అతి విశ్వాసం జగన్ లక్షణమా?

ఏపీలో రాజకీయ పరిస్థితులు విచిత్రంగా కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఉందని, ఈసారి ఇక్కడ తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు తేల్చి చెప్పేశాయి. అయినా  తెలుగుదేశం ఏ మాత్రం రిలాక్స్ కాకుండా రెట్టింపు ఉత్సహంతో పనిచేస్తున్నది. ఆ పార్టీ నేతలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకునే ప్రయత్నంలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా బలీయమైన నేతలను రంగంలోకి దింపే ప్రణాళికలు రచిస్తున్నారు.  ఇప్పటికే పలు సర్వేల ఆధారంగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నది. మరోవైపు ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ.. నాలుగేళ్ళలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజలు ఎన్ని విధాలుగా, ఎంతగా నష్టపోయారో వివరిస్తున్నారు.  టీడీపీతో పాటు జనసేన కూడా ఇదే అంశాన్ని సమర్ధవంతంగా ప్రజలలోకి తీసుకు వెడుతోంది. ప్రతిపక్షాల పొత్తుల వ్యవహారం కూడా త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నది. దాదాపుగా ఏపీలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లి అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకుంటుండగా.. అధికార వైసీపీ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. ప్రతిపక్షాలు టార్గెట్ చేసి ఘాటు విమర్శలకు దిగుతున్నా తిప్పికొట్టేందుకు తమ వద్ద సమాధానం లేదన్నట్లుగా సైలంట్ గా ఉండిపోతోంది.   మంత్రుల నుండి ఎమ్మెల్యే వరకూ అంతా సైలెంట్ మోడ్ లోనే ఉంటున్నారు. ఒకవైపు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరగా.. వాటిని అణచివేసే ప్రయత్నం కూడా ఈ పార్టీ అధిష్టానం తూతూ మంత్రంగానే చేస్తున్నది. ఇంకా చెప్పాలంటే అసలు మాకు పోటీనే లేదు.. మా నేతకి సాటే లేదు అన్నట్లు వైసీపీ నేతల తీరు కనిపిస్తున్నది. ద్వితీయ స్థాయి నేత నుండి ఎమ్మెల్యేల వరకూ కొందరికి ఇప్పటికే 2024 సినిమా క్లారిటీ వచ్చినా వారి మాటలను, సూచనలనూ   పార్టీ అధిష్టానం  పట్టించుకొనే పరిస్థితి లేకుండా పోగా.. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో వైసీపీ పోకడపైనే చర్చ జరుగుతున్నది.    వైసీపీ ఇలా కూల్ గా ఉండడం చూస్తే ఇది ఓవర్ కాన్ఫిన్స్ అనే భావన పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి జగన్ మళ్ళీ గెలుస్తారన్న పిచ్చి భ్రమల్లో ఉన్న నేతలు కొందరు.. అస‌లు సంగ‌తి మ‌ర‌చి పార్టీ పెద్దలను కూడా అదే మాయలో ఉంచుతున్నారన్న భావన కలుగుతున్నది. పేదలకు డబ్బులు పంచేశాం వాళ్లే మ‌న‌ల్ని గ‌ట్టెక్కిస్తారని ఆ పార్టీ పెద్దలు కూడా సీఎం వద్ద బాకాలు ఊదుతున్నట్లు తెలుస్తున్నది. ఇంటింటికీ మీ డబ్బులు జమ అయ్యాయని వాళ్ళెవరూ మిమ్మల్ని మర్చిపోరని సీఎంను ఆకాశాన్ని ఎత్తేస్తుండడంతో ఆయన ఊహాలోకాల్లో విహరిస్తున్నారనీ, చివరికి పార్టీ నేతల కుమ్ములాటను కూడా సీఎం వద్ద పార్టీకి అనుకూల అంశంగానే ప్రచారం చేస్తున్నారని వైసీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నది. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే నేతలు టికెట్ల కోసం కొట్టుకుంటున్నారని.. అదేమీ పెద్ద సమస్య కాదని, తామెళ్లి చిటికెలో వాటిని క్లియర్ చేస్తామని కొందరు బడా నేతలు సీఎం వద్ద చెప్పి మెప్పు పొందుతున్నట్లు చెబుతున్నారు,  అయితే, ప్రభుత్వం డబ్బులు పంచితే ప్రజలు పార్టీకి ఓటేసే రోజులు పోయాయి. చివరికి పార్టీ సొంత డబ్బులే ఎన్నికలకు ముందు రోజు ఓటర్ల చేతిలో పెట్టినా ఓటు పడుతుందన్న గ్యారంటీ లేదు. అందునా గత ప్రభుత్వానికి మించి ఈ ప్రభుత్వం ఇచ్చింది లేదని ఇప్పటికే లెక్కలు తేలాయి. దీనికి తోడు పూర్తిగా ప‌థ‌కాలు రాని వాళ్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.  ఉద్యోగులు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామా అని ఉన్నారు. వైన్ షాపుల వద్ద కాపాలా కాసిన టీచర్లు, నిత్యం బెదిరింపులు అనుభవిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు, కక్ష పూరిత రాజకీయాల పాపం మోస్తున్న పోలీసులు అందరూ ఇలా వారి వంతు అవకాశం కోసం చూస్తున్నారు. జగన్ అంటే నమ్మకం అనుకున్న యువ‌త‌ నిండా మునిగాక ఇప్పడు జగన్ అంటే మోసానికి షర్ట్ ప్యాంట్ వేసిన రూపమేనని మాట్లాడుకుంటున్నారు. భ‌వ‌న నిర్మాణ కార్మికులు అనుభవించిన ఆకలి బాధలు నేటికీ మర్చిపోలేకపోతున్నారు. మందుబాబులు ప్రతిరోజూ ఒక్కసారైనా సీఎంను తలచుకుని తిట్టుకోకుండా ఉండలేకపోతున్నారు. కోర్టులో మొట్టికాయలు, ఇంత వరకూ తేలని సొంత బాబాయ్ హత్య కేసు, కోడికత్తి కేసు, సీఎం సొంత తల్లి, చెల్లిని తరిమేయడం.. ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడంత లిస్టు. దీంతో ప్రతి వర్గంలోనూ అసంతృప్తి కనిపిస్తున్నది. ఇదేమీ జగన్ కళ్ళకు కనిపించడం లేదంటే చుట్టూ చేరిన నేతలు ఆయన్ను ఏస్థాయిలో భ్రమల్లో ముంచేశారో అర్ధం చేసుకోవచ్చు.

గుడివాడలో కొడాలి నాని పరాజయం ఖాయమేనా?

పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు, దివంగత నేత ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా  తెలుగుదేశం గత ఎన్నికలలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్ళలో తెలుగుదేశం తరఫున గెలిచిన   వారిలో మరో ఎమ్మెల్యే కూడా వైసీపీ పంచనే చేరారు. కారణాలు ఏమైనా కానీ ఇది ఆ పార్టీకి తీరని నష్టం కాగా.. ఎంత వీలయితే అంత త్వరగా.. ఏ స్థాయికి వీలయితే ఆ స్థాయికి ఇక్కడ టీడీపీ మళ్ళీ మునుపటి స్థాయిని అందుకోవాలన్న పట్టుదలతో పార్టీ అధినాయకత్వం, శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. అందునా తెలుగుదేశం పార్టీకి పంటి కింద రాయిలా మారిన ఇద్దరు నేతల స్థానాలను దక్కించుకోవడం కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఉంది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.  ఆ రెంటిలో  ఒకటి గన్నవరం కాగా రెండో నియోజకవర్గం గుడివాడ. ఒకటి మాజీ మంత్రి కొడాలి నానీ స్థానం కాగా మరొకటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్థానం. ఈ ఇద్దరికీ తొలిసారి సీట్లిచ్చి గెలిపించుకున్నది తెలుగుదేశం పార్టీయే. వారిరువురినీ  ప్రోత్సహించింది పార్టీ అధినేత చంద్రబాబే. కానీ, ఇప్పుడు ఈ ఇద్దరే తెలుగుదేశం పార్టీకి పంటి కిందరాయిలో, కొరకురాని కొయ్యగా మారారు. ప్రత్యర్థులలో మరే నేత విమర్శించని స్థాయిలో ఈ ఇద్దరూ తెలుగుదేశం ముఖ్య నేతలను టార్గెట్ చేసి విమర్శలకు దిగుతుంటారు. అందుకే ఈసారి ఎలాగైనా ఈ ఇద్దరినీ అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని తెలుగుదేశం పట్టుదలతో ఉంది.  ఇప్పటికే గన్నవరంలో వల్లభనేని వంశీకి టార్గెట్ సెట్ చేసింది. అంగ బలం, ఆర్ధిక బలం ఉన్న యార్లగడ్డ వెంకట్రావును ఇక్కడ రంగంలోకి దింపిన తెలుగుదేశం  కలిసి వచ్చే ఏ అంశాన్ని వదులుకోకుండా ప్రణాళికలు రచించుకుంటున్నది. తెలుగుదేశం ప్రణాళికాబద్ధంగా వేస్తున్న అడుగులతో  ఇక్కడ వంశీ గెలవడం సాధ్యం కాదని ఇప్పటికే పరిశీలకులు తేల్చి చెప్పేశారు. ఇక కొడాలి నాని విషయానికి వస్తే తాజాగా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుడివాడలో టికెట్ ఇచ్చేది  ఎవరికో పరోక్షంగా ప్రకటించేశారు.  కష్టపడి పనిచేసే వారికే గుడివాడ టికెట్ అని   క్లారిటీ ఇచ్చేశారు. దీనిని బట్టి చూస్తే ఎన్నారై వెనిగెళ్ల రాముకి గుడివాడ టికెట్ ఇస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా అదే చెబుతున్నాయి.    ఎన్నారై వెనిగెళ్ల రాము విషయానికి వస్తే  ఆయనకు అంగబలం అర్ధ బలంతో పాటు సామాజిక సమీకరణాలు కూడా పెద్ద ఎత్తున కలసి రానున్నాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన రాము భార్య దళితురాలు. దీంతో ఇక్కడ ఈ రెండు సామాజివర్గాలతో పాటు ఆర్ధికంగా పరిపుష్టి ఉన్న నేతతో పాటు తాజా ఫేస్ కూడా కావడం తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అవకాశమని చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ వైసీపీ ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యే కొడాలి నానీ మధ్య అంతర్గత కుమ్ములాటలు కూడా  తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్. తాజాగా ఎమ్మెల్యే నానీకి తెలియకుండానే.. ఎంపీ బాలసౌరి ముఖ్య అతిధిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగగా.. నానీ అనుచరులు ఈ కార్యక్రమంపై దాడులకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కుమ్ములాట జరిగింది. ఇలాంటి చిల్లర గొడవలకు తోడు ప్రభుత్వంపై వ్యతిరేకత టీడీపీ అభ్యర్థిని గెలుపు తీరాలకు చేర్చడం ఖాయం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి అమరావతి ఫ్యాక్టర్  కారణంగా కొడాలి నానీకి డిపాజిట్లు కూడా దక్కడం అనుమానమేనని అంటున్నారు. ఇక, ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావు విషయానికి వస్తే.. 2000లో జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. మళ్లీ ఆయన ఎమ్మెల్యే కాలేకపోయారు. 2004లో వెంకటేశ్వరరావును కాదని టికెట్ కొడాలికి ఇవ్వడంతో ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్లిపోయారు. 2009లో అక్కడ కూడా ఓడిపోగా.. కొడాలి తెలుగుదేశం పార్టీని వీడిన  తరువాత 2014లో ఆయనకు రెండవసారి టికెట్ దక్కినా మళ్ళీ ఓడిపోయారు. దీంతో టీడీపీ 2019లో రావిని కాదని దేవినేని అవినాష్ కి టికెట్ ఇచ్చింది. ఇప్పుడు అవినాష్ కూడా వైసీపీలోకే వెళ్లడంతో రావి  ఇంచార్జిగా ఉన్నారు. రావి వెంకటేశ్వరరావు పార్టీకి విధేయుడే కాకుండా అందరికీ అందుబాటులో ఉంటారు. కానీ, కొడాలి నానీని ఢీ కొట్టే స్థాయిలో ఆయన లేరనీ,  రావి ఆర్ధికంగా కూడా తరితూగే పరిస్థితి లేదనీ పార్టీ శ్రేణులే అంటున్నాయి. అందుకే ఆయన సేవలను గుర్తించేలా ఆయన్ను ఎమ్మెల్సీని చేసేలా హామీ ఇచ్చిన తె7లుగుదేశం అధినేత వెనిగండ్ల రామూను తెరపైకి తీసుకు వచ్చారని చెబుతున్నారు. తెలుగుదేశం ప్రణాళిక అమలైతే.. ఆ లెక్కల ప్రకారం ఈసారి కొడాలి అసెంబ్లీ గేట్ దాటడం కష్టమే అవుతుంది అంటున్నారు. 

ఈ శతాబ్దం ఎన్టీఆర్ దే!

సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. జగదేక సుందర రూపం, నవ నవోన్మేష చైతన్య స్వరూపం తారకరామనామధేయం. ఇటు సినీ జగత్తులోనూ, అటు రాజకీయ రణరంగంలోనూ రాణించిన ప్రతిభా భాస్వంతం. వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించి అన్నింటా అగ్రగామిగా నిలిచి, నిజజీవిత నాటకరంగంలోనూ కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, నాయకుడిగా, మహానాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా.. ఇన్ని పాత్రలు గొప్పగా పోషించి అనితరసాధ్యుడు అనిపించుకున్న మహామనీషి ఎన్టీఆర్.తెలుగుజాతి ఉన్నన్నాళ్ళు ఆయన నామం చిరస్మరణీయం. దేవుడు ఎలా ఉంటాడు అంటే తెలుగువాడెవరైనా ఎన్టీఆర్ లా ఉంటాడనే అంటారు.  1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలకే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, నభూతో న భవిష్యతి అన్న కీర్తిని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి చరిత్రకెక్కారు. జాతీయ స్థాయిలో తాము మద్రాసీయులం కాదనీ, తెలుగువారమనీ ఘనంగా చాటిచెప్పి ఢిల్లీ పీఠాన్ని వణికించిన ఘనత సాధించారు ఎన్టీఆర్. తెలుగు ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదవాడి అన్నంగిన్నెగా మారారు.  చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగువారందరిలోనూ రాజకీయ చైతన్యం నింపిన ఎన్టీఆర్.. యువతను, విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాల వారిని నాయకులుగా, మంత్రులుగా చేశారు. పేదల కోసం, మహిళల కోసం అహరహం తపించారు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, పేదల పాలిట పెన్నిధి అయ్యారు.  ఆడపడుచులకు ఆస్తి హక్కు లాంటి పథకాలతో అందరికీ అన్నగారు అయ్యారు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  ఎన్టీఆర్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన  తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది. అందుకే ఆయనకు సంబంధించి ఏ చిన్న అంశమైనా తెలుగు వారంతా తమ సొంతంగా భావిస్తారు. ఆయనకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి కార్యక్రమం అయినా తెలుగు జాతి ఉమ్మడిగా కదిలి వస్తుంది. కాగా, ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ముఖచిత్రంతో 100 రూపాయల నాణెంను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కాయిన్‍ను ఆగస్ట్ 28న ఢిల్లీలోని  రాజ్ భవన్ కల్చరల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి నందమూరి కుటుంబీకులు బాలకృష్ణ, జయకృష్ణతోపాటు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. కాగా, ఈ కాయిన్ కు ఇప్పుడు కనీవినీ ఎరుగని డిమాండ్ ఏర్పడింది. ఈ కాయిన్ కు తొలిరోజే విశేష స్పందన లభించింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్.. అందుబాటులో ఉంచిన రెండు పద్దతులలో కూడా తొలి రోజే అవుట్ అఫ్ స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఇప్పటి వరకు ఏ స్మారక నాణేనికి లేని డిమాండ్ ఎన్టీఆర్ నాణేనికి ఉందని తొలి రోజే హైదరాబాద్ మింట్ ఫైనాన్స్ జాయింట్ జనరల్ మేనేజర్ గుండపునీడి శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటి వరకూ తీసుకొచ్చిన స్మారక నాణేలు ముద్రించినవన్నీ 10 వేల లోపే చేశామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ స్మారక నాణెం ఒక్కో నాణెం ధర రూ. 3,500 నుంచి రూ. 4,850 వరకు ఉండగా.. మూడు వేరియంట్లలో ఈ నాణెం అందుబాటులోకి తెచ్చారు. తొలి విడతగా 12 వేల ఎన్టీఆర్ స్మారక నాణేలు ముద్రించగా అవి సేల్స్ కి పెట్టిన గంటలలోనే అమ్ముడైపోయాయి. ఆ మాటకొస్తే వేకువజాము నుండే ఎదురుచూసి మరీ ఎన్టీఆర్ అభిమానులు ఈ కాయిన్ సొంతం చేసుకున్నారు. దీంతో మరో 8 వేల కాయిన్స్ కూడా ముద్రించనున్నట్లు మింట్ మేనేజర్ శ్రీనివాస్ అప్పుడే చెప్పుకొచ్చారు. కాగా, తాజా సమాచారం ప్రకారం రెండో విడతలో 8 వేలు కాదు 40 వేల వరకూ ముద్రించనున్నట్లు తెలుస్తున్నది. ఈ నాణేనికి ఉన్న డిమాండ్ ప్రకారం ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి పురందేశ్వరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ నాణేన్ని పురందేశ్వరి సొంత డబ్బులతోనే ముద్రిస్తున్నారు. ఎన్టీఆర్ స్మారకంగా ప్రభుత్వం మింట్ లో ముద్రణకు అనుమతించగా.. ఇలా ఎన్ని కావాలన్నా మింట్ సిబ్బంది అందించేందుకు సిద్ధంగానే ఉంటారు. గతంలో ఇలా చాలా నాణేలను ముద్రించినా ఒక్క ఎన్టీఆర్ నాణేనికే ఎన్నడూలేని విధంగా ఊహించని డిమాండ్ ఏర్పడింది. పలు చోట్ల కొందరు ఎన్టీఆర్ అభిమానుల ముసుగులో ఈ నాణేలను సొంతం చేసుకొని బ్లాక్ లో కూడా అమ్మకాలు చేపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.  ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఈ నాణేల ముద్రణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. తొలి విడతలో 12 వేల నాణేలను తయారు చేయగా రెండో విడతలో 40 వేల వరకు ముద్రించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇందులో కూడా మూడు రకాలలో భారీ డిమాండ్ ఉన్న ఒక రకాన్ని 15 వేలకు పైగా ముద్రించనున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులెవరూ బ్లాక్ లో నాణేలను కొనే సాహసం చేయవద్దని, ఎవరికి నాణెం కావాలన్నా అందరికీ అందుతాయని, త్వరలోనే భారీ స్థాయిలో ఈ నాణేలు అందుబాటులోకి వస్తాయని సోషల్ మీడియాలో అభిమానులు మిగతా అభిమానులను కోరుతూ పోస్టులు పెడుతున్నారు.   ఎన్టీఆర్ పుట్టింది 100 సంవత్సరాల క్రితం.. చనిపోయి కూడా 25 సంవత్సరాలు.. అయినా కూడా ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు.   ఆయన ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదు అన్నది ఈ నాణానికి ఉన్న డిమాండ్ ను బట్టే తెలిసిపోతుంది. అందుకే ఈ శతాబ్దం ఎన్టీఆర్ దే అనడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. 

ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టే ఆలోచనలో జగన్ సర్కార్?

జగన్ సర్కార్ తీరు కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లుఅన్నట్లుగా ఉంది.  ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేసింది. రాష్ట్ర ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అందిన కాడికి అప్పులు చేసేసింది. వివిధ కార్పొరేషన్ల పేరిట, బాండ్లను ష్యురీటీగా పెట్టి రకరకాల మార్గాల ద్వారా ప్రపంచ బ్యాంకుల వద్ద కూడా అప్పలు చేసింది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి అప్పు తెచ్చింది. చివరికి దేవాలయాల భూములను కూడా తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించగా దానికి కోర్టులు బ్రేకులేశాయి. ఒక రాష్ట్రం తన పరిధికి ఎంత అప్పు చేయడానికి నిబంధనలు అంగీకరిస్తాయో అంతా జగన్ సర్కార్ ఎప్పుడో చేసేసింది.అంతకు మించి కూడా చేసేసింది. అయినా ఇంకా అప్పులు కావాలని కేంద్రాన్ని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలాడుకుంటున్నది. అందుకు కేంద్రం పెట్టే షరతులకు ఒప్పుకొని ప్రజా ప్రయోజనానికి కూడా గండికొట్టేసింది.ఇప్పటి వరకూ చేసిన అప్పులు సరిపోలేదేమో కానీ ఇప్పుడు ఏకంగా ప్రజల ప్రైవేట్ ఆస్తులను కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తాకట్టు పెట్టే ఆలోచన  చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   ఏపీలో రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఇప్పుడు మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. కార్డ్ ప్రైమ్ అని కొత్త సాఫ్ట్ వేర్ తో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఈ నూతన విధానంలో లాభనష్టాలపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. వీటన్నిటినీ గమనిస్తే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తులపై కూడా హక్కు తనదే అని భావిస్తోందా? అవసరమైతే ప్రజల ప్రైవేట్ ఆస్తులను కూడా కావాల్సిన విధంగా తాకట్టు పెట్టుకొని అప్పు తెచ్చుకోవాలని చూస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రజలకు ఇవ్వరట. కేవలం కలర్ జిరాక్స్ మాత్రమే హక్కు దారులకు అందిస్తారట. ఎప్పుడైనా ఆస్తి హక్కుదారులు తమ ఒరిజినల్ పత్రాలు తమకి కావాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుంటే అప్పుడు కూడా స్పెసిమన్ కాపీలు ఇస్తారు. అవి కూడా ఒరిజినల్ కాదు. ఇప్పటివరకూ మనం ఆస్తి కొంటే అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్స్ మనకి ఇస్తారు. ఇవి మన దగ్గర ఉంటే ఆ ఆస్తి మనదే అనే నమ్మకం ఉంటుంది. ఎప్పుడైనా అవసరం అయితే ఆ పత్రాలను బ్యాంకులలో లేదా   వడ్డీ వ్యాపారుల వద్ద తనఖా పెట్టి డబ్బు తెచ్చుకొని అత్యవసరాలను తీర్చుకొనే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ఒరిజినల్ పత్రాలే హక్కు దారులకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ కొత్త కార్డ్ ప్రైమ్ అనే విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కలర్ జిరాక్స్ హక్కు దారుల చేతులో పెడతారు. కావాలని దరఖాస్తు చేసుకుంటే స్పెసిమన్ కాపీలు అందిస్తారు. కనీసం ఈ స్పెసిమన్ కాపీలు అయినా ఒరిజినలేనా అంటే ఇప్పటి వరకూ స్ఫష్టత ఇచ్చే నాధుడే కనిపించడం లేదు. ఈ స్పెసిమన్ కాపీలు బ్యాంకులు యాక్సెప్ట్ చేస్తాయా అంటే ఏ రిజిస్టార్ ఆఫీసులో కూడా స్ఫష్టమైన సమాధానం రావడం లేదు. బయట వడ్డీ వ్యాపారుల వద్ద ఇక అసలు చెల్లె పరిస్థితే లేదు. మనం మన ఆస్తిని అమ్ముకోవాలంటే బహిరంగ మార్కెట్ లో ముందుగా చూసేది ఒరిజినల్ డాక్యుమెంట్.. దానికి లింక్ డాక్యుమెంట్. అవి రెండూ ఇప్పుడు కనిపించవని చెబుతున్నారు. దీంతో అసలు ఆస్తి మన పేరు మీదనే ఉందా.. ఉంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ భద్రంగానే ఉన్నాయా అనే అనుమానం హక్కు దారునికి జీవితాంతం ఉంటుంది.  దీంతో, ప్రభుత్వం వద్దే ప్రజల ఆస్తుల పత్రాలు ఉండడం అనేది ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఈ పత్రాలు ఫిజికల్ గా కాకుండా డిజిటల్ విధానంలో స్టోర్ చేస్తారని అనుకుంటే అది ఇంకా ప్రమాదం. ఎప్పుడు ఎవరు టాంపర్ చేస్తే తమ ఆస్తి పత్రాలు కూడా పోతాయని ప్రజలు నిత్యం భయపడాల్సిన పరిస్థితి. మరి ఇంత రిస్క్ ఉన్నా ప్రభుత్వం ప్రజల ఆస్తుల పత్రాలను తమ ఉంచుకోవాలనుకోవడం చూస్తుంటే.. ప్రభుత్వం వీటిని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసే  ఆలోచన ఏమైనా చేస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  

ఆర్5 జోన్ స్టే ఎత్తివేతకు సుప్రీం నో.. జగన్ కు మరో పరాభవం

భవిష్యత్ రాజధాని కోసం ఏడాదికి మూడు పంటలు పండే భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇస్తే.. అందులో పరిపాలనా భవనాలను కాకుండా గృహాలను నిర్మించాలని, అది కూడా రాజధానేతర ప్రాంతం వాళ్లకు ఇళ్లను నిర్మించాలని వైసీపీ సర్కార్ కుయుక్తులు పన్నింది. ఈ విషయంపై ఇప్పటికే రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. మరోవైపు కోర్టులు ఇది చెల్లదని మొట్టికాయలు వేశాయి. కానీ, కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా.. అమరావతి రైతులు తమ బాధ ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా దున్నపోతు మీద వాన మాదిరి జగన్ ప్రభుత్వంలో అసలు చలనమే లేదు. అందుకే ఆ మధ్య ఆర్ 5 జోన్ లో ఈ ఇళ్ల  స్థలాల పట్టాలు ఇస్తూ జీవో జారీచేసింది. అనంతరం ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్లాన్ వేసింది. అయితే, దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది.  ఈ అనుమతుల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. ఆ మధ్య ఒకసారి ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. జగన్ ప్రభుత్వం ఇచ్చే పట్టాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని, తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు  లబ్థిదారులకు ఉండవని స్పష్టం చేసింది. ఆ వ్యవహారం అలా కోర్టుల పరిధిలో ఉండగానే అమరావతిలో ఇళ్ల స్థలాలలో మౌలిక వసతుల కల్పన పనులను కూడా మొదలు పెట్టారు. కాగా, ఇప్పుడు మరోసారి విచారణ చేసిన సుప్రీంకోర్టు అమరావతి ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన  తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను నవంబర్ కు వాయిదా వేసింది.  హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో స్టే వస్తే ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. కానీ, విచారణ నవంబర్ కు వాయిదా పడటంతో అప్పటి వరకూ ఇళ్ల నిర్మాణం ఊసెత్తే అవకాశం, అధికారం జగన్ ప్రభుత్వానికి లేకుండా పోయింది.  గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కీలక అంశాలున్నాయి.  అమరావతి ఆర్‌5 జోన్‌లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను  వెంటనే నిలిపివేయాలని ఆదేశించిన హైకోర్టు.. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం పేదలకు ఇస్తున్న పట్టాలు అంతిమ తీర్పునకు లోబడి ఉంటాయని గుర్తు చేసింది. స్థలం ఇవ్వడానికి మాత్రమే అనుమతి గానీ ఇళ్ళు కట్టడానికి లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రభుత్వం తామే నిర్ణయించిన భూమి విలువ రూ.345 కోట్లు  సీఆర్డీఏకు ఇప్పటికీ చెల్లించకపోవడాన్ని  హైకోర్టు ధర్మాసనం ఎత్తి చూపింది. దీని కోసం మొత్తం ఖర్చు రూ.1500 నుండి 2000 కోట్లు అవుతుందని, తీర్పు వ్యతిరేకంగా వస్తే ఈ డబ్బుకు ఎవరు బాధ్యులని ప్రశ్నించింది. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తుంటే కోర్టు చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసింది.   హైకోర్టు తీర్పుపై వైసీపీ సర్కార్ సుప్రీం వరకూ వెళ్లగా అక్కడ కూడా ఆశించిన ఫలితాలేమీ రాలేదు. తదుపరి విచారణ నవంబర్ కు వాయిదా పడింది. అప్పుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం దాదాపు అసంభవం అని న్యాయనిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఒక నిర్దిష్ట ఒప్పందంతో ప్రభుత్వమే ఇక్కడ రైతుల వద్ద నుండి భూములు తీసుకుంది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని కాదని.. ఆ భూములను మరొక రకంగా ఉపయోగించుకోవాలంటే అది కుదిరే పనికాదు. అలా చేయాలంటే ప్రభుత్వం అనుకున్న ఒప్పందం ప్రకారం రైతులకు చేకూరే ప్రయోజనాల విలువను చెల్లించి, అప్పుడు తాను అనుకున్నట్లుగా చేసేందుకు ఉపక్రమించొచ్చు.   అలా రైతులకు ప్రయోజనాలు చెల్లించాలంటే ప్రభుత్వం లక్షల కోట్లు అమరావతి రైతులకు చెల్లించాలి. ఈ క్రమంలోనే ఇది జరిగే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదని పరిఇశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇవన్నీ వైసీపీ ప్రభుత్వానికి తెలియని అంశాలేవీ కావు కాదు. తెలిసి కూడా మౌలిక సదుపాయాల పేరిట కోట్లు ఖర్చు చేసింది. ఈ వెచ్చించిన నిధులన్నీ బూడిద పాలే అవుతాయి. మరోవైపు కింది కోర్టు నుండి హైకోర్టు.. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు అంటూ వందల కోట్ల రూపాయలను కోర్టు కేసుల కోసం ఖర్చు చేస్తుంది. మరి ఈ మొండి వైఖరి వలన ఎవరికి లాభమో ఆ జగన్ మోహన్ రెడ్డికే తెలియాల్సి ఉంది. ఇక నవంబర్ వరకూ ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణం అన్న మాటే ఎత్తే అవకాశం జగన్ సర్కార్ కు లేకుండా పోయింది. దాంతోనే జగన్ ఇంత కాలం చెబుతూ వచ్చిన మూడు రాజధానుల మాట ఇక ఆయన నోట వచ్చే అవకాశమే లేదు. అలాగే సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటూ విశాఖకు మకాం మార్చే అవకాశాలు కూడా మృగ్యమనే చెప్పాలి.  

గులాబీ బాస్ కోటకు బీటలు!?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా?  రాష్ట్రంలో రాజకీయాలను తనయుడు కేటీఆర్ కు అప్పగించేసి తాను జాతీయ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించే లక్ష్యంతో లోక్ సభకు పోటీ చేస్తారా? అన్న అనుమానాలు నిన్న మొన్నటి వరకూ కొందరిలోనై ఉండేవి. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఒక స్థానం నుంచి కాదు ఏకంగా రెండు స్థానాల నుంచి పోటీకి నిలబడతానంటూ ప్రకటించడంతో  ఆయన జాతీయ రాజకీయాల ప్రకటనలన్నీ రాజకీయ పబ్బం కోసం చేసినవేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అయితే ఆయన తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానన్నది ప్రకటించడానికి ముందే.. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ తాను ప్రత్యర్థిగా పోటీలోకి దిగుతామంటూ ప్రకటనలు చేస్తున్న వారి సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే గజ్వేల్ నుంచి కేసీఆర్ ప్రత్యర్థిగా తాను రంగంలోకి దిగుతానంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు.  అంతే కాకుండా ఆ మేరకు బీజేపీ అధిష్ఠానం అనుమతి కూడా కోరానని చెప్పారు.  పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, బీజేపీ నేత సువేందు అధికారి ఓడించిన విధంగా ఇక్కడ తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అలాగే  మరో బీజేపీ ఎమ్మెల్యే, రఘునందన రావు కూడా పార్టీ ఆదేశిస్తే, ముఖ్యమంత్రి పై పోటీ చేసేందుకు తాను సిద్దమని   ప్రకటించేశారు. ఇప్పుడు కేసీఆర్ తాను స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తన బలహీనతను తానే చాటుకున్నారు. గజ్వేల్ లో తనకు ఎదురుగాలి వీస్తున్నదని ఆయన పరోక్షంగా అంగీకరించేసినట్లైంది. రెండో నియోజవకర్గంగా ఆయన కామారెడ్డిని ఎంచుకోవడంతో బీజేపీ ఎంపీ అర్వింద్ తాను కేసీఆర్ పై పోటీకి సిద్ధమని సవాల్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ ను బహిష్కృతుడైన తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ కు తాజాగా ఓ సవాల్ విసిరారు. గజ్వేల్, కామారెడ్డి కాదు.. ఖమ్మంలోని మూడు జనరల్ స్థానాలలో ఒక స్థానం నించి కేసీఆర్ పోటీ చేయాలనీ, ఆయన ఏ స్థానాన్నిఎంచుకున్నా సరే ఆయనకు ప్రత్యర్థిగా తాను నిలబడతాననీ, ఒక వేళ తాను పరాజయం పాలైతే రాజకీయ సన్యాసం చేస్తాననీ సవాల్ విసిరారు.   తెలంగాణ ఉద్యమ నేతగా, ప్రత్యేక రాష్ట్రం సాధించిన నేతగా ఇప్పటి వరకూ తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ ఈ సారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారనడానికి ఆయనపై పోటీ చేసి గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఇంకెంత మాత్రం తిరుగులేని శక్తిగా లేదనీ, అలాగే కేసీఆర్ కూడా గతంలోలా బలమైన నాయకుడిగా లేరనీ అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో గులాబీ కోటకే కాదు.. కేసీఆర్ నాయకత్వ సౌధం కూడా బీటలు వారిందని చెబుతున్నారు.   

హరికృష్ణ జయంతి.. స్మరించుకొన్న నందమూరి, నారా కుటుంబాలు

తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీర్ కుమారుడు,  రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ 67వ జయంతి శనివారం(ఆగస్ట్ 2). ఈ   సందర్భంగా నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఘనంగా నివాళులర్పించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎంతో మందికి హరికృష్ణ ఆత్మీయుడిగా నిలిచారని గుర్తు చేశారు. నిండైన తెలుగుదనానికి ప్రతిరూపంగా తెలుగువారి అభిమానాన్ని పాందారన్నారు. హరికృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ఈ మేరకు ట్విట్ చేశారు.  అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం తన మావయ్య హరికృష్ణ జయంతి సందర్భంగా తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. హరి మామయ్య జయంతి సందర్భంగా ఆయన జ్జాపకాలు ఒక్కసారిగా కళ్ల ముందు కదిలాయన్నారు. వెండితెరపై తన నటనతో అభిమానులకు ఆరాధ్య నటుడైన హరి మావయ్య డేరింగ్ పొలిటీషియన్ అని కొనియాడారు. అలంకరించిన పదవులకే వన్నె తెచ్చిన ఆయన తనకు నిత్య స్పూర్తి అని లోకేశ్ తెలిపారు.  ఇక నందమూరి హరికృష్ణ తనయులు నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తన తండ్రిని తలుచుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ఎమోషన్ అయ్యారు. ఆ క్రమంలో ట్విట్టర్ వేదికగా తన తండ్రి నందమూరి హరికృష్ణను స్మరించుకొంటూ వారు ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే అంటూ స్పందించారు. 1956, సెప్టెంబర్ 2న ఉమ్మడి కృష్ణాజిల్లాలోని  నిమ్మకూరులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు హరికృష్ణ జన్మించారు. 1996 - 1999 మధ్య చంద్రబాబు నాయుడు కేబినెట్ లో నందమూరి హరికృష్ణ.. రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత అంటే 2008 నుంచి 2013 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నందమూరి హరికృష్ణ చిన్నతనం నుంచే సినిమాల్లో నటించారు. బాలనటుడిగా  శ్రీకృష్ణావతారం, తల్లాపెళ్లామా, తాతమ్మ కల, రామ్ రహీం, దాన వీర శూర కర్ణలో నటించారు. ఆ తర్వాత శ్రీరాములయ్య, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో... సీతయ్య, టైగర్ హరిచంద్రప్రసాద్ తదితర చిత్రాల్లో కీలక భూమిక పోషించారు.  అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిట్టనిలువుగా చీల్చేందుకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన హరికృష్ణ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నందమూరి హరికృష్ణకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. 2018, ఆగస్ట్ 29న నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆయన మరణించారు.

కేంద్రం ముందస్తు ఆలోచన.. మరి జగన్ నిర్ణయం మాటేంటి?

దేశంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? జమిలి   పేరిట దేశంలో సాధారణ ఎన్నికలు ముందే జరగనున్నాయా? అంటే మోడీ సర్కార్ అడుగులను గమనిస్తే.. ఆ అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. జమిలి ఎన్నికలు, ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. పేరేదైనా ఈ ఏడాదే దేశంలో ఎన్నికలు జరుగుతాయా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో దేశంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్నాయి. డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరగొచ్చని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు కేంద్రం నిర్ణయాలు తోడై దేశవ్యాప్తంగా చర్చల రచ్చ జరుగుతున్నది. కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు బిల్లుల ఆమోదానికా, ముందస్తు ఎన్నికల ప్రణాళికకా అన్న అనుమానాలు గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే  వన్ నేషన్–వన్ ఎలక్షన్‌  అంశంపై మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో   కేంద్రం ఒక  కమిటీ వేసిన సంగతి  తెలిసిందే. ఈ కమిటీ  నివేదిక   కేంద్రానికి కావాల్సినట్లు ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఎంపీలతో ఫొటో సెషన్‌ ఏర్పాటు చేసిన బీజేపీ పెద్దలు అందరినీ ఒక చోట చేర్చి ఏ సంకేతాలిచ్చారన్నది ఆసక్తి రేపుతోంది. జరుగుతున్న అన్ని పరిణామాలను చూస్తే ముందస్తు జమిలి ఎన్నికలు జరగొచ్చని చర్చ జోరుగా సాగుతుంది. ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ ముందస్తు వ్యవహారంపై ఒక క్లారిటీ రానుంది.  నిజానికి ఈ ముందస్తు వ్యవహారం కొత్తదేమీ కాదు. కేంద్రంలో మోడీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జమిలి ఎన్నికలు దిశగా కొద్ది రోజులు ప్రయత్నాలు జరిగాయి. కానీ  అప్పుడు అది కేవలం  ప్రతిపాదనగానే మిగిలిపోయింది. ఈ ఆలోచన వచ్చిన ప్రతిసారి బీజేపీ ప్రభుత్వానికి ఏదొక అడ్డంకులు ఏర్పడడంతో ఇది ప్రతిపాదన దశలోనే ఉండిపోయింది. కాగా మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం.. త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు  ఉండటంతో కేంద్రం మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావనను ముందుకు తీసుకువచ్చింది.  కేవలం ప్రస్తావనతోనే వదిలేయకుండా ఈసారి ఏకంగా ఈ ప్రతిపాదనను ఆచరణలో  పెట్టాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నది.  మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ ముందస్తుకు తెలంగాణలో ఎలాంటి సమస్య లేదు. ముందే ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉండటమే అందుకు కారణం. అయితే కేంద్రం ముందస్తుకు వెళ్తే తెలంగాణలో ఎన్నికల సమయానికే దేశమంతా ఎన్నికలు జరుగుతాయి. 2024 మేలో ఏపీలో ఎన్నికలు జరగనుండగా.. అదే ముందస్తుకు జగన్ ఒకే చెప్తే వైసీపీ సుమారు ఎనిమిది నెలల ముందే ఎన్నికలను ఎదుర్కొనవలసి ఉంటుంది.  జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రాతి తీవ్రంగా ఉందన్న వార్తల నేపథ్యంలో జగన్ ముందస్తుకు సై అంటే ఎడెనిమిది నెలల ముందే అధికారం కోల్పోవలసి వస్తుందని అంటున్నారు. మరి దీనికి జగన్ ఒకే చెప్తారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే నిర్దిష్ట గడువుకు ఒక్క క్షణం ముందు కూడా అధికారానికి దూరం కావడానికి ఇష్టపడదు. మరి జగన్ కేంద్రం ప్రతిపాదిస్తున్న ముందస్తుపై ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం రాజకీయ సర్కిల్ లో ఉత్కంఠగా మారింది.  కేంద్రం లోక్ సభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే ఏపీలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ముందే జరగాల్సి ఉంటుంది. జగన్ ముందస్తుకు వెళ్ళకూడదు అనుకుంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయి. కానీ, ఈ ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి.  ఇంకా చెప్పాలంటే అసలు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నా.. జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకున్నా వైసీపీ మద్దతు కూడా తప్పనిసరి అని చెప్పాలి. జమిలి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇందుకోసం 543 లోక్ సభ ఎంపీలలో 67 శాతం మంది మద్దతు కావాలి. అలాగే రాజ్యసభలో కూడా 245 సభ్యులలో 67 శాతం మంది మద్దతు కావాలి.   లొక్ సభలో వైసీపీకి 22 మంది సభ్యులు ఉండగా.. రాజ్యసభలో వైసీపీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. వీరి అవసరం ఇప్పుడు బీజేపీకి ఉంది. దీనిని బట్టి చూస్తే జమిలీ ఎన్నికల కోసం కేంద్రానికి వైసీపీ మద్దతు ఇస్తే దాదాపుగా రాష్ట్రంలో కూడా అసెంబ్లీ రద్దుకు సిద్దపడ్డట్లే భావించాలి.  ఇలా ఉండగా బీజేపీ అడిగితే కాదనే పరిస్థితిలో   వైసీపీ ఎంత మాత్రం లేదు. అందుకే కేంద్రం జమిలికి రెడీ అయితే.. జగన్ కూడా మారు మాట్లాడకుండా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అయిపోతారనడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అలిపిరి నడక మార్గంలో మరో చిరుత

అలిపిరి  నడక మార్గాన్ని టీటీడీ చిరుత పులల అభయారణ్యంగా మార్చేసిందా? నడకదారి భక్తులు ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడేలా పరిస్థితులను మార్చేసిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా కలియుగ వైకుంఠంగా భక్తకోటి భావించే తిరుమల పవిత్రతను మంటగలపడంతో ఊరుకోకుండా.. తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా టీటీడీ అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చిరుత దాడిలో ఓ చిన్నారి మరణించిన సంగతి తెలిసిందే. అంతుకు కొద్ది రోజుల ముందు చిరుత దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలతో అలిపిరి కాలినడకన తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఒకటికి పది సార్లు ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చిరుత సంచారం ఉన్న ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేసి నాలుగు చిరుతను బంధించారు. భక్తులు హమ్మయ్యా అని ఊరట పొందే లోగానే మరో చిరుత సంచారాన్ని గుర్తించడంతో భక్తులలో ఆందోళన పెరిగిపోతున్నది.  కాలిబాటలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు కెమేరాలలో రికార్డు కావడంతో చిరుతల భయం కాలినడక భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇటీవల చిరుత దాడిలో బాలిక మరణించిన ప్రదేశంలోనే చిరుత సంచారాన్ని గుర్తించడంతో అసలు నడక మార్గం లో భక్తుల భద్రతను టీటీడీ గాలికి వదిలేసిందా అన్న అనుమానాలు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అలిపిరి నడకమార్గంలో నాలుగు చిరుతలను బంధించామని టీటీడీ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఆ మార్గంలో మరో చిరుత అంటే ఇది ఐదోది సంచరిస్తోందన్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి.  అలిపిరి నడకమార్గంలో భక్తుల రక్షణకు చేయాల్సిన ఏర్పాట్లు పూర్తిగా విస్మరించిన టీటీడీ భక్తులు తమను తామే రక్షించుకోవాలంటున్నది. ఇందు కోసం నకడమార్గంలో వెళ్లే వారికి కర్రలను సప్లై చేస్తున్నది. అంతే కాకుండా ఆ కర్రలతో చిరుతలను భయపెట్టి భద్రంగా వెళ్లండని సలహాలిస్తోంది. అయితే ఆ కర్రలు కూడా ఉచితం కాదట. ప్రతి కర్రకు రుసుం వసూలు చేస్తున్నది. కొండ కింద అలిపిరి నడక మార్గం వద్ద టీటీడీ కర్రలు అందజేస్తుంది. కొండపైకి వెళ్లగానే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. కర్రలను అందించడం ద్వారా శ్రీవారిని నడక మార్గంలో దర్శించుకోవాలనుకునే భక్తులు కర్రసాము నేర్చుకుని మరీ రండి అని టీటీడీ చెబుతోందా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అలిపిరి నడక మార్గంలో సంచరిస్తున్న చిరుతల సంఖ్య ఎంత అన్న విషయాన్ని సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించి నిర్ధారించే దిశగా టీటీడీ ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా?  నడకమార్గంలోకి వన్యప్రాణులు చొచ్చుకు రాకుండా కంచె  నిర్మాణం ప్రతిపాదన ఎప్పటికైనా కార్యరూపం దాలుస్తుందా? లేక కర్రలు ఇచ్చేశాం. ఇక మీ రక్షణ మీదే అంటు చేతులెత్తేసిందా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  

ప్రపంచ కొబ్బరి కాయ దినోత్సవం

కేరళ, ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలు కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. మనిషి ఆరోగ్యానికి అవసరమైన అన్నీ పుష్కలంగా ఉన్న ఫలం నారికేళం. ఆరోగ్యానికే కాకుండా ఏ శుభ కార్యాన్నైనా కొబ్బరి కాయ కొట్టే ప్రారంభిస్తారు. శుభాలకు కొబ్బరి కాయను ప్రతికగా భావించడం కద్దు. అదే విధంగా కొబ్బరి కాయను మానవ శరీరానికి ప్రతికగా చెబుతారు. కొబ్బరి కాయలో ఉండే నీటిని మనిషిలోని నిర్మలత్వానికి, కొబ్బరి పీచుకు మనిషిలోని అహానికీ, ఇక కొబ్బరిని మనిషి మనసుకూ ప్రతీకగా అభివర్ణిస్తారు. అంటే ప్రతి మనిషీ తనలోని అహంకారాన్ని విస్మరించి, నిర్మలత్వంతో మంచి మనసుతో మెలగాలని కొబ్బరికాయ చెబుతుందంటూరు.  మనిషి ఆరోగ్యానికి అవసరయ్యే వాటన్నింటినీ ప్రకృతి మనకు సహజంగానే అందించింది. కానీ మనమే ప్రకృతి ప్రసాదించిన వాటిని పక్కన పెట్టి డబ్బులు ఖర్చు చేసి మరీ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాము. జంక్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ల పేరుతో అనారోగ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాము. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో కొబ్బరి ఒకటి.  మనిషికి అత్యవసరమైన ఆరోగ్య, ఔషధ, సౌందర్య ప్రయోజనాలను అందించే  కొబ్బరికాయకూ ఓ ప్రత్యేక రోజు ఉందని తెలుసా? సెప్టెంబర్ 2ను ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవంగా పాటిస్తారు. ఇన్ని సుగుణాలున్న కొబ్బరిని   దక్షిణాది రాష్ట్రాల్లో వంటల్లో  విరివిగా వినియోగిస్తారు.   ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని  తొలిసారిగా 2009 సంవత్సరంలో జరిపారు.  కొబ్బరి వినియోగం,  దాని వల్ల ఒనగూరే  ప్రయోజనాలను ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కమిటీ  ఈ ప్రపంచ కొబ్బరికాయ ఈ దినోత్సవాన్ని గుర్తించింది.

బాబుకు ఐటీ నోటీసులు.. బీజేపీ వ్యూహంలో భాగమేనా?

ఏపీ రాజకీయాలలో బీజేపీ వ్యూహమేంటి అన్నది రాజకీయ పరిశీలకులకు కూడా ఒక పట్టాన అర్ధం కావడం లేదు. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో రాజకీయాలకు తెరతీసే బీజేపీ ఏపీ విషయంలో ఎలా పావులు కడుపుతున్నదీ అంతు చిక్కడం లేదు.  ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంతో తెర వెనక దోస్తీ నడుపుతున్న బీజేపీ కేంద్ర పెద్దలు.. రానున్న ఎన్నికల సమయానికి ఏ వైపు వెళ్తారన్నది కన్ఫ్యూజన్ లో పెడుతున్నారో లేదా వారే కన్ఫ్యూజన్ లో ఉన్నారో తెలియడం లేదు.  ఏపీలో ఇప్పటికే బీజేపీ జనసేనతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. జనసేనతో పాటు బీజేపీ కూడా తెలుగుదేశంతో  కలిసి వస్తుందా అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప చంద్రబాబు కానీ, బీజేపీ పెద్దలు కానీ పొత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. చేయడం లేదు. పవన్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసే వెళ్తామని ధీమాగా చెప్తున్నారు.  ఏపీలో ప్రతిపక్షాల మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అన్న అనుమానాల మధ్యనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపింది. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పనిలో పనిగా ఎన్నికల కమిషన్ కు ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేయడంతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు బీజేపీ పట్ల సానుకూలంగానే మాట్లాడారు. ఏపీలో పొత్తులను కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. చంద్రబాబు ఒకవైపు బీజేపీ పెద్దలతో పోత్తులపై చర్చలు జరుపుతుండగానే.. బీజేపీ మాత్రం టీడీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. తాజాగా చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా ఆయన వంద కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది.  జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో కాంట్రాక్టు సంస్థలను బెదిరించారని, బోగస్‌ కంపెనీలు సృష్టించి సబ్‌ కాంట్రాక్టుల రూపంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తూ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే, ఒకవైపు పొత్తులపై చర్చలు జరుపుతూనే మరో వైపు ఆదాయపన్ను నోటీసులు పంపడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. టీడీపీపై బీజేపీ పెద్దలు ద్విముఖ వ్యూహంతో వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తిస్తుంది. ఒకవైపు పొత్తుల చర్చల పేరిట చర్చలు జరుపుతూనే.. మరో వైపు ఐటీ నోటీసుల వెనక ఏదైనా వ్యూహం ఉందా అన్న అనుమానాలు పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పొత్తులో సాధ్యమైనంత ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడంతో పాటు టీడీపీని తమ గ్రిప్ లో ఉంచుకొనే వ్యూహం ఏమైనా బీజేపీ పెద్దలలో  ఉందా అన్న చర్చ సాగుతున్నది.  ఏపీలో బీజేపీకి ఇలాంటి రాజకీయాలు కొత్తేమీ కాదు. గత ఎన్నికల ముందు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏపీలోని టీడీపీ నాయకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. టీడీపీ ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టి వైసీపీ గెలుపుకు సహకరించాయి. ఇప్పుడూ అదే రీతిలో వచ్చే ఎన్నికల సమయానికి కూడా రంగం సిద్ధం అవుతోందా అనిపిస్తున్నది. అటు అవినీతి అక్రమాస్తుల కేసులు, ఇటు బాబాయ్ వివేకా హత్యకేసులను అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్ ను బీజేపీ పెద్దలు ఇప్పటికే తమ చెప్పు చేతల్లో ఉంచుకున్న సంగతి తెలిసిందే.  చంద్రబాబు జేపీ నడ్డాతో పొత్తులపై అలా చర్చించారో లేదో ఇలా జాతీయ మీడియా ఏపీలో పొత్తులపై.. టీడీపీ, బీజేపీల మధ్య సీట్ల పంపకాలపై ఊహకు అందని లెక్కలతో కథనాలు వండి వార్చాయి. ఆ కథనాలు వాస్తవానికి బహుదూరమని రాజకీయ పరిశీలకులు కొట్టిపారేశారు. అదలా ఉండగానే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు అంటూ మళ్ళీ అదే మీడియాలో కథనాలు వచ్చాయి. మొత్తంగా బీజేపీ ప్రస్తుత వైఖరి చూస్తే అటు దర్యాప్తు సంస్థలను, మీడియాను అడ్డం పెట్టుకొని పొత్తుల విషయంలో చంద్రబాబు బీజేపీకి దాసోహం అంటున్నారనే ప్రచారాన్ని సాగించడం, పొత్తుల విషయంలో తమ డిమాండ్లకు తగ్గట్లుగా ఏదో ఒక ప్రకటన చేసేలా ఒత్తిడి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. 

28 ఏళ్ల కిందట ఈ రోజు..

1995, సెప్టెంబ‌ర్ 1.. చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు. మారిన‌ తెలుగుజాతి త‌ల‌రాత‌కు తొలి అడుగు ప‌డిన రోజు. తెలుగోడి కీర్తిప‌తాకం ప్ర‌పంచ య‌వ‌నిక‌పై రెప‌రెప‌లాడేందుకు అంకురం ప‌డిన రోజు. మ‌న పిల్ల‌లను సాఫ్ట్‌వేర్ నిపుణులుగా తీర్చిదిద్ది  వారి ఉజ్వల భవిష్యత్  కోసం అమెరికాకు వంతెన వేసిన రోజు. స‌రికొత్త హైద‌రాబాద్ నిర్మాణానికి బీజం ప‌డిన రోజు. సైబరాబాద్ మహానగర నిర్మాణానికి పునాదది పడిన రోజు.  ప్ర‌భుత్వ ప‌నితీరు మారిన రోజు. పేద‌ల చెంత‌కే  పాలన నడిచి వ‌చ్చిన రోజు. అస‌లైన ప్ర‌జారంజ‌క‌ పాల‌నకు  తొలి అడుగు పడి నేటికి 28 ఏళ్లు.  ఔను.. 28 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున అంటే 1995 సెప్టెంబర్ 1న నారా చంద్ర‌బాబు నాయుడు తొలిసారి ముఖ్య‌మంత్రిగా పద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేసిన శుభ‌దినం.   ఆ రోజు జ‌రిగిన ఆ కీల‌క‌ఘ‌ట్టం తెలుగుజాతి చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌ని ఆ స‌మ‌యానికి ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. కానీ  కాల‌చ‌క్రం అందుకు సాక్షిగా నిలిచి.. చంద్ర‌బాబు హయాంను చరిత్రలో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించుకుంది. ఇప్ప‌టికీ రెండు తెలుగురాష్ట్రాల్లో చంద్ర‌బాబు అంటే పీక కోసుకునేంత అభిమానులు కోకొల్ల‌లు ఉన్నారంటే అతిశ‌యోక్తి ఎంత మాత్రం కాదు. ప్ర‌స్తుత‌ ఏపీ, తెలంగాణ‌లోని ఏ మారుమూల తాండాల‌కో, గిరిజ‌న గూడేల‌కో వెళ్లినా.. అక్క‌డ మీకు కనీసం ఒక్కడైనా చంద్రబాబు అభిమాని త‌ప్ప‌క క‌నిపిస్తాడు. చంద్ర‌బాబు వ‌ల్లే మా బిడ్డ అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడ‌ని చెప్పే తండ్రులు ఎందరో ఉన్నారు. చంద్ర‌బాబు హ‌యాంలోనే మా అబ్బాయికి టీచ‌ర్ జాబ్ వ‌చ్చింద‌ని సంతోషించే త‌ల్లులు తెలుగురాష్ట్రాల్లో ల‌క్ష‌ల్లో ఉంటారు. చంద్ర‌బాబు జ‌మానాలోనే తాము తొలిసారి గ్యాస్ సిలిండెర్‌తో వంట చేసుకున్నామ‌ని చెప్పే పేద‌లు..  చంద్ర‌బాబు వ‌ల్లే తాము డ్వాక్రా గ్రూపుల‌తో డ‌బ్బులు పోగేసుకొని త‌మ కుటుంబాల‌ను బాగుప‌రుచుకున్నామంటూ ఆనంద‌భాష్పాలు కార్చే మ‌హిళ‌లు తెలుగునేల‌పై ఏ మూల‌కు వెళ్లినా తార‌స‌ప‌డ‌తారు. ఈ రోడ్డు జ‌న్మ‌భూమిలో భాగంగా వేసింద‌ని.. ఆ స్కూల్ చంద్ర‌బాబు హ‌యాంలో క‌ట్టించింద‌ని.. ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో చంద్ర‌బాబు ఆన‌వాళ్ల‌ను ఎవ‌రూ తుడిపేయ‌లేరు.   ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించార‌నే అప‌వాదుతోనే అంద‌ల‌మెక్కిన చంద్ర‌బాబు నాడు తాను చేసింది  ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కాద‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను, టీడీపీని ఓ దుష్టశక్తి క‌బంధ హ‌స్తాల నుంచి విడుద‌ల చేసిన రోజని చెబుతారు తెలుగు త‌మ్ముళ్లు.  ఎన్టీఆర్‌లా  చంద్రబాబుకు ఛ‌ర్మిష్మా లేదు. ఆయ‌నలా అన‌ర్గ‌ళ వాగ్దాటీ లేదు. అయినా   తన పాలనా దక్షతతో ఎన్టీఆర్‌ను మ‌రిపించారు. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే అంత‌కుమించి.. ప‌ని చేసి చూపించారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత    ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు ప‌ట్టిన ద‌శాబ్దాల బూజును,  ఒక్క‌సారిగా దులిపేశారు. అస‌లైన వ‌ర్క్ క‌ల్చ‌ర్‌ను తీసుకొచ్చారు.  ప‌ని అంటే ఎలా చేయాలో.. ప‌నితీరు ఎలా ఉంటుందో , ఎలా ఉండాలో రుచి చూపించారు. మేం ప్ర‌భుత్వ ఉద్యోగులం.. మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరంటూ విర్రవీగే  వారి  కొవ్వు క‌రిగించేశారు.  ఫైళ్ల వారోత్సవాల‌తో.. గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల్లో గుట్ట‌లుగా పేరుకుపోయిన ఫైళ్లను ప‌రుగులు పెట్టించారు. ఆక‌స్మిక త‌నిఖీల‌తో అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించారు. సీఎం చంద్ర‌బాబు ఎప్పుడు, ఏ ఆఫీసుకు చెకింగ్‌కు వ‌స్తారో తెలీక‌.. నిత్యం అల‌ర్ట్‌గా ఉండేవారు అధికారులు. అంత‌కుముందు ఆఫీసులోనే నిద్ర‌పోయే క‌ల్చ‌ర్ ఉన్న ప్ర‌భుత్వ కార్యాల‌యాలు.. ఆ త‌ర్వాత మిల‌ట‌రీ ఆఫీసుల్లా ఎనీటైమ్‌ అల‌ర్ట్‌గా ఉండేలా చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే.  బ‌ద్ద‌కానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌లాంటి గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయిస్‌ను.. క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేలా  తీర్చిదిద్దారు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వాన్ని మధ్య అంతరాన్ని తగ్గించేశారు. ప్రభుత్వంలో ఉన్న 47 కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ.. వాటి పనితీరులో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చారు అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఉద్యోగుల మైండ్ సెట్ మార్చిన.. మాస్ట‌ర్ మైండ్ నారా చంద్రబాబునాయుడు. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ‘పని చేసే ముఖ్యమంత్రి’ గా పేరుగాంచారు.  తుఫాన్లు, వ‌ర‌ద ముంపు ప్రాంతాలకు  24 గంటల్లోనే చేరుకొని.. ద‌గ్గ‌రుండి స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌ర్య‌వేక్షించి.. సంక్షోభ స‌మ‌యాల్లో సమర్థత చాటుకొన్నారు. సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టిన‌ ‘శ్రమదానం’ కార్యక్రమం.. ఆ తర్వాత ‘జన్మభూమి’గా మారి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రూపురేకల‌నే మార్చేసింది. అంద‌రికీ శ్ర‌మ విలువ తెలిసేలా చేసింది. అభివృద్ధిలో అంద‌రినీ భాగ‌స్వామ్యం చేసింది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఎన్నో పనులు.. ప్రజలు క‌లిసిక‌ట్టుగా శ్రమదానంతో సాధించుకొని.. చంద్ర‌బాబుకు ధ‌న్య‌వాదాలు చెప్పుకునేవారు. ఎన్నారైల‌నూ జ‌న్మ‌భూమిలో భాగ‌స్వామ్యం చేసి.. మాతృభూమి బాగుకోసం మేముసైత‌మంటూ త‌ర‌లివ‌చ్చేలా చేశారు. పచ్చదనం-పరిశుభ్రత.. చంద్ర‌బాబు బ్రెయిన్ ఛైల్డే. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన  స్వయం సహాయక సంఘాలు, అప్పటికి నామమాత్రంగా ఉన్న ‘డ్వాక్రా’ పథకాన్ని ఉద్యమంలా నడిపించిన తీరు అప్పట్లో ఓ సంచలనం. ‘డ్వాక్రా పథకం’తో గ్రామీణ ప్రాంత మహిళలలో చైతన్యం వెల్లివిరిసింది. సామాజిక నాయకత్వం వెలుగు చూసింది. డ్వాక్రా సంఘాల విజయగాథలను తెలుసుకోవడానికి ఆనాడు దేశ, విదేశీ ప్రముఖులు ఏపీని సందర్శించేవారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎగసిన మహిళా ఆర్థిక స్వావలంబన చైతన్యంపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారంటే చంద్ర‌బాబు డ్వాక్రా గ్రూపుల‌తో ఎంత‌టి ఘ‌న చ‌రిత్ర సృష్టించారో తెలుస్తోంది.  తెలుగువారికి ఐటీని ప‌రిచ‌యం చేసి.. మ‌న జాతి త‌ల‌రాత మార్చేసిన ఘ‌నుడు  చంద్ర‌బాబు. హైదరాబాద్‌ను పెట్టుబడుల కేంద్రంగా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హబ్‌గా చేసిందీ చంద్ర‌బాబే. కంప్యూట‌ర్‌ను వాడిన తొలి ముఖ్య‌మంత్రీ చంద్ర‌బాబే. ఆనాటి హైటెక్‌సిటీతోనే ఈనాడు ఇంటింటికో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నారు. వేలాది ఇంజినీరింగ్ కాలేజీల‌తో ల‌క్ష‌లాది ఐటీ నిపుణుల‌ను త‌యారు చేశారు. అమెరికా అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్‌నే హైద‌రాబాద్ ర‌ప్పించారు. అందుకే చంద్ర‌బాబును అప్ప‌ట్లో దేశ ప్ర‌ముఖులంతా 'సీఎం' అని కాకుండా 'సీఈవో' అని పిలిచేవారు.  సంస్క‌ర‌ణ‌ల‌తో ఏపీని ప‌రుగులు పెట్టించారు సీఎం చంద్ర‌బాబు. పోఖ్రాన్‌ అణుపరీక్షలతో భారత్‌కు రుణాలివ్వరాదని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి ఆర్థిక సంస్థలపై అమెరికా ఆంక్షలు పెట్టినా, ఆనాడు చంద్రబాబు ప్రపంచ బ్యాంకు రుణం తేగలిగారు. అయితే, విద్యుత్‌ రంగంలో సంస్క‌ర‌ణ‌లు స‌త్ఫ‌లితాల‌చ్చాయి. దళిత వ‌ర్గానికి చెందిన బాలయోగి  లోక్‌సభ స్పీకర్‌గా, శ్రీమతి ప్రతిభాభారతిని అసెంబ్లీ స్పీకర్‌గా చేసి.. దళితులకు స‌ముచిత గౌరవాన్ని క‌ల్పించింది అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే.  ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు, వైఎస్సార్‌, కేసీఆర్‌, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి.. ఇలా తెలుగు నేల‌ను ఎంత‌మంది ముఖ్య‌మంత్రులు పాలించినా.. వారందిలోకీ చంద్ర‌బాబు పాల‌నే తెలుగుజాతి త‌ల‌రాత‌ని బాగా మార్చేసి తలమానికంగా నిలిచిందని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. రాజకీయ విభేదాల కారణంగా ఆయన గొప్పతనాన్ని తక్కువ చేసి చూపాలని ప్రయత్నించి భంగపడిన వారెందరో ఉన్నారు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రెండుసార్లు సీఎంగా, న‌వ్యాంధ్ర తొలి ముఖ్య‌మంత్రిగా.. చంద్ర‌బాబు పేరు తెలుగునేల‌పై  ఆ చంద్రార్కం నిలిచి ఉంటుంది.  ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా.. అమ‌రావ‌తిని క‌నుమ‌రుగు చేసేలాంటి కుతంత్రాలు న‌డిపినా.. చంద్ర‌బాబు ఆన‌వాళ్ల‌ను తుడిచేయడం అసాధ్యం అనడంలో సందేహం లేదు. ఎవ‌రు హైద‌రాబాద్ వెళ్లినా.. హైటెక్ సిటీని చూసినా.. ఏ ఫ్లైఓవ‌ర్ల‌పై ప్ర‌యాణించినా.. రైతు బ‌జారుకెళ్లినా.. ఎవ‌రు కొవాగ్జిన్ టీకా తీసుకున్నా.. ఏ ఇంజినీరింగ్ కాలేజీలో చ‌దివినా.. ఏ 'మీ సేవ' కార్యాల‌యానికి వెళ్లినా.. ఎక్క‌డ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నా.. అవ‌న్నీ చంద్ర‌బాబు పాల‌న‌ అనే మ‌హావృక్షానికి కాసిన  సుమధుర  ఫ‌లాలే. అందుకే, తెలుగుజాతి ఉన్నంత కాలం చంద్ర‌బాబు పేరు, ముఖ్య‌మంత్రిగా ఆయ‌న పాల‌న‌ చిర‌స్మ‌ర‌ణీయం. అందుకే, 1995, సెప్టెంబ‌ర్ 1.. ఓ చారిత్ర‌క‌దినం. గ్ర‌హ‌ణం చాయ‌లు వీడ‌గానే మ‌ళ్లీ చంద్రోద‌యం ఖాయం.

షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు.. మళ్ళీ సొంత గూటికి వైసీపీ నేతలు?

మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో షర్మిల ప్రారంభించిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్టీపీ ఇక కనుమరుగు కానుంది. ఒకటీ రెండు రోజులలోనే ఈ విలీన ప్రక్రియ జరగనున్నట్లు రాజకీయ వర్గాలలో  గట్టిగా వినిపిస్తున్నది. ఇప్పటికే దక్షణాది కాంగ్రెస్ అగ్రనేతలతో పలుమార్లు సమావేశమైన వైఎస్ షర్మిల తాజాగా  సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా భేటీ అయి చర్చించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, పార్టీలో విలీనం చేయడం వల్ల తనకు పార్టీ కల్పించే అవకాశాలు తదితర అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో షర్మిల చర్చించినట్లుగా తెలుస్తొంది. షర్మిల పార్టీ విలీన ప్రక్రియ అయితే ఖరారైంది కానీ.. ఇంతకీ ఆమె  ఏపీ రాజకీయాలకు వెళ్తారా?  లేక తెలంగాణ రాజకీయాలలోనే ఉంటారా  అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఇంతకీ ఆమె ప్రయాణం రెండు పడవలపై అంటే ఆమె తెలంగాణ, ఏపీలలో రాజకీయాలు చేస్తే ప్రయోజనం ఏమిటి? ఎవరికి అన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  అయితే, ప్రస్తుతం ఉన్న  సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ షర్మిల సేవలను రెండు తెలుగు రాష్ట్రాలలో వినియోగించుకోవడానికే మొగ్గు చూపుతోంది. షర్మిలకు తెలంగాణ నుండే ఒక ఉన్నత పదివితో పాటు కర్ణాటక కోటా నుండి రాజ్యసభకు పంపించనున్నారన్న చర్చ కూడా సాగుతోంది. అదీ కాక ఆమెను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలు లేకపోలేదని కూడా చెబుతున్నారు. ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిల ఇక్కడే కాంగ్రెస్ నుండి రాజకీయాలు మొదలు పెట్టనుండగా..  ఏపీలో ఎన్నికల సమయానికి ఆమె ఏపీ పీసీసీ పగ్గాలు అందుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసినట్లు తెలుస్తున్నది.     అదే జరిగి షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపడితే ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే కనుక వైసీపీకి తీరని నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయపరిశీలకులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమౌతున్న నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలలో సైతం పార్టీపై అసంతృప్తి వ్యక్తం అవుతోందని అంటున్నారు. అయితే, వీరిలో కొందరు ప్రస్తుతం టీడీపీ, బీజేపీతో టచ్ ఉండగా మరికొందరు ఆ పార్టీల్లోకి వెళ్లలేక.. వైసీపీలో ఉండలేక సతమతమవుతున్నారంటున్నారు. షర్మిల కనుక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే ఇలాంటి వారందరూ కాంగ్రెస్ లోకి క్యూకట్టడం ఖాయమని అంటున్నారు. గతంలో వైఎస్ హయంలో కాంగ్రెస్ లో చక్రం తిప్పిన నేతలలో కొందరు ఇప్పుడు వైసీపీలో ఉక్కపోతకు గురవుతున్నారు. షర్మిల కనుక ఏపీ పీసీసీ పగ్గాలు చేపడితే వీరంతా మళ్ళీ సొంత గూటికి అంటే కాంగ్రెస్ లోకి రావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా, పార్టీలో అగ్ర నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ వంటి నాయకులు కూడా షర్మిలతో కలిసి ప్రయాణం మొదలు పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. భవిష్యత్ పరిణామాలు,  ప్రస్తుత పార్టీలో ఎదుర్కొంటున్న అంతర్గత వర్గ పోరుతో చాలా మంది నేతలు మరో కొత్త అప్షన్ కోసం ఎదురుచూస్తుండగా ఇలాంటి వారికి షర్మిల కాంగ్రెస్ బెస్ట్ ఛాయిస్ గా మారడం ఖాయమంటున్నారు. అదే జరిగితే రాబోయే ఎన్నికల్లోనే దాదాపు పదిశాతం ఓటు బ్యాంక్ వైసీపీకి దూరమై కాంగ్రెస్ బదలాయింపు జరగడం గ్యారంటీగా కనిపిస్తున్నది. వైసీపీకి గత రెండు పర్యాయాలు దళిత, ముస్లిం, క్రైస్తవ వర్గాల్లో అధిక సంఖ్యాకులు మద్దతు ఇచ్చారు. షర్మిల ఏపీకి వస్తే వీరిలో దాదాపు 30 శాతం ఓటు బ్యాంకు మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, తెలంగాణలో పార్టీ పుంజుకోవడంతో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఏపీ నేతలు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ హయంలో చక్రం తిప్పిన ఇద్దరు ముగ్గురు బడా నేతలను అండగా పెట్టి  కాంగ్రెస్ ఏపీలో షర్మిలతో  రాజకీయం మొదలు పెట్టనున్నట్లు తెలుస్తున్నది.  

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్.. విడుదల

మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. హస్తిన నుంచి విశాఖ చేరుకున్న ఆయనను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఇటీవల గన్నవరంలో జరిగిన యువగళం సభలో అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ అరెైస్టు జరిగింది. సీఎం జగన్, మంత్రులను అవమానించేలా అయ్యన్న ప్రసంగం ఉందంటూ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు అయ్యన్న పాత్రుడిని విశాఖ విమానాశ్రయం వద్ద అదుపులోనికి తీసుకున్నారు. ఐపీసీ 153ఏ, 354, 504, 505(2), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. కాగా అదుపులోనికి తీసుకున్న అయ్యన్న పాత్రుడికి 41ఎ కింద నోటీసులు ఇచ్చి యలమంచిలి సమీపంలో విడుదల చేశారు. కాగా అయ్యన్న పాత్రుడిని విశాఖ విమానాశ్రయంలో అరెస్టు చేసి యలమంచలి వరకూ తీసుకెళ్లి అక్కడ 41ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేయడమేమిటన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో అచ్చెన్నాయుడినీ ఇదే విధంగా అర్ధరాత్రి ఆయన ఇంట్లోకి ప్రవేశించి మరీ అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఆ తరువాత అచ్చెన్నాయుడి అరెస్టుపై కోర్టు సర్కార్ కు, పోలీసులకు అక్షింతలు వేసిన సంగతి విదితమే. ఇప్పుడు అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేసి గన్నవరం తరలించి కోర్టులో హాజరు పరిస్తే కూడా అదే పునరావృతం అవుతుందన్న ఉద్దేశంతో యలమంచిలి వద్ద 41(ఏ) నోటీసులు ఇచ్చి విడుదల చేసి ఉండొచ్చని అంటున్నారు.  

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. మోడీ ముందస్తు సంకేతమేనా?

గత కొన్ని రోజులుగా దేశంలో ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోడీ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ముందస్తు ఎన్నికలకు వెళ్లడమేనని భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రచారంలో వాస్తవమెంత అన్నది ఇతమిథ్ధంగా తెలియదు కానీ.. మోడీ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు జరుగుతున్న ప్రచారం వాస్తవమేననిపించేలా ఉన్నయని చెప్పడానికి మాత్రం ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. వంట గ్యాస్ ధరలు తగ్గించడం, త్వరలో పెట్రో ధరలు కూడా భారీగా తగ్గే అవకాశాలున్నాయన్న ప్రచారంతో పరిశీలకుల విశ్లేషణే కాకుండా సామాన్య జనం కూడా మోడీ ముందస్తుకు సమాయత్తమౌతున్నారన్న భావనకు వచ్చేశారు. దీనికి మరింత బలం చేకూర్చే విధంగా ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిశాయి. మణిపూర్ హింసాకాండపై సుదీర్ఘ ప్రతిష్ఠంభణ అనంతరం విపక్షాల అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరిగింది. సరే ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందనుకోండి అది వేరే సంగతి. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం వెనుక ఉన్నది ముందస్తు వ్యూహమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుసగా రెండు పర్యాయాలు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలను చేపట్టిన మోడీ సర్కార్.. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలన్న కలను నిజం చేసుకోవడానికి తొమ్మదేళ్లకు పైగా సాగిన మోడీ పాలనపై పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకత అడ్డంకిగా నిలిచింది. దేశంలోని అత్యధిక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పటికీ.. దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ పట్ల ఇటీవలి కాలంలో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ధరల నియంత్రణ లేకపోవడం, వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న నేపథ్యంలో వాగ్దానాలను నెరవేర్చడంలే వైఫల్యం కూడా మోడీ సర్కార్ పై యాంటీ ఇంకంబెన్సీ తీవ్రంగా ఉండటానికి కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. అదే సమయంలో విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక మీనింగ్ ఫుల్  కంక్లూజన్ దిశగా సాగుతుండటం, రాహుల్ భారత్ జోడీ యాత్ర తరువాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల జనంలో  ఏదో ఒక మేర సానుకూలత వ్యక్తం అవుతుండటం కూడా బీజేపీ అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. ఈ పాజిటివ్ వేవ్ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి అదొక ప్రభంజనంలో దేశాన్ని చుట్టేసే ప్రమాదాన్ని పసిగట్టిన మోడీ బృందం.. విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక కొలిక్కి వచ్చేలోగానే ఎన్నికలకు వెడితే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందన్న నిర్ణయానికి వచ్చాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్నేళ్లుగా లేనిది.. ఇన్నేళ్లుగా లేనిది అనడం పూర్తిగా సరికాదు.. ఎందుకంటే ఈ తొమ్మిదేళ్లకు పైబడిన మోడీ పాలనలో ధరల పెరుగుదల కు చెక్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే అవి ఎన్నికల సమయంలో మాత్రమే. నిరాటంకంగా పెరుగుతున్న గ్యాస్, పెట్రో ధరలకు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కళ్లెం పడేది. పోలింగ్ తేదీ ముగిసే వరకూ వాటి పెరుగుదల ప్రస్తావనే ఉండేది కాదు.  కానీ ఇలా పోలింగ్ పూర్తయ్యిందో లేదో అలా ధరల కళ్లేలు తెంపుకుని పెరిగేవి. సరే ఇప్పుడు అనూహ్యంగా గ్యాస్ బండ ధరను ఒకే సారి 200 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం ఇది ఆడబడుచులకు మోడీ ఇచ్చిన రక్షాబంధన్ కానుకగా ప్రకటించింది. ఈ తొమ్మదేళ్లలో ప్రతి ఏటా   రఖీ పండుగ వచ్చింది. కానీ ఇప్పుడు తప్ప గతంలో ఎన్నడూ మోడీ ఆడబడుచులకు రక్షా బంధన్ కానుక ప్రకటించలేదు. ఇప్పుడు ముందస్తు మూడ్ లో ఉన్నారు కనుకనే ఉరుములేని పిడుగులా ఆడబడుచులపై అభిమానం, అనురాగం పెరిగిపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగనున్నాయి. అదే సమయంలో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. దీంతో మోడీ మూలన పడేసిన జమిలి నినాదాన్ని మళ్లీ తలకెత్తుకున్నారు. ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకూ, ఆ వెంటనే నాలుగు నెలల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు, వాటితో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ ఏడాది చివరిలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలతో పాటే వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న సార్వత్రిక, మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేస్తే ప్రజాధనం వృధాను అరికట్టినట్లు అవుతుందన్న వాదనను మోడీ బృందం బలంగా తెరపైకి తీసుకువస్తున్నది. ఇప్పటికే ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉన్న అసెంబ్లీల ఎన్నికలకు సన్నాహాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించేసింది. వాటితో పాటు సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు సై అనడం కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు మోడీ సర్కార్ రెడీ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన సన్నాహాలను కేంద్ర ఎన్నికల సంఘం చాపకింద నీరులా చేసుకుంటూ పోతోందని కూడా ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.   ఏపీ, ఒడిషాల్లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా నియమించారు. పలు రాష్ట్రాలలో ఓటర్ల జాబితా ఫైనల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా కేంద్రం… నిర్ణయం తీసుకుంటే అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కారు జోరుకు సైకిల్ బ్రేకులేసేనా?

ముచ్చటగా మూడోసారి అధికారం అందుకోవడం కోసం.. కారు పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోన్నారు. ఆ క్రమంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించేశారు. దీంతో ఈ జాబితాలో పేర్లు గల్లంతైన సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాదు.. ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ అభ్యర్థుల్లో సైతం అసమ్మతి జ్వాల పెల్లుబికుతోందిని.. వారిని సైతం చల్లబరిచేందుకు కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే రంగంలోకి దిగి.. తమ వంతు ప్రయత్నాలు చేపట్టిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఫ్యామిలీలో  పసుపు పార్టీ భయం అంతర్గతంగా పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని  టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించడమే కాదు.. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను దింపుతామని ఆయన పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఎన్నీ సెంటర్... సింగిల్ హ్యాండ్‌ అన్నట్లుగా పోటీకి దిగుబోతున్నట్లుగా పసుపు పార్టీ శ్రేణులకు చంద్రబాబు ప్రకటన ఓ క్లారిటీ ఇచ్చినట్లు అయిందని.. అలాంటి వేళ  రానున్న ఎన్నికల్లో సైకిల్ పార్టీ వల్ల.. కారు పార్టీ విజయావకాశాలకు బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అయితే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికార పీఠాన్ని కైవనం చేసుకోవాలని.. బీజేపీ అగ్రనేతలు ప్రణాళిక బద్దంగా దూసుకెళ్తున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ సైతం దూకుడుగా ముందుకు వెళ్తోంది. అదీకాక కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా రావడంతో.. తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపినట్లు అయింది. దీంతో ఎలాగైనా గెలువాలనే ఓ పట్టుదలతో.. ఆ దిశగా హస్తం పార్టీ శ్రేణులు ముందుకు  కదులుతోన్నాయి.  ఇంకోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలన సాగించినా.. అభివృద్ధి, సంక్షేమం మాత్రం అరకొరగానే జరిగిందని... కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ విశ్వనగరంగా పునాదులు వేసుకొందని.. అప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు మాత్రమే ఉంటే.. వాటికి అదనంగా సైబరాబాద్ మహానగరం పురుడు పోసుకుందని.. ఈ విషయాన్ని తెలంగాణలోని ప్రస్తుత అధికార గులాబీ  పార్టీలోని అగ్రనేతలు సైతం వివిధ వేదికల మీద ఒప్పుకొన్నారని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.       అలాగే ఇటీవల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపట్టారని.. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అలాగే ఈ దశాబ్ది కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి , అదేవిధంగా ఆయా ప్రభుత్వాలు తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు, ఇక హైదరాబాద్ నగరాభివృద్ధి నాడు ఎలా ఉంది.. నేడు ఎలా ఉంది.. తదితర అంశాలను ప్రజలకు వివరించడంలో.. సైకిల్ పార్టీ శ్రేణులు.. యమ స్పీడ్‌గా దూసుకుపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో బీజేపీ కానీ, వామపక్షాలు కానీ అధికారాన్ని చేపట్టింది లేదని.. కానీ కేంద్రంలో బీజేపీ పాలన ఎలా సాగుతోందో మోదీ పరిపాలనతో అందరికీ అర్థమైందని.. అలాంటి వేళ.. రానున్న ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన ఓట్లు.. భారీగా చీలి.. అవి తెలుగుదేశం పార్టీకి పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని... దీంతో గులాబీ బాస్‌ కూర్చికి ఎసరు పట్టే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అదీకాక.. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిందని... దీంతో తెలంగాణ వాదం కాస్తా అవిరైపోయిందని.. సరిగ్గా ఆదే సమయంలో ఖమ్మం వేదికగా గతేడాది చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన శంఖారావ సభ సూపర్ డూపర్ సక్సెస్ అయిందని.. దీంతో ఆ నాటి నుంచి తెలంగాణలో సైకిల్ పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటు కొనేందుకు చేపట్టిన ప్రతీ చర్య.. సఫలీకృతమవుతు వస్తుందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.

విదేశీ పర్యటనకు జగన్.. 10 రోజులు సీఎం లేకుండా పరిపాలన!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. పది రోజుల పాటు సీఎం కుటుంబంతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లనున్నారు.  సీఎంగా జగన్ గత ఏడాది విదేశీ పర్యటనకు వెళ్లారు. పెట్టుబడుల సదస్సు కోసం ఆయన అప్పట్లో మంత్రి వర్గంలోని కీలక మంత్రులను, ఉన్నతాధికారులను దావోస్ తీసుకుని వెళ్లారు. మొత్తం పది రోజుల పాటు జగన్ విదేశీ టూర్ అప్పట్లో సాగింది. ఇక సీఎం కాకముందు కుటుంబంతో కలిసి ఇలాగే విదేశీ యాత్రలకు వెళ్లేవారు. గతంలో జగన్ పారిస్, డెట్రాయిట్, దావోస్, డల్లాస్ పర్యటనకు వెళ్లగా ఇప్పుడు యూకే వెళ్లనున్నారు. అక్రమాస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ విదేశీ పర్యటన కోసం మూడు రోజుల క్రితం తెలంగాణలోని సీబీఐ కోర్టులో అనుమతి కోరారు.  అవినీతి కేసులలో ఆయన ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. కాగా  దేశం విడిచి వెళ్ళరాదని బెయిల్ షరతులు ఉండడంతో వాటిని సడలించి తాను విదేశాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్‌లో కోరారు. బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని కోర్టు సీబీఐని కోరగా.. ముందుగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు కొద్దిగా సమయం కావాలని సీబీఐ తెలిపింది. అనంతరం జగన్ విదేశీ పర్యటనలపై సందేహలున్నాయని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని, సాక్షులను బెదిరిస్తారనే అనుమానాలు ఉన్నాయని.. అందుకే అనుమతి ఇవ్వవొద్దని సీబీఐ వాదనలు చేసింది. అయితే, సీబీఐ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేసింది. దీంతో సీఎం జగన్ రెడ్డి శనివారం (సెప్టెంబర్ 2)  నుంచి పది రోజుల పాటు యూకేకు వెళ్తారు.  కాగా.. సీఎం జగన్ తో పాటు అదే అక్రమ ఆస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరగా.. ఆయనకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన విషయానికి వస్తే ఈయన యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ లో పర్యటించనున్నారు. విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం ఆరు నెలల్లో ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరగా కోర్టు అందుకు అనుమతి ఇవ్వడం విశేషం. అక్రమాస్తుల కేసులలో బెయిల్ షరతుల్లో భాగంగా ఈ ఇద్దరి పాస్ పోర్టులు అప్పుడు కోర్టుకు సరెండర్ చేయగా.. ఇప్పుడు కోర్టు అనుమతితో ఆ రెండు పాస్ పోర్టులు వీరికి అప్పగించనున్నారు. పర్యటన పూర్తి కాగానే మళ్ళీ తిరిగి కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.  విజయసాయి రెడ్డి విదేశాలకు ఎప్పుడు వెళ్తారో   షెడ్యూల్ ఖరారు కాలేదు కానీ, సీఎం జగన్ మాత్రం శనివారం(సెప్టెంబర్ 2) ప్రయాణం కానున్నారు.  ఆ రోజు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి ఉండడంతో జగన్ ఇడుపులపాయకు వచ్చి నివాళి అర్పిస్తారు. అక్కడ నుంచే నేరుగా  ఆయన లండన్ టూర్ కి బయల్దేరి వెళ్తారు. విదేశాలలో చదువుకుంటున్న తన ఇద్దరు కుమార్తెలను చూసేందుకే జగన్ ఈ టూర్ పెట్టుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే, మొత్తం పది రోజుల పాటు సీఎం రాష్ట్రంలో లేకుండానే రాష్ట్ర పరిపాలన సాగనుంది. వర్చువల్ విధానం ద్వారా అక్కడ నుండే పరిపాలన సాగిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో సీఎం విదేశీ యాత్రకు వెళ్ళినపుడు కూడా ఇలాగే పరిపాలన సాగగా.. ఇప్పుడు కూడా అలాగే ప్రభుత్వాన్ని నడిపించనున్నారు.