కేసీఆర్ కి దడపుడుతోందా..?

    తెలంగాణ రాష్ట్రం రావడం అసలు కేసీఆర్ కే ఇష్టంలేదని వాదించేవాళ్ల సంఖ్య రోజురోజుకీ రాష్ట్రంలో పెరిగిపోతోంది. కావాలనే తెలంగాణ అంశాన్ని కేసీఆర్ బంగారు గుడ్లుపెట్టే బాతులా చూస్తున్నారని, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్.   చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వని కారణంగా టిఆర్ ఎస్ అనే సొంత కుంపటిపెట్టుకుని రాష్ట్రంలో వేర్పాటువాదమనే నిప్పుని రాజేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్న భావన తెలంగాణవాదుల్లో కూడా విపరీతంగా పెరిగిపోతోందని కొందరు పొలిటీషియన్లు ఆరోపిస్తున్నారు.   వై.ఎస్ బతికున్న రోజుల్లో కేసీఆర్ కి తెలంగాణ విషయంలో మాట్లాడ్డానికేం పెద్దగా మిగల్లేదు. అడపాదడపా ఏవో దీక్షలు చేసినా అవి చప్పగా చల్లారిపోయాయేతప్ప నిప్పులు కక్కిన దాఖలాల్లేవన్నది కొందరు కాంగ్రెస్ తెలంగాణ నేతల మాట. కాకపోతే.. కేసీఆర్ వల్లే ఎప్పుడో మూలనపడ్డ ఉద్యమం మళ్లీ తారా స్థాయికి చేరిందని నమ్మేవాళ్లూ చాలామందే ఉన్నారు.   ఉద్యమం పూర్తిగా పొలిటికల్ జెఎసి అధ్యక్షుడు కోదండరామ్ చేతుల్లోకి పోతోందని భయపడిన కేసీఆర్ హుటాహుటిన లాబీయింగ్ కోసం ఢిల్లీకి పరిగెత్తారు. ఢిల్లీ పెద్దల బందుల దొడ్లో కట్టేసినా, ఛీ.. అన్నా.. ఛా.. అన్నా ఓరిమితో అన్నీ భరించారు. టిఆర్ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానని బేరం పెట్టినా సోనియా మాత అనుగ్రహం దక్కనేలేదు   ఢిల్లీలో పడిగాపులు పడీ.. పడీ.. విసుగెత్తిన కేసీఆర్ చివరికి రాష్ట్రానికి ఉత్తచేతులు ఊపుకుంటూ వచ్చారు. అందర్నీ కలుపుకుపోతేనే తనని జనం చీదరించుకోవడం తగ్గుతుంది తప్ప మరో మార్గం లేదని గ్రహించి కోదండకి స్నేహహస్తం చాచారు. ఆయన కాస్తంత మెత్తబడడంతో పాతస్నేహం కొత్త పుంతలు తొక్కింది. నల్గొండజిల్లాలో ఏర్పాటు చేసిన భారీ గర్జనలో కేసీఆర్ పులిలా ఎంతగా గర్జించాలని ప్రయత్నించినా డొల్లతనం పైకి బాగా కనిపించింది. చేసేదేం లేక తనుకూడా కాంగ్రెస్, టిడిపిల బాటలోనే నడుస్తూ వరాల్ని గుప్పించారు. తెలంగాణ రాజ్యం గురించి ఆయన కంటున్న కలలు పెద్దగా జనాన్ని కదిలించలేకపోయాయనే చాలామంది అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లు చివరాఖరికి జనానిక్కూడా బాగానే తెలుస్తున్నాయని చాలామంది గట్టిగానే అనుకుంటున్నారుకూడా..

కెసిఆర్ ను కసబ్ లా ఉరితీయాలి: మోత్కుపల్లి

    తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని, ఉగ్రవాది కసబ్ లా ఉరి తీయాలని కేసీఆర్ ను ఉరితీయాలని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు ద్వజమెత్తారు. సూర్యాపేటలో టిఆర్ఎస్ సమరబేరి జరుగుతున్న సందర్భంగా కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడంటూ నరసింహులు గన్ పార్కు వద్ద నిరశన దీక్షకు దిగారు.   తెలంగాణ అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అని చెప్పి ప్రజలను ఇంతకాలం మోసం చేసిన కెసిఆర్ ఇప్పుడు రెండువేల పద్నాలుగు వరకు రాదని, వంద సీట్లే వస్తుందని చెబుతూ మళ్లీ తెలంగాణ వాసుల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

వైఎస్ తెలంగాణ పాలిట రాక్షసుడు

    కేసిఆర్ తనయుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటిఆర్ వైఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేతికి అందాక తెలంగాణ పాలిట యముడిలా..సైంధవుడిలా మారాడు. టీఆర్ఎస్ అండతో అధికారం చేజిక్కించుకుని ఆ తరువాత మిత్ర ద్రోహం చేశాడు. 2009 ఎన్నికల్లో తెలంగాణలో ఓటింగ్ ముగిశాక తెలంగాణకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ కావాలి..వీసా కావాలి అని సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టాడు’’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. జగన్ పార్టీ నేతలు వైఎస్ దేవుడు అని వేదాలు వల్లిస్తున్నారని, వైఎస్ తెలంగాణకు అంతా చేసింది ద్రోహమేనని విమర్శించారు. రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వారి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని, అంతేకాని తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని హెచ్చరించారు.

టీఆర్ఎస్ ‘సమరభేరి’

    తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉదృతం చేసేందుకు టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం ‘సమరభేరి’ సభ నిర్వహిస్తోంది. దక్షిణ తెలంగాణ జిల్లాలలో ప్రజలను సమాయాత్తం చేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నారు. దానికితోడు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వైపు నాయకులు వెళ్లకుండా వాళ్లకు ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ అని చాటి చెప్పేలా కేసీఆర్ ఈ సభను నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీ శ్రేణులన్నీ సభ కోసం భారీ ప్రచారం చేశాయి. 10 జిల్లాల నుండి భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. 40 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 5 లక్షలమంది హాజరవుతారని అంచనా. ఈ సభకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాంల తో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30నిషాలకు తెలంగాణ సమరభేరి సభ ప్రారంభం కానుంది. నేడు సమరభేరి సభ జరగనున్న నేపధ్యంలో సూర్యాపేట గులాబిమయమైంది. తెలంగాణ జిల్లాల నుంచి సభకు వచ్చే వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠి ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.

షర్మిలకు తెలంగాణ సెగ, వైకాపా దాడి

    షర్మిల పాదయాత్రకు తెలంగాణ సెగ తగిలింది. మహబూబ్ నగర్ జిల్ల వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో షర్మిల పాదయాత్రను తెలంగాణ వాదులను అడ్డుకున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని, జైతెలంగాణ అనాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యకర్తలు తెలంగాణవాదులపై విరుచుకుపడి విపరీతంగా చితకబాదారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ వాదులపై లాఠీ ఝళిపించారు. పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణవాదులపై వైఎస్‌ఆర్‌సీపీ నేతల దాడికి నిరసనగా ఐజాలో టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు ఐజా చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు.  భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణపై వైఎస్‌ఆర్‌సీపీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో తెలంగాణవాదులు షర్మిల పాదయాత్రను అడ్డుకుంటే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దాడి చేశారు. దీనికి నిరసనగా ఈ రాస్తారోకో జరుగుతుంది.

కేజ్రీవాల్ పార్టీ పేరు ఆమ్ ఆద్మీ

    సామాజిక కార్యకర్త, అవినీతి ఉద్యమకారుడు అరవింద కేజ్రీవాల్ తమ కొత్త పార్టీకి 'అమ్ ఆద్మీ' పేరును ప్రకటించారు. 350 మంది సభ్యులతో కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 25 మంది సభ్యులతో ఆమ్‌ఆద్మీ పార్టీకి కోర్‌కమిటీని ఏర్పాటు చేశారు. తమది ప్రజల పార్టీ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. స్వరాజ్‌ స్థాపనే లక్ష్యంగా సామాన్య ప్రజల అభ్యున్నతే పార్టీ లక్ష్యంగా ఈ సరికొత్త ఉద్యమపార్టీ ఉండబోతోందని కేజ్రీవాల్‌ ఇప్పటికే వెల్లడించారు. తన మద్దతుదారులతో అరవింద్‌ కేజ్రీవాల్‌ సమావేశమయ్యారు. కేజ్రీవాల్‌ పార్టీలో యోగీందర్‌ యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌, శాంతిభూషణ్‌ వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషించనున్నారు.

బాలకృష్ణ కు మద్దతుగా ప్రచారం చేస్తా: ఎన్టీఆర్

    ‘వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తా..రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుంది. బాబాయ్ బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తా’’ అని ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారా ? అని ప్రశ్నించగా ఎందుకు చేయను చేస్తాను అని అన్నారు.  2014లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, వందకు 101 శాతం రావాలని అప్పుడే రాష్ట్రం అభివృద్ధిపథంలోకి వెళుతుందన్నారు. మన రాష్ట్రం ముందుకు పోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందేనంటూ ఆయన ఆకాంక్షించారు.

ఎమ్మెల్యేగానే పోటిచేస్తా: బాలకృష్ణ

    ప్రముఖ నటుడు, న౦దమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి లోక్ సభకు పోటి చేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలోచ్చాయి. ఈ వార్తలను బాలకృష్ణ ఖండించారు. తాను ఎంపీగా పోటి చేయనని, ఎమ్మెల్యేగానే ఎన్నికల బరిలో పోటి చేస్తానని ప్రకటించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. టిడిపిని వీడి ఇతర పార్టీలోకి వెళ్ళే వారంతా అవకాశవదులేనని అన్నారు. కొంత మంది వాళ్ళ స్వార్ధం కోసమే ఇతర పార్టీల్లోకి వలస పోతున్నారని...వారితో టిడిపికి నష్టం లేదని పేర్కొన్నారు. ప్రజల బలం తమ పార్టీకి ఉందని చెప్పారు. ఎక్కుడి నుంచి పోటీ చేయాలని తాను అనుకుంటున్నానో తాను కూడా చెప్తానని, పార్టీలో చర్చించిన తర్వాత తాను పోటీ చేసే స్థానాన్ని పార్టీ నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. వెళ్లేవారు వెళ్లినా ఫరవా లేదని, పార్టీని తాము బలోపేతం చేసుకుంటామని ఆయన అన్నారు. బాలకృష్ణ కు లోకసభ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కూడా సుముఖంగానే వున్నారని ఈ మధ్య టాక్ వచ్చింది. లోకసభ ఎన్నికల్లో కాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేసి ఎమ్మెల్యే గా గెలిచి రాష్ట్ర అసెంబ్లీలో కాలు మోపేందుకే బాలయ్య నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.

తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదు?: బాబు

      ఎవరి మద్ధతు లేకుండానే కేంద్రం అణుఒప్పందం బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర కరెంట్ ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. చంద్రబాబు ’వస్తున్నా…మీకోసం’ పాదయాత్ర మెదక్ జిల్లాలో కొనసాగుతోంది. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలు ఏవీ కొనుక్కునే పరిస్థితి కనిపంచడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.   పిల్లా కాంగ్రెసుకు చెందిన పత్రికలో గీత కార్మికులను అవమానించేలా రాతలు వచ్చాయని, బెల్టు షాపులను రద్దు చేస్తానని తాను చెప్పానని, కానీ గీత కార్మికులను కూడా ఆ పత్రిక కలిపిందని చంద్రబాబు మండిపడ్డారు. కల్లుకు, బెల్టు షాపులకు సంబంధం లేదన్నారు. కల్లుని నిషేధిస్తానని తాను చెప్పలేదన్నారు. వైయస్ ఉన్నప్పుడు గీత కార్మికుల పొట్ట కొట్టాడన్నారు. అప్పుడు రెండు లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గీత కార్మికులకు లైసెన్సులు ఇస్తామన్నారు.

మమతా బెనర్జీ కి ఎదురు దెబ్బ

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వాన్ని పడగోడతానని సవాల్ విసిరిన మమతా అవిశ్వాసానికి కావలసిన మద్దతును కూడగట్టలేకపోయారు. అవిశ్వాసానికి మద్దతు లేకపోవడంతో స్పీకర్ తీర్మానాన్నిఅనుమతించలేమని ప్రకటించారు. దాంతో తృణమూల్ సభ్యులు నిరసనకు దిగారు. ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో గందరగోళం నెలకొంది. సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. ప్రభుత్వం పార్లమెంట్ విలువలను దిగజార్చిందని ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఆరోపించారు. 184 నిబంధన కింద ఎఫ్డీఐలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

పాదయాత్రలో 8వ సెంచరి పూర్తి చేసిన బాబు

    తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాదయాత్రలో మరో మైలు రాయి దాటారు. పాదయాత్ర 800 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు మొత్తం ఐదు జిల్లాల్లోని 327 గ్రామాల గుండా చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. యాభై రోజులు పూర్తి చేసుకున్న బాబు మరుసటి రోజే దూరంలో ఎనిమిది సెంచరీలు పూర్తి చేశారు. మెదక్ జిల్లా ఆంధోల్ నియోజకవర్గంలోని మునిపల్లి గ్రామంలోకి అడుగుపెట్టడంతో యాత్ర ఎనిమిది వందల కిలోమీటర్లు పూర్తయింది. యాభై ఒకటి రోజుల్లో ఆయన మొత్తం 20 నియోజకవర్గాలు పర్యటించినట్లయింది. పాదయాత్ర తొలిరోజు నుంచి చంద్రబాబు రైతులు, కుల వృత్తుల వారితో ఎక్కువగా మమేకం అవుతున్నారు. మధ్య మధ్యలో పలు రకాల ప్రజలతో మాట్లాడుతున్నారు. అప్పుడపుడు స్కూళ్లు, కాలేజీలు సందర్శిస్తూ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. వారికి స్ఫూర్తి పాఠాలు బోధిస్తున్నారు.  

జైలు వాకిట్లో జనం డబ్బు చెట్టు....జగన్ పై

  స్వామి నిత్యానందకు వ్యంగంగా స్వాగతం పలుకుతూ రాష్ట్రంలో అందరిని ఆకర్షించిన గుంటూరుకు చెందిన ‘ది మూన్ సేన’ తాజాగా తన తాజా అస్త్రాలను వైఎస్ జగన్ మీద ఎక్కుపెట్టింది. ఈ సంఘటన గుంటూరులో కలకలం రేపింది. జైలు వాకిట్లో జనం డబ్బు..అంటూ ఓ ప్లెక్సీని ఏర్పాటు చేసిన మూన్ సేన దాని మీద ఇలా రాసింది. ఏముందక్కడ..బెల్లం ముక్క..పోతున్నారెందుకో ఈగల్లెక్క..ఐదేళ్లకు ఓటేశాం మనుషుల లెక్క…అధికారం ఇచ్చాం మనమే పక్కా..అమ్ముడుపోతున్నారు సంతలో పశువుల్లెక్క..ఎంఎల్ఏ అయితేనే అంతటి లక్కా ? అంటూ రాష్ట్రంలో పార్టీలు మారుతున్న ఎంఎల్ఏలపై విమర్శనాస్త్రాలు విసిరారు. జనం సొమ్ముతో ఆకర్ష్ జాతర..ప్రజాస్వామ్య విలువలకు పాతర అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ప్లెక్సీ గుంటూరులో సంచలనం అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీని మీద మండి పడ్డారు. కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ది మూన్ సేన ప్రతినిధి రాజేంద్ర పలు ఫోన్ల ద్వారా బెదిరింపులు చేశారు. నీ సంగతి చూస్తాం అని హెచ్చరించారు. దీని మీద పో లీసులు కేసు కూడా నమోదు చేశారు.

అజ్మల్ కసబ్ కు ఉరిశిక్ష అమలు

    ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి కసబ్ ను పూణే లోని ఎర్రవాడ జైలులో ఉరి తీశారు. క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో కసబ్ కు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ ఉదయం 7.30 గంటలకు ఉరి అమలు చేశారు. ఉరిని మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే దృవీకరించారు. కసబ్ కు ఉరి అమలు ఆలస్యం జరిపి ప్రజాధనం దుర్వినియోగం చేశారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఇన్నాళ్ల విచారణలో అనేక రహస్యాలు తెలిసాయని, ఆలస్యం వల్ల లాభమే జరిగిందని, దాడుల వివరాలు రాబట్టగలిగామని అధికార పక్షం చెబుతోంది.   కసబ్ ను సజీవంగా పట్టుకోగలగడం ద్వారా పాకిస్తాన్ కుతంత్రాలకు ప్రత్యక్ష్య సాక్షం దొరికినట్లయింది. అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ కుటిలనీతిని భారత్ కసబ్ ద్వారా వెల్లడించినట్లయింది. ఉగ్రవాదం గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కసబ్ దానికి ఉదాహారణగా కనిపించాడు. దీంతో పాకిస్తాన్ తన  వాదనను వినిపించలేక పోయింది. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగా ముద్రవేయడానికి కూడా కసబ్ ఆధారంగా ఉన్నాడు.

హరీష్ చీడ పురుగు: ఎర్రబెల్లి

    టీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకపడ్డారు. హరీష్ టీఆర్ఎస్ లో ఓ చీడ పురుగన్నారు. వైయస్ బతికుంటే హరీష్ రావు కాంగ్రెసులో చేరి ఉండేవారన్నారు. తమ పార్టీని అణచేయడానికి టీఆర్ఎస్, కాంగ్రెసు కుమ్మక్కయి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎందుకు విమర్శించడం లేదని, తెలంగాణపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని సోనియాను ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. సిద్ధిపేటలో ఓడిపోతాననే భయంతోనే కెసిఆర్ గతంలో కరీంనగర్‌లో పోటీ చేశారని ఆయన అన్నారు. దమ్ముంటే కెసిఆర్ మళ్లీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు.

కంటతడి పెట్టిన కేశవ్

    జగన్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ లపై టిడిపి నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పయ్యావుల చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూనే...మీడియాతో మాట్లాడుతూ ఆయన కంటతడి పెట్టారు. టిడిపిని వీడే ప్రసక్తే లేదని పయ్యావుల కేశవ్ చెప్పారు. సంపాదనపై ఆశ లేకుండా రాజకీయాలో కొనసాగుతున్నానని, తాను జీవితంలో బాధ పడిన రోజుల్లో ఇది ఒకటని అన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో కంటిన్యూగా మూడు సార్లు గెలిచిన చరిత్ర తనదని అన్నారు. జగన్ పార్టీ బలమైన నేతలను టార్గెట్ చేసుకొని మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీలోకి నేను వస్తానని వాళ్ళవద్దకు వెళ్లానా, లేక వాళ్ళు నావద్దకు వచ్చారా అన్న విషయం కూడా చెప్పాలని కేశవ్ డిమాండ్ చేశారు.  ఉపఎన్నికల్లో ఆ పార్టీ గెలిచినంత మాత్రాన అటు వైపు వెళ్ళే బలహీనత తనదికాదన్నారు. జగన్ తండ్రితోనే పోరాటం చేసిన తాను ఇప్పుడు జగన్ పైన చేస్తానన్నారు.. వ్యూహంలో భాగంగా తనపై అసత్యాలు ప్రచారం చేసి గౌరవాన్ని, ఇమెజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారం వల్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం టిడిపికే లాభం అన్నారు. సంక్షోభం తలెత్తిన పలు సందర్భాలలో టిడిపి ఉవ్వెత్తున ఎగిసిందన్నారు.    

లోక్ సభ అభ్యర్థులపై టీడీపీ కసరత్తు

    లోక్ సభకు ముందస్తు ఎన్నికలు రావచ్చన్న ఉహగానాల నేపధ్యంలో పార్టీలు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ హైకమాండ్ నిమగ్నం కాగా...రాష్ట్రంలో టిడిపి కూడా ఎంపీ అభ్యర్ధుల లిస్టును తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులను రంగంలోకి తెచ్చే ప్రయత్నంలో కొన్ని సీట్లకు పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులను రంగంలోకి తెచ్చే ఆలోచన టిడిపిలో జరుగుతోంది. సినీ నటుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడు బాలకృష్ణ కూడా లోక్ సభకు పోటిచేయవచ్చని అంటున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం లోక్‌సభ స్థానం నుంచే పోటీకి నిలిపే విషయమై ఆలోచన నడుస్తోంది. ఒంగోలు సీటుకు ఈసారి టీడీపీ తరఫున సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన శ్రీనివాస్ స్వస్థలం ప్రకాశం జిల్లా. ఆయన అక్కడ బలమైన అభ్యర్థి కాగలరని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. హిందూపురం : సినీ నటుడు బాలకృష్ణ శ్రీకాకుళం జిల్లా : ఎర్రన్నాయుడు సతీమణి విజయనగరం జిల్లా : అశోకగజపతిరాజు అనకాపల్లి :  దాడి వీరభద్రరావు లేదా అయ్యన్న పాత్రుడు రాజమండ్రి : మురళీమోహన్ కాకినాడ : యనమల రామకృష్ణ ఏలూరు : మాగంటి బాబు నర్సాపురం : సితామహాలక్ష్మి విజయవాడ : వంశీ, ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్, మురళి పేర్లు పరిశీలీస్తున్నారు.  గుంటూరు : రత్తయ్య నర్సారావుపేట: ఎంపీ వేణు గోపాల్ రెడ్డి, కోడెల శివప్రసాద్ కరీంనగర్ : మాజీమంత్రి పెద్దిరెడ్డి మల్కాజిగిరి: మల్లేశం సికింద్రాబాద్ : తలసాని శ్రీనివాస్ యాదవ్, గత అభ్యర్ధి సుధీష్ రాంబోట్ల పేర్లు పరిశీలీస్తున్నారు.   

ఇద్దరినీ తప్పిస్తేనే పార్టీకి మనుగడ: కిషోర్ చంద్రదేవ్

    కేంద్ర మంత్రి వి.కిషోర్ చంద్రదేవ్ రాష్ట్ర ముఖ్య నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. అందులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను లక్ష్యంగా చేసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థ పాలకుడని పేర్కొన్న కిషోర్.. బొత్సను మాఫియా డాన్‌గా అభివర్ణించారు. వీరిద్దరనీ తక్షణం తొలగించాలని.. లేకుంటే పార్టీకి రాష్ట్రంలో ముగడ ఉండబోదని కిషోర్ పేర్కొన్నారు. బొత్స రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారానికి, భూ మాఫియా, అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో డాన్‌లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డి పసలేని సీఎంగా తేల్చేశారు.

ఆ పార్టీలను బంగళాఖాతంలో పడేయండి

    చంద్రబాబు పాదయాత్రలో ప్రతి జిల్లాలో లేటెస్ట్ కాన్సెప్ట్ తో దూసుకుపోతున్నారు. స్పీచ్ లతో ప్రజలను బోర్ కొట్టించకుండా, కొత్త ఐడియాలతో ముందుకెళ్తున్నారు. తన భార్య భువనేశ్వరితో కలిసి పాదయాత్ర చేసిన చంద్రబాబు మెదక్ జిల్లాలో ప్రవేశించారు. ప్రజాసమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పడేయాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు కోరారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగలు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నారన్నారు. ప్రభుత్వ భూములను, ఖనిజ సంపదను అమ్ముకుని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసి మనం కట్టిన పన్నులను మింగేశారన్నారు. అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న పిల్ల కాంగ్రెస్ నేత అక్కడినుంచి రాజకీయం చేస్తూ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. తమపై ఉన్న కేసులను మాఫీ చేస్తే కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు రాయబారాలు నడుపుతున్నరన్నారు. ఎన్నికలు జరిగే ఒక్కరోజు తన కోసం కేటాయించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతి నిర్మూలనకు ధర్మాన్ని, విలువలను కాపాడటమే తన ధ్యేయమన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయకుండా నిజాయితీగా ఉంటున్నానన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులందరి ఆస్తుల వివరాలు ప్రకటించే నాయకుడిని దేశంలో తానొక్కడినేనని ఆయన అన్నారు. డబ్బులకు కక్కుర్తి పడి తమ పార్టీ నుంచి వైసీపీలో చేరినవారు.. 2009లో తమ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.