అజ్మల్ కసబ్ కు ఉరిశిక్ష అమలు
posted on Nov 21, 2012 @ 9:39AM
ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి కసబ్ ను పూణే లోని ఎర్రవాడ జైలులో ఉరి తీశారు. క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో కసబ్ కు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ ఉదయం 7.30 గంటలకు ఉరి అమలు చేశారు. ఉరిని మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే దృవీకరించారు. కసబ్ కు ఉరి అమలు ఆలస్యం జరిపి ప్రజాధనం దుర్వినియోగం చేశారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఇన్నాళ్ల విచారణలో అనేక రహస్యాలు తెలిసాయని, ఆలస్యం వల్ల లాభమే జరిగిందని, దాడుల వివరాలు రాబట్టగలిగామని అధికార పక్షం చెబుతోంది.
కసబ్ ను సజీవంగా పట్టుకోగలగడం ద్వారా పాకిస్తాన్ కుతంత్రాలకు ప్రత్యక్ష్య సాక్షం దొరికినట్లయింది. అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ కుటిలనీతిని భారత్ కసబ్ ద్వారా వెల్లడించినట్లయింది. ఉగ్రవాదం గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కసబ్ దానికి ఉదాహారణగా కనిపించాడు. దీంతో పాకిస్తాన్ తన వాదనను వినిపించలేక పోయింది. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ముద్రవేయడానికి కూడా కసబ్ ఆధారంగా ఉన్నాడు.