ఎమ్మెల్యేగానే పోటిచేస్తా: బాలకృష్ణ

    ప్రముఖ నటుడు, న౦దమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి లోక్ సభకు పోటి చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలోచ్చాయి. ఈ వార్తలను బాలకృష్ణ ఖండించారు. తాను ఎంపీగా పోటి చేయనని, ఎమ్మెల్యేగానే ఎన్నికల బరిలో పోటి చేస్తానని ప్రకటించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. టిడిపిని వీడి ఇతర పార్టీలోకి వెళ్ళే వారంతా అవకాశవదులేనని అన్నారు. కొంత మంది వాళ్ళ స్వార్ధం కోసమే ఇతర పార్టీల్లోకి వలస పోతున్నారని...వారితో టిడిపికి నష్టం లేదని పేర్కొన్నారు. ప్రజల బలం తమ పార్టీకి ఉందని చెప్పారు. ఎక్కుడి నుంచి పోటీ చేయాలని తాను అనుకుంటున్నానో తాను కూడా చెప్తానని, పార్టీలో చర్చించిన తర్వాత తాను పోటీ చేసే స్థానాన్ని పార్టీ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. వెళ్లేవారు వెళ్లినా ఫరవా లేదని, పార్టీని తాము బలోపేతం చేసుకుంటామని ఆయన అన్నారు. బాలకృష్ణ కు లోకసభ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కూడా సుముఖంగానే వున్నారని ఈ మధ్య టాక్ వచ్చింది. లోకసభ ఎన్నికల్లో కాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేసి ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్ర అసెంబ్లీలో కాలు మోపేందుకే బాలయ్య నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదు?: బాబు

      ఎవరి మద్ధతు లేకుండానే కేంద్రం అణుఒప్పందం బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర కరెంట్ ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. చంద్రబాబు ’వస్తున్నా…మీకోసం’ పాదయాత్ర మెదక్ జిల్లాలో కొనసాగుతోంది. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలు ఏవీ కొనుక్కునే పరిస్థితి కనిపంచడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.   పిల్లా కాంగ్రెసుకు చెందిన పత్రికలో గీత కార్మికులను అవమానించేలా రాతలు వచ్చాయని, బెల్టు షాపులను రద్దు చేస్తానని తాను చెప్పానని, కానీ గీత కార్మికులను కూడా ఆ పత్రిక కలిపిందని చంద్రబాబు మండిపడ్డారు. కల్లుకు, బెల్టు షాపులకు సంబంధం లేదన్నారు. కల్లుని నిషేధిస్తానని తాను చెప్పలేదన్నారు. వైయస్ ఉన్నప్పుడు గీత కార్మికుల పొట్ట కొట్టాడన్నారు. అప్పుడు రెండు లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గీత కార్మికులకు లైసెన్సులు ఇస్తామన్నారు.

మమతా బెనర్జీ కి ఎదురు దెబ్బ

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వాన్ని పడగోడతానని సవాల్ విసిరిన మమతా అవిశ్వాసానికి కావలసిన మద్దతును కూడగట్టలేకపోయారు. అవిశ్వాసానికి మద్దతు లేకపోవడంతో స్పీకర్ తీర్మానాన్నిఅనుమతించలేమని ప్రకటించారు. దాంతో తృణమూల్ సభ్యులు నిరసనకు దిగారు. ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో గందరగోళం నెలకొంది. సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. ప్రభుత్వం పార్లమెంట్ విలువలను దిగజార్చిందని ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఆరోపించారు. 184 నిబంధన కింద ఎఫ్డీఐలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

పాదయాత్రలో 8వ సెంచరి పూర్తి చేసిన బాబు

    తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాదయాత్రలో మరో మైలు రాయి దాటారు. పాదయాత్ర 800 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు మొత్తం ఐదు జిల్లాల్లోని 327 గ్రామాల గుండా చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. యాభై రోజులు పూర్తి చేసుకున్న బాబు మరుసటి రోజే దూరంలో ఎనిమిది సెంచరీలు పూర్తి చేశారు. మెదక్ జిల్లా ఆంధోల్ నియోజకవర్గంలోని మునిపల్లి గ్రామంలోకి అడుగుపెట్టడంతో యాత్ర ఎనిమిది వందల కిలోమీటర్లు పూర్తయింది. యాభై ఒకటి రోజుల్లో ఆయన మొత్తం 20 నియోజకవర్గాలు పర్యటించినట్లయింది. పాదయాత్ర తొలిరోజు నుంచి చంద్రబాబు రైతులు, కుల వృత్తుల వారితో ఎక్కువగా మమేకం అవుతున్నారు. మధ్య మధ్యలో పలు రకాల ప్రజలతో మాట్లాడుతున్నారు. అప్పుడపుడు స్కూళ్లు, కాలేజీలు సందర్శిస్తూ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. వారికి స్ఫూర్తి పాఠాలు బోధిస్తున్నారు.  

జైలు వాకిట్లో జనం డబ్బు చెట్టు....జగన్ పై

  స్వామి నిత్యానందకు వ్యంగంగా స్వాగతం పలుకుతూ రాష్ట్రంలో అందరిని ఆకర్షించిన గుంటూరుకు చెందిన ‘ది మూన్ సేన’ తాజాగా తన తాజా అస్త్రాలను వైఎస్ జగన్ మీద ఎక్కుపెట్టింది. ఈ సంఘటన గుంటూరులో కలకలం రేపింది. జైలు వాకిట్లో జనం డబ్బు..అంటూ ఓ ప్లెక్సీని ఏర్పాటు చేసిన మూన్ సేన దాని మీద ఇలా రాసింది. ఏముందక్కడ..బెల్లం ముక్క..పోతున్నారెందుకో ఈగల్లెక్క..ఐదేళ్లకు ఓటేశాం మనుషుల లెక్క…అధికారం ఇచ్చాం మనమే పక్కా..అమ్ముడుపోతున్నారు సంతలో పశువుల్లెక్క..ఎంఎల్ఏ అయితేనే అంతటి లక్కా ? అంటూ రాష్ట్రంలో పార్టీలు మారుతున్న ఎంఎల్ఏలపై విమర్శనాస్త్రాలు విసిరారు. జనం సొమ్ముతో ఆకర్ష్ జాతర..ప్రజాస్వామ్య విలువలకు పాతర అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ప్లెక్సీ గుంటూరులో సంచలనం అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీని మీద మండి పడ్డారు. కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ది మూన్ సేన ప్రతినిధి రాజేంద్ర పలు ఫోన్ల ద్వారా బెదిరింపులు చేశారు. నీ సంగతి చూస్తాం అని హెచ్చరించారు. దీని మీద పో లీసులు కేసు కూడా నమోదు చేశారు.

అజ్మల్ కసబ్ కు ఉరిశిక్ష అమలు

    ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి కసబ్ ను పూణే లోని ఎర్రవాడ జైలులో ఉరి తీశారు. క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో కసబ్ కు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ ఉదయం 7.30 గంటలకు ఉరి అమలు చేశారు. ఉరిని మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే దృవీకరించారు. కసబ్ కు ఉరి అమలు ఆలస్యం జరిపి ప్రజాధనం దుర్వినియోగం చేశారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఇన్నాళ్ల విచారణలో అనేక రహస్యాలు తెలిసాయని, ఆలస్యం వల్ల లాభమే జరిగిందని, దాడుల వివరాలు రాబట్టగలిగామని అధికార పక్షం చెబుతోంది.   కసబ్ ను సజీవంగా పట్టుకోగలగడం ద్వారా పాకిస్తాన్ కుతంత్రాలకు ప్రత్యక్ష్య సాక్షం దొరికినట్లయింది. అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ కుటిలనీతిని భారత్ కసబ్ ద్వారా వెల్లడించినట్లయింది. ఉగ్రవాదం గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కసబ్ దానికి ఉదాహారణగా కనిపించాడు. దీంతో పాకిస్తాన్ తన  వాదనను వినిపించలేక పోయింది. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ముద్రవేయడానికి కూడా కసబ్ ఆధారంగా ఉన్నాడు.

హరీష్ చీడ పురుగు: ఎర్రబెల్లి

    టీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకపడ్డారు. హరీష్ టీఆర్ఎస్ లో ఓ చీడ పురుగన్నారు. వైయస్ బతికుంటే హరీష్ రావు కాంగ్రెసులో చేరి ఉండేవారన్నారు. తమ పార్టీని అణచేయడానికి టీఆర్ఎస్, కాంగ్రెసు కుమ్మక్కయి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎందుకు విమర్శించడం లేదని, తెలంగాణపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని సోనియాను ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. సిద్ధిపేటలో ఓడిపోతాననే భయంతోనే కెసిఆర్ గతంలో కరీంనగర్‌లో పోటీ చేశారని ఆయన అన్నారు. దమ్ముంటే కెసిఆర్ మళ్లీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు.

కంటతడి పెట్టిన కేశవ్

    జగన్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ లపై టిడిపి నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పయ్యావుల చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూనే...మీడియాతో మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టారు. టిడిపిని వీడే ప్రసక్తే లేదని పయ్యావుల కేశవ్ చెప్పారు. సంపాదనపై ఆశ లేకుండా రాజకీయాలో కొనసాగుతున్నానని, తాను జీవితంలో బాధ పడిన రోజుల్లో ఇది ఒకటని అన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో కంటిన్యూగా మూడు సార్లు గెలిచిన చరిత్ర తనదని అన్నారు. జగన్ పార్టీ బలమైన నేతలను టార్గెట్ చేసుకొని మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీలోకి నేను వస్తానని వాళ్ళవద్దకు వెళ్లానా, లేక వాళ్ళు నావద్దకు వచ్చారా అన్న విషయం కూడా చెప్పాలని కేశవ్ డిమాండ్ చేశారు.  ఉపఎన్నికల్లో ఆ పార్టీ గెలిచినంత మాత్రాన అటు వైపు వెళ్ళే బలహీనత తనదికాదన్నారు. జగన్ తండ్రితోనే పోరాటం చేసిన తాను ఇప్పుడు జగన్ పైన చేస్తానన్నారు.. వ్యూహంలో భాగంగా తనపై అసత్యాలు ప్రచారం చేసి గౌరవాన్ని, ఇమెజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారం వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం టిడిపికే లాభం అన్నారు. సంక్షోభం తలెత్తిన పలు సందర్భాలలో టిడిపి ఉవ్వెత్తున ఎగిసిందన్నారు.    

లోక్ సభ అభ్యర్థులపై టీడీపీ కసరత్తు

    లోక్ సభకు ముందస్తు ఎన్నికలు రావచ్చన్న ఉహగానాల నేపధ్యంలో పార్టీలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ హైకమాండ్ నిమగ్నం కాగా...రాష్ట్రంలో టిడిపి కూడా ఎంపీ అభ్యర్ధుల లిస్టును తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి తెచ్చే ప్రయత్నంలో కొన్ని సీట్లకు పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులను రంగంలోకి తెచ్చే ఆలోచన టిడిపిలో జరుగుతోంది. సినీ నటుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడు బాలకృష్ణ కూడా లోక్ సభకు పోటిచేయవచ్చని అంటున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం లోక్‌సభ స్థానం నుంచే పోటీకి నిలిపే విషయమై ఆలోచన నడుస్తోంది. ఒంగోలు సీటుకు ఈసారి టీడీపీ తరఫున సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన శ్రీనివాస్ స్వస్థలం ప్రకాశం జిల్లా. ఆయన అక్కడ బలమైన అభ్యర్థి కాగలరని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. హిందూపురం : సినీ నటుడు బాలకృష్ణ శ్రీకాకుళం జిల్లా : ఎర్రన్నాయుడు సతీమణి విజయనగరం జిల్లా : అశోకగజపతిరాజు అనకాపల్లి :  దాడి వీరభద్రరావు లేదా అయ్యన్న పాత్రుడు రాజమండ్రి : మురళీమోహన్ కాకినాడ : యనమల రామకృష్ణ ఏలూరు : మాగంటి బాబు నర్సాపురం : సితామహాలక్ష్మి విజయవాడ : వంశీ, ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్, మురళి పేర్లు పరిశీలీస్తున్నారు.  గుంటూరు : రత్తయ్య నర్సారావుపేట: ఎంపీ వేణు గోపాల్ రెడ్డి, కోడెల శివప్రసాద్ కరీంనగర్ : మాజీమంత్రి పెద్దిరెడ్డి మల్కాజిగిరి: మల్లేశం సికింద్రాబాద్ : తలసాని శ్రీనివాస్ యాదవ్, గత అభ్యర్ధి సుధీష్ రాంబోట్ల పేర్లు పరిశీలీస్తున్నారు.   

ఇద్దరినీ తప్పిస్తేనే పార్టీకి మనుగడ: కిషోర్ చంద్రదేవ్

    కేంద్ర మంత్రి వి.కిషోర్ చంద్రదేవ్ రాష్ట్ర ముఖ్య నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. అందులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను లక్ష్యంగా చేసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థ పాలకుడని పేర్కొన్న కిషోర్.. బొత్సను మాఫియా డాన్‌గా అభివర్ణించారు. వీరిద్దరనీ తక్షణం తొలగించాలని.. లేకుంటే పార్టీకి రాష్ట్రంలో ముగడ ఉండబోదని కిషోర్ పేర్కొన్నారు. బొత్స రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారానికి, భూ మాఫియా, అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో డాన్‌లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డి పసలేని సీఎంగా తేల్చేశారు.

ఆ పార్టీలను బంగళాఖాతంలో పడేయండి

    చంద్రబాబు పాదయాత్రలో ప్రతి జిల్లాలో లేటెస్ట్ కాన్సెప్ట్ తో దూసుకుపోతున్నారు. స్పీచ్ లతో ప్రజలను బోర్ కొట్టించకుండా, కొత్త ఐడియాలతో ముందుకెళ్తున్నారు. తన భార్య భువనేశ్వరితో కలిసి పాదయాత్ర చేసిన చంద్రబాబు మెదక్ జిల్లాలో ప్రవేశించారు. ప్రజాసమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పడేయాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు కోరారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగలు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నారన్నారు. ప్రభుత్వ భూములను, ఖనిజ సంపదను అమ్ముకుని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసి మనం కట్టిన పన్నులను మింగేశారన్నారు. అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న పిల్ల కాంగ్రెస్ నేత అక్కడినుంచి రాజకీయం చేస్తూ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. తమపై ఉన్న కేసులను మాఫీ చేస్తే కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు రాయబారాలు నడుపుతున్నరన్నారు. ఎన్నికలు జరిగే ఒక్కరోజు తన కోసం కేటాయించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతి నిర్మూలనకు ధర్మాన్ని, విలువలను కాపాడటమే తన ధ్యేయమన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయకుండా నిజాయితీగా ఉంటున్నానన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులందరి ఆస్తుల వివరాలు ప్రకటించే నాయకుడిని దేశంలో తానొక్కడినేనని ఆయన అన్నారు. డబ్బులకు కక్కుర్తి పడి తమ పార్టీ నుంచి వైసీపీలో చేరినవారు.. 2009లో తమ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మార్పు

  “కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ ఛార్జ్ గా దిగ్విజయ్ సింగ్ నిమమితులయ్యారు. గులాంనబీ ఆజాద్ స్థానంలో సోనియా దిగ్విజయ్ ని నియమించారు. గతంలోకూడా ఈ బాధ్యతల్ని నిర్వర్తించిన అనుభవం ఉండడంతో ఆయనకీ పదవి దక్కింది.   పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు పలువురు నేతలు దిగ్విజయ్ అనుగ్రహంకోసం ఆయన ఇంటిముందు పడిగాపులు పడుతున్నారు. తెలంగాణ వ్యవహారాన్ని త్వరగా తేల్చమని పాల్వాయి, గండ్ర, చెంగారెడ్డి శనివారంనాడు దిగ్విజయ్‌కి విజ్ఞప్తి చేశారు.”   ఇదంతా రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారం. నిజానికి గులాంనబీ సీటు మారనూ లేదు ఆయన స్థానంలో దిగ్విజయ్ కి బాధ్యతలు అప్పచెప్పినట్టు అధిష్టానం చెప్పనూ లేదు. అంతా రూమర్.. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని దిగ్విజయ్ మన నేతల్ని అడగడంవల్ల ఇంతపెద్ద ఎత్తున సీటు మారిందహో అంటూ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పాలిటిక్స్ లో ఎప్పుడైనా, ఏదైనా సాధ్యమే కాబట్టి దేన్నీ కొట్టిపారేయలేమని కొందరంటున్నారు.

బాల్ ఠాక్రే - ఏక్ థా టైగర్

బాల్ థాక్రే.. మడమ తిప్పడం ఎరగని మరాఠా యోధుడు.. తనని తాను అభినవ శివాజీగా ప్రకటించుకున్న సాహసం ఈ ముంబై వాసికి మాత్రమే సొంతం. ముంబైని గడగడలాడించిన అరాచక శక్తుల్ని “ఉ” పోయించిన వీరాధివీరుడు. హిట్లర్ ని ఆదర్శంగా తీసుకుని బతికినంతకాలం ముంబై మహానగరాన్ని శాసిస్తూ పులిలా బతికిన రాజకీయ యోధుడు బాలా సాహెబ్ థాక్రే.     బాల్ థాక్రే మాటంటే మరాఠీలకు వేదం. బాలా సాహెబ్ నివాసం మాతోశ్రీ మరాఠీలకు ఓ దేవాలయం. ఆయన ఆజ్ఞని తు.చ తప్పకుండా పాటించే మరాఠాలు బాలా సాహెబ్ ఇక లేరన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్తిగా తాము అనాధలైపోయామన్న భావనకు లోనౌతున్నారు.  దేశంలో బాల్ థాక్రే అంత చరిష్మా ఉన్న రాజకీయ నేత మరొకరు లేరన్న విషయాన్ని మరాఠీలు చాలా గర్వంగా చెప్పుకుంటారు. మరాఠీ ఏతరులు ముంబైని విడిచివెళ్లిపోవాలంటూ తొలిరోజుల్లో బాల్ థాక్రే చేపట్టిన చిన్న చిన్న ఉద్యమాల ప్రభావం ఇప్పటికీ మరాఠీలందరిమీదా చాలా బలంగా పనిచేస్తోంది. తొలినాళ్లలో కార్టూనిస్ట్ గా పనిచేస్తూ తన జాతి వీరత్వాన్ని ప్రదర్శిస్తూ చిన్న చిన్న పోరాటాలతో ముందుకు సాగిన బాల్ థాక్రే తర్వాత్తర్వాత ఒక్క ముంబైని మాత్రమే కాక, మొత్తం మహారాష్ట్రనే శాసించ గలిగే స్థాయికి చేరుకున్నారు. ఇండియా లాంటి దేశాన్ని పాలించాలంటే హిట్లర్ లాంటి లీడర్ కావాలంటూ థాక్రే చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించడం బాల్ థాక్రే స్టైల్. థాక్రే ఓ శక్తిగా ఎదగటడానికి ముందు ముంబైలో సామాన్యుల మనుగడ ప్రశ్నార్ధకంగా ఉండేది. అరాచకశక్తుల పదఘట్టనలకింద నలిగిపోతున్న హిందువులను పైకి లేపి మాఫియాని కాలికింద తొక్కిపట్టిన ఘనతని థాక్రే దక్కించుకున్నారు. ముంబైని ఏలుతున్న స్మగ్లర్లను తొక్కిపట్టడానికి అదే మార్గంలో వెళ్లి తన వాళ్లని ఆ మార్గంలో పాతుకుపోయలా చేసి ముంబై స్మగ్లింగ్ సామ్రాజ్యాన్నికూడా శాసించారన్న ఆరోపణలు వెల్లువెత్తినా నమ్మిన దానికోసం, నమ్ముకున్నవాళ్లకోసం వెనకడుగు వేయని మరాఠా పోరాట యోధుడు బాల్ థాక్రే.     1966లో థాక్రే స్థాపించిన శివసేన ముంబై మహానగరంలో హిందువులకు అండగా నిలించింది. థాక్రే పిలుపునందుకుని ఆ పార్టీలో చేరిన వేలాదిమంది శివసైనికులు హిందూవర్గాలకు రక్షణగా నిలబడ్డారు. తర్వాతికాలంలో మహారాష్ట్ర గడ్డమీద ఆ పార్టీ అప్రతిహతమైన మహా శక్తిగా ఎదిగింది. ప్రభుత్వాల్ని సైతం శాసించే స్థాయికి చేరింది. మహారాష్ట్రలో 1995నుంచి బిజెపితో చేతులు కలిపి శివసేన ఏర్పాటు చేసిన ప్రభుత్వం పూర్తిగా బాల్ థాక్రే కనుసన్నల్లోనే నడిచింది. ప్రభుత్వాల్ని సైతం శాసించగలిగే స్థాయిలో ఉన్నా బాలా సాహెబ్ ఏనాడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తాను కింగ్ మేకర్ నని గర్వంగా చెప్పుకున్న థాక్రే పులిలా దర్పాన్ని ప్రదర్శించేవారు.   శివసేన వాణిగా పేరుపడ్డ సామ్నా పత్రికలో బాల్ థాక్రే రాసే సంపాదకీయాలు మరాఠీల రక్తాన్ని మరిగించే రీతిలో ఉండేవి. 2002లో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులంతా కలిసికట్టుగా ఉండి, మత రక్షణకోసం ఓ ఆత్మహత్యా దళాన్ని ఏర్పాటుచేసుకోవాలంటూ ఇచ్చిన పిలుపు సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని అప్పట్లో ప్రభుత్వం ఆయనమీద మతకలహాలకు బీజం వేస్తున్నారంటూ కేసుకూడా పెట్టింది. బాల్ థాక్రే వార్ధక్యం ఛాయలు శివసేన పార్టీని బలహీనం చేశాయి. ఆఖరి నిముషంవరకూ పులిలా గర్జిస్తూ మరాఠీలకు ధైర్యాన్ని నూరిపోసిన బాల్ థాక్రే తర్వాతి తరం అంత బలంగా జనంలోకి వెళ్లలేకపోయింది. భార్య గుండెపోటుతో చనిపోయాక థాక్రే దూకుడు తగ్గింది. అదే సంవత్సరం పెద్ద కొడుకుకూడా యాక్సిడెంట్లో చనిపోవడంతో బాబా కుంగిపోయారు. తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే అంత సమర్ధుడైన నాయకుడిగా పేరు తెచ్చుకోలేకపోయారు. కాస్తో కూస్తో దూకుడుగా వెళ్లగలిగిన మేనల్లుడు రాజ్ థాక్రే, ఉద్ధవ్ తో విభేదాల కారణంగా వేరుకుంపటి పెట్టుకున్నా అంతగా రాణించలేకపోయాడు. బాబా ఆరోగ్యం దెబ్బతిన్న దగ్గర్నుంచీ ఆయనకు దగ్గరగానే ఉన్నా భవిష్యత్తులో పరిస్థితి ఏంటన్నది మాత్రం చెప్పలేని విషయమే. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధింత వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న బాబా సాహెబ్ ఆరోగ్యం ఈ మధ్య కాలంలో బాగా క్షీణించింది. లీలావతీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్సని అందించినప్పటికీ ఆయన పెద్దగా కోలుకోలేకపోయారు. ఆఖరు ఘటడియల్లో తనకి బాగా ఇష్టమైన తన నివాసంలోనే వైద్యులు ఆయనకు సపర్యలు చేస్తూ వైద్యమందించారు. కొద్దికొద్దిగా స్పందిస్తూ అంతలోనే దిగజారుతూ వచ్చిన ఆరోగ్యం నిలకడగా నిలబడలేకపోయింది. అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితిని గమనించిన మృత్యువు.. జీవితమంతా పులిలా బతికుతూ అలుపెరగని పోరాటం చేసిన యోధుడికి వీరమరణమనే శరణ్యమని భావించింది. బాలా సాహెబ్ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. బాలా సాహెబ్ థాక్రే శకం ముగిసిపోయింది. ముంబై నగరం మూగబోయింది. మహారాష్ట్రం చిన్నబోయింది. బాబా సాహెబ్ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న కోట్లాదిమంది మరాఠీలు అనాధలైపోయారు. మాతోశ్రీ దగ్గరికి లక్షలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. తమ అభిమాన నేత ఇక లేరన్న విషయాన్ని తెలుసుకుని గుండెలవిశేలా విలపిస్తున్నారు. ఓ సుదీర్ఘ శకం ముగిసిపోయింది. మహోజ్వలంగా వెలిగి ముంబై నగరవాసులకు అరాచక శక్తులను ఎదుర్కునే మనోధైర్యమనే కాంతిని అందించిన దివ్యనక్షత్రం నేలరాలింది. మొత్తం మరాఠా దేశమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.

'శివసేనాధిపతి' బాల్ ఠాక్రే కన్నుమూత

    శివసేన అధినేత బాల్ ఠాక్రే కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు బాల్ ఠాక్రే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న థాకరే జులైలో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. అయితే సుమారు రెండు నెలల క్రితం మాతోశ్రీకి ఆయనను తరలించారు. శనివారం మధ్యాహ్నం బాల్ ఠాక్రే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచారు. బాల్ ఠాక్రే మృతి చెందినట్లు తెలిసిన అభిమానులు ఆయన అధికార నివాసం మాతోశ్రీకి భారీగా తరలివస్తున్నారు. దీంతో భారీగా బలగాలను మోహరించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బాల్ థాకరే అంత్యక్రియలు జరగనున్నాయి.

పాతబస్తీలో ఆంక్షల సడలింపు

  హైదరాబాద్ పాతబస్తీలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చార్మినార్ దగ్గర తాత్కాలికంగా ఆంక్షల్ని సడలించారు. వాహనాల రాకపోకల్ని అనుమతిస్తున్నారు. శాలిబండ, చార్మినార్ దగ్గర బ్యారికేడ్లను తొలగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతూనే భారీగా అదనపు బలగాలను మోహరించారు. బస్తీల్లో నిఘా కెమెరాలు, పికెట్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శుక్రవారంనాటి అల్లర్లకు బాధ్యులైన 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం వ్యాపార సంస్థలు తెరిచే విషయంపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు యథావిధిగా జరుగుతున్నాయి. భక్తుల్ని అనుమతిస్తున్నారు.   శుక్రవారంనాడు మక్కా మసీదు వద్ద ప్రార్థనల అనంతరం అల్లరి మూకలు చెలరేగిపోయాయి. ప్రార్థనల అనంతరం పలువురు ఆందోళనకారులు పోలీసులమీద, మీడియా ప్రతినిధులమీద రాళ్లు రువ్వారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అల్లరిమూకలు ఎంతకూ తగ్గక పోవడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఆందోళకారులు మీడియాకు, పోలీసులకు చెందిన వాహనాల్ని ధ్వంసం చేశారు.   పాతబస్తీ అల్లర్లకు సంబంధించి వదంతుల్ని నమ్మొద్దని సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ ప్రశాంతంగానే ఉందని చెప్పారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని, పరిస్థితి అదుపులోనే ఉందని విజ్ఞప్తి చేశారు. పాతబస్తీలో శాంతి భద్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని సిపి అనురాగ్ శర్మ తెలిపారు. 144వ సెక్షన్ మాత్రం కొనసాగుతోంది.

అవినీతి సొమ్ము కోసం... అవిశ్వాసం అంటున్నారు: చంద్రబాబు

    బ్లాక్ మెయిలింగ్ కోసం, తమ కేసులు మాఫీ చేయించుకోవడం కోసం అవినీతి సొమ్ము కాపాడుకోవడం కోసం, శిక్షలు తప్పించుకోవడం కోసం మాత్రం నేను అవిశ్వాసం పెట్టను అని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నా అని భావిస్తే వెంటనే అవిశ్వాసం పెడతామని చంద్రబాబు స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును ఓడించి, దానికి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయడానికి తొమ్మిదేళ్లు కావాలా? ఇంతకంటే ఘోరమైన పాలన ఉంటుందా అని ఆయన ప్రజలతో వ్యాఖ్యానించారు. ఇదొక్కటి చాలు కాంగ్రెస్ అసమర్థతను నిరూపించడానికి అన్నారు. రాజకీయ అజ్ఞానులు, అవిశ్వాసం ఎప్పుడు పెడతారో తెలియని వారు కూడా దాని గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వారికి రాజ్యాంగ నిబంధనలేం తెలియవని, స్వార్థ ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని అడుగుతున్నారని అన్నారు. శానససభ సమావేశాలు జరుగుతున్నప్పుడే అవిశ్వాసం ప్రతిపాదిస్తారనే కనీస జ్ఞానం లేకుండా అవిశ్వాసం పెట్టు అని అడుగుతున్నారని విమర్శించారు.

గ్రేటర్ హైదరాబాద్ టిడిపి అధ్యక్షుడు తలసాని

  తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నియమితులయ్యారు. పాదయాత్రలో ఉన్న చంద్రబాబు తలసాని శ్రీనివాస యాదవ్ ను పిలిచి బాధ్యతలు అప్పగించారు. తలసాని నియామకం ఎప్పుడో ఖాయమైనా.. అధికారిక ప్రకటన రావడానికి సమయం పట్టింది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తాను ఒక సైనికుడిగా పనిచేసి తెలుగుదేశం అంటే ఏమిటో చూపిస్తానని అన్నారు. తలసానిని ఓ దశలో ఆయన పార్టీని వీడుతారన్న ప్రచారం కూడా జరిగింది. తనకు బద్ధ శత్రువైన దేవేందర్ గౌడ్ ను తిరిగి పార్టీలోకి రానివ్వడం, రాజ్యసభ సభ్యుడిగా చేయడం ఆయనకు రుచించలేదు. ఐతే అసమ్మతి బాటలో వెళ్తున్న తలసానిని చంద్రబాబు తాజాగా పదవి కట్టబెట్టడంతో తలసాని కథ సుఖాంతమైంది.

కోదండరామ్ పై గీతా రెడ్డి ఫైర్

    తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం పైన మంత్రి గీతా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోదండరాం అగ్రుకుల దురహంకారంతో అలా మాట్లాడారని మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా తనకు ఎలాంటి నష్టం లేదని, కోదండరంకే మచ్చ అన్నారు. ఆయన మాటల తీరును చూసి అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు. పవిత్రమైన ప్రొఫెసర్ వృత్తిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. తన గురించి తన తల్లి గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. ఆయనది ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ అని, పెత్తందారీ వ్యవస్థ కోసమే ఆయన పని చేస్తున్నట్లుగా ఉందన్నారు. తెలంగాణవాదులు ఎవరూ తనను వ్యతిరేకించడం లేదన్నారు. అందర్నీ రాజీనామాలు అడగడం కాదు, ముందు ఆయన తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలి అని ధ్వజమెత్తారు. కోదండరాం చేసిన తప్పు క్షమాపణలతో పోయేది కాదన్నారు. తన తల్లి తెలంగాణ కోసం జైలుకు వెళ్లారని, లాఠీ దెబ్బలు తిన్నారన్నారు. ఆమె తెలంగాణ కోసం రాష్ట్రం కోసం ఎంతగానో చేశారన్నారు. నేను ఒక అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు పరిమితులు ఉంటాయి. అన్ని పరిమితులున్నా నేరుగా అధిష్టానం మీద ఒత్తిడి తేవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశాం. మా వాదన, మా స్వరం సోనియా గాంధీకి, కేంద్ర ప్రభుత్వానికి వినిపించాం అని ఆమె స్పష్టంచేశారు. మెదక్ జిల్లాలోని జహీరాబాద్ పోలీసు స్టేషన్‌లో కోదండరామ్ పై కేసు నమోదైంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.