'కోలా' హలం వెనుక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ

టిడిపి ఎంపి టిక్కెట్టు ఇస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన నుంచి రూ.5.10 కోట్లు తీసుకున్నారని యూరోలాటరీ నిందితుడు కోలా కృష్ణమోహన్ చేసిన ఆరోపణల వెనుక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా సాక్షి దిన పత్రిక, సాక్షి టెలివిజన్ ఛానళ్ళు కోలా కృష్ణమోహన్ ఆరోపణలకు విశేష ప్రాధాన్యత నిచ్చాయి. కోలా తన ప్రకటనలో చంద్రబాబు తనను హత్య చేయించడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు. 1998లో తొలిసారి తాను తిరుపతిలో చంద్రబాబును కలిశానన్నారు. అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. చంద్రబాబుకు స్విస్ బ్యాంకులో క్రెడిట్ షూస్ పేరిట అకౌంట్ ఉందన్నారు. అలానే ఆ అకౌంట్ లో 15 వేల డాలర్ల డబ్బు కూడా ఉందని తనకు తెలుసన్నారు. బాబు సూచనల మేరకు ఒకసారి ఆయన కుమారుడు నారాలోకేశ్ కు 25 లక్షల రూపాయలు అందజేశానన్నారు. మొదట కోటి పదిలక్షలు అందజేసిన తాను ఆ తరువాత నాలుగు కోట్ల రూపాయలను లండన్ మిడ్ ల్యాండ్స్ బ్యాంక్ ద్వారా బాబు సింగపూర్ డచ్ బ్యాంక్ అకౌంట్ కు మనీట్రాన్స్ ఫర్ చేశానని వివరించారు. ఇదంతా నిజమేనా అని ప్రశ్నించిన విలేకరులకు ఆ బ్యాంకు ఖాతా సి నాయుడు నారా అన్న పేరిట ఉందన్నారు. దాని నెంబర్ 22486345910 అని చెప్పారు. కోలా తనను బాబు హత్య చేయించే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తాను మీడియాను కలవటానికీ ఇబ్బంది పడ్డానన్నారు.

పరకాలపై ఆశలు వదులుకున్న దేశం?

పరకాల అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ ఆశలు వదులుకుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఒక్కసారి వచ్చి వెళ్లిపోయారు. పార్టీ నేతలైతే తిరగటమే మానేశారు. తెలంగాణాటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు, పిఎసి ఛైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి, రాజ్యసభ సీటు పొందిన గుండుసుధారాణి, మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రచారానికి చివరి రోజున ఎక్కడా కనిపించలేదు. ఎన్నికలు జూన్ 12న అయితే ముందుగానే పార్టీ నేతలు, కార్యకర్తలూ ప్రచారంలో కనిపించలేదు. రాష్ట్రంలోని (పరకాలను మినహాయించి ) 17 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయన్ని పరకాల పర్యటనకు రమ్మని ఇక్కడి నేతలు కోరకపోవటం వారి జాగ్రత్తకు అద్దంపడుతోంది. అలానే ఈ నియోజకవర్గంపై పార్టీకి ఆశలు లేదన్న విషయాన్ని చాటుతోంది.

ఎన్నికల అక్రమాలకు ఈ రెండు రోజులే గడువు?

రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారం గడువు పూర్తయింది. దీంతో ఎన్నికల్లోపు అన్ని పార్టీలూ అక్రమ మార్గాల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. దానికి కూడా రెండు రోజులే గడువు ఉండటంతో ప్రతీ అభ్యర్థి ముందుగానే సిద్ధం చేసుకున్న కార్యక్రమాల్లో మునిగిపోయారు. మద్యం అమ్మకాలకు ఎన్నికలు జరిగే ప్రతీ జిల్లాలోనూ డ్రైడే ప్రకటించారు. ఈ డ్రైడే గురించి ముందుగానే తెలయటంతో అభ్యర్థులు మూడు రోజుల ముందే మద్యం కొనుగోలు చేసి ఓటర్లకు అందుబాటలో సెంటర్లు ఏర్పాటు చేశారు. తనిఖీకి దొరక్కుండా ముందుగా అటకల పైనా, పాన్ షాపుల్లో కూల్ డ్రింక్ ల మధ్యలోనూ మద్యం దాచేశారు. దాన్ని తీసి రాత్రి ఎనిమిది గంటలు దాటినది మొదలు పంపిణీ ప్రారంభించారు. తెల్లవారుజాము వరకూ మందు లేదనకుండా పంపిణీ చేసేందుకూ ప్రధానపార్టీల అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఎక్సయిజ్ శాఖ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లోనూ డ్రైడే పాటిస్తోంది. దీంతో మద్యం దుకాణాలన్నీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మూతపడ్డాయి. మంగళవారం సాయంత్రం దాకా వీటిని తెరవబోమని ఎక్సయిజ్ సిబ్బందే స్వయంగా తాగుబోతులకు చెప్పి పంపించారు. ఎక్సయిజ్ సిబ్బంది ఉన్నంత వరకూ నిబంధనల ప్రకారం నడుచుకున్న మద్యం దుకాణదారులు వారు అలా బయటకు వెళ్లగానే దొంగచాటు అమ్మకాలకు తెరలేపారు. అలానే మద్యం తరువాత డబ్బు పంపిణీ కూడా ప్రారంభమైంది. వీధికి ఒకరికి బాధ్యతలు అప్పగించారు. వారు కూడా మహిళల ద్వారా డబ్బులు అన్ని కుటుంబాలకు ఓట్ల లెక్క ప్రకారం డబ్బు చేరవేస్తున్నారు.  

మాచర్లలో త్రిముఖపోటీ?

గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భంగా మూడు ప్రధానపార్టీల మధ్య పోటీ నెలకొంది. మూడు పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారంలో ముందున్నారు. కాంగ్రెస్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు మధ్య పోటీ దాయాదుల పోరును తలపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి పెన్నెల్లి లక్ష్మారెడ్డి, వై.కా.పా. అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బంధువులు ఒక్కరే కావటం తప్ప మిగతా అన్ని అంశాల్లోనూ పోటాపోటీగా ఉన్నారు. ఇదే అవకాశమని తలచిన టిడిపి అధినేత చంద్రబాబు ఆ దాయాదులను వదిలేసి తమకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తులను బుజ్జగించేందుకు బాబు ప్రచారాన్ని వేదిక చేసుకున్నారు. ఆయన మాచర్ల దుర్తి, కారంపూడిల్లో ఇటీవల పర్యటించారు. దేశం నేతలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, చలమారెడ్డి, మండవరమేష్ రాథోడ్, సుజనాచౌదరి, ఎంపి నామానాగేశ్వరరావు, ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు తదితరులను ప్రచారంలో వేదిక ఎక్కించారు. ఐదు మండలాలకు ఐదుగురు ఇన్ ఛార్జీలను బాబు నియమించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ తదితరులు వచ్చి రోడ్డుషో వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్లను ఆకర్షించేందుకు జగన్ పై సిఎం విమర్శల వర్షం కురిపించారు. వై.కా.పా. అభ్యర్థి రామకృష్ణారెడ్డి తరుపున మూడు రోజులపాటు ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రచారంలో ఈ అంశాన్ని చొప్పించారు. ఈయనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, వంగవీటిరాద ప్రచారంలో సహకరిస్తున్నారు. ఇటీవల విజయమ్మ, షర్మిల రామకృష్ణారెడ్డి తరుపున ప్రచారం చేశారు.

డబ్బు పంపిణీల్లో వై.కా.పా. ముందంజ!

ఎన్నికల అక్రమాల్లో కాంగ్రెస్, టిడిపిల కన్నా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పత్రిక సర్వేల్లో ఈ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని చెప్పినప్పుడు అక్రమాల్లోనూ ఇదే ముందుంటుందని పరిశీలికులు ఎప్పుడో అనుమానించారు. వీరి అంచనాలకు తగ్గట్టే మూడు రోజులు ముందుగానే ఈ పార్టీ డబ్బును పంపిణీ చేసింది. అనంతపురంలోని పాతూరు చెరువుగట్టు కింద, శారదానగర్, ఎర్నాల కొట్టాల్లో వై.కా.పా. నేతలు ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలంలోనే ఓటర్లకు 15.50 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. కడప జిల్లాలోని సిద్ధవటం మండలంలో ఓటరుకు ఐదువందల రూపాయలు చెల్లించారు. నందులూరులోనూ ఓటరుకు ఐదొందల నోట్లు అందాయి. రాయచోటిలో ఓటుకు ఐదొందలు, ఇంటికి వెయ్యిరూపాయలు చొప్పున పంపిణీ జరిగింది. చీప్ లిక్కర్ పంపిణీలో వై.కా.పా. ముందుంది. ఆ పార్టీ అధినేత పర్యటనతో మొదలైన ఈ లిక్కర్ పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బళ్లారి కేంద్రంగా కర్ణాటక నుంచి డబ్బు, మద్యం రప్పించింది వై.కా.పా. అని పోలీసులకు అనుమానాలున్నాయి.

కాపుకాస్తున్న కడపనేతలు?

రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ కడపనేతలు చొచ్చుకువస్తున్నారు. కడప జిల్లాలో ఎన్నికలు జరగని ప్రాంతాల నుంచి వీరిని జట్లుగా ఎంపిక చేసి మరీ పంపించారు. ప్రచారం ముగింపునకు రెండు రోజుల ముందే అన్ని నియోజకవర్గాల్లోనూ మాటేసిన ఈ కడపనేతలు రాత్రిపూట డబ్బు పంపిణీ చేస్తున్నారు. పగలంతా పోలీసుల దృష్టికి దొరకని ప్రాంతాల్లో వీరు గడుపుతున్నారు. రాత్రి పది గంటలు దాటాకా ఓటర్ల జాబితాల ఆధారంగా వెదుక్కుంటూ వెళ్లి మరీ డబ్బు పంపిణీ చేస్తున్నారు. పోలీసుల రాకను తెలుసుకునేందుకు కూడా వీరు ఏర్పాట్లు చేసుకునే పంపిణీ పూర్తి చేస్తున్నారు. ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే పోలీసులకు కొందరిని ఎరగా వేసి వారిని విచారించే లోపు తమ పనిని చాకచక్యంగా చక్కపెట్టుకుంటారు. కడప జిల్లాలోని సిద్దవటంలో ఓటుకు ఐదొందల రూపాయలు చెల్లించారు. నందులూరులోనూ ఇంటింటికి తిరిగి మరీ చెల్లింపులు పూర్తి చేశారు. రాయచోటిలో ఒక పార్టీ ఓటుకు ఐదొందలు ఇస్తే, మరో పార్టీ ఇంటికి వెయ్యి రూపాయలు ఖర్చు చేసింది. ఒక్క కడప జిల్లాలో ఇప్పటి వరకూ ఎన్నికల అక్రమాలకింద ఏడు కోట్ల 82 లక్షల 40 వేల 881 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకుని ఆదాయపన్ను శాఖకు అప్పగించారు. అలానే అనంతపురం జిల్లాలో ఒక్క కణేకల్లులో 15.50 లక్షల రూపాయలు దొరికింది. తిరుపతిలోనూ భారీగానే డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బళ్లారి కేంద్రంగా రాయలసీమలో ఓట్ల కొనుగోళ్లు?

ఇరుగు, పొరుగు రాష్ట్రాల సరిహద్దులను ఓటింగ్ అక్రమాలకు వినియోగించుకుంటున్నారు. రాయలసీమ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్లకు బళ్లారి కేంద్రమైంది. ఇక్కడ నుంచి కొందరు నేతలు చక్రం తిప్పుతున్నారు. బళ్లారిలోని లాడ్జీలు, హోటళ్లలో బస చేస్తే తనిఖీల్లో బయటపడతామని ప్రయివేటు భవనాలు, గెస్ట్ హౌస్ లను ఉపయోగించుకుంటున్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు బళ్లారికి దగ్గరగానే ఉన్నాయి. తక్కువ సమయంలో ఎన్నికలు జరిగే ప్రాంతాలకు చేరుకోవచ్చు. అందువల్ల బళ్లారిలోనే ఉంటూ రాత్రిళ్లు గుట్టుగా అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాలకు కొందరు నేతలు వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని ముందుగానే పసిగట్టే పోలీసుల కన్నుగప్పి ఈ నేతలు నియోజకవర్గాల్లోకి చొచ్చుకువస్తున్నారు. వీరి ప్రధానమైన పని ఓట్లు కొనుగోలు చేయటమే. అందుకే రాత్రి వరకూ వేచి చూసి అప్పుడు తీరిగ్గా రాయదుర్గం, అనంతపురం తదితర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. పంపిణీ పూర్తయ్యాక తిరిగి బళ్లారి వెళ్లిపోతున్నారు. గత నాలుగు రోజులుగా ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వాహనాల రిజిస్ట్రేషన్ పరిశీలిస్తే కర్నాటక రాష్ట్ర ఆమోదంతో అవి నడుస్తున్నాయని అధికారులు గుర్తించారు.

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కార్యాలయంలో కిరణ్ తో కార్యకర్తల సమావేశం!

ఒకప్పుడు అది కాంగ్రెస్ కార్యాలయం. కానీ ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యాలయం. రెండు పార్టీల కార్యాలయంగా రంగులు మార్చుకున్నది మాత్రం ఒక్కటే భవనం. అదీ నర్సాపురంలోని ఇండిపెండెన్స్ మెమోరియల్ భవనం. ఎన్నికల పర్యటనలో భాగంగా ఇక్కడకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి  ఇది తమ కాంగ్రెస్ కార్యాలయం అంటూ సమావేశాన్ని నిర్వహించి ఈ భవన సమస్యను జటిలం చేశారు. దీంతో మండిపడ్డ లీజుదారుడైన నర్సాపురం తాజామాజీ, వై.కా.పా. అభ్యర్థి ప్రసాదరాజు పోలీసులను ఆశ్రయించారు. కాంగ్రెస్ నేతలపై ఆయన పోలీసుకేసు పెట్టారు. ఇప్పుడు రెండు పార్టీలనూ కాదని ఆ కార్యాలయం పోలీసు పహారాలో ఉన్నది. అంతేకాకుండా ఈ భవనం వద్ద 144 సెక్షన్ విధించారు. నర్సాపురంలోని ఇండిపెండెన్స్ మెమోరియల్ భవనాన్ని మడునూరి ప్రసాదరాజు తన కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు. ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. దీంతో ఆ భవనానికి కాంగ్రెస్ గుర్తింపునందుకుంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టినప్పుడు ప్రసాదరాజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. ఆ వెంటనే కాంగ్రెస్ బోర్డు తీసేసి రంగులు మార్చేసి అదే కార్యాలయాన్ని వై.కా.పా. కార్యాలయంగా ప్రసాదరాజు మార్చేశారు. అనంతరం ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల ప్రచారానికి ఇటీవల నర్సాపురం వచ్చిన ముఖ్యమంత్రి తమ కార్యాలయాన్ని వై.కా.పా. కార్యాలయంగా మార్చేశారని పితాని , ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అసలు విషయం తెలుసుకోకుండానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ కార్యాలయానికి వచ్చి పనిలో పనిగా అక్కడే కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం తిరిగి తన ప్రచారంలో భాగంగా మరో ప్రాంతానికి సిఎం వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వై.కా.పా. నేతలు, ప్రసాదరాజుకు సమాచారం ఇచ్చారు. తాను లీజు తీసుకున్న భవనంపై కాంగ్రెస్ పెత్తనమేమిటని ఆగ్రహించిన ప్రసాదరాజు మంత్రి పితాని, ఎమ్మెల్యే కారుమూరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పై దౌర్జన్యం చేసి లీజు తీసుకున్న కార్యాలయాన్ని లాక్కున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి, ఎమ్మెల్యే తనపై కూడా దౌర్జన్యం చేశారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని మరో నాయకుడు పాలపర్తి బోసు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ప్రసాదరాజుకు భవనాన్ని లీజుకు ఇచ్చామని ఇండిపెండెన్స్ బిల్డింగ్ సంఘం ఉపాధ్యక్షుడు పాలంకి ప్రసాద్ స్పష్టం చేశారు.  

300 కోట్లు దాటుతున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు

అభ్యర్థులే పోటీపడి మరీ ఓటుకు విలువను పెంచేస్తున్నారు. అంటే ఓటరు అడిగినంత డబ్బు ఇచ్చేస్తున్నారు. దీంతో నియోజకవర్గానికి 10కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనుకుంటే ఇప్పుడు అది సగటున 18 కోట్ల రూపాయల వరకూ చేరుతోంది. ఒక నియోజకవర్గంలో 16 కోట్ల రూపాయలు, ఇంకో నియోజకవర్గంలో 20కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నారు. దీంతో సగటున నియోజకవర్గానికి 18కోట్ల రూపాయల వరకూ ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ ఖర్చు పెడుతున్నారు. ఒక్క నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి ఎన్నికల పేరిట 6 కోట్ల రూపాయల వ్యయం అవుతోందని తెలుస్తోంది. ఇలా లెక్క వేస్తే 18 శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ఖర్చు 300 కోట్ల రూపాయలు దాటేస్తున్నది. ఒక ఓటుకు అతి తక్కువగా 200 రూపాయలు, పది ఓట్లను కలిగిన ఓ చోటా నేత ఓటుకు నాలుగువేల రూపాయలు వెలకట్టారు. అలానే ఓటుకు వెయ్యి రూపాయలు, చోటా నేతకు పదివేల రూపాయలు కూడా ఖర్చు పెట్టేందుకు వెనుకాడలేదు. ఈ 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే తరహాలో ఓటుకు విలువ కట్టేశారు. అయితే ఒక వెనుకబడిన (రాయదుర్గం తరహా) నియోజకవర్గంలో అభ్యర్థులు తక్కువే ఓట్లున్నా అతి తక్కువగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలా ఖర్చు చేయటంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కన్నా పోలీసులకు ఎక్కువగా దొరికింది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కావటం గమనార్హం. మొదట్లో ప్రచారం చేసినట్లే ఈ పార్టీ తరుపున ఎన్నికల అక్రమాలకు కార్యకర్తలు తెగబడుతున్నారు. పైగా మంచినీళ్ల ప్రాయంలా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రెండు కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పోల్చుకుంటే మద్యం పంపిణీ ఎక్కువయింది. ఎన్నికలు లేని నియోజకవర్గాల నుంచి చీప్ లిక్కర్ ను కేసులకు కేసులు తరలించేస్తున్నారు. హోల్ సేల్ గా దీన్ని కొని అడిగిన వారికల్లా పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకించి ఎస్సీకాలనీల్లోనూ, వెనుకబడిన ప్రాంతాల్లోనూ చీప్ లిక్కర్ ఓటర్లను ప్రభావితం చేస్తోంది. అభ్యర్థులు ఇంత భారీ ఖర్చు చేయటం ఇదే ప్రథమమని ఎన్నికల పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  ఓటర్లల్లో చైతన్యం వస్తే మారుతుందనుకుంటే వెనుకబడిన ప్రాంత ఓటర్లలో ప్రలోభాలు పెరిగాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రలోభాల ఎర నుంచి ఓటరును బయటికి తీసుకురావటం చట్టపరంగా కష్టమంటున్నారు.

రాష్ట్రపతి ఎన్నిక: ప్రణబ్ అభ్యర్ద్వత్వానికి మార్గం సుగమం

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి యూపీఏలోని అధిక భాగస్వామ్య పక్షాలు మద్దతు పలుకుతున్నాయి. దీంతో ప్రణబ్ అభ్యర్ద్వత్వానికి మార్గం సుగమం అయినట్లే అని పలువురు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రణబ్ వైపే మొగ్గు చూపుతోంది. ఈమేరకు ఆర్థిక మంత్రికి మద్దతు ప్రకటించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని బెంగాల్ పీసీసీ కోరింది. ఎన్సీపీ మాత్రం ఏకాభిప్రాయం రావాలని కోరుకుంటోంది. యూపీఏ తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా తాను గౌరవిస్తానని ప్రకటించింది. నమ్మకమైన భాగస్వామ్యపార్టీగా తమ వంతు పాత్రను పోషిస్తామని తెలిపింది.

జగన్ ఆస్తుల కేసు:రెండో దపా సిబిఐ కస్టడి పూర్తి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండో విడత సిబిఐ కస్టడి నేటితో పూర్తయింది. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో సిబిఐ అధికారులు జగన్ ను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తీసుకు వెళ్లారు. జగన్ ను దాదాపు ఆరు గంటల పాటు సిబిఐ విచారించింది. ఈ విచారణలో ప్రధానంగా విదేశీ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన్నట్టు తెలుస్తోంది. అలాగే, జగన్ విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు, ఆయన కంపెనీల్లో విదేశీ సంస్థలు పెట్టిన పెట్టుబడులపై సీబీఐ అధికారులు విచారించిన్నట్టు సమాచారం. కాగా ఇంతకు ముందు ఐదు రోజుల పాటు సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను ప్రశ్నించారు. మరో రెండు రోజులు తమ కస్టడీకి కావాలని సిబిఐ కోర్టును కోరడంతో కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆయనను ప్రశ్నించారు. ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. వైయస్ జగన్‌ను సిబిఐ 27వ తేదీ సాయంత్రం అరెస్టు చేసి, 28వ తేదీన చంచల్‌గుడా జైలుకు తరలించింది. ఆ తర్వాత జగన్‌ను భారతి మే 29, 30, 31 తేదీల్లో జైలులో ములాఖత్‌లో కలిసారు. ఆ మరునాడు జూన్ 1న ఆమె జగన్‌ను కలవడానికి రాగా నిబంధనల ప్రకారం కుదరదని జైలు అధికారులు తిరస్కరించారు.

నేటితో ముగిసిన ఏపి ఉపఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో ఉపఎన్నికలు జరిగే నెల్లూరు లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. సాయంత్రం నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా ఎలాంటి ప్రచారమూ చేయరాదని అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో సహా అందరూ ఆదివారం సాయంత్రం 5 తరువాత స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఓటర్లు కాని వారెవరైనా ఉంటే బయటకు పంపించాల్సిందిగా జిల్లా ఎస్పీలను ఆదేశించినట్టు చెప్పారు. ఇందుకోసం హోటళ్లు, అతిథి గృహాలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్, రెసిడెన్షియల్స్ స్కూళ్ల వంటి వాటిని తనిఖీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. నిషేధాన్ని అతిక్రమించి ఎవరైనా ఇంటింటి ప్రచారం చేస్తే కేసు నమోదుతో పాటు అరెస్టు కూడా చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ ఏర్పాట్లపై భన్వర్‌లాల్ శనివారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి తగిన ఆదేశాలు జారీ చేశారు. నగదు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రశాంతంగా ఆలోచించి, నచ్చిన అభ్యర్థికి ఓటేయాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూన్ 12 వ తేది ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

లగడపాటి జెండా కథేమిటి?

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన ఇంటిపేరు జగడపాటిగా మార్చుకుంటే బాగుంటుందని సూచనలు వస్తున్నాయి. ఈ మధ్య ఆయన పట్టుకు తిరుగుతున్న జెండాపై కథలు కథలుగా ఈసీకి పిర్యాదులు అందుతున్నాయి. తననేమీ చేయలేరన్నధీమాగా లగడపాటి జాతీయజెండాపై సోనియాగాంధీ, మహాత్మాగాంధీ బొమ్మలు చిత్రికరించేలా ఏర్పాటు చేసుకున్నారు. పైగా అదే జెండా మధ్యలో హస్తం గుర్తు కుడా ముద్రించారు. ఇలా జాతీయజెండాను పార్టీ జెండాలా తాయారు చేయించుకు తిరగటం పెద్దనేరం. ఒకరకంగా చెప్పాలంటే జాతీయతా భావనను ఎంపి హోదాలో ఎగతాళి చేయటం లాంటిది. అందుకే పార్టీ జెండాలను, జాతీయ జెండాకు తేడ ఉంచాలని సూచనలున్నాయి. చదవురాని వారికి జాతీయజెండాపై గౌరవము౦టే మరి ఎంపిగా ఉన్న లగడపాటి ఏ జాతీని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి తడిమి చూసుకోవాలి ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈసి సంగతెలా ఉన్నా కనీసం సగటు భారతీయుడనని అనిపించుకోనేందుకు లగడపాటి ఆ జెండాను ఉపయోగి౦చరాదని పలువురు కోరుతున్నారు. పిల్లలకు బుద్దులు చెప్పాల్సిన వయసులో జాతీయవత్తు గర్వపడే జెండాను కించపరిచేలా లగడపాటి తిరిగితే గట్టి పరాభవం తప్పదని ప్రతిపక్షాలు గట్టిగానే హెచ్చరిస్తున్నాయి.

రాజంపేట మహిళలకు బంగారు కానుక?

రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం మహిళలకు శుభవార్త వారి కోసం బంగారు కానుకలు సిద్దమయ్యాయి. సుమారు వేలు చిన్న సైజు ముక్కుపుడకలు పంపిణి చేసేందుకు అభ్యర్ధులు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఇంకొ 72గంటల్లో ఉన్నందున ముందుగానే పంపిణి చేయాలనీ వారు యోచిస్తున్నారు. దీంతో పాటు వెండి కుంకుమ భరిణె కుడా అందవచ్చు. ఈ నియోజకవర్గంలోని మహిళలు తమ తలరాత మారుస్తారని అభ్యర్థులు నమ్మటం వల్ల ఈ కానుకలకు ఏర్పాట్లు జరిగాయి. కార్యకర్తలు ద్వారా వీటిని ఓటర్లకు చేరవేయనున్నారు. ఇదిలా ఉంటే రైల్వేకొడురులో చీరెలు పంపిణి చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఎప్పటి వరకు కడప జిల్లాలో 480గ్రాముల బంగారం, 11కేజీల వెండి పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వీటిని ఎన్నికల కోసం కనుగోలు చేశారు. ఏమైనా పలకరిస్తే మాములుగా కూల్ డ్రింక్ ఇవ్వని ఇవ్వని అభ్యర్ధులు వేసవిని దృష్టిపెట్టుకొని మాధవపురంలో 2లీటర్ల బాటిల్స్ పంపిణి చేశారు .

మంత్రి పార్ధసారధిపై ఈసీ కి పిర్యాదు

పాటశాల ప్రాధమిక విధ్యశాఖ మంత్రి పార్ధసారధి తిరుపతిలో ఉపాధ్యాయులతో ఎన్నికల సమావేశం నిర్వహించారని విపక్షాలు ఈసీకి పిర్యాదు చేశాయి. ఒక ప్రైవేట్ హోటల్లో ఉపాధ్యాయులను సమావేశ పరచటం వెనుక కాంగ్రెస్ అభ్యర్ధి ఎం. వెంకటరమణకు మద్దుతు ఇమ్మని కోరటం లాంటిదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంత్రిగా ఉపాధ్యాయులతో సమావేశం కావటం అక్షేపించటం లేదనీ, కేవలం ప్రచార సమయంలో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించటమే నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంటున్నాయి. అయితే తాను రాజకియదురుద్దేశంతో ఈ సమావేశం జరపలేదని మంత్రి అంటున్నారు. ఇటీవల మంత్రి ధర్మాన రామచంద్రాపురం పర్యటనలో చేసిన కులవ్యాఖ్యలపై స్పందించిన ఈసి ఆయన్ని హెచ్చరించింది. ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే సీరియస్ గా పరిగణిస్తామని ప్రకటించింది. తాజాగా మంత్రి పార్ధసారధిని కూడా ఇరికించేందుకు విపక్షాల గట్టి ప్రయత్నలే చేస్తున్నాయి.

తిరుపతి కాంగ్రెస్ లో కొనసాగుతున్న అలకలు

తిరుపతి కాంగ్రెస్ పార్టీలో గతంలో కన్నా ఐక్యత సాధించామని ఆ పార్టీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కోపం తీరక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి కుంటు౦బ సభ్యులు ఇంకా పార్టీ ప్రచారానికి దూరంగానే ఉంటున్నారు. అంటే అలక కొనసాగిస్తూనే ఉన్నారు. పార్టీ నేతల ముందు మాత్రం పెద్దిరెడ్డి తాను కాంగ్రెస్ అభ్యర్ధి ఎం. వెంకటరమణకు మద్దతిస్తామన్నారు. కానీ, వాస్తవానికి ఆయన ఏమి చేయలేదు. ఈ విషయాన్ని వెంకటరమణ తరుచూ గుర్తు చేస్తూనే ఉన్నారని సమాచారం. ఇక మబ్బు సుబ్బిరామిరెడ్డి కుటుంబంలోని చెంగారెడ్డి తదితరులు అసలు ప్రచారచాయల్లోకే రాలేదు. మంత్రి గల్లాఅరుణకుమారి కుడా తన భర్త అమరరాజా బ్యాటరీ కంపెనీ ఉద్యోగులకు వెంకటరమణ ఓటెయ్యమని సూచించలేదు.

కాంగ్రెస్ కు కలిసొచ్చిన కమ్మ?

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కమ్మసామాజిక వర్గం కాంగ్రెస్ కు కలిసోచ్చింది. ఈసారి ఉప ఎన్నికల్లో తమ కమ్మ సామాజికవర్గం మొత్తం కాంగ్రెస్ అభ్యర్ధి తోట త్రిమూర్తులు అనుకూలంగా ఓటు వేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు గరికిపాటి సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు తమ సామాజికవర్గ సమావేశంలో నేతలు నిర్ణయం తెసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ జగన్ ను అరెస్ట్ చేసినందున వై.కా.పా కు మద్దుతు ఇవ్వరాదని నిర్ణయించుకున్నామన్నారు. వై.కా.పా కు వ్యతిరేకంగా అంటే కాంగ్రేస్ కు అనుకూలంగా ఓటు వేయాలని తీర్మానించుకునట్లు చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో కమ్మసామాజికవర్గం రెండు కుడా తోట త్రిమూర్తులుకు అనుకూలంగా ఉంటే రెడ్డిసామాజికవర్గం మాత్రం వై.కా.పా వెనుకే ఉంది. విచిత్రమేమిటంటే వై.కా.పా అభ్యర్ధి, తాజామాజీ పిల్లిసుభాష్ చంద్రబోస్ శెట్టిబలిజసామాజిక వర్గానికి చెందినవారు. ఈ సామాజికవర్గంలో కుడా పెద్ద చీలిక వచ్చింది. సగానికి పైగా, తోటకు అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్దపడ్డారు.

బాబును బాధ పెట్టిన కోడిగుడ్లు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బాధగా ఉన్నారు. ఆయన సుదీర్ఘరాజకియజీవితంలో ఉహించని సంఘటన ఎదురైందట. ఆ సంఘటన గురించి చెప్పడానికి కుడా మనసు ఒప్పుకోవడం లేదట. అయినా పాపం మీడియా చూసేటప్పటికి మనస్సు దానంతటదే బయటపడుతుందనుకోండి. ఆయన కుడా నోరు జారారు. తన ముప్పైయేళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు ప్రసంగించినా శేహబాష్ అనిపించుకున్నవని గుర్తు చేసుకున్నారు. ఈ మాట తరువాత బాబు తను గుంటూరు జిల్లా పత్తిపాడులో ఎన్నికల ప్రచార సభకు అంటూ చుట్టుచుశారు. మీడియా గమనిస్తోందని నిర్ధారించుకున్న తరువాత బాబు తన మాటను కొనసాగిస్తు సభలో ఎవరో కానీ నాపై కోడిగుడ్లు, రాళ్ళు విసిరారు అన్నారు. ఇది మరిచిపోదమనుకున్నా, మరచిపోలేకపోతున్నాను అన్నారు. ఇది మీడియా ముందు కక్కేశారు కాబట్టి ఇక ప్రశాంతమె అని ఒక విలేకరి చమత్కరించగానే మొహం మరోవైపుకు తిప్పుకున్నారు.

ఈసి నుంచి చిరుకు నోటీసు

మతపరమైన వ్యాఖ్యలను చేశారంటూ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి ఎన్నికల కమిషన్ నోటీసు జారి చేసింది. తన నోటీసుకు సత్వర జవాబు ఇవ్వాలని, అదీ 24 గంటల లోపే అని ఈసి పేర్కొంది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ప్రచారంలో ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈసి నోటీసుకు ఖంగుతిన్నారు. ఇప్పుడు చిరంజీవి కుడా నోటీసు అందేసింది. దీనికి ముందు రామచంద్రాపురంలో పర్యటించినప్పుడు మంత్రి ధర్మానప్రసాద్ రావు తమ సోనియాగాంధీ క్రిస్టియన్ అని చెప్పి దొరికిపోయాడు. ఆయన పంపించిన వివరణ కుడా అర్థరహితంగా ఉందంటూ ఇకపై ఎలాంటి ప్రసంగాలు చేస్తే కటిన చర్యలు తప్పవని ధర్మానకు ఈసి సేరియస్ వార్నింగే ఇచ్చేసింది. చావు తప్పి కన్ను లోట్టపోయిందని ఆయన ఊపిరిపీల్చుకున్నారు. ఆ వెంటనే ఆ వంతు ఇప్పుడు చిరంజీవికి వచ్చింది. ఆయన ఏమి వివరణ పంపిస్తారో? దానికైనా ఈసి సంతృప్తి చెందుతుందో లేదో? తేరా పైనే చూడాల్సిన విషయం.