రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి లేఖ.. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణకు తననూ ఆహ్వానించాలని వినతి
posted on Aug 25, 2023 7:02AM
నందమూరి తారక రామా రావు... తెలుగు ప్రజలకే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు. ఒక సినిమా హీరోగా ఆయన తాను జీవించిన పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా నటుడు ఎన్టీఆర్. రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్. దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.
రాముడు ఎలా ఉంటాడంటే, ఆ నాటి నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని అడిగినా ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. అచ్చం ఎన్టీఆర్ లాగానే ఉంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా ... అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో సజీవంగా ఉన్నారు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, ఇటు రాజకీయ రంగంలో ఇంకెవరికీ సాధ్యం కాని విధంగా చరిత్ర సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు.
సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలు రాయిలా చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది. అటువంటి శకపురుషుడి శత జయంతి జరుపుకున్నాం. ఆ సందర్భంగా కేంద్రం ఎన్టీఆర్ బోమ్మతో ముద్రించిన వందరూపాయల వెండి నాణేన్నా ఈ నెల 28న ఆవిష్కరించనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరిగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎన్టీయార్ కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు, ఆయనతో పరిచయం ఉన్నవారికి ఆహ్వానాలు అందాయి. అయితే ఎన్టీఆర్ మరణానంతరం ఎన్టీఆర్ కుటుంబానికి దూరంగా ఉంటున్న, రాజకీయంగా ఎన్టీఆర్ సిద్ధాంతాలకు విరుద్ధమైన పార్టీతో కలిసి పని చేస్తున్న ఆయన భార్య లక్ష్మీ పార్వతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. నేను లక్ష్మీ పార్వతిని.. దివంగత ఎన్టీఆర్ భార్యను.. అంటూ రాసిన ఆ లేఖలో ఎన్టీఆర్ బొమ్మతో ముద్రించిన వందరూపాయల వెండి నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి తననూ ఆహ్వానించాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్టీయార్ ఫ్యామిలీ మెంబర్స్ తో తనను కూడా ఆహ్వానించాలంటూ ఆమె లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
ఈ లేఖలో ఆమె రాజకీయ ప్రస్తావన చేశారు. 1994 ఎన్నికలలో ఎన్టీఆర్ తో కలిసి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతిని ప్రస్తావించారు. రాజకీయాలకు అతీతంగా ఒక మహోన్నత వ్యక్తిని స్మరించుకుంటూ నిర్వహించే ఒక కార్యక్రమాన్ని ఇలా వివాదాస్పదం చేయాలని చూడటం సమంజసం కాదంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న వందరూపాయల వెండి నాణెం ఆవిష్కరణ కుటుంబ కార్యక్రమం కాదనీ, అదొక ప్రభుత్వ కార్యక్రమమనీ, ఎవరికి ఆహ్వానం అందించాలి అన్నది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమనీ, ఈ విషయంలో రాజకీయాలు, కుటుంబ విభేదాలను తీసుకురావడం మంచిది కాదనీ అంటున్నారు.