుగుర్రమనే చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన తలసాని బలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరం. ఇప్పటికే సికింద్రాబాద్ అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని వైకాపా ఖరారు చేసిందని సమాచారం. టిడిపి కార్యకర్తల బలంతో క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆయన 2014 ఎన్నికల్లో పాగా వేయవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వైకాపా ఎన్నికల ప్రణాళిక మేరకు తలసాని సరితూగుతారని చెబుతున్నారు. కాగా, తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణా జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారతాయి.

జగన్ పై మరింత కఠిన చర్యలు తప్పవా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం గణనీయంగా పెరగడంతో ఎలాగైనా జగన్ ను కట్టడి చేసేందుకు తీహార్ జైలుకు పంపుతారని ఇక్కడి రాజకీయ శ్రేణులు అంచనా వేస్తున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు జగన్ ను అప్పగించి తీహార్ జైలుకు మారిస్తే రాష్ట్రంలో జగన్ ప్రభావాన్ని తగ్గించవచ్చని సీనియర్ నాయకులు అనుకుంటున్నారు. సోనియాను ధిక్కరించిన జగన్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ గా ఉందని, జగన్ మెడలు వంచేందుకు తీహార్ జైలుకు తరలిస్తారని పలువురు నాయకులు పేర్కొంటున్నారు. గతంలో పప్పూయాదవ్ మెడలు వంచిన తీరును గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ కు పెరుగుతున్న పలుకుబడిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతానికి వెనకడుగు వేసినట్లు కనిపించినా ఢిల్లీ మాత్రం పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. జగన్ కాంగ్రెస్ తో రాజీపడే విధంగా ఈ వ్యూహం ఉంటుందని భావిస్తున్నారు. తాత్కాలిక విజయాలు సాధించినా భవిష్యత్ లో జగన్ భారీ నష్టం చవి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా దెబ్బకొట్టే దానికి బదులు ఆర్థిక మూలాలను చేరిపెసేందుకు కాంగ్రెస్ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తున్నది.

మగధీరుడి పెళ్ళి ఖర్చులు రూ.20కోట్లు పైనే?

హైదరాబాద్: పెళ్ళి అంటే ఒక జంట జీవితం ఆరంభించడం దానికి సంఘం ఆమోదముద్ర వేయటం. దానిని బంధువులు మిత్రులతో కలిపి సెలబ్రేట్ చేసుకోవటం. అయితే దాని పరిధిని పెంచి దర్పాన్ని డాబుని ప్రదర్శించడానికి ఇదో సందర్భంగా వినియోగించుకోవటం ఈ మధ్య చూస్తున్నాము. ఎనభైయవ దశకంలో అందర్నీ ఆకర్షించిన అప్పటి కేంద్ర రైల్వే శాఖమంత్రి మాధవరావు సింధియా కుమార్తె వివాహాన్ని గురించి చర్చించాలి. గ్యాలియర్ సంస్థానాధీశుని పుత్రికగా వైభవంగా జరిపించిన తీరు పలువురిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా రైల్వే మంత్రిగా వున్న మాధవరావు సింధియా వెండి రైలుని చేయించి దాని బోగీల్లో విందుభోజనాలను డైనింగ్ టేబిల్ మీద రైలు పట్టాలు మీద తిరిగే విధంగా వుంచటం ఆహుతులకు ఆనందాశ్చర్యాలను ఇచ్చింది. ఆ తరువాత జరిగిన పెళ్ళిళ్ళలో చెప్పుకోదగ్గది జయలలిత పెంపుడు కొడుకు పెళ్ళి. ఇన్విటేషన్లతోపాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ లకు మిగతా మంత్రులకు పంపిన పట్టు చీరలు, బంగారు గిఫ్టులగురించి చెప్పుకున్నారు. ఈ దశకంలో జరిగిన మరోపెళ్ళి స్టీల్ టైకూన్ నవీన్ మిట్టల్ ఇంట జరిగిన వివాహం ఇది పరదేశంలో జరిగినా బాలివుడ్ తారలంతా అక్కడ ప్రత్యక్షమయ్యి ఆహుతులను అలరించారు. పెళ్ళికి హాజరైన అతిధులకు వారి హోదాను బట్టి అందచేసిన బహుమతులు వారికి హుందాతనాన్ని ప్రతిబింభించినా విమర్శలకు తావిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబునాయుని కుమారునికి బాలకృష్ణ కుమార్తెకు జరిగిన పెళ్ళిగురించి అందరూ ముచ్చటించుకున్నారు. ఈ వివాహానికి రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈమధ్యనే జరిగిన కధానాయకుడు అల్లుఅర్జున్ వివాహకార్యక్రమం సినీ ఉద్దండులందరినీ వివాహకార్యక్రమానికి హాజరయ్యేలా చేసింది. దీనిని అభిమానులు తిలకించడానికి గాను టివిలో ప్రత్యక్ష ప్రసారాన్ని చేశారు. ఆ తర్వాత జరిగిన జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళి చెప్పుకోతగ్గది. ఈ పెళ్ళి కూడా వ్యాపారవేత్తలతోను, రాజకీయ నాయకులతోను కళకళలాడింది. ఇదికూడా ప్రత్యక్ష ప్రసారంతో అభిమానులను అలరించింది. నిన్నటి మగమహారాజు కుమారుడు మగధీర వివాహమహోత్సవం భారీ సెట్టింగులతో దేశ విదేశ ప్రత్యేక ప్రతినిధులతో, ఉద్దండ రాజకీయ నాయకులతో వెలిగిపోయింది. చిరంజీవి రాష్ట్ర రాజకీయాలలో తనదైన ప్రత్యేకత చాటుతున్న నేపధ్యంలోనూ అంతకుముందే ఆయనకున్న మెగాస్టార్ ఇమేజ్ నూ దృష్టిలో పెట్టుకొని భారీసెట్టింగులతో ఆర్భాటంగా వివాహవేడుకలు నిర్వహించారు. ఈ వివాహ వేడుకలకు సుమారు 20 కోట్లు ఖర్చుచేసి ఉంటారని అంచనా. ఈ బడాబాబులు వేడుకల ఖర్చు లెక్కపెట్టి ఐటి లెక్కలు కట్టి టాక్సును కట్టించే అధికారులెక్కడా కనిపించడం లేదు. కష్టపడి ఉద్యోగాలు చేసే వారి వద్ద నుంచి గోళ్ళు ఊడగొట్టి మరీ పన్నులు వసూలు చేసే ఇన్ కం టాక్స్ అధికారులకు ఈ సెలబ్రిటీలు వివాహాలకు చేస్తున్న కోట్లాది రూపాయల ఖర్చులు టీ.వీ.ల్లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

కాంగ్రెస్, టి.డి.పిల కొంపముంచిన సెంటిమెంట్

అందరూ ఊహించినట్లే అత్యధిక స్థానాలను గెలుచుకొని వైసిపి తనప్రత్యేకతను చాటుకుంది. అధికారపక్షం, ప్రతిపక్షం విరుచుకుపడ్డా, సీబీఐ, ఎన్ పోర్స్ మెంట్స్ చుక్కలు చూపినా మొక్కవోని ఆత్మస్తర్యంతో తను ఓదార్పు యాత్ర విజయవంతంగా నడిపించి ప్రజల్లో తనదైన ముద్రవేసుకొన్న జగన్ వైయస్సార్ ప్రజల హదయాల్ల్లో ఉన్నారని నిరూపించారు. ఒంటిచేత్తో పార్టీని నడిపిన తీరు కాకలు తీరిన రాజకీయనాయకులకు మింగుడు పడటంలేదు. తన దారి రహదారి అని నిరూపించుకున్న బాలచంద్రుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారు. జగన్, విజయమ్మ వైయస్సార్ మరణంతరువాత వైసిపి నేలకొల్పి కాంగ్రెస్ నుండి బయటపడి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచినప్పుడు ఒక  ప్రముఖ జాతీయ స్థాయి పత్రిక విశ్లేషణలో వైయస్సార్ ఫ్యామిలీని జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలో ఏకాకిని చేసి వేధిస్తున్నారే భావనలో ప్రజలు వుండటం వల్ల కలిగే సింపతీ వల్ల  వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ  అధిక మెజారిటీతో గెలవటానికి కరణముయిందని తెలిపింది. అయినా అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేసి ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిరధమహారదులను పంపికూడా కేవలం రెండు చోట్ల మాత్రమే గెలిచి అబాసుపాలయింది.     వైయస్సార్  బ్రతికి ఉండగా నోరుమెదపని నాయకులు చనిపోయిన తర్వాత ఆయన అధికార దుర్వినియోగాన్ని తూర్పారబట్టటం ప్రస్తుత నాయకుల నైతికతను ప్రజలు సహించలేక పోయారు. పరకాలలో తెలంగాణ  సెంటిమెంటును టీ.ఆర్.యస్ ప్రజలకు నెత్తికెక్కించినా కొండా సురేఖ నేక్ టు నెక్ పోటీ ఇచ్చి ఓడి గెలిచారు. టీ.ఆర్.యస్ కు గాని హరీస్ రావుకి గాని అంతగా అనందం ఇవ్వని గెలుపుగానే దీనిని భావించవచ్చు.     రామచంద్రాపురంలో పిల్లి సుభాస్ చంద్రబోస్ భార్య పై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు అక్కడ  కాపులకు  ఉన్న పట్టు వల్లే ఆయన ఓడిపోవడం జరిగింది గాని అది వైసిపి ఓటమిగా అంగీకరించ వలసిన అవసరం లేదని రాజకీయ అనుభవం, ప్రజల్లో ఉన్న పలుకుబడితో పాటు సమాజిక వర్గ ఓట్లు కూడా పనిచేసాయి.     అవినీతి గురించి అరిచి గోలచేసిన చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కాని రెండు చోట్ల డిపాజిట్ కోల్పోయింది. పదిచోట్ల మాత్రం రెండో స్థానంలో నిలచింది. వాడ వాడ తిరిగిన చంద్రబాబుకు తీవ్ర నిరాశే మిగిలింది. వైసిపి కి ఓటు వేస్తే  అవినీతికి ఓటు వేసినట్లే అన్నా ఎవరూ వినిపించుకోలేదు.  బాబుకు అండగా నిలచిన రెండు పత్రికల పోరాటం కూడా భూడిదలో పోసిన పన్నీరుగా మిగిలింది.  ఏది ఏమైనా ఇదివరకటి కంటే ఎక్కువ శాతం ఓట్లు గెలుచుకున్నందుకు తెలుగుదేశం పార్టీకి కాస్త ఊరట కలిగిస్తుంది. చిరంజీవి ఆర్బాటంగా ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ ఆతర్వాత ఏ సామజిక న్యాయం లేకుండానే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభకు ఎన్నికయి తద్వారా ఖాళీ అయిన తిరుపతి సీటును కూడా గెలిపించుకోలేక పోయారు. చిరంజీవి స్వకుంటుంబానికే తప్ప ప్రజలకు దగ్గర కాలేక పోయారని చెప్పక తప్పదు. పరకాలలో బీరాలు పలికిన బిజెపి నాయకులతో పాటు సుష్మాస్వరాజ్ వచ్సినా ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోవడం కోసమెరుపు.     

ఎన్నికల ఫలితాలు తెలుగువన్ డాట్ కామ్ చెప్పినట్లే వచ్చాయి

రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాలు ఇటీవల తెలుగువన్ డాట్ కామ్ అంచనా వేసిన విధంగానే వచ్చాయి. 18 అసెంబ్లీ ఎన్నికల్లో 14 చోట్ల వై.ఎస్.అర్.కాంగ్రెస్ అభ్యర్దులు గెలుపోందడం ఖాయమని నాలుగుచోట్ల హోరాహోరీ పోటీ ఉంటుందని వీటిలో మరో ఒకటి లేదా రెండు చోట్ల వై.ఎస్.అర్.కాంగ్రెస్  పార్టీ అభ్యర్దులకే చాన్స్క్ష్ ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుగువన్ డాట్ కామ్  పోలింగ్ ముగిసిన వెంటనే తెలిపింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే  వై.ఎస్.అర్.కాంగ్రెస్  పార్టీ అభ్యర్దులు 15 స్థానాల్లో గెలుపొందారు.ఈ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ బాగా పనిచేసిందని, జగన్ పై కాంగ్రెస్,టి.డి.పిలు చేసిన అవినీతి ఆరోపణలు వోటర్లు పట్టించుకోలేదని కూడా తెలుగువన్ డాట్ కామ్ స్పష్టం చేసింది.తెలుగువన్ డాట్ కామ్  అంచనా వేసినట్లు గానే వోటర్లు జగన్ పై అవినీతి ఆరోపణలు పట్టించుకోలేదని తేలింది. తిరుపతిలో చిరంజీవి ప్రభావం పనిచేయదని,వాయిలార్ రవి,గులాం నబీ అజద్ చేసిన ఎన్నికల ప్రచారం వల్ల కాంగ్రెస్ కు ఎటువంటి ప్రయోజనం ఉండదని,నాలుగైదు చోట్ల ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని కూడా  తెలుగువన్ డాట్ కామ్ తెలిపింది.ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఉప ఎన్నికల్లో ఐదు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు డిపాజిట్లు కోల్పోయారు.    నెల్లూరు లోక్ సభ ఉప ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని కూడా  తెలుగువన్ డాట్ కామ్ ముందే అంచనా వేసింది. ఈ అంచనాలకు తగ్గట్టుగానే మేకపాటి సుమారు 2.91 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత  రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమార్పులు ఉంటాయని, త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినా ఆశ్చర్యపోనక్కర లేదని  తెలుగువన్ డాట్ కామ్ అంచనా వేస్తోంది.

షర్మిల, విజయమ్మలదే ఈ విజయం

ఉపఎన్నికల ఫలితాలు ఇటు కాంగ్రెస్ కు, అటు తెలుగుదేశంపార్టీకి తీవ్ర నిరాశకు మిగిల్చాయి, జగన్ ను జైల్లో పెట్టడం ద్వారా ఈ ఎన్నికల్లో లబ్ది పొందవచ్చనుకున్న కాంగ్రెస్ ఆశలపై వై.ఎస్. రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల అడియాశలు చేశారు. జగన్ అరెస్ట్ అయిన వెంటనే వీరిద్దరూ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. విజయమ్మ ఎన్నికల ప్రచారం చేస్తారని కాంగ్రెస్ నాయకులు ముందుగానే ఊహించారు. అయితే ఆమె వెంట షర్మిల కూడా ఉండడంతో వారు ఖంగుతిన్నారు. నిజానికి విజయమ్మ వక్త కాదు. జనాన్ని ఆకట్టుకునే విధంగా ఆమె ఏనాడూ ప్రసంగాలు కానీ, ఎన్నికల ప్రచారం కానీ చేయలేడు. ఆమె ఎన్నికల ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని మొదట కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు అంచనా వేశారు. అయితే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా విజయమ్మకు, షర్మిలకు సుమారు రెండు నెలలపాటు నిపుణులైన ఉపన్యాసకులచే నిత్యం శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణ వారిద్దరికి ఎంతగానో ఉపయోగపడింది. ఎన్నికల ప్రచార మొదటి సభలోనే వీరు ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేశారు. విజయమ్మ ప్రజల సానుభూతిని పొందే విధంగా ప్రసంగాలు చేయగా, షర్మిల ఓటర్లను ఆలోచన రేకెత్తించే విధంగా ప్రచారం చేశారు. తమ కన్నీరును చూసి అవహలన చేస్తున్న వారికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలంటూ చేసిన ప్రసంగాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభించింది. తడబాటు లేకుండా, ఆవేశానికి లోనుకాకుండా వీరు చేసిన ప్రసంగాలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మెజార్టీని మెరుగుపరచడానికి దోహదపడ్డాయి. జగన్ అరెస్ట్ తో డీలా పడ్డ అభ్యర్థులు ఇప్పుడు తమ విజయం షర్మిల, విజయమ్మలదే అంటున్నారు.

త్వరలో తెలంగాణలో విజయమ్మ ఓదార్పు యాత్రలు?

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ త్వరలో తెలంగాణా ప్రాంతంలో ఓదార్పుయాత్ర చేపట్టబోతున్నట్లు తెలిసింది. ఇటీవల ఉపఎన్నికల్లో ఆమె తన కుమార్తె షర్మిలతో కలిసి పరకాలలో ప్రచారం చేశారు. ఈ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఇకపై ఆమెతోనే తెలంగాణా ప్రాంతంలో ఓదార్పుయాత్రలు నిర్వహించాలని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. ఈ ఓదార్పుయాత్రల్లో విజయమ్మతో పాటు ఆమె కుమార్తె షర్మిల కూడా పాల్గొనబోతున్నారు. గతంలో జగన్ తెలంగాణా ప్రాంతంలో ఓదార్పుయాత్రకు బయలుదేరినప్పుడు అక్కడి టి.ఆర్.ఎస్. కార్యకర్తలు, విద్యార్థులు అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఓదార్పుయాత్రాలు చేయటానికి జగన్ ప్రయత్నించలేదు. ఉపఎన్నికల షెడ్యూల్ తర్వాత జగన్ అరెస్ట్ కావడం, పరకాల నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ పోటీ చేస్తుండడంతో ఇటీవల విజయమ్మ, షర్మిల అక్కడ విజయవంతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ స్పందన కూడా బాగానే ఉండడంతో వెంటనే ఆ ఇద్దరితో తెలంగాణలో ఓదార్పు యాత్రలు ప్రారంభించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

కిరణ్ కు పదవీ గండం తప్పదా?

ఉపఎన్నికల ఫలితాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చాయి. ఈ ఎన్నికల్లో కనీసం ఐదారు స్థానాల్లోనైనా గెలుస్తామనే ధీమాతో కిరణ్ తో పాటు కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడమే కాకుండా కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలబడడం, డిపాజిట్లు కోల్పోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ తన సర్వశక్తులను వినియోగించింది. మెరుగైన ఫలితాల కోసం వాయలార్ రవి, గులాంనబీ ఆజాద్ వంటి అతిరథ మహారథులు ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రులందరూ ఎన్నికల బాధ్యతను మోశారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. జగన్ ను రాజకీయంగా పాతర వేయడమనే ఏకైక ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోరాడింది. కిరణ్ కుమారైతే గొంతుచించుకుని మరీ జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ కు ఓటు వేస్తే అవినీతికి ఓటు వేసినట్లేనని ఊరూరా ప్రచారం చేశారు. కొన్ని చోట్ల జగన్ అభ్యర్థులను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ తన చిరకాల ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఎలాగోలా కనీసం ఐదారు స్థానాలు కైవసం చేసుకోవాలన్న కిరణ్ కుమార్ ఎత్తుగడలు విఫలమయ్యాయి. రాజీవ్ యువకిరణాలు, మహిళలకు రుణాలు వంటి సంక్షేమ పథకాలను ఎన్నికల సభల్లో చెప్పినప్పటికీ ఓటర్లు ఆలకించలేదు. దీంతో జగన్ అవినీతిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఈ వ్యూహం కూడా బెడిసికొట్టి ఓటమి పాలవడంతో కిరణ్ అధిష్టానం దృష్టిలో చులకనైపోయారు. జగన్ పార్టీ విఅజయంతో కాంగ్రెస్ లో కుమ్ములాటలు మరింత ముదురుతాయనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ లో కొనసాగితే తమకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదనే అనుమానంతో చాలామంది శాసన సభ్యులు, కొందరు మంత్రులు కూడా ఉన్నారు. వీరిని కంట్రోల్ చేయలేకపోతే కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి ఊడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు జగన్ పంచన చేరితే కిరణ్ సర్కార్ పతనమైపోతుంది. ఎలా చూసినా మరో కొద్ది నెలల్లో కిరణ్ కుమార్ రెడ్డికి పదవీగండం ఖాయంగా కనిపిస్తోంది.

కేంద్ర క్యాబినెట్ లో చిరజీవికి స్థానం లేనట్లే?

ఉప ఎన్నికల ఫలితాలు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజకీయ ఎదుగుదలకు గొడ్డలిపెట్టులా మారాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరమణ గెలిచి ఉంటే చిరంజీవికి క్యాబినెట్ స్థానం లభిస్తుందనే వార్తలు వచ్చాయి. చిరంజీవి 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచే పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం నజరానాగా లభించడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. తన రాజకీయ భవిష్యత్తుతో ముడిపడిన ఎన్నికలను చిరంజీవి కూడా సవాల్ గా తీసుకున్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. జగన్ పై వ్యక్తిగత వైరం లేకపోయినప్పటికీ ఆయన్ని ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ తో పాటు మాజీ పి.ఆర్.పి. శ్రేణులు కూడా కలిసి వస్తే వెంకట రణమ విజయం నల్లేరుపై నడకేనని ఆయన అంచనా వేశారు. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే అధిస్థానం తనకు కేంద్ర క్యాబినెట్ లో చోటు కల్పిస్తుందన్న హామీ వుండడంతో ఆయన రెచ్చిపోయి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పరాజయం పాలవడంతో చిరంజీవి కంగుతిన్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన స్థానంలో తిరిగి తన మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాడనే అపవాదును ఆయన మూతగాట్టుకున్నట్లయింది. ఈ ఓటమితో రాష్ట్ర కాంగ్రెస్ లో చిరంజీవికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది.

లక్ష్యాన్ని ఛేదించిన జగన్, కాంగ్రెస్ గుండెల్లో జగన్ బుల్లెట్

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి జైలులో ఉన్నా కాంగ్రెస్ గుండెల్లో మంటలు రేపాడు. ఉపఎన్నికల్లో అత్యధికస్థానాలు గెలుచుకుని అధికార కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టాడు. సిబీఐ అనే బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ జగన్ పై ప్రయోగించినా అది లక్ష్యాన్ని ఛేదించటంలో విఫలమైంది. దీనికి ప్రతిగా జగన్ సంధించిన సానుభూతి అస్త్రం కాంగ్రెస్ ను కళావికలం చేసింది. నేడు తగిలిన ఈ దెబ్బ రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తులో పెద్దముప్పుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండున్నర నెలల క్రితం తెలుగుదేశంపార్టీ కిరణ్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి మద్దతుగా వై.ఎస్. సానుభూతిపరులైన ఎమ్మెల్యేలు ఓటువేసి అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో రాష్ట్రంలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. జగన్ చేస్తున్న ఓదార్పుయాత్రలకు అనూహ్య స్పందన్ వస్తుండటంతో అటు కాంగ్రెస్, ఇటు టిడిపిలు బెంబేలెత్తాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఎన్నికలను సాకుగా తీసుకుని జగన్ పార్టీని భూస్థాపితం చేయటానికి రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. కాంగ్రెస్ పార్టీ అయితే తన ఆఖరి అస్త్రంగా సిబీఐను ప్రయోగించింది సిబీఐ జగన్ ను జైలులో పెట్టినా ఫ్యానుగాలి జోరు తగ్గకపోగా, విజయమ్మ, షర్మిల రూపంలో పెద్ద తుఫానుగా మారి కాంగ్రెస్, టిడిపిలను కుదిపేసింది. రాజశేఖరరెడ్డి అవినీతికి పాల్పడ్డారని, జగన్ దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడని కాంగ్రెస్, టిడిపిలు ఊరువాడా ప్రచారం చేసినప్పటికీ ఎటువంటి స్పందన కనిపించలేదు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సుమారు 37.03 శాతం ఓట్లు, తెలుగుదేశంపార్టీకి 35.66 శాతం ఓట్లు, ప్రజారాజ్యం పార్టీకి సుమారు 15.6 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావటంతో ఈ ఓట్ల శాతం 51 శాతంకు పెరిగింది. దీనికి తోడు టిడిపికి ఉన్న 35.56 శాతాన్ని కూడా కలిపితే సుమారు 87 శాతం ఓట్లు ఈ మూడు పార్టీలకు వచ్చినట్లు భావించాలి. అయితే 0 స్థాయినుంచి ప్రారంభమైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలను మట్టికరిపించింది. ఒకరకంగా చెప్పాలంటే బైబిల్ కథలోని డేవిడ్ అనే చిన్నకుర్రాడు తన చేతిలోని వడిశేలతో గొలియత్ అనే ఒక భీకరాకురుడిని హతం చేసిన సంఘటన గుర్తుకు వస్తుంది. ఇక్కడ జగన్ అనే జూనియర్ రాజకీయనాయకుడు ఏకంగా ఇద్దరు ప్రత్యర్థులకు ఒకేసారి మట్టికరిపించాడు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలతో పాటు బలమైన మీడియా వర్గాలు కూడా జగన్ కు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించాయి. సోనియాగాంధీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తేసుకుని వాయలార్ రవి, గులాంనబీ ఆజాద్ వంటి సీనియర్లకు ఎన్నికల ప్రచారానికి పంపింది. అలాగే టిడిపి అన్ని చోట్ల ఏరికోరి డబ్బున్నవారికే టిక్కెట్లు కట్టబెట్టింది. ఇక జగన్ ను వ్యతిరేకించే ఎలక్ట్రానిక్ ఛానల్స్, వార్తాపత్రికలు జగన్ అవినీతిపై పుంఖానుపుంఖాలుగా వ్యతిరేక వార్తలు గుప్పించాయి. జగన్ కు ఓటు వేస్తే ప్రజలు అవినీతిని సమర్థించినట్లేనని తీర్మానించాయి. అయినా ఓటర్లు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అవినీతి ఆరోపణలు అందరిపైనా ఉన్నాయంటూ జగన్ కె తమ మద్దతును ప్రకటించారు.

మంత్రి వెంకటరెడ్డికి మద్యం సిండికేట్లలో వాటాలు?

ఖమ్మంజిల్లాకు చెందిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి మద్యం సిండికేట్లతో లావాదేవీలున్నాయని తెలుస్తోంది. ఆయన బంధువులు కూడా సిండికేటు వాటాదారులని వెల్లడైంది. అయితే తన పేరు బయటికి రాకుండా వెంకటరెడ్డి తగిన జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను ఏసీబీ సేకరించిందని వెలుగులోకి వచ్చింది. ఇటీవల లిక్కర్ సిండికేట్ బాలరాజ్ గౌడ్ ను ఎసిబి పిలిపించింది. అప్పుడు తన వాంగ్మూలాన్ని ఇస్తూ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి మద్యం సిండికేట్లతో ఉన్న సమాచారాన్ని కక్కారు. మంత్రి బంధువుల పేర్లు, వారి షాపుల వివరాలు కూడా గౌడ్ వెల్లడించారని తెలిసింది. ఇప్పటికే పలువురు రాజకీయనాయకుల జాబితాలు తోకచాంతాడంత పెరిగిపోయాయనుకుంటే బాలరాజ్ గౌడ్ మరో పెద్ద తిమింగలాన్ని ఎసిబి ముందు పెట్టినట్లు అయింది. అయితే విచారణలో తాను పరారైనప్పుడు జార్ఖండ్ సిఎం, బీహార్ డిజిపి వంటి ప్రముఖుల దగ్గర తలదాచుకున్నానని బాలరాజ్ గౌడ్ చెప్పాడు. అయితే ఎసిబి ఇంకా కొందరి పేర్ల సమాచారం తెలిసినా ప్రకటించలేదనీ, వారు తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదనే గోప్యంగా ఉంచిందనీ బాలరాజ్ గౌడ్ వాంగ్మూలం తరువాత తెలిసింది.